Sunday, October 16, 2016

సర్వనామాలతో సమస్యలు - పూరణలు


సర్వనామాలతో సమస్యలు - పూరణలు


సాహితీమిత్రులారా!
సర్వనామాలసమస్యలను పూరించడం కొంత క్లష్టమైన పనే
అలాంటివి గతంలో ఇవ్వబడిన
సమస్యలను వాటి పూరణను ఇక్కడ చూద్దాం

ఒకానొక సమయంలో ఒక సభలో శ్రీనాథమహాకవిని 
పరీక్షించడానికి కుత్సితంగ
"అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందఱె" - అనే
సమస్యను ఇచ్చారు.
దానికి శ్రీనాథుని పూరణ-

కొందఱు భైరవాశ్వములు కొందఱు పార్థని తేరి టెక్కెముల్
కొందఱు ప్రాక్కిటీశ్వరులు కొందఱు కాలుని యెక్కిరింతలున్
కొందఱు కృష్ణ జన్మమునఁ గూసిన వారలు నీ సదస్సులో

నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందరే


భైరవాశ్వములు - కుక్కలు, పార్థుని తేరి టెక్కెముల్ - కోతులు,
ప్రాక్కిటీశ్వరులు - వరాహాలు, కాలుని యెక్కిరింతలు - దున్నపోతులు,
కృష్ణ జన్మమునఁగూసిన వారలు - గాడిదలు, అంటే సభలోని వారు కుక్కలు,
కోతులు, పందులు, దున్నలు, గాడిదలు అని నిందాహేళనం.
=======================================================================

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకమారు వేశ్య(కవయిత్రి) వచ్చి
అష్టదిగ్గజకవులకు సవాలుగా ఒక సమస్యను ఇచ్చింది.
"మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్" - అనేది సమస్య.
ఆ సమస్యను మరుసటి రోజుకు చెప్పేవిధంగా సమయమిచ్చింది.
దీనికి సమాధానం ఎలాగా అని ఆలోచించి తెనాలి రామకృష్ణుని ఆశ్రయించినారు.
దానికి అతడు పెద్దనతో  "రేపు బోగంది వచ్చి సమస్య అడిగినంతలో
మా శిష్యుడు అని మీరు చెప్పగా నేను మీ శిష్యుడనై చెబుతాను" -  అని అన్నాడు.
కచేరి ప్రారంభమైంది పెద్దన తన శిష్యుడు చెబుతాడని చెప్పాడు.
 తెనాలిరామకృష్ణుడు లేచి పద్యాన్ని ఈ విధంగా పూరించాడు.

"కోరిక లుప్పతిల్ల మదిఁగోరిన యట్టి కళా విశేషముల్
 చారు తరంబులన్ రతుల సల్పఁగ నేర్చిన యట్టి జాణ యీ
 వార వధూ శిరోమణి వంతుల వేసుక దెబ్బ తీయుఁడీ
 
మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్"

దీనితో అష్టదిగ్గజ కవులు ఆనందించగా సభ అంతా కరతాళధ్వనులతో వెల్లివిరిసింది. 

===================================================================

పూర్వం నెల్లూరు మండలంలో ఉన్న తెట్టు గ్రామ నివాసి మోచర్ల వెంకన.
వెంకటగిరి సంస్థానంలో యాచభూపతి ఇచ్చిన అనేక సమస్యలకు
పూరణ చేసిన గొప్ప ఆశుకవితా ధురీణుడు. ఆ రాజుగారు ఇచ్చిన
సమస్యలలో ఈ సమస్య ఒకటి- 
"నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్"
దీన్ని రామాయణ, భాగవత, భారతార్థాలలో పూరించమన్నాడు రాజుగారు.
వెంకన్నగారు ఈ విధంగా పూరించారు.

రామాయణార్థం వచ్చేలా పూరణ  -

అనిలజ! జాంబవంత! కమలాప్త తనూభవ! వాయుపుత్ర! యో
పనస సుషేణ! నీల! నల! భానుకులుండగు రాఘవేంద్రుఁడ
ద్దనుజపురంబు వేగెలువ దైత్యులఁజంపగ వేగ రమ్మనెన్

నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

కిష్కింధలో  ఉన్న వానర ప్రముఖులను పేరు పేరున రామచంద్రుడు
రాక్షసులతో వెంటనే యుద్ధం చేసి వారిని సంహరిచడానికి
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్
రమ్మన్నాడని భావం వచ్చే విధంగా పూరించాడు.

భాగవతార్థం వచ్చేలా పూరణ -

అనఘ సురేశ! వాయుసఖ! అర్యమనందన! రాక్షసేంద్ర! యో
వననిధినాథ! గంధవహ! వైశ్రవణా! నిటలాక్ష! తాను ర
మ్మను మని చెప్పె మాధవుఁడుమారుని పెండ్లికి మిమ్ము నందరన్

నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

ప్రద్యుమ్నుని పెండ్లికి ఇంద్రుని, అగ్నిని మొదలైన దేవతల నందరిని పేరుపేరున
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్
రమ్మన్నాడు కృష్ణుడు అనే భావం వచ్చేలా పూరించాడు.

భారతార్థం వచ్చేలా పూరణ -

అనఘ సురాపగాతనయ! యర్కతనూజ! విచిత్రవీర్యనం
దన! గురుపుత్ర! ద్రోణ! కృప! నాగపురీశ్వర! దుస్ససేన! ర
మ్మనె రాజసూయము యమాత్మజుఁడిప్పుడుచేయఁబూని తా

నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

ధర్మరాజు రాజసూయానికి భీష్ముని, కర్ణుని, ధృతరాష్ట్రుని, అశ్వత్థామ, ద్రోణ,
కృపాచార్య మొదలైన వారినందరిని ధర్మరాజు రాజసూయానికి పేరుపేరున
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ అని
అందరిని పిలువమని చెప్పినట్లు భావం వచ్చేలా పూరించాడు.

దీన్ని బట్టి మోచర్ల వెంకనకవికి ఎంతటి సమయస్పూర్తో! ఎంతటి ఆశుధారయో!

No comments:

Post a Comment