Wednesday, January 31, 2018

పెండ్లిపిలుపు


పెండ్లిపిలుపు




సాహితీమిత్రులారా!



ఒక పాలకొల్లు అమ్మాయికి
ఒక మండపేట అబ్బాయికి
కార్తీక పౌర్ణమి రాత్రి జరిగిన
వివాహాన్ని పురస్కరించి
పద్యరూపంలో ఆహ్వానించిన
ఆహ్వానం-

వెన్నె తిథులందు పున్నమి రోజు వా
రింట జరుగు పెండ్లికిదియె పిలుపు
పాలకొల్లు కన్య బంగారు మెడలోన
మండపేట పూలదండ వేయు
ఆ ఉమామహేశు లడుగిడు నట్లుగా
దంపతులుగ మీరు తరలి రండు.
పసుపు కుంకుమలకు పరిణయమ్మగువేళ
విందు మాది బహు పసందు మీది

(పద్యారామం, బేతవోలు రామబ్రహ్మం పుట. 189)

Tuesday, January 30, 2018

కవీంద్ర పరమేశ్వరదాసు


కవీంద్ర పరమేశ్వరదాసు



సాహితీమిత్రులారా!



కవీంద్ర పరమేశ్వరదాసు బెంగాలీ కవి.
15వ శతాబ్ది చివరిలో జన్మించి 16వ శతాబ్ది
తొలిభాగంలో కాలం చేసిన వారు వీరు.
హుసేనుషా(1497-1518) సేనాపతి అయిన
పారగల్ ఖాను ఆస్థానకవిగా ఉండినవాడు.
ఈ పారగలుఖాను అనంతరం కూచి బీహారు
రాజయిన నరనారాయణుడి దగ్గర మంత్రిగా
పనిచేశాడు. అలా చివరి దినాలు శారీపురంలో
గడిచాయి.

      మన తెలుగులో రాజరాజనరేంద్రుడు మహాభారతాన్ని
ఆంధ్రీకరించినట్లు బాంగ్లాలో మహాభారతాలు మహమ్మదీయ
ప్రభువులు వ్రాయించారు. తమ ఆస్థానాలలో భారతం
చదివించాలని అభిలాషపడ్డారు వారు. అయితే సంస్కృత
గ్రంథాలు వారికి అడవిలా అంధకారబంధుమైనాయి.
అందువల్ల తేటతెల్లమైన బాంగ్లా అనువాదాలు చేయించారు.

    పానగల్ ఖాను ఆదేశం ప్రకారం మహాభారతాన్ని సంస్కృతం
నుంచి బాంగ్లా చేశాడు పరమేశ్వరదాసు. అందుకని ఇతని భారతానికి
పానగల్ మహరాభారతమని పేరు. తన గ్రంథంలో మొదట్లోనే
ఆ గ్రంథరచనకు కారణం వివరించాడు.

ఆ ప్రస్తావనం-

"లస్కర పారగల్ సునంత కాహినీ,
యేనమతె పాండవె హారాయిల రాజధాని
వనవాసె బంచిలేక ద్వాదశవత్సర,
కేనమతె ధర్మ రయిల వనేర్ భితర.
వత్సరేక అభిలంత అజ్ఞాత వసతి,
కేనమ తె తారా సబె పాయిల వసుమతీ?
వహి సబ కథా కహ సంక్షిప్త కరియా,
దినేక సునితె పారి పాంచాలీ కరియా,
తాఁహార ఆదేశమాల్య మస్తకె కరియా,
కవీంద్ర కహిల కథా పాంచాలీ రచియా"

(పాండవులు రాజధాని ఎలా పోగొట్టుకున్నారు
ధర్మానికి కట్టుబడి పన్నెండేళ్లు వనవాసమూ,
సంవత్సరమూ అజ్ఞాతవాసమూ ఎలాచేశారు
ఎలాతిరిగి రాజ్యం సంపాదించారు
ఇదంతా సంక్షిప్తంగా ఒక్కదినంలో వినగలిగినంత
పద్యకావ్యంగా రచించమని పానగల్ సేనాని ఆదేశించాడు.
అతని ఆదేశం శిరస్సున దాల్చి కవీంద్రుడు
పద్యంగా(భారత)కథ వ్రాశాడు.)

భారత కథంతా వొక్కరోజులో చదవగలినంత
మొదట సంక్షిప్తంగానే వ్రాశాడు కవీంద్రుడు.
తరువాత దానినే విస్తృపరచి వ్రాశాడు.
ఇప్పుడది మొత్తం 17000 పద్యాలతో వుంది.
మన భారతమేకాదు భారతదేశంలో అనేకానేక
భారతాలు వివిధభాషల్లో కూర్చారని దీన్ని బట్టి
తెలుస్తున్నదికదా మిత్రులారా!

Monday, January 29, 2018

గరికపాటివారి గృహప్రవేశ ఆహ్వానం


గరికపాటివారి గృహప్రవేశ ఆహ్వానం




సాహితీమిత్రులారా!


గరికపాటివారు గృహప్రవేశ ఆహ్వానం పై
వ్రాసిన పద్యాలు గమనించగలరు.

ఇంటిలోని పోరు ఇర్వదేండ్లు భరించి
క్రొత్త ఇంటినొకటి కొంటినయ్య
గడపలోన మేము కుడికాలు నిడువేళ
మీరు చూడవలయు మెచ్చవలయు

అర్థరాత్రి వచ్చి ఆశీర్వదింపుడు
వీలుకాని యెడల విందుకైన
వచ్చిపోవలె తమవంటి సత్పురుషులు
కాలు పెట్టుచోటు కాని గాదె

తీయనైన మీదు దీవెనలే చాలు
వేరు కాన్కలేల వెర్రిగాని
అయిన తెచ్చునెడల అభ్యంతరములేదు
తేక యున్న మానె రాకె చాలు

(పద్యారామం, బేతవోలు రామబ్రహ్మం పుట.189)

కానుకలు లేకుండా వెళ్లాలనుకున్నా
కానుకలతోనే వెళ్లేవిధంగా ఉన్నాయికదా!
పిలుపులు పద్యాల్లో.

Sunday, January 28, 2018

భీష్మ - అష్టమి - ఏకాదశి - పంచకం


భీష్మ - అష్టమి - ఏకాదశి - పంచకం




సాహితీమిత్రులారా!


భీష్ముడు అంపశయ్యపైనుండి మాఘశుద్ధ అష్టమి తిథినాడు
పరమపదించాడు అందువల్ల ఆ రోజును భీష్మాష్టమి అంటారు.
మరి భీష్మ ఏకాదశి ఏమిటనికదా 
భీష్ముడు స్వచ్ఛంద అష్టమినాడు మరణం పొందిననాడు
పరమపదించే సమయంలో శ్రీకృష్ణుడు ఆయన దగ్గరే ఉన్నాడు
కావున తన మరణం తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మఏకాదశిగా
అనుగ్రహించవలసినదిగా భీష్ముడు కోరగా అందుకు శ్రీకృష్ణుడు
అంగీకరించాడని నారద పురాణంలో ఉన్నట్లు డా. ఆదిపూడి
వెంకటశివ సాయిరామ్ గారు తన నిత్యజీవితంలో పండుగలు - 
పర్వదినాలు అనే గ్రంథంలో వివరించారు.
భీష్ముడు తన పంచప్రాణాలను సప్తమి మొదలు ఏకాదశి వరకు
ఒకటొకటిగా వదిలాడని ఈ ఐదురోజులను భీష్మపంచకంగా పిలుస్తారు
కాని మరో కథనం ప్రకారం కార్తీక శుద్ధ ఏకాదశి మొదలు ఐదురోజులు 
భీష్మపంచకంగా పిలుస్తారు.

మాఘశుద్ధ ఏకాదశిని భీష్మఏకాదశి అని
జయాఏకాదశి అని కూడ పిస్తారు.

Saturday, January 27, 2018

తనుయాత్ర అంటే?


తనుయాత్ర అంటే?




సాహితీమిత్రులారా!




తనుయాత్ర అంటే ఈ పద్యం గమనించండి-

లలన మృదుబాహు యుగబిసలతలు గడఁగి
బిసలతా శ్రీలనెల్లను వెసహరించె
మఱి హరింపంగ నవి నెఱివిఱిగికాదె
సారెఁ దనుయాత్రఁ దంతుల జరుగుచుండు
                                                                                                  (5-19)

తనుయాత్రన్ - దేహయాత్రను, (శరీరపోషణము ననుట)
తంతువుల - నులుపోగుల చేతను, జరుపుచుండున్ -
కడపుచుండును, ఆమెయొక్క కోమలమైన బాహువులనెడి 
తామరతూడులు చెలరేగి యెల్ల తూడుల కాంతిసంపదల
అపహరింపగా అవి గుంపుచెదరి మరియొకవిధముగా 
బ్రతుకజాలక నూలిపోగులు వడికికొని శరీరయాత్ర
గడుపు ననియును, తామరతూడులు విరిగెనేని 
వానిలో నూలిపోగులుండుననియు భావము
(వావిళ్ళవారి వ్యాఖ్య)

తనుయాత్రన్ - దేహధారణము, 
తంతులన్ - నూలు వడుకుటచేత
(సన్నిపోగులను ధరించి)
జరుపుచుండున్ - ఆమెబాహువులు తామరతూండ్ల సిరిని హరించినవి,
ఆ కారణమున తామరతూండ్లు నూలువడుకుకొని జీవించుచున్నవి
అదే వానిని విరిచినచో సన్నిదారములు వచ్చుట
                          (వేదమువారి వ్యాఖ్య)
తంతువులతో తనుయాత్ర జరుపుట - నూలుపోగులు వడికికొని 
శరీరయాత్ర గడపుట - అనే వావిళ్ళ అర్థమునే మాటలు మార్చి 
వేదమువారు అనువదించారు.

తంతువులతో తనుయాత్ర జరుపుట - అనగా తంతువులే ఆహారముగా
కాలము గడపుటగాని, నూలు వడికి - అమ్ముకొని దానిమూలమున
జీవించుట కాదు.
గాంధీ వేరుసెనగ పప్పులతో శరీరయాత్ర జరిపెడివాడు - అంటే 
వేరుసెనగ పప్పులను అమ్ముకొని తన్నమూలమున జీవించెడివాడని
అర్థముకాదు. ఆ పప్పులను తిని శరీరము నిల్పుకొనెడివాడని అర్థము.
అట్లే ప్రకృతమునను.
మరియు తామరతూండ్లు నూలువడికొని జీవించినవి అయినందు వల్లనే
వానిని విఱిచినచో  సన్నపాటి దారములు వచ్చుట అని ఆంధ్రమల్లినాథులు 
వ్రాయుట మిక్కిలి వింత. నూలును తినెడివారి కడుపులో నూలు ఉండవచ్చుకాని 
నూలు వడికి అమ్మెడివారి కడుపులో నూలెట్లుండును.

సరే ఇందంతా ఎందుకు

దేహయాత్ర, శరీరయాత్ర - అనే పదాలకు భుజించిట అని అర్థం.
దీనికి క్రింది గ్రంథాలు ప్రమాణాలు-
1. దేహయాత్ర - మెసవుట, భుజించుట(శబ్దార్థ కల్పతరువు)
2. దేహయాత్ర - nourishment, food (ఆప్టే)
3. దేహయాత్ర - తిండి (శబ్దరత్నాకరము)
4. యాత్రాస్యాద్యాపనేగతౌ (అమరము) యాత్రాశబ్దము భోజనము మొదలైన వర్తమానములకును, గమనమునకును - పేరు 
ఉదా- శరీరయాత్రా, ప్రాణయాత్రా(గురుబాలబోధిక) 
5. శృంగారనైషధము(హంసవాక్యము)
   ఫలకుసుమ మూలమాత్రంబున శరీరయాత్ర నడపుచు
   మునులుం బోలె -- ఉన్నవారము(1-108)
6. గీ. పుష్ప ఫల పత్ర జల మాత్రముల శరీర
      యాత్ర గడపుచు సన్మార్గమధిగమించి
      యెసఁగు నివియెల్ల నీకేల యెగ్గొనర్చు
                 (వసుచరిత్ర - 3-128)
7. నీతిచంద్రిక -(మిత్రభేదమున కొంగ వాక్యము)
   జలశైవాదులతో దేహధారణంబు చేయుచు ముముక్షత్వంబు 
   బూని మునివృత్తి నున్నవాడను.

(దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి సాహిత్య సమీక్ష నుండి)


Friday, January 26, 2018

శ్రీమహావిష్ణువుకు వింజామరలు వీచేవారు


శ్రీమహావిష్ణువుకు వింజామరలు వీచేవారు




సాహితీమిత్రులారా!



వద్దిపర్తి కోనంరాజుకవి కృత
మహాలక్ష్మీ పరిణయములో
అష్టశక్తులను వివరించారు
ఆ అష్టశక్తులు శ్రీమహావిష్ణువునకు
వింజామరులు వీచేవారట-
ఆ పద్యం చూడండి-

సరసిజాలయ సావిత్రి సర్వభద్ర
విమల పద్మ మహాదేవి విలసదీశ
జాహ్నవి యనంగ నెనమండ్రు శక్తులెపుడుఁ
జామరంబుల వీతురు చక్రిమ్రోల
                                    (మహాలక్ష్మీ పరిణయము - 1-25)

శ్రీమహావిష్ణువు సన్నిధిలో వింజామరలు వీచే
ఎనిమిదిమంది ఎనిమిది శక్తులు వారి పేర్లు-
1. సరసిజాలయ, 2. సావిత్రి, 3. సర్వభద్ర,
4. విమల, 5. పద్మ, 6. మహాదేవి,
7. ఈశి, 8. జాహ్నవి.

Thursday, January 25, 2018

గద్యమంటే ఏమిటి?


గద్యమంటే ఏమిటి?




సాహితీమిత్రులారా!



గద్యం అంటే పాదవిభాగాలుగాని, గణనియమముగాని
లేని పదముల సముదాయము.
ఓజోగుణము, సమాసభూయస్త్యము గద్యమునకు ప్రధానమని
దండి పేర్కొన్నాడు.
సంస్కృత అలంకారికులు గద్యాన్ని మూడువిధాలని చెప్పారు.
1. వృత్తగంధి -
వివిధ పద్యపాదభాగములతో కూడినది వృత్తగంధి.
2. చూర్ణము-
అల్పసమాసాలతో, లలితపదాలతో కూడినది చూర్ణము .
3. ఉత్కలికాప్రాయము-
దీర్ఘసమాసాలతో, ఉద్ధతపదములతో  కూర్చబడినది
ఉత్కలికాప్రాయము.
కొందరు లాక్షిణికులు ఈ మూడింటిని అనుసరించి 
ముక్తకము, చిత్రము, ఖండము మొదలైన విభాగాలను
చేశారు. 
భోజుడు వృత్తగంధితో బాటు జాతిగంధి అనే భేదాన్ని కూడ
పేర్కొన్నాడు. అయితే తెలుగు లాక్షిణుకులు ఇన్ని విభాగాలు
చేయకుండా  పాదరహితమైనది గద్యమన్నారు. కాని తెలుగులో
దండకం కూడ పాదరహితమైనదిగా చెప్పబడటం వల్ల 
గణరహితమైనది అని కూడ చెప్పాల్సివుంది.
చిత్రమేమంటే మన తెలుగు కావ్యాల్లో ఆశ్వాసాంతాల్లో వాడేవే
గద్యంగా మిగిలిన చోట వాటిని వచనంగా చూస్తున్నాము. 
అలాగే అనంతుడు గద్యమునే తెలుగులో వచనమంటారన్నాడు.
ఇక్కడ వచనానికి జయకీర్తి తన ఛందో2నుశాసనంలో
వాక్యబంధురమైంది వచనం అన్నాడు.

Wednesday, January 24, 2018

ఇద్దరు కవులు దర్శించిన సముద్రలంఘనం


ఇద్దరు కవులు దర్శించిన సముద్రలంఘనం




సాహితీమిత్రులారా!



అయ్యలరాజు రామభద్రకవి 
రామాభ్యుదయంలో
సముద్రాన్ని లంఘించే సమయంలో
హనుమంతుని వర్ణించిన తీరు-

తనచూపంబుధి మీఁదఁ జాఁచి శ్రవణద్వంద్వంబు రిక్కిం చి వం
చిన చంచత్భుజముల్ సముత్కట కటీసీమంబులన్ బూన్చి తోఁ
క నభోవీధికిఁ బెంచి యంఘ్రులిరియంగాఁ బెట్టి బిట్టూఁది గ్ర
క్కున నక్కొండ యడంగఁద్రొక్కి పయికిన్ గుప్పించి లంఘించుచోన్
                     (రామాభ్యుదయము - 6 - 93)

ఈ పద్యం భావాన్ని గమనించిన తరువాత
ఈ పద్యం చూడండి -
ఇది తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి కృత
శ్రీరామకథా2మృతము అనే గ్రంధంలోని
సీసపద్యం -
మొలదట్టిపై బాహువులు మోపి పాదము
       లించుక గుదియించి యెరువు సేసి
యిలఁద్రొక్కి యిమ్మున నిలిచి కంఠమ్మును
       మూఁపులుఁగర్ణముల్మొనయఁదిగిచి
యెడఁబ్రాణధారణంబొదవించి నెక్కొని
       నింగిపై దృష్టులు నెలవు కొలిపి
పులకలు నెమ్మేనఁ బొదల నూష్మలభావ
       ముననొప్పి శరవేగమునఁ దనర్చి
యెగసెఁ గుప్పింపఁ గ్రుంగితో నెగసి యమ్మ
హెంద్రధర మనుయాయిత్వమెఱుక సేయ
నెదిరి భంగంబు స్వీయసమృద్ధి నోటఁ
దెలుపకయ తెల్పుచును వాయుదేవసుతుఁడు
                              (శ్రీరామకథా2మృతము - సుందరకాండ - 27)

వీరిద్దరి హనుమద్దర్శనము ఆ సమయంలో ఎలావున్నదో
మనం గమనించ వచ్చు.
చేతులు నడుంమీద పెట్టుకోవడం దగ్గరనుంచి
అన్ని దాదాపుగా ఒకలాగే కనిపిస్తున్నవికదా

Monday, January 22, 2018

మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్


మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్




సాహితీమిత్రులారా!



బమ్మెర పోతన దైవభక్తి -
అమ్మలమీది భక్తి
ఇక్కడ చూద్దాం-

భాగవత ప్రారంభంలో ఆయన స్తుతించిన
పద్యాలను చదవని తెలుగువారు ఉండరంటే
అతిశయోక్తికాదు. వాటిని ఇక్కడ మరోసారి
కేవలం అమ్మగారి పద్యాలనే చేసుకుందాం-

క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్
        (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 6)
నేలకు నుదురు తాకునట్లు సాగిలబడి మ్రొక్కి సైకతశ్రోణి,
చదువులవాణీ, అలినీలవేణీ అయిన వాణిని సన్నుతిస్తాను.
ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షమాలనూ, మరోచేతిలో
రామచిలకనూ, ఇంకోచేతిలో తామరపువ్వునూ, వేరొకచేతిలో
పుస్తకాన్నీ ముచ్చటగా ధరిస్తుంది. సుధలు వర్షించే తన
సుందర సుకుమార సూక్తులతో ఆ అరవిందభవు(బ్రహ్మ)ని
అంతరంగాన్ని ఆకర్షిస్తుంది. తన కటాక్ష వీక్షణాలతో
దేవతల సమూహాన్ని కనికరిస్తుంది.


పుట్టం బుట్టి శిరంబునన్ మొలవ, నంభోపాత్రంబునన్
నెట్టం గల్గును, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతు దత్సరణి నా కీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ నాకగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ దయాంభో నిధీ
 (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 7)

అమ్మా! సరస్వతీదేవీ! నేను తలపై పుట్ట పెరిగిన ఆదికవి వాల్మీకిగా పుట్టలేదు.
పడవలో పుట్టిన వ్యాసుడను కాను. కాళికను కొలిచిన కాళిదాసునికాను.
అయినా భాగవత పురాణాన్ని తెనిగంచటానికి పూనుకొన్నాను. ఏం చెయ్యాలో, ఏమీ తోచటంలేదు. ఇటువంటి సమయంలో ఎటువంటిమార్గము అవసరమో
అది నీవే నాకు అనుగ్రహించి నాచేయి పట్టుకొని నడిపించు, ముమ్మాటికి
నిన్నే నమ్ముకున్నాను తల్లీ! నీవే ఆధారం. నాకు తెలుసు తల్లీ నీ కరుణ
అపార పారావారం- అని భావం

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుందమం
దార సుధాపయోధి సితతామరసామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నఁడు గల్గు భారతీ
 (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 8)

సరస్వతీదేవీ శరత్కాలమేఘంవలె, చంద్రునివలె, కర్పూరంవలె,
హంసవలె, మల్లెపూవువలె, ముత్యాలహారంవలె, మంచువలె, నురుగువలె,
వెండి కొండవలె, రెల్లువలె, ఆదిశేషునివలె,  మొల్లవలె, జిల్లేడుపూవువలె,
పాలసంద్రమువలె, తెల్లతామరవలె, ఆకాశగంగవలె స్వచ్ఛమైన తెల్లనికాంతితో
ప్రకాశించే నిన్ను  మనసున దర్శించే అవకాశం ఎప్పుడు కలుగుతుందో


అంబ నవాంబుజోజ్వలకరాంబుజ, శారదచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శృతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబరవీధి విశ్రుత విహారిణి, నన్ గృపజూడు భారతీ
 (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 9)

కొత్తగా వికసించిన పద్మాన్ని ధరించి మిక్కిలిప్రకాశించే
పద్మమువంటి హస్తం కలదానా శరత్కాలపు వెన్నెకాంతుల
ఆడంబరంతో కూడిన అందమైన ఆకారం కలదానా
ధరించిన రత్నాభరణాల కాంతులు దిగంతాలను తాకేట్లు
శోభించేదానా వేదసూక్తుల్లో వ్యక్తమయ్యే స్వీయప్రభావం
కలదానా సత్కవుల మహాభక్తుల భావాకాశవీధుల్లో
ప్రశస్తంగా విహరించేదానా సరస్వతీ నను దయచూడు.

అమ్మలు గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపాఱడి బుచ్చిన యమ్మ, తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృతాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
 (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 10)

ఆమె అమ్మలందరికీ అమ్మ, మూడులోకాలకు మూలమైన
ముగురమ్మలకు మూలమైన అమ్మ, పెద్దకాలం నాటి
అందరికన్న అధికురాలైన అమ్మ, రాక్షసులతల్లికి
గర్భశోకాన్ని కలిగించిన అమ్మ, తనను నమ్ముకొన్న
దేవకాంతల మనస్సులలో నివసించే అమ్మ, అందరికీ
అమ్మ ఆ దుర్గమ్మ దయాసముద్రురాలు, ఆమె లక్ష్మయై
సంపద, సరస్వతియై కవిత్వాన్ని, పార్వతియై శక్తిని
సమకూర్చాలని పోతనమహాకవి కోరుకుంటున్నాడు.

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంపుఁబెన్నక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తోనాడు పూఁబోఁడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లా లు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణ ముల్
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 11)

శ్రీదేవి ఆదిదేవుడైన విష్ణువుకు పట్టపురాణి, ఆమె పుణ్యములరాశి,
సిరిసంపదలకు నిలయమైనది, క్షీరసాగరమథనంలో చంద్రునితో
కలిసి పుట్టినది. సరస్వతీ పార్వతులతో క్రీడించు పూబోడి,
పద్మాల్లో నివసించే యౌవనవతి, సమస్తలోకాలవారు ఆమెనే
పూజిస్తారు, ఒక్క చూపుతోనే దారిద్యాన్ని పటాపంచలు చేసే
తల్లి ఆ ఆదిలక్ష్మి తనకు నిరంతరం సౌభాగ్యాన్ని అందజేయాలని
పోతనమహాకవిగారు కోరుకుంటున్నారు.

ఈ విధంగా పోతనగారు సరస్వతి పార్వతి దుర్గాదేవిని లక్ష్మీదేవిని
కావ్యారంభంలో స్తుతించారు.

వసంతపంచమి పర్వదినాన వారిని ఈ పద్యాలరూపంలోనైనా
స్మరించుకుందాము.

Sunday, January 21, 2018

ఏ వ్రాలైనను వ్రాయును


ఏ వ్రాలైనను వ్రాయును




సాహితీమిత్రులారా!


రాయనిమంత్రి భాస్కరుని గురించిన
చాటువులు అనేకం వున్నాయి
వాటిలో ఒకటి-

ఏ వ్రాలైనను వ్రాయును
"నా" వ్రాయడు వ్రాసెనేని నవ్వులకైనన్
"సి" వ్రాసి "తా" వత్తివ్వడు
భావజ్ఞుడు రాయనార్య భాస్కరుడెలమిన్

రాయని భాస్కరుని దాతృత్వాన్ని చెప్పే పద్యం ఇది
ఇందులో అక్షరాభ్యాసం వేళనుండీ నా - అనే అక్షరం
వ్రాసేవాడు కాదట. ఒస వేళ వ్రాసినా సి అని వ్రాసి
తా వత్తివ్వడట. అంటే స్తి - అని వ్రాయడట.
దానగుణం పుట్టుకతో వచ్చిందని. అంటే ఆ దాతకు
నాస్తి(లేదు) అని అనటంకాని వ్రాయటంకాని చేతకాదు -
అని భావం.


Saturday, January 20, 2018

కురు పాండవుల సేనానులు - వివరణ


కురు పాండవుల సేనానులు - వివరణ




సాహితీమిత్రులారా!




భారత యుద్ధం అంటే కురుక్షేత్రంలో
కౌరవుల సైన్యం  - 11 అక్షౌహిణులు
పాండవుల సైన్యం-  7 అక్షౌహిణులు
ఈ సైన్యాన్ని ఒక అక్షౌహిణి సైన్యనానికి 
ఒక సైన్యాధిపతి చొప్పున నియమించారు.
ఆ లెక్కన కొరవులకు 11 మంది సైన్యాధిపతులు
పాండవులకు 7 మంది సైన్యాధిపతులు
వారిపై ఒక సర్వసైన్యాధ్యక్షుడుంటాడు
యుద్ధప్రారంభంలోని సైన్యధిపతులు
కొరవుల సైన్యాధిపతులు -
1. కృపాచార్యుడు, 2. ద్రోణాచార్యుడు, 3. అశ్వత్థామ,
4. శల్యుడు, 5. జయద్రథుడు, 6. సుదక్షిణుడు,
7. కృతవర్మ, 8. కర్ణుడు, 9. భూరిశ్రవుడు,
10. శకుని, 11. బాహ్లికుడు.
వీరందరికి సర్వసైన్యాధ్యక్షుడు - 
10 రోజులు - భీష్ముడు
5రోజులు - ద్రోణుడు
2రోజులు - కర్ణుడు
1రోజు - శల్యుడు
వీరు కాక చివరిలో సైన్యమేలేకుండా
సైన్యధిపతి అయినవాడు అశ్వత్థామ

పాండవుల సైన్యాధిపతులు -
1. ద్రుపదుడు, 2. విరాటుడు, 3. ద్రుష్టద్యుమ్నుడు 4.శిఖండి,
5. సాత్యకి, 6. చేకితానుడు, 7. భీమసేనుడు

వీరందరికి 18 రోజులు యుద్ధం ముగిసేదాక
సైన్యాధిపతి - ద్రుష్టద్యుమ్నుడు

Friday, January 19, 2018

దీనికి అందరూ సమానమే


దీనికి అందరూ సమానమే




సాహితీమిత్రులారా!



అందరినీ సమానంగా చూచేదేమిటని
కదా ప్రశ్న - ఈ శ్లోకం చూడండి-

నారదీయ పురాణంలోనిదీ శ్లోకం-

పండితే వాపి మూర్ఖే వా 
దరిద్రే వా శ్రియాన్వితే
దుర్వృత్తే వా సువృత్తే వా
మృత్యోః సర్వత తుల్యతా

చదువుకొన్నవాడా-
మూర్ఖుడా-
దరిద్రుడా-
ధనవంతుడా-
మంచినడవడికలవాడా-
దుర్వర్తన కలవాడా - అందరూ
సమానులే మృత్యువుకు- అని భావం
కాదనే దేమైన వుందా?
లేదుకదా!

Thursday, January 18, 2018

"స్వప్నప్రయాణం" నుంచి చిన్నతునక


"స్వప్నప్రయాణం" నుంచి చిన్నతునక




సాహితీమిత్రులారా!



ద్విజేంద్రనాథ ఠాకూరు(1840-1926)
ఈయన "విశ్వకవి" రవీంద్రనాథ ఠాగూరుగారి
అన్న. ఈయన కవిత్వంలోనే కాదు,
సంగీతంలోనూ,  చిత్రకళలోనూ, గణితంలోనూ,
తత్వవిద్యలోనూ, దర్శన శాస్త్రంలోనూ సమర్థుడు.
గద్యపద్యాల రెండింటా రచన సాగించాడు.
బీహారీలాలు కావ్యాలతో ఇతని కావ్యలకు
సామంజస్యం కనిపిస్తుందంటారు. ఇతని
స్వప్నప్రయాణం, కావ్యమాల, రేఖాక్షర
వర్ణమాల, జౌతుకనాకౌతుక ప్రసిద్ధకావ్యాలు.
"స్వప్నప్రయాణం" నుంచి చిన్నతునక-

కరియా జయె
మహా ప్రళయ
బాజియా ఉఠిల బాజనా నానా.
తాల వేతాల
దిచ్ఛేతాల
థెయి థెయి నాచే పిశాచదానా.
గాధాయ చడి
లాగాయ ఛడి
అదభుతరస కింపురుష.
దుటి అధరె
హాసి నా ధరె
లంబా ఉదర బేంటె మానుష.

(మహాప్రళయం జయించి నానా వాద్యాలు మోగాయి.
లయతోనూ, లయతప్పీ తాళాలు, రేగాయి. థెయిథెయి
పిశాచాలు నాట్యం చేశాయి. గాడిద లెక్కి, చబుకువేసి,
అద్భుతంగా కింపురుషులు - పెదవుల నవ్వులేదు.
పెద్ద పొట్టల పొట్టిమనుషులు)

Wednesday, January 17, 2018

తెలిసి పీల్చుకో గాలిని


తెలిసి పీల్చుకో గాలిని




సాహితీమిత్రులారా!

ఊపిరి అంటే ప్రాణం కదా!
ప్రాణం నిలవాలంటే గాలిపీల్చుకోవాలికదా!
ఆ గాలిని మనం ఎలా పీల్చుకుంటున్నాము
అన్నదే ప్రశ్న - దాన్నిగురించి తెలుసుకునే 
ప్రయత్నం చేద్దామా - 
         అసలు మనం గాలిని ఎన్నిమార్లు 
పీల్చుకొని వదులుతాము ఒక నిముసానికి
అంటే 14 నుండి 16 సార్లు ఈ పద్ధతిలో
గాలిని పీల్చుకుంటున్నామా ఏమో ఎవరు 
లెక్కగట్టారు. పోనీ ఎలా గాలిపీల్చు
కుంటున్నామో గమనించామా? అంటే
రోజులాగే అదికాదు మీరు పిల్లలను
గాలిపీల్చుకునేప్పుడు పరిశీలించారా
వారు గాలిపీల్చుకుంటే పొట్ట పెద్దవుతూ
చిన్నదవుతూ ఉంటుంది. అలా పెద్దలు
ఎంతమంది గాలిపీల్చుకుంటున్నారో 
గమనించామా ఇక అసలు విషయానికొద్దాం-
ప్రతి మనిషి రోజుకు 21,600 సార్లు శ్వాస 
తీసుకోవాలి వీటిలో ఎక్కువతక్కువ లుండకూడదు
ఉంటే ఏమంటారా మీ దగ్గర ప్రతిరోజూ
జియోవాడు 1జి.బి. డేటా ఇస్తున్నాడు కదా
అది మీరు వాడటానికి 24 గంటలు మాత్రమే 
మీ పరిమితి పరిమితిలో వాడుకుంటే 24 గంటలు
వాడవచ్చు. లేదంటే ముందే అయిపోయింది
మీరు వాడుకోడానికి వేగంగా పనిచేయదు 
స్లోగా నెట్ పనిచేసుంది అంటున్నారు కదా.
ఇది ఉదాహరణమాత్రమే ఇక్కడ మనకు 
గమనించాల్సిన అంశం ఒకటుంది.
ఏక్కువగా వాడితే ముందే అయిపోతుంది
తక్కువవాడితే నిర్ణీత సమయంవరకు ఉంటుంది.
అలానే మనం సరిగా రోజుకు 21,600 శ్వాసతీసుకుంటే
శతమానం భవతి. లేదంటే ముందుగానే శతమానం
అనుకోవాలి. రోజుకు 30లేక 40 వేలు శ్వాసలు పీల్చితే
ముందుగానే మన ఆయువు తీరుతుంది. అలాకాక
నిర్ణీతంగా శ్వాసిస్తే 100 సంవత్సరాలు జీవించవచ్చు
అలాకాదు మీరు 21600 x 24 = 518400 శ్వాసలు ఒక రోజుకు
అదే సంవత్సరానికి 518400ను 365 చే గుణిస్తే వచ్చే
సంఖ్య ఒక సంవత్సరంలో మనం శ్వాసించాల్సిన శ్వాసల 
సంఖ్య మరి ఒక 100 సంవత్సరాల్లో అంటే ఆ లెక్క మరీ 
ఎక్కువగా ఉంటుంది. ఒక రోజులో 21600 శ్వాసలు
కాకుండా 20000 వేల శ్వాసలు పీల్చామనుకుంటే 16 వందల
శ్వాసలు మనం మిగుల్చుకున్నట్టు కదా ఇవి ఇదే ప్రకారం
100 సంవత్సరాలకు ఎన్ని మిగులుతాయో అవన్నీ మనకు 
అదనంగా జీవించే కాలమౌతుంది. ఇది ఎలా 
అంటే 
అదే  మన మునులు చేసే తపస్సు. 
సరే ఇదంతా పక్కన పెట్టి మరికొన్ని 
విషయాలను తెలుసుకుందాం.
మనం శ్వాస తీసుకున్నపుడు మన నాసిక
రెండు రంధ్రాల గుండా గాలి వెళ్ళదు గమనించారా?
కుడి వైపు రంధ్రం గుండా వెళ్ళి వచ్చే గాలిని
సూర్యనాడి అని, ఎడమవైపు రంధ్రలో గుండా వెళ్ళి
వచ్చే గాలిని చంద్రనాడి అని అంటారు. ఒక ముక్కు 
రంధ్రంలోనుండి మరో ముక్కు రంధ్రంలోకి శ్వాస మారే 
సమయంలో రెండు ముక్కు రంధ్రాల్లో కొద్దిసేపు మాత్రమే
శ్వాస ఆడుతుంది. 
(ఈ వ్యాసంలోని అంశం అందరికి నచ్చినట్లయిన
మీరు పంపే సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు 
సాగాలని ఇక్కడ ఆపుతున్నాను పాఠకులు పాహితీమిత్రులు
దీన్ని కొనసాగించ వలసినదిగాను దీనితో మీ అభిప్రాయం
తెలపండి కొనసాగించే ప్రయత్నం చేస్తాను.)

Tuesday, January 16, 2018

పంచకావ్యాలంటే ఏవి?


పంచకావ్యాలంటే ఏవి?




సాహితీమిత్రులారా!



ఏ భాషా సాహిత్యంలోనైనా, వేలకొద్దీ పుస్తకాలు
వెలువడుతుంటాయి కానీ మరీ గొప్ప గ్రంథాలను
వేళ్లమీదే లెక్కపెట్టవచ్చు. నిన్నమొన్నటిదాకా
సంస్కృతంలో మొట్టమొదట చదవాల్సింది
ఐదు కావ్యలను చెప్పేవారు వాటినే
పంచకావ్యాలు అంటుండేవారు.
చిత్రమేమంటే ఆ ఐదింటిలో
కాళిదాసు వ్రాసినవి మూడున్నాయి.
మరొకటి భారవి వ్రాసింది. ఇంకొకటి
మాఘుడు వ్రాసింది. ఈ ఐదు కావ్యాలు
చదువగానే ఇంకే కావ్యాన్నైనా చదివి
అర్థం చేసుకోవడం అంతసులువని
వారి నమ్మకం. కాదు నిజమే.
ద్రాక్షాపాకంలోని రఘువంశం మొదలు
కొరుకుడు పడని మాఘకావ్యం వరకు.
చూద్దామా వాటి పేర్లు వరుసగా
1. రఘువంశం  - కాళిదాసు
2. కుమార సంభవం - కాళిదాసు
3. మేఘసందేశం - కాళిదాసు
4. కిరాతార్జునీయం - భారవి
5. శిశుపాలవధ - మాఘకవి

ఇవన్నీ సంస్కృతంకదా తెలుగులో
ఏవైనా వున్నాయా ఇలా అంటే
ఉన్నాయి. వాటిని రెండు మూడు
విధాలుగా చెబుతున్నారు చూద్దాం-
మన పరిశోధకులు ఆరుద్రగారి
ప్రకారం -
తెలుగులో పంచకావ్యాలు-
1. మనుచరిత్ర - అల్లసాని పెద్దన
2. వసుచరిత్ర - రామరాజభూషణడు
3. రాఘవపాండవీయం - పింగళి సూరన
4. శృంగారనైషధం - శ్రీనాథకవి
5. ఆముక్తమాల్యద - శ్రీకృష్ణదేవరాయలు

అంతర్జాలంలో కొందరు పెట్టిన
పంచకావ్యాలు-
1. మనుచరిత్ర - అల్లసాని పెద్దన
2. పాండురంగమాహత్మ్యం - తెనాలి రామకృష్ణుడు
3. ఆముక్తమాల్యద - శ్రీకృష్ణదేవరాయలు
4. వసుచరిత్ర - రామరాజభూషణుడు
5. విజయవిలాసము - చేమకూర వేంకటకవి

ఇక్కడ ఏవి పంచకావ్యాలైనా వాటిని చదవడం వలన
భాషా పరిజ్ఞానం పెంపొందుతుందని మనవారి
ఆలోచన.
పాటించగలవారు దాదాపు లేరనే చెప్పాలి
పాటించగల వారుంటే
వారి ధన్యవాదాలు.

Monday, January 15, 2018

పద్మానది


పద్మానది



సాహితీమిత్రులారా!



హుమాయును కబీరు బాంగ్లాలో మంచి కవి
అని తక్కువ మందికే తెలుసు. ప్రకృతి
మనోహర దృశ్యం చిత్రించడంలో సిద్ధ
హస్తుడు ఈయన. ఇతని పద్మా(నది)
కవితను చూడండి-
బ్రహ్మపుత్రానదిని బంగ్లాదేశ్ లో
పద్మా అని పిలుస్తారు.
ఇక్కడ బంగ్లా కవితను అలాగే చూసి
అర్థాన్ని తరువాత చూద్దాం-

దూరదేశే తోరె బహుదిన ఛిను భులె పద్మా మోర,
అబార శాంగనే తోర కూలే కూలే భాంగన లెగె ఛెజోర?
నెమెఛె వర్షా ఘోర
చరేర చిహ్నధుయె ముఛెదియె
వుపుల సలిల సంబార నియె
యౌవన తోరె బోయె నియె జాన్ కాహార దోర్?
కే మనో చోర?
పద్మా మోర..
సబుజ మాయాయ భరేఛె దుకూల తబొ
పద్మా మోర.
జలేర కినారె ఎసెఛె దుర్వానవ
తెబు దయా నహీ తోర?
అతిథి శిశురె హాసిన కి కరి?
నిఠుర ప్రహారె ఉఠిఛె శిహలీ
ఠకరి పడిచె క్షురధారీ ప్రోత నిరంతర
దెఖి తె కోమల తబు ఎతొ తోర
హియా కఠోర? 

భావం-
         నా పద్మా, దూరదేశాన ఎన్నాళ్ళో మరిచి వున్నావు.
తిరిగి శ్రావణం రాగానే నీ వొడ్లు విరిగి పడుతున్నాయి.
ఘోరమైన వర్షం దిగి వస్తోంది. పొడిపొడిగురుతులు 
తుడిచేసి, కడిగేసి, విపుల సలిల సంబారం నీయవ్వనం 
పారించి ఎవరి ద్వారానికి తర్లించుకు పోతుంది ఎవరే 
నీ మనసు దొంగిలించారు. నా పద్మా
         ఆకుపచ్చటి మాయ నీ ఉభయ తీరాలు దట్టంగా
వున్నాయి.నీటి వొడ్డున కొత్తగరిక వచ్చింది. అయినా దయలేదే
నీకు అతిథి పైగా శిశువు ఇలా అనాదరణ తగునే నీ నిష్ఠుర
ప్రహారాలతో అది అనవతరం వొణికి పోతూ వుంది. నీ క్షుర 
ధారాప్రవాహం నిరంతరం కోస్తూనేవుంది. చూసేందుకు ఇంత 
కోమలవు. నీహృదయ మింత కఠోరమేమి, నా పద్మా

Sunday, January 14, 2018

సంక్రాంతి అంటే ఎవరి పండుగ?


సంక్రాంతి అంటే ఎవరి పండుగ?




సాహితీమిత్రులారా!



సంక్రాంతి గురించి తెలుసుకునే ముందు
కొంత జ్యోతిషవిషయం చర్చించుకుందాం-

మనకు ఆకాశంలో కోట్లాది తారకలున్నాయి.
కాని మనం తెలుగులోనైతేనేమి జ్యోతిషంలో 
నైతేనేమి నక్షత్రాలు 27 అంటున్నాము.
అంటే అన్ని కోట్ల నక్షత్రాలుంటే 27 అనడమేమి
ఇది ముందు తెలుసుకుందాము.
సూర్యుడు ఆకాశంలో వెళ్ళినట్లు మనకు(భూమ్మీదివారికి) 
కనబడుతుంది. దాన్నే మనం రవి మార్గం అంటాం.
ఈ మార్గంలో పైకి 5 డిగ్రీలు, క్రిందకు 5 డిగ్రీలు తీసుకోగా
వాటి మధ్యనుండే తారకలను కలపగా కొన్ని రకాల ఆకారాలు
ఏర్పడ్డాయి. వాటికి పేర్లు పెట్టారు అవే అశ్వని, భరణి,
కృత్తిక, రోహిణి, మృగశిర ఇలా 27 పేర్లున్నాయి. వాటినే 
మనం నక్షత్రాలంటున్నాము. ఈ 27 నక్షత్రాలను మరి కొన్ని
గుంపులుగా చేసి కలుపగా మరి కొన్ని రకాల ఆకారాలు 
వచ్చాయి అవి- మేషం(మేక), వృషభం(ఎద్దు) ఇలా
12 రకాల ఆకారాలు వచ్చాయి. కొన్ని గుంపుల వల్ల 
ఏర్పడ్డాయి కావున వీటిని రాసులు(గుంపులు) అని 
పిలుస్తున్నాం. ఈ రాసుల్లో సూర్యుడు పయనిస్తాడు కదా
దీన్నే సంక్రమణం అంటాం. ఏ రాశిలో కెళితే ఆ రాశిపేరున
ఆ సంక్రమణం అదే సంక్రాంతి అంటాం. ప్రతినెల ఒక రాశిలోకి
సూర్యుడు మారుతుంటాడు. అయితే సూర్యుడు తిరిగే 
ప్రతి రాశికి ఒక సంక్రాంతి అన్నాం కదా వాటికన్నిటికీ
మనం పండగలు చేస్తున్నామా అంటే లేదు. మన పంచాంగాల్లో
మాససంక్రాంతి పేరున ప్రతినెల కనిపిస్తుంది. వాటికి మనం అంతగా
గమనించడంలేదు. కేవలం మకరసంక్రాంతిని మాత్రమే పండుగగా
పెద్ద ఎత్తున చేస్తున్నాము. కారణం ఏమిటంటే. మకరసంక్రమణం
నుండి సూర్యుడు ఉత్తరం వైపునకు ప్రయాణం చేస్తాడు. అంటే
మనకు సూర్యుడు రెండు రకాల ప్రయాణాలను కలిగి ఉన్నాడు
ఒకటి ఉత్తర అయనం(ప్రయాణం), రెండవది దక్షిణ అయనం
వీటిలో ఉత్తర అయనం పుణ్యకాలమని మనవారి నమ్మకం. 
అందుకే మకరసంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటాం. 
ఈ రోజు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు.
దీని వల్ల వారు ఉత్తమగతులకు పోతారని ఒక నమ్మకం.
ఇది మిత్రులారా సంక్రాంతి కథా కమామిషు.

కాలువలు దాటివచ్చేవారు చెప్పే కొలతలు


కాలువలు దాటివచ్చేవారు చెప్పే కొలతలు




సాహితీమిత్రులారా!

పూర్వం ప్రయాణాల్లో ప్రధానమైంది నడక
అలా నడచి వెళ్ళేవారు కాలువలు దాటాల్సి
వచ్చినపుడు వారు చెప్పే కొలతలు ఇక్కడ
తెలుసుకొందాము-

1. చీలగిర్తలకి - అరికాలు మీది అతుకు
2. ఓరడుమ్సులకి - చీలగిర్తలకి కాలి మడుసు(కీలు)కు మధ్య
3. బొట్టుముడుకు(మోకాలు)లకి - ముడుకు సమానం
4. ఎదురు తొడలకి - ముడుకుమీది మధ్యనుండి మడ్డితుంటికింది
                   మెత్తని భాగం
5. మక్కకీలకి - నడుముకింది ముడ్డిఅతుకు
6. మొలకట్లకి - కట్టుపంచె మొలతాడుకట్టుచోటు
7. బొడ్డు సేరుకు - బొడ్డు ఉన్న భాగం పరిమాణంలో 
                 కాలువ ప్రవహించుట 
8. చంకలకిందికి - చంకలెత్తు ప్రహించుట
9. కుత్తికెలకి - పీకెల ఎత్తు పరిమాణంలో ప్రవహించుట

కాలువల్లో ఎదురు తొడల ఎత్తు మించి ప్రవహించితే
ఆ కాలువ దాటి ప్రయాణించరు. మొలతాడు కట్టిన
హద్దు నుండి మెడపీకలవరకు ప్రవహించే కాలువ
ప్రమాదమని అందులో ఈతాడటంగాని, దాటే
ప్రయత్నంగాని చేయరు.

(గోదావరిలోయలో కొండరెడ్ల బతుకు కతలు - 2 వ్యాసం నుండి -
 వ్యాసకర్త - పల్లా బొర్రం రెడ్డి)

Saturday, January 13, 2018

తెనాలి రామకృష్ణుని శరదృతు వర్ణన


తెనాలి రామకృష్ణుని శరదృతు వర్ణన



సాహితీమిత్రులారా!



తెనాలిరామకృష్ణుని పాండురంగమాహత్మ్యంలోని
నాలుగవ ఆశ్వాసంలో మనకు శరదృతువర్ణన
కనిపిస్తుంది అందులోని ఒక పద్యం-
వర్షఋతువులో ఉండే అందాలు పోయినవి.
వాటి స్థానే శరదృతువులో కొన్ని కొత్త అంశాలు
చోటుచేసుకున్నాయి. ఆ విషయం ఎంత చమత్కారంగా
వర్ణించాడో ఈ పద్యం చెబుతుంది-

కలుగకుండిన నేమి కడిమి పువ్వులతావి
         ననిచిన మరువమెంతటికి నోప?
దొదవకుండిన నేమి మదకేకి నటనంబు
         చాలదె యంచల సంభ్రమంబు?
మెరవకుండిననేమి మెరుగుల పొలప మే
         తన్మాత్రములె శాలిధళధళములు?
సుడియకుండిననేమి సోనవానల పెల్లు
         గజదాన వృష్టికి గడమ కలదె?
కారుకాలాన గలిగిన గౌరవంబు
చౌకయై తోచె శరదృతు సౌష్ఠవమున
నురిలి తొల్లిటి యధికారి యోసరిలిన
వెనుక యధికారి యవికావె విభవకళలు?
          (పాండురంగ మాహత్మ్యం 4 - 42)



కలుగకుండిన నేమి కడిమి పువ్వులతావి
         ననిచిన మరువమెంతటికి నోప?
 వర్ష ఋతువులో కడిమి పువ్వులు పూచేవి. ఇపుడు శరత్తులో
కడిమిపువ్వుల వాసన రావడంలేదు. సరే కడిమిపూల వాసన 
లేకపోతేనేమి? చిగిరించిన ( ననిచిన) మరువము వాసనలు
న్నాయి కదా. (ఎంతటికైనా సరిపోతుందనడం.)

దొదవకుండిన నేమి మదకేకి నటనంబు
         చాలదె యంచల సంభ్రమంబు?
మదించిన నెమలి నాట్యము (మదకేకి నటనంబు) 
ఇప్పుడు లేకపోతే ఏమి?. హంసల సంభ్రమము చాలదా?

మెరవకుండిననేమి మెరుగుల పొలప మే
         తన్మాత్రములె శాలిధళధళములు?

మెరుపులు మెరవకపోతేయేం? శాలిధాన్యపు
( మేలిరకం ధాన్యం)  తళతళలు తక్కువా యేం?

సుడియకుండిననేమి సోనవానల పెల్లు
         గజదాన వృష్టికి గడమ కలదె?
చక్కని చిరుజల్లులు పడకపోతే మాత్రమేమి తక్కువ? 
ఏనుగులుమదజలమును వర్షిస్తున్నవికదా?

కారుకాలాన గలిగిన గౌరవంబు
చౌకయై తోచె శరదృతు సౌష్ఠవమున
వర్షాకాలమునకు గల గొప్పదనము సరిగ్గా ఆలోచిస్తే శరత్తులో
ఇంకా చౌకగా లభిస్తున్నది. అంటే వర్షాకాలంలో దొరికేవన్నీ
ఈ శరత్తులోనూ వానికన్న శ్రేష్ఠమైనవి ఇంకొంచెం చౌకగానే
దొరుకుతున్నాయి. అనగా శరత్తు తనధర్మములు చూపుతూ
వర్షాకాల ధర్మములనూ చూపగలుగుతున్నది

నురిలి తొల్లిటి యధికారి యోసరిలిన
వెనుక యధికారి యవికావె విభవకళలు?
ఒక అధికారి తాను ఉద్యోగమునుండి తప్పుకున్నా. 
వాని అధికారములన్నీ ఆ తరువాత వచ్చే అధికారికి
దొరుకుతాయితాయి కదా. ఆ వైభవాలన్నీ తరువాత
వచ్చేవాడికి దక్కినట్టే వర్షాకాల విభవము శరత్తుకు దక్కింది-
అని భావం

Friday, January 12, 2018

సత్యభామాకృష్ణుల సంవాదం - 1


సత్యభామాకృష్ణుల సంవాదం - 1




సాహితీమిత్రులారా!



కాకపర్తి తిరుపతి పాత్రయ్య కృత
సత్యభామా కృష్ణుల సంవాదం లోని
సంవాదం ఇది చూడండి-

ఒకనాడు ఎంత రాత్రయినా సత్యభామాదేవి
ఇంటికి శ్రీకృష్ణమూర్తి రాలేదు. ఆమె విరహంలో
పడి దూతికను పంపింది. ఆయన వచ్చాడు.
అయితే ఆమె అన్యవధూ పరిభోగ చిహ్నాలను
కనుగొని రోషవహ్నిశిఖ వలె కన్నులు కెంపుల
నింపుతూ తలుపువేసుకుంది. భార్యాభర్తల మధ్య
సంవాదం నడిచింది.
ఇంకొకరికి సొమ్మయినాడని సత్యభామ ఇలా
ఎత్తిపొడిచింది-

తళుకు పసిడి గాజుల నొక్కుల గళంబు
       స్తన మృగనాభి పత్రమూనిన యురంబు
గంబురా విడియంపు కావిని కనుదోయి
       లాక్షారసమున ఫాలస్థలంబు
పలుమొన సోకున కళుకు లేజెక్కిళు
       లసదుగాటుక చిన్నె నలతి మోవి
రమణీయతర నఖాంకముల బాహుయుగము
       పలుచని జిగి కదంబమున మేను
ముద్రలెట్టుచు తనదు సొమ్ముగ  దలంచి
యెవతె నిను నమ్మి యున్నదో యిపుడు తగవు
మాలి నిన్నంట దగునె మా జోలి రాకు
యొకరి సొమ్మొకరు గనంగ నుచితమగునె

(బంగారుగాజుల నొక్కులు గొంతుపైన,
కస్తూరి గుర్తులు రొమ్ముపైన,
కర్పూరతాంబూలపు రంగులో ఎర్రని కళ్లు,
లత్తుక నుదుటిన, దంతక్షతాలు బుగ్గలమీద,
కాటుక చిన్నపెదవి మీద, రెండు చేతుల మీద
ఖక్షతాలు, పలుచని కాంతి మిశ్రమముతో శరీరం
తన సొమ్మని తలచి ఎవతె ఇలా ముద్రలన్నీ
చేసిందో నిను నమ్మి, ఇపుడు నీతో కట్లాట దేనికి
నిన్ను అంటవచ్చునా ఒకరి సొమ్ము మరొకరు
చూడవచ్చునా మాజోలికి రాక వెళ్ళు - అని భావం.)

స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు


స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు

Thursday, January 11, 2018

భ్రాతృ గృహవాస మింతికి భారమగునె


భ్రాతృ గృహవాస మింతికి భారమగునె




సాహితీమిత్రులారా!



ఆడవాళ్ళ విషయంలో మగవాడు ఆడినమాట
తప్పినా భర్తలేని స్త్రీలు మాత్రం గడమనప్పుడు
తోడబుట్టినవాళ్ళ ఇంటిలో ఉండకూడదు -
అనే విషయాన్ని మదినె సుభద్రయ్యమ్మగారు
శతకంలో వివరించారు.
ఆ పద్యం చూడండి-

కాంతుడు లేకున్న గడుపేదయై యున్న
       బుత్రులు బాలత బొందియున్న
మిత్రులు శత్రులై మేలెరుంగక యున్న
       తిరిపెమే యూరను దొరకకున్న
దీన పోషకుడైన దేవ రక్షామణి
        కనికరం బెదపూని కావ కున్న
తన సహోదరులకు ధన ధాన్య సంపదల్
        కరము ప్రభుత్వంబు కలిగియున్న
భ్రాతృ గృహవాస మింతికి భార మగునె
వారి కుటిల వచశ్మర వ్రజమునాటి
బాధపడు కంటె దేహంబు బాయుటొప్పు
హీనమైయున్న బ్రదుకేల మానినులకు
వర విశాఖ పురాధీశ హరి! రమేశ!

విశాఖపురపాలకా!  ఒ హరీ! రమేశా!
భర్తలేకున్నా, చాలపేదరాలైనా, కుమారులు చిన్నపిల్లలైనా,
మిత్రులే శత్రువులై మంచి చేయకున్న, ఏ ఊర్లో బిక్షం
దొరకకపోయినా, దీనులను పోషించే దేవుడే కనికరించకపోయినా,
తన సోదరులకు ఎంత సంపదకలిగిఉన్నా, చేతిలో పాలనవున్నా,
సోదరుల ఇంటిలో నివసించడం స్త్రీకి భారమే అవుతుంది.
వారి కుటిలమైన మాటల వల్ల బాధ పడటం కంటే
శరీరాన్ని వదలడమే సరైంది. హీనమై వున్న స్త్రీల
బ్రతకులు బ్తకడం దేనికి అంటోంది సుభద్రయ్యమ్మగారు.

ఇందులో స్త్రీ ఎటువంటి పరిస్థితులలో ఉన్నా
సోదరుని ఇంటిలో ఉండకూడదనే విషయాన్ని
నొక్కి చెబుతున్నది కవయిత్రి.

Wednesday, January 10, 2018

పురాణాల్లోని పేర్లు - వాటి అర్థాలు - 2


పురాణాల్లోని పేర్లు - వాటి అర్థాలు - 2




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి............



సాంబశివుడు - (స + అంబ = సాంబ)అంబతో కూడుకున్న శివుడు

శ్రీకంఠుడు - కంఠమునందు విషము కలవాడు - శివుడు

కృష్ణడు - నలుపు వర్ణము కలవాడు

జిష్ణుడు - జయశీలం కలవాడు - ఇంద్రుడు

గౌరి - గౌరవర్ణము కలది - పార్వతి

భవ్య - పూజించువారి కోరికలను తీర్చునది - పార్వతి

చతుర్దంతము - నాలుగు దంతాలుకలది - ఐరావతం

వాల్మీకి -పుట్టనుండి పుట్టినవాడు

వ్యాసుడు -వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు.

విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు

విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు

శంతనుడు - శం = సుఖము/శుభము; తను = విస్తరింపజేయుట ,
                       సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు

శకుంతల - శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది.

శూర్పణఖ - చేటల వంటి గోరులుకలది (శూర్పమనగా చేట, నఖ మనగా గోరు)

సగరుడు - విషముతో పుట్టినవాడు 
                  (గర/గరళ శబ్దాలకు విషమని అర్ధము) (గర్భములో ఉండగా 
                   విష ప్రయోగానికిగురై ఆ విషంతోనే పుట్టినవాడు)

సత్యభామ - నిజమైన కోపము కలది ( భామ - క్రోధే)

సీత - నాగటి చాలు (జనక చక్రవర్తి) భూమి దున్నుతుండగా నాగటి చాలులో 
          దొరికిన శిశువు కనుక సీత అయినది

ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు  
                                            (ధ్యుమ్నము :బలము)

ప్రభావతి - ప్రభ (వెలుగు)కలది.

ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు

బలరాముడు - బలముచే జనులను రమింపచేయువాడు.

బృహస్పతి - బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్పతి)

భరతుడు - అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.

భీముడు - భయమును కలిగించువాడు

భీష్ముడు - భీషణమైన ప్రతిజ్ఞ చేసినవాడు

మండోదరి - పలుచని ఉదరము కలది (మండ-పలుచని)

మన్మధుడు - మనస్సు కలత పెట్టువాడు.

మహిషాసురుడు 1. రంభుడు మహిషంతో (గేదే) రమించగా పుట్టినవాడు
                               2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై   
                                   (గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును  
                                   మింగి గర్భాన్నిధరించి ఇతనికి జన్మనిస్తుంది.

యముడు - యమము (లయ)నుపొందించువాడు.

యశోద యశస్సును (కీర్తి) కలిగించునది.

రాముడు - రమంతే యోగినః అస్మెన్ = రామ(రమ్ -క్రీడించుట)

యోగులందరూ ఈ పరమాత్మునియందు విహరించెదరు/ఆనందించెదరు.

రావణాసురుడు - కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు 
                               బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు

రుక్మిణి - రుక్మము(బంగారము) కలది


Tuesday, January 9, 2018

పురాణాల్లోని పేర్లు - వాటి అర్థాలు - 1


పురాణాల్లోని పేర్లు - వాటి అర్థాలు - 1



సాహితీమిత్రులారా!



ప్రతి వ్యక్తికి పేరుంటుంది దానికో అర్థం కూడా ఉంటుంది.
అర్థంలేని పేర్లను సాధారణంగా ఎవరూ పెట్టుకోరు కదా
అలాగే పురాణాల్లోని వ్యక్తులకు ఆ పేర్లు ఎందు అలా వచ్చాయో
ఇక్కడ కొన్నిటిని తెలుసుకుందాము-

పేరు              అర్థం
విష్ణువు -  అంతటా వ్యాపించినవాడు

లక్ష్మి - అన్నిటిని చూచేది

శివుడు - శుభం కలిగించేవాడు

స్థాణువు - ప్రళయకాలమున ఉండువాడు - శివుడు

పార్వతి - పర్వతరాజ పుత్రిక

భవాని - భవుని భార్య (పార్వతి)

హైమవతి - హిమవంతుని కూతురు - పార్వతి/గంగ

ధాత - సమస్తమును ధరించినవాడు - బ్రహ్మ

సరస్వతి - అంతటావ్యాపించి ఉండునది

బ్రాహ్మి - బ్రహ్మ యొక్క భార్య

అనసూయ - అసూయ లేనిది

అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు

అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, 
           ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని 
           రావడం వలన అశ్వత్థామ అని పేరు

ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు.

ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు 
                         (జితమంగా విజయము)

ఊర్వశి - నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.

కర్ణుడు - పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు.

కుంభకర్ణుడు - ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల 
             కర్ణములు (చెవులు) కలవాడు.

కుచేలుడు - చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు 
           (చేలము అనగా వస్త్రము).

కుబేరుడు - నికృష్టమైన శరీరము కలవాడు 
                      (బేరమనగా శరీరము).

గంగ - గమన శీలము కలది .  

భాగీరధి - భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది - గంగ 

జాహ్నవి - జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది - గంగ

గరుత్మంతుడు - విశిష్టమైన రెక్కలు కలవాడు

ఘటోత్కచుడు - కుండవలె గుబురైన జుట్టు కలవాడు 
                               (ఘటమనగా కుండ)

జరాసంధుడు - 'జర' అను రాక్షసి చేత శరీర భాగాలు 
                             సంధింపబడిన (అతికింపబడిన) వాడు.

తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు

దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.

ధృతరాష్ట్రుడు - రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.

త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 
                        2. పరభార్యను అపహరించుట 
                        3. గోమాంసము తినుట అను మూడు
                               శంకువులు(పాపాలు) చేసినవాడు.

దమయంతి - 1. 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది.
                          2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).

దూర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము)

దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు 
                                వీలుపడనివాడు.

దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.

ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు.

ధర్మరాజు - సత్యము, అహింస మొదలగు ధర్మములను 
                      పాటించే రాజు/ 
                      (కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని   
                      వలన(యమధర్మరాజు) కన్న సంతానము )

యుధిష్టరుడు -  యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును
                              ప్రదర్శించువాడు 

నారదుడు - 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 
           2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.

Monday, January 8, 2018

ఇలాటి దూత ఉన్నాడా?


ఇలాటి దూత ఉన్నాడా?



సాహితీమిత్రులారా!


నిషధదేశాధీశుడైన నలుడు దమయంతి స్వయంవరం
వెళుతున్న సమయంలో అతనికి ఇంద్రుడు, వరుణుడు,
అగ్ని, యముడు కనిపించి వారి పనుపున దమయంతి
వద్దకు దూతగా పంపారు. ఇంద్రవరుణాగ్నియములలో
ఒకరిని చేసుకునే విధంగా దమయంతిని ఒప్పించటానికి.
నలుడు మొదట మాటఇవ్వడంతో చిక్కుపడ్డాడు. చివరకు
వారి మాయాశక్తితో దమయంతి వద్గకు వెళ్ళి అక్కడ నలుని
దౌత్యం ఇక్కడ చర్చాంశం-

నలుని చెప్పినదంతా విన్న దమయంతి-
ఏనేడ నింద్రాదులేడ వారలకు
నెప్పుడు మ్రొక్కుదు నేను నీ ధనమ
భూనాథ నీగుణంబులు హంసచేతఁ
బొలుపుగా విని మనంబున నిల్పియున్న
దాన భవన్నిమిత్తమున నిట్లఖిల
ధారుణీనాథ సార్థంబు రావింపఁ
గా నిప్డు వలసె లోకఖ్యాత కీర్తి
కరుణించి పతిబుద్ధి గావింపుమిందు

(నే నెక్కడ దిక్పలకులెక్కడ వారికి నేనెపు మ్రొక్కుతుంటాను.
వారియందు భక్తి వుందికాని భర్తృభావం లేదు. నేను నీసొత్తే,
నీగుణాలు హంసవల్లవిని నిన్నే ప్రేమించాను. నిన్ను
రప్పించటానికే ఈ స్వయంవరం చాటించి రాజులందరిని
రప్పించాల్సివచ్చింది. కాబట్టి దూతభావం వదలి భర్తృభావం
వహించు.)

నన్ను పెళ్లిచేసుకోవటానికి ఒప్పుకోకపోతే నేను ఉరి పోసుకొనో,
విషంత్రాగో, నిప్పుల్లోదూకో, నీటిలోదుమికో ప్రాలుతీసుకుంటాను
అని అన్నది దమయంతి.
దానికి నలుడు-

భూరిసత్త్వులు సర్వలోక విభుల్ విభూతి సమృద్ధు లి
ద్ధోరుతేజులు నిన్నుఁగోరుచున్న వారమరోత్తముల్
వారి పాదరజంబుఁబోలని వాని నన్ను మనుష్యు సం
సారిఁగోరఁగఁ జన్నే నీకుఁ బ్రసన్నులై సురలుండఁగాన్

(దేవతలు చాల బలం వున్నవారు, అన్ని లోకాలేలేవారు,
అష్టసిద్ధులు కలవారు, నిరంతరం పెరిగే తేజస్సుకలవాళ్లు,
వారు నీయందు అనుగ్రహంతో వచ్చినారు. నేను వాళ్లకాలి
అంటిన దుమ్ముతో కూడ సరిపోను. మనుష్యుని, సంసారిని,
న్నుకోరుకుంటావేమి ఇది మంచిదికాదు.)

దేవతల కప్రియంబులు
గావించి మనుష్యులధమ గతులగుదు రిలం
గావున వారి కభీష్టము
గావింపుము నన్నుఁ బ్రీతిఁ గావుము తరుణీ!

(దేవతలకు ఇష్టం లేని పనులు చేసి మనుష్యులు నరకంలో
పడతారు. కాబట్టి వాళ్లకు ఇష్టమైంది చేసి నన్ను కాపాడు.)

నలుని మాటలకు దమయంతి కన్నీరు కారుస్తూ చాలసేపు
ఆలోచించి నలునితో - నీకు దోషం రాకుండా నాకు
ఒక ఉపాయం తట్టింది. ఆ దిక్పాలకులముందే నిన్ను వరిస్తాను.
అప్పుడు నీకే దోషం రాదుకదా అని చెప్పింది.

ఒక ప్రియుడు ప్రేయసి వద్దకు దూతగా వెళ్ళిన వారెవరైనా
ఉన్నారా?  ప్రేయసి ఇంత ఇదిగా ఒప్పించ ప్రయత్నిస్తాడా?
ఇలాంటి వాళ్లు ప్రపంచంలో నలుడొక్కడే ఉంటాడేమో కదా!