Monday, July 31, 2017

సత్పురుషుల లక్షణాలు


సత్పురుషుల లక్షణాలు




సాహితీమిత్రులారా!



సత్పురుషుల గుణాలను గురించి
భర్తృహరి చెప్పిన పద్యం చూడండి-
దీన్ని తెలుగులో ఏనుగు లక్ష్మణకవి
కూర్చారు-

ఆశాసంహరణంబు, నోర్మియు, మదత్యాగంబు, దుర్దోషవాం
ఛాశూన్యత్వము, సత్యమున్, బుధమతాచారంబు, సత్సేవ యున్
వైశద్యంబును, శత్రులాలనము, మాన్యప్రీతియుం, బ్రశ్రయ
శ్రీశాలిత్వము, దీనులందుఁగృపయున్ శిష్టాలికిన్ ధర్మ ముల్


అత్యాశను వదిలిపెట్టడం, ఓర్పు కలిగి ఉండటం,
మదాన్ని వీడడటం, పాపకార్యాలపై కోరికలేకుండటం,
సత్యాన్నే పలకడం, సజ్జనులను సేవించడం,
సంపద కలిగి ఉండడం, శత్రువులనైనా చక్కగా చూడడం,
పూజ్యులను పూజించడం, పెద్దలయెడ అణకువ కలిగి ఉండడం,
దుఃఖితులయెడ దయ చూపడం - ఇవ్నీ
సత్పురుషులలో ఉండే లక్షణాలు- అని భావం.



Saturday, July 29, 2017

మనుస్మృతిలో రాజు


మనుస్మృతిలో రాజు




సాహితీమిత్రులారా!



రాజును గురించిన కొన్ని ఆసక్తికరమైన
విషయాలు రాజనీతిని గురించిన విషయాలు
మనుస్మృతిలో కనిపిస్తాయి వాటిని ఇక్కడ-

ఇంద్రానిల యమార్కాణా
మగ్నేశ్చ వరుణస్య చ
చంద్ర విత్తేశ యోశ్చైవ
మాత్రా నిర్హృత్య శాశ్వతీః
(మనుస్మృతి - 7-4)
రాజులేక ప్రపంచము మర్యాదమీరి చెడిపోతుంటే
బ్రహ్మ ఈ ప్రపంచాన్ని రక్షించడానికి  ఇంద్రుడు,
వాయువు, యముడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు,
చంద్రుడు, కుబేరుడు - వీరి అంశలను గ్రహించి
రాజును సృజించాడు.

తపత్యాదిత్య నచ్చైష
చక్షూంషిచ మానాంసిచ
న చైవం భువిశక్నోతి
కశ్చదవ్యభివీక్షితుమ్

రాజు సూర్యునివలె తనను చూచేవారి చూపులను
మనస్సును చుఱచుఱ దహించివేస్తున్నాడు.
ఎవడూ రాజును తల యెత్తైనా చూడజాలడు.

ఇంద్రస్యార్కస్య వాయోశ్చ
యమస్య చ వరుణస్యచ
చంద్రాస్యాగ్నే పృథివ్యాశ్చ
తేజోవృత్తం నృపశ్చరేత్ (9-313)

రాజు ఇంద్రుడు, సూర్యుడు, వాయువు, యముడు,
వరుణుడు, చంద్రుడు, అగ్ని, భూమి - వీరి తేజస్సును
నడవడిలో గలవాడై మెలగాలి.

వార్షికాం శ్చతురో మాసాన్
యథేంద్రోపి ప్రవర్షతి
తథాభివర్షేత్స్వం రాష్ట్రం
కామై రింద్రవ్రతం చరస్

ఇంద్రుడు వర్షాలను నాలుగు నెలలు కురిపించి
సస్యాదులను పండేవిధంగా చేసినట్లు
రాజు ఇంద్రునివలె తనరాజ్యంలోని ప్రజలకు
కోరికలు పండునట్లు చేయాలి.

అష్టాన్ మాసాన్ యథాదిత్య
స్తోయం హరతి రశ్మిభిః
తథాహరే త్కరం రాష్ట్రా
న్ని త్య మర్క వ్రతం హితత్

సూర్యుడు తక్కిన 8 నెలలు తన కిరణములచే
కొంచెము కొంచెముగానే భూమినుండి నీటిని గ్రహించినట్లు
రాజును నీతిమార్గమును తప్పక ప్రజలకు బాధలేకుండునట్లు
తనకు రావలసిన పన్నులను రాబట్టుకొనవలెను. దీని పేరు
సూర్యవ్రతము.

ప్రవిశ్య సర్వభూతాని
యథాచరతి మారుతః
తథాచారైః ప్రవేష్టవ్వం
వ్రతమేతద్ధి మారుతమ్

ప్రాణవాయువు అన్ని ప్రాణులలో ప్రవేశించి
బ్రతికింప చేసేవిధంగా రాజు వేగుల మూలమున
అందరిలో ప్రవేశించి వారి కష్టసుఖములను
తెలుసుకొని భరించవలెను - దీనికే
మారుతవ్రతమని పేరు.

యథా యమః  ప్రియద్వేష్యౌ
ప్రాప్తే కాలే నియచ్ఛతి
తథా రాజ్ఞా నియంతవ్యాః
ప్రజా స్తద్ధి యమవ్రతమ్

యముడు శత్రువులు మిత్రులు అని తేడా లేకుండా
వారివారి పుణ్యపాపములకొలది పక్షపాతంలేకుండా
సమానంగా ఏవిధంగా నియమిస్తాడో అదేవిధంగా రాజు
నేరములు చేసిన వారిని స్నేహద్వేషములు లేకుండా
వారివారిదోషములకు తగినట్లు దండించాలి. దీన్నే
యమవ్రతం అంటారు.

వరుణేన యథా పాశై
ర్బద్ధ ఏవాభిదృశ్యతే
తథా పాపా నిగృహ్ణీయా
ద్వ్రతమే తద్ధి వారుణామ్

ఎవడు వరుణపాశానికి కట్టుబడడో
అతడు నిస్సంశయముగా వరుణపాశాని
కట్టబడినవాడే. కావున రాజు పాపకారులను
ఎట్లు తమ అధికారమును నిర్వర్తిపంపరో
అట్లు వారిని ఆవిథంగా దండింపవలెను.
దీనికే వరుణ వ్రతమనిపేరు.

పరిపూర్ణం యథా చంద్రం
దృష్ట్వా హృష్యంతి మానవాః
తథాప్రకృతియో యస్మిన్ 
సచాంద్ర వ్రతికో నృపః

పూర్ణ చంద్రుని చూచి జనులు ఎట్లా సంతోషిస్తారో
అట్లు తనను చూచి వారట్లు సంతోషపడునట్లు
రాజు ఉండాలి. దీన్నే చంద్రవ్రతం అంటారు.

ప్రతాపయుక్త స్తేజస్వీ 
నిత్యం స్యా త్పాకర్మ సు
దుష్టసామంత హింస్రశ్చ
తదాగ్నేయ వ్రతం స్మృతమ్

రాజు ప్రతాపము తేజస్సుకలవాడై
ఎల్లపుడు పాపాత్ములను, దుష్టులగు
సామంతులను హింసించువాడై ఉండవలెను.
దీనినే ఆగ్నేయవ్రతమంటారు.

యథాసర్వాణి భూతాని
ధారాధారయతేసమమ్
తథాసర్వాణి భూతాని
బిభ్రతః పార్థివం వ్రతమ్

స్థావరములను జంగమములను ఉత్తమనీచులను
భూమి ఏవిధంగా సమంగా భరిస్తుందో అదేవిధంగా
పండిత మూర్ఖలను, ధనికదరిద్రులను దీనుల సనాథులను
అందరిని భరించాలి. దీన్నే పృథ్వీ వ్రతమంటారు.





Friday, July 28, 2017

మోసాన్ని మోసంతోనే జయించాలి


మోసాన్ని మోసంతోనే జయించాలి




సాహితీమిత్రులారా!



కిరాతర్జునీయంలోని ఈ శ్లోకం చూడండి-

వ్రజంతి తే మూఢ ధియః పరాభవం
భవంతి మాయావిషు యే న మాయినః
ప్రవిశ్య హి ఘ్నంతి శఠాస్తథావిధా
నసంవృతాంగాన్నిశితా ఇవేశవః
                                        కిరాతార్జునీయమ్ - 1- 30)

ధూర్తుల విషయంలో ధూర్తత్వంతోనే ప్రవర్తించాలి.
అలా చేయని వాడు గొప్ప దుఃఖాన్ని పొందుతాడు.
ఆ మోసగాళ్ళు ఇంటా బైటా ప్రవేశించి
అమాయకత్వాన్ని గుర్తించి బీభత్సం సృష్టిస్తారు.
కవచాదులు ధరించని శరీరాన్ని వాడి బాణాలు లోుల
ప్రవేశించి చంపినట్లు వీళ్లు చంపుతారుసుమా-
అని భావం.

Friday, July 21, 2017

మహాభారత యుద్ధములో పాల్గొన్న రాజ్యాలు


మహాభారత యుద్ధములో పాల్గొన్న రాజ్యాలు




సాహితీమిత్రులారా!

కురుక్షేత్ర యుద్ధములో కౌరవులవైపు 11 అక్షౌహిణీసేనాసమూహము.
పాండవులవైపు 7 అక్షౌహిణీసేనాసమూహం పాల్గొన్నది.
దీనిలో ఏఏ రాజ్యాలు ఎవరికి సహకారమందించారనే విషయం గమనిస్తే
కొందరు కౌరవులకు సహకారమందిస్తే, కొందరు పాండవులకు సహకారమందించారు. మరికొందరు ఇరువురికి సహరారమందిస్తే
కొందరు యుద్ధనికి దూరంగా ఉన్నారు. వారి వివరాలు ఇక్కడ చూద్దాం-

కౌరవులకు సహకారమందించిన రాజ్యాలు - 33
1. అంగ, 2. అవంతి, 3. ఆశ్మంతక, 4. ఆంధ్ర,
5. ఆభార, 6. కర్ణాట, 7. కళింగ, 8. కాశ్మీర
9.  కాంభోజ, 10 కేరళ, 11. గాంధార, 12. టేంకణ,
13. త్రిగర్త, 14. పుళింద, 15. బాహ్లిక, 16. మాళవ,
17. యవన, 18, వంగ, 19. విదర్భ, 20. విదేహ, 
21. సాళ్వ, 22. సింధు, 23. సుహ్మ, 24. సౌవీర,
25. మద్ర, 26. శక, 27. శిబి, 28. తుండ, 
29. శిలీంద్ర, 30. మచ్ఛిల్లిక, 31. అంబష్ఠ, 
32. పారదక, 33. వసాతి దేశాలు

పాండవ పక్షంలో పాల్గొన్న రాజ్యాలు- 8
1. పాంచాల, 2. పాండ్య, 3. కేకయ, 4. కోసల,
5. దశార్ణ, 6. పుండ్రక, 7. మగధ, 8. శూరసేన దేశాలు

రెండు వైపులా తమ సైన్యాన్ని పంపిగాని 
మరోవిధంగాగాని సహకరించినవారు-
1. కరూశ, 2. కిరాత, 3. కేకయ, 4. కోసల,
5. దశార్ణ, 6. పుండ్రక, 7. మగధ, 8. శూరసేన
దేశాలు.

ఇలా వీరు పాలుపంచుకోవడానికిగల కారణాలను 
గురించిన వివరణ మరో పోస్టులో చర్చించుకుందాము.

దొంగే మంచోడు


దొంగే మంచోడు




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-
ఎంత చమత్కారంగా ఉందో

వరం తస్కర సంబంధః
సుజనైః సహ సంగమాత్
తస్కరోహి హరత్యర్థం
సాధుస్తు హృదయం హరేత్

సజ్జనునితో సంబంధంకంటే
దొంగోడి సంబంధమే మేలు
ఎందుకంటే దొంగ కేవలం
మన సంపదనే దోస్తాడు.
సజ్జనుడో హృదయాన్నే దోచేస్తాడు-
అని భావం

Wednesday, July 19, 2017

ఎందు వలనో?


ఎందు వలనో?



సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-
ఇది చెప్పే మంచిమాట గమనించండి-

చరన్వనాంతే నవమంజరీషు
న షట్పదో గంధఫలీమజిఘ్రత్
సాకిం నరమ్యా నచకిం నరంతా
బలీయసీ కేవల మీశ్వరాజ్ఞా

తుమ్మెద పూలగుత్తుపై తిరుగాడుతూ
సంపంగెను వాసనకూడ చూడటంలేదు.
దానికి అందంలేదా? తుమ్మెదకు అనుభవ శక్తి లేదా?
ఇవేవీ కావు బలీయమైన దైవ నిర్ణయము - అని భావం.

పొడియొనరింతునా హహలముం గొని


పొడియొనరింతునా హహలముం గొని




సాహితీమిత్రులారా!


అన్నప్ప కృత సుదక్షిణా పరిణయములోని
ఒక మధుపాన వర్ణన పద్యం ముందు చూచాము.
ఇక్కడ మరొక పద్యం అలాంటిదే
మాధవభట్టుకృత
సుభద్రాపరిణయము కావ్యం నుండి-

పొడియొనరింతునా హహలముం గొని నాభుభుజంబుచేత మా
ర్పిడి బొనరింతునా పిపిపిండిగ జేయుదునా కడుంబడల్
పడ ధధరాస్థలిన్ ససకలంబుగ గూల్చుదునా యదేల యే
ర్పడ కకకల్లు పోము పపపాత్రము నిండగ ద్రావుదుం ద్రుటిన్


Monday, July 17, 2017

మహాభారతంలో సైన్యాధిపతులు


మహాభారతంలో సైన్యాధిపతులు




సాహితీమిత్రులారా!


సైన్యాధిపతులను నిర్ణయించినప్పుడు వారిని
రాజులు అభిషేకిస్తారు. కురుక్షేత్రసంగ్రామంలో
దీనికి ఎక్కువ ప్రాధాన్యం యివ్వబడింది.
ద్రోణుని సైన్యాధిపతిగా చేసినపుడు
దుర్యోధనుడు-

"కనక కలశంబుల భావన జలంబులు తెప్పించి, 
మంగళోపకరణ శోభితంబు గావించి, పుణ్యహనాదంబులుం బరమాశీర్వాదంబులున్ 
మాగధ గీతంబులున్, వంది జనస్తుతివ్రాతంబులుం బ్రభూత భూపతులుం డానును ద్రోణాచార్యునకు సేనాపత్యభిషేక పట్ట బంధం" బొనర్చాడు

ఇలాగే తరువాతిసేనాధిపతులైన కర్ణునికి, శల్యునికి
అభిషేకం చేశాడు. ఇవిసరే చివరకు
తొడలువిరిగి పడిపోయినప్పుడు కూడ
అశ్వత్థామను సేనాధిపతిగా చేసినపుడు
అతణ్ణి అభిషేకించి పట్టం కట్టాడు
దుర్యోధనుడు-

రారాజు
"కృపాచార్యుం గనుగొని యొక్క కలశంబున 
జలంబు నినిచికొని రమ్మనుటయు, 
నమ్మహీసురవరుండు దమ్ముజూడవచ్చి 
యచ్చట నున్న సమీపాశ్రమమునికుమారులం 
బ్రార్థించి యొక్క కలశంబు దెప్పించి దానిం దోయ పూర్ణంబు గావించి తెచ్చిన"

"అతనికి నెమ్మి నిట్లనియె నమ్మనుజేంద్రుడు నీవు వేగమం
చితముగ ద్రోణపుత్రు నభిషిక్తుని జేయుము ప్రీతి మచ్చ మూ
పతియుగ భూసురుండు నృపపంపున గయ్యము సేత లోక వి
శ్రుతమగు ధర్మమట్లగుట జూవె యొనర్చెద నవ్విశేష మున్"

"అనపుడు నతండు సంప్రీతుండై యగ్గురునందనునకు
సేనాధిపత్యభిషేకంబాచరించిన"

వీటిని బట్టి దుర్యోధనుడు సేనాపతుల పట్టాభిషేకానికి
ఎంతటి ప్రాధాన్యమిచ్చాడో తెలుస్తున్నది

తతతతామరసాక్షి


తతతతామరసాక్షి





సాహితీమిత్రులారా!



మధుపాన వర్ణననలో మత్తులో మాటలు
తడబడటం లాంటివి కవిత్వంలో కూర్చడం
అప్పన్నకవికృత సుదక్షిణా పరిణయంలో కనిపిస్తుంది
చూడండి-

తతతతామరసాక్షి తలవంత మాడకు
         వివివివీణాకంఠ, వీణదెమ్ము
పపపపాటలగంధి, పాటపాడు మొకింత
         కుకుకుకుందస్మిత, కురులు ముడువు
ససససారసహస్త, సరిదానవానీవు,
         ననననాతుక నాలినవ్వు లేల
వవవవారిజముఖి, వలదు వాదులు చాలు
         గొకొకొకోమలి, యేల కోపవేగ
మనుచు దపుతప్పు లాడుచు నన్ను గనిరి
మదననిర్ముక్తదుత్తూరమార్గణాగ్ర
హతుల నలసిరొ యన ఖేచరాబ్జముఖులు
భర్తదేల్చిరి మైరేయపానకేళి
(సుదక్షిణా పరిణయము 3-104)


Friday, July 14, 2017

అర్జునుని ధనుర్విద్యాపాటవము - 1


అర్జునుని ధనుర్విద్యాపాటవము - 1





సాహితీమిత్రులారా!



అర్జునుని ధనుర్విద్యాపాటవము గురించి వేరు
చెప్పక్కరలేదు అదిలోక విదితమే. కాని కొన్నిటిని
ఇక్కడ చెప్పుకొంటున్నము చూడండి-

ఒకనాడు ద్రోణుడు గంగానదిలో స్నానం చేస్తున్నాడు.
అప్పుడొక మొసలి వచ్చి అతని తొడను పట్టుకొంది.
ద్రోణుడు ఎంత ప్రయత్నించినా అది అతన్ని విడువలేదు.
అప్పుడు కురుకుమారులు అందరు వచ్చి ఏంచేయటానికి
సాహసించక పోయారు గురువుగారికి నొప్పితగలకుండ
మొసలిని చంపడం ఎలాగో వారికి తెలియదు పైగా
అది నీటి అడుగున ఉంది. గురువుగారి తొడకే తగలవచ్చు
దాంతో వారికి ఏంచేయాలో తెలియక నిలబడిపోయారు.
కాని అర్జునుడు మాత్రం అలా ఉండలేదు.
వెంటనే ధనుస్సును ఎక్కుపెట్టి ఏడు బాణాలతో దాన్ని ముక్కలుచేసి
ద్రోణున్ని వదిలించాడు. ఇది అర్జునుని ధనుర్విద్యాపాటవాలను
తెలిపేవాటిలో ఒక సంఘటనమాత్రమే

ద్రౌపదీ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని
కొట్టడం సామాన్య విషయంకాదు.

ఖాండవదహనం నాడు  అగ్నిదేవుని
అగ్నిమాంద్యాన్ని తొలగించటానికి
ఖాండవాన్ని దహించటానికి సహకరించి
నిలబడగా ఇంద్రుడు తన మిత్రుడైన తక్షకుని
రక్షించటానికి వర్షాన్ని కురిపిస్తే అర్జునుడు
తన ధనుర్విద్యాకౌశలంతో బాణాలతోనే
ఛత్రాన్ని నిర్మించి  అగ్నిదేవుడు ఖాండవాన్ని
పూర్తిగా దహించేట్లుచేశాడు.

అరణ్యవాసకాలంలో దుర్యోధనుణ్ణి చిత్రసేనుడనే గంధర్వుడు
బంధించి అదృశ్యుడై ఆకాశానికి వెళ్ళినపుడు కూడ అర్జునుడు
తన శరపరంపరలను వదలి ఆకాశంలో ఒక చిక్కంలాగా కట్టి,
అతణ్ణి వెళ్ళకుండా చేస్తాడు.



Saturday, July 8, 2017

ఇక్కడ ఆకు కూడ కదలాడదు


ఇక్కడ ఆకు కూడ కదలాడదు




సాహితీమిత్రులారా!




మద్దుపల్లి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు
1959-60 సంవత్సరమునందు కర్నూలు
సెంట్ జోసెఫ్స్ గరల్స్ హైస్కూలులో
ప్రధానాంధ్ర పండితుడుగా పనిచేయు సమయంలో
అక్కడి అపాధ్యాయుగా ఉన్న సిస్టర్స్ అక్కడి క్రమశిక్షణ
గురించి చెబుతూ ఇక్కడ ఆకుకూడ కదలదని చెప్పిరట.
దానికిగాను ఆయన చమత్కరించిన ఈ శ్లోకం చూడండి-

పత్రం వాపి ప్రచలతి న వై బాలికా పాఠశాలా
స్వేవం శిక్షాక్రమ ఇతిపదే దేవమే వాస్తుఃకింతు
మద్భావోయంన చలతి మరుత్త్వత్రభిత్యేతి యస్మా
ద్వేణి బంధైర్విషధరనిభైరత్ర కాంతాశ్చరన్తి


అక్కడ ఆకులు కదలక పోవటానికి
కారణం ఇక్కడి క్రమశిక్షణకాదు

మద్భావోయం - నా అభిప్రాయమేమనగా
నచలతి మరుత్త్వత్ర భీత్యేతి-
ఇక్కడ గాలి సంచరించటంలేదు
కాన ఆకులు కదలటంలేదు
గాలి సంచరించలేదనగా
భీత్యా - భయంచేత,
గాలి ఎందుకు భయపడవలసిన పని
ఏమంటే విషధర నిభై - పాముల వంటి
వేణిబంధైః - జడలతో
అత్ర కాన్తాశ్చరన్తి- ఇక్కడ యువతులు పెక్కు
మంది తిరుగుతున్నారు కనుక
పాములు వాతాశనములు(గాలిని భుజించేవి)గనుక
తన్నెక్కడ మ్రింగిపోతాయో అని భయపడి గాలి
ఈ ప్రక్కకు రాకుండా పోయింది.
అందుచే ఆకు కదలాడకున్నది.

Tuesday, July 4, 2017

దిఙ్నాగుని కుందమాల

దిఙ్నాగుని కుందమాల



సాహితీమిత్రులారా!



మంగు శివరామ్ ప్రసాదు గారి ఈ వ్యాసం చదవండి


దిజ్నాగుని ‘కుందమాల’: శ్రీరాముని వియోగాగ్నిజ్వాల
రామాయణ సంస్కృత నాటక వాఙ్మయంలో దిజ్నాగుని ‘కుందమాల’ నాటకానికి ఒక విశిష్ట స్థానముంది.
గోమతీ నదీతీరంలో శ్రీరామునికి కుందమాల ఒకటి కనబడి అది సీతా సంబంధితమని, సీతా విషయక స్మరణ కలిగి అతడు ఆమె పాదముద్రల ననుసరించి వాల్మీకి ఆశ్రమంలో సీతను చేరటం వలన ఈ నాటకానికి ‘కుందమాల’ అని పేరు వచ్చింది. దీని ఇతివృత్తం సీతను అరణ్యంలో దిగవిడిచినప్పటి నుండి, కుశ లవుల పట్టాభిషేకము వరకు గల ప్రఖ్యాత సీతారామ చరిత్ర రామయణోత్తరఖండ భాగాన్ని రసవంతంగా దిజ్నాగుడు సాహితీ జగతికి సమర్పించాడు.
ఈ నాటకంలో సీత శీలం ప్రధాన అంశము. సీత విరహంలో, బహిష్కృత సమయంలో తన నేరమేమిలేనప్పుడు, తన్నట్లు విడిచివేసిన భర్త విషయంలో తనకు గల ఉత్తమ భావాలను వెలువరిస్తూ అత్యుత్తమ భారత నారీ హృదయాన్ని ఆవిష్కరిస్తూ ఆదర్శ నారీ శిరోమణి అవుతున్నది. నాటకకర్త దిజ్నాగుడు సీతారాముల సూక్ష్మమైన సున్నితమైన మనోభావాలను కూడా అత్యంత రసవత్తరంగా చిత్రించాడు.
శ్రీరాముని సీతా వియోగ దు:ఖాన్ని మరల్చటానికి లక్ష్మణుడు గోమతీ తీరానికి అతణ్ణి తీసుకు వెళ్ళాడు. గోమతీ తీర వాయు స్పర్శతో ఆనందాన్ననుభవించి సీత ఆ ప్రాంతంలోనే ఎక్కడో ఉన్నదని శ్రీ రాముడు భావిస్తాడు. 
ముక్తాహారా మలయమారుత శ్చందనం చంద్రపాదా:
సీతాత్యాగాత్ప్రభృతి నితరాం తాపమేవావహంతి I
ఆద్యాకస్మాద్రమయంతి మనో గోమతీ తీరవాయు:
ర్నూనం తస్యాం దిశి నివసతి ప్రోషితా సా వరాకీ II”
----( దిజ్నాగుని, ‘కుందమాల’, అంకం: 3, శ్లోకం: 6)
శ్లోక వృత్తం: మందాక్రాంతం.
విరహాన్ని వ్యక్తం చేయాడానికి కవులు మందాక్రాంత వృత్తాన్ని ప్రయోగిస్తారు . ముత్యాల హారాలు, మలయమారుతాలు, వెన్నెలలు సీతను వీడినప్పటి నుండి ఎక్కువ తాపాన్నే కలిగిస్తున్నాయి. గోమతీ తీరంలో మాత్రం హఠాత్తుగా ఆ నదీ తీర వాయువు మనుసుకి ఆనందాన్ని కలిగిస్తున్నదని ఆ కారణం వలన నిజ ప్రేయసి ఆ ప్రాంతంలోనే ఉండి ఉంటుందని నిశ్చయిస్తాడు. భవభూతి ఉత్తర రామచరిత్రలో సీత చేతి స్పర్శ చేతనే సీతను గుర్తిస్తాడు రాముడు. ఇక్కడ దిజ్నాగుని ‘కుందమాల’ లో సీత వైపు నుండి వచ్చే గాలి తాకుడు చేతనే ఆమె ఉనికిని శ్రీ రాముడు దృఢ పరచుకున్నాడు.
ఇంతలో గోమతీ నదీ తీరానికి ఒక కుందమాల మెల్లగా రాముని పాదములకు ఉపాహారము వలె నీట కొట్టు కొని వస్తుంది. దానిని తీసుకొని ఆ కూర్పును నేర్పునూ సీతాదేవిదిగా వెంటనే శ్రీరాముడు గుర్తించి అది దేవతోపహారము కదా అని దానిననుభవించక విడిచి వేస్తాడు. ఇది అనన్య సామాన్య దైవభక్తి అభివ్యక్తి. ఈ కుందమాల ప్రభావంతో రామ లక్ష్మణులు ఆ నదీ తీరంలో సీత అడుగుజాడలు గుర్తించి క్రమముగా పోయి వాల్మీకాశ్రమ సమీపానికి చేరుతారు. ఈ సన్నివేశానికంతటికి ఈ కుందమాలయే ప్రధాన కీలకమై ఉండటంతో ఈ నాటకానికి కుందమాల అనే పేరు వచ్చింది.
ఆ స్థలంలో స్త్రీ పదాంకాలు చూచి అవి ఎవరివో అని లక్ష్మణుడు అంటే రాముడు “వత్స! కిముచ్యతే? కస్యాశ్చిదితి: నను వక్తవ్యం సీతాయా: పదాని ఇతి” (నాయనా ! ఎవరివో అంటా వేమిటి? సీత అడుగులే అవి) అంటాడు శ్రీరాముడు. సైకతము (ఇసుక)లో అడుగుజాడలను బట్టే అవి సీతవని చెప్పగలగడం సీతారాముల ప్రేమానురాగం అద్భుత మనడానికి ఒక చక్కటి దృష్టాంతం. 
చెట్ల చల్లని నీడల్లో విశ్రమిస్తున్న రామలక్ష్మణుల్ని దగ్గరలో పూలు కోస్తున్న సీత వారి సంభాషణల్ని బట్టి గ్రహిం చింది. వివిధభావోద్వేగాలు ముప్పిరిగొనగా పరాజ్ఞ్ముఖుడై ఉన్న శ్రీ రాముని ఎదుట పడి చూడడానికి సీత శంకించింది. ఒక వైపు భర్త కనబడెనని సంతోషం, చిరప్రవాసమని కోపము, రాముడు కృశించాడనే ఉద్వేగం, నిరనుక్రోశుడు అనే అభిమానము, ఆదర్శనీయుడని ఉత్కంఠ, భర్త అనే అనురాగము, తన బిడ్డలకు తండ్రి అనే కుటుంబీకుని సద్భావము ఆమెను ఉక్కిరిబిక్కరి చేశాయి. 
శ్రీ రాముడు సీతావియోగంలో కోరుకు న్న భోగము ఎట్లాంటిదంటే:
“కదా బాహూ పధానేన పటాంత శయనే పున:
గమయేయం త్వయా సార్థం పూర్ణ చంద్రాం విభావరీమ్” 
---- (అంకం: 4 శ్లోకం: 17)
చేయి దిండుగా, చీర చెరుగు పడకగా పున్నమిరేయి సీతతో ఎప్పుడు గడుపుదునా అని శ్రీరాముడు పరితపించాడు. శ్రీరాముడు విరహబాధ భరించలేక మూర్ఛిల్లితే, సీతా తన పటాంతం(ఉత్తరీయం) తో వీచుతుంది. శ్రీరాముడు వెంటనే మేల్కొని ఆ పటాంతాన్ని పట్టుకొంటాడు. సీత ఆ పటాంతాన్ని వదులుతుంది. అది చిత్రకూట వనదేవత మాయావతి ఇచ్చినదని శ్రీరాముడు గుర్తిస్తాడు. ఆ ఉత్తరీయాన్ని కప్పుకొని శ్రీ రాముడు తనది విసిరి వేస్తాడు. శ్రీ రాముని ఉత్తరీయాన్ని గ్రహించి సీత దానిని కప్పుకొని రోమాంచిత అవుతుంది. ఇది ఒక రసాత్మక సన్నివేశం. ఆమెలో శ్రీరాముని పట్ల అనురాగం శ్రుతించిన విపంచి వోలె సరాగాలు పోతుంది.
కానీ ఆమె శ్రీరామునికి కనబడదు. దీనికి కారణం వాల్మీకి వరమున ఆశ్రమ దీర్ఘికా తీరమున స్త్రీలు అదృశ్యులై ఉంటారు. దీర్ఘికాజలములో సీత ప్రతిబింబాన్ని చూసి సంభ్రాంతి చెందిన శ్రీరామునికి సీత కనబడదు. ఆమె ఆ తీరములోనే కూర్చొని ఉంటుంది. తన ఉనికి శ్రీరామునిచే అనుమానింపబడేనని సిగ్గుతో తన ప్రతిబింబము కూడా రామునికి కనబడకూడదని సీత అక్కడనుండి వైదొలుగుతుంది. ఒక వ్యూహాత్మకమైన నాటకీయ సన్నివేశానికి రూపకల్పన చేసాడు దిజ్నాగుడు.
సీత రాముని స్పృశింపకున్నా ఆమె ఉత్తరీయ గాలిచే రాముడు ప్రభావితుడు కావడం దిజ్నాగుని భావ సౌకుమార్యాన్నికి పరకాష్ట. సీత విషయక మోహంతో శోక్తప్తుడైన రాముని మనోభావాన్ని మరాల్చటానికి దిజ్నాగుడు విదూషకుడి కల్పన చేశాడు. కథానాయకుడైన రామునికి సీత అట్టి అవస్థలో కనబడటం తగదని ఆమె శీల పోషణకు తిలోత్తమ అనే అప్సరసను సీత రూపంలో రాముని కడకు పంపి రాముని మనస్సు పరీక్షింప వచ్చినట్లు చూపాడు. “తిలోత్తమో, శిలోత్తమో నాకు తెలియదనే” విదూషకుడు కౌశికుని మాట నెంచి దేవతలు కామరూపులుగా తిలోత్తమను సీతగా చేసి తన వద్దకు పంపి నట్లు రాముడు విశ్వసించాడు.
కాలగమన సూచకమైన సూర్యాస్త సమయాన్ని సీతారామ సమాగమ శుభసూచకంగా దిజ్నాగుడు ఒక శ్లోకంలో ఇలా దర్శింప చేశాడు: 
“ప్రియజన రహితానామంగుళీభిర్వధూనా
మావధీ దివస సంఖ్యా వ్యాపృతాభిస్సహైవ I
వ్రజతి కిరణమాలిన్యస్తమేకైకశో2స్మిన్
సరస కమలపత్ర శ్రేణయ: సంకుచంతి”
ప్రోషితభర్తృకలు ప్రియాగమనానికి రోజులు వ్రేళ్ళు ముడుచుకొంటూ ఒకటి రెండు అని లెక్కిస్తున్నట్లు కమలముల రేకులు వరుసగా నొక్కక్కటి ముడుచుకొంటున్నాయని సూర్యాస్తమయాన్ని చమత్కారంగా సంభావించటం ఒక రమ్యమైన భావనకు రసమయమైన రూపకల్పన. ఈ శ్లోకం ద్వారా సీతారామ సమాగమం కూడా త్వరలో లెక్కింపదగిన్నని రోజులలో కలుగగలదనే ఆశాభావాన్ని దిజ్నాగుడు ఈ శ్లోకంలో ధ్వనింప జేశాడు.
రసపోషణలో, పాత్రచిత్రణలో, సున్నితమైన భావాలను అత్యంత చమత్కారంగా, లోకసహజంగా వర్ణించటంలో దిజ్నాగుడు సిద్ధహస్తుడు. వియుక్తులైనవారు పున:స్సమాగమ సందర్భంలో పొందే భావపూర్ణత రసస్ఫోరకంగా లలితమైన శైలిలో రచించాడు. భావోద్భవానికీ, రసోత్పత్తికీ, సద్య: పర నిర్వృత్తికి భవభూతి ‘ఉత్తర రామచరిత’కు ఏ మాత్రం తీసిపోనిది దిజ్నాగుని ‘కుందమాల.’
“బాహు యుగళేన పృథివీం హృదయేన పృథివి దుహితర ముద్పహన్న తీవ గురుతర: సంవృత్త ఇతి.” బాహు యుగళంతో పుడమిని, హృదయంలో సీతను, నిలుపుకోవటం వలన ఎక్కువ భారం కలవాడివైనావు అంటాడు విదూషకుడు శ్రీ రామునితో. సందర్భం సీత విషయిక ప్రస్తావన. సీతాచ్చాయను వాల్మీకాశ్రమ ప్రాంతంలో చూచి చింతాక్రాంతుడై శ్రీరాముడున్న గంభీరమైన సన్నివేశమిది. సీతారాముల ప్రేమ కారణానురోధి కాదని రాముడే అంటాడు. వారి దాంపత్యమే భిన్నము, లోకాతీతము. శ్రీ రాముడు తాను కర్కశుడనని, తన అనురాగ భావాలు సూక్ష్మములై పద్మనాళములోని తంతువలవలె తన హృదయంలో లీనమై ఉన్నవని చెప్పాడు.
ఆదర్శవంతమైన దాంపత్య ధర్మం గురించి భవభూతి ‘ఉత్తర రామచరితమ్’ నాటకంలో ఇలా చెప్పాడు: 
“అద్వైతం సుఖదు:ఖయో రనుగతం
సర్వస్వవస్థాసు యత్
విశ్రామోహృదయస్య యత్ర
జరసా మన్మిన్నహార్యో రస:
కాలేణావరణాత్యయాత్
పరిణతే యత్ ప్రేమసారే స్థితం
భద్రం తస్య సుమానుషస్య
కథమప్యేకం హి తత్ ప్రార్థ్యతే “

----- భవభూతి, ‘ఉత్తర రామచరితమ్’
సుఖ దు:ఖాలు రెండింటిలోనూ దాంపత్య ధర్మం అద్వైత రూపంలో ఉంటుంది. భార్యాభర్తలలో ఒకరి సుఖమే మరొకరి సుఖంగాను, ఒకరి దు:ఖమే మరొకరి దు:ఖంగాను భావింప బడుతుంది. ఏ అవస్థలోనైనా సంపదలు వచ్చినా, ఆపదలు వచ్చినా ఒకరితో ఒకరు తలపోసుకొని ఊరట చెందుతారు. ముసలితనం పై బడుతున్నా భార్యా భర్తలలో ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గదు. కాలక్రమంలో ఆవరణాలన్నీ తొలగిపోయి, భార్యా భర్తల ప్రేమపండి స్థిర్త్వాన్ని పొందుతుంది. ఇలాంటి దాంపత్య ధర్మసారాన్ని లోకంలో ఎవరు కోరుకోకుండా ఉంటారని ఈ శ్లోక తాత్పర్యం. సీతారాముల దాంపత్య మాధుర్య పరమావధిని, దాంపత్య ధర్మాన్ని ఇంత రమణీయంగా చెప్పిన శ్లోకం మరొకటి సంస్కృత సాహిత్యంలో కనబడదు.

Monday, July 3, 2017

స్మృతులలో శిక్షలు


స్మృతులలో శిక్షలు




సాహితీమిత్రులారా!


యాజ్ఞ్యవల్క్య స్మృతిలో మహాపరాధము చేసినవారికి 5 రకాల
దైవపరీక్షలను వివరించారు. అవి సామాన్యమైన
వాటికి ప్రయోగించరాదు. దోషము చేసినవారిని, చేయనివారిని
కనుక్కోవటానికి ఈ పరీక్షలను చెప్పడం జరిగింది.

1. తులపరీక్ష-
దీనిలో దోషిగా నిర్ణయించబడినవారు ఒక త్రాసులో
కూర్చోవాలి తూచబడతాడు. మరలా లేచి  ఆ త్రాసునుద్దేశించి
నేను దోషినికానిచో నన్ను పైకి తీసుకుపొమ్మని మంత్రపూర్వకంగా
ప్రార్థించాలి. తరువాత అంతకుముందు కూర్చున్న దానిలోనే కూర్చోవాలి.
 అపుడు ఆ శిబిక పైకిలేచిన అతడు నిర్దోషి. లేదా
క్రిందికి వచ్చినా, యథాస్థానంలో ఉన్నా అతడు దోషిగా నిర్థారించబడతాడు.

2. అగ్ని పరీక్ష -
దీనిలో పరీక్షించ వలసినవాని చేతిలో 7 రావి ఆకులను ఉంచి
అగ్నిని ప్రార్థించి వానిపై బాగా కాల్చబడిన ఇనుపగుండ్లను చేతిలో
పెడతారు. వారు అగ్నిగుండము చుట్టు 7 వలయాలుగా ఉంచిన
అగ్నివలయాలను నిదానంగా దాటిన తరువాత ఇనుపగుండ్లను
వదలివేయాలి. అలా వదలిన తరువాత చేతులు పరీక్షిస్తారు
అవి కాలినచో అతడు దోషి. కాలనిచో నిర్దోషి.

3. ఉదక పరీక్ష - 
దీనిలో వరుణుని ప్రార్థించి నిందితుడు జలాశయంలో
నాభివరకు నీరు వచ్చువరకు వెళ్ళి నిలబడతాడు.
 మరొకడు తొడలు పట్టుకొని  ఉంటాడు. అప్పుడే బాణాన్ని విలుకాడు
 వదలిపెడతాడు విడిచిన బాణంతో బాగా వేగంగా పరుగెత్తేవాడు
ఒకడు నిలబడి ఉంటాడు. బాణంపడినచోట మరొకడు ఉంటాడు.
అపుడు ప్రాడ్వివాకులు మూడుమార్లు చప్పట్లు కొడతారు
మూడవమారు కొట్టగానే నిందితుడు
నీటిలో మునుగుతాడు. వెంటనే బాణం విడిచిన స్థానమందున్నవాడు
బాణం పడినచోటుకు చేరుకుంటాడు. చేరగనే బాణంపడిన
చోటున్నవాడు బాణంతో బాణం వదలినచోటుకు పరుగుతీస్తాడు.
అతడు ఆచోటుకు చేరేప్పటికి నిందితుడు నీళ్ళలోనే ముని ఉండాలి
అలా ఉంటే నిర్దోషి లేదంటే దోషి.

4. విషపరీక్ష - 
దీనిలో నిందితుడు విషాన్ని ప్రార్థించి. ఏడు యవల
(గోధుమగింజలలోని ఒక రకం) అంత పరిమాణంలో విషాన్ని
అంతకు 30 రెట్ల పరిణామం ఉన్న వెన్నతో కలిపి పూర్వాహ్నంలో
చల్లని చోట తినాలి. ఆ రోజంతా అతనికి మూర్ఛ, వమనము
మొదలైన విషలక్షణాలు కనబడకుంటే
అతన్ని నిర్ధోషిగా ప్రకటిస్తారు.

5. కోశ పరీక్ష -
ఇందులో రుద్ర, దుర్గ, ఆదిత్య మొదలైన ఉగ్రదేవతలను పూజించి
వారి స్నానోదకమును సేవిస్తాడు. 14 రోజులలో రాజ దైవిక సంకటాలు
(ధన నష్టము, బంధువుల మరణము, రోగము మొదలైనవి) రానిచో
అతడు నిర్ధోషిగా ప్రకటిస్తారు.

ఇవి వింటుంటేనే విచిత్రంగాను భయంగాను ఉన్నాయికదా
మన అదృష్టం  అవి ఇప్పుడులేవు.

Saturday, July 1, 2017

సుభాషితాలు


 సుభాషితాలు




సాహితీమిత్రులారా!


కొత్త సత్యనారాయణచౌదరి గారి
చాటువులుగా చెప్పిన సుభాషితాలు
ఇవి 1962 ఏప్రిల్ నెల భారతిలోనివి
మొత్తం 2ద పద్యాలు
మనం ఇక్కడ కొన్నిటిని చూద్దాం-

అందమగు భార్య, యింటిలో నతనికున్నఁ
బరుల యువతుల కోసమే ప్రాఁకులాడు
నూరఁజెరువున నిండిన నీరు విడిచి
కడవలో నీళ్ళ ముట్టును గాదె కాకి

ఇంట్లో ఎంత అందమైన భార్య ఉన్నా
కొందరు పరస్త్రీల కోసం వెంర్లాడుతుంటారు
వారికొరకై వ్రాసిన పద్యం ఇది- అలాంటివారు
చెరువులోని నీటిని వదలి కడవలోని నీటికై
వెదకే కాకిలాంటివారట - అని భావం.

ఆస్తి పాస్తులు మన వెంట నంటిరావు
వానికోసము చూచెడివారు వేఱు
పుణ్య పాపములే మనసొత్తు విడువ
నట్టి చుట్టాలుగాఁ గను పట్టుచండు

ఆస్తి పాస్తులు చనిపోయిన తరువాత
మన వెంటరావు వాటికోసం చూచేవారు
వేరేవారు వారు మామూలువారుకాని.
పాపపుణ్యాలే మన వెంట విడిచి పెట్టని
చుట్టాలవలె కనబడతాయి - అని భావం.


వినయ మెఱుఁగని చదువులు ముజునెపుడు
పైకిరానీయవనుట నిబుద్ధిసుమ్ము
చదువు వినయము జంటగాఁ గుదిరియున్న
మనుజుఁడన్నిట ధన్యుఁడై వినుతి కెక్కు

వినయం నేర్పని చదువు మనుష్యుని
ఎప్పుడూ పైకి రానీయదు
చదువు వినయము జంటగా కుదిరితే
మనుష్యుడు అన్నిటిలోనూ
వినుతి కెక్కతాడు - అని భావం

శునకమా! జంతువులలోన క్షుద్రమైన
దానని బెంగ పడఁబోకు, నేను నిన్ను
మించు వాఁడనటంచు గర్వించునొకఁడు
కలఁడు భువిని గృతఘ్నతా ఘనుఁడు నరుఁడు

ఓ కుక్కా! జంతువుల్లో క్షుద్రమైన
దాన్నని బెంగ పెట్టుకోకు
నేను నిన్ను మించిన వాణ్నంటాడు
చేసినమేలు మరిచే మనుష్యుడు-
అని భావం

లేదని చెప్పిన వాడే ఉత్తముడు


లేదని చెప్పిన వాడే ఉత్తముడు




సాహితీమిత్రులారా!



14 వ శతాబ్దానికి చెందిన అవ్వయార్
(తమిళ కవయిత్రి) చెప్పిన చాటువు
చూడండి-
ఈమె చేర, చోళ, పాండ్య రాజాస్థానాలను
సంర్శించినపుడు చెప్పిన చాటువు-

వాదవర్ కోన్ పినై యెండ్రాన్
వత్తవర్ కోన్ నాళై యెండ్రాన్
యాదవర్ కోన్ యాదోన్డ్రుమ్
ఇల్లై ఎండ్రాన్ ఆదలాల్
వాదర్ కోన్ పినై యినుం,
వత్తవర్ కోన్ నాళై ఎనుం
యాదవర్ కోన్ ఇల్లై ఇనియ

వాదవర్ అనే నృపాలుడు తరువాత రమ్మన్నాడు
వత్తవర్ రేపు రమ్మన్నాడు. యాదవర్ లేదన్నాడు
ఈ మువ్వురిలో తరువాత, రేపు అని చెప్పి వాయిదా
వేసిన వారికన్న లేోదని నిశ్చయంగా చెప్పిన వాడే
ఉత్తముడు - అని భావం