Sunday, March 31, 2019

ఎందుకంత దూరం?


ఎందుకంత దూరం?





సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.................
ఆగస్ట్ 14, 2015.
శ్రీధర్

ఘాట్ రోడ్డులో బస్ రొద ఆ మలుపుల్లో తగ్గుతూ పెరుగుతూ వుంది. చల్లగాలికి తెరలు తెరలుగా తలనొప్పి వస్తూంది. కళ్ళనుంచి కారుతున్న నీళ్ళు గాలికి చెదిరిపోతున్నాయి. అదృష్టం బాగుండి నా ప్రక్క సీట్లో ఎవరూ లేరు. నన్ను ఎవరైనా పరీక్షగా చూసినా ఎవరో మెకానిక్ అనుకోవాలని మట్టి, ఇంజనాయిలు బట్టలకి పూసుకున్నాను. టోపీని మొహం మీదకు లాక్కుని సీట్లో జారగిలబడి కూర్చున్నాను. ఈ రోడ్డులో పోలీసుల గస్తీ ఎక్కువగానే వుంటుంది. వాళ్ళు ఒకసారి చూసిన మొహాన్ని మర్చిపోరు. మొదటిసారి వాళ్ళకి చిక్కి ఏడేళ్ళయినా నాకు భయంగానే వుంటుంది ఎప్పుడేమవుతుందేమో అని. కానీ, అది ఈ రోజు మాత్రం కాకూడదు. నేను ఎలాగైనా సరే ఊరికి చేరాలి.

“బాగా దిగులు పడుతుంటుందిరా కృష్ణమ్మ నీ గురించి.”

తమ్ముడి మాటలు గుర్తొచ్చాయి. ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో నా గురించి మాట్లాడుతుందంట. నడవలేని తమ్ముడిని, రోగిష్టి అమ్మని గాలికొదిలేసి వచ్చాను. ఆమే వాడిని కాపాడుతోంది. ఎలా వచ్చానో అలా వాళ్ళని వదిలేసి!?

ఆమె మీద కోపం, ఉక్రోషం, నాకేం కావాలో నాకే తెలియనితనం. పారిపోయాను ఆమెకి దూరంగా… ఊబి లోకి… చేతకాని పనిని చేయలేక, ప్రతిక్షణమూ ఏడుస్తూ. ఇంత చదువుకున్న నాకు అది తప్పు పనన్న ఆలోచనే రాలేదు. తప్పని తెలిసే సరికే తప్పించుకోలేనంత ఇరుక్కుపోయాను. అమ్మ చనిపోయిందని తెలిసినా వెళ్ళలేదు. ఏదో కోపం నామీద నాకే, ఎవరి మీదో చెప్పలేని కసి.

బస్ మట్టిరోడ్డు మీదికొచ్చింది. ఇంకొక్క గంటలో ఊరు చేరతాను. వున్నట్టుండి వెన్నులోంచి చలి పుట్టి ఒళ్ళంతా వణికింది. ఆమెకేమయిందో!? ఆఖరి క్షణాల్లో ఉన్నట్లే చెప్పారు. ఆమె బతకాలి. బతకాలి.

మధ్యాహ్నం వాళ్ళు నా గది తలుపును తట్టినప్పుడు సగం నిద్రలో ఉన్నాను.

“శ్రీధరూ, కృష్ణమ్మకి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో చేర్పించారంట, మీ తమ్ముడు ఫోన్ చేశాడు. చీకటి పడ్డాకే బయల్దేరమని పెద్దన్న నీకు చెప్పి రమ్మన్నాడు,” అన్నాడు రఘు.

వాడు చెప్పింది అర్థం కావడానికి చాలా సమయం పట్టింది కాని ఆమె పేరు వినగానే దిగ్గున లేచి కూర్చున్నాను.

“వెళ్ళేప్పుడు జాగ్రత్త అని చెప్పమన్నాడు అన్న. అడ్డరోడ్డు రంగమ్మ కొట్టు దగ్గరాగి మీ తమ్ముడికి ఫోన్ చేసి – వస్తున్నట్లు చెప్పు. నువ్వొస్తే ఆమె బతుకుద్దన్నట్లు చెప్తున్నాడు మీ తమ్ముడు.” వాడి మాటలకి గుండె గుబుక్కుమంది.

“ఆఁ” అన్నాను.

చీకట్లు ముసురుకున్న దాకా ఉగ్గబట్టుకుని కూర్చుని లేచెళ్ళి రంగమ్మ కొట్టు దగ్గర్నుండి ఫోన్ చేశాను.

“నేను చేసింది తప్పురా శీనా. ఆమెకి చెప్పాలిరా. నేనొస్తున్నానని చెప్పు.” నా గొంతు బొంగురు పోయింది.

“పొద్దున్నే వీలు చూసుకుని చెప్తానన్నాయ్, నువ్వొస్తే సంతోషంతో కొన్నాళ్ళు బ్రతుకుతుంది, భయపడక్కర్లా, నాకు నమ్మకముంది.”

మౌనంగా ఉన్నాను. ఎప్పడి మాదిరే ‘నా గురించి ఏమంటోందిరా?’ అని అడగాలని మాట నోటిదాకా వచ్చింది కాని మాట పెగల్లేదు. వాడే మళ్ళీ అన్నాడు.

“అన్నాయ్, నువ్వెందుకు భయపడుతున్నావన్నాయ్? తెలీక చేసిన తప్పు. ఆ సంగతి పోలీసోళ్ళకి చెబితే శిక్ష తగ్గిస్తారు. తర్వాత ఏదో పని చేసుకోని బ్రతకొచ్చు అంతేగాని వాళ్ళకి కనపడకుండా దాక్కుంటే ఎట్లా? అదే తప్పులో అలానే బతుకుతుంటే ఎట్లా? అని అంటానే ఉందిరా కృష్ణమ్మ. ‘నువ్వు ఫోన్ చేసి చెప్పు కృష్ణమ్మా, నువ్వు చెప్తే వస్తాడు’ అని చాలా సార్లు అడుక్కున్నానన్నాయ్. నువ్వు తిరిగొస్తే కానీ నీతో మాట్లాడ్డం మాత్రం చేయననేదిరా. చాలా మొండిపట్టే పట్టింది. ఆమె చెప్పిన మాట వినకుండా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావని కోపం.”

“అమ్మనీ, నిన్నూ వదిలి పెట్టి రావడం తప్పే కదరా. పొరపాటు చేశాను. పోలీసులకి లొంగి పోతానన్నానని కృష్ణమ్మకి చెప్పు. వస్తున్నానని చెప్పు.” నా గొంతు పూడుకుపోయింది.

“ఊరుకోన్నాయ్, మనకి అమ్మ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కృష్ణమ్మే నాకు అమ్మ. నాకిప్పుడు వొంట్లో కూడా బావుందిరా. గజ్జి పోయింది. కర్రపోటుతో నడుస్తున్నాను. తొందర్లోనే కర్ర కూడా అక్కర్లేదని చెప్తుంది కృష్ణమ్మ. ఆయమ్మ ఎంత ధైర్యం చెప్తుందో ప్రతిరోజూ.” వాడి గొంతులో ఉత్సాహం వచ్చింది.

“సరేలే, రాత్రి బస్‌కి బయల్దేరుతున్నానుగా. వచ్చాక మాట్లాడుకుందాం.”

బస్సు గుంతలో పడి వూగింది. డ్రైవర్ ఆవేశంగా రోడ్లనీ, గవర్నమెంట్ ఆఫీసర్లనీ, రోడ్లకు రాళ్ళడ్డం పెట్టే పోలీసుల్నీ బూతులు తిడుతున్నాడు. ముందు సీట్లల్లో కూర్చున్న వాళ్ళు అతనికి సపోర్టుగా మాట్లాడుతున్నారు.

“నువ్వు బాగా చదువుకో శ్రీధర్, ఇంటికి పెద్దకొడుకువి నువ్వు. తమ్ముడు చూస్తే రోగిష్టి. మీ అమ్మ సంగతి నీకు తెలుసు. ఆమెకి ఎప్పుడు ఏం ప్రమాదం వస్తుందో చెప్పలేము. నువ్వు బాగా చదువుకుంటేనే తమ్ముడినీ, అమ్మనీ బాగా చూసుకోగలవు,” అనేది కృష్ణమ్మ.

ఉద్యోగం లేదని చిరాకు ఒక వైపు. ఆమె నన్ను తనింట్లోకి రానియ్యకుండా నా ముఖం మీదే తలుపులు మూసేసిందని దిగులు మరో వైపు. ఆమెని అల్లరి చేశాను, ఆమె తోనే ఉండాలని, ఆమె మళ్ళీ మళ్ళీ కావాలనిపించి పిచ్చి పట్టినట్లయి ఆమెని ఎన్ని మాటలో అన్నాను. నేనట్లా మాట్లాడినా కూడా ఆమెకి నా మీద అంతే అభిమానం వుండింది. తను నాతో మాట్లాడకపోయినా తమ్ముడి చేత ఫోన్లు చేపిస్తూ నన్ను వచ్చేయమని అడిగిస్తూనే ఉంది. నా బాగోగులు తెలుసుకుంటూనే వుంది.

ఆమెకి ఈ పాపిష్టి జబ్బేందో? నేను చేసిన పాపం ఆమెను కుట్టికుడుపుతోందేమో! నాకు వెక్కిళ్ళు ఆగలేదు. భుజం మీద తువ్వాలు తీసి మొహం కప్పుకున్నాను.

బస్ ఇంకా మట్టిరోడ్డు మీదే ఉంది. దారినిండా గుంతలు. వాటిల్లో పడ్డప్పుడల్లా బస్ ఎగిరెగిరి పడుతోంది.

జూన్ 10, 1996.
కృష్ణమ్మ

రోడ్డుకి అవతల మట్టిలో కూలబడి తన పక్కన ఆడుకుంటున్న పిల్లలని ఆశగా చూస్తూ, అప్పుడప్పుడూ తన గజ్జి కాళ్ళని గీక్కుంటున్న అబ్బాయి బొమ్మని వేస్తున్నాను నా గది కిటికీలోంచి చూస్తూ. వాటర్ కలర్స్ కాకుండా ఆయిల్స్ ఎంచుకున్నాను ఈ బొమ్మ కోసం. ఈయన క్యాంపుకెళ్ళి నాలుగు రోజులవుతోంది. ఈ రోజు రావాలి. ఆయనుంటే పెయింటింగ్ పనే కుదరదు అదేమిటో…

“కిష్టమ్మా, పువ్వులు కోసేదా?” నరసమ్మ కేక పెద్దగా.

ఉలిక్కిపడి గడియారం వైపు చూశాను. సాయంత్రం ఐదవుతోంది. కుంచెని పాలెట్ మీద పెట్టేసి తలుపు తీసి బయటకి వచ్చాను. ఇంటి ముందున్న రేకుల పంచ లోంచి వడగాలి కొడుతోంది.

“ఐదయినా ఎండ పేల్చేస్తుంది నరసమ్మా!”

నన్ను చూసిన నరసమ్మ గేటు తీసుకుని లోపలకి వచ్చి నా వైపు చూసి నవ్వింది. “లోపలే ఉంటావుగా, బయటికొచ్చేలకి అట్టానే వుంటది మరి.”

సన్నజాజి కొమ్మ వంచి పూలు కోస్తూ, “అబ్బబ్బ, ఈ పిల్లల గోల చూడు కిష్టమ్మా, మద్దేన్నం పూట కాస్త కునుకు కూడా తియ్యనియ్యకుండా అరుస్తానే వుంటిరి,” అంది విసుగ్గా.

“ఈ పిల్లలు బడికి వెళ్ళకపోతే వాళ్ళమ్మానాన్నలు ఏమీ అనరా?” అన్నాను వాళ్ళనే చూస్తూ.

గజ్జిపిల్లవాడు నన్ను చూసి దేక్కుంటూ నా వైపు రాసాగాడు. వయసు పద్నాలుగు, పదిహేనేళ్ళుంటాయేమో కాని పోషణ లేక బక్కచిక్కి ఉన్నాడు. కళగల ముఖం కాని పాపం ఒళ్ళంతా అట్టగట్టుకు పోయినట్లు గజ్జి. కాళ్ళ దగ్గర గీక్కున్నచోట చర్మం చెదిరి ఎర్రగా ఉంది. ఆ పిల్లాడి కాళ్ళల్లోని శక్తిని గజ్జే లాగేసి ఉంటుంది. అందుకే నడవలేకపోతున్నాడు.

“ఆ శీదర గాడు పిల్లల్ని సెడగొడుతున్నాడు కిష్టమ్మా, పదో తరగతి ఎన్ని సార్లు రాపిచ్చినా పెయిలయిపోతన్నాడు. ఈ గజ్జి శీను వాడి తమ్ముడే,” పిల్లల్లో అందరికంటే పెద్దవాడి లాగా ఉన్న అబ్బాయిని చూపిస్తూ అంది. గజ్జిపిల్లాడు గేటు దగ్గరకొచ్చి పళ్ళికిలించాడు. నాకు నవ్వొచ్చింది వాడిని చూస్తే.

“నిన్న ఆడిని పిలిచి లడ్డు ఇస్తివిగా!ఇంకొదలడు కిష్టమ్మా నిన్ను,” అంది నరసమ్మ కూడా నవ్వుతూ. నేను వాడికి లడ్డు తెచ్చివ్వాలని లోపలకి వెళ్ళాను.

ఆ ఇంట్లో మా కొత్త కాపురం మొదలు పెట్టి మూడు నెలలవుతోంది. ఇంటికి వెనకనున్న పోర్షన్ మాది. మా పోర్షన్ ఎదురుగ్గా, రోడ్దుకి అవతల వరసగా ఇందిరమ్మ ఇళ్ళు. మా ఇంటి ఓనర్స్ ముందు వైపు పోర్షన్లో ఉంటారు. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ, ముందు పెద్ద గేటు, వెనుక చిన్న గేటు. చిన్న గేటు లోంచే మా రాకపోకలు. ఓనర్స్ – భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు. వాళ్ళిద్దరూ, ఈయనా ఉదయం వెళితే మళ్ళీ సాయంత్రమే వచ్చేది. నెలలో నాలుగు సార్లు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళుతుంటారు ఈయన. వెళితే రెండు రోజులగ్గాని రాడు.

పగలంతా అంత పెద్ద ఇంట్లో నేనొక్కదాన్నే. ఇందిరమ్మ ఇళ్ళల్లో వాళ్ళు, పిల్లలు, మా ఇంటి ఎదురుగ్గా ఉండే నరసమ్మ నాకు కాలక్షేపం. నరసమ్మ మా ఇంట్లో పనికి కూడా కుదురుకోవడంతో భయం లేకుండా హాయిగా ఉంది.

“ఒరేయ్, శీదరా! ఇటురారా, కిష్టమ్మ పిలుస్తంది ఇటురా.” కేకేసింది నరసమ్మ. నేను లడ్డు తెచ్చి ఇస్తుంటే శ్రీధర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. తమ్ముడిని చూస్తూ ‘తీసుకోకూడదు’ అని కంటితో సైగలు చేశాడు. అన్ననేమీ పట్టించుకోకుండా ఆ పిల్లాడు నా చేతిలోంచి లడ్డుని తీసుకున్నాడు.

“యీడికి బడికెళ్ళమని చెప్పు కిష్టమ్మా, నువ్వు చెప్తే అన్నా యినుకుంటడేమో! పది పాసయిపోతే ఏదో ఒక కంపెనీలో అటెండర్ పని ఇప్పిస్తానని మా ఇంటాయన అంటన్నాడు. మేవెంత చెప్పినా యినడంలా.”

శ్రీధర్ వైపు పరీక్షగా చూశాను. ముచ్చటగా ఉన్నాడు.

“లెక్కలొక్కటే ఫెయిల్ అయిపోతున్నానండీ ఎన్ని సార్లు రాసినా…” అన్నాడు కళ్ళు చిట్లించి. పదిహేడు ఏళ్ళ కుర్రవాడు అలా అమాయకంగా అంటుంటే పాపం అనిపించింది.

“పోన్లే, ఈ సంవత్సరం మళ్ళీ పరీక్ష ఫీజు కట్టు. ప్రతిరోజూ సాయంత్రం ఈ టైమ్‌లో వచ్చి నా దగ్గర లెక్కలు నేర్చుకో, ఈజీగా పాసయిపోతావు.”

సరేనన్నట్లుగా తల ఊపాడు. వెళుతున్న అతన్ని ఆపి లోపలకెళ్ళి మరో లడ్దు తెచ్చి ఇవ్వబోయాను. అతను తీసుకోకుండా వద్దంటూ తల ఆడించి వెళ్ళిపోయాడు.
జులై 5, 1996.
ఉదయం పది అయినట్లుంది. పిల్లలు బయట అరుస్తూ ఆడుకుంటున్నారు. దేకుతున్న గజ్జి పిల్లాడిలోంచి ఆరోగ్యంగా అయి కర్ర సహాయంతో లేచి నిలబడుతున్న అదే అబ్బాయి రూపాంతరం అవుతున్నట్టుగా, నా బొమ్మ నాకే చాలా బాగా నచ్చింది.

శ్రీధర్‌ లెక్కలు చెప్పించుకోవడానికి రాలేదు. ‘నేను కూడా అతన్ని గురించి పూర్తిగా మర్చిపోయానేమిటో’ అనుకుంటూ నరసమ్మ కోసం చూశాను. బయట రేకుల పంచకి ప్రక్కగా ఉన్న నీళ్ళ తొట్టి దగ్గర బట్టలు ఉతుకుతోంది.

“శ్రీధర్ రానేలేదే నరసమ్మా, లెక్కలు చెప్పించుకోవడానికి వస్తానన్నాడు?!”

“ఇప్పుడే పట్టకొస్తా నుండమ్మా.”

మొదటి రోజు శ్రీధర్‌కి నా దగ్గరున్న నోట్‌బుక్‌లో లెక్కలు వేసి చేయమని ఇచ్చాను. కాసేపట్లోనే ఆ లెక్కలు వేసి ఇచ్చిన శ్రీధర్ చాలా తెలివైన వాడని గ్రహించాను. చాలా చురుగ్గా నేర్చుకుంటాడు ఏది చెప్పినా. కాకుంటే కాస్త ప్రేమగా చెప్పాలి, నిదానంగా.

మధ్యాహ్నం మిగిలిన అన్నం నరసమ్మ గిన్నెలో పెట్టుకుంటోంది. శ్రీధర్ అటే చూస్తున్నాడు. శీను దేక్కుంటూ వచ్చి గేటు దగ్గర కూర్చున్నాడు.

“పొద్దున ఏం టిఫిన్ తిన్నావ్ శ్రీధర్?”

“అయ్యో, కిష్టమ్మా! యీళ్ళ సంగతి నీకింకా తెలియలా. నిన్న మద్దేల నేను పెట్టిన నాలుగు ముద్దల అన్నమే. ఇంకా టిపిను కూడానా!? వాళ్ళమ్మ ఊరెమ్మట పడి పోయిందిగా. నాలుగు రోజులదాకా కనపడదింకా. నేను పన్జేసే ఇండ్లల్ల మిగిలిన అన్నం యారయినా ఇస్తే నేనే పెడతా. లేకపోతే పస్తే ఇద్దరు బిడ్డలకి. మద్దేలన్నానికైనా బడికి పోరా అంటే ఈ శీదర గాడు యినడు,” అంది నరసమ్మ.

“ఆఁ!”

అన్నదమ్ములిద్దరినీ చూస్తూ కాసేపు అలాగే నిశ్చేష్టనయ్యాను. బాధతో కడుపులో దేవినట్లయింది. నరసమ్మ తీసుకున్న అన్నంలో పచ్చడి కలిపి గబగబా ముద్దలు చేసి ఇద్దరికీ చెరి నాలుగు ముద్దలు గిన్నెల్లో పెట్టి ఇచ్చాను. ఆబగా తిన్నారు. తొట్టి దగ్గర గిన్నెలు కడిగి ఆ నీళ్ళే పట్టుకుని కడుపు నిండా తాగాడు శ్రీధర్.

వాళ్ళిద్దరినీ పంపించి వాళ్ళమ్మ గురించి నరసమ్మని అడిగాను. పిల్లల తండ్రి ఎవరో తెలియదు. తల్లి రోడ్డు మీద నిలబడి ఎవరో ఒకరిని పట్టుకుని డబ్బులు సంపాదిస్తుందట, ఒక్కోసారి ఏ లారీ వాళ్ళో, ఆటోలవాళ్ళో నాలుగు రోజులు తీసుకుపోతారట. నరసమ్మ చెప్తుంటే చాలా బాధేసింది. ‘పాపం’ అంటున్న నన్ను ఆశ్చర్యంగా చూస్తూ “ఈమాట నీబోటోండ్లకి చెప్తే ‘చీ, చీ!’ అన్నోళ్ళే కాని ‘పాపం’ అంటున్నదాన్ని నిన్నొక్కదాన్నే చూస్తున్నా కిష్టమ్మా!” అంది నరసమ్మ.

వాళ్ళని నేనింక వదల్లేదు.

ఆగస్ట్ 15, 2003.
నరసమ్మ

పొద్దెక్కగానె కిష్టమ్మ ఇంటికి బోయినాను. ఆమె పడగ్గదిలో బొమ్మ ఏసుకుంటంటే శీదర ఆ బొమ్మని అప్పుడప్పుడూ చూస్తా ఆడనే కూర్చోని ఏదో రాసుకుంటన్నాడు. ఆన్నట్లా చూస్తంటే ఇంకా చూడబుద్దవతంది. నా కంటి ముందు పుట్టి పెరిగినోడు. గాలికి తిరిగేటోడు వాడు పది పాసయితే చాలు అనుకున్నా కాని ఆయమ్మ దయ వల్ల వాడు యింజినీరి దాకా సదువుకొచ్చాడు. వాడికి అదృష్టం అట్టొచ్చింది. ఇంక ఉద్దోగం దొరికినా, వాడి కష్టాలు తీరతయ్యి. అదేందో మరి ఎన్ని ఆపీసులకి తిరిగినా ఉద్దోగం దొరకడం లేదంట. ‘వస్తుందిలే తొందరపడితే ఎట్టా’ అంటంది కృష్ణమ్మ.

పని అయినాక ఆల్లున్న గదికాడికి పొయినా. జుట్టంతా బుజాల మీదేసుకొని, కిటికీలోంచి ఏందో చూస్తా నిలబడ్డ ఒక పిల్ల బొమ్మని గీస్తంది కిష్టమ్మ. బలే ఉంది ఆ పిల్ల.

“కిష్టమ్మా, నాపని అయిపోయింది. నే పోతున్నా.” పెద్దగా కేకేసి చెప్పి గేటు గడేసుకుంటా నేనొచ్చేశా.

శిరీషమ్మ ఇంట్లో, లలితమ్మ ఇంట్లో పని చేసుకోని చూస్కుందును గదా తాళంచేతులు కనపళ్ళే. కిష్టమ్మ ఇంట్లో మరిచిపోయుంటా. మళ్ళీ అటుకేసి పోయినా. మెల్లిగా పడగ్గది వైపు పోయినా. నేను గేటు తీసిన చప్పుడు కూడా వాళ్ళకి యినబడలా. ఇద్దరూ ఈ లోకంలో లేనట్టుండారు.

గబగబా ఎనక్కి నాలుగడుగులేసి గుమ్మం నుండే, అసలేమీ చూడనట్టే, ‘కిష్టమ్మా!’ అని పిలుస్తా వంటింటి కేసి పోయా. ఆయమ్మ గదిలోంచి మాట లేదు. ఏమీ తెలియనట్లు యాక్షాను చేస్తా, ‘తాళం మర్చిపోయా కిష్టమ్మా, ఇదిగో తీసుకుని పోతండా!’ అంటా కేకబెట్టి గేటు పెద్దగా చప్పుడు చేస్తా యేసి ఇంటికొచ్చి పడ్డా పరుగెత్తుకుంటా. గుండె గుబగుబలాడతావుంది. చూసింది తలచుకుంటంటే కాళ్ళు చేతులు వణికిపోతన్నట్లయి గడపలోనే కూలబడిపోతిని. ఏం చేసేది బగమంతుడా…

ఈ శీను గాడేడబ్బా, వాడెటు పోయుండాడు!? చూసొద్దామని లేచి మా గోడ మీదగా తొంగి చూశా. వాళ్ళింటి వాకిట్లో పడి నిద్రపోతన్నాడు. వీళ్ళమ్మ మళ్ళీ ఎక్కడికి పోయిందో ఏమో! ఎప్పుడైనా నాలుగైదు రోజులకొచ్చే మనిషి పది రోజులవుతున్నా రాలేదు. శీదరకీ, శీనుగాడికీ, ఇద్దరికీ కిష్టమ్మే అన్నం పెడతంది.

కిష్టమ్మ మంచిది. ఎట్ల జరిగిందో ఇది జరిగింది. తప్పు కాయి సామీ. ఈ సంగతి పొక్కనీయకు సామీ!’ అనుకుంటా లోపలకొచ్చి పొయ్యి వెలిగించాను. నా సూపు మాత్రం కిష్టమ్మ ఇంటేపే ఉంది. కాసేపటికి శీదర గాడు బయటికి వచ్చి వాళ్ళింట్లోకి పోయాడు. కిష్టమ్మ ఇంటి తలుపులు మూసేసుకున్నాది.

శీదర గాడికి సహాయం చేయమని కిష్టమ్మని అడగడం నా తప్పా సామీ! ఇట్లా జరిగిద్దని నేనెట్లనుకుంటాను. గుడ్డిదాన్ని కాకుంటే ఇద్దరికీ మద్దెన వయసు తేడా యెంతున్నాదేంది. ఒంటిగుంటారాయె రోజంతా కలిసి. సిన్మాల్ల సూడటంలా ఇట్టా జరిగేది?

తలూడిపోతంది సామీ, బగమంతుడా ఇప్పుడేమయిద్దో!? సారు క్యాంపు నుంచి ఇయ్యాళో, రేపో వస్తడు. ‘వస్తే ఏమయిద్దిగాని, నువు మాత్రం నోర్మూసుకోనుండు తల్లా,’ కడుపు అరిచి చెప్తంది.

జెండా పండగ చేసుకోని పిల్లలందరూ వచ్చారు.

“ఈరోజు క్రికెట్టు ఆడదామురా, కృష్ణమ్మ ఇంట్లో ఉన్నాడేమో శీదరన్నని పిలవండిరా” అంటన్నాడు ఎవరో… శీదర మాట వినపడగానే ఉడికిన అన్నాన్ని గబాల్న కిందికి దించి బయటకొచ్చి చూశా వాడొస్తాడేమో చూద్దామని.

“శీదరన్న ఇంట్లో నిదరపోతన్నాడురా. లేపుతుంటే లేవడంలా. మనమాడుకుందాం రాండి…” అంటన్నాడు బాగ్గెం కొడుకు గోపిగాడు.

ఆట మొదలయింది, అరుపులు వినపడుతున్నాయి. శీదర గాడు మాత్రం ఇంట్లోంచి బయటికి రాలేదు.

ఆగస్ట్ 15, 2015.
కృష్ణమ్మ

శీను కళ్ళ ద్వారా శ్రీధర్ వస్తున్నాడని తెలుస్తోంది. ఒక్కసారి చూడాలని ఉందనీ, రమ్మనీ ఎన్నిసార్లు అడిగినా రాలేదు. నేను అతన్ని తల్చుకున్నప్పుడల్లా గుండెలు పిండేసినట్లుంటుంది. ఆ బాధ ఇక పోయేది కాదు. అతను ఫోన్లో చాలా సార్లు శీనుకి చెప్పాడట. ఉద్యోగం దొరకలేదన్న చిరాకుతో ఇంట్లో నుంచి వెళ్ళానని. అది కూడా ఒక కారణం… నిజమే. కానీ అదొక్కటే కారణం కాదు. మూలుగుతూ ఎదని నొక్కుకున్నాను.

“ఏమయింది కృష్ణా, గుండెల్లో నొప్పిగా ఉందా?” ఆయన నా మీదకి వంగి అడుగుతున్నారు.

“ఏమీ లేదండీ. మీరు జాగ్రత్తగా ఉంటారుగా… మిమ్మల్ని వదిలి వెళుతున్నాను.”

ఆయన నా కన్నీళ్ళు తుడిచారు. మళ్ళీ శ్రీధర్ గురించిన ఆలోచనలు. వాడంటే నాకు జాలి. ఆ జాలే దగ్గర చేసింది. ఒంటరిగా వున్న ఇద్దరిని అలా దగ్గరకు చేర్చింది. అదేమీ పాపం అని నేను అనుకోలేదు. అనుకోకుండా జరిగిన ఒక తప్పు అనుకున్నాను. ఆ తప్పు కొనసాగించకూడదని అనుకున్నాను. అతనికీ అదే చెప్పడానికి ప్రయత్నించాను. ఆ సంఘటన జరిగాక నేను అతన్ని ఇంట్లోకి రానివ్వలేదు. అదే అతనికి మొదటి అనుభవం కావడం అతనిలో మార్పును తెచ్చింది. నా నిర్ణయం నాకు మనశ్శాంతిని ఇచ్చింది కాని అతను ఎంత చెప్పినా వినకుండా తన బాధ్యతలని మరిచి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడన్న ఆవేదన మాత్రం నన్ను పీడించడం మానలేదు.

“శీనేడండీ?” అన్నాను నీరసంగా.

ఆయన బైటికివెళ్ళి పిలిచారు. కర్రపోటేసుకుంటూ వాడు వచ్చి నా పక్కనే కూర్చున్నాడు.

నరసమ్మ
డాక్టరుబాబు వచ్చి కిష్టమ్మని చూసి పోయినాడు. కిష్టమ్మకి కడుపులో ఏందో కేన్సర్ అంట. ఈ మాయదారి రోగం మంచోళ్ళకే పెడతావేందయ్యా బగమంతుడా! ఆమె ప్రక్కనే సారు కూర్చోని వుండాడు. లేచి బైటకు పోయా. శీనుగాడు గది వాకిలి మెట్లమీద చీకట్లో కూర్చోనుండాడు.

“వచ్చేటోడు ఇంటిదాకా రాడట్రా శీనా? దా లోపలకి పోదాం,” అన్నా వాడి పక్కనే కూలబడతా. వాడు దిగులుగా నా వైపు చూశాడు. కిష్టమ్మ తనకి బిడ్దలు లేరని ఏనాడూ మనాది పడలా. శీనుగాడినే తన బిడ్డ మాదిరి పెంచుకుంది.

“శీనూ, కృష్ణ పిలుస్తోంది, రా!” సారు బైటికొచ్చి చెప్పినాడు. గబాలమని లేచి లోపలకు పోతిమి.

కర్రపోటేసుకుంటూ దగ్గరికొస్తన్న వాడినే చూస్తా వుండింది కిష్టమ్మ. ఆ యమ్మ మనసులో ఏమనుకుంటాందో నాకు తెలిసినట్లే అయింది.

“ఇంకాసేపట్లో అన్నాయొస్తాడు కృష్ణమ్మా! వచ్చి ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుంటాడంట… నన్ను చూసుకుంటాడు, నువ్వు నా గురించి దిగులు పెట్టుకోబాక!” ఆమె చెయ్యి పట్టుకుని అన్నాడు శీను.

కిష్టమ్మా చిన్నగా నవ్వింది. ఆయమ్మ కళ్ళు మూతలు పడిపోయినాయి. సారు డాక్టరుబాబు కోసం పెద్దగా కేక పెట్టినాడు. నాకు ఏడుపు ఆగలేదు. శీను కూడా తలని మంచం పట్టెకి ఆనించుకుని పెద్దగా ఏడ్చేసినాడు.

శ్రీధర్
అదాటుగా బస్సు ఎవరో ఆపినట్లు ఊగి ఆగింది. ఉలిక్కిపడి లేచి తలెత్తి చూశాను. హెడ్‌లైట్లలో రోడ్డు కడ్డంగా పోలీసు వ్యాను.

టోపీని ముఖం మీదికి లాక్కుని జారగిలబడి కూర్చున్నాను.

“ఏయ్, నిన్నే, లే!” నా భుజం మీద లాఠీ. అప్పుడే నిద్రలోంచి లేచినట్లుగా ఉలిక్కిపడి వాళ్ళ వైపు చూశాను.

“లే, బస్ దిగు!” కాలర్ పట్టుకుని లేపాడు లాఠీతో కొట్టిన వాడు. లేచి నిలబడ్డాను. బస్సు లోంచి దింపి వ్యాన్ దగ్గరకు తీసుకుపోయారు. ఇనస్పెక్టర్ నాదగ్గరికొచ్చి మొహంలో మొహం పెట్టి చూసి పరిచయం ఉన్నోడిలా నవ్వాడు.

“ఏరా, ఈడు మనోడేనట్రా? ఈణ్ణెక్కడో చూసినట్టు లేదూ?”

పోలీసోళ్ళు నవ్వుతూ భుజం మీద గన్నులు సర్దుకున్నారు.

“సార్, సార్! అర్జెంటుగా వూరు పోవాలి సార్! మా వాళ్ళకి బాలేదు. చావుబతుకుల్లో వున్నారు, నన్నొదిలేయండి సార్. ఆఖరు సారి చూసుకుందామని పోతున్నా. నాకేం తెలీదు సార్!”

“అవునా? ఈ బస్ ఇంక ముందుకు పోదు గానీ, ఆ చెట్లకడ్డంపడి పరుగెత్తు. మీ వూరు ఇక్కడికి దగ్గరే. పోరా, పో! పరుగెత్తు! ఆఖరు చూపులు చూసుకో, పో!”

పోలీసొకడు టార్చ్ లైట్ చూపెట్టాడు అడవి వైపుగా. ఆ వెలుతురులో పరుగెత్తాను చెట్లలోకి. కళ్ళనిండా నవ్వుతూ కృష్ణమ్మ. అదే ఆఖరు గుర్తు నాకు.
--------------------------------------------------------
రచన: రాధ మండువ, 
ఈమాట సౌజన్యంతో

Saturday, March 30, 2019

అదే నేను


అదే నేను





సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి............

పెను చీకటికవతల
ఏముందో తెలుసుకోవాలనీ
ఆది అంతాలను గ్రహించాలనీ
జనన మరణాల
రహస్యాన్ని ఛేదించాలనీ
నేను అనుకుంటుంటే,

రేయి లేదు
పగలు లేదు
మొదలు చివరలసలే లేవు
ఆఖరికి
చావు బ్రతుకులు కూడా
లేవని నీవంటావు.

మరి ఉన్నదేమిటయ్యా అంటే
ఉన్నదంతా ‘నువ్వే’ నంటావు
‘నేనా’ అని ఆశ్చర్యపోతుంటే
దొంగలా నవ్వుతూ
నా కళ్ళలోకి చూస్తావు
నా లోలోపల దాక్కొని
‘అదే నేను’
నన్ను వెతుకు అంటావు.
-------------------------------------------------
రచన: రాధ మండువ, 
ఈమాట సౌజన్యంతో

Friday, March 29, 2019

ఎవరు చూడొచ్చేరు?


ఎవరు చూడొచ్చేరు?




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకవితను ఆస్వాదించండి...........

గాలి సావిట్లోకొస్తే
ఎవరు చూడొచ్చేరు?
నువ్వూ చూళ్ళేదూ నేనూ చూళ్ళేదు:
ఆకులు గలగల్లాడితే
తడి బట్టలు అల్లాడితే
అబ్బ గాలే అమ్మలూ!
అనుకోడం తప్పించి.

గాడుపు ఈడ్చి కొడుతుంటే
ఎవళ్ళకి కనిపిస్తుంది?
నీకూ అవుపడదూ నాకూ అవుపడదు:
చెట్లు జుట్లు విరబోసుకుని
తలలొగ్గి ఊగుతుంటే
అయ్యొ గాలిరా నానా!!
అనుకోడం తప్పించి.
--------------------------------------------------------
[Inspiration: Who Has Seen the Wind? Christina Rossetti.]
రచన: కనకప్రసాద్,
ఈమాట సౌజన్యంతో

Thursday, March 28, 2019

అమ్మ గోపెమ్మ


అమ్మ గోపెమ్మ





సాహితీమిత్రులారా!

ఆ మధ్య మదర్స్ డే నాడు గుడికి వెళ్ళిన నాకు, తెలిసిన పెద్దమనిషొకరు తారసపడ్డారు. యోగక్షేమాలు అడిగేక ఆయన “అన్నట్టు మర్చిపోయాను. హాపీ మదర్స్ డే!” అని శుభాకాంక్షలు చెప్పి, అంతటితో ఆగకుండా “మాతృ దేవోభవ – అంటూ దినచర్య ప్రారంభించమని బోధించిన సంస్కృతిలో పెరిగిన వాళ్ళకి, ఏడాదిలో ఫలానా రోజునే ఇలా అనాలి అన్న విషయం వింతగా తోచదూ?” అని విశ్లేషణని కూడా జతపరిచారు.

నాక్కూడా నిజమే అనిపించింది. గుడి మెట్లు దిగుతున్న నా దృష్టి మురిపాల కృష్ణుణ్ణి ముద్దుచేస్తున్న యశోదమ్మ చిత్ర పటం, దాని కింద రాసి ఉన్న ‘ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు’ అన్న మాటల మీద పడింది. నిజంగా తల్లంటే యశోదే. చరిత్ర కందని దినాల్లో చిన్న కృష్ణుడి తల్లిగా, తరతరాలుగా చరిత్ర పుటల్లో మరపురాని కొమ్మగా, మాయని బొమ్మగా నిలిచిపోయింది ఈ అమ్మ అనుకున్నాను.

మన భాషలో ఈ కధ ఇలా నిలిచిపోవటంలో – భావం శబ్దంలో ఒదిగిందో, శబ్దం భావంలో కలిసిందో, అంతుపట్టని రీతిని పరుగులు పెట్టే, తన కవితాప్రవాహానికి ఆధారం, సహజ పాండిత్యమో, భక్తి పారవశ్యమో తెలియకుండా – గంటం తిప్పిన పోతన్న చేతి మహిమ చాలా ఉంది. ఈయన అక్షరాలా అమ్మకి భక్తుడు. సమస్త మహోన్నత లక్షణాలకి మూల రూపం అయిన అమ్మలగన్న అమ్మని “క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు..” అంటూ మొదలు పెట్టి, నాలుగు పద్యాలలో నోరారా స్తుతించాడు భాగవత పీఠికలో. తరువాత తనతల్లి లక్కమాంబను ప్రస్తుతి చేసాడు. ఈ మాతృభక్తి భావమే యశోదా పాత్ర చిత్రణకి అంత చక్కగా మెరుగులు దిద్దిందేమో.

నిజానికి యశోదమ్మ కృష్ణుని కన్న అమ్మ కాదు. పాలిచ్చి పెంచిన గోపాంగన. యోగమాయని కని, ఆ మాయల తెరలలో యశోద, ఆమెతో బాటు గోకులం సమస్తము నిద్రలోకి జారుకుంది. ఇలా నిద్రావస్థలో ఉన్న యశోద పక్కలో ‘చిన్ని నల్లనయ్యను’ ఉంచి చిఱుతపాప రూపున ఉన్న యోగమాయని పుచ్చుకుని తిరిగి చెరసాలకు చేరుకున్నాడు వసుదేవుడు. ద్రోణుడనే వసువును, అతని భార్య ధరను, భూలోకంలో మానవులుగా జన్మించండి అని బ్రహ్మ కోరితే, ‘వైకుంఠుని సేవాభాగ్యం మాకు కలిగేటట్టు వరమిస్తే వెళతాం’ అని అడిగారుట ఆ దంపతులు. దానికి ఆ విధాత తధాస్తు అన్నాడట. వాళ్ళే ద్వాపర యుగంలో యశోద,నందులు.

తన పక్కన పొత్తిళ్ళలో ఉన్న చిన్నిపాపడు – తండ్రి సంకెళ్ళు త్రెంచి, చెరసాల చెరలను వదిలించి, మధురానగరిని మాయానిద్రలో ముంచి, పాపఱేని పడగల నీడన, అర్ధరాత్రి వేళ, ఒదిగి దారిచ్చిన యమునని దాటి వచ్చేడని, ఆ తల్లి ఎఱుగదు. ముద్దుల బిడ్డడిని ఒడిలో చేర్చుకొని మురిసిపోయింది. నందుడు వేదవిదులను పిలిచి బాలుడికి జాతకర్మలు చేయించాడు. ఈ కృష్ణావతారంలో మాత్రం ఆ విష్ణుమూర్తి, ఆనాటి అదితీపుత్రుడైన వామనుడిలా ఉపనయన వయస్కుడై జన్మించి, నా భిక్షాపాత్ర ఏది? నేను బలిని దానం అడగాలి! అంటూ కాళ్ళల్లో చెప్పులు పెట్టుకుని అడగలేదు, సరికదా “మన యశోద చిన్ని మగవాని కనెనట చూచి వత్తము” అంటూ గోపికలు వచ్చి, కానుకలు ఇచ్చి “జో జో కమలదలేక్షణ! జో జో కృష్ణా!” అని జోలలు పాడగా, లోకాలని నిద్రపుచ్చే స్వామి కళ్ళు మూసుకుని నిద్ర నటించాడు.

ఏబాములెఱుగక యేపారు గట్టికి బసులకాపరి యింట బాముగలిగె
ఏకర్మలు లేక యొనయు నెక్కటికిని జాతకర్మంబులు సంభవించె
ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడ యశోద చన్నుల పాల చొరవ యెఱిగె
(భాగవతం, దశమస్కంధం, పూర్వభాగం, 193)

పుట్టుక అనేది లేకుండా ప్రకాశించే ఆ దేవుడికి ఒక పశువుల కాపరి ఇంట్లో జన్మం కలిగింది. కర్మలకి అతీతుడైన ఆ నేర్పరికి జాతకర్మలు జరిగాయి. ఏ తల్లి పాలు ఎరుగని ఆ ప్రౌఢునికి(పెరిగి ఉన్నవాడు) యశోదాదేవి చన్నుపాలలోని మాధుర్యం తెలిసింది.

అన్నీ తెలిసిన ఆ భగవంతుడికి అంతా మాయే. అంతా లీలే. కాని ఆ తల్లికి మాత్రం తన బిడ్డడు నవ్వే ప్రతి నవ్వు, వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి చేష్టా ఒక అద్భుతము, అపూర్వము అయిన అనుభూతి. దాన్ని కాదనడానికి, త్రోసిపుచ్చడానికి సాధ్యాసాధ్యాలు అంటూ లేని ఆ దేవదేవుడికి కూడా సాధ్యం కాలేదు. అందుకే ఎన్ని వేషాలు వేసి, ఎన్ని మాయలు చూపించినా, ప్రేమపాశానికి పట్టుబడి, తల్లి ఒడిన పాపడు కావడం తప్పలేదు ఆ జగన్నాటక సూత్రధారికి.

కంసుడి ఆజ్ఞ మేరకు, తనను చంపబోయిన పూతన ప్రాణాలని పాలతో కలిపి లాగేసిన ఆ కృష్ణుడికి దృష్టి తీసి, పాలిచ్చి, పాన్పు పై పడుకొనబెట్టి, ఓ పాపడా! నిద్రపోవయ్యా! అని జోలపాడి, జోకొట్ట గలిగిన భాగ్యవంతురాలు ఆ యశోద. తన పాపడు బోర్లా పడగానే బ్రాహ్మణులని పిలిచి, సంభావనలని ఇచ్చింది. పండుగ చేసింది. శకటాసురుణ్ణి సంహరించిన ఆ దుష్టశిక్షకుడు, తన చుట్టూ ఉన్నవారిని మాయ పుచ్చటానికి ఏడుస్తుంటే, ఆ పాపడిని ఎత్తుకుని బుజ్జగించింది. బాలగ్రహం సోకిందని శాంతులు చేయించింది. తృణావర్తుడనే రాక్షసుడు, సుడిగాలి రూపున బాలుడిని చుట్టుముట్టి, పైకి లేపుకు వెళ్ళిన విషయం తెలుసుకుని, ఇలాంటి ఆపద ముంచుకు వచ్చిందే అని వాపోయింది. దైవాన్ని దూషించింది.

ఇక్కడం బెట్టితిం దనయుఁ డిక్కడ నాడు చుండె గాలి దా
నెక్కడ నుండి వచ్చె, శిశువెక్కడి మార్గము వట్టిపోయెనే
నెక్కడఁ జొత్తు నంచుఁ గమలేక్షణ గ్రేపుఁ దొఱంగి ఖిన్న యై
పోక్కుచు వ్రాలు గోవు క్రియ భూస్థలి వ్రాలె దురంతచింతయై (భా. ద. పూ. 268)

దూడను కోల్పోయిన గోమాత లాగ పట్టరాని దుఃఖంతో భూమి మీదకి ఒరిగి పోయిందట.

పుట్టి పుట్టఁడు నేఁడు దొంగిలబోయి మా యిలు సొచ్చి, తా
నుట్టి యందక ఱోలుఁ బీఁటలు నొక్కప్రోవిడి యెక్కి చే
వెట్టఁ జాలక కుండక్రిందొక పెద్దతూఁ టొనరించి మీ
పట్టి మీఁగడ పాలు చేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ! (భా. ద. పూ. 309)

ఓ యశోదమ్మా ! నీ ముద్దుల బిడ్డడు పీటలు, ఱోలు దొంతరలుగా పేర్చి, దాని మీదకెక్కి, అప్పటికి చేతికి అందకపోతే కుండకు చిల్లు పెట్టి దానిలో నుంచి కారుతున్న మీగడ పాలను పట్టుకుని తాగేడు. ఇలా అయితే మేము ఊరు వదిలి పోవాల్సిందే! అంటూ వెన్నలదొంగ ఆగడాలను వినిపిస్తారు గోపికలు.

అంతా విని, “కన్నులు తెరవని మా యీ చిన్ని కుమారుని ఱవ్వ సేయం దగునే? అన్య మెఱుగడు, తనయంత ఆడుచుండు. మంచివాడితడు. ఎగ్గులు మానరమ్మ!” అని వాళ్లనే ఎదురు తిరిగి మందలిస్తుంది. మనసులో అనుమానం ఉన్నా ముద్దుల కొడుకుని కోపించడానికి మనసు రాదు ఆ తల్లికి. గోపకాంతలు చెప్పిన ఎగ్గులను విని, భయపడుతున్న వాడిలాగా, పరమ సాధువు లాగా, ఆ గడుసు వాడు తల్లి గుండెల్లో తల దాచుకుంటాడు.

అన్న, గోపన్నలు వచ్చి, తుంటరికన్నడు మన్ను తింటున్నాడని తల్లితో చెబుతారు. తన ఇల్లు, పరాయిల్లు అన్న తేడా లేకుండా, ఇంటింటా దూరి పాలు వెన్నలు తినే బాలుడు మన్నెందుకు తింటున్నాడో బోధపడలేదు ఆ యశోదమ్మకు. పిల్ల వాడి చెయ్యి పుచ్చుకుని, “మన్నేటికి భక్షించెదు మన్నియములేలా నీవు మన్నింపవు?” నేను చెప్పిన మాట ఎందుకు వినవు?” అని విసిగిపోయి, అమాయకంగా అడుగుతున్న తల్లితో:

అమ్మా! మన్ను దినంగ నే శిశువనో, యాఁకొంటినో, వెఱ్ఱినో,
నమ్మంజూడకు వీరి మాటలు మది న్నన్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు, కాదేనిన్, మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము సేసి, నా వచనముల్ దప్పైన దండింపవే (భా. ద. పూ. 337)

నా మాటలు నమ్ముతావా ? లేక నన్ను నీ చేత కొట్టించాలనుకున్న వీళ్ళ అబద్ధాలు నమ్ముతావా? చూడు నా నోరు మట్టి వాసన వేస్తోందేమో? అదే నిజమైతే నన్ను దండించు. అని నేరుపులన్నీ నేర్చిన ఆ బాలుడు ఎంతో ప్రేమగా పలికి, తన నోరు చూపించాడు. అంతే!

ఆ లలితాంగి కనుంగొనె
ముఖమందు జలధి పర్వత వన భూ
గోళ శిఖి తరణి శశి ది
క్పాలాది కరండ మైన బ్రహ్మాండంబున్ (భా. ద. పూ. 339)

బాలుని నోట బ్రహ్మాండాన్ని చూసి సందేహంలో పడిపోయింది తల్లి. ఇది కలా? వైష్ణవ మాయా? అసలు నేను యశోదాదేవి నేనా? ఇది అసలు రేపల్లె కాదేమో? అంటూ కొంచం ఆలోచించుకుని, “బాలుని భంగిని ఇతడు భాసిల్లు గాని, సర్వాత్ముడాది విష్ణుడు అగుట నిజము” అని నిర్ణయించుకుంది. కప్పుకొన్న మాయతెరలు జారడం చూసి మళ్లీ మాయ పన్నుతాడు ఆ పరమాత్మ. మోహపు పొరలు కమ్ముకోగానే ఆమె ‘సర్వాత్ముడు’ అనుకోవడం మానేసి, ‘నా బిడ్డ’ అని తొడపై కూర్చోపెట్టుకుని ఎంతో మమతతో ముద్దు చేసింది. ఆ యశోదమ్మ జ్ఞాని, భక్తురాలుగా కాకుండా తనని బెదరించి, బుజ్జగించి, ముద్దు మురిపాలలో తేల్చే అమ్మగానే తనకి ఇష్టం అన్నట్టుగా ప్రవర్తించాడు బాల కృష్ణుడు. ఈ సందర్భంలో భాగవత కధను తనకు వినిపిస్తున్న శుకయోగితో పరీక్షిత్తుడు:

ప్రబ్బిన భక్తిని హరిపైఁ
గబ్బంబులు సెప్పి కవులు కైవల్య శ్రీ
కబ్బుదు రఁట హరి పోషణ
మబ్బిన తలిదండ్రు లెచటి కబ్బుదురో (భా. ద. పూ. 350)

భక్తితో హరినికీర్తన చేస్తూ కావ్యాలు వ్రాసే కవులకి మోక్షం ప్రాప్తిస్తుందట. మరి ఆ విష్ణుముర్తి ఆలనా పాలనా చూసే భాగ్యం కలిగిన వారికి ఏం లభిస్తుందో ? అని అంటాడు. శుకుడి సమాధానం ఎలా ఉన్నా, జన్మాంతం దాకా ఎందుకు? అప్పడే, అక్కడే, ఆవిడ ముంగిటి లోకే వచ్చి కూర్చుంది వైకుంఠం. ఈ జన్మలోనే ముజ్జగాలను పాలించే ఆ వైకుంఠాధీశుని ఒడిలో ఉంచుకుని లాలించే భాగ్యం ఆ గోపెమ్మకే అబ్బింది.

ఒక నాడు తల్లి యశోద కవ్వంతో పెరుగు చిలికి వెన్న తీస్తోంది. చేరవచ్చి, ఆకలి వేస్తోందని మారాం చేస్తాడు, గారాలు పోతాడు, పేచీలు పెడతాడు కన్నడు. కవ్వాన్ని విడిచి కుర్రవాడిని చేరదీస్తుంది. ఇంతలో పొంగిపోతున్న పాలదుత్తిని పొయ్యి మీద నుంచి దింపడానికి కొడుకుని కింద పెట్టి వెళుతుంది. ఆ పెంకెవాడు తన ఆకలి తీర్చకుండా వెళ్ళిన తల్లి మీద అలిగి కోపంతో కుండ తన్ని పగుల గొట్టి వెన్న తిని పోతాడు. తిరిగి వచ్చిన యశోద బిడ్డ కోసం వెదుకుతుంది. మరో ఇంట్లో రోటి మీద ఎక్కి వెన్న దొంగిలిస్తూ కనబడ్డాడు. యశోదాదేవికి బాగా కోపం వచ్చింది. నేను పిల్ల వాడిని గారాం చేసి పాడు చేస్తున్నాను. భయం పెట్టాలి అనుకుంది. దండించడానికి కర్ర పుచ్చుకుని తన కేసి వస్తున్న తల్లిని చూసి, రోటి మించి దూకి పరుగుతీస్తాడు గోపాలుడు. నీ వేషాలు నా దగ్గర చెల్లవు. నా చేతికి చిక్కకుండా ఎక్కడికి పోతావు అని వెంట తరిమింది. అతి ప్రయాస పడి పట్టుకుంది కొడుకుని.

చిక్కఁడు సిరి కౌఁగిటిలోఁ
జిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్
జిక్కఁడు శ్రుతి లతికావళిఁ
జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్ (భా. ద. పూ. 381)

లక్ష్మీదేవి కౌగిట గాని, సనకాది యోగిజనుల హృదయాల్లో గాని, వేదవేదాంగాలలో గాని ఇమడని ఆ హరి లీలగా తల్లి చేత చిక్కి పోయాడు. అలా చిక్కిన వాడిని నవనీత హృదయ ఆ యశోదకి కొట్టటానికి చేతులు రాలేదు. అందుకే తాటిని తెచ్చి ఱోటికి కట్టి పడేస్తాను నిన్ను అంది. ఎంత పెద్ద తాడు తెచ్చినా సరిపోలేదు. “పట్టి కడుపు పెక్కు బ్రహ్మాండములు పట్టుట ఎరిగేనేని ఏల కట్టు?” తన కొడుకు పొట్టలో బ్రహ్మాండాలన్నీ నిండి ఉన్నాయని తెలిసిననట్టు అయితే ఎందుకు కట్టాలనుకుంటుంది? ఎరగక పోవటం ఏమిటి? చూసిందిగా ఇంతకు పూర్వం. కాని ఏం లాభం? ఆ చూసిన విషయం తాలూకు వాసన లేకుండా ఇంద్రజాలం చేశాడు మరి బాల వాసుదేవుడు.

ఎలాగైనా కొడుకుని ఱోటికి బంధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్న ఆ యశోదకి ఒళ్లంతా చెమటలు పోశాయి, కొంగు జారిపోతోంది. తలలో పూలు నేల రాలాయి. తనని కట్టి పడేయ్యాలనే తాపత్రయ పడుతున్న తల్లి అవస్థని చూసి, ఆమెని కరుణించాడు కరుణాసింధువు.

బంధ విమోచనుఁ డీశుఁడు
బంధింపఁ బెనంగు జనని పాటోర్చి సుహృ
ద్బంధుఁడు గావున జననీ
బంధంబునఁ గట్టువడియెఁ బాటించి నృపా! (భా. ద. పూ. 386)

అలా కట్టబడి ఱోలీడ్చుకుని మద్దెచెట్లని కూల్చి నలకూబర మణిగ్రీవులని శాపబంధ విముక్తుల్ని చేస్తాడు.

ఇంద్రుడు ఎడతెరపి లేకుండా కురిపించిన ఘోరమైన వర్షధారల నుంచి గోకులాన్ని రక్షించడానికి గోవర్ధన గిరినెత్తి లోకరక్షకుడైన గోపాలుడు, లోకధర్మాన్ని పాటించి, తల్లి దండ్రుల మీద భక్తి చూపుతూ, ”రా తల్లి! రమ్ము తండ్రీ !” అని ముందుగా యశోదను నందుడిని పిలుస్తాడు.

ఆ లోకైక రక్షకుడిని వేయికళ్ళతో కాపాడడమే ఆ మాతృమూర్తి కర్తవ్యం, అతడే ఆమె లోకం. తనను పసివాడిగా భావించి పరిరక్షించాలని నిరంతరం తాపత్రయ పడే ఆ యశోదాదేవిని తన నటనలతో, మభ్య పెట్టటము, మురిపించడమే తన కర్తవ్యం అన్నట్టు ప్రవర్తించేడు బాలకృష్ణమూర్తి.

సెలగోల పట్టుకుని జల
కలశము లోని నీడఁ జూచి కలశ గతుండై
సెలగోలఁ బాపఁ డొకఁ డిదె
తలచెన్ ననుఁ గొట్ట ననుచుఁ దల్లికి జెప్పెన్ (భా. ద. పూ. 418)

చేత కర్ర పుచ్చుకుని నీటిమడుగు ముందు నిలబడి తన నీడను చూసి, బెదరిపోతూ, అమాయకంగా తల్లితో, నీళ్ళలో ఉన్న ఆ బాలుడు కర్రతో నన్ను కొట్టటానికి వస్తున్నాడని చెప్పినప్పుడు, తనయుడిని గుండెల్లో పొదువుకుని, భయపడకు! అది వట్టి నీడే! అని బుజ్జగించక మరేం చేస్తుంది ఆ పిచ్చి తల్లి.

పిల్లలు పేచి పెట్టి ఏడిస్తే తల్లులు ఏదో సాకు చెప్పి, భయపెట్టి, ఊరుకో పెడతారు కదా. అందరు అమ్మల లాంటిదే యశోదమ్మ.

భిక్షులు వచ్చెద రేడ్చిన
భిక్షాపాత్రమున వేసి బెగడించి నినున్
శిక్షిం చెదరని చెప్పిన
భిక్షులఁ గని తల్లి నొదిఁగి భీతిల్లు నృపా! (భా. ద. పూ. 419)

నువ్వు ఏడ్చావంటే భిక్షువులు వస్తారు. నిన్ను వాళ్ళ భిక్షాపాత్రలో వేసుకుని పోయి శిక్షిస్తారు సుమా! అని భయ పెడుతుంది. నిజంగా వాకిటిలోకి భిక్షువు వచ్చినప్పుడు, భయపడుతూ తల్లి చాటున దాక్కున్నాడుట చిన్నారి కన్నయ్య. చరాచారాలన్నిటిలో తానే నిండి ఉండే వాడికి ఈ లీల ఏమిటి? ఈ మిషతో తన మాతృమూర్తిని సంతోషపెట్టి ధన్యురాలిని చెయ్యడం కాకపొతే. లోకాలన్నిటిని లాలించి పాలించి అలిసిన స్వామి బాలకృష్ణునిగా తల్లి యశోదాదేవి ఒడిలో తనివి తీరా సేద తీరాలనుకున్నాడో, లేక పూర్వ జన్మలో బ్రహ్మ ఆమెకు చేసిన వాగ్దానాన్ని మన్నించాలనుకున్నాడో – కారణం ఏదైనా, ఆ యశోదాదేవిని మాత్రం కలకాలం గుర్తుండిపోయే మాతృమూర్తిగా చేశాడు ఆ హరి.

పోతన్న భాగవతపీఠికలో “శ్రీ కైవల్య పదంబు చేరుటకు”, ఎవరినో కాదు “మహా నందాంగనా ఢింభకుని” (నందపత్ని చిన్ని కుమారుడిని) శరణు కోరడమే కాదు, ఆ తల్లి భాగ్యాన్ని ప్రశంసిస్తూ:

సంగడిఁ దిరిగెడు శంభుడు
నంగాశ్రయ యైన సిరియు నాత్మజు డై యు
ప్పొంగెడు పద్మజుడును
గోపాంగన క్రియ గరుణవడయ రఖిలేశ్వరుచేన్ (భా. ద. పూ. 387)

సఖుడైన శివుడు,అర్ధాంగి యైన లక్ష్మీ దేవి, పుత్రుడైన బ్రహ్మ కూడా గోపాంగన యైన ఆ యశోదాదేవి లాగ ఆ లోకాధీశ్వరుని కరుణని పొందలేదు – అంటాడు. ఆ కన్నడిని కనురెప్పల్లో దాచుకుని పెంచిన ఆ యశోదమ్మ, ఆ అమ్మని మనకందించిన ఆ పోతన్న, ఇద్దరూ ధన్యజీవులు.
-------------------------------------------------------
రచన: కాశీనాధుని రాధ, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, March 27, 2019

ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా


ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా





సాహితీమిత్రులారా!

ఈ అనువాదకవితను ఆస్వాదించండి................

ఎక్కడెక్కడ తిరిగేవు నాయినా బిడ్డా సిపాయి చిన్న
ఎండనపడి వొచ్చేవు నాయినా నా కన్న?
కోనాడ అడివుల్లంట యేటకెల్లేనులేయే మాయమ్మ
పేనాలు పోతన్నాయి పక్కన్న పరిసిత్తు రమ్మీ!

ఈవలొట్టి పోతన్నావు నాయినా బిడ్డా సిపాయి చిన్న
కేవు తప్పిపోతన్నావు నీకేటి పెట్టీసిందిరా సిత్రాంగి నా కన్న?
కొర్రలన్నం వోర్చింది కోడిగుఱు వొండింది లేయే మా యమ్మ
కళ్ళు తేల్తన్నాయి బొంతన్న పరిసిత్తు రమ్మీ!

యేట కుక్కలుండాలి ఏ సవితి మింగీసింది బిడ్డా సిపాయి చిన్న
అంతలేసి బేపుల్ని ఏ యేరల కొట్టీసింది కొడుకా నా కన్న?
గస పోసుకున్నాయి నడలేక సచ్చేయి లేయే మా యమ్మ
మసకలాడుతున్నాయి మంచమైన వాల్సిత్తు రమ్మీ!

గస పోసుకుంతావు గుడ్లు తేల్సుకుంతావు నాయినా సిపాయి చిన్న
మాటైన మాటాడు పలుకైన పలుకుమీ దేవుడో నా కన్న?
సోకులాడి దాన్దుక్కు నీకెవలెల్లమన్నారు బిడ్డా సిపాయి చిన్న
నీ రోకైన పెళ్ళాము దని మాటేమి చెప్పుదుము కొడుకా నా కన్న?

మందు పెట్టీసింది మాయదారి కోడల్ది నాయినా బిడ్డా సిపాయి చిన్న
యిషం పెట్టీసింది దీనిల్లు కూలిపోదేమి కొడుకా నా కన్న?
మందానుకోలేదు మారడిగి తిన్నాను నా రాత లేయే మాయమ్మ
యిషమానుకోలేదు ఇష్టపడి తిన్నాను నా సావు రమ్మీ!
--------------------------------------------------------
రచన: కనకప్రసాద్, 
మూలం: Lord Randall, 
ఎనానిమస్ కవిత.
ఈమాట సౌజన్యంతో

Tuesday, March 26, 2019

రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది


రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి.................

చెడ్డ గాలి గంతులు వేసింది
ఎండు తాటాకులను ఎగరగొట్టింది
తాతమ్మ పాక గిజగిజలాడింది

దొడ్డి వాకిలి చప్పుళ్ళు చేసింది
నీళ్ళ బిందెలో తరంగం ఏర్పడింది
మేకుకున్న పటం ఊగిసలాడింది

మూకుడులో రొట్టె చల్లారిపోయింది
చమురు దీపం మూలన అల్లల్లాడింది
వెల్ల వేసిన గోడంతా నీడలమయమైనది

గాలి హోరులో కలవరింత పచార్లు చేసింది
నవారు మంచంపైన అది జాగారం చేసింది
రాత్రంతా వర్షం కురుస్తూనే ఉన్నది
-------------------------------------------------------
రచన: పాలపర్తి ఇంద్రాణి, 
ఈమాట సౌజన్యంతో

Monday, March 25, 2019

సరస్సు నవ్వు


సరస్సు నవ్వు




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి..................

తన నుంచి తాను వెళిపోయి
అతడలా వుండిపోతాడు
తన వొడ్డు మీద తానుండి
తన లోనికి తాను గాలం విసిరే జాలరి
కొలనులో నీరు కదలదు
లోపల స్వప్నమీనం నవ్వుకుంటుంది
ఉండి వుండి కొలను నిద్ర పోతుంది
అతడూ నిద్ర పోతాడు
నిద్రపోక ఏం చేస్తాడు?
నిద్దట్లో మాత్రమే జీవిస్తున్నవాడు
ఎంతో కొంత తనకు తాను లేనప్పుడే
నిజంగా వుంటుంటాడు ఈ మాత్రమైనా
పేటిక మూసుకోవాలి ఇంకా
మనసులో ఏం వుందో
చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు
లోలోపల నవ్వుకోడమే
------------------------------------------------
రచన: హెచ్చార్కె, 
ఈమాట సౌజన్యంతో

Sunday, March 24, 2019

ముగ్గురు సాధువులు


ముగ్గురు సాధువులు




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి.................

ఓడ బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. సరంగు పైకెక్కి ఆకాశంలోకి చూస్తున్నాడు, ఎక్కడైనా వర్షం కానీ తుఫాను కాని వచ్చే సూచనలున్నాయేమో అని.

“అందరు ఎక్కేశారండి. బయల్దేరొచ్చు ఇంక!” వచ్చి చెప్పేడు నౌకరు.

“పాస్టరు గారు వచ్చినట్టేనా? ఆయన లేకుండా మనం వెళ్ళిపోతే బాగుండదు.”

“వచ్చారుగా. ఈ పాటికి ఆయన మళ్ళీ ప్రార్ధన చేసుకోడానికి లోపలకెళ్ళారేమో. ఆయనెక్కడం నేను చూశాను.”

“సరే ఐతే తెరచాపలెత్తమను. బయల్దేరదాం.”

ఓడ బయల్దేరిన చాలా సేపటికి పాస్టర్ తన గదిలోంచి బయటకొచ్చాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. చేతిలో జపమాల పట్టుకుని మెల్లిగా నడుచుకుంటూ కనపడిన ఆయన్ని అడిగేడు, “జనం ఎవరూ కనపడరేం?”

“అందరూ పైన ఉన్నట్టున్నారండి. చాలామందికి ఇలాంటి ప్రయాణం మొదటిసారి. అందుకే అలా చుట్టూ చూడ్డానికి పైకెక్కి ఉంటారు.”

“అరే, నేను సాయంకాలం అందరితో కలిసి ప్రార్ధన చేయిద్దామనుకున్నానే?”

“పైకి వెళ్ళి చూడండి, అక్కడే ప్రశాంతంగా ప్రార్ధనా అదీ చేయించుకోవచ్చు.”

సమాధానం కోసం చూడకుండా ముందుకెళ్ళిపోయేడు ఆయన, ఏదో పనిమీద ఉన్నట్టున్నాడు. పాస్టర్ పైకి వెళ్ళేసరికి జనం అంతా గుంపుగా నించుని ఒకాయన చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. దగ్గిరగా వెళ్ళి మాట కలుపుతూ అడిగేడు –

“మీరందరూ ఏదో చర్చించుకుంటున్నట్టున్నారే?”

పాస్టర్ని చూడగానే అప్పటిదాకా మాట్లాడుతున్నతను చటుక్కున ఆపి తలమీద టోపీ తీసి వంగి నమస్కారం చేసేడు తప్ప ఏమీ మాట్లాడలేదు. గుంపులో ఉన్న ఒకాయన కాస్త ముందుకొచ్చి చెప్పేడు:

“ఆ దూరంగా కనబడే లంకలో ముగ్గురు సాధువులున్నారనీ, వాళ్ళొక వింత జీవితం గడుపుతున్నారనీ ఇతను చెప్తున్నాడు.”

“సాధువులా? ఎక్కడా ఆ దీవి?” పాస్టర్ గారి కుతూహలం ఎక్కువైంది.

మొదట మాట్లాడుతున్నాయన వేలితో చూపించేడు లంకవేపు. కళ్ళు చికిలించి చూశాడు. ఏమీ కనపళ్ళేదు. “నాకేం కనపడట్లేదోయ్, మీ అంత కుర్రవాణ్ణి కాదు కదా?” నవ్వుతూ చెప్పేడు.

“పోనీలే, ఈ సాధువులు ఎలాంటివారు?”

“క్రిందటేడు దాకా నాకూ తెలియదండి, అప్పుడప్పుడూ ఇలా ప్రయాణికులూ, చూసిన మా బెస్తవాళ్ళూ చెప్పడం తప్ప. కానీ పోయినేడాది నేను చేపలు పట్టడం కోసం వెళ్తే చిన్న తుఫానులో నా పడవ మునిగిపోయింది. నాకు స్పృహ పోయింది. నేను కళ్ళు తెరిచేసరికి ఆ లంకలో ఉన్నాను.”

“వాళ్ళేం చేస్తూంటారు ఆ ద్వీపంలో? అక్కడో గుడో, గోపురమో, ఆశ్రమమో ఉందా?”

“అక్కడేమీ ఉండదండి. వాళ్ళుండేదో చిన్న గుడిసె. నేను లేచేసరికి నాకు తిండీ నీరు ఇచ్చి నా పడవ బాగుచేసి పెట్టారు. ముగ్గురూ అసలు మాట్లాడ్డం కూడా అంతంతే.”

“ఆ ద్వీపం పేరేమిటి?”

“ఇలాంటి లంకలు ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. వీటికి పేర్లు అవీ లేవు.”

“సరే సాధువుల గురించి చెప్పు. వాళ్లు నీతో ఏం మాట్లాడేరు?”

“ఒకాయన చాలా ముసలివాడు. ఆయనకి నూరేళ్ళు దాటి ఉంటాయని ఖచ్చితంగా చెప్పగలను. మొహం మాత్రం అదో రకమైన వెలుగుతో ఉంది. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. రెండో ఆయన కూడా ముసలివాడే కానీ మొదటాయనకంటే కొంచెం తక్కువ ఉంటుంది వయస్సు. మూడో ఆయన కాస్త పడుచువాడే, ముఫ్ఫై, నలభై ఏళ్ల లోపుల ఉండొచ్చు. ఈ రెండో ఆయన్ని మీరిక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారని అడిగేను. దానికే ఆయనకి కోపం వచ్చినట్టుంది. ఏదో అనబోయేడు కానీ పెద్దాయన ఈయన చేయి పట్టుకుని ఆపాడు. ఆ పెద్దాయనే నాకేసి చూసి, ‘మా మీద దయ ఉంచాలి’ అన్నాడు. ఇంకా తర్వాత మాటా మంతీ లేదు.”

ఇలా మాట్లాడుకునేంతలో ఓడ లంకకి దగ్గిరగా రావడం గమనించేడు పాస్టర్. “ఆ, ఇప్పుడు కనిపిస్తోంది. అక్కడకెళ్ళి వాళ్లని చూడడం కుదురుతుందా?”

“సరంగుని అడిగితే చెప్తాడండి. కానీ మనం అక్కడకెళ్తే మనకి ఆలస్యం అవుతుందని మీకు తెలియంది కాదు.”

“ఇక్కడ ఆ కనిపించే దీవిలో ముగ్గురు సాధువులున్నారని ఈయన చెప్తున్నాడు. నాకు వాళ్ళని చూడాలని ఉంది. మీరు అక్కడికి నన్ను ఎలా తీసుకెళ్లగలరో అని అడుగుదామని…” సరంగు వచ్చాక చెప్పేడు పాస్టర్.

“భలేవారే, ఈ కధలన్నీ నమ్ముతున్నారా? వాళ్ళు సాధువులని కొంతమందీ, కాదని కొంతమందీ అనడం నేను విన్నాను. ఇంతా చేసి అక్కడకెళ్తే వాళ్ళు మామూలు బెస్తవాళ్ళనుకోండి, మనకి సమయం వృధా, మీకు అనవసరపు శ్రమాను!” సరంగు కంగారుగా చెప్పేడు.

“నా సమయానికేంలే గానీ నన్ను అక్కడకి తీసుకెళ్ళాలంటే ఎలా కుదురుతుంది?”

“ఓడ ఆ లంక వరకూ వెళ్లడం కుదరదు కానీ మిమ్మల్నో చిన్న పడవలో నిచ్చెన మీదనుంచి దింపి ఇంకో ఇద్దరు తెడ్డువేసే బెస్తవాళ్లతో పంపించాల్సి వస్తుంది. ఇదంతా మనకెందుగ్గానీ మనం ఇక్కడ ఆగవద్దని నా మనవి. మనదారిన మనం పోదాం.”

పాస్టర్ గారి కుతూహలం ఇంకా ఎక్కువైంది. “అలా కాదు, మీ శ్రమ ఉంచుకోను. నన్ను ఓ సారి అక్కడకి తీసుకెళ్ళగలరా?”

సరంగు ఈ లంకలో ఆగడం ఎంత ప్రమాదమో, ఎందుకు వద్దో అన్నీ పాస్టర్‌కి చెప్పి ఆయన్ని అక్కడకి వెళ్ళకుండా ఆపుదామని చూశాడు కాని పాస్టర్ మంకుపట్టూ, ఆయన పాస్టర్ అనే గౌరవం వల్లా ఏదీ కుదర్లేదు. ఓ అరగంటలో చకచకా పడవ దింపడం, పాస్టర్ గారూ ఇంకో ఇద్దరు పడవ నడిపే బెస్తవాళ్ళూ దిగడం అయింది. పడవ మెల్లిగా లంక దగ్గిరకొస్తూంటే పాస్టర్‌కి సాధువులు ముగ్గురూ కనిపించేరు గట్టుమీదే. వాళ్ళ మొహాల్లో ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వులని పెరిగిన గడ్డాలు దాచలేకపోతున్నాయి. పడవ దిగిన పాస్టర్ చెప్పేడు సాధువులతో.

“నేను మీలాగే యొహావా సేవకుణ్ణి. భగవంతుడి ఇష్టం ప్రకారం ఆయన నా దగ్గిరకి పంపించిన వాళ్లందరికి ఏదో నాకు తోచినంతలో ఆయన విభూతి గురించి చెప్తూ ఉంటాను. ఈ దారిలో ఈ రోజు వెళ్తూంటే మీ గురించి తెల్సింది. మిమ్మల్ని చూడాలనిపించి సరంగు వద్దంటున్నా ఇలా వచ్చేను.”

సాధువులు ముగ్గురూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు తప్ప బదులివ్వలేదు. మళ్ళీ పాస్టరే అన్నాడు.

“ఇలా జనాలకి దూరంగా సముద్రంలో ఉండే ఒంటరి దీవిలో మీరు ఎలాంటి ప్రార్ధన చేస్తారో, జ్ఞానం సంపాదించుకోవడానికేం చేస్తున్నారో మీరు చెప్తే తెల్సుకోవాలని ఉంది నాకు.”

ఈ మాట విని ఒక సాధువు నిట్టూర్చేడు. అందరికంటే ముసలి సాధువు చెప్పేడు పాస్టర్‌తో, “మాకు అసలు ప్రార్ధన అంటేనే తెలియదు. మాకొచ్చినదల్లా ఒకే ఒక వాక్యం. దానితోనే ఇలా జీవితం గడిచిపోతోంది.”

ఆయనిలా అనగానే ముగ్గురు సాధువులూ ఆకాశం కేసి చూసి గొంతెత్తి ఒక్క కంఠంతో అన్నారు “మీరు ముగ్గురు, మేం ముగ్గురం. మా మీద దయ ఉంచాలి.”

ఇది విని పాస్టర్ మనసులో చిన్నగా నవ్వుకుని ఇలా అన్నాడు.

“‘మీరు ముగ్గురు’ అంటున్నారంటే మీకు భగవంతుడి త్రిమూర్తి తత్వం గురించి తెలిసినట్టుంది, సంతోషం. కానీ మీరు చేసే ప్రార్ధన అంత బాగాలేదు. భగవంతుడే ఈ భూమ్మీద యొహోవా రూపంలో పుట్టి మనుషులందరూ సరిగ్గా ఎలా ప్రార్ధన చేయాలో నేర్పి వెళ్ళాడు. నేను చెప్పేది ఇదంతా నా స్వకపోల కల్పన అనుకునేరు సుమా, లేదు, ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను. మీకు ఇష్టమైతే ఆ చిన్న ప్రార్ధన నేర్పుతాను ఇప్పుడు ఇక్కడే, భగవంతుడు చెప్పినట్టుగానే.”

“తప్పకుండా,” వెంఠనే చెప్పేడు సాధువులందర్లో పెద్దాయన.

“సరే అయితే వినండి. విన్న తర్వాత మీరు నేను చెప్పింది నాకు అప్పచెప్పారంటే మనం ఇది పది నిముషాల్లో పూర్తి చేయవచ్చు, చెప్పండి, స్వర్గంలో ఉండే పరమేశ్వరా..”

అందర్లోకీ చిన్న సాధువు “స్వర్గంలో ఉండే పరమేశ్వరా…” అనగలిగేడు, కానీ అలవాటు లేని భాష వల్ల కాబోలు రెండో సాధువు సరిగ్గా ఉఛ్ఛరించలేకపోయేడు. మాట్లాడుతూంటే ఆయన గెడ్డం నోటికడ్డం పడుతోంది మాటిమాటికీ. అందరికంటే పెద్దాయనకి పళ్ళే లేవు నోట్లో. ఆయనేదో గొణిగినట్టుంది ఇది చెప్తూంటే. ఆయనన్నదేమిటో పాస్టర్‌కే అర్ధం కాలేదు.

కాసేపు పాఠం చెప్పగానే పాస్టర్‌కి అర్ధమైంది. వీళ్ళు జనసమూహంలోంచి బయటకొచ్చి చాలా ఏళ్ళే అయింది కనక ఇది గంటా గంటన్నరల్లో తేలేది కాదు. అయినా సరే వీళ్ళని చూస్తే పాస్టర్ గారికి వదిలి వెళ్ళబుద్ధేయలేదు. వాళ్ళు ముగ్గురూ స్పష్టంగా చెప్పేదాకా రోజంతా అక్కడే కూర్చుని అలా పాఠం చెప్తూనే ఉన్నాడు, చెప్పిందే మళ్ళీ చెప్తూ. దాదాపు చీకటి పడేసరికి పాస్టర్ సంతోషంగా లేచాడు. ముగ్గురు సాధువులూ అప్పటికి మొదటి పంక్తి, “స్వర్గంలో ఉండే పరమేశ్వరా…” దగ్గిర్నుంచి ఆఖరి పంక్తి “పాపాల నుంచి రక్షించు…” వరకూ పూర్తిగా చెప్పగలుగుతున్నారు.

ముగ్గురు సాధువులూ కూడా సంతోషంగా పాఠం అప్పచెప్పి పాస్టర్‌కి సాష్టాంగ నమస్కారాలు చేశారు. పాస్టర్ ముగ్గుర్నీ లేపి దగ్గిరకి తీసుకుని దీవించి చెప్పేడు, “ఇలా మిమ్మల్ని కల్సుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా నేను ఏదో ఒక సేవ చేయగలిగేను ఈరోజున. ఈ ప్రార్ధన మర్చిపోకుండా రోజూ చేయండి. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు.”

సరంగు ఇప్పటికే బాగా ఆలస్యం అయిందని కంగారు పడుతూ తెడ్డువేసే బెస్తవాళ్ళని హెచ్చరించి, నిచ్చెన మీదనుంచి పాస్టర్ గారిని ఓడలోకి త్వరత్వరగా ఎక్కించాడు. ఇది జరుగుతున్నంతసేపూ ముగ్గురు సాధువులూ లంకలో గట్టుమీద నుంచుని ఆపకుండా, “స్వర్గంలో ఉండే పరమేశ్వరా.. ” అంటూ గొంతెత్తి వాళ్ళకు నేర్పిన పాఠం వల్లిస్తూనే ఉన్నారు. వాళ్ళలా ప్రార్ధన చేస్తూండగానే చీకటి పడడం, పాస్టర్ ఓడలోకి చేరడం, ఓడ బయల్దేరి పోవడం జరిగిపోయింది.

పాస్టర్, ఓడలో మిగతా జనం ఈ సాధువులు కనపడేంతవరకూ అలా చూస్తూ కూర్చున్నారు. మెల్లిగా సాధువులూ వాళ్ళుండే దీవీ కనుమరుగయ్యేయి. చంద్రోదయం కావడంతోటే అదో రకమైన ప్రశాంతత వాతావరణం అంతా పరచుకుంది. బాగా చీకటి పడ్డాక మిగతా ప్రయాణీకులందరూ పడుకున్నారు గానీ పాస్టర్ గారికి నిద్ర దూరమైంది. ఆ రోజు తాను చూసిన సాధువులూ, వాళ్ళకి తనెలా ప్రార్ధన నేర్పించాడో మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంటే ఒళ్ళు గగర్పొడుస్తూ ఉంది ఆయనకి. మళ్ళీ పైకి ఎక్కి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని దూరంగా కనుమరుగైన ద్వీపంకేసే చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయేడు ఆయన. ఓడ కదుల్తూంటే నీళ్ళలో వచ్చే శబ్దం తప్ప ఇంకేమీ లేదు.

ఎందుకో ఓ సారి పాస్టర్ తలెత్తి చూశాడు. దూరంగా నీళ్ళమీద ఏదో తెల్లగా మెరుస్తూంది. ఇటువేపే వస్తూన్నట్టుందేం? కూర్చున్నాయన లేచి నిలబడి కుతూహలంగా చూడబోయేడు కనిపించేదేమిటో. ఈ వెల్తురు ఇంకా దగ్గిరైంది. పైకి చూసి అక్కడున్న చుక్కాని కదిపేవాడితో అన్నాడు పాస్టర్, “హేయ్, ఇదేదో ఓడ దగ్గిరకొస్తూంది. ఏమిటో తెలుసా?” వాడు చూసి భయంతో చుక్కాని వదిలేసి ఒక్క గావుకేక పెట్టేడు. ఈ పాటికి వచ్చేది ఏమిటో తెల్సింది. ముగ్గురు సాధువులూ నీళ్ళమీద పరుగెట్టుకుంటూ ఓడ కంటే వేగంగా వస్తున్నారు – ఓడ దగ్గిరకే.

చుక్కాని కదిపేవాడు పెట్టిన కేకకి మొత్తం ఓడలో జనం అంతా మేలుకున్నట్టున్నారు. వాళ్ళంతా పైకి చేరారు కంగారుగా, ఈ వింత చూడ్డానికి.

ఓడ దగ్గిరకి రాగానే అక్కడే నీళ్లలో నిలబడి పెద్ద సాధువు అన్నాడు, “మీరు చెప్పిన పాఠం మీరున్నంతవరకూ అలా అంటూనే ఉన్నాం. అలా అన్నంతవరకూ గుర్తు ఉంది. కానీ ఒక్కసారి ఆపగానే ఒక్కో పదం మనసులోంచి జారిపోయింది. ఇప్పుడు ముగ్గురికీ ఒక్క ముక్క కూడా గుర్తు రావట్లేదు. మళ్ళీ ఓ సారి నేర్పమని అడగడానికి వచ్చేం. శ్రమ అనుకోకపోతే మళ్ళీ నేర్పగలరా?”

ఛెళ్ళున చెంపమీద కొట్టినట్టైంది పాస్టర్‌కి. ఆయన కిందకి వంగి వాళ్ల ముగ్గురికి ప్రణామం చేసి చెప్పేడు, “మీరు జనసంద్రంలోంచి విడిపోయి, భగవంతుడి నుంచి దూరంగా ఉండిపోయారనుకుని అజ్ఞానంతో మీకేదో నేర్పడానికి ప్రయత్నించాను. మీరు చేసే ఆ చిన్న ప్రార్ధనే నేను నేర్పినదానికన్నా ఎంతో మేలైనది అని తెలిసింది ఇప్పుడు. క్షమించండి. నేను మీకు నేర్పగలిగేది ఏమీ లేదు. నాలాంటి పాపాత్ముణ్ణి కనికరించమని మీరే భగవంతుణ్ణి ప్రార్ధించాలి.”

ఇది విన్నాక ముగ్గురు సాధువులూ ఒకరి మొహం ఒకరు చూసుకుని వెనుతిరిగేరు. ఓడలో ఉన్న జనాల మొహాలలో కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు. అందరూ తిరిగి వెళ్ళి పడుకున్నారు, ఈ సారి పాస్టర్‌తో సహా.

ఆ రాత్రి నుండి మర్నాటి సూర్యోదయం దాకా ముగ్గురు సాధువులూ – వాళ్ల లంక నుంచి ఓడవరకూ – నీళ్లమీద నడిచివచ్చిన బాట వెల్తురు చిమ్ముతూనే ఉంది.
----------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి,
మూలం: లియో టాల్‌స్టాయ్,
(మూలం: The three hermits – Leo Tolstoy)
ఈమాట సౌజన్యంతో

Saturday, March 23, 2019

పనిపిల్లలు


పనిపిల్లలు




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..................

“అమ్మా నేను బడికి పోతానే … అందరు పిలకాయల్లాగా నేను కూడా మంచిగా చదువుకుంటానే ” పొద్దున్నే నిద్ర లేచి కళ్ళు నలుపుకుంటు అడిగాడు తల్లిని

” పోతావురా నువ్వు బడికి పోతావు … మీ అయ్య వల్లకాటికి పోతాడు నేను రెక్కలు ముక్కలు చేసుకుని మీ ఇద్దర్నీ పోషిత్తా ….. బడికి పోతాడంట బడికి అయినా బడికి పోయేది మనసుంటోల్లు కాదురా దానికీ ఎప్పుడో పుణ్ణెం చేసుకోనుండాలి …. పొద్దున్నే ఎదవాలోచనలు చెయ్యకుండా లేచి పనికి బయలుదేరు ” తల్లి మందలింపుతో ఆ పసి హృదయం చివుక్కుమంది

“అదేందమ్మా పిలకాయలు బడికి పోము మొర్రో అంటుంటే వాల్ల అమ్మా వాల్లు పొమ్మని బతిమాలుతుంటారు నువ్వేమో నేను బడికి పోతానమ్మా అంటే తిడుతున్నావు” అమాయకంగానే అడిగినా తల్లి హృదయానికి తగిలాయామాటలు , చెప్పేందుకు సమాధానంలేదు తనదగ్గర.

“చెప్పానా పిచ్చి పిచ్చి గా అదీ ఇదీ ఆలోచించొద్దని “ కోపంగా చెప్పింది , అంతే కిమ్మనకుండా ఇంట్లోకి వెల్లి సద్దెన్నం తిని అక్కడినుండి బయలుదేరాడు, కొంచం సేపు అక్కడా ఇక్కడా తిరిగి , బడి మొదటిగంట కొట్టే టైంకిి ఆ వీధి చివర వేపచెట్టు కిందున్న అరుగుమీద కూర్చుని ఆ దారి వెంట వెల్లే వాల్లను చూస్తూ ఉన్నాడు

రోజూ చూసేదే అయినా ఏరోజు కారోజు కొత్తగానే అనిపిస్తుంటుంది జట్లు జట్లుగా వడి వడి గా నడుచుకుంటూ భుజానికి వ్రేలాడే పుస్తకాల సంచులతో కొందరు అమ్మో , నాన్నో , అమ్మమ్మో , నాన్నమ్మో లేక తాతయ్యో ఎవరిదో ఒకరి వేలుపట్టుకుని బుడి బుడి అడుగులు వేసుకుంటూ మధ్య మధ్యలో ఆగి తనకు వింతగా కనిపించినదేదో చూస్తూ, జారిపోతున్న నిక్కరును ఓ చేత్తో పైకి లాక్కుంటూ నడిచే చిన్నారులు కొందరు నేను బడికెల్లను మొర్రో అని మారాం చేస్తుంటే చంకనేసుకుని ఎందుకెల్లవు రా అని గదుముతూనో లేక వెల్తే నీకు అది కొనిపెడతాను ఇది కొనిపెడాతాను అని బుజ్జగిస్తూ తీసుకెల్లే వాళ్ళు కొందరు ఇలా అందరి గమ్యం ఒక్కటే అదే బడికి వెల్లి చదువుకోవడం

మనసులో ప్రతీ రోజూ వచ్చే ఆలోచనే బడి గంట మోత వింటూ అందరిలాగా పుత్తకాల సంచీ తగిలిచ్చుకుని “అమ్మా నేను బడికెల్తన్నానే ” అంటూ బయలుదేరేదెప్పుడు, అయినా ఇంత మంది పిలకాయలు చేసుకున్న పుణ్ణెమేంది నేను చేసుకున్న పాపమేంది ఒకేళ నేను పాపమే చేసుంటే దానికి పరిహారం ఈ జల్మకు లేనట్లేనా ఒకవేళ ఉంటే ఎప్పుడు , నేనూ అందరిలా బడికెల్లేదెప్పుడు? ఇలా ప్రతీ రోజూ ఓ అరగంట ఆ అరుగుమీద కూర్చుని ఉదయమే బడికి వెల్లే పిల్లల్ని చూస్తూ తనలో తాను బాధపడుతూ తనను తాను ప్రశ్నించుకుంటూ ఉంటాడు

“ఓరి కిట్టిగా ఎక్కడ చచ్చావు రా …. టైమవుతా ఉండాది పనిలోకి పోవా ఏందియ్యాళ …..” వీధికి ఆచివర ఉండి అరిచింది లచ్చమ్మ

ఒక్కసారి స్పృహలో కి వచ్చాడు కిట్టిగాడు పుట్టినప్పుడు మంచిగా కృష్ణమోహన్‌అని పేరుపెట్టారు కాని వాడికి ఊహ తెలిసినతరువాత పిలిచే ప్రతి ఒక్కరూ కిట్టిగా అనేవాల్లేగాని అసలుపేరుతో పిలిచినవాళ్ళు లేరు

” ఆ వత్తన్నా ఎందుకంత గొంతు చించుకోని అరుత్తుండావ్‌పనిలోకి పోక సత్తాన చెప్పు ” అంటూ తల్లి కి ఎదురెల్లి చేతిలో ఉన్న సంచీ తీసుకుని బుజానికి తగిలించుకుని తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ అక్కడినుండే వెనుతిరిగాడు ‘అందరూ పుస్తకాల చంచీ తగిలింకుకుంటుంటే నేను తిండిబోతోడి లా మద్దేనం తినేదానికి సంచీ తగిలించుకుంటున్నా ‘ మనసులో అనుకుంటూ నడుస్తున్నాడు

“ఏందిరో నీలో నువ్వే తెగ నవ్వేసుకుంటున్నావ్‌….. మాకూ చెపితే మేం కూడా కొంచం నవ్వుతాంకదా ” నవ్వుతూ అడిగాడు అప్పటిదాకా కిట్టిగాడికోసమే ఎదురుచూస్తూ ఉన్న రాముడు, రాముడు వయసులో కిట్టిగాడికన్నా ఓ మూడేల్లు పెద్దవాడు ఇద్దరూ మంచి స్నేహితులు చిన్నప్పటినుండీ ఇద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు

“ఎంతసేపయిందేంది నువ్వొచ్చి ” అడిగాడు కిట్టిగాడు

” ఆ ఇప్పుడే మీ అమ్మ నీకోసం కేకేసిందే అదిని ఇంట్లో నించి బయటకొచ్చా ఇక నువ్వు రాకపోతావా అని ” చెప్పి “అదిసరే ఎందుకు నవ్వుతున్నావో చెప్పలేదు ” అడిగాడు

“ఏమీలేదురా ఊరికే సంచి తగిలించుకుంటుంటే నవ్వొచ్చింది ” అంటూ తనకు నవ్వురావడానికి గల కారణం చెప్పాడు

ఈ సారి నవ్వడం రాముడి వంతయింది “ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావురా …. అందుకే నేనెవరికీ ఏదీ చెప్పకూడదనుకుంటా ” చెప్పాడు కిట్టిగాడు

“అందుక్కాదులేరా నా చిన్నప్పుడు నేనూ నీలా నే అనుకునే వాడిని అది గుర్తొచ్చి నవ్వొచ్చింది అంతే ….. నిన్ను ఎగతాలి చెయ్యడానికి నవ్వలేదు ” సంజాయషీగా చెప్పాడు

“నీక్కూడా అలానే అనిపించేదా ? ” అమాయకంగా ప్రశ్నించాడు

“ఏ నేను మాత్రం నీలా మనిషిని కాదా …. నాకూ బడికెల్లి చదువుకోవాలని ఉండదా ?” చెప్పాడు

” ఒరే నాకో చిన్న అనుమానం అడగనా ? ” మెల్లగా అడిగాడు కిట్టిగాడు

“అడుగురా….”

“అదే రా మనం ఒక్కసారన్నా బడిలో అడుగుపెడతామంటావా ?? ” ప్రశ్నించాడు

“నీసంగతి నాకు తెలియదుకాని నేను మాత్రం రెండు మూడేల్ల క్రితం ఒకసారి ఓ వారం రోజులు బడికెల్లాను రా …..”

నడుస్తున్నవాడల్లా ఒక్కసారిగా నిలబడిపోయి “నిజమా ” ఆశ్చర్యపోతూ అడిగాడు

“నిజమేరా ” చెప్పాడు

” మరి నాకెప్పుడూ చెప్పలేదే” మల్లీ తిరిగి ప్రశ్నించాడు

“ఇందులో చెప్పేదానికేముంది అప్పుడేదో అట్టా జరిగింది ”

“మీ అమ్మా అయ్యా నిన్ను బడికి పంపించారా ” ఇంకా నమ్మకం కుదరనట్లు అడిగాడు

“వాల్లు పంపించలా ….. బడిలో అయ్యోర్లొచ్చి తీసుకెల్లారు ”

“అదెట్టా …”

“అప్పుడేదో పండగంట …. అదేంపండగబ్బా ” అని తల గోక్కుంటూ కొంచం సేపు ఆలోచించుకుని ” ఆ అదే చదువుల పండగ , ఆ పండగప్పుడు పిల్లలు పనిలోకిపోకూడదని గవర్నమెంటోల్లు రూలు పెట్టారు అందుకే సేటు ఆ వారంరోజులు సెలవిచ్చాడు మా అయ్య వేరే గత్తెంతరం లేక బడికి పంపించాడు

“చదువుల పండగా ?” నేనెప్పుడూ వినలేదే ఇది అడిగాడు కిట్టిగాడు

“నేనుకూడా అప్పుడే విన్నా … అంతక ముందుగానీ ….. ఆ తరువాతగానీ ఎప్పుడూ ఇనలా ”

“మరి అన్నీ పండగలూ పెతేడూ వత్తయి కదా మరి ఈ పండగ రాదా … ? ” అమాయకంగా ప్రశ్నించాడు

“అదే నాకూ అద్దం కావటల్లా అన్నీ పండగల్లా అది పతేడూ రావడంలేదు ఎందుకో నాకయితే తెలియదు ” చెప్పాడు

“అయినా మనం బల్లోకని వెల్తే ఇంట్లో కూడెలా వత్తదిరా చెప్పు మీ అమ్మా మాయమ్మా నాలుగిల్లలో పాసిపని చేసి ఒకపూట వాల్లు పెట్టే ముద్ద తీసుకొచ్చి మనకు పెడతండారు వాల్లు నెలకిచ్చే వందో రెండొందలో రెండో పూటా మూడో పూటా మన తిండికే సరిపోదు మరి రోగాలనీ దవాఖానాలని ఇంటి ఖర్చులని వీటన్నిటికీ డబ్బులెలా వత్తాయ్‌రా ”

“చదువుకున్నాక పెద్ద ఉద్దోగం చేత్తాం కదా, అప్పుడు మరిన్ని డబ్బులొస్తాయి కదా ” మరిన్నీ అనే పదాన్ని నొక్కిపలుకుతూ చెప్పాడు కిట్టిగాడు

” ఓ రి పిచ్చి మొద్దా పెద్ద చదువులు చదవాలంటె పుత్తకాలనీ , పీజులనీ డొనేషన్లనీ చాలా డబ్బులు కావాలి మన దగ్గర అన్ని డబ్బుల్లేవు అలా కాకుండా ఇప్పుడు బడికెల్లినా పెద్ద పీజులు కట్టే చదువుకొచ్చేటప్పటికి మనం మల్లీ ఇదే పని చెయ్యాల , అప్పుడు చదువు మద్దెలో మానేయడమంటే చాలా బాదగా ఉంటాది అందుకే ఇప్పుడునుంచే ఈ పని చేస్తే ఏ బాదా ఉండదు ” వివరంగా చెప్పాడు రాముడు

“ఇవన్నీ నీకెలా తెలుసురా “అడిగాడు కిట్టిగాడు

“మన కాలనీలో ఎంతమంది లేరు చదువుకుంటు చదువుకుంటు మద్దెలో మానేసినోల్లు వాల్లందరికీ చదువుకోవాలనే ఉం టుంది కానీ అందరూ పుత్తకాలకీ పీజులకీ డబ్బుల్లేక మద్దెలో మానేసినోల్లే ” చెప్పాడు రాముడు

“రేయ్‌ఏందిరా నీటకంగా పెళ్లి నడక నడుస్తున్నారు తొందర్రండి అవతల టైం అయిపోతుంది …. వచ్చి బండెక్కండి ” సూపర్వైజర్‌కేకతో ఈ లోకంలోకొచ్చారిద్దరూ

“అప్పుడే అడ్డాకాకికొచ్చామా ? ” ప్రశ్నించాడు కిట్టిగాడు

“ఆ …. పద వాడు తిడతాడు ” సూపర్వేజర్నుద్దేసించి చెప్పాడు రాముడు

“అదికాదురా …..” ఎదో చెప్పబోయాడు కిట్టిగాడు

“ఇప్పుడుకాదు ఆనక్క మాట్టడుకుందాం పద బండెక్కు ” అంటూ పరిగెత్తుకెల్లి బండెక్కాడు రాముడు, రామున్నే అనుసరించాడు కిట్టిగాడు

ఇద్దరూ ట్రక్కులోకెక్కారు ఆ ట్రక్కులో తమలాంటి పిల్లాలే ఎక్కువ మంది మొత్తం నలబై మందికి పైగా ఉన్న ఆ ట్రక్కులో ఓ ఏడెనిమిది మంది మాత్రమే పెద్దవాళ్ళుంటారు మిగిలిన అందరూ ఏడు సంవత్సరాల వయసునుండి పదిహేనేల్ల వయసు మగపిల్లలూ ఆడపిల్లలే వీల్లందరూ పనిచేసేది ఝూట్‌మిల్లులో ఎక్కిన కొంచం సేపటికే బండి కదిలింది.

బండి దిగి అందరూ లైనులో నిల్చున్నారు ఒక్కొక్కరి సంచి చెక్‌చేసి పేరు చెప్పాక రిజిస్టరులో హాజరు వేసుకుని లోపలకు పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు. గేటులో నుండి లోపలకు అడుగుపెట్టడంతోటే ఎవరి లైనుకు వాళ్ళు వెళ్ళిపోతారు లోపలంతా దుమ్మూ ధూళి. ఒక్కోసారి నాలుగైదు అడుగుల దూరంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించనంతగా దుమ్ము లేస్తుంది అదే పీల్చుతూ లోపల పనిచేసేవాల్లకు అవీ ఇవీ అందించడం ఉదయం నుండి సాయంత్రం వరకూ ఒక్కచోట నిలబడడానికి కానీ కూర్చుంటానికిగానీ ఖాలీ దొరకదు మధ్యాహ్నం అన్నం తినేందుకు కేవలం అరగంట మాత్రమే టైం ఉంటుంది ఇంతా కష్టపడితే వచ్చేది రోజుకు ఇరవై నుండి ముప్పై రూపాయలు అదీ వయసునుబట్టి

ఆరోజు మద్యాహ్నం అన్నం తినేటప్పుడు మల్లీ బడి ప్రస్తావన తెచ్చాడు కిట్టిగాడు “అదిసరే రా నువ్వు పొద్దున చెప్పావే బడి మానేసినోల్లంతా పీజులు కట్టలేకో పుత్తకాలు కొనలేకో మానేసారని మరి గవన్నమెంటోల్లు మనసుంటోల్లకు పీజులు కట్టించుకోరంట అదీకాక పుస్తకాలుకూడా ఇస్తారంటకద ” అడిగాడు

“ఒరే నీకు తెలీదురా పీజులు కొన్నిరోజులే కట్టించుకోరు పుత్తకాలిత్తారు కానీ నోడుసులు అవీ ఇవీ చాలా ఉంటాయ్‌కదా అవన్నీ మనమే కొనుక్కోవాల అయినా ఆల్లు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నీకివన్నీ తెలియదు ర అనవసరంగా బడిగురించి ఆలోచించకుండా పని చేసుకో ఎక్కువాలోసిత్తే పిచ్చెక్కుద్ది ”

“అవున్రా నాకు బడి పిచ్చెక్కింది ”

“అరే కిట్టిగా నీకో విషయం చెప్తా వింటావా మనం ఎంత అనుకున్నా చదువుకోలేము నేనూ చదువుల పండగప్పుడు బడికి పోయినప్పుడు ఎంతో ఆనంద పడ్డా ఇక నా జీవితం మారిపోయింది అందరిలా నేనుకూడా చదువుకోవచ్చు అని కానీ ఏమయింది వారం గడిచాక ఆ పండగ అయిపోయాక మల్లీ బడికిపోతానంటే మా అమ్మా, అయ్యా ఒప్పుకోలేదు చదువుల పండగప్పుడు పనిలో కి రానివ్వని సేటు పండగయిపోగానే ఇంటికి సూపెర్వేజర్ని పంపాడు పనిలోకి తీసుకురమ్మని పోనీ ఆ అయ్యోరన్నా వచ్చి మీ అబ్బాయిని బడికి పంపించండి అంటాడేమో అని ఓ వారం రోజులదాకా ఎదురుచూశా ఎమీ లాబం లేదు అందుకే అట్టాంటి పండగొచ్చినా ఈ సారి నేను బడికి పోదలుచుకోలేదు ”

“ఏ ఎందుకు ” అయోమయంగా అడిగాడు కిట్టిగాడు

“ఎందుకంటే వారం రోజులో పదిరోజులో పోతే కనీసం ఓ న మః లు కూడా రావు…తరువాత ఆ బడికి పోయిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ చానాలు బాద పడాల ”

ఆలోచనలో పడ్డాడు కిట్టిగాడు

ఇంతలో అన్నం టైం అయిపోయింది మళ్లీ ఎవరి పనిలోకి వాళ్ళు వెల్లిపోయారు

******

సాయంత్రం ఆరుగంటలకు మల్లీ ట్రక్కులో ఎక్కారు, ఇంటికొచ్చి నీల్లుపోసుకుని అన్నంతిని పక్కమీద పడుకున్నాడు, వాడి ఆలోచనంతా ఒక్కటే ‘ నేను బడికెల్లి చదువుకోవాలంటే ఏం చేయ్యాల ?,

‘అయ్యా బడికిపోతానే అంటే ఏడిచావ్‌ ఎదవ , బడి గిడి అన్నావంటే చమడాల్‌ తీత్తా అయినా చదివి నువ్వేం సేత్తావ్‌రా పని చేసుకుంటే నాలుగు డబ్బులన్నా వత్తాయి అని తన్నినంత పని చేత్తాడు పనికి పోతే నాలుగు డబ్బులొత్తాయ్‌అని చెప్పే ఆయనెందుకు పనికిపోడో అడుగుదామంటే నిజంగానే తంతాడేమో అని బయం, ఆ పసాదు గాడు చేసినట్టు చదువుకోసం దొంగతనం చేసి జైలుకెల్తే ? వచ్చాక అందరూ దొంగోడంటారు అదీకాక అమ్మ నన్ను చూడకుండా ఉండలేదు మరేం చేయాల, తెల్లారే లోగా ఏదో ఒకటి చేయ్యాలంతే ‘ ఆలోచిస్తా నిద్రలోకి జారుకున్నాడు కిట్టిగాడు

“అమ్మా నేను బడికి పోతానే , అందరిలా చదువుకుని పెద్దయ్యాక నిన్ను మారాణిలా చూసుకుంటానే నన్ను బడికి పంపవే నీకు దణ్ణం పెడతా

చూడవే అందరు పిలకాయలు బడికెల్లోచ్చి ఎంచగ్గా ఆడుకుంటున్నారు నేనలా ఆడుకోనే ఈ టైములో ఏదన్నా పనిచేసి నాలుగు డబ్బులు తెత్తానే , ఎప్పట్లాగే నీకు సాయంగా ఉంటానే నీకు పుణ్ణెముంటదే అయ్యకు ఏదోకటి చెప్పి నన్ను బడికిపంపవే … ” మొదట్లో వాడేమంటున్నాడొ అర్దం కాకపోయినా పదే పదే ఈ విషయాన్నే కలవరిస్తుండడంతో ఒక్కసారి కళ్ల వెంట నీరు కారడం మొదలయింది లచ్చమ్మకి నిద్దర్లో ఏడుస్తున్న కిట్టిగాడి పక్కనే కూర్చుని వాన్ని తన ఒల్లో పడుకో పెట్టుకుని వాడికల్లు తుడుస్తూ ” ఏమి చెయ్యనురా నేను …చావనా చెప్పు, మీ అయ్య ఏదయినా పని చేత్తే నువ్విలా కట్టపడాల్సిన పనేముంది ఆడు పని చెయ్యడు నేను తెచ్చే సొమ్ము మనం తింటానికి సరిపోదు కన్న కొడుకు చదువుకుంటానంటే బడికి పంపలేని దరిద్రురాలి కడుపున పుట్టావు రా ఈ జనమకి మీ అయ్యా మారడు , మనకీ కట్టాలూ తప్పవు, కనీసం వచ్చే జనమలో అన్నా బడికి పంపించే చల్లని తల్లి కడుపున పుట్టి నీ కోరిక తీర్చుకో ” అంటూ తాను ఏడుస్తూనే వాన్ని సముదాయిస్తుంది లచ్చమ్మ.

******
ఉదయం నిద్రలేచి పక్కమీద కిట్టిగాని కోసం చూసింది లచ్చమ్మ ఇంటి చుట్టుపక్కలవెతికి కనిపించిన వాల్లందరినీ అడిగింది ఎవరూ చూడలేదనడంతో గుండెలు బాదుకుని ఏడుస్తుంది.
-------------------------------------------------------
రచన: కె . యస్ . వరప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

Friday, March 22, 2019

రంగులూ మాటాడతాయి!


రంగులూ మాటాడతాయి!




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి..............

గీతలూ గీయని, రంగులేవీ అద్దని పటవస్త్రం
జీవితమెలా అవుతుంది?
అర్థమయో అర్థంకాకో
కొన్ని గీతలు గీయాలి
కొన్ని రంగులు అద్దాలి

గీత గీసే ముందూ రంగులద్దేముందూ
ఒకింత పరికించుకో
ఆకసానికి ఆకుపచ్చనీ
గడ్డిపరకకు నీలాన్నీ అద్దకు
నవ్వుకూ కన్నీటికీ
ప్రతి రంగుకూ ఓ భాష వుంటుంది
కొంచెం గమనించుకో

ఉన్నాయి కదా రంగులని
ఊరికే అతిగా పులమకు
కోపం మరింత ఎర్రబడినా బాగోదు
నవ్వులు తెల్లబడినా బాగోదు

ఇన్ని మనసుల ప్రపంచంలో
ఎన్నో కష్టాలూ సుఖాలూ
నవ్వులు ఏడుపులూ
ఈ రంగులన్నిటినీ చక్కగా కలుపుకో

ఆ గుసగుసలు పోయే గాలి పాటని
అదుగో ఆ మెరుపు నవ్వు చూపుని
ఈ హోరుగాలి గుండె బరువును
కలగలిపి వేసిన చిత్రాన్నలాగే
వదిలేయకు

గుండె అంగీలా చుట్టుకో
నవ్వుల పటంగా కట్టి
కనీసం ఒక్కరితోనైనా పంచుకో
---------------------------------------------------------
రచన: విజయ్ కోగంటి, 
ఈమాట సౌజన్యంతో

Thursday, March 21, 2019

రి సైకిల్


రి సైకిల్




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.................

రంగనాథానికి పేపర్లు, అవే దినపత్రికలు అతి జాగర్తగా దాచి నెలాఖరుకి “పాతపేపర్లు కొంటాం, పాత డబ్బాలు కొంటాం” అని అరుచుకుంటూ వచ్చే గడ్డం సాయిబ్బు కోసం ఎదురుచూడడం అక్కడ ఉండేరోజుల్లో మామూలే!

ఆ రోజుల్లో పేపర్లు అమ్ముకుంటే వచ్చే డబ్బులు వాడికి కనీసం వారం రోజులకి సిగరెట్ల ఖర్చుకి సరిపోయేది. అందుకని, వాళ్ళ ఇంటిపక్కన కోమట్ల ఇంట్లో అద్దెకుండే గాంధీ స్కూల్ టీచరమ్మ గారు పేపరు అడిగి తీసుకోపోతే, తిరిగి ఇచ్చేవరకూ వదిలిపెట్టేవాడే కాదు. ఈ పేపర్లు అమ్మిన డబ్బుల జమా ఖర్చు చెప్పమని వాడి అమ్మగారు కానీ, నాన్న గారు కానీ, అడిగే వారు కారు. రంగనాధం తమ్ముడు రామచంద్రం బాగా చిన్నవాడు. వాడికి రెండు చాక్లెట్లు కొని ఇస్తే వీడి సిగరెట్ల విషయం కూడా గప్చిప్ రహస్యమే. అంతేకాదు. అప్పుడప్పుడు, ఎవరి ఇంటిముందైనా పేపరు పడి వుంటే, అటూఇటూ చూస్తూ, కాలితోతన్నుకుంటూ ఏమీ ఎరగనట్టుగా నటిస్తూ వాళ్ళ పేపరు ఎత్తుకొచ్చిన రోజులు కూడా లేకపోలేదు. ఈ కళలో ఆరితేరిన వాడు రంగనాధం గురువు చిన సుబ్బయ్య చౌదరి. చిన సుబ్బయ్య చౌదరే రంగనాధానికి సిగరెట్లు కాల్చడం నేర్పిన గురువు కూడాను.

రోజూ పొద్దున్నే విస్సిగాడికి తోడుగా, రంగనాధం, చిన సుబ్బయ్య చౌదరీ కోట దిబ్బకింద పెరుగు చెట్టు దగ్గిరకి వెళ్ళేవాళ్ళు. పెరుగు చెట్టు అంటే పెద్ద మర్రిచెట్టు. పొద్దున్నే, ఆచెట్టుకింద పక్కూరి గొల్లలు కుండల్లో పెరుగు తెచ్చి అమ్మే వాళ్ళు. ఆ చెట్టుని ఊళ్ళో అందరూ పెరుగు చెట్టు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు కొట్టేసి సిమెంటు రోడ్డు వేసేశార్లేండి. విస్సిగాడు రోజూ వాళ్ళ ఇంటికి పెరుగు కొనటానికి పెరుగు చెట్టు దగ్గిరకి వెళ్ళే వాడు. రంగనాధం, చిన సుబ్బయ్యా విస్సిగాడికి తోడు! అసలు మతలబు ఏమిటంటే, ఆ వీధిలో షావుకార్ల ఇళ్ళముందు దినపత్రికలు దొరికితే ఎత్తుకోపోవడానికి వీళ్ళిద్దరూ విస్సిగాడితో వెళ్ళేవాళ్ళు. విస్సిగాడు, వీళ్ళిద్దరినీ తోడుదొంగలని ఆక్షేపించేవాడు, నవ్వుతూ. అవి ఆ రోజులు. మిడిల్ స్కూలు, హైస్కూలు కెళ్ళే రోజులు. మహమంచి రోజులు.

రంగనాధం కాలేజీ రోజుల్లోనూ, ఆ తరువాత రెండేళ్ళు అడ్డగాడిలాగా తిరిగిన రోజుల్లోనూ, రాజుగారితో స్నేహం అయ్యింది. ఆయన అలవాటు చేశాడు, మోహన రావు పెట్టిన కనకదుర్గా స్వీట్ హోం లో మెత్తని పకోడీలు ఆనవాయితీగా కొనుక్కో తినడం. రాత్రి పదికొట్టంగానే అక్కడ చేరేవాళ్ళు, లెక్కల మేష్టారు, రావుగారు, రాజు, లక్ష్మణాచార్యులూ, రంగనాధం. పకోడీలు కాదు ముఖ్యం. ఆ పకోడిలు కట్టిన పొట్లం కాయితం. ఆ కాయితంలో వున్న పాత వార్తో, అదృష్టంబాగుండి ఆదివారం పేపరైతే కథో, సగం చిరిగిపోయిన ఆథునికకవితో పకోడీల నూనెలో తడిసి చదవడానికి మహ సొంపు గా వుండేవి. రాజు తనలో తనే చదువుకునే వాడు. రంగనాధం మాత్రం పైకి ఘట్టిగా చదివేవాడు. ఆ రోజుల్లో పకోడీ పొట్లం కట్టిన కాయితంలో చదివిన పద్యం టైటిల్ “వేరు వేరు విధమ్ముల ఆరు కారు మేఘమ్ములు,” ఇప్పటికీ గుర్తుంది, రంగనాధానికి. నూనె అంటక పోతే, పకోడీ కాయితాలు కూడా భద్రంగా దాచేవాడు, రంగనాధం, అలవాటుగా!

2.

పైచదువులు నెపంతో రంగనాధం అమెరికాకి వచ్చాడు. వచ్చిన కొత్త రోజుల్లో, అబ్బో చాలాకాలం క్రిందట లెండి, ధాతనామ సంవత్సరం అన్నా దిగులు లేదు– పాత అలవాటు ప్రకారం దినపత్రికలన్నీ దాచి వుంచేవాడు. అంతే కాదు. అల్యూమినియం డబ్బాలు అతి జాగ్రత్తగా పోగు చేసేవాడు. ఉన్నది, లింగూ లిటుకూ అనుకుంటూ ఒక్క గది. ఒక్క మంచం. ఓ చిన్న ఫ్రిజ్. రెండు ఎలట్రీ పొయ్యిలు. ఇదీ మనవాడి సంసారం. అన్నీ అందులోనే అన్న సామెతలా ఒక మూల పేపర్లు, మరోమూల డబ్బాలు. రంగనాధం పేపరు కొనేవాడు కాదు. పక్క గదిలో నర్సింగ్ స్కూలు పిల్లలు పేపరు తెప్పించేవాళ్ళు. వాళ్ళు చదివింతర్వాత పేపరు రంగనాధానికిచ్చేవాళ్ళు. ఆ పేపర్లు భద్రంగా దాచేవాడు. అబ్బో! అమెరికాలో పేపరు మనకిమల్లే కరువుగా ఉండదు. ఆదివారం పేపరయితే, కనీసం అర్థ మణుగు పైచిలుకే ఉండేది. ఈ పేపర్లు, డబ్బాలూ, ముఖ్యంగా పేపర్లు ఎక్కడికి పట్టికెళ్ళి అమ్మాలో రంగనాధానికి తెలియదు. ఏవరినన్నా అడగడానికి, మహమాటం… నామర్దా.

ఇలా వుండగా ఒక రోజున రంగనాధానికి విపరీతంగా జలుబు చేసి జ్వరం వొచ్చింది. ఫ్లూ అన్నారు, పక్క రూములో నర్సింగ్ పిల్లలు. రెండురోజులు స్కూలు కెళ్ళ లేదు. అప్పుడు ప్రొఫెసర్ జాన్, రంగనాధాన్ని చూడటానికొచ్చాడు. గది లోకి రాగానే ఆయనకి అయిదడులెత్తు కుప్పగా దుమ్ముకొట్టుకొని పేపర్లు కనిపించాయి.

“ఈ పేపర్లు పారేయలేదేమిటీ? ఈ దుమ్ము మూలంగానే నీకు జలుబు జ్వరం వచ్చాయి. Get rid of them, ASAP,” అని చెప్పి, కాఫీ మరకలు పడ్డ సోఫామీద ఓ మూల కాస్సేపు కూచొని, Get well soon అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక రెండు ఘంటలు తిరక్కముందే ప్రొఫెసర్ రావు గారొచ్చారు, రంగనాధాన్ని చూడటానికి. రావు గారు తెలుగు వాడే! ఇండియాకి స్వరాజ్యం రాకముందే అమెరికాకి వొచ్చేశాడు. ఒక తెల్లావిడని పెళ్ళాడాడు; ఇద్దరు పిల్లలు కూడాను!

ఎంతయినా తెలుగు వాడే కదా! ఆయన ఇట్టే పసిగట్టేశాడు, రంగనాధం పేపర్లు ఎందుకు దాస్తున్నాడో. “ఏమిటి? ఈ పేపర్లు మనదేశంలో లాగా అమ్ముదామని దాస్తున్నావా?” అని నవ్వుతూ అడిగాడు. అవునన్నట్టు తలూపాడు, రంగనాధం. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ, “ఒక టన్ను పేపరు పోగుచేస్తే, బహుశా, రెండు డాలర్లు వస్తాయి. అదికూడా, నువ్వు ఈ పేపర్లు తీసికెళ్ళి ఎక్కడో recycling సెంటర్లో ఇస్తేనే. ఈ లోపుగా నీగది ఈ పేపర్లతోటీ దుమ్ముతోటీ నిండిపోతుంది,” అని మెత్తగా చివాట్లు పెట్టాడు.

నాలుగు రోజులు పోయింతర్వాత, బాలచందర్ అనే గుజరాతీ స్నేహితుడొస్తే వాడి సాయం తీసుకోని రంగనాధం తను పోగుచేసిన పేపర్లూ, అల్యూమినియం డబ్బాలు వాళ్ళ అపార్ట్మెంటు వెనకాల వీధిచివర పెద్ద చెత్త డబ్బాలో పడేశాడు, చాలా బాధ పడుతూ! Recycling Centers గురించి కొంచెం పరిశోధన కూడా చేశాడు, రాడ్నీ స్మిత్ సాయంతో. పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే, ఈ సెంటర్లకి ప్రభుత్వం డాలరు కర్చుకి ఎదురు నాలుగు డాలర్లిస్తుందిట. అంటే, సెంటరు పోగుచేసిన పేపర్ల విలువ ఒక డాలరయితే, ప్రభుత్వం వారు ఈ సెంటరు నడిపే కంపెనీకి నాలుగు డాలర్లు ఇస్తారట! ప్రభుత్వం సొమ్ము తినేయడానికే ఈ సెంటర్లు, పుట్టగొడుగుల్లా పుట్టేశాయి. అప్పుడు జ్ఞానోదయం అయ్యింది, రంగనాధానికి; ఇంత గొప్ప తెల్ల దేశంలో కూడా, వ్యాపారస్తులందరూ ప్రభుత్వాన్ని ఎడా పెడా రోజూ దోచుకుంటారని! ఒక్క ఆదివారం మినహా!!

నిజం చెప్పొద్దూ! ఇప్పటికీ ఈ దేశంలో పేపరు కొనడం దండగే అని అనిపిస్తుంటుంది, రంగనాధానికి. దానికి కారణాలు వేరే ఉన్నాయనుకోండి — కానీ, ఇప్పటికీ ప్రతిరోజూ పేపరు తెప్పించడం, పేజీలు అన్నీ యధావిధిగా తిప్పి బాధపడుతూనే ఆ పేపర్ని చెత్త బుట్టలో పారెయ్యడం మానలేదు.

3.

రంగనాధానికి చదువు పూర్తికావడం, పెళ్ళాం రావడం, అపార్టుమెంటునించి చిన్న ఇంటికి మారడం అన్నీ ‘క్లాక్ వర్క్’ లా జరిగిపోయాయి. ఓ నాలుగేళ్ళతర్వాత సంసారం పెద్దదవటంవల్ల, చిన్న ఇంటినుంచి ఇంకొంచెం పెద్ద ఇంటికి మారడం జరిగిపోయింది. ఇల్లు పెద్దదయ్యేకొద్దీ నానా చెత్తా ఇంట్లో పోగుపెట్టడం మొదలెట్టాడు. పుర్రెతో పుట్టిన బుద్ధికదా, ఇప్పటికీ ఏదీ పారెయ్య బుద్ధికాదు, రంగనాధానికి. చదువుకునే రోజుల్లో కొనుకున్న డాలరు చొక్కాలు, అరిచిచచ్చినా పట్టని పాలియెస్టర్ పంట్లాములు, జోళ్ళు, కాలిజోళ్ళు, కంటి జోళ్ళు, అంకెలూ అక్షరాలూ చెరిగిపోయిన రకరకాల టెలిఫోన్లు, నాబు ఎంతతిప్పినా స్టేషను మారక గీ పెడుతూ మారాం చేసే చిన్న చిన్న రేడియోలు, వగైరా వగైరా గరాజ్ లో పోగు పెడుతూనే వున్నాడు. రంగనాధం భార్య రుక్మిణమ్మకి అప్పుడప్పుడు విసుగెత్తి బెదిరిస్తూనే వుండేది, “అవన్నీ ఎప్పుడో గారబేజ్ లో పారేస్తా,” అని. అలా అన్నప్పుడు రంగనాధానికి చచ్చే కోపం వచ్చేది. వెంటనే, “అవేం నిన్ను కరుస్తున్నాయా?” అని చీదరించికునేవాడు.

చూస్తూ ఉండంగా మరో అయిదేళ్ళు గిర్రున తిరిగొచ్చాయి. వాళ్ళ అమ్మాయికి, అదే దాన్ని పాపాయి అంటారు; దానికి నాలుగేళ్ళొచ్చాయి. అదృష్టం బాగుందో ఏమో వాళ్ళు మరో పెద్ద ఇంట్లోకి మారారు. ఇంటితో పాటు, రంగనాధం పోగుచేస్తున్న వస్తుసముదాయం కూడా కొత్త ఇంటికి చేరింది. ఈ సారి, గరాజ్ లోనే కాకండా, బేస్మెంటులో సగం రంగనాధం సామానుతో నిండి పోయింది. ఇల్లు పెద్దదయేకొద్దీ, అక్కరలేని చెత్త కూడా పెరుగుతుంది. ఇది అమెరికన్ ఆచారం! రంగనాధానికి ఈ వస్తు సముదాయమంతా భద్రంగా దాచి పెట్టడం సంప్రదాయం!

ఈ అయిదేళ్ళల్లో రంగనాధం, రుక్మిణీ లకి ఒక కొత్త వ్యాపకం వచ్చింది. ఎక్కడ గరాజ్ సేల్ పెట్టినా, సరదాగా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. అదొక హాబీ! ఇంటికొచ్చి, పొట్ట చెక్కలయ్యేట్టు తెగ నవ్వుకునేవాళ్ళు. విశేషమేమిటంటే, పెద్ద పెద్ద ఇళ్ళున్న subdivision లలో, కనీసం మూడు నెలలకోసారి గరాజ్ సేళ్ళు వస్తాయి, అదేమి చోద్యమోగానీ, పై స్థాయిలో ఉన్న మధ్య తరగతి కుటుంబీకులుండే పేటల్లోనే ఈ గరాజ్ సేళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి; — సంపాదన పెరగడం వల్ల, ఇళ్ళు పెద్దవి కావడంవల్లా, కావలసినంత తీరిక ఉండడం వల్లా కాబోలు. రంగనాధం, వీళ్ళని “పనిలేని మంగళ్ళు” అని అంటే, రుక్మిణి , “ఈ గరాజ్ సేల్స్ పెట్టుకునే ఆడంగులందరూ, రోజూ పేపర్లో సేళ్ళు చూసి, మురిసిపోతూ షాపింగుకి పోయి కావలనే నానా చెత్త కొంటారు, రాబోయే గరాజ్ సేల్ కోసమా అన్నట్టు,” అని అనేది.

కాకపోతే ఏమిటి? ప్లాస్టిక్ దువ్వెనలూ, వాడిన రంగు బ్రష్షులు, థాయిలాండులో అల్లిన వెదురు బుట్టలు, రీడర్స్ డైజెస్టు వాళ్ళు కుదించిన చచ్చు నవలలూ, పిల్లల టీ షర్టులు, అమ్మగారి డ్రెస్సులూ, అయ్య గారు వాడేసిన చొక్కాలు, సగం వాడిన షాంపూలు, కొవ్వొత్తులు పెట్టే గాజు బుడ్డీలు, పాత వంట గిన్నెలు, గీతలు పడిన నాన్ స్టిక్ బూరెల మూకుళ్ళు, మొక్కలు ఎండిపోయి ఉసూరు మంటూన్న పూల కుండీలూ, రకరకాల సైజుల్లో లంబాడీ పూసల దండలు, అరిగిపోయిన మెల్మాక్ ప్లేట్లూ, కప్పులూ సాసర్లూ, గాజు గ్లాసులూ….ఒకటేమిటి, అన్ని రకాల సరంజామా డ్రైవ్ వేలో పెట్టుకొని రోజంతా పడగాపులు పడతారు, ఈ ముష్టి సామాన్లు అమ్ముకోటానికి. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ సామాన్లు ఆ పేటలోనే ఒక ఇంటినుంచి మరోఇంటికి మారుతూ ఉంటాయి, అని రుక్మిణి చేసిన థీసిస్. అప్పుడప్పుడు, రంగనాధాన్ని ఏడిపించటానికో యేమో, “ఏమండోయ్ మీరు పోగుచేస్తున్న తుక్కంతా కూడా ఎప్పుడో గరాజ్ సేల్ పెట్టి అమ్మేస్తా! పీడ విరగడయి పోతుంది,” అని నవ్వుతూ బెదిరిస్తూనే ఉండేది. రుక్మిణి ఏమిచెప్పినా రంగనాధం “మీరజాలగలడా,” అన్నట్టు జవదాటకుండా ఉండే వాడేకానీ గరాజ్ సేల్ మాత్రం సాగనియ్యలేదు. ఆవిషయం రుక్మిణికి కూడా తెలుసు.

4.

“మన neighborhood లో పిల్లలందరూ సాయంకాలం పూట సైకిల్ తొక్కు కుంటున్నారు; పాపాయికి కూడా ఒక సైకిల్ కొనితేవాలి,” అని ముచ్చట పడిపోయేది. “దానికి నాలుగేళ్ళు కూడా లేవు; ఇప్పుడు సైకిల్ తొక్కడం చాలా ప్రమాదం. ఏ కాలో చెయ్యో విరిగితే, మధ్య మనం చావాలి,” అని చాలా సార్లు గసురుకున్నాడు, రంగనాధం. అంతేకాదు. “ నేను సైకిలు పదిహేనోయేడు వచ్చేవరకూ నేర్చుకోలేదు. మన అమ్మాయికూడా, అంతే. That’s it,” అనే వాడు. అలా అన్నాడే కానీ, తనూ చూస్తున్నాడుగా, చుట్టుపక్కల పిల్లలందరూ పాపాయి ఈడు వాళ్ళే! “Keeping up with the Joneses! అమ్మాయికి సైకిల్ కొనాలి,” అని తనకీ మనసులో వుంది.

ఒక శనివారం రంగనాధం ఆడపిల్ల సైకిలు కోనటానికి ముహూర్తం పెట్టుకున్నాడు. దోవలో లక్ష్మి, ప్రసాదరావులని చూసి చాలారోజులయ్యిందని వాళ్ళ డ్రైక్లీనింగ్ కొట్టు దగ్గిర ఆగాడు. ఆప్యాయంగా లక్ష్మి పీజ్జా తెప్పించిపెట్టింది. ఆవిడతో, మాటవరసకి అన్నాడు; “ పాపాయికి సైకిలు కొనమని రుక్మిణి చంపేస్తోంది. ఇవాళ సియర్స్ కెళ్ళి సైకిల్కొందామనుకుంటున్నా,” అని. వెంటనే లక్ష్మి, “ కొనడం ఎందుకండీ! మా ఇంట్లో ఆడపిల్ల సైకిలు ఊరికే గరాజ్ లో పడి ఉన్నది, దుమ్ము కొట్టుకుంటూ. దాన్ని తీసుకో పొండి,” అన్నది. గరాజ్ అన్న మాట వినంగానే, రంగనాధానికి వాళ్ళ పేటలో గరాజ్ సేళ్ళే గుర్తుకొచ్చాయి. “అయితే లక్ష్మి గారూ! మీ ఇంటిముందు గరాజ్ సేల్ పెట్టి అమ్మెయ్యక పోయారా?” అన్నాడు, నవ్వుతూ. “ఇంకా నయం! అదొక్కటే తక్కువయ్యింది, మన దౌర్భాగ్యానికి,” అన్నది లక్ష్మి. వెంటనే కొట్లో పనిచేసే నల్ల కుర్రాడిని పంపించి సైకిలు తెప్పించింది. కానీ కర్చు లేకండా అమ్మాయికి సైకిలు దొరికినందుకు ఉబ్బిపోయాడు, రంగనాధం. వెంటనే, “ Thanks Lakshmi gaaru. నాకు కర్చు తగ్గించారు, అంతకన్నా ముఖ్యం శ్రమ తగ్గించారు,” అని, మిగిలిన పీజ్జా పూర్తిగా తినేసి బయల్దేరాడు.

సైకిలు చూడటానికి చక్కగా వుంది. గులాబిరంగు ఫ్రేము, బరువుగా రబ్బరు చక్రాలు, వెనక చక్రానికి అటూ ఇటూ రెండు బుల్లి చక్రాలు; ఊదా రంగు సీటు, బంగారం రంగు హేండిల్బార్ కవర్లు, వాటి చివర రెండువైపులా కొరడా చివర వుండే తోలు పటకా జూళ్ళు, ముందు చక్రంపైన హేండిల్ బార్ కి తగిలించి ఒక చిన్న ప్లాస్టిక్ బుట్ట…. రంగు కొంచెం మాసినట్టున్నది కానీ, అన్నీ సవ్యంగానే ఉన్నట్టు కనిపించాయి. కారు ట్రంకులో సైకిలు పెట్టుకొని, ఆల్బర్ట్ ఇంటికెళ్ళాడు. ఆల్బర్ట్ పాత వస్తువులన్నీ చక్కగా బాగు చేసి కొత్తగా కనిపించేట్టు చెయ్యగలడు. వాడి గరాజ్ అంతా ఒక పెద్ద వర్క్ షాపే!

సైకిలు దింపి, ఆల్బర్ట్ కి విషయమంతా విప్పి చెప్పాడు. వాడు, సైకిల్ని, శుభ్రంగా వాటర్ జట్ తో కడిగి, సీటుకింద, వెనకా గులాబీ రంగు పూసి, తోలు జూలు పటకాలని అదేదో నూనె పులిమి శుభ్రం చేసి, సీటు వెనకాల తెల్లటి పూసలదండ కట్టి, బ్రహ్మాండంగా తయారుచేశాడు, మా పాపాయి సైకిలుని.

ఇంటికి రాంగానే రుక్మిణి ఖస్సు మంది; చెప్పా చెయ్యకండా బజారుకి పోయినందుకు. విజయోత్సాహంతో, ట్రంకులోంచి, సైకిలు చూపించాడు, రంగనాధం. “ఈ పాత సైకిలు ఎక్కడనుంచి పట్టుకొచ్చారు? కొంపదీసి ఎక్కడో గరాజ్ సేల్ లో కొనలేదుకదా?” అని కసురుకుంది. “ఇది పాతదంటావేమిటి? నాకు కొత్తగానే కనిపిస్తోంది,” అని సర్దుకున్నాడు, రంగనాధం. “దాని మొహం చూడగానే తెలియటల్లా? పాతదని,” అన్నది రుక్మిణి. డ్రైక్లీనింగు లక్ష్మి గారిచ్చారు అని చెప్పంగానే, “పోనీలే! మూణ్ణెల్ల తర్వాత ఈ సైకిలు పాపాయికి ఎల్లాగో పనికే రాదు. దానికి సైకిలు బాగా తొక్కడం వచ్చిన తరువాత, మరొ పెద్ద సైకిలు, కొత్తది కొనిపెడదాం లెండి,” అని సర్దుకుంది. ఎంతయినా లక్ష్మి తన జట్టు కదా!

ఆరునెల్లు తిరక్కుండానే, పాపాయికి అసలు సైకిలంటేనే మొహం మొత్తిపోయింది. రుక్మిణికీ ఆ కాస్త మోజూ తీరిపోయినట్టుంది. మళ్ళీ సైకిలు మాట ఎత్తలేదు, ఏ ఒక్కరూనూ!

5.

వాళ్ళ వీధి చివర ఇల్లు మరియా, రాయ్ అనే మళయాళీలు కొనుక్కున్నారని తెలిసి, వాళ్ళని చూడటానికి వెళ్ళారు, రుక్మిణి రంగనాధం. రాయ్ సాఫ్ట్ వేర్ ఇంజనీరు, మరియా ఐ.సీ. నర్సు. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు. పెద్దదానికి, నాలుగేళ్ళు రెండోదానికి రెండేళ్ళు. చూడటానికి ఇద్దరూ ముచ్చటగా ఉన్నారు. రుక్మిణి వెంటనే వాళ్ళ పెద్ద అమ్మాయిని చేరదీసింది. మిగిలిన వాళ్ళనందరినీ వదిలిపెట్టి వాళ్ళిద్దరూ ఏవిటేవిటో మాట్లాడుకున్నారు. “ మా ఇంటికి రా! నీకు సైకిలిస్తా,” అనేసింది రుక్మిణి. ఆపిల్ల, “Thank you Auntie! అంటూ కావలించేసుకుంది. అంతే! లక్ష్మిగారి దగ్గిరనుంచి ఊరికే వచ్చిన సైకిలు, పాపాయి సైకిలు తొక్కడం నేర్చుకున్న ముద్దుల సైకిలు, దాని మొదటి సైకిలు, రుక్మిణి దానం చేసేసింది. రంగనాధానికి చచ్చే కోపం వచ్చింది; ఇదే తనైతే, ఆ సైకిలుని గరాజ్ లోనో, బేస్మెంట్ లోనో భద్రంగా దాచి ఉంచేవాడు. ఎంతయినా అది వాడి కూతురి సైకిలు కదా!

మరో నాలుగేళ్ళు గడిచాయి, రంగనాధానికి, రుక్మిణికి. అమ్మాయి పెద్దదవుతున్న కొద్దీ, రంగనాధానికి దాచే సరంజామా పెరగడం మొదలెట్టింది. పాపాయి వేసిన బొమ్మలు, చేసిన లక్క పిడతలు, దాని పుస్తకాలు, లంచ్ డబ్బాలూ, అన్ని అతిజాగ్రత్తగా పోగు పెడుతున్నాడు. ఇప్పుడు ఈ పోగుపెట్టడం అతనికి హాబీ కాదు; ఒక వ్యసనంగా తయారయ్యింది. ఏ వస్తువూ తనకి అడ్డు రానంతవరకూ, రుక్మిణి జోక్యం చేసుకోదు. మనకెందుకులే అని, చూసీ చూడనట్టు ఊరుకునేది. ఇది నిజంగా పెద్ద compromise అనే చెప్పాలి!

ఇలా రోజులు గడుస్తూ వుండగా, రుక్మిణి మేనల్లుడు, వాడి భార్య, ఐదేళ్ళ కొడుకూ, వెరసి ముగ్గురూ ఇండియానుంచి దిగుమతయ్యారు. వాళ్ళిద్దరూ ఇంజనీర్లే! వాడికి ఇక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం వచ్చిందిట; వాడి భార్య కడుపుతోఉన్నది. అంచేత, ఇంటిపట్టునే ఉంటుంది. వాళ్ళ పిల్లడు పొట్టిగా బొద్దుగా ఉంటాడు. బుద్ధిమంతుడే కాని, సైజు చూస్తే పదేళ్ళవాడిలా ఉంటాడు. వాడు, ఇరుగుపొరుగు పిల్లలందరి తోటీ మచ్చికగా చేసుకోవాలంటే, వాళ్ళలాగా సాయంత్రం వాళ్ళతోటి పేవ్మెంట్లమీద సైకిలు తొక్కాలసిందే నని రుక్మిణి హుకుం జారీ చేసింది.

“ఏమండీ! మా మేమల్లుడి కొడుక్కి ఒక సైకిలు కొనిపెడదాం. ఏమంటారు?” అని అంది, రంగనాధంతో. “చూద్దాంలే! ఇప్పుడేంతొందర?” అన్నాడు రంగనాధం. “అల్ల అంటారేవిటి? ఆ అబ్బిగాడు మా పెద్దన్నయ్య మనవడు. మా పెద్ద అన్నయ్య అంటే నాకు ఎంత ప్రాణమో మీకు తెలుసు గా. పైగా, ఆయనంటే మీకూ ఇష్టమేగా,” అని పాట పాడింది, రుక్మిణి. “సరే! సరే! చూద్దామన్నాగా!,” అంటూ తప్పుకున్నాడు రంగనాధం.

ఓ వారం తర్వాత, ఓ శనివారం నాడు, మరియా ఇంటిముందు డ్రైవ్ వే లో కారు కడుగుతూ రాయ్ కనిపించాడు. ఆగి, “హై” అంటూ, రాయ్ తో పిచ్చాపాటీ మొదలెట్టాడు. ఏదో సడెన్గా గుర్తుకొచ్చినట్టు ముఖం పెట్టి, “ హే రాయ్ మీఅమ్మాయికిచ్చిన సైకిలు ఎక్కడ పెట్టావ్?” అని అడిగాడు. “ ఓ! నాధ్! అదా. ఆ సైకిలు ఎప్పుడో గరాజ్ సేల్లో అమ్మేశా,” అన్నాడు, రాయ్. రంగనాధానికి రాయ్ గాడిని గొంతుపిసికి చంపేద్దామన్నంత కోపం వచ్చింది. తన దగ్గిర ఊరికే సైకిలు దొబ్బేసి, దాన్ని గరాజ్ సేల్ లో అమ్ముకుంటాడా? వీడికి ఎంత ధైర్యం? ఎంత కండ కావరం? అని అనుకుంటూ, వెర్రి మొహం పెట్టుకోని కోపంగా ఇంటికొచ్చాడు.

6.

మరో మూడు వారాలు గడిచాయి. రంగనాధం ఓ శుక్రవారం మధ్యాన్నం, ఆఫీసునుంచి కొంచెం తొందరగా వస్తూ, వాళ్ళ subdivision లోకి తిరిగాడు. మొట్టమొదటి వీధిలో గరాజ్ సేల్! ఆ వీధిలో రెండోఇంటి దగ్గిర డ్రైవ్వే లో ముందుగా గులాబిరంగు సైకిలు కనిపించింది, రంగనాధానికి. “ఈ సైకిలు మనదే! పాపాయి మొట్టమొదటి సైకిలు!” అని అనుకుంటూ, కారు ఆపి, ఇంటిముందు కూర్చున్న తెల్లావిడతో పరిచయం చేసుకొని, “ ఈ సైకిలు ఎంతకిస్తారు?” అని అడిగాడు. “పదిహేను డాలర్లు,” అన్నది ఆవిడ ముఖం ఎత్తకండానే. ఎండకి ఆవిడ ముఖం కందగడ్డలా తయారయ్యింది. “ఐదు డాలరిస్తా,” అన్నాడు రంగనాధం. ఆవిడ, ముఖం ఎత్తకండానే “O.K. Take it.” అన్నది. వెంటనే సైకిలు ట్రంకులోపెట్టుకొని, ఐదు డాలర్ల ముడుపూ చెల్లించి, తిన్నగా ఆల్బర్ట్ ఇంటికి బయలుదేరాడు.

“అనుమానం లేదు, ఈ సైకిలు పాపాయిదే! అది సీట్ వెనకాల దాని పేరు పి.ఆర్. అని బ్లేడుతో చెక్కింది. కావాలంటే చూడు,” అని ఆల్బర్ట్ తో జరిగిన కథ అంతా చెప్పుకున్నాడు. “ ఇదిగో, ఆల్బర్ట్ ఇటు చూడు. ఈ సైకిల్ కాస్త బాగుచేసి మా ఆవిడ మేనల్లుడి కొడుక్కి ఇద్దామనుకుంటున్నా. కాస్త నీ హెల్ప్ కావాలి,” అన్నాడు. “ఇది ఆడపిల్లల సైకిలు. దీని రంగు చూసి ఆ కుర్రాడు నాకొద్దు, ఈ పాడు ఆడపిల్లల సైకిలు, అంటాడు. రుక్కి సిస్టర్కి కోపం వస్తుంది, ఆ తరువాత నీ ఇష్టం,” అన్నాడు, ఆల్బర్ట్.

“అందుకేగా నీ సాయం కావాలనేది. దీని గులాబి రంగు గీకేసి, నల్ల రంగు వేద్దాం. దీన్ని, మొగపిల్లల సైకిలు గ తయారు చేద్దాం. ఏమంటవ్”? అన్నాడు రంగనాధం. “రేపు శనివారం. పొద్దున్నే రా. దీని పని పడదాం,” అన్నాడు ఆల్బర్ట్. రంగనాధానికి, ఎగిరిగంతేసి “యురేకా” అని అరుద్దామనిపించింది. ఇంటికొచ్చి, రెండు బీర్లు పట్టించి, టీ.వీ. లో మునిగిపోయాడు.

మర్నాడు, పొద్దున్నే పదిగంటలకి ఆల్బర్ట్ ఇంటికెళ్ళి, పాపాయి సైకిలు మీద గులాబీ రంగంతా గీకి, ఎమరీ పేపర్తో శుభ్రంచేశాడు. ఆల్బర్ట్ నల్ల రంగు స్ప్రే చేశాడు, సీటుకి ప్లాస్టిక్ అంటించి. తోలు జూలు పటకాలు కత్తిరించి, హేండెల్ బార్ మీదున్న బుట్ట పీకేసి, ఒక సైకిలు బెల్లు తగిలించాడు. “ఆల్బర్ట్ నువ్వు గొప్ప ఆర్టిస్ట్ విరా,” అని రంగనాధం మెచ్చుకుంటూనే వున్నాడు. సరిగ్గ ఈ పని పూర్తయి, నల్ల రంగు ఆరడానికి అంతా వెరసి ఆరు గంటలు పట్టింది; చెరో ఆరు బీర్లు పట్టించారు, ఈ పేరుతో!

సాయత్రం ఐదు గంటలకి రంగనాధం ఇంటికి చేరాడు. ఇంటిముందు పోర్చ్లో రుక్మిణి, మేనల్లూడు, వాడి భార్య చాలా ఉత్సాహంగా రోడ్డుకి అటు ఇటు చూస్తూ, అబ్బిగాడితో “జాగర్త, జాగర్త,” అని ఉద్రేకంగా అరుస్తున్నారు. అబ్బిగాడు సరికొత్త సైకిలు పక్కకి వంచి, కుడికాలు యెగరేసి సైకిలెక్కి, తూటాలా దూసుకొ పోతున్నాడు, పేవ్మెంట్ మీద.

“ Honey! మేమంతా అబ్బిగాడిని సియర్స్ తీసికెళ్ళాం. అక్కడ వాడికి నచ్చిన ఈ సైకిలు కొన్నా. వచ్చే వారం వాడి పుట్టింరోజు. Advance గా అబ్బిగాడికి మన gift! పెద్ద ఖరీదేం కాదు; సైకిలు ఎనభై. దాన్ని బిగించి ఇవ్వడానికి పాతిక; Taxతో కలిపి మొత్తం నూట పదకొండు డాలర్లు,” అన్న ది రుక్మిణి.

గరాజ్లో కారు పెడుతూ, రంగనాధం తనుతెచ్చిన సైకిలు ట్రంకులోనే వదిలేశాడు. “రేపో మాపో, రుక్మిణి చూడకండా, గరాజ్ గోడకి మేకు కొట్టి ‘పాపాయి సైకిలు’ ఆ మెకుకి తగిలించాలి,” అని అనుకుంటూ ఇంట్లోకి చేరాడు, పిల్లిలా.
--------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, March 20, 2019

సగమే పూర్తయిన ఓ కవిత


సగమే పూర్తయిన ఓ కవిత




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి................

సమయం వుదయం 6:10
ఇంకా బద్ధకంగా పడకలోనే!
దిగి పగటి గడియారంలోకి
పరుగెత్తి ఏమీ చేయాలనిపించట్లేదు

పొద్దు తేరకుండానే
పడకగది బయట వేపచెట్టుమీద చేరి
అల్లరి చేసే పిట్టలు
గోలచేసీ చేసీ విసుగెత్తి వెళ్ళిపోయాయి.

సమయం 7:20
లేవాలనే అనిపించట్లేదు.
నన్ను తలుచుకునేవారూ
‘అన’వసరంగా నా కోసమే వచ్చేవారూ
కూడా ఎవరూ లేరు.

సగమే పూర్తయిన ఓ కవిత
అదుగో అలా నన్నే చూస్తూ అక్కడ,
రాత్రి కథ చెప్పమని అడిగి
చెప్పలేని స్థితికి అర్థంగాక
అలిగి
బుంగమూతితోనే నిద్రపోతున్న
బుజ్జితల్లీ,
నిర్విరామంగా ఎవరూ
పట్టించుకోకున్నా
అవసరపడి
తిరుగుతున్న పంఖా తప్ప
నన్నూ నామనసునూ
కదిలిస్తున్నవేవీ లేవిక్కడ!

సమయం ఎనిమిది కావస్తున్నట్లుంది
పరుచుకుంటున్న తెల్లటి ఎండా
వెచ్చనౌతున్న ఎండాకాలపు గాలీ
గుచ్చుకునీ గుచ్చుకోకుండా వుండే
రాత్రి నీవు కురిపించిన
మౌనమో మాటలో కన్నీరో నవ్వులో-
ఏదో లీలగా ఒక అలికిడి చేస్తూ…
---------------------------------------------------------
రచన: విజయ్ కోగంటి, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, March 19, 2019

మునులేం చేస్తారు నాన్నా?


మునులేం చేస్తారు నాన్నా?




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి....................

“మునులేం చేస్తారు నాన్నా?”

మా అమ్మాయి హైస్కూల్లో చదువుకునే రోజుల్లో తెలుగు వాచకం కూడా కొంత ఆసక్తి తోనే చదివేది. తెలుగు పాఠాల్లో ఋషులూ, మునులూ, వాళ్ల కథలూ వస్తూ ఉండేవి. ఇంట్లో అందరమూ చదివే చందమామ కథల్లోనూ అవే. ఆ రోజుల్లో తను ఒక ఆదివారం పొద్దున వాళ్ళమ్మ అల్పాహార పర్వం నడిపిస్తుండగా నన్ను ఇదుగో, ఈ ప్రశ్న అడిగింది. నిజానికి నాకూ తెలీదు.

“తపస్సు చేస్తారమ్మా!” అనేశాను.

“అలా తపస్సు చేస్తునే ఉంటారా?”

“ఆఁ! అరణ్యాలకు పోయి చాలా సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు.”

“చాలా సంవత్సరాలే! చేసి…?”

చిట్టీతకాయంత నా తలకాయలో ఒక కథ లాంటిది మెదిలింది. ఆ కథ చెప్పాలనిపించింది.

“చేసి ఇంటికి వస్తారు.”

“వచ్చి?”

“వచ్చింతర్వాత యేమవుతుందో చిన్నకథ చెబుతాను.”

నా గురించి మా అమ్మాయికీ, మా అమ్మాయి గురించి నాకూ, మా ఇద్దరి గురించి మా ఆవిడకీ బాగానే తెలుసు. తనూ టేబుల్ దగ్గర కూర్చుండిపోయింది. మా అమ్మాయి, రామారావే రాముడు గానూ రావణాసురుడు గానూ వేసిన సినిమా ట్రయలర్ ఈ-టీవీలో ఒక నిమిషం పాటు చూసి, ‘రాముడూ, రావణుడూ ఒకరేనా! ఇక సీత యెక్కడుంటే యేం?’ అనేసిన పిల్ల. తఃతః ఈమాటలో రాసిన ఇటునేనే – అటునేనేలో ‘అమ్మా! నువ్వు జుట్టుకు రంగేసుకోవాలి,’ అన్నది యీ పిల్లే. కథ మొదలు పెట్టాను.

“ముని తపస్సు చేసి ఇంటికి వచ్చాడు.”

“ముని పేరేమిటి, నాన్నా?”

“కుచ్చు తల్లీ! మునికి పేరు పెట్టాననుకో, అప్పుడు ఈ కథ ఆ పేరు గల ఒక మునికి మాత్రమే చెందుతుంది, మతంగుడి కథ, భరద్వాజుడి కథ లాగా. నువ్వు మునులేం చేస్తారు? అన్నావు కదా! ఏ పేరూ పెట్టకపోతే మునులు సాధారణంగా ఈ రకంగా ఉంటారు అన్నది చెప్పినట్టవుతుంది. ఈ విషయం అర్థమయింది కదా? ఇప్పుడు ముని పేరు అచ్చయ్య అనుకుందాం. ముని పత్ని పేరు పిచ్చమ్మ. తన భర్త అన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి ఇంటికి వచ్చాడు గదా అని పిచ్చమ్మ మునికి ఇష్టమైన చేగోడీలు చేసింది.”

మొగుడూ, మొగుడికి ఇష్టమైనవి పెళ్ళాం చేసి పెట్టడమూ కొంతయినా అర్థమై ఉంటాయి. మా అమ్మాయి ప్రశ్నలు వేయటం ఆపి నేను చెప్పబోయేది వినడానికి తయారైనట్టుగా చూసింది.

“పిచ్చమ్మ గబగబా చేగోడీలు అరిటాకులో జాగ్రత్తగా తీసుకుని వచ్చి, మఠం వేసుకుని కూచుని దేని గురించో గాఢంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్న ముని ముందు పెట్టి, అంతే తొందరతో మంచినీళ్ళు కూడా తీసుకుని వచ్చి ఆకు పక్కగా పెట్టి, ఎంతో సంతోషంతో ఆయన యెదురుగా నిలబడి ఆతృతతో చూసింది. ముని ముందు చేగోడీల వంకా తర్వాత తన భార్య వంకా చూసి, అలవాటుగా తన ఇష్టదేవతను తలుచుకుని అరిటాకులో ఉన్న చేగోడీలు తదేకంగా అన్నీ తినేశాడు. తిని చాలా బావున్నాయన్నట్టుగా భార్య వంక చూసి ఇందాకటి కన్నా ఒఖ్ఖ పిసరు ఎక్కువైన చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసి పిచ్చమ్మ పట్టలేనంత ఆనందంతో పరుగు పరుగున లోపలికి వెళ్ళి మరిన్ని చేగోడీలు ఆఘమేఘాల మీద ఇందాకటికన్నా జాగ్రత్తగా తెచ్చి తన భర్తకు, మహామునికి, వడ్డించి కొంచం వెనక్కి తగ్గి ఆయననే చూస్తూ ఒద్దికగా నిలబడింది. తన భర్తకు – ఆకలీ దప్పికా తెలీకుండా గాలిలో, నిప్పులో, నీళ్ళల్లో సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేసి తపస్సిద్ధుడై ఇంటికి వచ్చిన మునీశ్వరుడైన తన భర్తకు – ఎంతో ఇష్టమైన చేగోడీలు ఇన్నేళ్ళ తర్వాత చేసి పెట్టగలిగానని ఆమె ముఖం వెలిగిపోయింది.

రెండోసారి పెట్టిన చేగోడీలు కూడా ముని ఒక్కొక్కటీ మంత్రం చదువుతున్నంత మంచినీళ్ళ ప్రాయంగా తినేశాడు. ముని భార్య ముని చేగోడీలు తింటున్నంతసేపూ తను నుంచున్న చోటు నుంచి కదలకుండా భర్త వంకే చూస్తూ ఆయన ఎప్పుడు ఏమి కావాలంటాడో అని కొంత కంగారు గానే అక్కడే నిలబడి ఉంది. ఇంతలో ఎక్కణ్ణించి వచ్చారో పిల్లలు బిలబిలమంటూ ఇంట్లోకి వచ్చారు. ఈ మునుల పిల్లలు ఆ ఆశ్రమాల్లో ఎప్పుడు బయటికి పోతారో ఎక్కడ ఉంటారో ఎన్నాళ్ళ తర్వాత ఎప్పుడు తిరిగి వస్తారో ఎవరికీ తెలీదు. రాగానే తలెత్తకుండా చేగోడీలు తింటున్న తండ్రి వంక చూసి పరుగున ఇంటి వెనక్కి ఆవుదూడలతో ఆడుకోవటానికి వెళ్లి పోయారు.”

టిఫిన్లు పూర్తయ్యాయి. ఇంతలో ఫోన్ మోగింది. మొబైళ్ళు ఇంకా మాయింటికి రాని రోజులవి. ఫోన్ మోగుతూనే మా అమ్మాయి ఫోన్ దగ్గరికి పరిగెత్తి వెళ్ళింది.

“ఈ పూట వంకాయ కూర చేయనా?” అన్నది కథ వింటూనే టేబుల్ సర్దేయటం కూడా పూర్తి చేసిన ఈవిడ, మా ఆవిడ.

కథకు ఆటంకం వచ్చిందే ఎలాగా! అన్న ఆలోచనలో సరేనన్నట్టుగా ఆవిడ వంక చూశాను.

“ఎలా చేయను? కూరపొడి వేసి అమ్మ చేసినట్టు చేయనా, పచ్చిమిరపకాయలూ అల్లం ముక్కలతో అత్తయ్య చేసినట్టు చేయనా?”

నాకు చిన్న నవ్వు. ఇటువంటి ప్రశ్న ఈవిడ ఎప్పుడడిగినా నాకు ఈ నవ్వు వస్తుంది.

“ఇదుగో అల్లా నవ్వకూడదు. నాకు అమ్మ వంటా అత్తయ్య వంటా రెండూ ఇష్టమే. అయినా ఇలా ఎప్పుడడిగినా ఎందుకలా నవ్వుతారు!”

“నువ్విలా ఎప్పుడడిగినా నాకు చప్పున నా పిల్లలు మనసు లోకి వస్తారు.”

“నా పిల్లలకేం? వాళ్ళు వాళ్ళమ్మ వంట ఇష్టంగానే తింటారు.”

“మన పిల్లలు కాదు. బళ్ళో నా పిల్లలు.”

“మన ఇంట్లో విషయానికి మధ్యలో వాళ్ళెందుకూ గుర్తు రావటం?”

“ఐన్‌స్టయిన్ థియరీ ఆఫ్ రెలెటివిటీ అయినా, న్యుటోనియన్ మెకానిక్స్ అయినా వాళ్ళకు చెప్పేది నేను గదా అని!”

“ఆహా! అలాగా! అయితే పైథాగరస్ సిద్ధాంతం పైథాగరస్‌నీ పాస్కల్ సూత్రాలు పాస్కల్‌నీ పిలిపించి చెప్పిస్తుంది లెండి యూనివర్సిటీ!”

“అయ్యబాబోయ్! అలా అయితే నా ఉద్యోగం ఉండదు! ఇక నీ వంట…”

“అందుకే అనుకుంటాను అన్నారు, ‘అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం’ అని. మీరు పిచ్చమ్మ గురించి చెప్పండి.”

ఈవిడ కళ్ళలో నవ్వుతో నా పక్కనే కూచుంది.

“నాన్నా! శ్వేత రమ్మంటోంది. ఒక పావుగంటలో వచ్చేస్తాను. అమ్మకు కథ చెప్పేయకండి. అంతగా అయితే అన్నకు ఫోన్ చేసి చెప్పండి. అన్న ఇప్పుడు మేలుకొనే ఉంటాడు.”

అంటూ ఇంతసేపూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్న పిల్ల ఒక్క దూకులో సైకిలెక్కేసింది. నేను ఇరకాటంలో పడ్డాను. కథ ఇంక ఎంతో లేదు. మహామునులందరికీ మనసు లోనే దండం పెట్టుకుని కథ చెప్పేయాలనే నిశ్చయించాను. లేచి కొంచెం దూరంగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను.

“మునికి చేగోడీలు చాలా ఇష్టం. ఇంకా కావాలన్నట్టుగా పిచ్చమ్మ వంక చూశాడు. పిచ్చమ్మ ముఖం వెలవెల బోయింది. దాదాపుగా చేసిన చేగోడీలన్నీ తెచ్చి పెట్టేసింది రెండు విడతల్లోనూ. ఇహ, మహా ఉంటే ఓ పదిహేనో ఇరవయ్యో ఉంటాయేమో! తను పిల్లలను చూసీ చాలా రోజులయింది. తల్లి మనసు పిల్లలను చూడంగానే కరిగిపోయింది. పిల్లలకు ఆ మిగిలిన కాసిని చేగోడీలూ పెడదామనుకుంది. ఈ సారి భర్త మరి కాసిని కావాలన్నట్టుగా చూసినా కాళ్ళు కదలలేదు. ముని తనకు ఇంకా కాసిని చేగోడీలు కావాలని తన భార్యకు అర్థమయినట్లుగా లేదనిపించి కొంచెం తీవ్రంగా భార్య వంక చూశాడు. ఎంత అన్యాయం! భార్య మనసు భర్తకు తెలియదేమో గానీ, భర్త మనసులో ఏముందో భార్యకు తెలియదా! తనకు పిల్లలు ఉన్నారనీ, తన భార్య తన పిల్లలకి తల్లి అనీ గూడా తట్టనంత ఇష్టం చేగోడీ లంటే అచ్చయ్య మునికి. పిచ్చమ్మకు మాట్లాడక తప్పలేదు.

‘కాసిని… పి… పిల్లలకు… ఉమ్… ఉంచానండీ.’

అంతే అచ్చయ్య మహాముని ఆగ్రహోదగ్రుడయినాడు.

‘అసలు నీకు చేగోడీలు చేయడం వచ్చా? చేగోడీల్లో ఉప్పు ఎంత ఎక్కువయిందో తెలుసా? అంత ఉప్పు వేస్తావా! ఇప్పటినుంచీ నీ జీవితంలో నువ్వు చేసిన చేగోడీలు నీ పిల్లలు ముట్టకుందురు గాక!’

తపశ్శాలి యైన ముని శాపానికి తిరుగు లేదు. పిచ్చమ్మ కూలబడి పోయింది. దుఃఖంతో కన్నీళ్ళ జల. అయినా తృటిలో తేరుకుని భర్తను క్షమించమనీ, శాపాన్ని వెనక్కు తీసుకోమనీ వేడుకుందామని ఆయన కూచున్న వేపు ఆ కన్నీళ్ళతో తల వంచుకునే చూసింది.

కానీ మహాముని అక్కడ లేరు. తపస్సుకు వెళ్లి పోయారు!”

ఈవిడ నాకు దగ్గరగా వచ్చి నా తల నిమిరి తిరిగి తన కుర్చీలో కూర్చుంది.

“ఏంటీ అమ్మ అలా ఉంది! కథ చెప్పేశారా?!”

మా అమ్మాయి శ్వేతతో లోపలికి వస్తూనే అడుగుతోంది.

“మామా! ఎల్లుండి మా స్కూల్లో మదర్స్ డేకి చిన్న నాటిక రాశాను. కుచ్చుకి చూపిద్దామని పిలిచాను. మాకిద్దరికీ నాటికకి పేరేం పెట్టాలో తెలియలేదు. నాటిక ఒకసారి చదివి పేరు సజెస్ట్ చెయ్యండి మామా!” అంతలోనే శ్వేత.

“నువ్వు రాసింది తప్పకుండా చదువుతాను కానీ, మదర్స్ డే నాటికకి పేరు పెట్టడానికే అయితే చదవక్కర లేదు తల్లీ! ‘వన్ డే మాతరం!'”
----------------------------------------------------
రచన: తఃతః, 
ఈమాట సౌజన్యంతో

Monday, March 18, 2019

పగటి వాన


పగటి వాన




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి....................

ఆకాశం పురివిప్పుకుని
సూర్యుడిని దాచేసినప్పుడు..

ఓ ఆహ్లాదం
మేలిముసుగులా ప్రపంచాన్ని కప్పుతుంది.

ఎన్నో శిశిరాల విరహం తరువాత
ప్రియురాలిని చూసిన ప్రియుడిలా
చూపులు దాహంతో బయటికి పరుగెడతాయ్.

వాన చినుకు పెట్టిన ముద్దు లోంచి
మంచు ఆవిరులు..
నాలోకి…

బలవంతపు నిద్రలో ఉన్న మనసు
సంకెల తెగిన సైనికుడవుతుంది.

చినుకు చినుకూ పెట్టే ముద్దులకి
సిగ్గుతో తలొంచుకుంటూనే
సౌందర్యాన్ని ప్రసవిస్తూ
ప్రకృతి…

అప్పుడు…
మెదడునధిగమించి
మనసే శరీరాన్నేలుతుంది.
---------------------------------------------------------
రచన: ప్రసూన రవీంద్రన్, 
ఈమాట సౌజన్యంతో

Sunday, March 17, 2019

నాక్కొంచెం నమ్మకమివ్వు


నాక్కొంచెం నమ్మకమివ్వు




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..................

కాళ్ళ మధ్యలో ఉన్న బ్రీఫ్‌కేస్‌ని మరింత గట్టిగా బిగించి మరోసారి పేపర్లోంచి తల బయటపెట్టి చూశాను. క్రితం సారి నేను చుట్టూ చూసినప్పట్నించి ఇప్పటికి రెండు నిమిషాలయ్యుంటుంది.కానీ ఈ రెండు నిమిషాల్లో ఈ ప్లాట్‌ఫాం మీద పది రెట్లు జనాలు పెరిగారు. బహుశా మరో నిమిషంలో ట్రైన్‌వస్తుంది. సెల్‌ ఫోన్‌పైకి తీసి టైం చూశాను, కరెక్ట్‌ మరొక్క నిమిషం.

పేపర్‌ముడుస్తూ తెలిసిన మొహాలకోసం చూశాను. ప్రశాంత్‌, రామారావు మెట్లెక్కి వస్తూ కనపడ్డారు. వాళ్ళు నేరుగా నేనున్న దగ్గరికే వస్తారని తెలుసు నాకు.

కొంచెం దూరంలో మా సర్దార్జీ ఫ్రెండ్స్‌కనపడ్డారు. అప్రయత్నంగా గాలిలో చెయ్యి ఊపాను. వెంటనే వాళ్ళనించి జవాబు. నాకు కొంచెం దూరంలో తెల్లమ్మాయి ట్రేసీ.
“హాయ్‌ట్రేసీ” అన్నాను. ఆమె పుస్తకంలోంచి తలెత్తి “హాయ్‌సత్యా” అనేసి, ఓ ప్రశాంతమైన నవ్వు పడేసి తిరిగి పుస్తకంలోకి వెళ్ళిపోయింది. ఈ ట్రేసీ లాంటి ఫ్రెండ్స్‌నాకు ఈ ప్లాట్‌ఫాం మీద ఓ పాతికమంది దాకా ఉంటారు. ఒకే కంపార్మ్టెంట్లో ఒకే చోట కూర్చున్నప్పుడు, లేదా నుంచున్నప్పుడు మాత్రం మాట్లాడుకుంటాం. ఆ స్నేహం అంతకు మించదు. కానీ ఓ రోజు ప్లాట్ఫాం మీద కనపడకపోతే వెంటనే తెలిసిపోతుంది, ఆలోచించకుండా ఉండలేం. అమెరికాలో అన్నింటికన్నా నాకు బాగా నచ్చింది ఇదే. పెద్దగా పరిచయం లేకున్నా హాయిగా ఓ నవ్వు, ఆప్యాయంగా ఓ “హాయ్‌”, ఎంతో హాయిగా ఉంటుంది. మధు మాత్రం ఇవ్వన్నీ దొంగ వేషాలు, నువ్వు మాత్రమే పడేది వీటికి అంటాడు. నాకు రుచించదు. ఇంతవరకూ దీనివల్ల నే కోల్పోయిందేమిటోతను మిగుల్చుకున్నదేమిటో నాకు తెలీదు.

సుమారు రెండు గంటల ప్రయాణం. మెటుచెన్‌నించి NJ Transit లో నువార్క్‌ దాకా వెళ్ళి, అక్కణ్ణించి PATH ట్రెయిన్లోకి మారి WTC (World Trade Center) న్యూ యార్క్‌దాకా వెళ్ళాలి. ఈ రెండు గంటల తర్వాత ఓ ఎనిమిది గంటలు ఏ ప్రశాంతతా దొరకని ఉద్యోగం. మళ్ళీ తిరిగి మరో రెండుగంటల తిరుగు ప్రయాణం. ఈ పరుగో పరుగో బతుకులో ఈ ప్లాట్ఫారాలమీదా రైల్లోనూ మాత్రమే గుర్తొచ్చేది, ఇంకా చుట్టూ ప్రపంచం ఉందనీ, అందరూ ఇలాగే పరిగెడుతున్నారనీను. అందరూ అలా హాయ్‌చెప్పడంతో నా అస్థిత్వాన్ని అందరూ గుర్తించినట్టు, ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అదికూడా లేకపోతే బతుకు మరింత యాంత్రికమవుతుందనిపిస్తుంది.

అలా ఆలోచిస్తూనే అన్ని “హాయిల్నీ” నవ్వుల్నీ ఏరుకుని లెక్కపెట్టుకునే లోగానే ట్రెయిన్‌వస్తూ కనపడింది. ఆ ట్రెయిన్‌రావడం, ఆగడం, డోర్లు తెరుచుకోవడం, దిగాల్సిన వాళ్ళు దిగడం అంతా రెండు నిమిషాల్లో జరిగిపోయింది. నా ముందున్న వాళ్ళు ట్రెయిన్‌ఎక్కడం మొదలు పెట్టారు. నాకు అకస్మాత్తుగా గుర్తొచ్చింది నా హాయిల లెక్కలో ఓ ముఖ్యమైన హాయి తక్కువయిందని. అక్రమ్‌ ఇంతవరకూ కనపళ్ళేదు. ట్రెయిన్‌మిస్సవుతున్నాడా? ఆలోచిస్తూ ఎక్కాను. ఇంకా కొన్ని ఖాళీ సీట్లు ఉన్నాయి. సాధారణంగా ట్రెయిన్‌ఇక్కడే ఫుల్‌అవుతుంది. నే వెళ్ళి కిటికీ పక్కనే కూర్చున్నాను. ఓ అరనిమిషం తర్వాత ప్రశాంత్‌, రామారావు వచ్చి ముందర కూర్చున్నారు.

ట్రెయిన్‌బయలు దేరింది. ప్లాట్‌ఫాం మీదకి వచ్చే మెట్లమీద వేగంగా ఎక్కి వస్తూ, కదిలిపోతున్న ట్రెయిన్ని చూస్తూ ఒక్కసారిగా సడెన్‌బ్రేక్‌వేసి, దీర్ఘంగా నిట్టూరుస్తున్నారు. అదో సరదాగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ మొహాల్లో ఓ నిరాశ, ఓ చిరాకు ఓ కెరటంలా వచ్చి, అర సెకనులో మళ్ళీ అంతా నెమ్మదిస్తుంది. ఆ భావాలకి రంగు, వయసు, లింగ భేదాలుండవు. ప్రతిరోజూ ఉండే తంతే ఇది. కనీసం పది మందిని చూస్తాను ఈ మెట్లమీద రోజూ, కదిలిపోతున్న రైల్లోంచి. తర్వాతి ట్రెయిన్‌ మరో 12 నిమిషాలకి గాని రాదు. ఆ మొహాల్లో కూడా అక్రమ్‌ కనపళ్ళేదు. కొంచెమాగి ఇతగాడికి ఫోన్‌చెయ్యాలి. పదిగంటాలకల్లా నా ఆఫీస్‌కి వచ్చి కలుస్తానన్నాడు. ఇప్పటిదాకా బయల్దేరకపోతే … రాడేమో, వచ్చి కలవడేమో?

అక్రమ్‌ పని చేసేది WTC టవర్‌లో. తనో మానేజ్మెంట్‌కన్సల్టింగ్‌ కంపెనీలో పనిచేస్తాడు. బోల్డెన్ని కంపెనీలలో పరిచయాలుండటంతో కాంట్త్ల్రాకూ గట్రా చూపించగల సమర్థుడు. నామట్టుకు నాకైతే అక్రంతో కూర్చుని సాయంత్రాలు మాట్లాడ్డం ఇష్టం. అక్రమ్‌ నాకెప్పుడూ మిస్టరీయే. ఎంతో ఖచ్చితమైన అభిప్రాయాలున్నా, ఏ మాత్రం ఆవేశపడకుండా, రాజీ పడకుండా మాట్లాడగల్గటం ఎలానో నాకెప్పుడూ అర్థం కాదు.

ఇక్కడి పాకిస్తానీ గాంగ్‌కీ దేశీ గాంగ్‌కీ మధ్య మే మిద్దరం లింకు లాంటి వాళ్ళం. మా స్నేహం పెరిగిన కొద్దీ మ రెండు గ్రూపులూ కలవటం ఎక్కువయింది. స్నేహాలు కూడా ఎక్కువయ్యాయి. క్రికెట్‌మ్యాచ్లున్నప్పుడయితే మొత్తం మిత్రబృందమంతా అక్రమ్‌ పేరే జపిస్తుంటుంది. అపార్మ్టెంటుల్లో బతికే మాకెవ్వరికీ శాటిలైట్‌ డిష్లు పెట్టుకునే అవకాశం లేదు. అదుంటేతప్పా అమెరికాలో క్రికెట్‌చూసే భాగ్యం ఉండదు. పాపం, అక్రమ్‌ ఇంటిమీద క్రికెట్‌చూడ్డం కోసం ఎంతమంది పడ్డా విసుక్కోడు. కానీ నిజం చెప్పాలి. ఇండియా, పాకిస్తాన్‌మాచ్‌ఉన్నప్పుడయితే నాకూ అక్రం కీ కూడా పరీక్షే! మా ఒళ్ళూ, మా బుర్రే అదుపు తప్పుతుంటుంది, ఇంక అక్రమ్‌ స్నేహితులవంకా, నా స్నేహితులవంకా భయం భయంగా చూస్తుంటాం. నా అనుమానం, ఎవరికివారే మిగతా వాళ్ళందర్నీ అలాగే చూస్తుంటారేమోనని! అదృష్టవశాత్తూ ఇంతవరకూ ఏమీ జరగలేదు. నాతో పాటే వస్తాడనుకున్నాను ఇవ్వాళ. ఇంతవరకూ కనపడని వాడు పదింటికల్లా నా ఆఫీస్‌కి రాగలడా అనేది అనుమానమే. మొత్తానికి రైలు WTC కి మామూలు సమయానికే చేరింది. అక్రమ్‌ ఆఫీస్‌ WTC లోనే 83వ అంతస్తులో. నా ఆఫీసుకి జచఈ లోంచి బయటి వెళ్ళి, ఓ రెండు బ్లాకులు నడవాల్సి వుంటుంది. బ్రీఫ్కేస్‌చేత్తో పట్టుకుని ఎస్కలేటర్ల మీదుగా ఎక్కి బయటకు నడిచాను.

ఆఫీస్‌చేరి కొంచెం సేపు మెయిల్‌చెక్‌చేసి, తర్వాత సగం రాసిన డాక్యుమెంట్‌ తీసి ఎడిట్‌చెయ్యడం మొదలు పెట్టాను. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. రాబర్ట్‌ నా అఫీస్‌తలుపు తెరిచి… రొప్పుకుంటూ అన్నాడు… WTC మీద ఏక్సిడెంట్‌ అయ్యింది తెలుసా అని. ఏదో పెద్ద జెట్‌వచ్చి టవర్ని గుద్దిందిట అన్నాడు. నాకు అర్థం అవడానికి టైం పట్టింది.

వెంటనే ఫోన్‌అందుకుని అక్రమ్‌ ఆఫీస్‌నంబర్‌కి చేశాను. లైన్‌ దొరకలేదు. ఎందుకయినా మంచిదని ఇంటికి ఫోన్‌చేశాను. లక్ష్మి… WTC మీద ఏదో ఏక్సిడెంట్‌ అయ్యిందిట, భయపడద్దు, నేను రైలు దిగి క్షేమంగానే బయట పడ్డానని చెప్పాను. అక్రమ్‌ సంగతే తెలియట్లేదు, ఫోన్‌చేసి కనుక్కుంటానని చెప్పాను. ఫోన్‌పెట్టేసి, మళ్ళీ అక్రమ్‌ సెల్‌కి చేశాను. ఆన్సరింగ్‌సిస్టంకి వెళ్ళింది. సీట్లోంచి లేచి బయటికి నడిచాను. WTC వైపు చూడగానే గుండె గుభేలు మంది. కాళ్ళు వణికాయి. అంత పెద్ద ఏక్సిడెంట్‌అనుకోలేదు నేను. రెండు టవర్లూ భగ్గున మంటల్లో మండి పోతున్నాయి. అసలట్లా ఎట్లా ఏక్సిడెంట్‌అవగలదు? ఓ మనిషి జారిపోతున్న జాకెట్‌లాక్కుంటూ పరిగెడుతున్నాడు… మొహంలో భయం, ఆతురత, దుఖం…
“ఏమిటది, ఏం జరిగింది” అన్నాను. నా గొంతెలా పలికిందో నాకు తెలీదు.
“టెర్రరిస్టులు… ఇక్కడా, వాషింగ్టన్లోనూ విమానాలతో విరుచుకుపడ్డారు” అన్నాడు. అంటూనే పరిగెట్టాడు. సాధ్యమయినంత త్వరగా సిటీ నించి బయటపడమని కూడా అరిచాడు… పరిగెడుతూనే!

నా నోట మాట లేదు. అర్థమయీ కానట్టుగా వుంది నాకు. ఇంతలో అక్రమ్‌ గుర్తొచ్చాడు. వెంటనే సెల్‌ఫోన్‌తీసి కాల్‌చేశాను. ఆఫీస్‌కి, తర్వాత తన సెల్‌కి. రెండూ దొరకట్లేదు. కనుచూపు మేరలో అందరి చేతుల్లోనూ ఫోన్లు… అందరూ డయల్‌చేస్తూనే ఉన్నారు. ఇప్పట్లో ఏ లైనూ దొరకదని అర్థమయింది నాకు. ముందుగానే ఇంటికి ఫోన్‌చేసి మంచిపని చేశాననుకున్నాను. వడివడిగా అడుగులు వేస్తూ WTC వైపు నడిచాను. ఇంకో బ్లాక్‌వుందనగా ఓ ఇద్దరు పోలీసులు నిలబడి అటువైపు వెళ్ళద్దన్నారు. మా ఫ్రెండ్‌లోపల వున్నాడన్నాన్నేను. అయినాసరే ఇక్కడే వెయిట్‌చెయ్యండి అన్నారు. అని, వాళ్ళు మాత్రం టవర్ల వైపు వెళ్ళి పోయారు. నాలాగే చాలామంది అక్కడే తచ్చట్లాడుతున్నారు. కొందరప్పటికే ఏడుస్తున్నారు. వాళ్ళ వాళ్ళెవరో లోపల వుండివుంటారు. చాలామంది అప్పటికే టవర్ల లోంచి బయటపడ్డారని చెప్పారు. చుట్టు పక్కల చూశాను. ఎక్కడా కనపడ్డు అక్రమ్‌ అసలీ రోజు రానే లేదేమో? అలా వెతుకుతూనే వున్నాను. ఇంతలో అకస్మాత్తుగా ఓ పెద్ద నల్లటి మేఘం కమ్ముకు వస్తూ కనపడ్డది.

ఏమిటది? నిజమే? ఆ టవర్‌.. ఆ టవర్‌.. కూలిపోతోంది…. పరిగెట్టండి.. పరిగెట్టండి… అదెంత దూరం దాకా పడుతుందో తెలీదు… పరిగెట్టండి…. అయ్యో ఇప్పటిదాకా ఎంతోమంది అటువైపుగా వెళ్ళారు నా కళ్ళముందే…. ఆ పోలీసులు… ఆ అంబులెన్సులూ, ఫైర్‌ డిపార్మ్టెంట్‌ వాళ్ళూ… అయ్యో అందర్నీ వదిలి పరిగెట్టాల్సిందేనా…. ఏవిటది… పరిగెట్టండి పరిగెట్టండి… ఈ భూతాన్నించి పారిపోండి… ఇదో కమ్ముకు వస్తున్న ప్రళయం… ఇదో విలయం…. ఇదో ఛండాలం… విరిగి బద్దలయి పేలిపోతున్న మానవత్వం…. మనిషిని మనిషే బలిచ్చే క్షుద్ర పూజ.. నిలువెత్తున కూల్తున్న నాగరికత… పరిగెట్టండి.. పరిగెట్టండి… మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడుతూ, మనుషుల్లో, సమాజంలో బతకాల్సొచ్చినందుకు భయపడుతూ, బాధ పడుతూ, ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని పరిగెట్టండి… ఏడవకండి… కన్నీళ్ళని వృథాచేయకండి… ఇది మనిషిని చేసుకుంటున్న ఆత్మహత్య…. వాడి ఖర్మకి వాణ్ణి వదిలేసి అడవుల్లోకి పోయి హాయిగా మృగాల్లా బతుకుదాం పదండి…. పరిగెట్టండి.

……………………………

అబ్బా… ఎవరిదో కాలడ్డం పడ్డట్టుంది. స్పృహలేకుండా పరిగెడుతున్న నేను వెల్లకిలా రోడ్డు మీద పడ్డాను. ఈ లోకంలోకి వచ్చాను. నుదురు రోడ్డుకు కొట్టుకుంది. లేచి వళ్ళుదులుపుకున్నాను. ఒక టవర్‌పూర్తిగా కూలిపోయింది. వళ్ళు జలదరించింది, అందులోనే అక్రమ్‌ పని చేసేది. అయినా ఇంతసేపు అందులో వుండడేమోలే అనిపించింది.

అంతా యుద్ధరంగంలా ఉంది. టవర్‌కూలినప్పుడు లేచిన దుమ్ము, మేఘంలా అంతా పరుచుకుని వుంది. అంతా గందర గోళంగా వుంది. దుమ్ము కొట్టుకు పోయిన వాళ్ళు, దెబ్బలు తగిలినవాళ్ళు…. దిక్కు తోచక పరిగెట్టే వాళ్ళు… వీళ్ళకి సహాయం చెయ్యాలని తాపత్రయ పడేవాళ్ళూ… అంతా అయోమయంగా వుంది. నేను నా మనసుని కూడ గట్టుకుని అనుకున్నాను… అక్రమ్‌ కోసం ఇంకాసేపు చూసిగానీ ఇంటికి వెళ్ళేది లేదని. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అక్రమ్‌ ఫోన్‌ కలవట్లేదు. అలాగే ప్రయత్నం చేయగా చేయగా ఇంటికి కలిసింది…. లక్ష్మి భయపడుతోంది. త్వరగా వచ్చెయ్యండి అంది. అక్రమ్‌ వాళ్ళింటికి ఫోన్‌ చేశావా అని అడిగాను. ముంతాజే చేసింది అంది. అక్రమ్‌ చాలా పొద్దున్నే వెళ్ళిపోయాట్ట, ఇప్పుడెక్కడున్నాడో తెలీట్లేదుట అంది. నేను చూసొస్తాను, భయం లేదు… వాళ్ళింటికి ఫోన్‌చేసి చెప్పు అన్నాను. ఫోన్‌ పెట్టేశాను. అన్నానేగానీ… నిజానికి అక్రమ్‌ అసలు రానేలేదేమోలే అన్న నా ఆశ అడుగంటిపోయింది.
అక్రమ్‌ కిందికి రాగలిగాడో లేదో అనేదే ప్రస్తుతం తెలియాల్సింది.
అమ్మో… అదేంటి… రెండో టవర్‌.. అదీ కూలిపోతోంది…. భగవంతుడా…. ఏమిటీ దారుణం… ఈ ఘోరం ఇంకా ఎంత దూరం పోబోతోంది? పక్కనే ఉన్న పెద్ద హోటల్‌లోపలికి పరిగెట్టాను. పాపం వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ విసుక్కోకుండా రానిస్తున్నారు. మంచినీళ్ళూ అవీ కుడా అందిస్తున్నారు… ఒరే మనిషీ.. నీకెన్ని రూపాలురా అనుకున్నాను!
అక్కడే ఓ అరగంటో, ఇంకా ఎక్కువో కూర్చుని బయట పడ్డాను. ఎన్ని చోట్ల వీలయితే అన్ని చోట్ల వెతికాను. అలా ఓ రెండు మూడు గంటలయుంటుంది. నా సెల్‌ ఫోన్‌మోగింది… లక్ష్మి!
“ఎప్పట్నించి, ఎన్నిసార్లు చేశానో లెక్కలేదు… మీ ఫోన్‌లైన్‌దొరకట్లేదు. ఇంక మీరు ఎవరికోసం వెతక్కుండా ఇంటికి వచ్చేయండి” అంది. గొంతులో దుఖం. పిల్లలేడుస్తున్నారు అంది. నాక్కూడా చెయ్యగల్గింది పెద్దగా కనపళ్ళేదు. “ఇప్పుడింటికెలా రావాలో తెలీదు…. ఎలాగోలా బయల్దేరి వచ్చేస్తాను… వెంటనే బయల్దేరుతున్నాను” అని చెప్పి పెట్టేశాను.

* * *

అతికష్టం మీద సిటీ బయట పడగల్గాను. ఇంటికి చేరేటప్పటికి దాదాపు సాయంత్రం అయింది. లక్ష్మి చిన్నపిల్లలా కావులించుకుని బావురుమంది. పిల్లలు సరేసరి. నాకూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మాకెవ్వరికీ సరిగ్గా తెలీదు… మేమెందుకు ఏడుస్తున్నామో.
ఇంట్లో అప్పటికే ప్రశాంత్‌, రామారావు, మధులు కుటుంబాలతో సహా వచ్చి వున్నారని అర్థమయింది.
“హమ్మయ్య మీరంతా క్షేమంగా వచ్చారు గదా” అన్నాన్నేను. వాళ్ళు రెండో టవర్‌మీద ఎటాక్‌చూడగానే బయల్దేరి వచ్చేశార్ట.
“నాకు చాలాసేపటిదాకా ఆ సంగతే తెలీదు, ఆ తర్వాత అక్రమ్‌ కోసం చూస్తూ ఇంతసేపూ తిరుగుతున్నాను” అని చెప్పాను.
ప్రశాంత్‌, రామారావులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
“ఏం జరిగింది” అన్నాన్నేను
“ఆ అక్రమ్‌ సంగతి మర్చే పోలేవా?” అన్నాడు మధు కొంచెం చిరాకుగా.
“ఏంటీ ?” అన్నాన్నేను అంతే చిరాకుగా, అసహనంగా.
“ఆ పాకీ గాళ్ళందరి మీదా కన్నేసి వుంచారు పోలీసులు. ఎవడో ఒకడి మీద అనుమానంట. మధ్యాహ్నం నించీ అందర్తోటీ, అక్రమ్‌ ఫ్రెండ్స్‌అందరితోటీ మాట్లాడుతున్నారు పోలీసులు. పెద్దగా ఏమీ మర్యాదగా సాగట్లేదుట ఆ సంభాషణ”
ఆఖరి వాక్యం చెప్పడంలో కాస్త వెటకారం ధ్వనించింది.
” ఆ వరల్డ్‌ట్రేడ్‌సెంటర్‌మీద జరిగిన దాడి కీ, మన చుట్టూ వుండే ఈ అర్భకులకీ ఏమిటిట సంబంధం” అన్నాన్నేను.
“అదే వాళ్ళు తేల్చుకుంటార్ట. నువ్వు పొద్దుణ్ణించీ టీ.వీ చూడట్లేదుకదా. వాతావరణమేమంత బాగాలేదు. పోలీసులూ మామూలు వాళ్ళు కూడా మన బోటి సౌత్‌ ఏషియా మొహాలు కనపడితే చాలు అనుమానంగా చూస్తున్నార్ట” అన్నాడు ప్రశాంత్‌
“అవునా ?” అన్నాన్నేను ఆశ్చర్యంగా.
“అందుకే చెప్పేది. ఆ అక్రమ్‌ గిక్రం అని వాళ్ళింటి చుట్టూ తిరక్కు.” మళ్ళీ మధు
నాకు తిక్కరేగింది. “మిగతావాళ్ళ సంగతి సరే, మనకి అక్రమ్‌ సంగతి తెలీదా? మనిషేమయిపోయాడో తెలీకుండా వుంటే పట్టించుకోకుండా వదిలేస్తామా?” అన్నాన్నేను, నాకు తెలీకుండానే నా గొంతు లేచింది.
“అందుకే వద్దంటున్నాను. అక్రమ్‌ రిజ్వి ఇద్దరూ లెక్క తేలలేదుట. పైగా ముంతాజ్‌నడిగితే, ప్రతిరోజులా కాకుండా ఈ రోజు ఇంకా ముందే వెళ్ళిపోయాడు అనిచెప్పిందిట. పొద్దుట్నించీ అక్రమ్‌ సెల్‌ఫోన్‌కి ట్రై చేసినా దొరకట్లేదుట. వాళ్ళ ఆఫీసు వాళ్ళు కూడా మేం చూశాం అని చెప్పిన వాళ్ళు లేరుట ఇంతవరకూ” అన్నాడు మధు.
“నన్ను పదింటికి కలుస్తానన్నాడు నా ఆఫీసులో. ఏవో ఇమ్మిగ్రేషన్‌ఫామ్స్‌ కావాలంటే ఇస్తానన్నాను. ఆ పని వుంది కదాని ముందుగా ఆఫీస్‌కి వెళ్ళుంటాడు. సెల్‌ఫోన్‌ తియ్యట్లేదంటే ఏమయ్యిందోనని భయపడాల్సింది పోయి అనుమానిస్తారా?” అన్నాన్నేను

“అదే వద్దనేది. నీ దగ్గరికి వస్తానన్నాడని చెప్పి పోలీసులకి చెప్తావా? పిచ్చెక్కిందా… అయినా ఆ పాకీ గాళ్ళు ఎంత రక్తం మరిగారో చూస్తూనే వున్నాంగా… అసలు నిజంగా అక్రమ్‌ ఎక్కడున్నాడో నాకయితే అనుమానమే… ఆ గుద్దిన విమానాల్లో లేకపోవచ్చు… వాళ్ళ నెట్వర్క్‌ఎంతపెద్దదో… ఇతగాడందులో ఎక్కడ ఏంచేస్తున్నాడో?” అన్నాడు.

నేను అవాక్కయి పోయాను. అక్రమ్‌ చూపించిన ఉద్యోగం చేస్తున్న మనిషి. అతని కుటుంబం గురించీ, ఉద్యోగం గురించీ దాదాపు పూర్తిగా తెలిసిన మనిషి. ఇన్నాళ్ళూ సుబ్భరంగా కలిసి తిరిగిన మనిషి. మనిషిలో ఇంత హఠాత్తుగా ఇంత మార్పు నాకు ఆశ్చర్యంగా ఉంది. పాకిస్తానీ వాడూ, తురకాడూ అవటం చాలా అంతగా అనుమానించబడటానికి? అంతగా అవమానించబడటానికి? నాకు కోపం కన్నా బాధగా వుంది.
గట్టిగా కళ్ళు మూసుకుని ఓ క్షణం కూర్చున్నాను. మెల్లిగా కళ్ళు తెరిచి నచ్చచెప్తున్నట్టుగా అన్నాను.
“మధూ! ఆలోచించు. అక్రమ్‌ ద్వారా ఒక్క అపకారమన్నా జరిగిందా మనకింతవరకూ? మనకి అవసరమయినప్పుడల్లా సహాయమేగా చేశాడూ…. ఇది అన్యాయం మధూ… తోటి మనిషిని ఇంతలా అవమానించకూడదు”
“సత్యా! నువ్వు బాధ పడ్తావని తెలుసు. కానీ పై పై రూపాలు వేరుగా వుంటాయి. అయినా అడిగావు కాబట్టి చెపుతున్నాను. కాశ్మీర్‌ని మనం అన్యాయంగా ఆక్రమించుకున్నామని అన్నాడు గుర్తులేదా?” అన్నాడు మధు.
“అందుకని, కాశ్మీర్లో పేలిన ప్రతి బాంబుకీ, పోయిన ప్రతి ప్రాణానికీ అక్రమ్‌ బాధ్యుడా? ఇప్పుడీ దారుణానికి కూడా? మనకి నచ్చని విషయం నమ్మినందుకు నిర్దోషి అనితెలిసినా మనం సహాయం చెయ్యకూడదా?” ఆశ్చర్యంగా అడిగాను.

“నేనామాటనలేదు. ఏ పుట్టలో ఏ పాముందో మన జాగ్రత్తలో మనం వుందామంటున్నాను” అన్నాడు

నేను అందరి మొహాలూ చూశాను. ఇంట్లో సుమారు 10 మంది మనుషులున్నారు. మాట్లాడుతున్నది మాత్రం ఇద్దరమే. అందరి మొహాల్లోనూ అదో బాధ, దుఖం… ఈ సంభాషణ వినాల్సొచ్చినందుకు. ఎటూ మాట్లాడాలని లేదు ఎవరికీ. కళ్ళు కూడా ఎవరితోనూ కలిపే ధైర్యం లేదు, అందరూ తలా ఓ దిక్కూ చూస్తున్నారు.

ఓ రెండు నిమిషాలలాగే కూర్చున్నాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లలు కూడా,ఇంతమంది పెద్దవాళ్ళు ఇలా నిశ్శబ్దంగా వుండటం ఎప్పుడూ చూసి వుండలేదేమో, ఆశ్చర్యంగా చూస్తున్నారు.

నేను మెల్లిగా దీర్ఘంగా నిట్టూర్చి, కుర్చీలోంచి లేచాను. లేస్తూ ఇలా అన్నాను…

“నాకు తెలుసు. ఇక్కడెవరూ చెడ్డవాళ్ళు లేరని. అక్రం కీ చెడు జరగాలని కూడా ఎవరూ కోరుకోవట్లేదు. నిజానికి ఇక్కడ చాలామందికి అక్రమ్‌ ని నమ్మాలని కూడా ఉందని నా అనుమానం. మనకి ధైర్యం సరిపోవట్లేదంతే. నేను దగ్గర్నించి చూశాను. మనిషిమీద మనిషికి నమ్మకం పోతే ఏం జరగ్గలదో. ఇప్పుడు నేను అక్రమ్‌ ని నమ్మటం మానేస్తే… అమ్మో నాకు భయమేస్తోంది. నా పిల్లలు చూస్తున్నారు. అంత సాహసం చెయ్యలేను. అక్రమ్‌ ని నేను నమ్ముతున్నాను. అక్రమ్‌ ని నమ్ముతున్న నా నమ్మకాన్ని ఇంకా ఎక్కువగా నమ్ముతున్నాను. అక్రమ్‌ ని నమ్మక పోవడం అంటే నన్ను నేనే నమ్మకపోవటం. FBI, CNN లకి నా కన్నా ఎక్కువగా అక్రమ్ల గురించి తెలిసే అవకాశం లేదు.వాళ్ళనించి నేను వినను… నేనే వాళ్ళకి చెప్తాను. మీలో ఇష్టం ఉన్నవాళ్ళు నాతో రండి. లక్ష్మీ నువ్వుకూడా… నీ ఇష్టమయితేనే” అన్నాను… ఖచ్చితంగా, ఆవేశంగా.

అందరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. లక్ష్మి మాత్రం నోరు విప్పి అంది ” అక్రమ్‌ మీద వున్న నమ్మకం నా మీద లేక పోయింది. నేనెప్పుడో చెప్పేశాను ముంతాజ్‌కి… ధైర్యంగా వుండమనీ, మీర్రాంగానే అందరం వాళ్ళింటికి వచ్చేస్తామనీను. వాళ్ళక్కూడా వంట చేసి పాక్‌చేసేసి వుంచాను. పదండి చూద్దాం ఏమయిందో అక్రమ్‌ భాయ్‌కి” అంది లక్ష్మి.

అందరూ లేచారు…. వాళ్ళ సహాయం నా కవసరం లేకపోయినా… కనీసం కొందరయినా నాతో నడిస్తే బావుండుననే ఆశని చంపుకోలేక పోతున్నాను… ఆశగా వాళ్ళవైపు చూస్తూ “పద” అన్నాను లక్ష్మితో.
-------------------------------------------------------
రచన: అక్కిరాజు భట్టిప్రోలు, 
ఈమాట సౌజన్యంతో