దండిస్తేకాని పనిజరగదు అనే సందర్భంలో "దండం దశగుణ భవేత్" అంటూంటారు.
దేవుడికైనా దెబ్బేగురువు అంటే కొడితేగాని పనిజరగదు అని భావం.
కానీ ఈ శ్లోకం పూర్తిగా చూద్దాం.
అంటే
కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపు చేయడానికి,
బురదలోను, నీటిలోను, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను ఆపుగా(ఆసరాగా)ఉంటుంది.
కావున కర్ర ఈ పది రకాలుగా ఉపయోగపడుతుంది - అని భావం
అందంలో మాబావ హనుమంతుడు అంటే కోతి,
నాగరకతకు యముని వాహనానికి సమానం అంటే దున్నపోతు,
పరిశుద్ధిలో హిరణ్యాక్షుని చంపిన శూరునికి జోడి అంటే
వరాహము(పంది)తో సమానం అన్నమాట.
మాబావ వంటివాడు ఈ భూమిమీద లేనేలేడు అంటున్నాడు
బావమరది. చూడండి
ఎంత చక్కగా వేళాకోళం చేశాడో.
చూశారుకదా! వినడానికి ఎంతబాగా పొగిడినట్లున్నది.
వ్యాజస్తుతి అంటే ఇదే పైకి పొగడినట్లును
అంతర్గతంగా నిందించినట్లుంటుంది.
సాహితీమిత్రులారా!
ప్రపంచంలో కవులతో కృతులు రాయించుకొని చివర
చెప్పినది కాక వేరొకటి చేసెడివారు కొందరైతే,
మరికొందరు రిక్తహస్తములు చూపెడివారు.
గజనీ మహమ్మదు ఫిరదౌసికి బంగారునాణేలు ఇస్తానని
చివరికి వెండినాణేలు పంపాడు.
అవి తిరస్కరించినందుకు మరణదండన కూడ
విధించడానికి వెనుకాడలేదు సుల్తాను.
కూచిమంచి జగ్గకవికి చింతలపాటి నీలాద్రిరాజు
తన ఉంపుడుకత్తెను నాయికగను, తనను నాయకునిగాను
కృతి రాయమని చివరికి శూన్యహస్తాలు చూపాడు
దీనితో మండిన జగ్గకవి చంద్రరేఖావిలాసం పేరును చంద్రరేఖావిలాపంగా మార్చాడు.
ప్రార్థనా పద్యంలో రాజును
ఈ విధంగా శపించాడు చూడండి.
విత్త మొకని కిచ్చి వితరణశీలమౌ చిత్త మొకని కిచ్చి చెరచినాడు బ్రహ్మ ఆలిత్రాడు బండిరేవునద్రెంప రెండు నొకనికీక బందుచేసె
సృష్టికర్త బ్రహ్మదేవుడే తప్పులు చేస్తున్నాడు చూడండి
ఆ బ్రహ్మ దాతృబుద్ధిలేని లోభికి అపార ధన(విత్తం) ఇస్తున్నాడు.
దాన (వితరణ) శీలం మరొకనికి ఇస్తున్నాడు
కాని వానికి ధనంలేకుండా మహాదరిద్రుని చేసి
మహాపరాధం చేస్తున్నాడు.
విత్తాన్ని వితరణశీలాన్ని ఒకరికే ఇస్తే ఎంత బాగుంటుంది-
అని దరిద్రంలో మగ్గే కవి ఎంత అక్కసుతో అంటున్నాడో చూడండి.
సరస్వతీదేవి మంగళసూత్రాన్ని తెంచేయాలట అంటే బ్రహ్మదేవుని చంపేస్తున్నాడు.
లేమిలో ఎన్ని బాధలో ఇంతపని చేయిస్తున్నది.
ఈరోజు మనం అన్నిటిని మార్చివేశాము.
ప్రతిదాన్ని ఆంగ్లంతో అనుసంధానించి చెప్పుకుంటున్నాము.
మనం వాడే ప్రతిపదం కొన్నాళ్ళకు పరభాషాపదాలవుతాయేమో!
ఏమో! ఆశ్చర్యం అక్కరలేదు.
మనదేశంలో ఉన్నవారు ప్రతిదాన్ని మనలో కలిపేసుకునే దానికి అలవాటు పడ్డారు.
కానీ కొందరు ఎంత ప్రత్యేకంగా ఆలోచించారో చూస్తే అది ఇంకా ఆశ్చర్యం కలగకమానదు.
అలాంటి వారిలో అజ్జాడ ఆదిభట్లనారాయణదాసుగారు,
కొక్కొండ వేంకటరత్నంగారు మరొకరు.
హరికథాపితామహునిగా పేరుగాంచిన ఆదిభట్ల నారాయణదాసుగారు
అచ్చతెలుగు పుస్తకాలను రాశారు.
ఆకాలంలో బళ్ళలో తెలుగుపంతుళ్ళకు సంస్కృతం రాదు.
సంస్కృత పండితులకు తెలుగు రాదు.
ఇలాంటి స్థితి తరువాత అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే తెలుగు పుస్తకాలు లేవు.
మళ్ళీ ఇప్పుడు అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే కావాలంటున్నాము.
ఇదంతా ఏమిటో మరి
అసలు విషయానికొస్తే నారాయణదాసుగారు సంస్కృత వారాలకు
తెలుగులో వారాల పేర్లు మార్చారు. (ఇవి అంతకు ముందుకాలంలో ఉన్నవే)
అలాగే తెలుగు నెలలుగా చెప్పేవాటికి అచ్చతెలుగు పేర్లు పెట్టాడు
అవి ఇక్కడ చూద్దాం.
వారాల పేర్లు (వంతుల పేర్లు) సంస్కృతం పేరుఅచ్చతెలుగు పేరు రవివారం ప్రొద్దువంతు సోమవారం నెలవంతు మంగళవారం పారిపట్టివంతు బుధవారంపెద్దవంతు గురువారంబేస్తవంతు శుక్రవారం చుక్కవంతు శనివారం సనివంతు
బ్రహ్మోత్సవములు
19-05-2016 నుండి 23-05-2016 వరకు జరిగినవి.
ఈ సందర్భముగా 22-05-2016 సాయంకాలం 5గం.లకు
"రాయలసీమ స్థాయి కవిసమ్మేళనం" జరిగింది.
అందులో పాల్గొన్న శ్రీయుతులు విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి
"పద్యాలమాల - హృద్యశుభాలహేల" ఇది.
1948 జనవరి 18వ తేదీన విజయవాడలో ఆంధ్ర నాటక కళా పరిషత్ వార్షిక సమావేశంలో విశ్వనాథ సత్యనారాయణ వారు తమ "శశిదూత" మనే ఖండకావ్యమును
"బందా కనకలింగేశ్వరరావు" గారికి అంకితం చేశారు.
ఈయన ప్రముఖ రంగస్థల నటుడు.
కనకలింగేశ్వరరావుగారు విశ్వనాథవారికి 5 స్వర్ణ పుష్పాలను బహూకరించారు.
ఆ సభలో ఆసీనులై ఉన్న తమ గురువు చెళ్ళపిళ్ళ వారికి
ఆ స్వర్ణపుష్పాలతో విశ్వనాథవారు పాదపూజ చేస్తూ,
చంపకోత్పల ఛందస్సులో అయిదుసార్లు నమస్సులు సమర్పించారు.
వాటిని చూడండి.
(కొండల్లో, కోనల్లో, కానల్లో పారుతున్న ఆంధ్ర శారదాగంగను
నూతన సాధు సమతలంలో ప్రవహింపజేసిన మహా ప్రతిభానిధికి నమస్కారం.
క్షీణప్రబంధ యుగంలో క్షుద్ర కావ్య నిర్మాణాల గందరగోళాల మధ్య
కొట్టుమిట్టాడుతున్న తెలుగు కవిత్వాన్ని కొత్తమలుపు తిప్పి
నూతన యుగస్రష్టయైన మహాకవికి నమస్కారం.)
నమస్కారానికి ఒక స్వర్ణపుష్పం
చొప్పున గురువుగారి పాదాలముందు ఉంచాడు.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు
ఒకసారి చమత్కారంగా ఈ పద్యం చెప్పారు.
చూడండి.
తొలి నాళుల శబ్దార్థము తెలియనిచో పాఠకునిది తెలియమి యీ నా ళుల వ్రాసిన కవి దోషము కలి ముదిరిన కొలది వింతగతులను వెలయున్
(వెనుకటి రోజుల్లో ఏదన్నా ఒక పద్యానికో,
పదానికో అర్థం తెలియకపోతే పాఠకుడు
అపండితుని కింద లెక్క తెలుసుకోవటానికి ప్రయత్నం జరిగేది.
ఈ రోజుల్లో అలా కాదు.
తమ కర్థం కాకుండా రాయటం కవి దోషమని
అధునాతనులు అంటున్నారు.
కలి ముదిరిన కొద్దీ వింతలు పుడుతున్నాయి సుమా!)
ఇది ఎన్ని ఏళ్ళనాటి పద్యమో కాని
ఇది నేటికీ అక్షరసత్యం కదా!
శ్రీకాళహస్తీశ్వరుని ధూర్జటి ఎలా నిలదీస్తున్నడో చూడండి.
నీకున్ మాంసము వాంఛయేని కఱవా? నీ చేత లేడుండగా, జోకైనట్టి కుఠారముండ, అనలజ్యోతుండ, నీరుండగా, పాకంబొప్ప ఘటించి, చేతిపునకన్ భక్షింప కాబోయచే చేకొంటెంగిలిమాంస, మిట్లు తగునా? శ్రీకాళహస్తీశ్వరా!
కరుణాంతరంగుడైన శ్రీకాళహస్తీశ్వరుడు భక్తదయాళువు
తిన్నని చేతి ఎంగిలి మాంసం తిన్నాడు కదా!
దాన్ని ధూర్జటిగారు ఈ విధంగా నిలదీస్తున్నారు.
నీకు మాంసంకవాలంటే కరువా?
నీచేతిలోనే లేడి ఉందికదా! ఇంకో చేతిలో చక్కని గొడ్డలి ఉందిగా,
నెత్తిమీద నీరుందికదా! నీ మూడవ కంట్లో అగ్ని ఉందికదా!
మంచి పాకంగా వండుకొని తినే వీలుందికదా!
మరి ఆ తిన్నని ఎంగిలి మాంసం ఎందుకు తిన్నావయ్యా? ఓ కాళహస్తీశ్వరా!
- అని నిలదీస్తన్నాడు.
ఎంత చమత్కారంగా
ఎంత రమణీయంగా
అడిగాడో చూడండి.
అడిదము సూరకవి ఒకసారి విజయనగర ప్రభువు విజయరామరాజు
మీద ఏకవచన ప్రయోగంతో ఒక "రా" వచ్చేట్టు పద్యం చెప్పాడు.
రాజుగారు ఏమీ అనలేదుగానీ రాజ బంధువు సీతారామరాజుకు
కోపం వచ్చి ఆక్షేపించాడు. అప్పుడు సూరకవి ఆవిధంగా
చెప్పటంలోని ఔచిత్యాన్ని, అందాన్ని
ఇలా సమర్థించుకున్నారట.
ముక్కుతిమ్మన ముక్కమీద ఒక పద్యం చెప్పి ఒకరికి ఇవ్వగా
ఆపద్యం నచ్చి రామరాజభూషణుడు(భట్టుమూర్తి) అది కొని
తన వసుచరిత్రలో రాసుకున్నాడని ఒక కథ ప్రచారంలో ఉంది.
కానీ ఇది నిజంకాదని అది వేరొక పద్యమై ఉంటుందని పండితులు,
పరిశోధకులు భావిస్తున్నారు.
ఆ ముక్కుమీద చెప్పిన పద్యం
ఇదని ప్రచారం చూడండి.
నానాసూన వితానవాసనల నానందించు సారంగ మే లా నన్నొల్ల దఁటంచు గంధఫలి బల్కాలం దపం బంది యో షా నాసాకృతిఁ దాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసి యై పూనెం బ్రేక్షణమాలికా మధుకర పుంజంబు లిర్వంకలన్
ఈ పద్యాన్ని నాలుగువేల వరహాలిచ్చి
రామరాజభూషణుడు కొన్నాడని ప్రతీతి.
ఇది ఎంతమాత్రం సరైనదికాదు.
ఇది కవులను గూర్చి మనవారు కల్పించే కల్పనాకథ మాత్రమే.
అయినా నంది తిమ్మన కాలంలో రామరాజభూషణుడు లేడు.
ఒకవేళ ఉన్నా వసుచరిత్ర అంతటి కావ్యం రాయగల వానికి ముక్కుపై
ఇంత కల్పన చేయలేకపోయాడనడం పరిహాసాస్పదం అన్నాడు - వీరేశలింగంగారు.
ఈ ఐతిహ్యము అంత విశ్వాసపాత్రంగాలేదని - డా. దివాకర్ల వేంకటావధాని అన్నారు.
ఆఁడుదాని అంగప్రత్యంగములు వర్ణనము చేయుట వసుచరిత్రకారుని లక్షణము.
ఈ లక్షణము తిమ్మన పారిజాతాపహరణములో మచ్చుకైనా కనబడదు.
అట్టి వర్ణనలు చేయుట తిమ్మనగారి స్వభావములో లేదు.
కావున నిస్సందేహంగా ఇది రామరాజభూషణునిదే కాని తిమ్మన కృతికాదు.
ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుని
ఆస్థానంలో ఉండిన విద్యానాథుని(అగస్త్యుని)
"నలకీర్తికౌముది" అనే సంస్కృతకావ్యంలో
ఈ క్రింది శ్లోకం ఉన్నది.
భృంగానవాస్తి ప్రతిపన్నఖేదా కృత్వాననే గంధఫలీ తప:ఫలమ్ తన్నాసికా భూ దనుభూతగంధా స్వపార్శ్వనేత్రీకృతభృంగసేవ్యా
ఈ శ్లోకం భావం గ్రహించి రామరాజభూషణుడు
"నానాసూన వితానవాసనల" - అనే పద్యం రచించి
ఉండవచ్చని టేకుమళ్ల అచ్యుతరావుగారి అభిప్రాయం.
(ఆంధ్రవాఙ్మయచరిత్రము పుట. 206 - టేకుమళ్ల అచ్యుతరావు)
"ఊరక రారు మహాత్ములు" అన్నది ఇప్పుడు విరివిగా వింటుంటాం.
ఇంతకు ఇది ఎక్కడిది? - అని ఆరా తీస్తే
ఈ విషయం తెలుస్తుంది.
ఇది మొదట అన్నది ఎవరు అంటే నందుడు.
అసలు సంగతేంటి అంటే వసుదేవుని కోరికమేరకు
యాదవుల పురోహితుడు వ్రేపల్లెకు వచ్చాడు
ఆ సమయంలో నందుడు ఆయనకు
ఉచితోపచారములు చేసి
ఈ పద్యం చెప్పాడు.
ఊరక రారు మహాత్ములు వా రధముల యిండ్లకడకు వచ్చుట లెల్లం గారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా!
(శ్రీమదాంధ్రమహాభాగవతము -10-284)
అని అన్నాడు.
(మహాత్ములైనవారు ఏ పని లేకుండా ఊరకే రారు.
తక్కువ స్థాయిలో ఉన్న మావంటి వారి ఇంటికి వచ్చారంటే
దానికి కారణం మాకు శుభములు చేకూర్చడానికే అవుతుంది.
మహానుభావా! మీరాక చాలా శుభం కలిగిస్తుంది.
నాకు బాగా తెలుసు.)
దీన్ని ఇప్పుడు వ్యంగంగా కూడా ఉపయోగిస్తున్నారు.
ఇది వ్యావహారికంలోకి ఎంతలా చొచ్చుకు పోయిందో!
మనందరికీ తెలుసు.
కలికిరొ చెక్కుల మకరికలు చెడలేదు?
చందనం చన్నుల చెదరలేదు?
కన్నుల కాటుక జారలేదు?
పెదవి తాంబూలంచే ఏర్పడిన ఎరుపు చెడలేదు?
ఓ గజగామినీ! నీవు కోప్పడ్డావా?
లేక
నీ భర్త పసివాడా?
నేను -
నాపతిని కోపించుకోలేదు.
అతడు నిద్రపోలేదు.
కురూపి కాడు.
వృద్ధుడు కాడు.
బాలుడు కాడు.
బలహీనుడు కాడు.
వ్యాధిగ్రస్తుడు కాడు.
మూర్ఖుడు కాడు.
కాని
నవయౌవనంలో ఉన్న చంద్రముఖినైన నన్ను
చూడగానే మన్మథావేశంతో
రాక్షసగురుని(శుక్రమును) విడచినాడు
- నేను తెల్లబోయాను.
- అని సమాధానం చెప్పింది.
(ఇది కాళిదాసు "శృంగారతిలకము"లోనిది.)
సాధారణంగా భౌతికంగాలేని మహనీయుల
పుట్టినరోజులను జయంతి అని వాడుకలో వాడుతున్నారు.
దీన్ని గురించి "వాడుకతెలుగులో అప్రయోగాలు" అనే పరిశోధకగ్రంథంలో
వివరించడం జరిగింది.
దాన్ని ఒకసారి గమనిద్దాం.
మేదినీకోశంలో (నానార్థ నిఘంటువు) - జయంతీ అంటే వృక్షవిశేషం(తక్కిలి చెట్టు), పార్వతి, ఇంద్రసుత, పతాక అనే అర్థాలున్నాయి.
అమరకోశంలోనూ జయంతీ పదానికి వృక్షవిశేషమనియే ఉన్నది.
వాచస్పత్య నిఘంటువులో - జయంతీ అనే పదానికి దుర్గాశక్తి,
ఇంద్రసుత, పతాక,తక్కిలి చెట్టు, యాత్రాయోగవిశేషములతోపాటు రోహిణీ నక్షత్రముతో కూడిన శ్రావణ కృష్ణాష్టమి అనే అర్థాన్ని కూడా చూపింది.
ఏ నిఘంటువులోను జయంతీ అనే శబ్దానికి జన్నదినం అనే అర్థం చూపలేదు.
కానీ ఈ లోకంలో శంకర జయంతి,
నృసింహ జయంతి, గాంధీ జయంతి
మొదలైన పదాలలో జన్మదినం అనే అర్థంలో వాడుకలో ఉన్నది.
ఐతే ఈ శబ్దానికి కేవలం జన్మదినం అనికాక అవతారపురుషుల
జన్మదినం, మరణించిన మహాపురుషుల జన్మదినం అనే
విశేషార్థంల్లో వాడుకలో ఉంది.
వాచస్పత్య నిఘంటువులోని ప్రమాణం విష్ణుధర్మంలోనిది -
వీటి ఆధారంగా జయంతీ శబ్దానికి రోహిణీ నక్షత్రంతో
కూడిన కృష్ణాష్టమి అనే అర్థమే తేలుతుంది.
కానీ జన్మదినం అనే అర్థం రాదు.
కాని కృష్ణాష్టమి కృష్ణుని జన్మదినం కావడం వల్ల
రోహిణీ నక్షత్రంతో కూడిన కృష్ణాష్టమిని తెలియజేసే
జయంతీ శబ్దం మహాత్ముల జన్మదినంగా
వ్యాకోచాన్ని పొంది ఉండవచ్చు.
ఇంటిపేరు "నస" - కవిత్వం బహు"పస" అని అంటూ ఉంటారు.
ఆయనే చేమకూర వెంకటకవి.
ఈయన విజయవిలాస, సారంగధర మొదలైన కావ్యాలను రచించినవారు.
విజయవిలాసం అనేది అర్జునుని తీర్థయాత్ర.
దీనిలో ముగ్గురు నాయికలతో అర్జునుని విలాసం.
అందులోని 1-104వ పద్యం ఇది చూడండి.
ఉత్తరాలు రాయడం ఇప్పుడు లేదనే చెప్పాలి.
కాకపోతే అక్కడక్కడ అప్పుడప్పుడు అర్జీలలాంటివి
ఇంకా కొనసాగుతగన్నవనే చెప్పాలి.
వీటిలో శ్రీ-లు రాస్తుంటాము.
శ్రీశ్రీశ్రీ - ఇలా రాసిన తర్వాత మిగతా విషయం ఉంటుంది.
అయితే ఎవరికి ఎన్ని శ్రీ-లు వాడాలి అనేది ఒక లెక్క ఉండేది.
దానికి సంబంధించిన వివరాలు
ఈ పద్యంలో ఉన్నాయి
చూడండి.
ఒకటి సుతునకు, చెలికాని కొప్పు రెండు మూఁడు సమునకు, వైరికి మూఁడు నొకటి యైదు గురునకు, నేలిక కాఱు శ్రీలు ఏడు భూపాలునకు దగు నేర్పడంగ
ఇది దేవరకొండ బాలగంగాధర్ గారి
"అమృతంకురిసిన రాత్రి" లోనిది
ఎలావుందో చూడండి
ఈ కవిత.
స్టేషన్లో టికెట్లును జారీ చెయ్యకండి ఎక్కడి రైళ్ళు అక్కడ ఆపివెయ్యండి దేశదేశాలకు కేబుల్ గ్రమ్స్ పంపించండి దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి ఆకాశవాణిలో ఈ విషయం ప్రకటించండి కాఫీహోటళ్ళలో క్లబ్బులలో కర్మాగారాల్లో కాస్త జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి సముద్ర తీరాలలో నదీజలాలలో వెదకండి సాయుధ దళాల్ని దిక్కులలో నిబెట్టండి రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి అడుగుజాడల్ని కూపీ తియ్యండి వేలిముద్రల్ని పరీక్షించండి ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు కంగారులో భయంతో గుసగుసలాడుతున్నారు విజ్ఞానవేత్తలు నాగరికత పైతోలు వొలుస్తున్నారు మనుష్యభక్షకులు నేడు చంకలు కొట్టుకుంటున్నారు కావ్యచర్చలు కళాలయాలు ఆకర్షించటం లేదు రాజకీయవేత్తల ఉపన్యాసాలు ఎవరూ వినడం లేదు సైంటిస్టులు ఒక్కొక్కరే ఆత్మహత్య చేసుకుంటున్నారు స్వార్ధజీవనులు గభాలున రొమ్ములు బాదుకొంటున్నారు సిద్ధాంతాలు చర్చలూ ఎవరూ చేయడం లేదు సిరా యింకకుండానే ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు అతృప్త అశాంత ప్రజా పారావార తరంగం అంచుల్ని దాటి భీకరంగా విరుచుకు పడుతోంది ఇంక చరిత్రలు రాయనక్కర లేదు ఇంక రాజ్యాలు పాలించ నక్కరలేదు అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నది ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ - మన జాతిని మనం కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం వెతికి తీసుకురండి పరారీ అయిన వ్యక్తిని వేరు దారిలేదు కదలండి కదలండి జై అని. అపార కృపా తరంగితాలైన నయనాంచలాలు ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరీమళాలు సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి సదా ప్రజా హితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్నీ తిరస్కరిస్తుంది తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి
ఈ పద్యంలో పాదాది కేశ పర్యంతం వివిధ అవయవాలను జంటలుగా
తీసుకొని శుభవచనాలు పలికాడు కవిసార్వభౌముడు.
ముందు పాదాల నుంచి ముంగురులదాకా ఒక్కసారి పరకాయించి చూశాడు.
వాటికి దీర్ఘాయువగు గాక - అని ఆశీర్వదించాడు.
ఎదురుగా వస్తున్నది కాంత,
ముఖం కనిపించింది. నఖాలు కనిపించాయి.
చంద్రుడు నక్షత్రాలు ఉన్నంతవరకు వాటికాంతి ఉండుగాక - అని ఆశీర్వదించాడు.
వదనాన్ని చంద్రబింబంతోను, గోళ్ళను నక్షత్రాలతోను పోల్చటం సంప్రదాయం.
తరువాత పిరుదులు, నడుము - వరుసగా మన్ను మిన్ను ఉన్నంతకాలం
వాటి మహిమ ఉండును గాక!
- అని(ఇక్కడ క్రమంగా తగిన ఉపమానాలే, వైశాల్యానికి మన్ను - భూమి,
శూన్యత్వానికి సన్నగనానికి నడుము మిన్ను(ఆకాశం)),
గాన(మాట), వీక్షలు(చూపు) నొమలిగొంతులా, లేడి కన్నులలా విజయం పొందునుగాక!
ఇక వేరువేరు అవయవాలను వదలి సార్థకమైన
జంట వక్షోజాలను గ్రహించి బంగారు కుండలవలె, ఐరావత కుంభాల వలె
అలరేటి మేరు మందర పర్వతాలు
ఉన్నంతకాలం కుశలం కలుగుగాక! -
అని తృప్తితీర ఆశీర్వదించాడు.
శ్రీ అనంత పంతుల రాలింగస్వామిగారు నేటి విమర్శకులు ముచ్చటగా
మూడు విధాలని హాస్యప్రాయంగా క్రింది పద్యంలో చెప్పారు.........
చూడండి.
ఉన్నది ఉన్నదంచనుచు నుఁడెడి వాడధముండు, తెల్వి మై ఉన్నది లేదటంచనుచు నుండెడి నాతడు మధ్యముండు, లే కున్నది యున్నదంచనుచు నుండు నతండిలనుత్తముండ యా, నెన్నగ ముత్తెరంగులు మహింగల యట్టి విమర్శకుల్ వెసన్
1.ఆయా గ్రంథాలలో ఉన్న మంచిని విమర్శించువాడు
అధమ విమర్శకుడు,
2. ఆధిక తెలివిని ప్రదర్శిస్తూ, ఆ గ్రంథాలలో ఉన్న మంచిని
లేదంటూ పేర్కొనువాడు మధ్యముడు,
3. ఇక, ఆ పుస్తకాలలో చెప్పబడని, లేని, మంచిని, విషయాన్ని,
ఉన్నదని ఉగ్గడించేవాడు ఉత్తమవిమర్శకుడు.......
గా ప్రపంచంలో చెలామణి అగుచున్నారు.
మిత్రా!
చాతకమా!
ఒక్కమాట సావధానంగా విను.
ఆకాశంలో మేఘాలు అనేకములు.
అన్నీ ఒక లాటివేకాదు.
కొన్ని భూమిని ఫలింపచేస్తాయి.
మరి కొన్ని కేవలం ఉఱిమిపోతాయి.
కనిపించిన ప్రతి మేఘం దగ్గర
దీనంగా యాచించవద్దు.
అంటున్నాడు కవి.
నిజమేకదా!
తొందరా చదవటం
మూలుగుతూ చదవటం
తల ఆడిస్తూ చదవటం
వ్రాస్తున్నట్లుగా చగవటం
అర్థ జ్ఞానం లేకుండా చదవటం
నీరసంగా చదవటం - అనే
ఈ 6 అధమ పాఠకుని లక్షణాలు.
గమనించండి మనవారిలో ఎవరైనా ఉన్నారేమో?
ఇప్పటినుండైనా ఈ లక్షణాలను మానేట్లు చేద్దాం.
రామచంద్రే "రణ" ప్రాప్తే మధ్య "మం" నాక యోషిత ఆది "మం" లేభిరే వీరా భీరమశ్చ ఆది "చం" రణమ్
రామచంద్రుడు "రణమ్" (యుద్ధము) నకు వెళ్ళినాడు.
నాకయోషిత (దేవతా స్త్రీలు)
(రణ మధ్య "మ" ను పొందిరి) "రమణ" రమణులను పొందిరి.
వీరులు ఆది "మ" ను పొందిరి - "మరణ" - మును పొందిరి.
భీరువులు (పిరికివారు) ఆది "చ" ను పొందిరి
అనగా
చరణములను పొందిరి.
సాహితీమిత్రులారా!
సామాన్యమానవులు పరిహాసాలాడడం, ఛలోక్తులు విసరడం
మనం గమనించేవే కాని దేవతలు సైతం పరిహాసాలాడడం
మనం ఇక్కడ గమనించ వచ్చు.
గంటి కృష్ణవేణమ్మగారు "గిరిజా కల్యాణము" - అనే కావ్యంలో
"బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు" వివాహభోజన సమయంలోని
సరససంభాషణలు ఇలా చిత్రించారు చూడండి.
ప్రతి కావ్యంలో ప్రతికవి కుకవి గురీంచిన పద్యం రాయడం పరిపాటి.
ఇక్కడ క్రీ.శ. 1932లో అనంతపంతుల రామలింగస్వామి అనుకవి
రచించిన శుక్లపక్షము అనే హాస్య కావ్యం రాసి ముద్రింపిచారు.
అందులో కుకవి నింద
ఎంత
తమాషాగా
రాశారో
చూడండి.
రసము నే నెఱుంగనా? ప్రారబ్దమిదియేమి? ద్రవిడదేశాన్నసత్రముల నిడరె? సముచితాలంకారసమితి నే నెఱుగనా? మగువలు ధరియించు నగలు కావె? యతిని నే నెఱుగనా? క్షితిలోన కాషాయవస్త్రధారుండైనవాడు కాడె? గురువు నే నెఱుగనా? సరిసరి! అక్షరా భ్యసనంబు సల్పిన యతడు కాడె? శబ్దమన నే నెఱుంగనా? చప్పుడు గదె? అనుచు వచియించు అజ్ఞాన జనములోన అగ్రగణ్యుండవగు నీ వహా! కవిత్వ మును రచించుట భాషకు ముప్పు గాదె?
సరస్వతిని ఆరాధించువారు అనేకులు.
కాని సారస్వతసారము గురుకులములో
శ్రమపడి విద్యను అభ్యసించిన ఒక "మురారి" కే తెలియును.
సముద్రమును ఎన్నియో కపులు దాటినవి.
కాని సముద్రపులోతు - పాతాళం వరకు మునిగిన
మందరపర్వతానికే తెలియును!
నాయిక పరపురుషుని దంతక్షతము పొందినది
అంతలోనే భర్త వచ్చినాడు.
అతనికి అనుమానం రాకుండా
చెలికత్తె నాయికతో
"ప్రియురాలి పెదవి గాటు చూచిన ఏ ప్రియునికి రోషం రాదు?
నేను చెప్పినా వినక తుమ్మెద ఉన్న పద్మమును అఘ్రాణించితివి!
కర్మను అనుభవింపుము!"
అని భర్త వినేట్లుగా అంటున్నది.
అన్నను చంపినవాడు,
తండ్రిని చంపినవాడు,
తల్లిని చంపినవాడు
ఈ ముగ్గురు మహాభక్తులు.
వీరికి నమస్కారం.
ఎట్లా
అన్నను చంపినవాడు, తండ్రిని చంపినవాడు, తల్లిని చంపినవాడు
మహాభక్తులా?
ఎవరువారు?
అన్నను చంపినవాడు(విభీషణుడు),
తండ్రిని చంపినవాడు (ప్రహ్లాదుడు),
తల్లిని చంపినవాడు(పరశురాముడు)
ఈ ముగ్గురు మహాభక్తులు.
వీరికి నమస్కారం.
సదాశివ సద్గురువర్యా దేశంలో గొప్పగొప్ప కవీశ్వరు లెందరో,
ఇతరుల కవిత్వాన్ని, దానిలోని ఇంపుసొంపులను వినాలనుకుంటారు.
విన్న తర్వాత వానిలోని మంచి చెడ్డలను,
అర్థనర్థాలను తనకుతోచినట్లు స్పష్టంగా, తెల్పుతారు.
తిరస్కరింపక, చొరవ తీసుకొని, ఇక్కడ ఇది ఇలా ఉంటే బాగుంటుందని,
దిద్దిచెబుతారు.
ఇక సరిగా,
చదువురాని మూర్ఖుడు(గరాసు), దుష్టుడైనచో,
వెదకి వెదకి ఆ కవిత్వంలోని ఒప్పులను విడచి
తప్పులను మాత్రమే పట్టుకొంటాడు.
విడిచి పెట్టక వానిమాటలకు, విపరీతార్థాలు,
పెడార్థాలు తీసి, క్రూరత్వం, గర్వం కూడా ప్రదర్శిస్తాడు,
వాని తస్సదియ్య అలాంటివాని
తలకాయ తీసివేసినా తప్పులేదు సుమా!
కవితావినోదము (మొదటి సంపుటి)లో
విద్వాన్ కావ్యతీర్థ మద్దుపల్లి వేంకటసుబ్రమణ్యశాస్త్రిగారు
ఈ విధంగా రాసి ఉన్నారు.
1925నుండి 1934 వరకు నంద్యాల మునిసిపల్ హైస్కూల్ నందు ఉండేవారు.
తరువాత కర్నూల్, సెంటుజోసఫ్స్ గరల్స్ హైస్కూలులో
చేరినపుడు వారికి ఈ విధమైన ఆలోచన వచ్చిందట.
ఇప్పుడు ఈ పాఠశాలలో ఉద్యోగం దొరకుటకు కారణమేమి?
అని ఆలోచించగా
ఈ విధమైన శ్లోకం వచ్చిందట.
27-02-1960లో రాయబడింది.