Wednesday, October 31, 2018

తలుపుల రసీదు


తలుపుల రసీదు



సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి............

బొబ్బిలిలో యూనివర్సిటీ పెట్టే విషయంలో పెద్దగొడవ జరిగింది. గొడవ బొబ్బిలి వాళ్ళకి విజయనగరం వాళ్ళకి మధ్య కాదు. బొబ్బిల్లో ఉన్న బొబ్బిలి వాళ్ళ మధ్యే. యూనివర్సిటీ పేరు పెట్టడంలో పేచి వచ్చింది. కొందరు వీరబొబ్బిలి యూనివర్సిటి అనాలని, కొందరు “కాదహే…. రెండొందల ఏబైమంది ఇక్కడ మిగలకుండా చచ్చిపోతే ఈరత్వం ఏడంటుంది? ఉప్పుడు మనం అంతా కేవిస్ కాబట్టి వి బిల్ కాదు కెవిబిల్ ఊనివర్సిటి అని పేరు పెట్టాలి” అని. ఇదీ గొడవ. కేవి అని పెడితే కులం తీసుకొచ్చినట్లవుతుందని కొందరు వాదించారు. యూనివర్సిటీ అత్యున్నత అధికారులను కులపతి, ఉపకులపతి అని అంటారు కదా అని వెంఠనే మరొకరన్నారు. కులపతి అంటే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అని బోధపరిచి ఎలాగో ఒకలాగా అందరిని ఒక కొలిక్కి తీసుకొచ్చాను.

బోష్టన్ యూనివర్సిటిని బియు అంటారు. బ్రౌన్ యూనివర్సిటి ఉంది. బర్మింగ్ హమ్ యూనివర్సిటీ ఉంది. ఇలా చాలా బితో మొదలయ్యే యూనివర్సిటీలు ఉన్నాయి. మనం కూడా బొబ్బిలి యూనివర్సిటి అని పేరు పెడితే బియు ఆఫ్ ఇండియా అంటారు. వాళ్ళంతా మనతో కలిసి బొబ్బిలి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తారు అని రాత్రి పగలు కష్టపడి అందరిని బొబ్బిలి యూనివర్సిటీ అన్న పేరుకు ఒప్పించాను.

అందరిని ఒప్పించేను కాబట్టి వీళ్ళతో కలిసి పనిచేసి యూనివర్సిటిని నిలిపి నాలుగు డిగ్రీలు ఇచ్చి పదిమందికీ పనికి వచ్చేలా ఓ రూపకల్పన చెయ్యమన్నారు. దేశంలో వేల వందల యూనివర్సిటీలు కావాలని అందరూ అంటున్నారు. కాని వాటిని నడపడానికి, పాఠాలు చెప్పడానికి, మంచి రిసెర్చి చెయ్యడానికి కావల్సినంత మంది మనుషులు లేరు. ఇంజినీరింగ్ కాలేజీలకే దిక్కు లేకుండాపోతున్నాది మరి యూనివర్సిటీ అంటే మాటలా. మీరు ఇక్కడ ఉండి ముఖ్యమైన వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకొని అప్పుడు కాని మీరు వెళ్ళండి అన్నారు.

బొబ్బిలి యూనివర్సిటి నడపడానికి అర్హులైన వాళ్ళు అన్ని రకాల ఉద్యోగాలకి కావలెను అని ప్రపంచవ్యాప్తంగా నెట్ ప్రకటన ఒకటి ఇచ్చాం. వచ్చినవాళ్ళకి ఇవాళ ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ఇప్పటికే ఓ ఇరవై మందిని ఎడ్మినిస్ట్రేషన్ లో ఒక ముఖ్యమైన ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేసాం. దేశదేశాల నుండి వచ్చిన తెలుగు వాళ్ళున్నారు. ఇంకా మరో పది మందిని ఇంటర్వ్యూచెయ్యాలి. ఒక్క పదినిముషాల విరామం తరువాత మొదలుపెడ్తాం అని అనుకొన్నాం.

నేను ఎలక్ట్రానిక్ పేపరు రెండు చేతుల మధ్య పట్టుకొని చదువుతున్నాను. ఈ ‘ఈ-పేపరు’ పూర్వం అచ్చం పేపరు చదివినట్లే విప్పి రెండు చేతులతో పట్టుకొని చదువుకోవచ్చు. పూర్వం లేప్‌టాప్ లాంటి స్క్రీన్ లో చక్కగా అన్ని రంగులు అచ్చం కాగితం మీద కనిపించినట్లు కనిపిస్తాయి. సేటిలైట్ ద్వారా వచ్చే సంకేతాలతో మొత్తం పేపరంతా చదవచ్చు. ఈ పరికరంలో ఏ పేపర్ కావాలంటే ఆ పేపరు, ఇంగ్లీషు, తెలుగు ఏభాష కావాలంటే ఆ భాషలో చదవచ్చు. తెలుగు పేపరుని ఇంగ్లీషులో, లేమాంద్ అన్న ఫ్రెంచి పేపరుని తెలుగులో చదవచ్చు. అంతా గూగుల్ టెక్నాలజీ మహిమ.

సరిగ్గా అలాంటపుడు ‘మే ఐ కమిన్… నేను రావచ్చా?’ అని రెండు భాషలలో అంటూ పొడవైన ఒక అభ్యర్థి లోపలికి వచ్చాడు. అంటే విరామ సమయం అయిపోయిందన్నమాట అని అనుకొన్నాను, ఈపేపర్ ని చుట్టి జేబులో పెన్నులా పెట్టుకొంటూ!

అతన్ని ఎక్కడో చూసాను సుమా అని అనుకొన్నాను. అచ్చం మా కనకప్రసాద్ లాంటి మొహం. కళ్ళద్దాలు కూడా అలాగే అనిపించాయి. వయస్సు 55 దాటి ఉంటుంది. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎవరూ కళ్ళద్దాలు పెట్టుకోవడం లేదు. కళ్ళకి కావలసిన సర్జరీలు చేయించేసుకొంటున్నారు. ఇదుగో ఇలా ఏభైలు దాటిన వాళ్ళే అలవాటు కొద్ది కళ్ళజోళ్ళు పెట్టుకొంటున్నారు.

“మీపేరు” అని అడిగాను.

“తలుపుల రసీదు” అన్నాడు తెలుగు కొత్తగా నేర్చుకున్నవాడిలా.

“తలుపుల ఇంటిపేరు అయ్యుండాలి, రైట్!” అన్నాను నవ్వుతూ.

“అవునండి. మాదికూడా బొబ్బిలే” అదో క్వాలిఫికేషన్ లా అన్నాడు.

“కాని ఈ రసీదు అన్న పేరే ఆశ్చర్యంగా…”

“నా అసలు పేరు రషీద్ అండీ. చాలామంది సరిగ్గా పిలవలేక చివరికి రసీద్, రసీదు అయిపోయిందండి” అన్నాడు కొద్దిగా సిగ్గుపడుతూ.

“సరే. మీరేం చదువుకొన్నారు…” అని బటన్ నొక్కి నా అరచేతిలో ఉన్న గూగుల్ ఆర్గనైజర్లో అతని పేరుతో ఉన్న బయోడేటాని వెతుక్కోవలసి వచ్చింది. ఎక్కడా డిగ్రీ కనిపించలేదు. మిస్సయ్యేనేమోనని మరొకసారి చూసాను. లేదు. మీకు ఏ డిగ్రీ లేదా? అన్నాను ఆశ్చర్యంగా.

“లేదండి…” అన్నాడు వినయంగా

“మరి ఇంటర్వ్యూలోకి ఎవరు రానిచ్చేరు” అని గట్టిగా అరిచాడు ఇంటర్వ్యూ చేసే మరో కమిటి సభ్యుడు.

“నన్ను పిలవలేదండి. కానీ ఉద్యోగం తప్పక ఇస్తారన్న ఆశతో నా అంతట నేనే లోపలికి తలుపు తోసుకొచ్చానండి” అని ఓ క్షణం ఆగి “క్షమించండి” అన్నాడు.

“క్షమించేం. వెళ్ళండి. పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లతో ఎంతోమంది బయట వెయిట్ చేస్తున్నారు” అన్నాను చిరాగ్గా.

“నా బేక్ గ్రౌండ్…”

“రిజర్వేషన్లంటే లాభం లేదండి. రిజర్వేషన్లు పోయి చాలా ఏళ్ళు అయ్యింది. మీరు ముస్లిం అయినా మరేదయినా నో యూజ్” అన్నాను వెళ్ళమని చెయ్యి చూపిస్తూ.

“నా ఎక్స్పీరియన్స్…”

“ఏంటి మీ ఎక్స్పీరియన్స్…” ఒక కమిటీ సభ్యుడు మర్యాదగా అడిగాడు.

“అమెరికాలో…”

“అమెరికాలో ఎక్స్పీరియన్స్ ఎవడికి కావాలండి…” అన్నాడు ఇంకో కమిటీ మెంబరు.

“అమెరికాలో నేను ఒక పెద్ద సంస్థ నడిపానండి.” అన్నాడు ఒక పెద్ద ఫైల్ తీసి టేబుల్ మీద పెడుతూ.

“ఆ సంస్థ ఏం చేసేది.”

“కంప్యూటర్ల ఆపరేషన్ సిస్టమ్స్, ప్రోగ్రామ్ లు…”

“సరే మరి అవన్ని మీరు మాకు పంపారా?”

“పంపానండి”

“మరి మా గూగుల్ ఫోన్ ఆర్గనైజర్ డేటాబేస్ లో లేవే!” అన్నాం అందరం గబగబ మరోసారి వెతికి.

“బహుశా ఫార్మాట్ ప్రాబ్లమ్ అయింటుందండి… నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010లో పంపానండి.”

“అలా చెప్పండి గూగుల్ డాక్స్ లోనే గత పదేళ్ళుగా ప్రపంచం ఉంటే మీరు ఇంకా ఎప్పుడో పాత మైక్రోసాఫ్ట్ పట్టుకు వేలాడితే ఎలా?” అతను చెప్తున్న ప్రతి మాటని నేను గూగుల్ ‘బ్రెయిన్’ లోకి పంపుతున్నాను. కంప్యూటర్లు పోయి లేప్‌టాప్‌లు, లేప్‌టాప్‌లు పోయి గూగుల్ బ్రెయిన్‌లు వచ్చేసాయి. నానో టెక్నాలజీ, బయోమెటీరియల్ సైన్సులు బాగా డెవలప్ అయి టెరాబైట్ కంప్యూటర్లు చిన్న క్రెడిట్ కార్డు సైజుకి దిగిపోయాయి. దాన్ని కూడా అతి పల్చగా తయారు చేస్తున్నారు. దాన్ని విడిగా పట్టుకొని తిరగడం కష్టం కాబట్టి కావాలనుకొన్న కొంతమంది తలపై భాగంలో ఓ చిన్న సర్జరీతో అమరుస్తారు. దానిని మనుషులు ఆలోచనతో నడుపుతారు. ఆలోచనల తీరు, జోరు, ఆ గూగుల్ బ్రెయిన్ కనిపెట్టి అడిగిన వివరాలను అందిస్తుంది. దానికి కావలసిన విషయాల కొన్ని దానిలో పొందు పరిచినా అపారమైన విజ్ఞానాన్ని, విశేషాలని, వివరాలని సేటిలైట్ ద్వారా నానో సెకన్ల లో తీసుకొంటుంది. మౌఖికం పోయి తాళపత్రాలు, తాళపత్రాలు పోయి అచ్చుపుస్తకాలు, అచ్చుపుస్తకాలు పోయి కంప్యూటర్లు, కంప్యూటర్లు పోయి గూగుల్ బ్రెయిన్ వచ్చేసింది.

సాధారణంగా మాలాంటి వాళ్ళంతా గూగుల్ బ్రెయిన్ తో పని చేస్తున్నాం చాలా మట్టుకి. అప్పుడప్పుడు మాత్రమే స్వంత బ్రెయిన్ వాడేది. అది కూడా ఏదో అమ్మాయితో, ప్రేమగా కబుర్లు చెప్పడానికి మాత్రమే. అనుభూతులు ఇంకా గూగుల్ బ్రెయిన్ పరిధిలోకి రాలేదు. అనుభవాలని మాత్రం దాస్తున్నది.

మిగిలిన కమిటీ సభ్యులు అతనిని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అతను తాపీగా సమాధానాలు చెప్తున్నారు. నేను కళ్ళు మూసుకొని అతని సమాధానాలని నా గూగుల్ బ్రెయిన్ లోకి పంపుతున్నాను. గూగుల్ బ్రెయిన్‌ని ఈ సమాధానాలని అన్నింటి శోధించి అతని గురించిన అసలు వివరాలని ఇమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అది ఇచ్చిన సమాధానం విని ఆశ్చర్యంతో లేచి నిలుచున్నాను. నోటమాట రాలేదు. ఏమైయిందో తెలియక నాతో పాటే అందరూ నిలుచున్నారు. నేను కొద్దిసేపటికి తేరుకొని…

“మీరు బిల్ గేట్సా?” అన్నాను ఒక్కొక్క అక్షరం వత్తి పలుకుతూ.

“అవును. చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయాను మా కుటుంబంతో. అసలు పేరు మీద మమకారంతో తలుపుల రసీదు పేరుని బిల్ గేట్స్ గా మార్చుకొన్నాను”, అన్నాడు చిర్నవ్వుతో!
-----------------------------------------------------------
రచన: కలశపూడి శ్రీనివాసరావు, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, October 30, 2018

తైల వర్ణ (వి)చిత్రం


తైల వర్ణ (వి)చిత్రం




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి................

న్యూయార్కు నగరం పొలిమేరలో ఉంది మా ఇల్లు. అందువల్ల అర్థరాత్రి అయినా సరే మా ఆవిడతో పాటు లాంగ్‌ ఐలెండ్‌ జ్యుయిష్‌ మెడికల్‌ సెంటరు మీదుగా, లేక్‌వీల్‌ రోడ్డు మీద ఓ రెండు మైళ్ళు అటు ఇటు వాకింగ్‌కు వెళ్ళడానికి వీలవుతుంది. ఆకురాలు కాలం ప్రారంభం అవ్వగానే మారీ మారని ఆకులు వివిధ రంగులు సంతరించుకుంటున్న ఒకానొక రోజు సాయంత్రం తొమ్మిది గంటలకి భోజనం చేసి “వాక్‌”కి వెళ్ళాం. దార్లో ఉన్న ఓ బస్‌ స్టాప్‌ లో ఓ ఆఫ్రో అమెరికన్‌ (వాళ్ళని నల్లవాడు అని అనకూడదని మా వాడికి స్కూల్లో నేర్పింది వాడు మాకు ఇంట్లో నేర్పేడు) భుజానికో సంచి, చేతిలో ఓ చిన్న పెట్టెతో ఒంటరిగా బస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. మేం మా వాకింగ్‌ పూర్తి చేసుకొని వెనక్కి వస్తుంటే మళ్ళీ అక్కడే కనిపించాడు దూరం నుండే.

“ఆఖరి బస్‌ మిస్సయ్యేడేమో” అంది కరుణ అని పిలవబడే మా ఆవిడ కె. అరుణ.

“అంటే అతన్ని ఇప్పుడు మనింటికి తీసుకెళ్ళి ఈ రాత్రి ఉంచాలనా నీ ఉదేశ్యం?” అన్నాను భాషకి అందని భావాల్ని పదాల మధ్య “స్మగ్లింగ్‌” చేసే మా ఆవిడ తత్వం తెలిసిన నేను. “వద్దన్నానా?” ఆమె సంక్షిప్త, సాధికార సమాధానం  ప్రశ్నగా. “ఇప్పటికే ఇల్లు సత్రం చేసానంటున్నావ్‌” అని ఆగిపోయాను. “అన్నా అనకపోయినా అయ్యేది అదేగా” అంది నవ్వుతూ. ఇంతలో బస్‌స్టాప్‌ దగరికి వచ్చాం.

“లాస్ట్‌బస్‌ మిస్‌ అయ్యారా?” అని అడిగాను ఇంగ్లీషులో. “లాస్ట్‌బస్‌ ఎప్పుడు?” అని వచ్చీరాని ఇంగ్లీషులో ఫ్రెంచియాసతో అడిగాడు.

బహుశా పూర్వం ఫ్రెంచి వాళ్ళు పాలించిన ఏ ఆఫ్రికా దేశస్థుడో అయి ఉంటాడని అనుకొని మనకొచ్చిన ఫ్రెంచిభాష వెలగబెట్టడానికి అవకాశం వచ్చింది కదాని మనసులో సంతోషించి ఫ్రెంచిలో సంభాషణ సాగించాం.

బస్‌ స్టాప్‌లో ఉన్న టైమ్‌టేబుల్‌ చూసాను. లాస్టు బస్‌ వెళిపోయింది. మర్నాడు ఉదయం 530 నిమిషాలకు మొదటి బస్‌ ఉంది. ఇక్కడ టాక్సీ దొరకాలంటే ఫోను చెయ్యాలి అని చెప్పాను. ఇక్కడ నుండి మెన్‌హటన్‌లో ఉన్న పోర్టు అథారిటీ బస్‌ టెర్మినస్‌, (అంటే పై ఊర్లు వెళ్ళే బస్‌ స్టేషన్‌) వెళ్ళాలంటే ఎంతవుతుంది అని అడిగాడు అతను. “సుమారు 50 డాలర్లు అవుతుంది” అని చెప్పాను. “చాలా ఎక్కువే” అని తటపటాయించాడు .

మా ఆవిడ నేత్రావధానంతోనే “మరెందుకు టైమ్‌ వేస్టు, పిలువు, రాత్రి మనింట్లో ఉండి ఉదయం బస్సులో వెళ్ళమను” అంది. అడగ్గానే వెంఠనే ఒప్పేసుకొన్నాడు. కమరూన్‌ అనే ఆఫ్రికా దేశస్థుడట. విజిటర్‌గా అమెరికా వచ్చాడట. క్వీన్స్‌ అనబడే మేం ఉండే ప్రాంతంలో ఉన్న స్నేహితునితో ఉందామని అతని ఎడ్రస్‌ పట్టుకొని వచ్చాడట. తీరా తన దగ్గర ఉన్న ఎడ్రస్‌ ప్రకారం వెళితే ఆ ఫ్రెండ్‌ ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి చాలారోజులైందని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పారట. అంచేత ఇప్పుడు మెన్‌హటన్‌ వెళ్ళి అక్కడ నుండి వాషింగ్టన్‌ (డిసి) అన్న ఊరు వెళ్ళాలిట. ఈ విషయాలు అన్ని చెప్తుండగానే మా ఇల్లు వచ్చేసింది. అతనికో గెస్ట్‌ బెడ్‌రూమ్‌ చూపించి పడుకోమన్నాం.

అలా వచ్చి ఆ రాత్రి ఉన్న వ్యక్తి ఉదయం వెళ్ళిపోతూ ఓ తైలవర్ణచిత్రం ఇచ్చాడు మేం చేసిన సహాయానికి కృతజ్ఞతతో. అది మోడ్రన్‌ఆర్టులా ఉంది. దానిని ఆ రాత్రే మా ఇంట్లోనే వేశాడుట. అది మాకర్థం కాకపోయినా ఇచ్చాడు కదా అని “మర్సి” (ఫ్రెంచిలో కృతజ్ఞతని చూపించే పదం) అని ఆ తైల వర్ణ చిత్రం తీసుకొన్నాను. అతను వెళ్ళిపోయాడు. మేం దాన్ని మా లైబ్రరీ గదిలో ఓ మూల పెట్టి మరిచిపోయాం దాని గురించి.

కొన్ని నెలల తరవాత చాలా మంది అమెరికన్‌ల లాగే “స్ప్రింగ్‌క్లీనింగ్‌” అని ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసిపారేసే కార్యక్రమంలో ఈ అర్థం కాని మోడ్రన్‌ ఆర్టుని ఏం చెయ్యాలి అని ఒక చిన్న చర్చ జరిగింది మా డైనింగ్‌ టేబుల్‌ దగ్గర. మోడ్రన్‌ ఆర్ట్‌ ఫ్రం కమరూన్‌ ఫర్‌ సేల్‌ అని “పెన్నిసేవర్‌” లో ఎడ్వర్‌టైజ్‌మెంట్‌ ఇస్తే అన్న మా అబ్బాయి సలహా అమలుపరిచాం. ఓ ఆదివారం అందరిని రమ్మని చెప్పాం.

వచ్చిన వారి కారు బట్టి, వారు తైల వర్ణ చిత్రం చూసిన తీరు బట్టి, దాన్ని చూడ్డానికి వారు వెచ్చించిన కాలాన్ని బట్టి మా అమ్మాయి ఆ తైల వర్ణ చిత్రం ధర అతి జాగ్రత్తగా పెంచుకొంటూ పోయింది. సాయంత్రం ఐదు అయ్యింది. “ఎంతో కొంతకి అమ్మేయవే, ఇక బయట పార్టీకి వెళ్ళాలి” అని గట్టిగా చెప్పాను. కారుచవకగా అమ్మేస్తున్నానని చెప్తూ ఖరీదైన కారులో వచ్చిన ఒకాయనకి వెయ్యి డాలర్లకి అమ్మేసింది. అతను చెక్కిచ్చి చిత్రం తీసుకొని వెళ్ళిపోయాడు.

తల్లి, “పుత్రిక పుట్టంగ కాదు, ఆ పుత్రిక ..” అని పుత్రికోత్సాహాన్ని ప్రదర్శించితే ఆ చెక్‌ ఎన్‌కేష్‌ అయి డబ్బురానీ అని కొట్టిపారేశాను. నిజంగానే ఆ వెయ్యి డాలర్లు చెక్‌ ఎన్‌కాష్‌ అయ్యింది అని తెలియగానే ముందు ఆశ్చర్యపోయాను తర్వాత అయ్యో ఆ చిత్రకారుని చిరునామా తీసుకోలేదే అని బాధపడ్డాను.

“నల్లవాళ్ళని చూస్తే భయం అనే వాళ్ళకి, ప్రక్కవాడికి సహాయం చేస్తే ప్రిస్టేజ్‌ పోతుందనుకొనే వాళ్ళకి ఈ కథ చెప్పు. దాని వల్ల ఏ ఒక్కరిలోనైనా, ఎంతో కొంతైనా నల్లవాళ్ళ మీద మంచి అభిప్రాయం వస్తే, అటు వెయ్యి డాలర్లు ఉత్తినే వచ్చాయే అన్న బాధ ఉండదంది మా ఆవిడ.

అందుచేత ఈ కథ వేసుకొన్న వారికి, చదివిన వారికి, చదివి వినిపించిన వారికి, విన్నవారికి, విని మరొకరికి చెప్పిన వారికి, స్వంత తైలం (కాలం గట్రా) కొంత పోయినా ఏదైనా ఓ మంచి విచిత్రం జరుగుతుంది!

(1999లో న్యూయార్క్‌ టైమ్స్‌ న్యూస్‌ పేపర్‌లో మెట్రా సెక్షన్‌లో మొదటిపేజీలో వచ్చిన వార్త ఆధారంగా వ్రాసినది.)
-----------------------------------------------------------
రచన: కలశపూడి శ్రీనివాసరావు, 
ఈమాట సౌజన్యంతో

Monday, October 29, 2018

సంకల్పం


సంకల్పం




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి............

ఇప్పుడు కాకపోతే, మరెప్పుడు ? మనం కాకపోతే మరెవ్వరు ?

అమెరికా దేశంలో, మిచిగన్‌రాష్ట్రంలో, గేంజెస్‌అన్న ఊరులో ఉన్న వివేకానంద మొనాష్టరీలో ఆగష్టు నెల ఆఖరు వారం కలసిన వంద మంది భారతీయులులని రెండు రోజులుగా అలోచింపజేస్తున్న ప్రశ్నలివి.

బ్రిటీష్‌పాలన నుండి రాజకీయ స్వాతంత్య్రం సంపాదించుకొని కొన్ని ఏళ్ళు పైబడ్డా,ఎన్నో రకాలుగా వెనుకబడి, సుమారు సగానికిసగం జనం నిరక్షరాస్యతతో, కులాల కుమ్ములాటలతో,మనిషి స్వార్ధపు మూర్ఖత్వానికి మతంముసుగుతో, అన్ని రంగాలలో లజ్జలేని లంచగొండితనంతో, అధికార దాహంలో ప్రజాసేవ పేరుతో పదవులెక్కుతున్న రాజకీయ నాయకులతో, దిక్కుతోచక నిస్పృహతో నిలబడిఉన్న సామాన్యుడికి ఉత్తేజం కలిగించేలాంటి ఉద్యమం కావాలి. అది ఇప్పుడు కాకపోతే, మరెప్పుడు.

ఆ దేశంలో పుట్టీ, ఆ దేశంలో పెరిగి, ఆ దేశంలో ఉన్న విద్యా సౌకర్యాలని పూర్తిగా ఉపయోగించుకొని, పట్టాలు పుచ్చుకొని, విదేశం వచ్చి వివిధ రంగాలలో నిలదొక్కుకొని, కొద్దో గొప్పో పేరు సంపాయించుకొని,ఆ దేశానికి కావలసినది చెయ్యగల స్ధితిలో ఉన్న మనం కాకపోతే మరెవ్వరు.

” ఎన్నో వనరులతో, శతాబ్దాలుగా స్వశక్తిపై ఆధారపడి, స్వంత బుద్ధితో, విద్యా, వ్యవసాయ,వ్యాపార రంగాలలో ముఖ్యమైన దేశంగా నిలబడ్డ భారత దేశం ఈనాడు ఇంత వెనుకబడ్డ దేశంగా ఉండనవసరం లేదు. బాధ్యతాయుతమైన భారతీయులుగా దేశం బాగుకై మీ మీ పరిధులలో,మీ మీ శక్తి కొద్ది, మీరు చెయ్యగలిగినది చెయ్యండి ” అన్న డాక్టర్‌ భాగవతుల పరమేశ్వర రావు గారి పిలుపునందుకొని సమావేశమైన వాళ్ళ సామూహిక ఆలోచనల సారమిది.

ఆషా, ఎ. ఇ. డ్‌, ఐ. ఎల్‌ పి., వంటి సంస్ధల సభ్యులు, అమెరికా దేశంలో వివిధ రాష్ట్రాలలో డాక్టర్‌ పరమేశ్వర రావు గారి సభలకి వచ్చిన వారి ప్రతినిధులతో ఆ ప్రదేశం నిండిపోయింది.దేశం బాగుకోసం అంతమంది కలవడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఎవరి మొహంలో చూసినా ఉత్సాహం పెల్లుబుకుతున్నది. అందరికి అందరూ సుమారుగా కొత్తవారే. ఒకరిని ఒకరు పలుకరించుకొంటూ, పరిచయాలు పెంచుకొంటున్నారు. చాలామంది వయస్సులో చిన్నవారే, కానీ అందరూ పెద్ద పెద్ద చదువులు
చదివినవారే ! గుంపులు గుంపులుగా, పచ్చిక మీద కూర్చొని, చెట్ల కింద నిలబడి రకరకాల విషయాలని తీవ్రంగా చర్చించుకొంటున్నారు. సరిగ్గా అటువంటి సమయంలో నా దృష్టి ఒంటరిగా,అందరికీ దూరంగా ఉన్న ఒకతని మీద పడింది. అతన్ని నిన్న మధ్యాహ్నం భోజనాల దగ్గర కలిసాను.” పేట్‌” అని పరిచయం చేసుకొన్నాడు. అతని పూర్తి పేరు వాయువేగుల పతంజలిట. విష్ణుభొట్ల రామన్న గారితో కలసి వచ్చాడుట. మద్రాసు ఐ. ఐ. టి. లో ఇంజనీరింగ్‌ , తరవాత స్టాన్‌ఫోర్డ్‌యూనివర్సిటీలో పి. హెచ్‌.డి. గత ఎడాదిగా న్యూయార్క్‌ లో ఉద్యోగం చేస్తున్నాడుట. అమెరికా వచ్చి ఐదేళ్ళే అయిందిట. ఎక్కువమందితో పరిచయం చేసుకొన్నట్లు లేడు. అందుకే ఒంటరిగా ఉన్నాడని దగ్గరకి వెళ్ళి పలకరించాను.

“ఏమిటీ ఇలా ఒక్కరు ఉన్నారు ?” అన్నాను.

“మా గ్రూపు వాళ్ళు లిటరసీ పెంచడంపై డిస్కస్‌చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం లిటరసీ పెంచడం జరగని పని అని నా ఉద్దేశ్యం ” అన్నాడు.

” మరి మీ ఆలోచన ఏమిటి ?” అన్నాను.

“లిటరసీ పెంచాలి. ప్రస్తుతం ఉన్న 52 శాతం తో భారతదేశం అభివృద్ధి సాధించడం జరగని పని.చిన్న చిన్న హెల్పుల వల్ల యూజ్‌అట్టే ఉండదు. పెద్ద ఎత్తున లిటరసీ టేకప్‌చెయ్యాలి ” అన్నాడు.

“పెద్ద ఎత్తున అంటే …” అన్నాను వివరంగా చెప్పమన్న భావంతో.

” నాకు ఓ 100, 000 డాలర్లు సంపాదించి, ఇండియా వెళ్ళి అక్కడ ఉన్న ఓ ఆర్గనైజేషన్‌తో కలసి కాని, లేదా ఓ ఆర్గనైజేషన్‌పెట్టి వందలకొద్దీ వాలంటీర్లని పెట్టి, వేలకొద్దీ ఇల్లిటరేట్సుని, లిటరేట్సుగా చెయ్యాలని ఉంది ” అన్నాడు అవేశంగా.

” అది మంచి ఉద్దేశ్యమేగానీ, ఇటువంటి విషయాలలో అంటే సంఘసేవలో డబ్బు కోసమో,ఎదుటి వారి కోసమో ఎదురు చూడడం అనవసరం. పైగా ఆ డబ్బు కాని, మనుషులుకాని సమకూరేసరికి పనిచెయ్యడానికి కావలసిన అనుభవం రావాలంటే ఊహ తోచిన నాటినుండి ఎంతలో వీలయితే అంతలో,పని చేయడం మొదలు పెట్టాలి. ”

” కానీ రిజల్స్టు ?” అన్నాడు ప్రయోజనం ఉండదన్న భావంతో.

ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే, సమాధానం నా చేతులోనే ఉన్నట్టు తోచింది. వెంటనే ” మీరు తెలుగు చదువుతారా ? ” అని అడిగాను.

“షూర్‌ ” అన్నాడు.

“అయితే నా స్వంత అనుభవాన్ని ఓ కధ రూపంలో వ్రాసాను. ఈ కధ చదవండి. మీ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు ” అని నేను వ్రాసిన కధ కాపీ అతనికి ఇచ్చాను.

ఇంతలో డాక్టర్‌ రాణి చింతం గారు రమ్మంటున్నారని నాకు కబురు వచ్చింది. ఆమె ఇక్కడికివచ్చిన వారందరకి కాఫీ, టీ, భోజనాలన్నింటీని అందించే బాధ్యత తీసుకొన్నారు. ఆమెకు సహాయం అందించడానికి నాలాంటివారు కొద్ది మంది వాలంటీర్లు ఉన్నారు. ఏదో పని ఉండి పిలిచి ఉంటారు.

” ఓ అరగంట తరవాత వచ్చి కలుస్తాను ” అన్నాను.

” చాలా థేంక్సండి. ఇప్పుడే చదువుతాను” అని అతను అక్కడే కూర్చొని చదవడం మొదలుపెట్టాడు.

1998 జనవరి మొదటి వారంలో భువనేశ్వర్‌ వెళ్ళాం నేను, నా భార్య చిత్ర. చిన్నప్పుడు నాతో కలసి చదువుకొని, పాతికేళ్ళుగా అక్కడే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కిషోర్‌ అతని భార్య కమల ఉదయాన్నే రైల్వే స్టేషన్‌కు వచ్చి మమ్మల్ని ఆదరంగా వాళ్ళింటికి తీసుకుని వెళ్ళారు.

” కిషోర్‌! ఈ మాటు కోణార్క తప్పకుండా వెళ్ళాలి ” అన్నాను కబుర్ల్ల్లలో.

” తప్పకుండా, కానీ మరీ రెండు రోజులే ఉంటానంటే ఎలారా ?” అన్నాడు.

” రేపే వెళదాం. మీరిద్దరు కూడా రండి. అందరం కబుర్లు చెప్పుకుంటు హాయిగా గడుపుదాం ” అన్నాను.

” సరే. అయితే ఉదయాన్నే నాలుగు గంటలకి బయలుదేరితే సూర్యోదయానికల్లా కోణార్క చేరుకోవచ్చు. అప్పుడయితే, ప్రశాంతంగా ఆ గుడిని, గుడి వెనుకగా సూర్యోదయాన్ని చూడవచ్చు.ఆ తరవాత అయితే జనం ఎక్కువై అంతా గాభరా గాభరాగా ఉంటుంది. ఉదయాన్నేగాని, లేదా పౌర్ణమినాడు రాత్రి కాని ప్రాకారం చుట్టూ ఉన్న చెట్ల క్రిందో, నాట్య వేదికమీదనో కూర్చొని చూస్తూ, ఆ అందాల్నిఆస్వాదిస్తే కానీ కోణార్క గొప్పదనం అర్ధం కాదు, ఆనందించలేము ” అన్నాడు కిషోర్‌ తన్మయత్నంతో.

” సరే, అలాగే ” అన్నాను.

ఆరోజంతా చిన్ననాటి కబుర్లు, అమెరికా విశేషాలు, పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్‌లు,చెదరిపోయిన మిత్రుల గురించి, చనిపోయిన ఉపాధ్యాయుల గురించి, ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం మధ్యాహ్నం భోజనాలు అయ్యేంత వరకు. తరవాత ఓ రెండు గంటలు నిద్రపోయి లేచాము. కమల అందించిన టీ త్రాగుతూ ఉంటే, “రేపు తెల్లవారు ఝామున చాలా చలిగా ఉంటుంది. నువ్వేమైనా స్వెట్టరు గట్రా తెచ్చావా ” అని అడిగాడు కిషోర్‌.

” లేదే ” అన్నాను.

” సర్లే. మావి ఇస్తాం ” అన్నాడు.

” అసలు ఇండియాలోనే మంచి స్వెట్టర్లు దొరుకుతాయంటారు. ఇక్కడ కొని పట్టుకువెళితే బాగుంటుంది కదా ! ” అంది చిత్ర.

” అవును. అది మంచి అయిడియా” అని చిత్రతో అని, ” కిషోర్‌్‌ సాయంత్రం అలా ఊరిలో తిరిగి వచ్చినట్లుంటుంది, ఏదైనా స్వెట్టర్లు అమ్మే షాపుకి తీసుకువెళ్ళు ” అన్నాను.

” పరదేశీ బాబు అన్న పేరుతో ఓ పెద్ద బట్టల షాపు ఉంది. అందులో మంచి స్వెట్టర్లు దొరుకుతాయి ” అన్నాడు కిషోర్‌.

“అదేమిటి ? ఆ పేరు అలా ఉంది ?”

” అవును. కొంచెం వింత పేరే ! కానీ మంచి పేరున్న షాపు. అక్కడ బేరాలు ఉండవు. మంచి నాణ్యమైన బట్టలు. పైగా షాపుకు వచ్చిన వాళ్ళందరిని వాళ్ళ అభిప్రాయాన్ని వ్రాసి సంతకం పెట్టమంటారు. అలా చేసినందుకు ఓ మంచి పెన్ను ఇస్తారు “.

ఆరు గంటలకల్లా అందరం తయారై ఊరిమీద పడ్డాం. ఇరవై ఏళ్ళ తరవాత మళ్ళీ ఈ ఊరు చూస్తున్నాను. ఇదివరకు విశాలంగా అనిపించిన రోడ్లు ఇప్పుడు, జనాభా పెరుగుదల వలన కాబోలు, ఇరుకుగా అనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనుష్యులే, చిన్న చిన్న దుకాణాలే, ఇరుకు అన్న భావం మనసంతా
ఆవరిస్తుంది.

ఓ రెండు గంటలు ఊరంతా తిరిగి, సుమారు ఎనిమిది గంటలకు ” పరదేశీ బాబు ” అన్న పేరు పెద్ద పెద్ద అక్షరాలతో, అధునాతన పద్ధతిలో అలంకరించబడి ఉన్న ఓ విశాలమైన షాపులో అడుగు పేట్టాం. అడుగు పెట్టీ పెట్టగానే ఓ అందమైన అమ్మాయి ఎదురు వచ్చి వినయంగా అహ్వానించింది. ఏ బట్టలు కొనడానికి వచ్చేమో అడిగి వాటి కోసం ఎటువైపు వెళ్ళాలో చూపించి, అవి కొనడం అయిన తరవాత షాపు అంతటిని చూడమని కోరింది. కాష్‌కౌంటర్లకి ఓ 20 అడుగులకు ముందుగా ఉన్న ఓ టేబుల్‌ చూపించి, ఇక్కడ మా అభిప్రాయాలను షాపు విడిచి వెళ్ళే ముందు వ్రాసి సంతకం పెట్టమని ” పరదేశీ బాబు ” తరఫున ప్రార్ధిస్తున్నాను అని చక్కనైన ఇంగ్లీషు ఉచ్చారణతో భాషా దోషాలు లేకుండా చెప్పింది. అది విని ఆశ్చర్య పోయాను.

” ఇంత మంచి ఇంగ్లీషా ! ” అన్నాను ఆశ్చర్యంలోంచి తేరుకొంటూ.

” ఈ షాపులో పనిచేసే వాళ్ళు ఒరియాతో పాటు రెండు మూడు భాషలు మాట్లాడుతారు. అందరు ఇంగ్లీషు మాట్లాడుతారు, అదీ చాల చక్కగా ” అన్నాడు కిషోర్‌ ప్రసంసాపూర్వకంగా.

కావల్సిన స్వెట్టర్లు తీసుకొని, షాపంతా తిరిగి చూసి, బిల్లు చెల్లించడానికి కాష్‌కౌంటర్ల వైపుకి కదిలాం. ఎదురుగా ” ఈ షాపుపై మీ అభిప్రాయాలను తెలియజేయండి ” అని 12 భారతీయ భాషల్లో పెద్ద అక్షరాలతో వ్రాసి ఉన్న బోర్డు, దాని ప్రక్కనే ఓ టేబులు, టేబులు వెనక నవ్వు మొహంతో కూర్చొని ఉన్న అమ్మాయి కనిపించింది. ఆ టేబులు దగ్గరకు రాగానే, ” మీ అభిప్రాయం ఇక్కడ వ్రాసి పెట్టండి ” అని వినయంగా ఓ పుస్తకాన్నిఅందిస్తూ అడిగింది.

” అలాగే ” అని ” ఎక్సలెంట్‌” అని వ్రాసి సంతకం పెట్టాను. నా సంతకం పక్కనే చిత్ర కూడా సంతకం పెట్టింది. కిషోర్‌, కమల ఇంతకు ముందే వ్రాసాం అని చెప్పారు. ఆ అమ్మాయి వెంటనే రెండు పెన్నులు తీసి నాకు,చిత్రకి ఇచ్చింది. అవి తీసుకొని కాష్‌కౌంటర్ల వైపు వెళ్ళాం. అక్కడ మాకంటే ముందుగా వచ్చి నిలబడ్డవారి వెనుక క్యూలో నిలబడ్డాం. అలా నిలబడే షాపంతా కలయ చూసాను. షాపంతా చాలా అందంగా అమర్చారని అనిపించింది. అభిప్రాయ సేకరణ టేబుల్‌ దగ్గర కూర్చోన్న అమ్మాయి ఆమె చేతిలో ఉన్న కాగితంలోకి, అభిప్రాయం సేకరించిన పుస్తకంలోకి పదే పదే చూస్తున్నట్లు గమనించాను. ఉన్నట్టుండి ఆ అమ్మాయి ఒక్క ఉదుటన కుర్చీలోంచి లేచి, పరుగెట్టుకుంటూ షాపులో భాగంగా ఉన్న పై అంతస్ధుకు చేరుకొంది. షాపులో ఉన్న వాళ్ళందరి దృష్టి పరిగెత్తుతున్న అమ్మాయి మీదే ఉంది.కొద్ది క్షణాలలో పై అంతస్ధులో ” ఆఫీస్‌” అని వ్రాసి ఉన్న తలుపు తీసుకొని లోపలికి వెళ్ళింది. కొద్ది క్షణాలు గడిచాయి. ఎవరి పనులు వారు చెయ్యడం మొదలు పెట్టారు. మేం బిల్లులు చెల్లించడానికి ముందుకు కదిలాం. కాషియర్‌ మేం అందించిన రసీదు తీసుకొని, చెల్లించవలసిన సొమ్ము చెప్పి టకటక వ్రాయడం ఏదో మొదలు పెట్టింది. నేను పర్సు తీసి డబ్బులు లెక్కపెడుతున్నాను. అప్పటిదాకా చకచక పని చేస్తున్న కాషియర్‌ పని ఆపి, ఒక్క ఉదుటన లేచి నిలబడింది.

” ఏమైంది ?” అని అడిగాను.

” మేడం ” అంది.

నేను వెనక్కి తిరిగి చిత్ర వైపు చూసేంతలో నా పక్కగా నాలుగు ఆడుగుల దూరంలో ఏ భావం వ్యక్తం చెయ్యకుండా అన్ని భావాలను ఇముడ్చుకొందా అన్నట్లు అనిపించే విశాలమైన మొహంతో, యూనివర్సిటీ రోజులలో ఎన్‌ సి. సి. ఆఫీసర్‌ గా ఉన్న అంజలిని శర్మని గుర్తుకు తెప్పించే ఓ అమ్మాయి రెండు చేతులు జోడించి నిలబడి నన్ను చూసి ” నమస్తే ” అంది. ఆమె వెనుకగా అభిప్రాయం తీసుకొన్న అమ్మాయి మేం అభిప్రాయం వ్రాసిన పుస్తకం పట్టుకొని వెనక నిలబడి ఉంది. నేను కొద్దిగా తడబడుతూ ప్రతి నమస్కారం చేసాను.

” ఈ సంతకం మీదేనా ?” అని ఆ పుస్తకంలో ఉన్న నా సంతకం వైపు వేలు చూపిస్తూ అడిగింది. నా కోసం వాళ్ళు వెతుకుతున్నారన్న ఆలోచన నన్ను కొద్దిగా ఆశ్చర్యంతో నన్ను కలవర పెట్టింది.

” అవును ” అన్నాను మెల్లగా.

” మీరు 20 సంవత్సరాల క్రిందట భువనేశ్వర్‌ వచ్చారు కదూ !” అని అడిగింది.

” అ, అ అవును సుమారుగా …”

” ఈ కాగితంపై ఉన్న సంతకం కూడా మీదేనా ” అని పఠం కట్టి ఉన్న నా సంతకం ఫోటో కాపీ చేసి ఉన్న కాగితాన్ని చూపించి అడిగింది.

మొదటనుండి నా సంతకంలో ఆట్టే మార్పులేదు. ఆ కాగితం మీదనున్నది నా సంతకమే. సులభంగానే గుర్తు పట్టాను. సంభాషణ అంతా ఇంగ్లీషులోనే సాగుతున్నది.

” అవును ” అన్నాను నిశ్చయంగా.

” బాబూజీ !” అని ఆ షాపు అంత ప్రతిధ్వనించేలా ఒక్కసారి అరచి, చటుక్కున నా కాళ్ళపై పడి, తన చేతులతో నా రెండు కాళ్ళని చుట్టేసింది. ఉద్వేగంగా ఏదేదో అంటున్నది. అర్ధమవడంలేదు.

నన్ను ఆశ్చర్యం, ఉద్వేగం ఒక్కసారి ఆవరించి గాభరా పెట్టాయి. ఆ స్ధితిలోనే వంగుని, ” లేవండి,లేవండి. అలా కాళ్ళమీద పడకూడదు. అసలు విషయం ఏమిటి ? ఏం జరిగింది ? నా కోసం ఎందుకు వెతుకుతున్నారు ? మీ రెవరో నాకు తెలియదు ? ” అన్నాను.

ఆమె నా కాళ్ళు వదలకుండానే ” ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. లక్ష సంతకాల తరవాత మీ సంతకం కనిపించింది. మీరు దొరికారు. నేను మిమ్మల్ని వదలలేను. నా తనివి తీరా నా మనస్సులో ఇన్నేళ్ళుగా దాచుకున్న నా కృతజ్ఞతని మీకు తెలుపుకోవాలి బాబూజీ, బాబూజీ !! ” అంటూ అవేశంగా పరిసరాలని మరచి, ఒదిలితే ఎక్కడ జారిపోతాయో అన్నంత గట్టిగా నా కాళ్ళను పట్టుకొంది.

నేను నిస్సహాయంగా నిలబడి సహాయం కోసం మా ఆవిడ చిత్ర వైపు చూసాను. నా చూపును అర్ధం చెసుకున్నదానిలాగా ముందుకు వచ్చి వంగుని, నా కాళ్ళ దగ్గర ఉన్న ఆ అమ్మాయిని తన చేతులతో పట్టుకొని మీదకు లేపి నిలబెట్టింది. కానీ ఆ అమ్మాయి ఇంకా ఉద్వేగంతో చిత్ర భుజంపై వాలి ఉంది. షాపులో ఉన్న వాళ్ళంతా
మా చుట్టూ మూగి ఉన్నారు.

ఆ సంతకం నా సంతకమేనా ? నా సంతకానికి పఠం కట్టి ఉంచడమేమిటి ? ఆ సంతకానికి ఈ అమ్మాయికి సంబంధమేమిటి ? గతంలో ఈ అమ్మాయికి నాకు ఉన్న సంబంధం ఏమిటి ? నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నది ? నన్ను పట్టుకుందుకేనా ఈ అభిప్రాయ సేకరణ ? మనిషిన పోలిన మనుషులు
ఉంటారంటారు. సంతకాన్ని పోలిన సంతకం ఉండదా ? ఇందులో ఏ పొరపాటు లేదుకదా ? ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను.

ఇంతలో ఆ షాపు స్టాఫ్‌తేరుకొని, చిత్ర భుజంపై ఒరిగి ఉన్న ఆ అమ్మాయిని, మా నలుగురిని పై అంతస్తులో ఉన్న ఆ ఆఫీసుగదిలోకి తీసుకు వెళ్ళారు. ఆ ఆఫీసు గది ముందు అనుపమ పట్నాయక్‌ ఎమ్‌ ఎ., మేనేజింగ్‌ డైరెక్టర్‌ అని వ్రాసి ఉన్న బోర్డు ఉంది. లోపల కుర్చీలతో, సోఫాలతో అధునాతన పద్ధతిలో అమర్చిన విశాలమైన
ఆఫీసు ఉంది.ఎడమవైపున్న సోఫాలో కూర్చోమని సూచించారు. ఆ సోఫాకు ఎదురుగా ఉన్న సోఫాలో ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు. అంతలోనే మంచినీళ్ళు, వేడి వేడి టీలు వచ్చాయి. మంచినీళ్ళు, టీ అందరకి అందించారు. ఆమె ముందుగా కొంచెం మంచినీళ్ళు త్రాగి, తేరుకొని, స్టాఫ్‌ఇచ్చిన తువ్వాలుతో ముఖం తుడుచుకొని, నా మొహంలోకి చూస్తూ, ” మీరు ఇరవై ఏళ్ళ క్రిందట భువనేశ్వర్‌ వచ్చారు గుర్తుందా ?” అని నా జ్ఞాపకాలని గుర్తు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదానిలా అంది ” మీరు మా నాయన కూరల దుకాణానికి వచ్చారు…..” ఏమేమో చెపుతున్నాది. ఇరవై ఏళ్ళ క్రిందట భువనేశ్వర్‌ వచ్చినపుడు జరిగిన విశేషాలని గుర్తుకు తెచ్చుకుందుకు ప్రయత్నిస్తున్నాను నేను.

నేను ఉద్యోగప్రయత్నం మీద ఇంటర్య్వూ కోసం భువనేశ్వర్‌ వచ్చాను. కోణార్క్‌ కూడా చూద్దామని అనుకున్నాను. కాని వెళ్ళలేదు ఎందుచేత …?

అప్పుడు భువనేశ్వర్‌ ఇంత పెద్ద ఊరు కాదు. జనం బాగా తక్కువ. ఊరు విశాలంగా ఉన్నట్లు గుర్తు. కిషోర్‌ ఓ చిన్న గదిలో అద్దెకు ఉండే వాడు. నేను నాలుగు రోజులు ఉందామని కూడా వచ్చాను. అప్పుడు ” మదరాసీ ” హోటళ్ళు లేవు. కిషోర్‌ ఒరియా భోజనానికి అలవాటు పడ్డా, నా కోసం ఇంట్లోనే వంట చేసేవాడు. ఇంటర్య్వూ అయిన నాటి రోజు సాయంత్రం సామానులు, కూరలు కొనడానికని బజారుకు వెళ్ళాము.

” బాబూజీ !” గౌరవం, ఆప్యాయత మేళవించి పిలిచిన ఆ పిలుపుకు నా ఆలోచనలు తెగిపోయాయి. ” చిన్న వయసులో, చింపిరి తలతో, చీమిడి ముక్కుతో, చిరిగిన బట్టలతో, మట్టి కొట్టుకుపోయిన వంటితో, చదవలేక,చదువు రాక, చదువుకోమనే దెబ్బలతో, ఏడుపుతో, కన్నీళ్ళు నిండిన కళ్ళతో గుర్తుకు వచ్చానా ?” అని తోర్‌ దత్‌పొయట్రీ లాంటి భాషలో ఇంగ్లీషులో అడిగింది. మెల్లి, మెల్లిగా కూరగాయల తట్టల మధ్య కూర్చొని ఉన్న ఓ చిన్నపిల్ల గుర్తుకు రావడం మొదలయ్యింది. పూర్తిగా గుర్తుకు రాగానే ఎదురుగా కూర్చొని ఉన్న ఆమె కన్నీళ్ళు నిండిన కళ్ళల్లోకి చూసాను.

చక్కని సాంప్రదాయపు కేశాల కూర్పుతో, మిసమిసలాడుతున్న చెంపలమీద, మెరుస్తున్న కన్నీటి తడితో, పసుపు ఎరుపు రంగు మేలు మేళవింపుతో, మగ్గాన నేసిన మంచి చీరలో, వయసు తెచ్చి ఇచ్చిన వన్నెవెలుగుతో మెరుస్తున్న మేనుతో, ఈమె చదవనిది లేదేమో అని అనిపించే భాషా జ్ఞానంతో, భావోద్వేగాన్ని ప్రజ్వలిస్తున్న కళ్ళతో ఉన్న ఈమె ఆ పిల్లా ? నా కళ్ళముందే అందమైన సీతాకోక చిలుక అప్పుడే రెక్కలు విచ్చుకున్న భ్రాంతి కలిగింది.

మసక వెలుతురులో 30 35 సంవత్సరాల వ్యక్తి, అతనికి ఎదురుగా ఓ 6 7 ఏళ్ళ అమ్మాయి, చుట్టూ కూరగాయల తట్టలు ఒకదాని తరవాత మరొకటి గుర్తుకు వస్తున్నాయి. పిల్ల ఏడుపు వినిపిస్తున్నాది. ఏడుపు మధ్యలో ఏదేదో ఒరియాలో అంటున్నాది. అతను తండ్రి కాబోలు కొడుతున్నాడు. కొడుతూ అరుస్తున్నాడు. ఒరియా భాష రాకపోవడం వలన ఏమీ అర్ధం కావడం లేదు. తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. కిషోర్‌ సామానులు కొనడం పూర్తి అయిన తరువాత ఆ ఏడుస్తున్న పిల్ల ఉన్న కూరల దుకాణానికి వెళ్ళాం. ఆ పిల్లని, తండ్రిని దగ్గరగా చూడటం కుదిరింది. మేం రాగానే అతను పిల్లను కొట్టడం ఆపి మా వైపు తిరిగి కూరలు ఏరుకొందుకు తట్ట అందిస్తూ, పిండి తీసుకొని మొహానికి రాసుకున్న తీరులో, నవ్వు తీసుకొని మొహానికి పులుముకున్నాడా అన్నట్లు నవ్వాడు ఒక్క క్షణం సేపు.

ఆ పిల్ల మేం దగ్గరకు రాగానే ఆపలేక ఆపలేక ఆపినట్లు ఏడుపు ఆపింది. అయినా మధ్య మధ్యలో బెక్కుతూనే ఒరియాలో ఏదో అప్పజెపుతున్నట్లు చెపుతోంది. విరిగిపోయిన పలక, చిరిగిపోయిన పుస్తకం …

ఆ తండ్రి నలిగిన బట్టలతో, రేగిన జుత్తుతో, ముడతలు పడ్డ నుదురుతో, చాలా కాయ కష్టం చేసి రాటుదేరిన చేతులతో, నిర్భాగ్యపు బ్రతుకుకు నకలుగా, నిరాశ ముద్దలలాంటి కళ్ళతో, మాసిన గడ్డంతో,బ్రతుకుమీదో వ్యాపారం మీదో పిల్లదాని చదువుమీదో మనుషులమీదో లేక వీటన్నింటిమీదో, దీనిమీద అని నిర్దుష్టంగా చెప్పలేని కసి, కోపం అతని మొహమంతా మబ్బులా కమ్మేసింది.

కూరలు కొనడం అయిపోయిన తరవాత రూమ్‌కి వస్తుంటే కిషోర్‌ ని అడిగాను. “ఆ పిల్ల ఎందుకు ఏడుస్తోంది ? ఆ తండ్రి ఎందుకు కొడుతున్నాడు ? చదువుకోవడం లేదు అనేనా ?”

” ఆ!. సుమారుగా అంతే. పుస్తకాలు కొనకుండా బడికి రావద్దన్నారని, అందుచేత పుస్తకాలు కొనమంటుంది. బడిలో అందరు మంచి బట్టలు కట్టుకు వస్తున్నారని, తనకు అలాంటి బట్టలు కావాలని. ఆ పిల్ల ఎక్కాల పుస్తకం కొన్నా ఇంకా ఎక్కాలు రాలేదని, పుస్తకాలు కొనడానికే డబ్బులు చాలక పోతుంటే, ఇంక మంచి మంచి బట్టలు ఎక్కడనుంది తేగలనని ఆ తండ్రి అంటున్నాడు. నీకూ చదువబ్బదు, నాలాగే ఈ కూరల తట్టలే గతి. నా బ్రతుకు ఈ కూరల తట్టల మధ్యనే తెల్లవారుతుంది అని తిట్టుకుంటున్నాడు”. ఆ కబుర్లలో రూం కి వచ్చాం. రాత్రి ఆ పిల్ల ఏడుపు గుర్తుకు వచ్చి మెలుకువ వచ్చింది. ఆ తరవాత నిద్ర పట్టలేదు. ఆ పిల్ల మొహం పదే పదే
గుర్తుకువచ్చి ” చదువంటే డబ్బులని” స్కూల్లోనూ “చదువంటే దెబ్బలని” ఇంట్లోనూ ఒక దురభిప్రాయాన్ని ఆ చిన్నారి మనసులో నాటుతుంటే నాకు చాలా బాధ కలిగింది. ఆ పిల్లకి ఎలాగైనా చదువుకోవాలనే ఆసక్తి కలిగించాలని అనిపించింది. ఆ ఊరిలో ఇంకా ఉండేది ఒక్క రోజు మాత్రమే. మర్నాడు కోణార్క్‌ వెళ్ళాలని  అనుకున్నాను. నాకా పిల్లతో కాని వాళ్ళ నాన్నతో కాని మాట్లాడ్డానికి ఒరియా రాదు. ఏంచేసినా అది ప్రోత్సాహకరం అయ్యేదే కానీ ఆ పిల్ల చదువు భాద్యత మొత్తం తీసుకోడానికి నేను ఆ ఊర్లో ఉండను. ఉద్యోగం లేదు. మరేం చెయ్యాలి ? ఇలా ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారు ఝామున నిద్ర పోయాను.

మర్నాడు ఉదయం కిషోర్‌ నిద్రలేపాడు. కోణార్క్‌ వెళ్ళడానికి ఆలశ్యం అయిపోతోందన్నాడు.

” కోణార్క్‌ వెళ్ళడం లేదు ” అన్నాను నేను లేచి.

” అదేం ? ” అన్నాడు. ” మరేం లేదు. నా దగ్గర 200 రూపాయలే ఉన్నాయి. అవి పెట్టి ఆ పిల్లకి కావల్సిన పుస్తకాలు బట్టలు కొని ఇచ్చి చక్కగా చదువుకోమని చెప్పాలనుకుంటున్నాను.” అన్నాను.

” ఏం పిల్ల ? ఆ కూరగాయల కొట్టతని పిల్లా ?”

” అవును ” అన్నట్టు బుర్ర ఊపాను.

” మరి కోణార్క్‌ ప్రయాణం ….” అన్నాడు కిషోర్‌.

” ప్రయాణం అంత ముఖ్యం కాదు. విపరీతంగా వెనకబడి ఉన్న మన దేశానికి అక్షరాస్యత అత్యంత అవసరం. ఆడపిల్లలు చదువుకుంటే ఆమె పిల్లలు నిరక్షరాస్యులవ్వరు. ఆ కుటుంబం నిరక్షరాస్యత నుండి బయట పడుతుంది. కాబట్టి, నేను కోణార్క్‌ వెళ్ళడం కన్నా అదే డబ్బుతో ఆ పిల్ల చదువుకి ఉత్ప్రేరకంగా తోడ్పడడం మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నాను” అన్నాను.

కిషోర్‌ తెల్లబోయి చూస్తున్నాడు.

” నువ్వు ఆఫీసుకు వెళ్ళే దారిలో ఉన్న ఏదైనా ఓ పుస్తకాల షాపులో నన్ను విడిచిపెట్టి వెళ్ళు. ఆ తరవాత అక్కడ దగ్గరలో ఉన్న బట్టల దుకాణానికి వెళ్ళి బట్టలు కూడా కొని సాయంత్రం ఆ పిల్లకి ఇచ్చి వద్దాం ” అన్నాను.

సాయంత్రం మళ్ళీ ఆ కూరల దుకాణానికి వెళ్ళి ఉదయం కొన్న ఒరియా, ఇంగ్లీష్‌పుస్తకాలు, పెన్సిళ్ళు, ఓ రెండు పెన్నులు, కొన్ని రబ్బర్లు, బట్టలు ఇచ్చి, ” చదువుకో! బాగా చదువుకో ! చాలా పెద్దదానివి అవుతావు. నీకు కావలసినవి అన్నీ దొరుకుతాయి ” అని ఒరియాలో కిషోర్‌ చేత చెప్పించి, అవే మాటలని కిషోర్‌ చేత ఒరియాలో వ్రాయించి క్రింద నా సంతకం పెట్టి ఇచ్చాను. వాళ్ళు ఒరియాలో అన్నవాటిని ” కృతజ్ఞత “లని కిషోర్‌ నాకు తెలుగులో తరవాత చెప్పాడు. ఆ తరవాత ఏంజరిగిందో మరి తెలియదు. “ఆ పిల్లే ఈ పిల్లా?” అని ఆమె మొహంలోకి చూస్తూ ” అవును. అప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చినట్లు గుర్తు. ” అన్నాను.

” బాబూజీ, ఇవిగో ఆ పుస్తకాలు ” అని ఎదురుగా ఉన్న అందంగా నగిషీ చెక్కిన పెట్టె లోంచి కొన్ని పాత పుస్తకాలు తీసి కళ్ళకు అద్దుకొని నా ఎదుట పెట్టి ” ఆ రోజు మీరిచ్చిన ఈ పుస్తకాలు నాకు వరాలు. అప్పటినుండి శ్రద్ధగా చదువుకున్నాను. మా నాయన నా హైస్కూల్‌ చదువు పూర్తి కాగానే బట్టల వ్యాపారం మొదలు
పెట్టించాడు. మీ మాటలు మీది గురితో ఏర్పడ్డ చదువుమీది అభిమానం నన్ను వదలలేదు. ఉదయం వ్యాపారం,సాయంత్రం చదువు. చదువుతున్నకొద్దీ చదువు ఇచ్చే ఆనందాన్ని అస్వాదించ సాగేను. వ్యాపారంలో కూడా నా చదువు చాలా ఉపయోగపడడం చూసి మా నాయన నన్ను చదువుకోమని ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అలా ఎమ్‌ ఎ. దాకా చదివాను.” అనిలేచి, గోడకు తగిలించిఉన్న ఉత్కల్‌ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్టులను తెచ్చి చూపించింది.

” మిమ్మల్ని లెఖ్క పెట్టలేనన్ని సార్లు తలుచుకొని ఉంటాను. పరీక్షలు పాస్‌అయినప్పుడల్లా ఇదంతా మీ దయ వలనే అని అనుకుంటుంటాను. మీ పట్ల నాకున్న కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలా అని చాలా రోజులు ఆలోచించి, అఖరుకు మీ కిష్టమైన పనే చేసాను. చూడండి ” అని ఓ ఆల్బం తెరిచి గత 10 ఏళ్లగా ఏడాది వారీగా అమర్చిన ఆడపిల్లల గ్రూప్‌ఫొటోలని చూపించి ” ప్రతీ ఏడాది సుమారు వంద మంది చదువుకోడానికి స్ధోమత లేనివారిని చదివిస్తున్నాము. వాళ్ళని తిరిగి పెద్దవాళ్ళయ్యాక కనీసం పదిమందిని చదివించమని కోరుతున్నాం. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుందనుకుంటాను బాబూజీ !”

” నిజంగానే మంచి పని. చాలా ఆనందంగా ఉంది ” అన్నాను చెమర్చిన కళ్ళతో.

” బి. ఎ. పాస్‌కాగానే మిమ్మల్ని కలవాలన్న కోరిక అతి గట్టిగా అనిపించింది. మీ సంతకం ఉందిగానీ,మీ పేరు తెలియ లేదు. ఒరియా వాళ్ళు కాదని మాత్రం తెలుసు. మిగిలిన ఆశ ఒక్కటే. మీరు మళ్ళీ భువనేశ్వర్‌ వచ్చి మా షాపుకు వచ్చినట్లయితే ఈ సంతకం ద్వారా మిమ్మల్ని కలవవచ్చు అని తోచి ఈ సంతకాల పద్ధతి పెట్టాం. మా నాయన కూడా మిమ్మల్ని కలవాలని చాలా ఎదురు చూసాడు. అనారోగ్యంతో మంచంమీద ఉన్నా మీరు దొరికారా అని అడుగుతుండేవాడు. చనిపోయే ముందుకూడా మిమ్మల్ని గుర్తు చేసుకొని ఎప్పుడైనా కలిస్తే తన తరఫున కూడా మీకు పాదాభివందనం చెయ్యమన్నాడు ” అని ఉద్వేగంతో నా కాళ్ళకి మరో సారి నమస్కారం పెట్టింది.

నా నిలువెల్లా ఆనందాశ్చర్యాలతో ముంచెత్తబడుతున్న ప్రకంపనాలు పదే పదే ప్రవహిస్తున్నాయి. మాట్లాడాలని ఉంది కానీ గొంతునుండి మాటలు రావడం లేదు. గత 20 ఏళ్ళుగా విదేశాలలో పని చేస్తూ సంపాదించిన పురస్కారాలన్నింటి కంటే ఆమె చేసిన నమస్కారం అత్యున్నతమైనదిగా తోచింది. ఆ రోజు చేతిలో ఉన్న 200 రూపాయలు ఈ పిల్ల చదువుకు ఖర్చు చెయ్యడం కంటే మంచి పని నా జీవితంలో ఇంకేమీ లేదేమో అని అనిపించింది.అయితే ఆ అమ్మాయి తన జీవితంలో ఇంత ఎత్తు ఎదగడానికి కారణం నేనే అని, ఆ గొప్పదనం నాకే ఆపాదించబడడం అంత సబబు అనిపించ లేదు. అందుకే నోరు విప్పి ” నీ పట్టుదల,కృషి, మేధతో, విశాల దృక్పధంతో ఈ స్ధితికి వచ్చావు. కాని నా పాత్ర ఇందులో ఉత్ప్రేరకంగా పనిచెయ్యడం మాత్రమే. నువ్వు చాలా అభినందనీయురాలవు. ఎంతో మంది ఆడపిల్లలకి నువ్వు మార్గదర్శకురాలివి. అటువంటి నీ అభిమానానికి ఎంతో ఆనందిస్తున్నాను ” అన్నాను ప్రతీ పదాన్ని నొక్కి పలుకుతూ.

మేం ఇద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అంతా మమ్మల్నే చూస్తున్నారు అన్న ఊహ అప్పుడే కలిగింది.

” బాబూజీ, మీరు మా ఇంటికి రావాలి. మాతోనే ఉండాలి. ఇన్నేళ్ళుగా నా మనసులో మీతో చెప్పుకుంటున్నమాటలన్నీ మీతో చెప్పాలి.”

” అలాగే ” అన్నాను.

” మరి కోణార్క్‌ వెళ్ళాడమో …” అన్నాడు కిషోర్‌.

” రేపు కోణార్క్‌ వెళ్ళాలనుకొంటున్నారా ! రేపొక్కసారి మానుకొని మరోసారి వెళ్ళకూడదా ?” అని ప్రశ్న లాంటి అభ్యర్ధన చేసింది అనుపమ పట్నాయక్‌

” అలా అయితే ఇది 20 ఏళ్ల తరవాత మరో సారి అవుతుంది ” అన్నాడు కిషోర్‌.

ఎలా అన్న ఆమె ప్రశ్నకు సమాధానంగా 20 ఏళ్ళ క్రిందట నేను కోణార్క్‌ వెళ్ళడం ఎందుకు అవ్వలేదో చెప్పాడు.

అదివిని అనుపమ పట్నాయక్‌ మౌనంగా, నీళ్ళు నిండిన కళ్లతో కృతజ్ఞతతో మరోసారి చూసింది.

ఆ రాత్రి అందరం అనుపమ పట్నాయక్‌ కోరికపై ఆమె అతిధులమైనాం.

నేను వంటింటిలో చెయ్యవలసిన సహాయం చేసి వచ్చేసరికి పతంజలి నేనిచ్చిన కధ చదవడం పూర్తి చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు.

” ఇప్పుడేమంటారు ? ” అన్నాను. అతను అందిస్తున్న కాగితాలను అందుకుంటూ..

” సంకల్పం, ఆచరణ ముఖ్యం. మరి నేను వెళ్ళి మా గ్రూప్‌లో జాయిన్‌అవ్వాలి. థేంక్సు ” అన్నాడు అతను.

” మంచిది ” అన్నాను తృప్తిగా.
-----------------------------------------------------------
రచన: కలశపూడి శ్రీనివాసరావు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, October 28, 2018

నిలువు నూరు వండేటి మొలక: అన్నమయ్య పదం


నిలువు నూరు వండేటి మొలక: అన్నమయ్య పదం



సాహితీమిత్రులారా!

అన్నమయ్య పదాలను గురించినది ఈవ్యాసం చూడండి....
బాహ్యంగా మనిషి ముందున్న సమకాలానికీ, మనిషి తాత్త్విక చింతనని ప్రేరేపించే అంతర్లోకాల సమకాలానికీ చాలా తేడా ఉంటుంది. ఒకటి బయటికి కన్పిస్తుంది. దాని బాహ్యరూపాలనే, ఆ కాలాన్నే మనుషులు వాస్తవమని భ్రాంతి పడతారు. రెండోది మనిషి అంతర్లోకాల వైపు అనేకానేక దృక్కోణాల నించి దృష్టి పెడుతుంది. బాహ్యంగా కన్పించే కాలాన్ని దాటి, పాఠకుల జీవితానుభవంతో కలిసిపోయి వారి మనసులలోకి తన కవితా రీతులతో ప్రవేశించగల్గిన కవి అన్ని కాలాలలోనూ సమకాలికుడే అవుతాడు. అన్నమయ్య ఆ రకంగా సమకాలికం కాగల్గిన కవి. అందుకనే ఇప్పటికీ ఆయన స్పందనలు మన మనసుల్ని తాక గలిగేవిగా ఉన్నాయి. ఆయన కవితా విశిష్టతలో ఉన్న వైవిధ్యం వల్లనే అవి పాతబడలేదు. అందుకనే అవి ఇప్పటికీ గాఢమైన ఇష్టాన్ని మనలో కల్గించగలుగుతున్నాయి.

ఇవాళ్టిదాకా అన్నమయ్యగారి పదాలని భక్తితో గాయకులు పాడితే విని సంతోషించేవారే ఎక్కువ. పైగా ఆసరికే వారి హృదయాలలో వేంకటేశ్వరుని మీద సిద్ధంగా వున్న భక్తి ప్రపత్తులు ఒక ముఖ్యమైన కారణం, వారంతా ఈ కీర్తనలని ఆత్మీయంగా ఆనందించడానికీ ఆదరించడానికీ! కానీ సాహిత్యం విషయం వచ్చేసరికి అలా కాదు. సాహితీ దృక్పథం అన్నది పూర్తిగా భిన్నమైన విషయం. కవి చేసిన ఊహని అంతే సమానస్థాయిలో ఊహించి అనుభవించగల చతురత కావాలి దీనికి. అందుకు సావకాశం కూడా కావాలి. ఏకాంతంలో పుస్తకాన్ని నింపాదిగా చదువుకుంటున్నప్పుడు మాత్రమే విషయాన్ని మరీమరీ ఆకళించుకోవడానికి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. ఇలా పాఠకుల ముందు ఉన్న సౌకర్యం, పాటని వినే శ్రోతలకి ఎంతవరకు ఉంటుందో నేను ఖచ్చితంగా చెప్పలేను. పదాలని రాగం ద్వారా అందుకోవడానికీ — పదాలని సాహిత్యంగా చదివి, దానిలోని రామణీయకతని తమ ఊహల ద్వారా అందుకోవడానికీ మధ్య చాలా అంతరం ఉంటుందని మాత్రం చెప్పగలను, మరీ ముఖ్యంగా ఆ పదకర్త గాఢమైన ఊహల ఐంద్ర జాలికుడు అయినప్పుడు.

అన్నమయ్యగారి సాహిత్యం ప్రక్రియాపరంగా మిగతా తెనుగు సాహిత్యం కన్నా భిన్నమైనది. దీనిని పాడాల్సి రావటం అన్నది తప్పనిసరి. పదాన్ని పాటగా వినడానికి మాత్రమే అలవాటు పడిన వారికి కవిత్వంగా దీనిని తిరిగి పరిచయం చేయడం కూడా నాకు కొంచెం కష్టమైన పనే! పాడటం గాయకుల పని. సాహితీ విశ్లేషకుల పని కాదు. ఇప్పుడు నా ఇబ్బంది ఏమంటే పదాన్ని వినడానికే అలవాటుపడిన — అంటే, సంగీత స్వరాలలో కలిసి పోయిన అన్నమయ్య ఊహలని మీ మనసుల నించి విడిపించి, వాటిని మళ్ళీ సాహిత్య ప్రధానమైన అంశంగా — అవి ఎంత ఉదాత్తమైనవో, ఎంత వైవిధ్యమైనవో — మీకు పరిచయం చేయడం అన్నమాట. నా రెండు పుస్తకాలలోనూ నేను చేసిన పని ఇటు వంటిది. నేను అన్నమయ్యగారి పదాలని సాహిత్యంగా పరిశీలించాను. నేను ఆయన సాహిత్యాన్ని రాగబలంతో కాక అక్షర బలం తో తూచి పరవశించినదాన్ని! త్యాగరాజ కీర్తనల వ్యాఖ్యానానికి నేను పూనుకోకపోవడానికీ, అన్నమయ్య పదాల వ్యాఖ్యానానికి నేను ఉపక్రమించడానికీ గల కారణం అంతా అన్నమయ్య గారి కవితా చతురతే!

అన్నమయ్యగారి దేవుడు పురుషుడే! ఈ విషయాన్ని అన్నమయ్య ఇలా చెబుతాడు. ‘‘పొగరు మగతనానఁ బురుషోత్తముఁడితడు’’ అని (సంపుటము 3, సంకీర్తన 102, పేజీ 69). మరోచోట, ‘‘మగవాడు మెత్తనైతే మరి యపకీర్తిగాదా — తగవు నెరప కుంటే తరుణులు మెత్తురా!’’ (సంపుటము 18, సంకీర్తన 502, పేజీ 336) అని కూడా అంటాడు. అలాగే వేంకటేశ్వరుడిని అన్నమయ్య తన ఒక పదంలో, ‘మీసాల తిరువేంగళేశుడు’ అని కూడా సంబోధిస్తాడు (సంపుటము 18, సంకీర్తన 229, పేజీ 153). మొత్తంగా చూస్తే, స్త్రీల రతికాంక్షలని అనేకం వ్యక్తం చేస్తూ, మగవాడైన దేముడిని చేరుకోవాలని ఆశించిన శృంగార సంకీర్తనా సాహిత్యం ఇది. అందుకనే పురుషోత్తముని ‘మగతనాన్ని’ రూఢపరిచే వర్ణనలే ఈ సంకీర్తనలలో అంతటా స్థాపించబడ్డాయి.

అయితే నిరాకారుడైన దేముడు, పురుషుడే ఎందుకు కావాలన్న ప్రశ్న తప్పదు. అప్పుడు అన్నమయ్యగారి సాహిత్యపు నమూనా కూడా, అదివరకటి ఎందరో కవులలాగే పురుషుని నాయకునిగా చేసి, ఆ అఖిలాండ భర్తకి అనువైన ఊహలతో సాగినదే అవుతోంది మరి. భాష చేసే చమత్కారం వల్ల, పురుషా ధిక్యతా దృక్పథం వల్ల, పురుషుడే దేవుడైన చట్రంలోంచే ఆయన కవితారచన చేసినా, అన్నమయ్యగారి ఊహలు నాకు ఎంతో బాగున్నాయి. దేవుడు ఉన్నాడా లేడా అన్నదానితో గాని, దేవుడు పురుషుడే అవాలా అన్న ఆలోచనతోగాని నేను ఆగిపోకుండా, కుతూహలంతో — నాయికా పక్షపాతిగా అన్నమయ్యగారు ఎన్ని వేల కల్పనలని చేశారో? అలా ఎలా చేయగలిగారో? అన్నది ఆశ్చర్యంగా గమనించాను. అదే ఈ సంకీర్తనా సాహిత్య విశ్లేషణలో నాకు ఇష్టం కలిగించే విషయం అయ్యింది. అన్నమయ్యగారు సైతం ఆయన కాలానికి అతీతులేమీ కాలేరు. అందువల్ల ఆయన ఊహలో భగవంతుడు పురుషుడే కావడం సహజం! మనం మనకి తెలిసిన ఊహలలోంచే ఆలోచనలు చేయడానికి ఎక్కువగా అల వాటు పడిన మనుష్యులం. అయినా అన్నమయ్యగారి సంకీర్తనా సాహిత్యంలోని స్త్రీలు, తమ మనోభావాలని వ్యక్తపరిచిన తీరు మాత్రం చాలా ప్రత్యేకమై భాసించింది. అందువల్లనే అనివార్యంగా ఆయన రచన పట్ల కుతూహలం, ఇష్టం, ప్రేమ నాకు కలిగాయి. ఆయన రచనా వైవిధ్యం సైతం అనితరసాధ్యమై నదిగా నాకు కన్పించడం వలన కూడా ఇది నలుగురితోనూ తప్పక పంచుకో వలసిన ప్రత్యేకత కల్గిన సాహిత్యంగా నేను భావించాను. దేవదేవునికి భార్యలు కావాలనీ, ప్రియురాళ్ళు కావాలనీ తపన పడిన ఎందరో నాయికలు తమకు కల్గిన భావనలన్నింటినీ, ఆ వేడుకల నన్నింటినీ, ఆ వియోగ దుఃఖాలనీ, ఆ సంయోగపు తృప్తినీ వివిధ రకాలైన వ్యక్తీకరణలుగా పోటీపడి ప్రకటించారు. స్త్రీల మనః స్పందనలూ, శరీర స్పందనలూ మరి ఏ కవికీ వశం కానంత విశిష్టంగా అన్నమయ్యగారి ద్వారా వ్యక్తీకరించబడినాయి. స్త్రీల హృదయస్పందనలు అన్నమయ్యగారి ముందటి తెనుగు సాహిత్యంలో ఎక్కడా ఇంత గాఢంగా ఆవిష్కృతం కాలేదు.

స్త్రీల చన్నులని ఎన్ని తరహాలలో పదాలలో పేర్కొని వర్ణించవచ్చునో అన్నమయ్య అన్ని వైవిధ్యమైన ఉపమానాలని వాడి వర్ణించాడు తన పదాలలో! ‘మొలక చన్నులు’, ‘నిమ్మ కాయల వంటి చిన్న చన్నులు’తో మొదలుకొని ‘భారపు గుబ్బల’ దాకా అన్నమయ్య వర్ణించాడు. ‘చన్నులు పిసుకు’ లాంటి తెలుగు మాటలని ఆయన నిస్సంకోచంగా తన పదాలలో వాడారు. ‘‘గోపీ పీన పయోధర మర్దన … చంచల కరయుగశాలీ’’ అని గీత గోవిందంలో జయదేవుడు కృష్ణుణ్ణి వర్ణించిన వైనాన్ని ఈ తరహా మాటలలోంచి అన్నమయ్య ప్రేరణగా స్వీకరించి ఉంటారని ఇవాళ మనం స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు.

అయితే అన్నమయ్య పదాలలోంచి గాయకులు ఎంచు కుని పాడే వాటిల్లో భక్తి వైరాగ్య పదాలే ఎక్కువ. శృంగార పదాలు చాలా సొగసైనవి అనేకం ఇంకా ఇప్పటికీ ఆయన సంకీర్తనలలో వేనవేలు అలా స్వరరహితమై మిగిలే ఉన్నాయి. గాయకుల చూపు వాటిపై ఏనాటికి పడుతుందో మనకి తెలీదు. గాయకులు ఎలా పాడటం లేదో, అలాగే ఈ తరహా పదాలకి వ్యాఖ్యానాలు కూడా బహుశా వెలువడకపోవచ్చు. ఎవరికి వారే విధించుకున్న ఒక అప్రకటిత నిషేధంలోంచి లేదా సమకాలీన సామాజిక మర్యాదల లోంచి చివరికి ఆయన చేసిన భాషా ప్రయోగాల విషయంలోనూ సాహిత్యరంగంలోని వారు సైతం ద్వంద్వ ప్రమాణాలు పాటిం చటమో లేదా ఇటువంటి తరహా పదాల పట్ల వాళ్ళు తమ మౌనాన్ని కొనసాగించటమో చేయవచ్చు. వీటి వలన కొన్నాళ్ళకి అన్నమా చార్యులవారు కేవలం భక్తిపదాలో వైరాగపదాలో మాత్రమే రాసేరు కాబోలనుకునే అవకాశమూ ఉంది. అదీ అసలు ప్రమాదం. ఇవాళ్టికి మనకి దొరికిన అన్నమయ్య సంకీర్తనలలో మూడొంతులు శృంగార సంకీర్తనలే కాగా కేవలం ఒక పావు భాగం మాత్రమే భక్తి వైరాగ్య సంకీర్తనలు ఉన్నాయి. ఇంత ఎక్కువగా అన్నమయ్య శృంగార సంకీర్తనలని రాయడానికి కారణం ఆయన తన భక్తిని శృంగారపద సంచయంగా ప్రకటించా లని నిర్ణయిం చడమే! ఆయన ఇలా అంటాడు,

‘‘చేరి నా కన్ను లెదుట శృంగార రసమవై
ఆరసి రక్షించఁ బితురార్జితమవై
సారపు టిహపరాల సంసార సుఖమవై
యీ రీతిఁ బెంచితిగా నాకిందిరారమణా!’’

అని (సంపుటము 3, సంకీర్తన 381, పేజీ 257), ‘‘నేనేమి బాతి నీకు’’ అన్న పదములో! అన్నమయ్యకి ఆ శ్రీ వేంకటేశ్వరుడు పిత్రార్జితం లాంటివాడట! కన్నులెదుట శృంగార రసముగానూ, ఇహములోని సంసార సుఖముగానూ కూడా తానే దర్శనమిచ్చిన వాడూను, తాను దర్శించిన దేవుని శృంగారాన్నే తన వేల సంకీర్తనలలోంచి అన్నమయ్య కీర్తించాడు. ఆ కీర్తించడం అనేక విధాలుగా చేశాడు. అలుపెరుగని రీతిలో చేశాడు. ఆ క్రమంలో ఆయన తెనుగుభాషని కదం తొక్కించాడు. ఎన్నో రకాల కొత్తకొత్త ఊహలు చేశాడు. ఎన్నో కొత్త తరహా ఉపమానాలు వాడాడు. సామెతలని గుప్పించాడు. ఎన్నో నూత్న పదబంధాలని ప్రయోగిం చాడు. అవి ఏయే రీతులలో సాగేయో నాకిచ్చిన కొద్దిపాటి ఈ స్థలంలోంచి క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఈ పదాన్ని చూడండి –

‘‘ఈతగాదు మోఁతగాదు ఇంతే లోతు మోహము
చేఁతసేసి యిఁకనైనా చెక్కు నొక్కవే’’
(సంపుటం 26, సంకీర్తన 66, పేజీ 48)

ఈ పదంలో నాయిక మోహానికి చెలికత్తెలు చెప్పిన కొల మానాలు ఈ తరహాలోనివి. నువ్వంతగా బిగుసుకుపోనక్కరలేదు ఈ ‘వలపు’ అన్నది ‘పుక్కిటిబంటి.’ కాస్త సరసమాడి చూడు. నీ అసూయ కాస్తా కరిగిపోతుంది. దానికి పెద్ద లోతేమీ లేదులే. అతడిలోని ఆ చలము వట్టి ‘చంకల బంటి’ అంతే! కలిసిమెలిసి అతగాడిని కౌఁగిలించావో అది ఇట్టే మాయమైపోతుంది సుమా అంటూ వారంతా నాయికతో పరాచికాలు మొదలెట్టారు. వాళ్ళంటున్నారింకా ఇలా, సంకోచించకు. ఈ కోరిక వుంది చూడూ ఇది వట్టి ‘పిక్కలబంటి’ అంతే! ఎలాగైనా ఆయనతో కలువు. దాని లోతే మాత్రమో తెలిసిపోతుంది నీకు! మదన మంత్రాలు మరి వినిపించు అని. ఈ పదం ఎత్తుగడే భిన్నమైనది. అచ్చ తెనుగు పదాలతో… వలపుని దాని అనేక ఛాయలతో వ్యక్తం చేయడం ఏ రచనలోనైనా అంత తేలిక కాదు. చాలా నైపుణ్యం ఉండాలి దానికి. ఆ నైపుణ్యం ఉన్నప్పుడే అది గుర్తుంచుకోగల రచనగా మిగులు తుంది. అందునా శృంగార వర్ణనలో నైపుణ్యం కొరవడినా భావం నీరసమైనా, భంగపాటు తప్పదు. వలపుని నువ్వు పొందలేవేమో నని భయపడకు, ప్రయత్నించి చూడు నీకే తెలుస్తుంది అంటూ, ‘పుక్కిటిబంటి’, ‘చంకల బంటి’, ‘పిక్కల బంటి’ అన్న వినూత్న కొలమానాలతో వలపుని గురించి చెప్పటమే ఈ పదాన్ని ప్రత్యేకం గా గుర్తు పెట్టుకొనేటట్టు చేసింది.

అయితే ఇదే వలపుని గురించి అన్నమయ్య అంతే సున్నితంగానూ చెప్తాడు సుమా ఇలా ఈ పదంలో!

‘‘ఎరఁగవా వోయి నీవు యేల నన్ను నడిగేవు
తరి తరుకాణై వుండు తరితీపు వలపు’’
(సంపుటం 7, సంకీర్తన 212, పేజీ 129)

ఈ పదంలో ఆయన వలపుని వర్ణించిన తీరే మనం ఊహించ వీలులేనిదిగా వుంటుంది. ఆయన అంటున్నాడు ఇలా – వలపు తరితీపు! వచ్చీరాని పదం వంటిదట వలపు! అంటే ఇంకా రూపు దిద్దుకోని కవితా కల్పన వలపంటే అనటం ఎంత బాగుందీ!! ఇది నీకు తెలీదా? అని అంటోంది నాయిక తన ప్రియునితో. వలపు కలిగిన సమయంలో ఎంత గర్వం కలుగుతుందోనట! పరి హాసంతో కూడిన మాటల వల్లనే మోహం కలుగుతుంది. పచ్చని తీగలాగా వ్యాపిస్తుంది ప్రేమ. ప్రియమైన చల్లగాలితో సరిసమాన మైనది ప్రేమ! మన్మధుని చోటు వలపు అన్నది. ముంజేతి చిలకలాంటిది వలపు! వలపు అంటే పిలిచి మరీ బిడ్డనిచ్చినంత ప్రియమైనదని అంటున్నాడు అన్నమయ్య ఈ పదంలో వలపుని వ్యాఖ్యానిస్తూ!! అంతేనా ఆయన ఇంకా ఇలా అంటున్నాడు. వందింతలు పండేటి మొలక పైరు లాంటిదట వలపు! వలపంటే వసంతమాసమట! మనసు మారుమూలల్లో పదిలంగా దాచుకునే రహస్యమేనట ప్రేమ! నన్ను పొందిన శ్రీ వేంకటేశా! మన ఇద్దరికీ ఈ వలపు శాశ్వతము! అంటూ ఈ పదాన్ని ముగించింది నాయిక, ఈ పదంలో ఆయన ప్రేమని వాతావరణంతోనూ, రుతువుల తోనూ, పెంపుడు చిలుకతోనూ, విరగపండిన వరిపైరుతోనూ మదిలో దాచుకున్న పదిలమైన రహస్యంతోనూ పోల్చటం మరి విశేషం కాదా? ఆయన వాడిన ఉప మానాల గాఢతని బట్టి, ‘వలపు’ మీద అన్న మయ్యకున్న గురి ఎంతటిదో మనకి అర్థ మవుతుంది. విఫలమయినా, విరహ మయినా ‘వలపు’ అనే మానసిక స్థితినీ — దానికి తగిన శారీరక ప్రతిస్పందనలనీ మనుష్యులు తప్పకుండా పొందాలన్నదే — కవిగా అన్నమయ్య ఆశయం.

అన్నమయ్యగారి నాయికలలోని చొరవ, చనువు, తిక్క, అలక కూడా చాలా ఘాటైనవి! ఒక్కోసారి వారు నాయకుడిని ‘లంజకాడ!’ అంటూ కూడా సంబోధించగలరు. ‘లంజ’ అన్న తిట్టు లోని తీవ్రత ఇవాళ ఉన్నట్టుగా మరి ఆనాటి సమాజంలోనూ భాషలోనూ లేదేమో?! ‘లంజ’ అన్న పదం ఆడవాళ్ళని మాత్రమే ఉద్దేశించి తిట్టుగా చెలామణీలో ఉన్న ఇవాళ్టి కాలంలో అన్నమయ్య తన నాయికల నోట వాళ్ళకి కోపం వచ్చిన సందర్భంలో అక్కసుతో నాయకుని ‘లంజకాడ’ అంటూ సంబోధింప జేయటాన్ని గమనించాకా — నిజం చెప్పొద్దూ… కాస్త మనసు శాంతించినట్లయ్యింది సుమా నాకు! ఆడవాళ్ళు కూడా తిట్టడానికి వీలున్న ఒక పదాన్ని అన్నమయ్యగారు మనకి అందిం చారులే అని!

‘‘లంపు గుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ
యింపులే వెదకంబట్టీ నెట్లరా వోరి’’
(సంపుటం 6, సంకీర్తన 127, పేజీ 92)

అలాగే ఇంకో పదంలో కూడా అన్నమయ్య ఇలాగే రాస్తారు.

‘‘లంజకాడ వౌదువురా
లంజకాఁడ వౌదువు – నీ లాగులెల్లఁ గానవచ్చె
ముంజేతఁ బెట్టిన సొమ్ముల కద్దమేలరా’’
(సంపుటము 5, సంకీర్తన 84, పేజీ 58)

ఈ పదంలో నాయిక ఇంకొక స్త్రీ ఆయనని కలిసిన గుర్తులన్నీ ఆయన వంటి మీద స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కన్పిస్తున్న వాటిని గుర్తించి — వాటిని ప్రస్తావిస్తూ అసూయాగ్రస్తయై కోపంతో ఉడికిపోతూ వుంది. తనకి తెలుస్తుందేమోనని అవతలి స్త్రీ కాస్తైనా భయపడినట్టు లేదే అన్నదే ఈ నాయికకి ఇంకా కష్టం కల్గించేదిగా వుంది. అదే ఈ పదంలోని విషయం. ఆ మరో నాయిక ఎక్కడా ‘కొంకక’ కోరి తన నాయకుని భుజం మీద కంకణాల చేయి వేసి మరీ కౌగిలించుకోబోయింది. ఆమె కంకణాల ముద్రలు ఆ వొంకులతో సహా ఆయనగారి భుజాల మీద అచ్చులుగా వత్తుపడి ఉన్నాయట! ఇంకా నీ బొంకులెందుకూ? నీ మారువేషాలన్నీ నీ మోసాలన్నీ నీ మాయలన్నీ చూశాంలే అంటోంది కోపంతో! ఈ నాయిక తన నాయకుని వక్షం మీద ఎవరో స్త్రీ ధరించిన కంఠమాల తాలూకు గుర్తులని కూడా గమనించింది. ఆమె అంటోందిలా నాయకునితో ‘‘నువ్వు జాగ్రత్తపడగల నేర్పరివైతే కావొచ్చు. కానీ నాతో అబద్ధాలాడకు. నేను భరించలేను,’’ అని. ఆయన శరీర సుగంధాన్ని కూడా ఆ మరో స్త్రీ కొల్లగొట్టుకుపోయింది కదా అన్న పెనుబాధ ఈ నాయికది. అయితే ఇలాంటి విషయం మీద తీర్పులు ఎవరు మాత్రం చెప్పగలరు, ఏ కాలంలోగానీ!!

అన్నమయ్య తాను వర్ణించదలుచుకున్న దేవుని పేరు కూడా పైకి చెప్పకుండా, పరోక్షంగా అతనికి సంబంధించిన కథా ఘట్టాలతో మొత్తం పద రచన చేసిన సందర్భాలు ఆయన సంకీర్తనా సాహిత్యంలో కోకొల్లలు! అందులోనూ భాషాపరంగా చూసినా, ఆయన తన ఉపమానాలని వాడిన తీరుని గ్రహించినా కూడా ప్రత్యేకంగా ఎంచి మరీ ప్రస్తావన చేయవలసిన పదాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు నేను వివరించబోయే ఈ పదాన్ని శ్రీమాన్‌ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ స్వరపరిచారు. ఈ పదం అనేక కారణాలకిగానూ నాకెంతో ఇష్టమైనది. ఈ పదంలో ‘నీ బంటు’ అన్న దొక్కటే సంబోధన! పదం మొత్తం మీద ఎక్కడా రాముడి పేరూ రాదు, హనుమంతుడి పేరూ రాదు. ఆంజనేయుడి భుజశక్తినీ, ధీశక్తినీ చతురతగా ప్రదర్శించిన ఈ పదంలో అన్నమయ్య గారి భాషా చమత్కారం ఎన్నదగినది. ఒక పదాన్ని ఇలాగ కూడా చెప్ప వచ్చునా? అచ్చ తెనుగుని ఇంత బాగా ఉపయోగించ వచ్చునా? దేశిభాషలో ఇంతటి అందముందా? అని తెనుగువారు విస్తుపోతూ గమనించవలసిన పదం ఇది. అన్నమయ్య ఊహ లోనికి గనక మనం ప్రయాణం చేయగల్గితే, మనసుకి చాలా సంతోషం కల్గించగల అన్నమయ్య పదాలలో ఇది కూడా ముఖ్య మైన ఒక పదంగా చెప్పవలసినది!

‘‘నేల మిన్ను నొక్కటైన నీ బంటు వొక్క –
వేలనే యక్షుని దెగవేసెఁగా నీ బంటు’’
(సంపుటం 1, సంకీర్తన 69, పేజీ 47)

ఈ పదం నిండా అచ్చ తెనుగు పదాలు ఎంతో అందంగా అమిరాయి. హనుమంతులవారి ప్రజ్ఞకి పట్టం కట్టిన ఈ పదం — రామాయణంలో అంజనీపుత్రుడు చేసిన సాహసాల విన్యాసాల కథాక్రమాన్ని పరోక్షంగా చెబుతుంది. రామాయణం కథని బాగా తెలిసిన వారికి ఈ పదంలో కవి ఉద్దేశించిన ఘట్టాలన్నీ సుపరి చితాలే! అయితే అంత బాగా ఇతిహాస పరిజ్ఞానం లేని తరాలు అప్పుడే వృద్ధి పొందుతున్న ఇవాళ్టి కాలంలో, అన్నమయ్య పదాలకి వివరణాత్మక వ్యాఖ్యానంతో మరొక పునర్ముద్రణ అవసరం ఎంతో ఉంది. ఆ అవసరాన్ని తెనుగు సాహితీ జిజ్ఞా సువులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మేలు పొందిన వారవుతారు అన్నమయ్య సంకీర్తనల విషయంలో!

ఇంతకీ కథలు కావు ఈ పదాన్ని ప్రత్యేకం చేసినవి. ఆ కథల ప్రస్తావన దేనినీ సూటిగా తీసుకొని రాకుండా — వాటిని ఊరికే సూచన చేసి వదిలివేస్తాడు అన్నమయ్య. ఈ పదంలో ఆంజనేయస్వామి పరాక్రమ ఘట్టాలని అన్నమయ్య వర్ణించిన తీరు ఎలా ఉంటుందంటే` ఇవాళ్టి చలనచిత్రంలో చూసిన మాదిరి దృగ్గోచరం చేయగల్గిన శక్తి కల్గిన పదబంధాల కూర్పుతో — పదం అంతా కదం తొక్కు తున్నట్టు నడుస్తుంది.

‘‘ఉంగరమెగరవేసి యుదధిలోఁబడకుండ
నింగికిఁ జెయిచాఁచె నీ బంటు
చంగున జలధి దాటి జంబుమాలి నిలమీద
కుంగఁదొక్కి పదములఁ గుమ్మెఁగా నీ బంటు’’

అన్నమయ్య వాక్యాలని గమనించండి. ఉంగరాన్ని ఎగుర వేయటం; అది సముద్రంలో పడిపోకుండా ఆకాశంలోకి హను మంతుడు తన చేతిని చాచటం; చంగున సముద్రాన్ని దాటటం; జంబుమాలిని సంహరించటం — వీటిని ఆయన దృశ్య మానం చేసిన పద్ధతి ప్రత్యేకమైనది. అలాగే ఈ పదంలో సంజీవనీ పర్వతాన్ని అచ్చ తెనుగులో అన్నమయ్యగారు చక్కగా ‘మందుల కొండ’ అని అంటారు. ఇంత చక్కగా తెలుగులోంచి మనం పదాల వాడకం చేయొచ్చని మనకి తట్టదే!? బహుశా తెనుగు సాహిత్యం లో సంజీవనీ పర్వతాన్ని ‘మందుల కొండ’గా పిలవగలిగినదీ, పిలిచినదీ అన్నమాచార్యుల వారొక్కరే కాబోలు!

‘‘దిట్టయై మందులకొండ తేజమున నడురేయి
పట్టపగలుగఁ దెచ్చె బాపురే నీ బంటు’’

పట్టపగలైనట్టుగా ఉన్న తేజముతో కన్పించే ఆ మందుల కొండని తన దిట్టతనంతో తెచ్చాడయ్యా నీ బంటు – బాపురే! అంటూ పదం రాయడంలోని ఆయన రచనా విన్యాసాన్ని గమనించండి. మరి ఇన్నోటి పనులని చేసే పావని మామూలువాడా? కాడు గద. అతడు ఏకంగా బ్రహ్మపదవికే పోటీపడినవాడాయె. అందుకనే, ‘అజుని పట్టానకు’ అని అంటాడు అన్నమయ్య. అటువంటి ఆంజనేయుడిని తన విశేషమైన కల్పన ద్వారా అచ్చ తెనుగు పదాల మధ్య బంధించి దృశ్యమానం చేసిన అన్నమయ్య మాత్రం సామాన్యుడా? ఉత్త మోత్తమ భాషా పాటవం చింది పడిన అన్నమయ్యగారి ఇలాంటి పదాలు అనేకం ఉన్నాయి. వాటిలోంచి ఇదిగో ఇది చాలా బాగుంది సుమా అని ఎంచబోతే అంతకన్నా బాగున్నది మరొకటి ఎదురుపడుతుంది. దేనికి ప్రాముఖ్యతనిచ్చి ముందుగా ఉదహరిం చాలో తెలియక – బుద్ధి తెగ తికమక పడుతుంది. రసజ్ఞులైన పాఠకుల అభిరుచికి వాటిని వదిలిపెట్టి ముందుకు సాగవలసినదే!

దేవుని మీద తన అనంత కల్పనా స్రవంతిని ప్రవహింప జేసిన అన్నమయ్య లోకేశ్వరుడినే కాదు లోకులని కూడా ఎంత గానో సమాదరించటం గమనార్హం! ‘‘అన్నిటాఁదాము నతిశయులే/ యెన్నఁగ నధికులె యెసఁగఁగను’’ (సంపుటము 4, సంకీర్తన 75, పేజీ 411) అన్న పదంలో. అన్నమాచార్యులు ఈ పదంలో మను ష్యులని గురించి,

‘‘పరంపరలగు భవములఁ బొడమియు
చిరంతనులే జీవులిదే
దురంధరులే దురిత సుకృతముల
జరామరణ విశారదులే!’’

అని అంటారు. మనుష్యులలో ఎన్ని రకాల వారున్నారో వారందరినీ పేర్కొని కీర్తించా డిరదులో అన్నమయ్య. ఈ లోకంలో పరంపరగా తరాలు దాటి పుడుతూనే ఉన్న ఈ మనుష్యులు ఎంత ప్రాచీనులూ అని అంటున్నాడు అన్నమయ్య, జీవులు చిరం తనులే నంటూ!

అన్నమయ్యగారి ఈ పదం చదవగానే నాకు శ్రీశ్రీ మహా ప్రస్థానంలోని ‘మానవుడా!’ అన్న గేయం చప్పున గుర్తొచ్చింది. ఈ రెండూ భిన్న కాలాలలోని భిన్న దృక్పథాలకు చెందిన కవులు రాసినవే అయినా బింబ ప్రతిబింబాలుగా కన్పించడం చాలా ఆశ్చర్యాన్ని కల్గించే సంగతి. కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణు సంకల్పంలో ప్రభవం పొందినవాడా! మానవుడా! అని అంటాడు శ్రీశ్రీ. మనిషి చిరంతనాన్నే — ‘‘కల్పాంతాలకు పూర్వం’’ అంటూ చెప్తాడు శ్రీశ్రీ. సౌందర్యాన్ని ఆరాధించే వానిగా; జీవించేవానిగా; దుఃఖించేవానిగా; ప్రేమించే వానిగా; వియోగీ, యోగీ, భోగీ, త్యాగీ మానవుడా! అని శ్రీశ్రీ మనిషిని సంభావిస్తే, విషయమత్తులు; మదాతురులూ; ముదాసక్తులు; మోహవిదూరులూ; చిదానందులూ; చిరయశులూ అంటూ అన్నమయ్య పేర్కొంటాడు. మనిషిలోని ఘర్షణని ఈ కవులు చూసిన కాలాలు వేరే అయినా ఆ మనిషిని గుర్తించడంలో వీరిద్దరి గొంతులూ కలవడం చాలా ఆశ్చర్యం!

చివరిగా తెనుగు సాహిత్య పాఠకవర్గానికి నాదొక విన్నపం. అన్నమయ్య సాహిత్యానికి మేలైన ముద్రణని సాధించుకోవలసి ఉన్నది. అలాగే ఆ సంకీర్తనలని అర్థతాత్పర్యాలతో, విశేషాలతో తరవాతి తరాలకి తెలిసే వీలుగా ఆ ముద్రణని తీసుకుని రావలసీ ఉన్నది. ఇది ఎంత తొందరగా సాధించగలిగితే అంత సత్ఫలితం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ప్రత్యేకంగా ఎన్నదగిన మహా కవి శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యులు. తెలుగువారి అదృష్ట వశాననో, పుణ్యఫలాననో ఆయన సంకీర్తనలు తెనుగు భాషలో వ్యక్తం అయినాయి. ఆ వారసత్వానికీ, ఆ ఘనతకీ తెలుగు వాళ్ళంతా కూడా హక్కుదారులే గనక ఈ బాధ్యత కూడా ప్రతి తెలుగు వ్యక్తి మీదా ఉంది. అన్నమయ్య సాహిత్యాన్ని ఏయే రీతులలో భద్రంగా పదిలపరచుకోవలసి ఉన్నదో, భక్తులూ, సాహితీ బంధువులూ అందరూ సమాలోచనలు చేయవలసి వున్నది. ఆ సత్కార్యానికి వీరంతా అన్ని రకాలుగానూ తమ మద్దతుని తెలుపవలసి ఉన్నది.
---------------------------------------------------------
రచన: జయప్రభ, 
ఈమాట సౌజన్యంతో

Saturday, October 27, 2018

1998(కథ)


1998(కథ)



సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.........

ఆమె వెళ్ళిపోతోంది.
పుట్టింటికి వెళ్ళిపోతోంది.
భాస్కర్ని విడిచి వెళ్ళిపోతోంది.
అందుకు రేపే ముహూర్తం !

పద్మ పుట్టిల్లు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళపై తను అర్ధంతరంగా వాలిపోవడం ఆర్ధికంగా ఇబ్బంది వ్యవహారం అయినప్పటకీ కూతురిని బరువుగా తలచే తల్లితండ్రులు కారు.

జీవితాంతం వాళ్ళకి బరువు కాకుండా తనకి ఉన్న డిగ్రీ చదువుకి ఏదో చిన్న ఉద్యోగం దొరక్కుండా పోదు. వాళ్ళకి కూతురుకన్నా ఏడేళ్ళ మనవరాలు సుస్మిత, అయిదేళ్ళ సమీర్‌ అంటే పంచప్రాణాలు.

ఆమె పుట్టింటికి వెళ్ళిపోతున్న విషయం భాస్కర్‌ కి తెలీదు. తెలియజేయడం కనీస ధర్మం. ఆమె అతనితో మాటాడదు. మాటాడ బుద్ధికాదు. అంచేత కూతురు సుస్మిత చేత తెలియపరచింది. తను పక్కనే ఉండి గమనిస్తోంది. భాస్కర్లో చలనం ఆమెకు కనిపించలేదు. మరోసారి సుస్మిత చెప్పింది. అయినా లేదు చలనం. “వెళితే వెళ్ళండి” అన్లేదు. “వెళ్ళడానికి వీల్లేదు” అని కూడా అన్లేదు. ఒక చిన్న నిట్టూర్పు కూడా లేదు. నిర్ఘాంతపోయింది పద్మ. అతడు అవుతాడనుకొన్న షాక్‌ ఆమెకే తగిలినట్టయింది .

ఏంమనిషి ? పదేళ్లబంధం ఒక్కసారిగా తెంచేసుకొవడం సామాన్యమైన విషయమా ? మనిషి అన్నాక పోజిటివ్‌ గానో, నెగిటివ్‌ గానో ఏదో వల్లకాడు గానో స్పందించాలికదా!

అతనిలో ఏ స్పందనా లేకపోవడం ఆమెను ఇంకా వెర్రెత్తించింది. మరింత అశాంతికి గురి చేసింది.

ఇతనితోనా ఇన్నాళ్ళుగా కాపురం చేసింది.

అవును. చేయగలిగింది. ఆమె కాబట్టి చేయగలిగింది.

మరో ఆడదయితే అతనితో పట్టున పదిమాసాలు కూడా కాపురం చేయలేదని పద్మ ప్రగాఢ అభిప్రాయం.

అది సరే!

భాస్కర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పటికి అతని సర్వీసు పదిహేనేళ్ళు !

భాస్కర్ని అతను పనిచేస్తున్న కంపెనీ ఎలా భరిస్తుందనేది ఆమెకి అందని విషయం. ఈపాటికే అతను సర్వీసునించి టెర్మినేటు చేయబడి ఉండాలి !

భాస్కర్‌ ఒక అసమర్ధుడు. ఏ పనీ చేతా వాతా కాని వాజమ్మ. దద్దమ్మ. అతడు వంటింట్లోకి చొరబడి స్టవ్‌ వెలిగించలేడు. వెలిగించి ఇస్తే పాలు కూడా మరిగించలేడు. ఇల్లు శుభ్రం చేయాలి. వంట చేయాలి. అదే సమయంలో పిల్లలు ఇద్దరినీ స్కూలికి తయారు చేయాలి … ఇంట్లో సవాలక్ష పనులతో పెళ్ళం ముండ ఒక్కతే గింజుకు ఛస్తుంటే చూస్తూ ఊర్కుంటాడు తప్ప తనుకూడా చేయి వేసి సహకరించడు. హూషారుగా ఏ పనిలోకి చొరబడడు. చాకిరీకి ఆమె రెండు చేతులూ చాలక, పిలిచి ఏదైన పని చెబితే ఖర్మ ! పనికి రెండు పనులవుతాయి. మళ్ళీ ఆమే చావాలి.

చిన్న సంసార నావకి చుక్కాని కాలేని భర్త, ఏట్లో తెడ్డు వేయడం చాతకాని భర్త, నావ ఎలా నడపాలో చెప్పినా నడపలేని భర్త, అంత పెద్ద కంపెనీలో ఎలా నెగ్గుకు వస్తున్నాడనేది ఆమెకు అర్ధం కాని విషయం.

అతను పనిచేస్తుండగా తనివి తీరా చూడాలని ఆమె ముచ్చట. తన ముచ్చట తీర్చమని చాలాసార్లు బతిమాలుకొంది పద్మ.

నవ్వేస్తాడు భాస్కర్‌ . అదొకటొచ్చు ! ఆమె రెట్టిస్తే “రా! వచ్చి చూడు” అంటాడు. ఎలా చూస్తుంది? తీసుకెళ్ళాలి కదా ! ఆ పని కూడా చేత కాదు.

నవ్వేస్తూ, ఆమెను దగ్గరకు తీసుకొని అంటాడు ” ఏదో పోనిద్దూ! నీ లాగే మా కంపెనీ కూడా చూసీ చూడనట్టు వదిలేస్తోంది. పాపం నీవు భార్యగా భరిస్తుంటే, కంపెనీ కన్న తల్లిగా నన్ను సాకుతోంది. అయితే ఒకటే తేడా ! భార్య భరిస్తున్నాననుకొని నొప్పులు పడిపోతోంది. తల్లికి భరిస్తున్నట్టే తెలియదు !”

“చాల్లెండి! మీ అమ్మే మిమ్మల్ని పాడు చేసింది. ఎందుకూ పనికిరాకుండా పెంచి, నా మీదకి ఆంబోతులా వదిలేసింది” అంటుంది పద్మ.

అక్కడితో వదలకుండా అతని మిత్రుల వద్ద కదుపుతుంది. ” ఈ చేతకాని మనిషి ఉద్యోగం ఎలా వెలగబెడుతున్నాడయ్యా బాబూ” అని సాగదీస్తుంది.

“అమ్మమ్మమ్మా ! భాస్కర్ని అలా తీసిపారేయకండి మేడాం ! అతడు డ్యూటీలో రెచ్చిపోతాడండీ బాబూ! అతనికి సరిరారు ఎవరూ ! మా బాస్‌ కి భాస్కరంటే ప్రాణం”

“నేను నమ్మను. మీ స్నేహితుడు కదా! వెనకేసుకొస్తున్నారు”

“అంత దారుణంగా మమ్మల్ని తీసి పారేయకండి మేడాం ! అతని పనితనం గురించి మీకు ఒకటే ఉదాహరణ … మాకు ఇన్‌ టైములో రాని ప్రమోషన్లు మీశ్రీవారికి ప్రత్యేకంగా అవుటాఫ్‌ టర్న్‌ లో వస్తున్నాయి. ఇంతకన్నా గుర్తింపు ఏముంటుంది?”

“ప్రమోషన్లకీ, పనికీ సంబంధం లేదు. మీ మిత్రుడు కాకా మాష్టారు! వాళ్ళ బాస్‌ ని పాలిష్‌ చేసి, మస్కా కొట్టి ప్రమోషన్లు కొట్టేస్తాడు. కాదంటారా ?”

“కుండ బద్దలు కొట్టినట్టు మీరంత గట్టిగా చెబుతుంటే .. ఎలా కాదనగలం మేడాం ? కాని మాకిది న్యూడిస్కవరీ”

“నోర్ముయ్యండ్రా స్టుపిడ్స్‌ ” నవ్వేస్తాడు భాస్కర్‌. స్టుపిడ్స్‌ నోర్ముయ్యలేదు.

“మేడం ! మీవారి పాలిష్‌, మాలిష్‌ వ్యవహారం మేం అణుమాత్రం కూడా పసిగట్టలేనిది మీరెలా కనిపెట్టేశారు ?” ఉత్సాహంగా అడిగేరు.

“బాబూ ! నాకు ఆయనతో పదేళ్ళ అనుభవం ! నాకు తెలీకపోవడం ఏమిటీ ? దయచేసి వివరాలు అడక్కండి”

అడగలేదు వాళ్ళు. భాస్కర్‌ మాత్రం అడక్కుండా ఉండలేకపోయాడు. అడిగిన సమయం చిక్కని రాత్రి. బెడ్‌ రూం లో ఆమెతో సరసం. శృంగారం. “నీ అనుభవం నుంచి నా పాలిష్‌ వివరాలు చెప్పవా పద్మా !” అడిగేడు. “ఇది మరీ బాగుంది. మీ గురించి మీకే చెప్పడం ఏమిటి ?” “నాకు తెలీదు కనక” “తెలీకుండానే పాలిష్‌ కొడతారా ? గొప్ప కళే ?” “నీ పదేళ్ళ అనుభవంనుంచి నేను ప్రదర్శించిన ఆ కళగురించి చిన్న ఇన్సిడెంటు చెబుతే సంతోషిస్తాను”

“చాల్లెండి. నంగనాచి కబుర్లు. తెలీనట్టు నాపకాలు. మీరు ఇప్పుడు చేస్తున్నది ఏమిటీ ? నాపై అప్లయ్‌ చేస్తున్నది అదికాదా !”

ఆమె నగ్న శరీరంపై అతని చేతులు చేస్తున్న విన్యాసాలు క్షణకాలం ఆగిపోయాయి. “దీన్ని పాలిష్‌ అంటారా !” అన్నాడు తెల్లబోతూ.

“నన్ను నిద్రపోనివ్వకుండా మెత్తగా దువ్వి నన్ను రంగంలోకి దింపడాన్ని ఏమంటారు ? మీబాస్‌ కి పాలిష్‌ తో ప్రమోషన్‌. నాకు పాలిష్‌ తో మీకు అమర సుఖం !”

“సెక్సు ప్రిపరేషన్‌ కి నీవు పెట్టిన పేరా ఇది ! నీ ఉద్దేశ్యం ఏమిటీ ? నీ దగ్గరే కాకుండా మాబాస్‌ దగ్గర పడుకొంటున్నానా ? హోమో సెక్సు మాకు అంటగడుతున్నావా ?”

“ఛీఛీ. చెత్త మాటలు మాటాడకండి”

“పాలిష్‌, మాలిష్‌ అంటూ కొత్త విషయాలు చెప్పి చెత్త అంటావేమిటి ? సరే. నేను పాలిష్‌ కొట్టి నీదగ్గర సుఖాన్ని దోచుకొంటున్నాను. మరి నీ సంగతి ఏమిటి ? పాపం ! నీకిందులో సుఖం లేదా ?”

“ఆ మాట నేను అనలేదు. నాకూ సుఖమే. కాని ఇక్కడ తేడా ఉంది” “చెప్పు ”

“మీరు నాదగ్గర చేరేది నాకు సుఖాన్ని ఇవ్వడానికి కాదు. మీరు తీసుకోవడానికి. అందులోకి దింపేక, రగిలించేక ఏం చేస్తుందీ ఆడది ? స్త్రీ నుంచి మగాడికి కావల్సింది సుఖం. ఆ సుఖం కోసం ప్రేమిస్తాడు. స్త్రీకి కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమకోసం ఇస్తుంది తన శరీరం. సుఖం. కాదంటారా ?”

“ఇదేదో కొటేషన్‌ ఏ పుస్తకంలోనో చదివి పాలిష్‌ మాలిష్‌ అని నా ప్రేమను శంకిస్తున్నావు” అన్నాడు.

అతనికి ఆమె అంటున్నది కొత్త విషయంగా తోచింది. పూర్తిగా ఏకీభవించలేక ఆమెతో ఆరాత్రి వాదన పెట్టుకొన్నాడు కాసేపు.

ఆమె చెప్పిన దాంట్లో స్త్రీ యొక్క త్యాగ గుణం, పురుషుడిలో జంతు స్వభావం కనిపించి జీర్ణించుకో లేకపోయాడు. అయితే

అప్పటికా విషయం ఆ రాత్రి ఆమె ఇచ్చిన సుఖంలో మర్చిపోయాడు.

గత నాలుగైదు రోజులుగా

అతను ఆమెనుంచి ఆ సుఖం పొందటంలేదు. ఆమె అతని నించి తీసుకోవటం లేదు.

రోజూ రాత్రి ఇద్దరూ బెడ్‌ రూం లో డబుల్‌ కాట్‌ పైకి చేరుతున్నప్పటికీ ఒకరి శ్వాస మరొకరికి తగలనంత దూరంగా నిశ్శబ్దం మధ్య మంచం అంచుల వైపు అటు ఆమె ఇటు అతడు.

రేపటినించి ఆ రకం పడక గూడా ఉండదు. ఇక ఇంటోనే ఉండదు పద్మ. అతనికి దూరంగా పుట్టింటికి పయనం. ఇద్దరి మద్య గొడవ కారణంగా ఆ పయనం. ఇంతాచేస్తే అంతగొడవకీ కారణం చిన్న ఉల్లిగడ్డ !  1998 ఉల్లిపాయికి అంత పవరు లేదని ఎవరూ అనలేరు.

నెలరోజుల క్రిందట ఉల్లిపాయలు అయిదు కేజీలు పద్మ ఒక్కసారిగా కొనబోతూంటే వద్దని వారించేడు భాస్కర్‌.

చిచ్చు అక్కడే రగులుకొంది.

సాధారణంగా బజారుకి భాస్కర్‌ పద్మతో వెళతాడు. సరదాగా, తోడుగా మాత్రమే వెళతాడు. అతడు ఆమె పక్కనే ఉన్నప్పటికీ బజారులో కూరగాయలు బేరమాడుట, ఎంపిక చేయుట సమస్తం పద్మ మాత్రమే చూసుకొంటుంది.

అందుకు బలవత్తరమైన కారణం ఉంది.

భాస్కర్‌ ఒక్కసారి సాయంత్రం డ్యూటీనుంచి వస్తూ కూరగాయలు కొని తెచ్చాడు. ఆమె తెమ్మంటేనే తెచ్చాడు. తీరా తెచ్చాక ఒకటీ, ఒకటీ గెలికి పుచ్చుకొని, చచ్చువి, ముదరవి అంటూ ప్రతి కూరగాయికీ వరుసగా రకరకాల పేర్లు పెట్టింది. ఆమే కాదు చదువుకొంటున్న ఇద్దరు పిల్లలనూ పిలిచి వింత వస్తువులను చూపించినట్లు చూపించింది. పిల్లలతోపాటు ఆమె ఆ రోజంతా పకపక నవ్వింది. ఆమె అక్కడితో ఆగకుండా అతని నిర్వాకాన్ని మరుసటి రోజు ఇరుగు పొరుగు ఆడవాళ్ళ మధ్య్య ఒక చోద్యంగా చూపించి వినోదాన్ని పంచింది.

మరోసారి భాస్కర్‌ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగర్తగా తెచ్చాననుకొంటే పద్మ ఆ కూరగాయలను సీరియస్‌ గా కోపంగా గబగబా బయటకు తీసుకువెళ్ళి పెంటకుప్పపై విసిరేసింది. అతని మనస్సు చివుక్కుమంది. ఆమె తననే మూట కట్టి పెంటపై పడేసినట్టు ఫీలయ్యాడు. ఆ రోజునుంచీ తను బజారు తీసుకు రావటంలేదు. ఆమె తెమ్మనటం లేదు.

అప్పటి నుంచీ భాస్కర్‌ ఆమెకు తోడుగా మాత్రమే వెళతాడు. కూరగాయల వ్యవహారం మొత్తం పద్మే చూసుకొంటుంది. పొరపాటున ఆమె చచ్చువి, పుచ్చువీ తను చూస్తుండగా ఏరినా, చూస్తూ ఊర్కొంటాడు తప్ప మాటాడడు. అంతేకాదు ఆమె సెలక్షన్‌ లో పుచ్చులను ఎత్తిచూపి ఎద్దేవా చెయ్యడు. “ఇపుడేమంటావ్‌ ?” అని రెచ్చగొట్టడు. పుచ్చులను ఆమె సైలెంటుగా ఏడుచుకొంటూ పారేయటం చూస్తాడు. బయటకి కనపడనివ్వని ఆమె ఏడుపుని చూసి, ఆమెకు కనపడకుండా, వినపడకుండా అతను నవ్వుకుంటాడు. అంతే తప్ప దొరికింది ఛాన్సు కదా అని ఓపెన్‌ గా ఏడిపించడు.

ఏదైన సరే వినియోగవస్తువుల కొనుగోలు విషయంలో తలదూర్చకుండా జాగర్తలు పాటించే భాస్కర్‌ … ఆ రోజు అతనికేమయిందో తెలీదు … ఉన్నపాటున దభీమని ఉల్లిగడ్డ ఊబిలో పడిపోయాడు.

ఉల్లి సలహాతో అడ్డంగా దొరికి పోయాడు.

కత్తిపీట తగలకుండానే పద్మకి కళ్ళనీళ్ళు రప్పిస్తున్నాయి ఉల్లిపాయలు.

పక్కింటి సరోజ సలహాపై హోల్‌ సేల్‌ కొట్లో కొనాలని బయల్దేరింది. అలా కొంటే కేజీ దగ్గర రెండు రూపాయల తేడా ఉంది. అంచేత పద్మ సంచితో బాటు భర్తను కూడా వెంటేసుకొని హోల్‌ సేల్‌ కొట్టుకి పరుగున వెళ్ళింది.

అక్కడ ఉల్లిపాయలు మినిమం అయిదు కేజీలు కొనాలి. లేకుంటే అమ్మడు. తర్వాత అవి సగానికి పైగా కుళ్ళిపోయి బయటకు పారేయవలసి వస్తుందని భాస్కర్‌ కి ఎందుకో అనిపించింది. తన భయాన్ని ఆమె ముందు వెలిబుచ్చలేదు. డైరెక్టుగా దుకాణుదారునే అడిగేసాడు. “ఉల్లిపాయలు స్టాకు ఉంటే పాడవ్వవు సార్‌” అన్నాడు. “మీకా భయం ఉంటే రెండు రోజులు ఎండబెట్టి, గాలి తగిలేలా స్టోర్‌ చేస్తే కుళ్ళకుండా కావల్సినంత కాలం ఉంటాయి” అన్నాడు.

అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే పప్పులో అతని కాలు పడింది ! ఏ కొట్టులో నయినా బేరమాడకుండా కొనదు పద్మ. బేరమాడిందని కాబోలు కేజీపై రూపాయి పెంచేడు షావుకారు. పద్మ నివ్వెర పోయింది. గాభరాతో ఆమె మాట తడబడింది. “అదేమిటండీ మాపక్కింటి ఆవిడ మీ దగ్గర గంట క్రితమే కొంది” అన్నది. “అది గంట క్రితం రేటు తల్లీ ” అన్నాడు షావుకారు. ఆమె బ్రతిమిలాడింది. “ఇక్కడ బేరాలు ఉండవమ్మా. మీకు అనుమానం ఉంటే బయట మార్కెట్‌ రేటు ఎంత ఉందో కనుక్కోండి ” ముందుగానే ఆమె అక్కడకి వచ్చేముందు మార్కెట్‌ రేటు కనుక్కొనే వచ్చింది. కేజీ 16 రూపాయలు. హోల్‌ సేల్‌ రేటు 14 రూపాయలు. పక్కింటి సరోజ అదృష్టవంతురాలు. 13 రూపాయలకే కొన్నది. హుషారైన మొగుడు కాదు భాస్కర్‌ . సరోజలా అదృష్టాలు ఎలా తగుల్తాయి తనకి !

పక్కన చెట్టంత మగవాడు ప్రేక్షకుడిలా ఉండిపోతే, ఆడకూతురు అరగంట సేపు ప్రాధేయపడిందని కాబోలు షావుకారు … ఏదో స్పెషల్‌ కేసుకింద కిలోపై ఒక అర్ధరూపాయి తగ్గిస్తానన్నాడు.

“ఏంచేద్దాం ” అన్నట్టు భర్త వైపు చూసింది పద్మ. చూడక పోయినా బావుణ్ణు. “వద్దు. కొనద్దు” అన్నాడు భాస్కర్‌ . రెండు రోజులాగి చూద్దాం అన్నాడు. “మీ ఇష్టం” అని పద్మ ఉల్లిపాయలు కొనే ప్రపోజల్‌ ని విరమించుకుంది. మాటాడకుండా భర్త అడుగులో అడుగువేస్తూ ఇంటి ముఖం పట్టింది. ఇంటి వ్యవహారాల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో భాస్కర్‌ తలదూర్చి సరైన నిర్ణయాలు తీసుకొన్న అరుదైన సందర్భాలు లేకపోలేదు.

“నా మంచి మొగుడు. సమయానికి ఎంత గొప్ప నిర్ణయం తీసుకొన్నాడు ” అని పద్మ ఏనాడు కొనియాడలేదు. అందుకు భాస్కర్‌ బాధపడలేదు. అది ఆమె స్వభావంగా భావిస్తాడు.

భాస్కర్‌ మాత్రం ఆమె ఏ పని చేసినా అభినందిస్తాడు. “అది నిజంగా నీకే సాధ్యం పద్మా !” అంటాడు. “వండర్‌ ఫుల్‌ ! నీకు నీవే సాటి ! అంటాడు. అతని పొగడ్తలకి పడిపోతుంది. పడగొట్టటంలో భాస్కర్‌ ఘనుడు. దానినే అతనిలో “కాకా” గుణంగా గుర్తించింది. ఆ రోజు భాస్కర్‌ ఉల్లిపాయలు కొనవద్దు అన్నది కేవలం సలహా మాత్రమే. “కొనేద్దాం అంటే అతను కాదంటాడా ?” కాదనడు. వద్దు అన్నది కూడా రెండు రోజుల్లో ఉల్లి ధర తగ్గుతుందనే నమ్మకంతో అన్నాడు. అతను ఆ ముందురోజే పేపర్లో చదివాడు.

“ఎప్పుడూ లేని విధంగా నిత్యావసర సరకుల ధరలు దేశం మొత్తాన్ని గజగజ వణికించేస్తున్నాయి. ఉల్లిపాయల ధరలైతే అందుబాటులో లేకుండా పోయాయి. ఒకటీ, రెండు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోవలసి ఉన్నందు వలన ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ధరలు తగ్గేలా తగిన చర్యలు చేపట్టింది. ఓట్ల బ్యాంక్‌ దిగువ తరగతితో ముడిపడి ఉండడంచేత ఆ స్థాయికి ధరలు మరి రెండు రోజుల్లో కిందకి దిగేలా ముమ్మరం చేసింది. ”

భాస్కర్‌ పేపర్లో వచ్చిన వార్త నమ్మేడు.

అతని మిత్రుల మధ్య టీ కబుర్లలో వేడి వేడి రాజకీయాలు దొర్లేయి. వాళ్ళు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు తగ్గటం అనివార్యం అని అభిప్రాయ పడ్డారు. భాస్కర్‌ అభిప్రాయం కూడా అదే అయ్యింది.

పద్మకి ఇంటి సమస్యలు తప్ప దేశ రాజకీయాలు పట్టవు. ఉల్లిగడ్డ ధర ఎందుకు పెరిగి ఎందుకు తగ్గుతుందో, అందులో అసలు రాజకీయం ఉందా, ఉంటే ఏ మేరకు ఉంది అనేది ఆమెకు అందదు. సంసారం ఒడుదొడుకులు లేకుండా హాయిగా పూలపడవలా సాగాలని భగవంతుని ప్రార్ధించుట, భర్త పిల్లలను ప్రేమగా చూచుకొనుట, ఉన్నంతలో మానేజ్‌ చేస్తూ ఇల్లుని చక్కబరచుకొనుట అవి మాత్రమే ఆమెకు తెల్సు. ఆమెది చాలా చిన్న ప్రపంచం.

రెండు రోజుల తర్వాత

ధరలు అదుపులోకి రాలేదు. సరికదా కళ్ళేలు తెంచుకొని ఏ తరగతికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాయి.

కేజీ ఉల్లిపాయలు విశ్వ రూపం దాల్చి పాతిక రూపాయలు పలికింది. హోల్‌ సేల్‌ రేటు, రిటైల్‌ రేటు ఒకటే అయింది.

పేపర్లో ప్రభుత్వం తన తప్పు లేదని ప్రకటించుకొంది

ధరలు పెరగడానికి కారణం ప్రభుత్వం కాదు, బ్యూరో క్రాట్లు అంది. బ్లాక్‌ మార్కెటీర్లను నిందించింది. ధరలు పెరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాలదే అంది. మరో వైపు వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ యొక్క ప్రభావం లేకపోలేదు అంది. సందేహంలేదు, ఇందులో విదేశీ హస్తం ఉందనే రహస్యం ఒకటి బహిరంగ పరచింది ప్రభుత్వం.

వీళ్ళంతా గవర్నమెంటుకి అతీతులు. కాదుకాదు గవర్నమెంటోళ్ళే. ఆ శక్తులకి తొత్తులు అని భాస్కర్‌ కి జ్ఞానోదయం అయ్యేటప్పటికి ఆలస్యమయిపోయింది.

ఉల్లి బోనులో దోషిగా నిలబడ్డాడు. పద్మ పదమూడున్నర రూపాయలకి కొనబోయిన కేజీ ఉల్లి రేటు అతని కారణంగా కేజీ పాతిక రూపాయలకి కొనవలసిన పరిస్థితి దారి తీసింది.

పద్మ ఏమి శిక్ష విధించింది ? అందులో భాస్కర్‌ తప్పు ఎంతవరకు ఉంది ? ఈ మాత్రానికే ఆమె అతణ్ణి విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిందా ? సిద్ధపడితే ఆమెదే తప్పు. అసలు భాస్కర్‌ భర్తగా లభించడం ఆమె ఎంతో అదృష్టంగా భావించాలి. ఈ రోజుల్లో భాస్కర్‌ లాంటి అమాయకులు అరుదుగా కనిపిస్తారు. అతడు సకల సద్గుణ సంపన్నుడు. సరదాకికూడా మందు కొట్టడు. సరసానికి మరో స్త్రీకి కన్ను కొట్టడు. అంతేకాదు నెలాఖరులో మొత్తం జీతం కవర్‌ తో సహా పెళ్ళం చేతిలో పెడతాడు. జీతమంతా ఆమె చేతికిచ్చేసి నెలనెల పాకెట్‌ మనీ అడగడానికి మొగమాటపడతాడు. ఆమె పాకెట్‌ మని ఎంత ఇస్తే అంత కిక్కురుమనకుండా తీసుకుంటాడు.

ప్రతినెల బుద్ధిగా జీతం ఇచ్చేసే భాస్కర్‌ ని “నా మంచి మొగుడు” అని ముద్దులతో ముంచెత్తేయదు.

వచ్చే జీతం ఎక్కువ, ఇంట్లో ఖర్చు తక్కువ అయితే ఆమె అంతపని తప్పక చేయగలదు. ముద్దు చేదు కాదుకదా !

వచ్చే జీతం గొర్రె తోక. ఖర్చులు చూస్తే హనుమంతుని తోక.

బుద్ధిగా జీతమంతా తన చేతిలో పెట్టేసి ఎంచక్కా భాస్కర్‌ చేతులు దులిపేసుకోవడం ఒక కుట్రగా, అతని గడుసుదనంగా ఆమె భావిస్తుంది. ఎవరైనా అతను అమాయకుడు అంటే ఇదే సమాధానం చెబుతుంది.

జీతం కవరు అనే చిన్న కొరడా చేతిలో పెట్టి సమస్యల పులి బోనులోకి తనని చాకచక్యంగా నెట్టేసి తప్పుకు తిరిగే తెలివితేటలున్నవారిని అమాయకులంటారా ?

అతన్ని ఎన్నోసార్లు సంసారం చేయమంది. చేతులెత్తి నమస్కారం పేట్టేస్తాడు. అది తప్ప ఇంకేంపనైనా చెప్పు చేస్తాను అంటాడు. చేయడానికి ఇంకేముంటుంది ?

పెళ్ళాం పెట్టింది వేడి వేడిగా రుచి రుచిగా తినడం, పెళ్ళాం పక్కలో వెచ్చ వెచ్చగా హాయి హాయిగా “సుఖం” జుర్రుకొని చల్లగా నిద్ర పోవడం. అంతకన్నా ఇంకేం పని చేస్తాడు ?

అంత సుఖాన్ని పొందే అదృష్టం ఎంతమందికుంటుంది ? అంచేత అదృష్టవంతులు ఆమె కాదు అతడే ! నిజమేనని ఒప్పుకుంటాడు భాస్కర్‌.

పద్మ తలపగల కొట్టుకునేలా ఆలోచిస్తూ, ఆదాయానికి తగ్గట్టు ప్రతి నెలా బడ్జెట్‌ రూపొందిచేటప్పుడు గెడ్డం తీసేసి చీరె చుట్టుకున్న మన్‌ మోహన్‌ సింగులా సీరియస్‌ గా కనిపిస్తుంది. అయితే జోక్‌ గా కూడా ఆమెతో ఆ మాట ఆ సమయంలో అనడు. ఆ మాటే కాదు. ఏ మాటా అనడు. పలకరించడు. పిల్లలనుకూడా వెళ్ళనీయడు ఆ పరిసరాలకి. ( ఆ రాత్రిమాత్రం సింగ్‌ జోకులు కురిపిస్తాడు. ) అప్పుడామెను చూస్తే ఎనలేని గౌరవం కలుగుతుంది. బడ్జెట్‌ రచన సామాన్యమైనది కాదని అతనికి తెల్సు. పాపం ఈ మధ్య ఆమె ఎంత పకడ్బందీగా బడ్జెట్‌ ప్లాన్‌ చేస్తున్నా తరచుగా బెడిసి కొడ్తోంది. గమనిస్తున్నాడు తను. ఏం చేయగలడు ? రాబడిని బట్టి ఆమె ప్రయారిటీస్‌ నిర్ణయించడంలో రిక్రియేషన్‌ కి సంబంధించిన అంశాలు ఒక్కొకటీ కలంపోటుకి విలవిల్లాడుతూ బడ్జెట్‌ నుంచి నేలరాలిపోతున్నాయి. పద్మకి పెళ్ళికాకముందు ఎన్నెన్నో సరదాలు …

కాలేజీ లైఫ్‌ లో ఆమెకు సినిమా అంటే మహా పిచ్చి. ఇప్పటికీ ఆ సరదా ఉంది. సరదా ఒకటే ఉంటే సరిపోదు. పిల్లలతో కలసి సినిమాకి వెళ్ళాలంటే వంద చాలదు. సినిమాలకు వందలు వేసే శక్తి లేదు ఆమెకు.

అంచేత పిల్లలను ఇంట్లో ఉంచి బయట తాళం వేసి భాస్కర్‌ తో రెండు, మూడు సినిమాలు చూసింది. అయితే ఏమాత్రం ఎంజాయ్‌ చేయలేకపోయింది. తెరమీద బొమ్మలు బదులు పిల్లలు కనిపించే వారు. హాలులో ఉన్నంత సేపు పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారో, ఏమి చేస్తున్నారో అని ఒకటే దిగులు అదే ధ్యాస. పిల్లలు ఇద్దరకీ ఒక్క క్షణం పడదు. కొట్టుకొని, కలియబాడి ఇల్లుని ధ్వంసం చేయడం లేదు కదా ! వంట గదిలో గ్యాస్‌ సిలిండర్‌ తో పిల్లలు ఆడుతున్నట్టు పిచ్చి పిచ్చి ఆలోచనలు. సినిమా చూడలేక పోయింది. ఆట మధ్యలోనే భర్తతో ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత సినిమా సరదాలు పూర్తిగా మానుకుంది. టీవీ సినిమాలతోనే తృప్తి చెందుతోంది.

ఆదివారం సాయంత్రాలు సినిమా బదులు సముద్ర తీరానికి భర్తా పిల్లలను బయలు దేరతీస్తోంది. అక్కడ పడి లేచే కెరటాలను చూసి ఆనందిస్తోంది. భర్త సరసన ఇసుక తిన్నెపై కూర్చొని సాయం సంధ్యలో ఎర్రటి సూర్య బింబాన్ని పలకరించి పరవశించి పోతోంది. ఆమె పిల్లలు కాసేపు కెరటాలతోనూ, తర్వాత ఇసుక గూళ్ళతోనూ ఆట. ఈ రిక్రియేషన్‌ కి సినిమా ఖర్చులో నాల్గవ వంతు చాలు !

సరదాలంటే ఇంకా చాలా ఉన్నాయి. చీరలూ, నగలూ చాలా మంది స్ర్తీలకి మల్లే ఆమెకూ ఇష్టం. సరదా పడి అవి కొనాలంటే బడ్జెట్‌ అరలో ఇమడవు. అలాంటి సరదాలు క్రమక్రమేణ మర్చిపోవడం అలవర్చు కుంటోంది. గుర్తు చేసుకోంటే దిగులు తప్ప సుఖం ఏముంది ?

ఆమె సరదాలు ఏమీ తీర్చలేకపోతున్నాననే బాధ అతనికి ఎంతో ఉంది. ఏమి చేయగలడు ? ఏమైనా చేయాలనుకోంటే అతని జీతం వెక్కిరిస్తుంది.

ధరలు అనూహ్యమైన పెరుగుదలముందు అతని జీతం వెలవెల బోతున్నది. కొనుగోలు శక్తి రోజు రోజుకీ క్షీణించి పోతున్నది. రూపాయికి విలువలేదు. ఇలా వంద తీస్తే మంచు గడ్డలా మరుక్షణం కరిగిపోతున్నది.

జీవన వ్యయంతో సమంగా అతని జీతం పెరగడం లేదు. జీతాలు నాలుగేళ్ళ కొకసారి పెరుగుతాయి. ఆ పెరుగుదల మహా ఉంటే మూడు నాలుగు వందలు. ఏడాదికొక ఇంక్రిమెంటు. అంటే జీతంలో మరో ఏభై చేరుతుంది. ఏ మూలకొస్తుంది ఆ పెరుగుదల !

పెరిగే ధరలముందు అతని జీతం పెద్ద గీతముందు చిన్న గీతలా వెలవెల బోతున్నది.

ఈ మధ్య బజారుకు వెళ్ళాలంటే గుండెలు దడదడ మంటున్నాయి.

నిత్యావసర సరుకులూ, కూరగాయలపై చేయి వేయబోతే కాటేస్తున్నాయి. ఉల్లి గడ్డలు ముట్టుకోబోతుంటే నాటు బాంబుల్లా భయ పెడుతున్నాయి.

ఉల్లిధర ఒక్కసారిగా పాతిక రూపాయలు అయిన తర్వాత

పద్మకి దుఃఖమే వచ్చింది. ఇంట్లో భర్త పిల్లలు లేనప్పుడు కళ్ళనీళ్ళు వచ్చేలా ఏడ్చిన రోజులున్నాయి.

భాస్కర్‌ రాంగ్‌ గైడెన్సు ఇచ్చి అయిదు కేజీల ఉల్లిపాయలు చవగ్గా కొననీయలేనందుకు ఆమెకు కోపం వచ్చింది.

ఒక్క అయిదు కేజీలకి అతన్ని నిందించగలదు. తర్వాత ఎవరిని నిందిస్తుంది ?

మరి రెండు రోజుల్లో ఉల్లి ధర పాతిక నుంచి ముఫ్ఫైరెండు వరకూ వెళ్ళింది. ఇప్పుడెవరిని నిందిస్తుంది ?

ఉప్పెనలా వచ్చిన ఈ విపరీత పరిణామాలకి హడలి పోయిన పద్మ ఇంటో ఎమర్జన్సీ విధించింది. అన్నిటిపై కఠినంగా ఆంక్షలు.

సెల్ఫ్‌ రేషనింగు అమలులో పెట్టింది.

భాస్కర్‌ కి ఉల్లికి సంబంధించిన కూరలూ, పులుసులూ ఇష్టం. అవి పూర్తిగా నిషేధించ బడ్డాయి. భాస్కర్‌ కి ఇది శిక్షే !

ఎవరూ పుట్టిన రోజున కూడా ఉప్మా, ఉల్లి పెసరట్లు కోరరాదు.

మసాలా కూరలు ఉపసంహరింప బడ్డాయి. రసం, పచ్చడి, పెరుగు. పెట్టింది తినడమే. మరేమీ అడగ రాదు.

అంతే కాదు

రొటీన్‌ దినచర్యలో చాలా మార్పులు ప్రవేశించాయి.

రాత్రులు భాస్కర్‌, పిల్లలూ నిద్రపోయేముందు పాలు తాగే అలవాటు ఇక సాగదు. పాలు బదులు చల్లటి నీళ్ళు గడగడ తాగి పడుకోవాలి.

పద్మ రోజుకి అయిదారు సార్లు టీ తాగే అలవాటుని ఉదయం ఒక కప్పుతోనే సరిపెట్టుకుంటోంది. భాస్కర్‌ టీ పూర్తిగా మానేసాడు. అంతేకాదు. అతని పాకెట్‌ మనీ కూడా సగానికి సగం కత్తిరించ బడింది.

ఇంత చేసినా రోజులు నెగ్గుకు రావడం కష్టమవుతోంది.

భాస్కర్‌ ఏమి వండినా తింటున్నాడు. ఏమి చెప్పినా వింటున్నాడు. ఏది వద్దన్నా చిత్తం మహా రాణీ అంటున్నాడు.

అయితే మహారాణితో పువ్వుల దగ్గర పేచీ వచ్చింది.

భాస్కర్‌ డ్యూటీనుంచి వచ్చేటప్పుడు రోజూ గుర్తుగా మూడు రూపాయల పూలపొట్లం తీసుకొని వస్తున్నాడు.

పద్మ … పూలుకొనడం మానేయమని ఆదేశించింది.

భాస్కర్‌ స్పష్టంగా అది కుదరదు అన్నాడు. మరేదైనా చెప్పు వింటాను. పూల దగ్గర రాజీ పడేది లేదు అని నిక్కచ్చిగా తేల్చేసాడు. నెలనెల ఆమె ఇచ్చే పాకెట్‌ మనీలో సమస్తం వదులుకొని పూలు కొని తెస్తున్నాడు.

పూలు ఇంతకు మునుపు పద్మే కొనేది. రోజూ వీధిలోకి పూల కుర్రవాడు వాడుకగా ఇచ్చి వెళ్ళిపోయేవాడు. ఆ వాడుక మానిపించేసింది.

అయినప్పటికీ ఆమె జడలో పూలు గుభాళిస్తున్నాయి.

“పూలు లేకుండా నా పక్కన పడుకోరా ” పద్మ.

“పూలు లేకుండా ఎందుకు పడుకోవాలి అనేది నా పాయింటు” భాస్కర్‌.

నెలనెలా బడ్జెట్‌ లోటు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి సల్ప నివ్వకుంటే మల్లెపూలకోసం అతని మంకు ఏమిట్ట ! అర్ధం చేసుకోడు గదా మనిషి !

రోజూ మూడు రూపాయల ఖర్చు ఆమెను బాధిస్తున్నప్పటికీ పూల పరిమళంలో, మత్తులో భాస్కర్‌ స్పర్శ ఆమెను శాంతింప చేస్తున్నాయి. పువ్వులు కొనవద్దని గట్టిగ అనలేకపోతోంది.

ఇంటి పెరట్లో మల్లె, సన్నజాజి, విరజాజి వేసింది. అవి పెరిగి పూలు విరగ పూసినపుడు తప్పక కొనడం మానేస్తానని ప్రామిస్‌ చేసాడు. “సంతోషం ” అని వెక్కిరించింది పద్మ.

భాస్కర్‌ ప్రేమలో కృత్తిమత్వం లేదు. అతని ప్రేమ రోజూ తెచ్చే పువ్వుల్లా స్వచ్ఛ మైనది. ఆ విషయం ఆమెకి తెల్సు. ఇంటి సమస్యలనుండి, ఇంటి చాకిరీ నుండి అతని ప్రేమే ఆమెను సేద తీరుస్తోంది. అలసటనీ, దిగులుని రేపు ఎలా గడుస్తుందనే భయాన్ని అతని బాహువుల మద్య అల్లుకు పోయి సమస్తం మర్చి పోతోంది. సరదాలు, సినిమాలు, షికార్లు లేవనే దిగులు అతను అందిస్తున్న సుఖంలో మర్చిపోగల్గుతోంది. ఆ సుఖమే లేకుంటే ఈ పాటికి తను పిచ్చెక్కి పోయి ఉండేది. లేదా చచ్చిపోవాలనుకునేది.

సాయంత్రాలు భాస్కర్‌ డైరెక్టుగా డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. స్నేహితులూ, సరదాలూ మరో వ్యాపకం పెట్టుకోడు. పద్మ అలా ఆదేశిస్తుంది. అందులో ఆమె ప్రేమనే చూస్తాడు. ఒక్కోసారి అతనికి చిరాకు, కోపం వస్తుంది. ఏమిటీ ఆవిడ జులుం ? మగవాడు బయటకు వెళ్ళేక ఎన్నో పనులుంటాయి. అర్ధం చేసుకోకుండా ఆర్డర్లు జారీ చేయడం ఏమిటీ అనుకొనే సందర్భాలు లేకపోలేదు.

పద్మ పుట్టింటికి పిల్లల సెలవులకి వెళ్తుంది. ఇంటి నుంచి ఆమె పిల్లలతో వెళ్ళిపోగానే ఎంతో స్వేచ్ఛ వచ్చినట్టు ఎగిరి గంతేసేవాడు. అయితే కావాలని స్నేహితులతో చేసే కాలక్షేపం మజా లేకుండా చప్పగా ఉందేది. కాళ్ళీడ్చుకొని ఇంటికి వస్తే భార్యా, పిల్లలూ లేని ఇల్లు భూతాల గృహంలా భయపెట్టేది. రెండు రోజులకే అతను బోరెక్కిపోయి, పిచ్చెక్కిపోయి రైలెక్కేసి పద్మను తీసుకొచ్చేసేవాడు. పిల్లలూ వచ్చేస్తే సంతోషం. రాకుంటే ఇంకా సంతోషం. ఆమెతో కావల్సినంత ఏకాంతం. అడ్డూ ఆపూ లేని ఆనందం.

ఒక రకంగా పద్మ స్వార్ధపరురాలు. ఉదయం తనని విడిచి వెళ్ళి సాయంత్రం వరకూ రాని భర్త, సాయంత్రం వచ్చేక పిల్లలతో ఆడుతూనో, చదువు చెబుతూనో సమయం అంతా వాళ్ళతోనే గడిపేస్తే ఆమె చిత్రంగ అలుగుతుంది. పిల్లలతో గొడవపడి అతన్ని ఏకాంతానికి లాక్కెళ్ళిపోతుంది. అతని భుజంపైనో, గుండెలపైనో వాలి అతను చెప్పే ఖబుర్లు, కాకమ్మ కధలు వింటుంది. అది ఆమెకు ఆనందం. లేదా సోఫాలో అతని తొడని దిండుగా చేసుకొని, అతని చేయిని తన చేతుల్లోకి తీసుకొని ఎదురుగా టీవీ చూస్తూ గడుపుతుంది. నగరంలో ఆడే చిత్రాలను డబ్బుపోసి ఎలానూ చూడ లేదు. టీవీలో కావాల్సినన్ని సినిమాలు. నగరంలో ఆడే చిత్రాలు ఎంత మంచివి అయినా ఏదొక రోజు అవి టీ వీ సముద్రంలో కలవక మానుతాయా !

భాస్కర్‌ ఉద్యోగ రీత్యా ఏ ఊరు అయినా కాంప్‌ వెళితే భరించలేదు. అతన్ని వదిలి ఉండలేదు. ఆమెలో విపరీతమైన భయం చోటు చేసుకొంటుంది. అతను లేకుండా ఇంట్లో ఉండలేదు. అతను లేని ప్రపంచం ఆమెకు శూన్యం. అంతకన్నా ముఖ్యంగా ఆమెకి అలజడి కలిగించేది ఆ జిడ్డు మనిషి మాయాప్రపంచంలోకి ఎలా వెళ్తాడో, ఏం తింటాడో, ఎలా తిరిగి వస్తాడో అని దిగులు.

ఆమె అభిప్రాయం ఏమిటంటే భాస్కర్‌ కి ఏమి కావాలో భాస్కర్‌ కే తెలియదు. తెలిసినా చేసుకోలేని అమాయకుడు. అతని గురించి ఆమెకు మాత్రమే తెల్సని ఆమె నమ్మకం. అంచేత అతన్ని ఒక్కోసారి చంటి పిల్లాడిలా సాకుతుంది. ఆమె గైడెన్సు లేకుంటే ఖచ్చితంగా తప్పడిపోయే, పాడైపోయే పిల్లవాడుగా భాస్కర్‌ ని భావిస్తుంది.

“ఈ నెల జీతం ఎంత అందింది” అని అడిగితే అతను వెంటనే సమాధానం చెప్పలేడు. సమాధానంగా జేబులో డబ్బు, పే స్లిప్పూ ఆమె చేతిలో పెట్టేస్తాడు.

అవును. అతనికొచ్చే జీతంలో బేసిక్‌ పే ఎంతో అతనికి గుర్తు ఉండదు. డి. ఎ. పాయింట్లు ఎంత పెరిగిందో తెలీదు. ఏ లోను ఎంత కటింగు అయి, నెట్‌ ఎంత వస్తున్నదీ చెప్పలేడు.

విశేషం ఏమిటంటే అతని సేలరీ స్లిప్పుని ఆమే స్టడీ చేస్తుంది. జీతం గ్రాసూ, నెట్టూ పరీక్షగ చూస్తుంది. నెలనెలా ఎంత రావాలనేది ఆమెకి లెక్కే. లోన్‌ కటింగ్‌ లో ఏదైన తిరకాసు వస్తే, అదేమిటో అతనికి వివరంగ చెప్పి ఆ సంగతి ఏమిటో చూడమంటుంది. ఆ తప్పుని కంపెనీ ఒప్పుకొని సరిదిద్దేవరకూ భాస్కర్‌ ని నిద్ర పోనీయదు.

భాస్కర్‌ ని సడెన్‌ గా రెండో ఎక్కం చెప్పమంటే తడబడతాడు. అతను ఏదైనా లెక్కచేసినా, చేసింది కరెక్టే అనే కాన్ఫిడెన్సు తక్కువ. నిదానంగా చేయనీయకుండా, గాభరా పెడితే అంకెలు అతనికి గొంగళి పురుగుల్లా కనిపిస్తాయి. అదృష్టవశాత్తు అతను చేస్తున్న ఉద్యోగం అంకెలతో అంత సంబంధం లేనిది.

పద్మ ఒకసారి కిరాణా దుకాణంలో సరుకులు కొంటున్నప్పుడు కేజీ పప్పు పదహారున్నర అయితే మూడు కేజీలు ఎంత అని అడిగింది.తను బియ్యం కొనడానికి తెచ్చిన డబ్బుల్లో ఏమైన మిగిలితే పప్పులు కూడా కొందామని ఆమె తాపత్రయం. ఆమె ఒక్కసారిగా లెక్క అడిగే సరికి అతని మెదడు బ్లాంక్‌ ! అతని ముఖం చూడగానే ఆమెకు వెంటనే అర్ధమయి పోతుంది. అతను చెప్పే లెక్కకోసం చూడకుండా తనే మూడు పదిహేనులు, మూడు రూపాయలు, మూడు అర్ధలు అని లెక్క వేసుకొని (అతను లెక్కకట్టే లోగ) పప్పులు పాక్‌ చేయించేసింది.

ఆమె సాధ్యమైనంత వరకూ లెక్కలు, సలహాలు అడగదు. అడిగితే ఉల్లిపాయల సలహాలాగే ఉంటుంది !

పద్మకి తలనొప్పి ఏమిటంటే చెప్పిన పని కూడా ఏదీ సరిగా చేసుకురాలేడు. చివరికి కరెంటు బిల్లు కూడా ఆమే వెళ్ళి కడుతుంది.

ఇంట్లో కావల్సినవన్నీ ఆమె చూసుకోవాలి. ఆమే ప్లాన్‌ చేసుకోవాలి.

ఆమె అతని చేత పి. యఫ్‌. లోను పెట్టించి సీజన్‌ లో కొన్నిరకాల పప్పులూ, చింతపండు లాంటి స్టాక్‌ అయిటంస్‌ ఏడాదికి సరిపడా కొనేస్తుంది. పెరుగుతున్న ధరలతో ఏ నెలకానెల కొనుక్కోవాలంటే ఆ జీతం లో సాధ్యమయ్యేపని కాదు. బోనస్‌ ని పిల్లల యూనీఫాం, పుస్తకాలకీ వినియోగిస్తుంది. ఫెస్టివల్‌ అడ్వాన్సుతో తన చీరతో సహా అందరకీ బట్టలు కొంటుంది. ప్రతి నెలా జీతం లో ఎంతోకొంత మిగిల్చి ఇన్స్టాల్‌మెంట్లలో ఇంటి వస్తువులు కొంటుంది. ఈ పదేళ్ళలో డైనింగ్‌ టేబుల్‌, సోఫా, ఫ్రిజ్‌, టీ. వీ, ఆ విధంగా కొన్నవే !

భాస్కర్‌ కి ఇదంతా అద్భుతమే !

చిన్న జీతంతో ఇంటిని చక్కదిద్దుతున్న ఆమె పనితనానికి, కష్టానికి, ప్లానింగ్‌ కి అభినందనలతోనే సరిపెట్టకుండా, ఆమె కోరుకొనే చిన్న చిన్న సరదాలు తీరేలా ఏదైన కొని బహూకరించాలని అతని మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. కాని డబ్బుల పెత్తనం ఆమెది కాబట్టి అతని రిక్వెస్టుని నిర్దాక్షిణ్యంగా తోసి పారేస్తుంది. అది అతనికి బాధిస్తుంది. కోపాన్ని రప్పిస్తుంది. భర్తగా తనకి ఆ మాత్రం అధికారం లేదా ?

భాస్కర్‌ కొన్ని సార్లు మొండి. అతనిలో ఆవేశం వస్తే ఏమైనా చేస్తాడు. అప్పుడా ఇంట్లో పెద్ద గొడవే ! …. ఒకసారి ఏమయిందంటే

ఆమె పుట్టిన రోజుకి కొత్తచీర కొని తీరాలని భీష్మించుకు కూర్చున్నాడు. ఆ నెల బడ్జెట్‌ లో కొంత చీరకి కేటాయించమన్నాడు. కేటాయించకపోతే ఒప్పుకోన్నాడు.

“కుదరదు” అంది పద్మ. “కుదరాలి” అన్నాడు. “కుదిరే పని కాదని చెబుతున్నాకదా !” ఆమె గొంతు పెంచింది. “అయినా నిన్ను అడిగే దేమిటి ? నేనే కొంటాను ?” “ఎలా కొంటావ్‌ ?” నిలదీసింది. “ఎందుకు కొనలేను. ఆ మాత్రం అప్పు పుట్టదా !”

“అప్పా !” ఆమెకు అప్పు అంటే హడలు. వడ్డీలు కట్టి డబ్బులు తేవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె సహించదు. ఒప్పు కోదు. ఆ విషయం చాలా సార్లు అతనికి స్పష్టం చేసింది.

“మీరామాట ఎత్తటానికి మీకెంత ధైర్యం ! అప్పు అనే మాట మరో సారి ఎత్తితే వీపు చీరేస్తాను.”

“నీ చీర కోసం నా వీపు చీరించు కొంటాను.”

ఆమె మెత్తబడి పోయింది. “ఏమిటండీ మీరు .. నన్ను అర్ధం చేసుకోరు గదా ”

” నేనెప్పుడూ నిన్ను అర్ధం చేసుకోవాల్సిందే తప్ప నన్ను కూడా అర్ధం చేసుకోవాలనే సంగతి నీకు స్ఫురించదు.”

“అమ్మో ! అయ్యగారికి కోపం వచ్చింది. మీ కోపం రాత్రికి తీర్చేస్తాను మిమ్మల్ని చీరలా చుట్టేసుకొని ” అంది పద్మ అతని చేతులను తన నడుం చుట్టూ వేసుకోంటూ.

ఆ రోజు పద్మ అతని చేతిలో మూడు వందల రూపాయలు పెట్టింది. చీరకోసం కాదు. బియ్యం కోసం..

నెల వాడుక కొట్టులో ఎప్పుడూ వాడే బియ్యం ఇరవై కేజీలు తెమ్మంది. తనేం మోసుకు రానక్కరలేదు. సాయంత్రం తను డ్యూటీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు బియ్యం షావుకారుకి డబ్బులు ఇవ్వడమే అతని పని. ఒక గంటలో బియ్యం డోర్‌ డెలివరీ చెయ్య బడతాయి.

ఆ సాయంత్రం భాస్కర్లో ఒక మొండి ధైర్యం ప్రవేశించింది.

బియ్యం కొట్టుకి బదులు బట్టల కొట్టుకి వెళ్ళి మూడు వందలతో తనకు నచ్చిన చీర కొనేసాడు.

చీరను చూసి నిశ్చేష్టురాలయింది పద్మ.

ఆమె వేసే కేకలకీ, చీవాట్లకీ సిద్ధపడే ఆ పని చేసాడు భాస్కర్‌. ఆమె కేకలు వేయలేదు. చీవాట్లు పెట్టలేదు. గంభీరంగా మారిపోయింది. ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం.

ఆమె ముఖం అప్పుడు చూస్తే అది రాబోయేతుఫాను తాలుకు ప్రశాంతత అని ఆ ఇంట్లో చిన్న పిల్లడు సమీర్‌ కి కూడా అర్ధమయిపోతుంది.

పద్మ తీరుబడిగా కూర్చొని వార పత్రిక తిరగేస్తోంది. పిల్లలు ఇద్దరికీ మినప దోసెలు వేసి తినిపించి పడుకోమంది. అతను లేచాడు. చేతులు కడుక్కొని వచ్చి డైనింగ్‌ టేబుల్‌ వద్ద భోజనానిక్‌ ఇ కూర్చొన్నాడు. ఆమె విసురుగా వచ్చి కంచం అతని ముందు పెట్టి కమ్మగా తినమంది. ఆమె పుట్టిన రోజు స్పెషల్‌ ! కంచం నిండుగా చీర. అతను ప్రేమగా కొని తెచ్చిన చీర.

“అలా మిడిగుడ్లు వేసుకు చూస్తారేం ! తినండి. నా పుట్టిన రోజు స్పెషల్‌. తినండి. మస్తుగా తినండి. నెమరు వేసుకు తినండి.”

చీరని తినమనడమే కాదు. ఇంకా చాలా మాటలు అంది. భాస్కర్‌ చీరను తినలేదు. ఎదురు తిట్లు తిట్టలేదు. తను చేసిన తప్పుకి “సారీ” చెప్పేడు. ఆమె మళ్ళీ రయిజయ్యింది. “మీరు తెచ్చిన చీర, మీరు చెప్పిన సారీ ఈ నెల రోజులు మనకి అన్నం పెడతాయా ? చెప్పండి ? ఎంతకని నేను చచ్చేది. మీ ఇష్ట ప్రకారం మీరు చేసేయడమే తప్పా ఇంటి పరిస్థితిని అర్ధం చేసుకోరు” అని ఆమె ఏడ్చింది.

పద్మ అక్కడితో ఊర్కోలేదు.

“మీకో నమస్కారం బాబూ ! నేను ఇక సంసారం చేయలేను దేవుడోయ్‌ ! నాకు పిచ్చెక్కి పోతోంది దేవుడోయ్‌ ! ఇక నావల్ల కాదు నాయినా, మహానుభావా. నేను చేయలేను. నాకు చేత కాదు.” అని బీరువా తీసి జీతం డబ్బులు మొత్తం అతని చేతిలో పెట్టేసింది. జీతం అతను క్రితం రోజే ఇచ్చాడు.

“నీ డబ్బులు. నీ ఇష్టం. నీ పెళ్ళానికి చీరలే కొంటావో, నగలే చేయిస్తావో నీ ఇష్టం.” అంది. రేపటినించి సంసారాన్ని అతణ్ణే ఎత్తమంది.

“నా కెందుకొచ్చిన బాధ ! ఏ రోజుకారోజు ఇంట్లోకి ఏ సామాన్లు కావాలో చెప్పి ఏడుస్తాను. కావాల్సినవి తెచ్చి తగలెట్టండి. వంట, పెంట నీ కెలాగూ రాదు కాబట్టి నీకూ, నీ పిల్లలకు ఇంతింత వండి పడేస్తాను.”

ఇంటి భాధ్యత మొత్తం అతని నెత్తిన పడేసి చేతులు దులుపుకుంది.

అతని కాళ్ళ కింద నేల కంపించి, అమాంతం పాతాళంలోకి దిగి పోయేడు.

తను చేసిన పనికి చీవాట్లు ఊహించాడు తప్ప, ఇలా రియాక్ట్‌ అవుతుందనుకోలేదు. ఆమె చర్య తట్టుకోలేక చలి జ్వరం వచ్చినట్టు వజ వజ వణికి పోయాడు.

అతని చేతులో జీతం కవరు పర్వతమంత బరువయింది. ఇంటి ఖర్చులు సమస్యలూ తలచుకొంటే వాయుగుండాలు, ఉప్పెనలు గుర్తుకొచ్చి గడగడ లాడించేయి.

ఆమె రెచ్చగొట్టినా, పౌరుషానికయినా ఒకనెల ఇంటి బాధ్యత స్వీకరించడానికి సిధ్ధంగా లేడు.

మరేమీ ఆలస్యం చేయకుండా, మరో ఆలోచన చేయకుండా ఆ రాత్రి ఆమె కాళ్ళను పట్టేసుకొన్నాడు. తను చేసిన పనికి ఆ శిక్ష తప్పించి మరే శిక్షయినా విధించమన్నాడు. క్షమించేవరకూ ఆమె కాళ్ళు వదలనన్నాడు.

“అయ్యో ! కాళ్ళు పట్టుకుంటారేమిటండీ ?” అనలేదు పద్మ.

“మీరు కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన మీరు చేసిన వెధవ పనులు చక్కబడతాయా. పోయిన మూడు వందలూ వెనక్కి వస్తాయా. చెప్పండి. బాబూ ! నేనే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇక మీదట ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకండి. ఇలాటి పని మరోసారి చేశారంటే ఈ సారి మీకూ మీ ఇంటికీ నమస్కారం పెట్టేసి పుట్టింటి కెళిపోతాను ” అంది పద్మ.

హమ్మయ్య ! తుపాను తీరం దాటింది.

ఆమె చెప్పిన ప్రతి మాటకి బుధ్ధిగా గంగిరెద్దులా తలాడించేడు భాస్కర్‌. వెంటనే యమా స్పీడులో తన జీవితాన్ని ఆమె చెంగుకి ముడి వేసి ఇంటి బాధ్యతలని యధావిధిగా ఆమె నెత్తిపైకి నెట్టేసి తేలికైన మనసుతో నిద్రలోకి వెళ్ళిపోయేడు.

ఆమె లేపితే తుళ్ళిపడి లేచేడు. ఇది కలా! నిజమా ! ఎదురుగా కొత్త చీరలో ధగధగా మెరిసి పోతోంది పద్మ. తనకోసం వచ్చిన దేవతలా ఉంది. ఆమె అతని పైకి వంగి అధరాలను చుంబించింది. ఏదో మధురాను భూతి. కల కాదు. నిజమే. అతని నిద్ర మత్తు, మనసు బరువు వదిలిపోయింది. ఆకలితోనే నిద్రపోయిన సంగతి అతనికి గుర్తు లేదు. దేవత చేతిలో పళ్ళెం ఉంది. అందులో వేడి వేడి మినప దోశెలున్నాయి. ఆమె అతన్ని పసివానిలా దగ్గరకి తీసుకొంది. దోశెలు అతనికి తినిపించింది. ఆమెకి అతను తినిపించాడు. “మీరు నా పుట్టిన రోజు బహుమతిగా తెచ్చిన ఈ చీర ఎంతో బాగుందండీ. నా కెంతగా నచ్చిపోయిందో” అతణ్ణి ముద్దులాడింది. పద్మని అర్ధం చేసుకోవడం కష్టమే అనుకొన్నాడు. ఆమె అతని కౌగిలిలో ఉంది. కాదు ఆమె కౌగిలిలో అతను ఉన్నాడు. ఆమె ముచ్చటగా కట్టుకొన్న కొత్త చీర విప్పేవరకూ అతను ఒప్పుకోలేదు. చీర నలిగి పోతుందని కాదు. ఆ సమయంలో ఆమె శరీరంపై గాని, తన శరీరంపై గాని చిన్న నూలు పోగు కూడా ఉండటానికి వీల్లేదు.

ఖచ్చితంగా ఆ నియమం పాటించవలసిందే. “కొత్త చీర కట్టుకున్న పుట్టిన రోజు కూడానా !” “ఏ రోజైనా సరే” “ఏమిటీ అల్లరి ! వద్దు అంటే చీర కొన్నారు. కట్టుకొంటే విప్పేయమంటున్నారు. ఆంతా మీ ఇష్టమేనా ?” “అవును. అంతా నా ఇష్టం.” మంచంపై అతని ఇష్టప్రకారమే ఆమె నడవాలి. ఆ సమయంలో అతనికి ఎక్కడలేని హుషారు. అక్కడ అతనిదే పై చేయి. అక్కడ అతనిదే పెత్తనం. అతని ఇష్టాన్ని ఆమె తీర్చింది. కావాల్సినంత సుఖాన్ని ఇచ్చింది. “సుఖం కోసం స్త్రీని ప్రేమించే పురుషుడు పురుషుని ప్రేమ కోసం సుఖాన్ని అర్పించే స్త్రీ” పద్మ అన్న మాటలు అతనికి గుర్తుకు వచ్చాయి. సుఖం కోసం ఆమెను కలియని రోజు లేదు. కలిసేక ఆ కొటేషన్‌ గుర్తుకి రాని రోజు లేదు. అతని అనుభవం అది అక్షరాల నిజమేనని చెబుతోంది. మనుసు మాత్రం అంగీకరించకుంటోంది. ఏమైతేనేం ఆ రాత్రి సుఖాంతం అయినప్పటికీ ఆమెను కాదని చీరకొనడం లాంటి పొరపాట్లు ఇక జన్మలో చేయలేనంతగా అతణ్ణి కుదిపేసింది.

ఆ తర్వాత ఉల్లిగడ్డల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి స్కేప్‌గోట్‌ అయ్యేడు. ఒక ఉల్లిపాయ చిత్రంగా ప్రియాతిప్రియమైన పద్మని తనకు కానీయకుండా చేస్తోంది. ఆమెను తననుంచి నిర్దాక్షిణ్యంగా వేరుచేసి పుట్టింటికి తరిమేస్తోంది. ఆ రోజు హోల్‌సేల్‌ కొట్లో ఆమెను ఉల్లిపాయలు కొనవద్దు రెండు రోజులు ఆగమన్నాడు. రెండు రోజుల తర్వాత పాతిక రూపాయలకు పాకింది. తర్వాత కొండెక్కి నన్ను ముట్టుకుంటే ముప్ఫయిరెండు రూపాయలంది. పద్మ ఆ తర్వాత ఇంట్లో ఎమర్జెన్సీ విధించింది. సెల్ఫ్‌ రేషనింగ్‌ అమలుజరిపింది. అతన్ని ప్రత్యేకంగా నిందించలేదు. నిందిస్తే ఆమె కాళ్ళపై మళ్ళీ పడిపోవటానికి అతను సిద్ధం. అక్కడితో ఉల్లిసరసం ముగిసేది.

అంతలో ఢిల్లీలో ప్రకంపనలు! ఉల్లిపాయ అధికారపీఠం పునాదులను కుదిపేస్తుంటే ఇక్కడ తెలుగు ప్రభుత్వం గభాల్న నిద్ర లేచింది. తెలుగు బిడ్డకి కోపం రాదు. వచ్చిన కోపం పోదు. కోపం ప్రభంజనమై, తుపాను అలజడిగా పరిణమిల్లి విప్లవాలకే దారితీస్తుందని నేతలకు తెల్సు.

అధికారులు వెంటనే స్పందించి ధరల అదుపు కార్యక్రమాలు సిన్సియర్‌గా మొదలుపెట్టారు. అందులో భాగంగా ఉల్లిపాయలను తక్కువ రేటుకి అనగా 12 రూపాయలకే కేజి త్వరలో విక్రయించ బోతున్నట్టు ప్రకటించింది. ఎక్కడ? సూపర్‌ బజార్‌లో వెంటనే పద్మ భాస్కర్‌ని ఆదేశించింది. అతను ఏరోజు కారోజు వెళ్ళి సూపర్‌ బజార్‌లో ఎప్పుడు ఉల్లిపాయలు వస్తాయో తెల్సుకోవాలి. తెల్సుకొని ఉల్లిపాయల లోడు లారీలనుంచి దిగీ దిగగానే వాటిని కొనే మొదటి వ్యక్తి భాస్కరే అవ్వాలి.

కొడుకు సమీర్‌కి యూనిఫారం వేసి, వీపు వెనుక స్కూల్‌ బ్యాగ్‌ తగిలించి, చేతికి క్యారేజు ఇచ్చి జాగ్రత్తగా పంపినట్టు భర్త చేతికి రేషన్‌ కార్డు, చేతిసంచీ, వందరూపాయల నోటు ఇచ్చి రోడ్డు మీదికి తోసేసింది. “దయచేసి ఈ పనైనా సవ్యంగా చేసుకురండి. ఈ పని నేనే చేసుకుందును. సూపర్‌ బజార్‌ దగ్గర్లో ఉంటే” అంది. అవును సూపర్‌ బజార్‌ దగ్గర్లో లేదు. భాస్కర్‌ ఆఫీసుకి వెళ్ళే తోవలో ఉంది. అతను ఆఫీసుకి సిటీబస్‌పై వెళ్తాడు. రోజూ బస్‌ ఎక్కుతాడు గనుక ప్రతినెలా బస్‌ పాస్‌ తీసుకుంటాడు. అంచేత అతను ఏ బస్‌ అయినా, ఏ రూట్‌ అయినా, ఎన్ని సార్లయినా పట్టణపరిమితుల్లో నిరభ్యంతరంగా తిరగవచ్చు. ఆఫీసు పని తర్వాత సాయంత్రాలు ఇంటి దగ్గర అతను చేసే రాచకార్యాలు ఏమీ లేవు గనక, బస్‌ పాస్‌ వుంది గనక ఉల్లిపాయలు సూపర్‌ బజార్‌కి వచ్చేవరకూ, వచ్చేక కొనేవరకూ అదే పనిపై ఉండమని హుకుం జారీ చేసింది పద్మ. భాస్కర్‌ తు. చ. తప్పకుండా రోజూ సూపర్‌ బజార్‌ చుట్టూ తిరుగుతున్నాడు. రోజుకు రెండుసార్లు ప్రదక్షిణం చేస్తున్నాడు. ఆఫీసుకి వెళ్ళేటప్పుడు, ఆఫీసునుంచి వచ్చేటప్పుడు.

అతను అక్కడికి ఏ రోజు వెళ్ళినా ఉల్లిపాయలుగాని, దానికి సంబంధించిన సమాచారం గాని లభించేది కాదు. ఎవరిని అడగాలో అర్ధమయ్యేది కాదు. ఎవరినైనా అడిగితే పెదాలు విరిచేవారు.

భాస్కర్‌ కి గొప్ప చికాకుగా, న్యూసెన్సుగా ఉంది.

ఏమిటీ బతుకు ఇలా అయిపోయింది.

ఆమె తిరగమండం ఏమిటి ? తను గానుగెద్దులా తిరగడ మేమిటీ.. ? ఛఛ.

ఆమె పోరుపడలేక ఇలా రోజూ తిరుగుతున్నాడు తప్ప మనస్ఫూర్తిగా కాదు.

నాలుగు రోజులు వరుసగా సూపర్‌ బజార్‌ కి వెళ్ళేడు.

అయిదోరోజు ఉదయం వెళ్ళేడు. ఆ రోజు సాయంత్రం పని ఒత్తిడి ఎక్కువయి ఇంటికి ఒక గంట ఆలస్యంగా వెళ్ళేడు. కాస్త నీరసంగా ఉంది.

భాస్కర్‌ ఇంటి గుమ్మం ఎక్కుతుండగానే అతని చేతిలో ఉల్లిపాయల సంచి కోసం వెదికింది. కనిపించలేదు.

“ఉల్లిపాయలు తెచ్చారా ?”

ముందుగా భర్తని ఇంట్లోకి రానిచ్చి, గ్లాసుడు మంచినీళ్ళిచ్చి, లఘుశంక వగైరా ఏమైనా ఉంటే తీర్చుకోనిచ్చి, కాళ్ళూచేతులూ కడుక్కోనిచ్చి, సోఫాలో రిలాక్స్‌ అయ్యేక చేతికి టీ కప్పు ఇచ్చి అడిగితే ఎంత బాగుంటుంది !

“ఉల్లిపాయల గురించి మాట్లాడరేం ?” ఆమె రెట్టించింది. అతనికి ఇమిడియట్‌ గా బాత్రూం కి వెళ్ళవలసిన అవసరం ఉంది పద్మతో గొప్ప చికాకు. చిరాకు కనపడనీయకుండా “ఉల్లిపాయలు ఇంకా రాలేదు పద్మా. ఎప్పుడొస్తాయో సూపర్‌ బజార్‌ అధికారులకే తెలియదట” అన్నాడు. “ఆహా! అలాగటా!” నీ వెటకారాలు తర్వాత. ముందు నన్ను బాత్రూంకి వెళ్ళనీయ్‌ తల్లీ. ఒంటేలుకి కూడా వెళ్ళనీయకుండా ఉల్లిపాయల గోల. నీతో గొప్ప చిక్కు వచ్చింది. “మీరు నిజంగా సూపర్‌ బజ్జర్‌కి వెళ్ళేరా?” సూటిగా అడిగింది. “వెళ్ళేను” అతనికి తెలీకుండానే చిన్న అబద్ధం. అయినా సాయంత్రం వెళ్ళకపోయినా ఉదయం వెళ్ళేడుగా. అతనిలో స్థితిస్థాపక శక్తి అద్భుతంగా పనిచేస్తుండటం వల్ల యూరిన్‌ కంట్రోల్‌ చేసుకోగల్గుతున్నాడు. “మీరు వెళ్లలేదు. వెళ్ళాననడం పచ్చి అబద్ధం. ఉల్లిపాయలు ఇస్తున్నారక్కడ” బిక్కచచ్చిపోయేడు భాస్కర్‌. ఆడే అబద్ధాలు అతి చిన్నవి అయినా అప్పుడప్పుడు కొంపలు కూల్చును. అది నిన్ను కోలుకోని విధముగానూ, అతి పెద్దగానూ దెబ్బతీయును. అతనికి ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేయి. బాత్రూం అర్జెన్సీ ఆవిరైపోయింది. “ఎవరు చెప్పారు నీకు ఉల్లిపాయలు ఇస్తున్నారని?” “మీరు చెప్పకపోతే నాకు తెలీదనుకున్నారా ? పక్కింటి వాళ్ళు తెచ్చుకున్నారు. ఇపుడేమంటారు ? ఎందుకండీ నన్నిలా మాయ చేస్తారు ? ఈ ఒక్క పనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయమన్నాను. మీరు చేయలేక కాదు. అది చెప్పితే ఎందుకు చేయాలి అనే నిర్లక్ష్యం ! నేను చేసిన పొరపాటు ఏమిటంటే ఈ పనికి నేనే తగలడకుండా బుద్ధి తక్కువై మీకు అప్పజెప్పడం.”

పక్కింటి వాళ్ళు ఉల్లిపాయలు తెచ్చుకోగలిగి, భర్త నిర్వాకం వల్ల తాము తెచ్చుకోలేకపోవడం ఆమెను మరింతగా బాధించింది.

పద్మ ఉన్నపాటున సూపర్‌ బజార్‌ కి కట్టుబట్టలతో పరిగెట్టింది. ఆమె భాస్కర్‌ ని వెళ్ళమనలేదు. అతనిపై విశ్వాసం, నమ్మకం పోయింది. అతని ముఖమే చూడాలని అనిపించటం లేదు. ఆమె ఒక్కర్తే వెళ్ళిపోతుంటే భాస్కర్‌ కి ఏమిచేయాలో తోచలేదు. ఆమె పిలవలేదు కాబట్టి తను వెళ్ళక్కరలేదు. వంటరిగా వెళ్తుంది కాబట్టి తోడుగా వెళ్ళడం ధర్మం. బాత్రూం కి వెళ్ళడం అంతకన్నా అవసరం. అవసరాన్ని త్యాగం చేసి ధర్మ నిర్వహణకి పరిగెట్టేడు. అతనిని పద్మ గమనించి గమనించనట్టే ఊరుకొంది. సిటీ బస్‌ ఎక్కి సూపర్‌ బజార్‌ వద్ద దిగేరు. తోవలో ఆమె ఏమీ మట్లాడ లేదు. అతను కూడా. ధైర్యమేది ? సమయం ఏడు గంటలు. పద్మ అదృష్టం ! సూపర్‌ బజార్‌ లో ఉల్లిపాయలు ఇంకనూ ఇవ్వబడుతున్నాయి. అయితే ఉన్నపాటున ఆమెకి వెంటనే ఉల్లిపాయలు ఇచ్చేయడానికి వీలు లేకుండా ఆమె కన్నా ముందు వచ్చి వాళ్ళ వంతుకోసం వెయిట్‌ చేస్తున్నారు చాలా మంది. ఒక పెద్ద లైను వంకర్లు తిరిగి ఆమెను వెక్కిరించింది.

ఆమె అంత లైను చూసి బెంగపడిపోలేదు. ధైర్యంగా లైన్లో నించుంది. ఎలాగైనా ఉల్లిపాయలు తీసుకొనే ఆమె ఇంటికి బయల్దేరుతుంది.

లైన్‌ లో నించొని ఆమె షిరిడి శాయిని ప్రార్ధించింది. కనక మహలక్ష్మిని తలచుకొంది. ఆమెకు ఉల్లిపాయలు దొరుకుతాయనే నమ్మకం బలంగా ఏర్పడి పోయింది.

మగవాళ్ళ లైను, ఆడవాళ్ళ లైను రెండు పట్టాల్లా ఉన్నాయి. రెండు లైన్లూ పొడవుగానే ఉన్నాయి. పద్మ వెనుక అప్పుడే పది మంది చేరేరు.

భాస్కర్‌ ఆమె దగ్గరకి వెళ్ళి “పద్మా ! నేను లైను కడతాను. నీవు అక్కడ కూర్చో ” అన్నాడు భాస్కర్‌.

పద్మ వినిపించుకోలేదు. అతను ఇంకెవరినో అడుగుతున్నట్టు ఆమె ఉండిపోయింది. పద్మకి ముందు, వెనక ఉన్న స్త్రీలు అతని వైపు చూసేరు. అతను సిగ్గు పడి తర్వాత చిరాకు పడి విసురుగా, దూరంగా మగవాళ్ళ వైపు వచ్చేశాడు.

ఉల్లిపాయల కోసం లైన్లోనించున్న వాళ్ళ మధ్య ఉల్లిపాయల మీదే కబుర్లు దొర్లుతున్నాయి.

“రూపాయికి ఆపిల్‌ వస్తోంది గాని ఉల్లిపాయ రావడం లేదు.”

“జగదాంబ సెంటర్‌ లో ఒక బట్టల షాపువాడు రెండు వందల రూపాయల బట్టలు కొంటే కేజీ ఉల్లిపాయలు గిఫ్టుగా ఇస్తున్నాడు. జనాలు విరగబడి కొంటున్నారట. అయితే ఉల్లిపాయలు సప్లయి చెయ్యలేక, స్టాకు లేక ఆ స్కీము ఎత్తేశాడట. ”

“ఉల్లిపాయలు ఎగుమతి ఆపేసి, దిగుమతి చేసుకొంటున్నారని మనం పేపర్లో వినడమేగాని నిజంగా అమలు పరిస్తే ఉల్లి ధర తగ్గదా !”

“అదంతా బోగస్‌. ఉల్లిపాయల ఎగుమతి వల్ల రైతుకి గిట్టుబాటు ధర పెరిగింది లేదు. ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం వల్ల పప్పులూ, నిత్యావసర సరకులూ దిగుమతి అవుతున్నాయి. అంచేత గిట్టుబాటు ధర రైతుకి పెరగక చిక్కిపోయి బక్కగా మిగులుతున్నాడు. పోనీ దిగుమతులవల్ల ధరలు తగ్గి వినియోగదారుని శాంతింపచేసింది అంతకన్నా లేదు.”

“ధరలు తగ్గితే మనకీ పడిగాపులు ఎందుకు సార్‌ ! కేజీ పాతిక రూపాయలకి తక్కువకి ఏ కూరగాయలు వస్తున్నాయి చెప్పండి. ఈ పరిస్థితి ఎప్పుడైనా ఉందా ?”

“ధరల పెరుగుదలకు ఆస్మానీ కారణం తప్ప సుల్తానీ కాదని వాజ్‌పాయిగారు ఉల్లిపాయి మీద కవిత్వం చెబుతున్నారు తీరుబడిగా ఫిడేలు వాయిస్తూ.”

“ప్రభుత్వం మారాలండి.”

“మారవలసింది ప్రభుత్వాలు కాదండీ. ఈ దళారీ దోపిడీ వ్యవస్థ మారాలి. అందుకు విప్లవాలే శరణ్యం.”

అంతలో అక్కడ గొడవ ! గుంపులు గుంపులుగా జనం.

సమయం ఎనిమిది గంటలు కావడంతో సూపర్‌ బజార్‌ మూసివేసే ప్రయత్నం చేస్తుంటే జనం తిరగబడ్డారు. మరుసటి రోజు అమ్మకాలు కొనసాగిస్తామంటే ప్రజలు రెచ్చి పోయారు. ఒప్పుకో లేదు. రాత్రంతా ఉల్లిపాయలు అక్కడే ఉంటాయని ప్రజలకి నమ్మకం లేదు. అంతే కాదు రేపు ఉదయం మళ్ళీ లైనులో నించునే ఓపికల్లేవు. నించున్నా ఛాన్సు తగులుతుందనే గ్యారంటీ లేదు. ప్రజలు మీదు మిక్కిలి ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఉల్లిపాయల కౌంటర్‌ మూసివేస్తే మొత్తం సూపర్‌ బజార్‌ అన్ని స్టాల్‌ లను లూట్హీ చేసేసి, తగలబెట్టి అడ్డుతగిలే అధికారుల కీళ్ళువిరిచి చంపేసేలా ఉన్నారు.

ఆ ఉద్రిక్త వాతావరణంలో సూపర్‌ బజార్‌ డైరెక్టరూ, జాయింట్‌ కలెక్టరూ రంగ ప్రవేశం చేయక తప్పలేదు. వాళ్ళు ప్రజలని శాంతించమన్నారు.

మీరు కోరిన ప్రకారమే టైముతో నిమిత్తం లేకుండా మొత్తం ఉల్లిపాయల స్టాకు

అయిపోయేవరకూ అమ్మకాలు కొనసాగుతాయన్నారు.

ఆ విధంగా ఆర్డరు జారీ చేసి అక్కడ నుంచి జారుకొన్నారు అధికారులు.

ఉల్లిపాయల కౌంటర్‌ మళ్ళీ తెరవబడింది. లైను పెరుగుతోంది. ఉల్లిపాయలు తరుగు తున్నాయి. జనం ఎక్కువ పెరిగి ఉల్లిపాయలు తరిగిపోతుండటం చేత మనిషికి అయిదు కేజీలనుంచి మూడు కేజీలకు, తర్వాత రెండు కేజీలకు కోటా తగ్గిపోయింది. రాత్రి పదవుతోంది. పద్మ వెనుక చాలామంది ఉన్నారు. పద్మ ముందు పది మంది కూడా లేరు. ఆమె తపస్సు ఫలించి ఉల్లిగడ్డలు దొరకబోతున్నాయి. అంతలోనే ఆమె అదృష్టం పై పిడుగు పడ్డట్టు కౌంటర్‌ షట్టర్స్‌ బర్రున కిందకి దిగిపోయాయి. ఉల్లిపాయలు మొత్తం అయిపోయేయి. వందలాది జనం అలాగనే ఉన్నారు. గొడవ చేయడానికి ఉల్లిపాయలు ఉంటే కదా ! అరవడానికి ఒంట్లో శక్తి ఏదీ ? జనంలో నిరాశ, నిస్పృహలు. నీరసాలు, నిట్టూర్పులు. పద్మ కాళ్ళల్లో పీకు. కళ్ళల్లో నీళ్ళు. ఆ సమయంలో పద్మను చూడడానికి భయపడ్డాడు భాస్కర్‌. ఆమె సరదాగా సినిమాకి లైన్లు కాయడం ఎప్పుడో మానుకొంది. రేషన్‌ షాపుల్లో గంటా, అరగంటా లైన్‌ లో నించోడం అలవాటు ఉంది. అయితే రెండు కేజీల ఉల్లిపాయలకోసం చాంతాడు లైను కట్టి పడిగాపులుపడే రోజులు ఉంటాయని ఆమె ఏనాడూ ఊహించలేదు. పడిగాపులు పడినా ఫలితంలేదు.

నీరసంగా వేలాడిపోయి, స్పృహ కోల్పోయేలా ఉంది పద్మ స్థితి. భాస్కర్‌ ఆమెను కిళ్ళీ బడ్డీ వద్దకు తీసుకువెళ్ళి ఐస్‌సోడా కొట్టించేడు. ఆమె గబగబా తాగింది. మరో సోడా కావాలని సౌంజ్ఞ చేసింది. రెండో సోడా కొంత తాగి, మిగతాది ముఖం మీద జల్లుకున్నది. పద్మ కొంత స్వాధీనం లోకి వచ్చింది. ఇంటికి చేరిన తర్వాత అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు పద్మ భాస్కర్‌పై విరుచుకు పడింది. ఉల్లి దొరికి ఉంటే తుస్సుమని పోయే బాంబు భాస్కర్‌పై ధన్‌మని పేలింది. అతను దెబ్బ తిన్నాడు. ఉల్లిపాయలు ఆమెకు అందినట్టు అంది దొరక్కుండా పోయేయి. భాస్కర్‌ తన బాధ్యతను గుర్తెరిగి ఆఫీసు నుంచి డైరక్టుగా సూపర్‌ బజార్‌ వెళ్ళి వుంటే తప్పక దొరికి ఉండేవి కదా!

ఇంటికి వచ్చేక తిండి లేదు. తిప్పలు లేవు.
ఆరాత్రి ఇద్దరి మధ్య పెద్ద రగడ. యుద్ధం.

అతణ్ణి నిందిస్తూ ఆమె అదే పనిగా అరుస్తుంటే అతడు సహనం కోల్పోయేడు. ఒక్కసారిగా ఆమెకన్నా హెచ్చు స్థాయిలో అరవడం మొదలెట్టేడు. పిల్లలు నిద్రలేచి ఏడుపు ముఖాలతో నిలబడ్డారు. అతనిలో నిక్షిప్తమైన శాంతస్వభావం ఆమె అరుపులకి ఆవిరైపోయి మాటకి మాట విసిరి మానసికంగా ఆమెను గాయపరచి తను గాయపడ్డాడు. అంతేకాదు అతని కోపం తారస్థాయికి ఎగసి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఫడేల్మని ఒక లెంపకాయ ఆమెకి తగిలింది. ఆమె నిర్ఘాంతపోయి నోట మాట రాక అలా ఉండిపోయింది. తుపాను సద్దుమణిగింది.

పదేళ్ళలో ఏనాడూ జరగని సంఘటన!

భాస్కర్‌ ఈ పదేళ్ళ సంసారంలో ఏనాడూ ఆమెపై చేయిచేసుకోలేదు. ఆమెపై అంత రోతగా, బ్రూటల్‌గా విరుచుకుపడలేదు. ఆమె మంచంపై పిల్లలు మధ్య నిశ్శబ్దంగా ఏడ్వసాగింది. తల్లితోబాటు పిల్లలు కూడా. తనుకొట్టేడా? అప్రయత్నంగా ఆమె పైకి చేయి దూసుకుపోయింది! అతని ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు. ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చా లనిపించలేదు. ఆమెకు క్షమాపణలు చెప్పాలనిపించలేదు. ఆమె కనిపించకుండా, ఆమె ఏడుపు వినిపించకుండా పక్క గదిలోకి వెళిపోయి తలుపులు వేసుకున్నాడు భాస్కర్‌.

తనకు తెలిసీ ఏనాడూ పురుషుడిగా తన అహం ఆమెపై ప్రదర్శించలేదు. పైగా ఆమెను తృప్తి పరచడానికి, ఉత్సాహపరచడానికి ఆమె కన్నా తను ఒక మెట్టు దిగువనే ఉన్నట్టు ప్రవర్తించేడు. ఆమెకు ఇంట్లో పెద్ద పీట వేసి మహారాణిని చేశాడు. ఆమె అధికారాన్నీ, ఆధిపత్యాన్నీ ఆనందంగా శిరసావహించేడు. ఆమె పెత్తందారీ తనాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించేడు. పద్మ ఎన్నోసార్లు తనపై అనవసరంగా, అకారణంగా అరిచేటప్పుడూ, విరుచుకుపడేటప్పుడూ, విసుక్కున్నప్పుడూ, నోరు జారేటప్పుడూ తనది తప్పు అన్నట్టుగా ఒప్పుకోవడమో, తప్పుకోవడమో, లేదా నిశ్శబ్దంగా భరించడమో తను చేసిన పొరపాటా? తను లోకువ అయ్యేడా? ఆమె శ్రుతి మించడం వల్లే ఏనాడూ లేనిది కొట్టేడా? తన పాశవిక ప్రవర్తనకి కారణాలు వెదుకుతున్నాడా?

కారణాలు, పరిస్థితులు ఏమైనా కొట్టడం తప్పని అతనికి తెలుస్తోంది. స్త్రీలను తిట్టి, కొట్టి, హింసించే ఏ మగాళ్ళనయితే అసహ్యించుకుంటాడో తను కూడా అచ్చంగా అలాగే ప్రవర్తించేడు. ఎంతగానో ప్రేమిస్తున్న పద్మను కొట్టగలిగేడు. అతని మనసు వికలమయింది. కొట్టడం తప్పే కావొచ్చు. కాని ఆమె తనను భర్తగా గౌరవించకపోవడం, ఒక మనిషిగా నైనా చూడకపోవడం, ఉల్లిపాయ కన్నా హీనంగా చూడటం తను భరించలేక పోతున్నాడు.

ఆమెను క్షమించలేక పోతున్నాడు.
ఆరాత్రి నిద్ర పట్టలేదు అతనికి.
మరుచటి రోజు నుంచి పద్మది కొత్త అవతారం!
వింతగా కొత్తగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.

దినచర్యల్లో విపరీతమైన, విలక్షణమైన మార్పులు. వంటగదిలో ధన్‌ ధన్‌ చప్పుళ్ళు. కొత్తరకం వంటలు. రుచి పచిలేని భయంకరమైన వంటలు. అవసరమైన కూరలోనైన ఒక్క ఉల్లిపాయ ముక్క కూడా వెయ్యని వంటలు!

“ఏమిటీ వంట? ఎందుకిలా తగలెట్టావ్‌. కుక్కలు కూడా తినవు” అని ముఖంపై కంచాన్ని గిరాటు వెయ్యటం లేదు. తనూ, పిల్లలూ రసంతో, పెరుగుతో ఏదో తిన్నాం అనిపించుకొని కంచాల నుంచి లేస్తున్నారు. వడ్డించేటప్పుడు డైనింగ్‌ టేబుల్‌పై కంచాల చప్పుడు విపరీతం. పద్మ ఏమి తింటున్నదో అతనికి తెలీదు. అతనికి అక్కర లేదు. ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. ఇద్దరి మధ్య మాటలు లేవు. పడకలు లేవు. ఎడమొగం. పెడమొగం. నాలుగైదు రోజులుగా ఇదే సీను. ఇన్నాళ్ళూ చిన్నచిన్న అలకలు, గిల్లికజ్జాలు వాళ్ళ మధ్యకి వచ్చి వెళ్ళేయి తప్పా ఇంత భారీ ఎత్తున ఎడబాటు లేదు లేదు. పద్మకి దుఃఖం ఆగటం లేదు. అతనిపై కసికసిగా ఉంది. బతుకుపై రోతగా, విరక్తిగా ఉంది. ఎందులోనైనా పడి చావాలనిపిస్తోంది. పిచ్చెక్కి పోతోంది.

పద్మ అన్నివిధాల ఆలోచించుకొని ఒక నిర్ణయానికొచ్చింది. భాస్కర్‌కి దూరంగా పుట్టింటికి వెళ్ళిపోవడం ఉత్తమం, తక్షణ కర్తవ్యంగా భావించింది. అతణ్ణి విడిచి వెళిపోతున్న సంగతి ఆమెకు చెప్పాలనిపించలేదు. చెప్పక తప్పదు గాబట్టి కూతురు సుస్మిత ద్వార తెలియజేసింది. ఆరాత్రే సూట్‌కేస్‌లూ, ఇతరత్రా పట్టుకెళ్లవలసిన వస్తువులన్నీ సర్దుకొని ఓపిగ్గా ప్యాక్‌ చేసుకొంది.

ఇన్నాళ్ళు ఎంతో చక్కగా, తన అభిరుచికి అనుగుణంగా తీర్చి దిద్దుకున్న ఆ గృహముతో రేపటి నుంచి బంధం తెగిపోతుంది. ఈ పదేళ్ళు ఏమీ కాకుండా సాగిపోయేయి. ఈరాత్రి తెల్లవారడం ఎంతసేపు. ఇల్లు నిశ్శబ్దంగా రోదిస్తోంది. పిల్లలు వాళ్ళ గదిలో హాయిగా నిద్రపోతున్నారు. అంతే హాయిగా రేపు అమ్మమ్మ ఇంటిలో కూడా నిద్రపోగలరు. అదృష్టవంతులు.

నిద్రపోవడానికి ప్రయత్నిస్తోంది పద్మ.
ఆ మంచంపై భాస్కర్‌ కూడా ఉన్నాడు.
డబల్‌ కాట్‌ పై .. అటు పద్మ ఇటు భాస్కర్‌ నాలుగైదు రోజులుగా ఇదే తంతు.

ఆ మంచానికి ఈ అనుభవం కొత్తగా ఉంది. చెత్తగా ఉంది. చప్పగా ఉంది. భరించలేకపోతోంది.

మంచంపై భాస్కర్‌ ఆమెకి పొరపాటున కూడా తగలకుండా అటూ, ఇటూ దొర్లుతున్నాడు. రేపటి నుంచి ఆ జాగర్తలు అతనికి అవసరం లేదు. ఆమె వెళిపోతోంది.

ఆమె తనను విడిచివెళ్ళడం అనే సీను ఒకటి అతని జీవితంలో ఎదురవుతుందని ఏనాడు ఊహించలేదు. జీవితం కొంత కొంత అతని కిపుడిపుడే అర్థమవుతున్నట్టుగా ఉంది. ఎడబాటు పాఠాలు నేర్పుతోంది.

భార్య ప్రేమానురాగాలతో అతని జీవితం పెనవేసుకుపోయి చల్‌ మోహనరంగా అని హాయిగా హాయిగా సాగిపోతుందనుకున్నాడు తప్పా ఇలా ఉల్లిపాయలు, ఉప్పుపొప్పులూ మరొకటీ మరొకటితో అదే జీవితం ముడిపడి ఉంటుందనుకోలేదు.

అతనికి అర్థమవుతోంది. ఎగుడుదిగుడుగా ముళ్లకంపలతో రాళ్ళు రప్పలతో వికృతంగా, లోపభూయిష్టంగా వ్యవస్థే ఉన్నప్పుడు మన జీవితాలు, దాంపత్యాలు చలువరాతి గచ్చులా నున్నగా, సాఫీగా సాగాలనుకుంటే ఎలా సాగుతుంది? భార్యాభర్తల మధ్య ఎంత అండర్‌స్టాండింగ్‌ ఉన్నా జీవితాన్ని గిరిగీసుకొని ఎంత పకడ్బందీగా ప్లాన్‌ చేసుకున్నా, వాళ్ళు తప్పనిసరిగా సామాజిక పరిస్థితులకు కీలుబొమ్మలు. వాళ్ళ బతుకులపై సామాజిక ప్రభావం మంచికో చెడుకో, శాంతికో అశాంతికో గురిచేస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం ఆ దంపతులను అశాంతికే గురి చేసింది.

పద్మ అయితే తల్లడిల్లి పోయింది.
ఆమెపై జాలి వేస్తోంది అతనికి.

ఆమెది చాలా చిన్న ప్రపంచం. ఇల్లు, భర్త, పిల్లలు. అంతే. ఆ చిన్న ప్రపంచాన్ని గాజుబొమ్మలా చూసుకుంటుంది. ఆమె తెలివైనది. ఇంటిలోపల ఎంతైన ఆమె మానేజ్‌ చేయగలదు. ఇంటి బయట ఆమె అశక్తురాలు. ఆమె అధీనంలో లేని శక్తులే ఆమెను శాసిస్తున్నాయి. గాజు ఇంటిపై రాళ్ళు రువ్వుతున్నాయి. కనబడని రాయి ఎవరు విసిరిందో తెలియక, అర్థం కాక ఎదురుగా ఉన్న భర్తపై తన ఆక్రోశం, భయం వెళ్లగక్కుతోంది. ఆమె అర్థమవుతోంది. ఆమెను కొట్టిన చేయిని నరికివేసుకోవా లనిపిస్తోంది. అతని మనసెందుకో తేలికవుతోంది. అతడు నిద్రకి ఉపక్రమించేడు.

……………………….

అతను నిద్రపోతున్నాడు.
ఆమె నిద్రపోతోంది.
సమయం రాత్రి పావు తక్కువ పన్నెండు అవుతోంది.
ఆరాత్రి
నాలుగురాత్రుల ఎడబాటు తర్వాత .. ఒక అద్భుతమైన క్షణాన .. ఒకరి శరీరం మరొకరికి తగిలింది.

ఎవరి శరీరం ఎవరికి తగిలిందో చెప్పడం కష్టం. ఆ రెండు శరీరాలు తగలాలని తగిలేయా, అనుకోకుండా తగిలాయా మన్మథుడిక్కూడా తెలియదు. కరెంట్‌ షాక్‌ తగిలినట్టు అంటుకుపోయేయి. వంటిమీద బట్టలు విడిచేసి త్రాచుపాముల్లా చుట్టుకుపోయేయి. పోట్లగిత్తల్లా దొర్లేయి. మంచమంతా పొర్లేయి. సుఖాన్ని పొందేయి.

ఆ శరీరాల వేడి రాపిడిలో అహాలు, కోపాలు, స్పర్థలూ బాధలూ ఒక్కసారిగా చల్లబడిపోయేయి. సెక్సు వాళ్ళతో మధ్యవర్తిత్వం నెరిపి రాజీ కుదిర్చింది.

చిత్రంగా ఎవరికి వాళ్ళు తప్పు నాదంటే నాదన్నారు. ఎవరికి వాళ్ళు నన్ను క్షమించమంటే నన్ను క్షమించమన్నారు. “ఏదో కోపంలో ఏదో అంటే నన్ను నాలుగు రోజులు దగ్గరకు తీసుకోకుండా ఎలా ఉండగలిగారు. నాకు చాలా కోపం వచ్చింది తెల్సా” అంటూ అతని గుండెలపై వాలిపోయి ఏడ్చింది పద్మ “ఏదో పిచ్చిదాన్ని ఏ చికాకులోనో ఏదో అంటాను. మిమ్మల్ని కించపరచాలని కాదు. ఏవండీ నేనెలా ప్రవర్తించినా నన్ను దగ్గరకు తీసుకోడం మానకండి. ఇంటి చాకిరీతో విసిగివేసారి పోయిన నన్ను మీరు దగ్గరకి తీసుకుంటే ఆ సుఖంలో అన్నీ మర్చిపోతాను. ఏవండీ దయచేసి నాకు ఎడంగా ఉండకండి. నాకున్నది ఈ సుఖమే. మీ సుఖమే”

ఆమె అతన్ని పూర్తిగా హత్తుకుపోయింది. అతని పొందులో ఏదో తన్మయత్వం. ఎంతో ఓదార్పు. మగవాడు సెక్సు కోసం స్త్రీని ప్రేమిస్తే, స్త్రీ ప్రేమకోసం, మగవానికి సెక్సు ఇస్తుందనే సూత్రం అక్కడ చెల్లలేదు. ఇద్దరిదీ ప్రేమే. ఏకకాలంలో రెండు శరీరాలు స్పందించి సెక్సు సుఖాన్ని పొందేయి. సెక్సు వాళ్ళని సామాజిక, శారీరిక, మానసిక వత్తిడిల నుంచి రిలీవ్‌ చేసి సుఖాన్ని, శాంతినీ ఇచ్చిందనేది ఇద్దరిలోనూ స్పష్టంగా తెలుస్తోంది. …………………….

మరుచటి దినం హుషారుగా తెల్లవారింది. ఆమె పుట్టింటికి బయల్దేరలేదు! భాస్కర్‌ ఆఫీసుకి బయల్దేరుతుండగా ఆగమంది పద్మ ఆగేడు అతని చేతికి యాభై రూపాయల నోటు చేతికిచ్చింది

“ఎందుకు?”
“ఆఫీసు నుంచి వచ్చినపుడు నాలుగైదు సాల్టు పేకెట్లు తీసుకురండి.” తెల్లబోయి .. చూసేడు
ఏం మనిషి! ఈ రోజు పేపరు చూడలేదా!
ఉప్పుగాలి పేకెట్‌కి అరవై రూపాయల చొప్పున వీస్తోంది ఆ గాలి ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం ఎంతసేపు?
“పద్మా! నిజంగా నీకు మతిపోయింది”
పద్మకి కోపం వచ్చింది
ఆ కోపానికి అదిరేడు భాస్కర్‌.

అతనికి తెల్సు ఆడది అలిగితే మగవాడికి మతి తప్పుతుంది. ప్రభుత్వాలకి గతి తప్పుతుంది. ఎగిసే ధరలను నేలకు చచ్చినట్టు దిగివచ్చేల కళ్ళెర్ర జేస్తుంది.
                                                                                                   ఆ విషయం చరిత్ర చెబుతోంది.
----------------------------------------------------------
రచన: అర్నాథ్‌, 
ఈమాట సౌజన్యంతో