మూడు ముళ్ళు వేసేటప్పుడు జీవితానికి చిక్కుముళ్ళు వేసుకుంటున్నామని తెలియక మురిసిపోయి, ఆ తరువాత ఎంత ప్రమాదంలో పడ్డామో తెలుసుకుని జడిసిపోయి.. నోరెత్తలేక, చెవులు మూసుకోలేక, ముఖంతో నవ్వుతూ, మనసుతో ఏడుస్తూ, జీవితమనే బండికి ఎద్దులా మారి భార్యనే వెలకట్టలేని బరువును మహరాణిలా ఎక్కించుకుని, ఈడుస్తూ ఒగరుస్తూ జీవిస్తున్న ప్రతి భార్యాబాధిత భర్తకు ఈ అష్టకం అంకితం.
మనవి:
భార్య అనే రెండక్షరాల బ్రహ్మపదార్థం మీద నాకున్నవి భయభక్తులేగాని, మరొకటి కాదని సహృదయులైన భార్యలు, విధేయులైన వారి భర్తలు గమనించ ప్రార్థన.
ప్రథమం ఆవలింతంచ - ద్వితీయం కళ్లు ముయ్యడం - తృతీయం త్రుళ్ళిపడటం - చతుర్థం చెంపదెబ్బచ - పంచమం పారిపోవడం - ఇదీ ఒకప్పటి పురాణ ప్రవచన లక్షణమట. అంటే.. ప్రవచనకారుడు రాగాలు తీసుకుంటూ తన మానాన తాను పురాణం చెప్పుకుపోతుంటే.. ఆ పురాణం వినడానికి వచ్చిన వారు ముందు ఆవలింతలు తీస్తుంటారట. అటుపై మెల్లిగా నిద్రలోకి జారుకుంటూ కళ్ళు మూసుకుంటారట. ఇంతలో చిన్న శబ్దం వినిపించినా త్రుళ్ళిపడి లేస్తారట. ఆపై చెంప మీద వాలిన దోమను ఠపీ మని కొట్టుకుంటారట. ఇక చివరిగా ఇక్కడ కూర్చోవడం మా వల్ల కాదు బాబోయ్ అనుకుంటూ పారిపోతారట. ఈ మాటలు ఒకప్పటి ప్రవచనాల తీరుపై ఎవరో సంధించిన వ్యంగ్యాస్త్రం. అందుకే పురాణంలాగే పురాణ ప్రవచనకారులకు కూడా పంచలక్షణాలుండాలేమో అనిపిస్తుంటుంది. అవి..
ఒకటి.. రామాయణ భారత పురాణాదుల మీద, వేదవేదాంగాల మీద, సంపూర్ణమైన సాధికారత కలిగినవారై ఉండాలి.
రెండు.. పురాణసాహిత్యంలో పైకి అసంబద్ధంగా కనిపించే కొన్ని విషయాల అసలు రహస్యాలను ప్రామాణికంగా విశదీకరించగలిగిన ప్రజ్ఞాశాలురై ఉండాలి.
నాలుగు.. సందర్భోచితమైన హాస్యచతురత కలిగినవారై ఉండాలి.
అయిదు.. అన్నిటికన్నా ముఖ్యంగా ఉపాసనాబలం కలవారై ఉండాలి.
ఇవీ ఆ అయిదు లక్షణాలు. వాల్మీకిమహర్షి నారదమహర్షిని పదహారు మహోన్నత లక్షణాలు కలిగిన నరుడు ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడిగినప్పుడు, ఆ దేవర్షి.. అటువంటి వాడు ఉండటం దుర్లభమే కానీ.. ఒకే ఒక్కడు మాత్రం ఉన్నాడన్నాడు. అతడే మర్యాదాపురుషోత్తముడైన శ్రీరాముడు. అలానే మనం పైన చెప్పుకున్న అయిదు లక్షణాలూ కలిగిన ప్రవచనకర్త ఉండటం దుర్లభమే కానీ.. అటువంటి వారూ ఒక్కరున్నారు. ఆయనే పౌరాణిక సార్వభౌమునిగా పేరెన్నికగన్న మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారు. వారి ప్రవచనాల విశిష్టతను మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం.
మనలో చాలామందికి అప్పుడప్పుడూ వైరాగ్య భావన కలుగుతుంటుంది. ఆ సమయంలో ఇక ఏ పనీ చేయబుద్ధికాక, నిరాశానిస్పృహలు వచ్చేస్తుంటాయి. మనకే కాదు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తికి కూడా ఈ వైరాగ్య భావన కలిగింది. అయితే అది మనకు వచ్చేటటువంటి వైరాగ్యం కాదు. మనకి వైరాగ్యభావన సాధారణంగా మూడు సందర్భాలలో కలుగుతుంటుంది. అవి పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. అయితే రామచంద్రునకు కలిగింది ఏ కొద్దిసేపో ఉండే ఇలాంటి వైరాగ్యభావన కాదు. లోకాన్ని పరిశీలనగా చూసి, ఆత్మవిచారం చేయడం వల్ల కలిగిన వైరాగ్యం. అయితే స్వధర్మాన్ని ఆచరించే విషయంలో ఆయనకు కలిగిన సంశయం వల్ల ఈ వైరాగ్యభావన చింతగా మారింది. అటువంటి స్థితిలో ఉన్న శ్రీరామునకు వసిష్ఠ మహర్షి ఉపదేశించినదే ఈ యోగవాసిష్ఠం. దినినే వాసిష్ఠ రామాయణం అని, శ్రీవాసిష్ఠ గీత అని కూడా అంటారు. భగవద్గీతలో ఉన్న అనేక శ్లోకాలు ఈ యోగవాసిష్ఠంలోని శ్లోకాలను పోలి ఉంటాయి. వసిష్ఠ రామ సంవాదమైన ఈ యోగవాసిష్ఠాన్ని మొదట బ్రహ్మదేవుడు నిషధ పర్వతంపై మహర్షులకు బోధించాడు. ఆ తరువాతకాలంలో వాల్మీకి మహర్షి ఈ యోగవాసిష్ఠాన్ని తన శిష్యుడైన భరద్వాజునకు, ఆపై అరిష్ఠనేమి అనే మహారాజుకు బోధించాడు. 32 వేల శ్లోకాలు కల ఈ యోగవాసిష్ఠంలో ఆరు ప్రకరణాలున్నాయి. అవి.. వైరాగ్య ప్రకరణం, ముముక్షు ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, ఉపశమ ప్రకరణం, నిర్వాణ ప్రకరణం. ఏ ప్రకరణంలో ఏముందో ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం-
ధర్మసంస్థాపనార్థమై శ్రీకృష్ణపరమాత్మ ఈ భూమి మీద అవతరించి అర్జునుడిని మిషగా పెట్టి ఉపనిషత్ సారమైన భగవద్గీతను మనకు అనుగ్రహించాడు. అటుపై కొంతకాలానికి అవతారపరిసమాప్తి చేసి వైకుంఠానికి వెళ్లిపోయినా, భూలోకవాసుల మూఢత్వాన్ని గురించిన చింతమాత్రం స్వామికి అలానే ఉండిపోయింది. తన భర్త చింత చూసిన అమ్మవారు ఆనాడు స్వామి ఉపదేశించిన గీతాసారాన్ని భూలోకవాసులు ఆచరణలో పెట్టేలా చేయాలని సంకల్పించింది. అందుకోసమని తానే స్వయంగా ఈ భూమి మీద గోదాదేవి అన్నపేరుతో అయోనిజగా అవతరించింది. తిరుప్పావై అనే దివ్యప్రబంధాన్ని మనకు ప్రసాదించింది. 30 పాశురాల ఆ తిరుప్పావైలో ఏముందో ఈరోజు చెప్పుకుందాం.
సినారె చమక్కులు - సి. నారాయణరెడ్డి గారి చమత్కారములు
సాహితీమిత్రులారా!
“నేను పుట్టకముందే
నెత్తిమీద నీలితెర
కాళ్ళకింద ధూళిపొర”
అంటూ మొదలుపెట్టి సువిశాల విశ్వంభరను తన అక్షరాలలో మనకు సాక్షాత్కరింపజేసి, తెలుగు పాఠకలోకం ప్రణమిల్లుతుండగా, తాను జ్ఞానపీఠమెక్కిన కవితా ఘన జగజెట్టి మన సింగిరెడ్డి నారాయణరెడ్డి.
పగలే వెన్నెలలు కురిపించి జగములను ఊయలలూగించినా, రాక్షస స్త్రీతో చాంగురే బంగారు రాజా అంటూ హొయలు ఒలకబోయించినా, గున్నమామిడి కొమ్మమీదున్న రెండు గూళ్ళ గురించి బాలమిత్రులతో ముద్దుముద్దుగా పలికించినా, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం అని ప్రబోధించినా, నల్లని రాళ్ళలో దాగిన కన్నులకోసం, బండల మాటున మ్రోగిన గుండెలకోసం వివరించినా, వస్తాడు నా రాజు ఈరోజు అంటూ విరహగీతాలు ఆలపింపజేసినా, ఎంతటి రసికుడవో తెలిసెరా అంటూ కవ్వింపు నాట్యాలు చేయించినా, సుయోధన సార్వభౌముడితో చిత్రం భళారె విచిత్రం అంటూ యుగళగీతం పాడించినా, తాండ్రపాపారాయుడికి అభినందన మందారమాలలు వేయించినా, వటపత్రశాయికి వరహాలలాలి పాడుతూ జోకొట్టి నిద్రబుచ్చినా అది సినారె గారికే చెల్లుతుంది. అందుకే..
ఆ పెదవి మెదిపితే ఆణిముత్తెపు జల్లు
ఆ కలము కదిపితే అందాల హరివిల్లు
అయన కలం “బంగారు కడ్డి”
అయన పేరు “నారాయణరెడ్డి”
అంటూ సినారె గారి గురించి మృదుమధురంగా కవితాగానం చేశారు మన మధురకవి కరుణశ్రీ గారు. జగమెరిగిన నారాయణరెడ్డి గారి, పాటల్లో మెరుపుల గురించి, మనం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. అందుకే ఈరోజు ఆయన మాటల్లో విరుపుల కోసం కాసింత చెప్పుకుందాం. ఇక ఈనాటి సినారె చమక్కుల్లోకి ప్రవేశిద్దాం.
కలియుగ భీముడు ‘కోడి రామ్మూర్తి నాయుడు’గారి జీవిత కథ| చేసిన విన్యాసాలు
సాహితీమిత్రులారా!
సంజీవనీ పర్వతాన్ని అమాంతం పైకెత్తి అవలీలగా దానిని యుద్ధభూమికి చేర్చిన హనుమంతుని గురించీ, తన పిడిగుద్దులతో బకాసురుడు, హిడింబాసురుడు వంటి రాక్షసుల్ని నుజ్జునుజ్జు చేసి చంపిన భీమసేనుడి గురించీ మనం బోలెడన్ని కథలు చెప్పుకుంటూ ఉంటాం. ఎంతకాదన్నా మహాబలులు, సింహబలులు అంటే మనకు తెలియకుండానే ఏదో అభిమానం ఉంటుంది. మరి అలాంటి బలశాలురు కేవలం ప్రాచీన కాలంలోనే ఉండేవారా? అంటే.. కాదు. మనకాలంలో కూడా ఉన్నారు. అందుకు ఉదాహరణే కలియుగ భీముడిగా, జగదేకమల్లునిగా పేరు గడంచిన కోడి రామమూర్తి నాయుడు గారు. ఆయన కథను, మహాబలుడిగా ఆయన చేసిన విన్యాసాలనే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం.
వాల్మీకి రామాయణానికి వచనంలో వచ్చిన ఉత్తమ తెలుగు అనువాదమేది?
సాహితీమిత్రులారా!
వాల్మీకి రామాయణాన్ని భక్తి ప్రపత్తులు కలిగిన ఎందరో పండితులు తెలుగులోకి అనువదించారు. శ్రీరామచంద్రమూర్తిని హృదయం నిండా నింపుకుని ఉండటం చేతనూ, రామకథ మీద ఉన్న అపారమైన ఆపేక్ష చేతనూ, నేను ఆ అనువాదాలలో ఎన్నింటినో చదివాను. అలా నేను చదివిన వచన అనువాదాలలో ఉత్తమస్థాయివని భావించిన వాటి వివరాలను మీతో పంచుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను. జై శ్రీరామ్!
తంత్ర అంటే టెక్నిక్. ఎలాంటి టెక్నిక్ అంటే.. మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకునేలా చేసే టెక్నిక్. ఈ తంత్రాల్లో రెండు రకాలున్నాయి. క్రియా తంత్రాలు, జ్ఞాన తంత్రాలు. మంత్రాలు, యంత్రాలు ఉపయోగించి చేసేవి క్రియా తంత్రాలు. అటువంటి వాటి అవసరం లేకుండా కేవలం మన బుద్ధిని మాత్రమే ఉపయోగించి చేసేవి.. జ్ఞాన తంత్రాలు. మనం చెప్పుకోబోయే విజ్ఞాన భైరవ తంత్ర అటువంటి జ్ఞానతంత్రమే. ఇది చాలా ప్రాచీనమైన తంత్రం. ఈ విజ్ఞాన భైరవ తంత్రాలో మొత్తం 112 టెక్నిక్స్ ఉన్నాయ్. ఇవన్నీ పరమశివుడు పార్వతీదేవికి చెప్పినవి. ఈ టెక్నిక్స్లో ఏదో ఒక టెక్నిక్ని సాధన చేసి.. మన ఆలోచనకు కూడా అందనంత గొప్ప స్థితిని చేరుకోవచ్చు. బుద్ధుడు కూడా ఈ 112 టెక్నిక్స్లో ఒకదానిని సాధనచేసే జ్ఞానోదయం పొందాడు. ఈ విజ్ఞాన భైరవ తంత్ర ఎలా పుట్టింది. ఈ తంత్రాన్ని సాధన చేయడానికి నియమాలేమన్నా ఉన్నాయా? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.
మన భరతభూమిలో పుట్టినవారిలో ఎందరో కవులున్నారు. మరెందరో తాత్త్వికులూ ఉన్నారు. అయితే మహాతాత్త్వికుడే కాకుండా, మహోత్కృష్ట కవి కూడా అయిన దైవాంశ సంభూతుడు మాత్రం ఒక్కరే ఉన్నారు. ఆసేతు హిమాచలం పాదచారియై పర్యటించి, అనేకరకాల అవైదిక మతాల ప్రభావంతో అస్తవ్యస్తమైన ఈ సమాజాన్ని, మళ్ళీ జ్ఞానమార్గం వైపు నడిపించినవాడు, దేశం నలుమూలలా ధర్మరక్షణకై నాలుగు పీఠాలు స్థాపించి, భరతజాతికి దిశానిర్దేశం చేసిన మహాపురుషుడు, “బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ న పరాః” - పరబ్రహ్మము మాత్రమే సత్యము, ఈ కనబడే జగత్తంతా మాయ. జీవాత్మ పరమాత్మ వేరువేరు కాదు. ఉన్నది ఒక్కటే పదార్థం - అంటూ అద్వైత సిద్ధాంతానికి అసలు సిసలు వ్యాఖ్యనం చేసిన అపరశంకరావతారుడు… జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యులు.
మనలో చాలామంది నిత్యం పారాయణ చేసే, కనకధారాస్తవం, భజగోవింద స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, శివపంచాక్షరీ స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, గణేశ పంచరత్న స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఇలా అనేక దైవప్రార్థనలకు కర్త మన ఆది శంకరుల వారే. ఇక శంకరులవారు తన కవిత్వాన్నంతా రంగరించి మనకు అందించిన అమృతపాత్రలు రెండు. అవి… ఒకటి శివానందలహరి. రెండవది… సౌందర్యలహరి.
అటువంటి సౌందర్యలహరి నుండి ఒక శ్లోకాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఈ శ్లోకంలో శంకరభగవత్పాదులవారు అమ్మవారి కళ్ళు పలికించే నవరసాల వర్ణన చేశారు. నిజానికి ఈ శ్లోకంలో కనబడేవి ఎనిమిది రసాలే. ఆ తొమ్మిదవ రసమైన శాంతము అన్నది జగన్మాత సహజస్థితిని సూచిస్తుంది.