మన శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక
ఆయన నిర్యాణం తరువాత సముద్రంలో
మునిగిందని మనవారు చెబుతారు
ఆ ద్వారక ఇప్పుడు సముద్రంలో కనుగొనబడింది
దానిగురించిన డాక్యుమెంటరీ ఇక్కడ చూడగలరు-
భారతదేశంలోని దేవాలయాల గురించి
కొంత ఆసక్తి కరమైన సమాచారాన్ని
నేషనల్ జాగ్రఫి ఛానల్ వారు రూపొందించిన ది లాస్ట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అనే
ఈ డాక్యుమెంటరీ చూడండి.
ఇందులో తంజావూరు బృహదీశ్వరాలయంపైకి
అంతబరువైన రాతిగోపురాలను ఎలా ఎక్కించారో
హంపిలోని సమాచారం ఖజురహో దేవాలయాన్ని
గురించి తాజ్ మహల్ గురించిన విషయాన్ని
మనం గమనించవచ్చు చూడండి-
మన శ్రీవేంకటేశ్వరులవారిని ప్రపంచప్రజలకు
పరిచయం చేసేందుకు నేషనల్ జాగ్రఫిక్ వారు "ఇన్ సైడ్ తిరుమల తిరుపతి" అనే పేరున డాక్యుమెంటరీ చేశారు. అందులో
మన తిరుమలను గురించి వారు ఏమి చెబుతున్నారో
చూడగలరు. ఇక్కడ మనం ఆ డాక్యుమెంటరీ
చూసి తెలుసుకుందాం-
కర్మసిద్ధాంతం మన హిందూధర్మంలోనే కాక జైనమత సాంప్రదాయంలోనూ ఉంది. ఇది వారికి చాల ముఖ్యమైనది. చేసిన కర్మలను బట్టి శుభాశుభ కర్మ ఫలాలను అనుభవించవలసి వస్తుంది. అదే జన్మలో కాకపోతే తరువాత జన్మలో అనుభవించాల్సి వస్తుంది. సత్కర్మలకు సత్ఫలం, దుష్కర్మలకు దుష్ఫలం తప్పదు. సర్వజ్ఞులైన తీర్థంకరులకు ముందుగానే అన్నీ తెలియవచ్చు. కర్మలు - ఘాటీయ కర్మలు(ఆత్మగుణాలను కలుషితం చేసే దుష్టకర్మలు), అఘాటీయకర్మలు అని రెండు విధాలు. ఆత్మకు సహజంగా సర్వజ్ఞత్వం, సర్వదర్శన శక్తి, పరమానందాన్ని అనుభవించే అవకాశం, సర్వశక్తిమంతత్వం ఉంటాయి. అయితే ఘాటీయ కర్మలు ఆత్మకు అవి లేకుండా చేస్తాయి. అవి 1. జ్ఞానా వరణీయ కర్మ ఆత్మకు సహజం ఉండే సర్వజ్ఞత్వ శక్తికి అడ్డువస్తుంది. 2. దర్శనావరణీయ కర్మ దేనినైనా చూడగల శక్తికి ఇది ప్రతి బంధకం కలిగిస్తుంది. 3. మోహనీయ కర్మ పరమానందాన్ని అనుభవించే శక్తికి ఈ కర్మలు గుదిబండలు అవుతాయి. 4. అంత్రాయ కర్మ ఇది ఆత్మ సర్వశక్తిమంతం కావడానికి ప్రతిబంధకం అఘాటియ కర్మలు - 4 1. వేదనీయ కర్మ- కష్టసుఖాలనే భావనలను కలిగిస్తుంది 2. నామకర్మ - జన్మించినపుడు ఏ విధమైన శరీరాన్ని ధరించాలో నిర్ణయిస్తుంది. 3. ఆయుకర్మ- ఆత్మ ఏ దేహధారణ చేస్తుందో ఆ దేహ ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తుంది 4. గోత్ర కర్మ - ఏ అంతస్తు కుటుంబంలో జన్మించాలో నిర్ణయించే కర్మ
మదం అనే మాట తరచు వింటుంటాం అంటే ఏమిటో? "ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చున్ " అంటుంటారు కదా! మదం అంటే కొవ్వు, పొగరు అని చెప్పవచ్చు. "శబ్దరత్నాకరం"(నిఘంటువు) ప్రకారం- మదము - క్రొవ్వు, ఏనుగు క్రొవ్వు, రేతస్సు, ఏనుగు రేతస్సు, కస్తూరి, గర్వము, సంతోషం అనే అర్థాలున్నాయి. ఇక్కడ మదం అనేది మూడు రకాలని త్రిమదములు అవి - 1. అన్నమదం, 2. ధనమదం, 3. కులమదం మరో రకంగా మదం 8 రకాలు అంటే అష్టమదములు అవి - 1. అన్నమదం, 2. అర్థమదం, 3. స్త్రీ మదం 4. విద్యామదం, 5. కులమదం, 6. రూపమదం, 7. ఉద్యోగమదం, 8. యౌవన మదం. ఇవి ఇలా ఉంటే గజమదం అనేది ఏనుగుకు శరీరంలో ఎనిమిది చోట్ల మదం(క్రొవ్వు/రేతస్సు) పుడుతుంది. 1. కన్నులలో పుట్టే మదం పేరు "సీధువు" 2. చెక్కిళ్ళలో పుట్టే మదం పేరు "దానం" 3. చెవులలో పుట్టే మదం పేరు "సాగరం" 4. తొండం చివరల పుట్టే మదం "శీకరం" 5. చనుమొనల వద్ద పుట్టే మదం పేరు "శిక్యం" 6. జననాంగాల వద్ద పుట్టే మదం పేరు "మదం" 7. గుండె సమీపంలో పుట్టే మదం పేరు "ఘర్మం" 8. కాళ్ళ వద్ద పుట్టే మదం పేరు "మేఘం" ఏనుగుకు ఇన్నిరకాల మదాలున్నాయి. ఈ విషయాలు యతులను గజారోహణం చేయించేవారికీ, ఏనుగులపై విగ్రహాలను ఊరేగించేవారికీ తెలిసివుండాలి అంటారు పెద్దలు.
కృష్ణయజుర్వేదానికి తైత్తిరీయమనే పేరు ఉంది. తిత్తిరి అంటే తీతువు పిట్ట. దీనికి సంబంధించిన ఒక కథ పూర్వులు చెప్పినది ఇక్కడ గమనిద్దాం. యాజ్ఞవల్క్యుడు బ్రహ్మరాతుడు అనే మునికుమారుడు. యాజ్ఞవల్క్యుడు యజుర్వేదంలో దిట్ట అయిన వైశంపాయనుడు అనే ఋషి శిష్యుడు. ఒక సందర్భంలో అహంకారంతో మాట్లాడిన యాజ్ఞవల్క్యుని గురువుగారు కోపించి తనవద్ద నేర్చుకొన్న యజుర్వేదాన్ని కక్కమన్నాడు. శిష్యుడు అలాగే చేశాడు. ఆ కక్కిన యజుర్గణం రక్తసిక్తమై ఉండగా తిత్తిరి పక్షులరూపంలో యజుర్గణ దేవతలు వచ్చి వాటిని తిన్నారు. అందుకని యజుర్వేదానికి అప్పటి నుండి తైత్తిరీయమనే పేరు వచ్చింది. వేదాలన్నీ పోగొట్టుకున్న తరువాత యాజ్ఞవల్క్యుడు సూర్యుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. అప్పుడు సూర్యుడు వాజి(గుఱ్ఱం)రూపంలో వచ్చి యాజ్ఞవల్క్యునికి యజుర్గణాన్ని ఉపదేశించాడు. అప్పటి నుండి యజుర్వేద శాఖకు వాజసనేయ శాఖ అనే పేరు వచ్చింది అని ఐతిహ్యం.
మన హిందూసమాజంలో సన్యాసి అనే పదం సుపరిచితమైనదే. దీన్ని గురించి ఇంకెందుకు తెలుకోవడం అనే అనుమానం రావచ్చు. కానీ మనకు తెలిసిన విషయం స్వల్పం. అందుకే మరికొంత తెలుసుకుందాని ఇక్కడ చర్చించడం జరుగుతోంది. ఆశ్రమ ధర్మాల్లో సన్యాసం నాలుగవది. మొదటిది బ్రహ్మచర్యం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థం. సన్యాస మనే ఈ పదాన్ని ఇంతకుపూర్వం సన్న్యాసం అని, సంన్యాసం అని వాడేవాళ్ళు. సన్యాసం అంటే వైరాగ్య భావనతోనో, అదే లక్ష్యంగానో సంసారిక జీవితాన్ని త్యజించివేయడం. వైరాగ్య తీవ్రతను బట్టి మంద వైరాగ్యం, తీవ్ర వైరాగ్యం, తీవ్రతర వైరాగ్యం అని మూడు విధాలుగా చెబుతారు. 1. గృహసంబంధమైన సమస్యలను తట్టుకోలేక సన్యసించటాన్ని మందవైరాగ్యం అంటారు. 2. దారేషణ, పుత్రేషణ, ధనేషణ అనే ఈషణత్రయాన్ని వదలిన సన్యాసాన్ని తీవ్రవైరాగ్యం అంటారు. 3. కర్మకాండలలో చెప్పిన విధివిధానాలు ప్రయోజనరహితమని విడిచి పెట్టిన సన్యాసాన్ని తీవ్రతర వైరాగ్యమని అంటారు. ఈ విభజన కాకుండా సన్యాస తీవ్రతను బట్టి మరి రెండు రకాల విభజన వుంది. అందులో నాలుగు విధాలని, ఆరు విధాలని చెప్పబడుతున్నవి. మొదట నాలుగు విధాలైన వాటిని గమనిస్తే- 1. కుటీచకం, 2. బహూదకం, 3. హంస సన్యాసం, 4. పరమహంస సన్యాసం తీవ్ర వైరాగ్యం వల్ల తీసుకునే సన్యాసాలు మొదటి రెండు సన్యాసాలు. వాటిలో మొదటిది 1. కుటీచకం- 2. బహూదకం. తీవ్రతర వైరాగ్యం కలిగిన సన్యాసులు హంసలు, పరమహంసలు సంచారం చేసే శక్తిలేని సన్యాసి ఊరివెలుపలో, ఏదైనా ఒక నదీతీరంలోనో మఠం ఏర్పరచుకొని, కాషాయవస్త్రాలు దండ కమండలలాలు ధరించి స్వయంగా ఆహారాన్ని సంపాదించుకునే సన్యాసి కుటీచకుడు. పుణ్యతీర్థాలను, పవిత్ర క్షేత్రాలను దర్శిస్తూ ఎక్కడా ఆరు రోజులకు ఎక్కువ కాకుండా గడుపుతూ సంచారం చేస్తుండే సన్యాసి బహూదకుడు. హంసలు ఆచార విహితమైన మార్గంలో సన్యాస వ్రతం కొనసాగిస్తారు. పరమహంసలు బ్రహ్మజ్ఞానం సంపాదించాలనే జిజ్ఞాసతో తీవ్ర సాధన చేస్తుంటారు. ఒక జీవిత కాలం సాధనలో కృతకృత్యులు కాలేని పరమహంసలు తిరిగి జన్మలు ఎత్తి సాధన కొనసాగించి గమ్యం చేరుతుంటారని ప్రతీతి. రెండవ విధానంలో పైన చెప్పిన నాలుగు విధాలే కాకుండా మరో రెండు విధాలున్నాయి. తురీయాతీత, అవధూత అనే వ్యవస్థలు. మరో విభజనప్రకారం 6 విధాలు ఇవే- 1. కర్మఫల సన్యాసం / కర్మసన్యాసం 2. వైరాగ్య సన్యాసం / జ్ఞాన సన్యాసం 3. ఆతుర సన్యాసం / క్రమ సన్యాసం 4. వివిదిషా సన్యాసం / విద్వత్సన్యాసం 5. కర్మైక దేశ సన్యాసం / పరమార్థ సన్యాసం 6. గౌణ సన్యాసం గౌణ సన్యాసంలో బ్రహ్మణేతరులు స్త్రీలు కూడ సన్యాసం తీసుకోవచ్చు. పురాణ కాలంలో బ్రహ్మణేతరులు సన్యాసం తీసుకోవడం ఉంది. ఉదాహరణకు విదురుడు ఇలా సన్యాసం తీసుకొన్నవాడే.
సాహితీమిత్రులారా! పృథివి, అప్(నీరు), అగ్ని, వాయు, ఆకాశములనేవి పంచభూతములు. ఈ తత్వాలకు ప్రతీకలుగా ఐదు లింగాలున్నాయి. వీటినే పంచభూత లింగాలంటాము. ఇవన్నీ మన దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. 1. పృథివీలింగము- దీన్ని కొందరు రామేశ్వరంలోని రామలింగేశ్వరునిగా చెబుతున్నారు. మరికొందరు కాంచీపురంలోని ఏకాంబరేశ్వరునిగా చెబుతున్నారు. ఇక్కడ రెండింటిని తీసుకోవీలుంది. ఎందుకంటే రామాయణ కాలంలో సీతారాములు మట్టితో(ఇసుకతో) ప్రతిష్ఠించినది ఈ లింగం. అలాగే కాంచీపురంలోని లింగాన్ని కామాక్షి అమ్మవారు ఇసుకను లింగం చేసి ప్రతిష్ఠించినదని కథనం.
2. అపోలింగం - తమిళనాడులో శ్రీరంగానికి సమీపంలో జంబుకేశ్వరం అనే చోట అపో(జల)లింగం వుంది. జంబుకేశ్వరలింగం ఎప్పుడూ నీటిలో కనిపిస్తుంది. కనుక దీన్ని అపోలింగం అంటున్నారు.ఆపస్ అంటే నీరు.
3. తేజోలింగం(అగ్నిలింగం)- తమిళనాడులోని అరుణాచలం(తిరువణ్ణామలై)అనే చోట అరుణాచలేశ్వరలింగం ఉంది. ఇక్కడ కార్తీకమాసంలో కొండమీద వెలిగించే దీపం చాలా దూరం కనిపిస్తుంది. ఇది అరుణాచలేశ్వరునికి తేజస్సుకు సంకేతంగా భావిస్తారు.
4. వాయులింగం- ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగం. శ్రీకాళహస్తీశ్వరునిగా పిలుస్తున్నాము. ఈ దేవాలయంలో శివలింగం ఎదురుగా ఉన్న దీపాలలో ఒకటి కొద్దిపాటి గాలికి కదులుతూ కనిపిస్తుంది.. అది శివుని ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల జరుగుతూ ఉంటుందని అదేవాయు లింగానికి ఆధారమని అంటారు.
5. ఆకాశలింగం- తమిళనాడులోని చిదంబరంలో ఉంది ఈ ఆకాశలింగం. చిదంబరం నటరాజస్వామి ఆలయానికి కూడ ఆకాశలింగమని ప్రసిద్ధి ఉంది. ఇక్కడ నటరాజస్వామి విగ్రహం పక్కన చీకటిలో శూన్యప్రదేశం కనిపిస్తుంది. ఈ శూన్యమే ఆకాశానికి ప్రతీక
ఇవి పంచభూత లింగాలు. వీనిలో ఒక్క వాయులింగం తప్ప అన్నీ తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి.
శూన్య తిథులు- 1. చైత్రమాసంలో వచ్చే శుక్ల అష్టమీ, నవమీ తిథులు, అలాగే కృష్ణ అష్టమీ, నవమీ తిథులు శూన్యతిథులు 2. వైశాఖంలో వచ్చే రెండు ద్వాదశి తిథులు 3. జ్యేష్టమాసంలో వచ్చే శుద్ధ త్రయోదశి, బహుళ చతుర్దశి తిథులు 4. ఆషాఢ మాసంలో శుద్ధ సప్తమి, బహుళ షష్ఠి 5. శ్రావణ మాసంలో రెండు విదియలు, రెండు తదియలు 6. భద్రపదంలో పాడ్యమి, విదియలు 7. ఆశ్వయుజ మాసంలో రెండు దశములు, రెండు ఏకాదశులు 8. కార్తికంలో శుద్ధ చతుర్దశి, బహుళ పంచమి 9. మార్గశిరంలోని రెండు సప్తములు, రెండు అష్టములు 10. పుష్యంలోని రెండు చవితులు, రెండు పంచమీ తిథులు 11. మాఘమాసంలో శుద్ధ షష్ఠి, బహుళ పంచమి 12. ఫాల్గుణ మాసంలో రెండు తదియలు, రెండు చవితులు మొత్తం 12 మాసాలలో 24 శూన్యతిథులు
సాహితీమిత్రులారా! లింగం అంటే ఏమిటి అంటే దీనికి విభిన్నమైన అర్థాలున్నాయి. అవి- 1. పరమశివుని అర్చామూర్తి - శివునికి జటాజూటంతో ఫాలనేత్రంతో డమరుకం, కపాలం, త్రిశూలం మొదలైనవి ధరించి రూపాన్ని ఎక్కడా పూజించరు. దీనిగల కారణం భృగువు శివునికిచ్చిన శాపమంటారు. అందువల్ల లింగాన్ని శివునికి ప్రతిరూపంగా పూజిస్తారు. 2. లింగ్యతే జ్ఞాయతే అనేనేతి లింగం - అని అమరకోశం చెబుతున్నది. అంటే చిహ్నం అని అర్థం. 3. శిశ్నము అని సాధారణార్థం 4. బసవేశ్వరగీతామృతం - ప్రకారం లీయతే గమ్యతే యత్రయేన సర్వచరాచరం తదేతత్ లింగతత్వ పరాయణైః - అంటున్నది అంటే ప్రళయ కాలంలో సకల చరాచర ప్రపంచం ఎక్కడి ఉండి, సృష్టికాలంలో ఎక్కడి నుంచి తిరిగి వస్తుందో అది లింగం. 5. భూమి పీఠంగా, వేదాలే ఆలయంగా, కలిగిన ఆకాశమే లింగం. ఇలా అనేక నిర్వచనాలున్నాయి. ఏది ఏమైనా శైవులు అంటే హిందువులు శివునిగా లింగాన్ని పూజిస్తారు. లింగ భేదాలు - వైవిధ్యాలు లింగాలన్నీ ఒకే రూపంలో ఉండవు. సాధారణంగా శివాలయంలో కనిపించేది నల్లరాతితో చేసిన శివలింగం. కళ్లు, ముక్కు, చెవులు, కలిగి ముఖాలు ఉండవు. స్పటికంతో చేసిన లింగాలు, పాదరసంతో చేసిన లింగాలు, కూడ ఉన్నాయి. లింగప్రమాణనేదీ లేదు. శ్రీశైలంలోని శివలింగం చాల చిన్నది.
అలాగే వేములవాడలోని శివలింగం ఎక్కువ కైవారాలను కలిగి ఉంది.
ద్రాక్షారామంలోని శివలింగం రెండవ అంతస్తులోకి వెళ్ళి చూడాలి.
ఇది ఇలా ఉంటే తంజావూరులోని బృహదీశ్వరాలయంలోని శివలింగం ఆకారంలోను ఎత్తులోనూ చాల పెద్దది.
గుడిమల్లాంలోని శివలింగం మరోవిధంగా ఉంది.
కొన్ని లింగాలకు ఒకటి నుంచి ఐదు ముఖాలవరకు ఉంటాయి ఖాట్మండు(నేపాల్ రాజధాని)లోని పశుపతినాథ్ ఆలయంలోని శివలింగానికి 5 ముఖాలున్నాయి. అందులో ఒకటి ఊర్ధ్వముఖంగా ఉంది.
పరమ శివుడి పంచముఖాలు ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాతాలు. ఒకే శివలింగంలో అనేక చిన్నచిన్న లింగాకృతులు వెయ్యి వరకు ఉన్నాయి. వెయ్యిన్నొక్క ముఖాలుండే శివలింగాన్ని ఆట్యలింగం అంటారు. 108 ముఖాలుండే శివలింగాన్ని అష్టోత్తర లింగమని, సారోడ్య లింగమని అంటారు. ఏ ముఖంలేకుండా మనకు సాధారణంగా శివాలయాల్లో కనిపించే లింగాన్ని అకాట్య లింగం అని అంటారు. లింగ భేదాలను గురించి పూర్వనుంచి ఉన్న ఆచారాలు కృతయుగంలో రత్నలింగాన్ని, త్రేతాయుగంలో స్వర్ణలింగాన్ని, ద్వాపరయుగంలో రస(పాదరస)లింగాన్ని, కలియుగంలో పార్థివ(మట్టి)లింగం పూజనీయాలని చెబుతారు. అలాగే క్ష్తత్రియులు బాణలింగాన్ని, వైశ్యులు స్వర్ణలింగాన్ని, శూద్రులు శిలాలింగాన్ని, స్త్రీలు పార్థివలింగాన్ని పూజనీయాలుగా చెబుతారు. కొందరు స్పటిక లింగాన్ని పూజిస్తారు. ఇది కఠినమైన నియమంకాదు ఎవరైనా అందుబాటులో ఉండటాన్ని బట్టి ఏలింగాన్నైనా పూజించవచ్చని పెద్దలు చెబుతారు. లింగం రూపం మీద కొన్ని అపోహలున్నాయి- శివలింగాన్ని పురుషుని జననాంగంతోను, పానవట్టాన్ని స్త్రీ జననాంగంతోను పోల్చడం. ఇది సరైనదికాదని వివేకానందుడు ఖండించారు. శివలింగం యజ్ఞశాలలో యూప స్థంభ పరిణామమేనని ఆయన వాదించారు. బౌద్ధులు నిర్మించిన స్థూపాలు కూడా శివలింగార్చనకు స్ఫూర్తిని కలిగించి ఉండవచ్చని వాదించారు. "శివదర్శనమ్" అనే పుస్తకంలో శ్రీ చందూరి సుబ్రహ్మణ్యం గారు లింగార్చన బహుపురాతనమైందని, ఇతర ఖండాలలోనూ ఉన్నదని ఆధారసైతంగావ్రాసివున్నారు.
మన చిత్రసీమలోని కొన్ని ప్రత్యేకాంశాలు
ఇక్కడ గమనిద్దాం-
నాయిక నాయకుని పటం ఎదురుగా నిలుచొని
నాయకునితో కలిసి పాటపాడటం చాలా సినిమాల్లో
కనిపిస్తుంది ఇక్కడ కొన్నిటిని గమనిద్దాం.
భీష్మ సినిమాలో అంబ సాళ్యునితో పాటం
మహామంత్రి తిమ్మరుసు సినిమాలో
నాయిక కృష్ణదేవరాయలతో పాడటం
అలాగే దాన వీర శూర కర్ణ సినిమాలో
దుర్యోధనునితో భానుమతి(దుర్యోధనుని భార్య) పాటపాడటం
మనం గమనించవచ్చు అవి ఇక్కడ చూడండి
ఇవి కాక అనేకం ఉన్నాయి మీరు గమనించండి
స్నానం అంటే మనం ప్రతినిత్యం చేసేదేకదా అవును కానీ దీనిలో రకాలున్నాయట- తలస్నానం, కంఠస్నానం అవేకదా అవి మనకు తెలిసినవి కాని మనకు తెలియనివి ఉన్నాయి వాటిని గురించి ఇక్కడ తెలుసుకుందాం శాస్త్రాలల్లో స్నానాలు పంచ, దశ, సప్తవిధాలని తెలిపియున్నారు మన పెద్దలు. స్నానాని పంచ పుణ్యాని కీర్తితాని మహర్షిభిః....... అని అంటే స్నానం 5 రకాలని అవి- 1. ఆగ్నేయస్నానం విభూతిని శరీరమంతా పూసుకోవడం 2. వారుణ స్నానం బొడ్డులోతు నీటిలో మూడుసార్లు మునగడం వారుణ స్నానం 3. బ్రాహ్మ్య స్నానం ఆపోహిష్టామ యోభువఃతాన ఊర్జే దధాతన.... అనే మంత్రం చదువుతూ స్నానం చేయడం 4. వాయవ్య స్నానం గోధూళి శరీరం మీద వేసుకోవడం 5. దివ్య స్నానం ఎండ కాస్తున్నప్పుడు వర్షం కురిస్తే ఆ నీటిలో తడవడం ఇవి ఆంధ్రవేద పరిభాష అనే గ్రంథంలో చెప్పబడినవి. అలాగే ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వేదసార రత్నావళిలో దశవిధ, సప్తవిధ స్నానాలగురించి వివరించారు. పై చెప్పిన 5 విధాలకు మరికొన్ని చేర్చారు ఇక్కడ వారుణం, ఆగ్నేయం, వాయవ్యం, బ్రహ్మం, కాపిలం, మానసం, దివ్యం అని ఏడు విధాలు పైన చెప్పనివి కాపిలం, మానసం అనేవి రెండురకాలు కాపిలం స్నానం - నాభిస్థానానికి దిగువ నీటితో ప్రక్షాళన చేసికొని శరీరం పైభాగాన్ని తడిబట్టతో తుడుచుకోవటం మానస స్నానం మనసులో విష్ణుస్మరణ చేసుకోవటం మానస స్నానం పది స్నానాలు- భస్మ గోమయ, ఘృ, ద్వారి, పంచగవ్యైస్తతః పరం గోమూత్రం, క్షీరం, సర్పిః, మశోదకం ..... అనే శ్లోకం పదివిధాలైన స్నానాలను చెబుతున్నది. దీనిలోని ప్రతి స్నానానికి మంత్రాలున్నాయి. అవి మనం ఇక్కడ వివరించుకోవడం లేదు. స్నానం చేసే విధానంలో 5 అంగాలున్నాయట అవిసంకల్పం, మార్జనం, వరుణసూక్త పఠనం, అఘమర్షణం, స్నానాంగ తర్పణం అనేవి స్నానాంగ పంచకాలు. స్నానోదకాలు- స్నానం చేసేనీటిని కూడ మన శాస్త్రకారులు విభజించారు అవి ఆరు విధాలు మామూలుగా ప్రవహించే నీరు ప్రవహించని నీరు అని రెండురకాలు తైత్తిరీయ అరణ్యకంలో దీనికి సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి. 1. నదులు, సెలయేర్ల నీరు 2. బావినీరు 3. తటాకాలనీరు 4. వర్షపునీరు 5. ఎక్కడనుండైనా కడవతో తెచ్చిన నీరు 6. నీటి బోదెలు/కాలువలు/నీటి కుంటలలోని నీరు
అగ్నిపురాణంమన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది. ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు. కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి, ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం అని అంటున్నాము. అలా నీటిని "ఓమ్ కేశవాయస్వాహా, " "ఓమ్ నారాయణాయస్వాహా, " "ఓమ్ మాధవాయస్వాహా ", అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు. ఈ సందర్భంలోని ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది. చూపుడు వ్రేలి క్రింది ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని దాన్నే బ్రహ్మతీర్థం అని అంటారు. చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం అని ప్రజాపతి స్థానమనీ, ప్రజాపతి తీర్థం అని అంటారు. అరచేతి మధ్య పల్లపు ప్రదేశాన్ని అగ్ని స్థానమని దాన్ని అగ్ని తీర్థం అని అంటారు. చూపుడు వ్రేలినుంచి, చిటికెన వ్రేలి వరకు ఉన్న వ్రేళ్ళ కొనల భాగం దేవస్థానాలని అవే దేవతీర్థాలుఅని అంటారు. ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు. ఆచమనం చేసేప్పుడు మణికట్టువైపు బొటనవ్రేలి క్రింద ఉండే ప్రదేశం నుండి నీటిని గ్రహిస్తాము కనుక దీన్ని కూడ బ్రహ్మతీర్థం అంటారు. సంధ్యవార్చే వ్రేళ్ల చివరలనుంచి తర్పణం జలాన్ని విడుస్తాం కాబట్టి ఇదికూడ దేవతీర్థం అవుతున్నది. పితృకర్మలలో తర్పణాలకు వదిలే జలం పితృతీర్థం అనబడుతున్నది. ఇవండీ అగ్నిపురాణంలోని పంచతీర్థాలు మన అరచేతిలో.
106. గౌతముడు అహల్యను శిల కమ్మని శపించాడని చెబుతున్న వారు-? - వ్యాసుడు, కాళిదాసు, తెలుగులో భాస్కర రామాయణ కర్తలు మొదలైనవారు. (అంటే ఇది వాల్మీకి వ్రాయలేదు) 107. విశ్వామిత్రుని యాగం మొదలైన ఎన్ని రోజులకు ఆకాశం చిల్లులు పడేంత మాయ మబ్బులూ, చూస్తుండగా ప్రవాహంలా నెత్తురూ - ఒక్కసారిగా పడసాగాయి? - 11వ పగలు రాగానే 108. రామాయణం మొత్తంలో లక్ష్మణుడు ఎంత మందిస్త్రీలకు ముక్కు చెవులు కోశాడు? - ముగ్గురు (తాటక, శూర్పణఖ, అయోముఖి) 109. రామాయణం ప్రతి కాండలోని 18 సర్గకు ప్రత్యేక విశేషం ఉంది అంటారు వాటి వివరాలేవి? - బాలకాండ 18వ సర్గలో - రామలక్ష్మణభరతశత్రుఘ్నుల జననం అయోధ్యకాండ 18వ సర్గలో- కైక దశరథుని వరాలడగటం అరణ్యకాండ 18వ సర్గలో- శూర్పణఖ రావడం కిష్కింధాకాండ 18వ సర్గలో- వాలిసమాధానం సుందరకాండ 18వ సర్గలో- సీతమ్మను చూడటానికి రావణుడు రావడాన్ని హనుమంతుడు స్వయంగా చూడడం. యుద్ధకాండ 18వ సర్గలో- విభీషణునికి రాముడు శరణునీయడం ఉత్తరకాండ 18వ సర్గలో- వేదవతి రావణుని శపించడం 110. తెలుగులో మొదటి రామాయణం-? - గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం 111. గౌతముని ఆశ్రమం దగ్గర ఇంద్రుడు కోడై కూసిన దాన్ని వ్రాసిన కవి-? గోన బుద్ధారెడ్డి (ఇదీ వాల్మీకి రామాయణంలో లేదు) 112. వశిష్ఠుని వద్ద ఉన్న గోవుపేరు? - శబల 113. విశ్వామిత్ర వశిష్ఠులకు మధ్య వివాదానికి కారణం-? - శబలను విశ్వామిత్రునికి ఇవ్వకపోవటం 114. శబల విశ్వామిత్రుని నుండి ఎలా రక్షించుకొంది? - శబల హూంకారం నుండి కాంభోజులు, పొదుగు నుండి పహ్లవులు, రోమాల నుండి మ్లేచ్ఛులు, గోమయం నుండి శకులు, యోని నుండి యవనులు పుట్టి విశ్వామిత్రుని సేనల నుండి కాపాడాయి. 115. అహల్యాగౌతముల పెద్దకుమారుడు-? - శతానందుడు
36. దశరథకుమారులకు గురువెవరు? - వశిష్ఠుడు 37. రామాయాణానికి గల పేర్లు? - రామాయణం, సీతాయాశ్చరితమం మహత్, పౌలస్యవధ 38. రామోవిగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమహః - అని చెప్పింది ఎవరు? - మారీచుడు 39. రామాయణంలో ఎన్ని శ్లోకాలున్నాయి? - 24 వేలు 40. రావణుని తండ్రి ఎవరు? - విశ్రవసుడు 41. రావణునికి కుబేరుడు ఏమౌతాడు? - తమ్ముడు 42. కౌసల్యా సుప్రజా రామా - అనే శ్లోకాన్ని చెప్పింది ఎవరు? - విశ్వామిత్రుడు 43. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు ఎందుకు వచ్చాడు? - యాగరక్షణార్థం రాముని పంపమని అడగటానికి 44. విశ్వామిత్రుని మాటలు విన్న దశరథుడు ఏమన్నాడు? - రాముడు చిన్నవాడు విద్యపూర్తికాలేదు కావాలంటే నేనే నీవెంట వస్తాను అన్నాడు. 45. చివరకు రాముని విశ్వామిత్రుని వెంట ఎందుకు పంపాడు? - వశిష్ఠుని మాటల వలన రాముని విశ్వామిత్రుని వెంట పంపాడు 46. దారిలో రామునికి లక్ష్మణునికి విశ్వామిత్రుడు ఏమి నేర్పాడు? - బల, అతిబల అనే విద్యలతోబాటు అనే విద్యలు నేర్పాడు 47. బల విద్య అంటే ఏమిటి? - ఉత్సాహాన్ని, బలాన్ని వృద్ధి పొందించేది, ఇతరులు వేసే ఆయుధాలని తట్టుకొనే శక్తినిచ్చేది, ఆకలి దప్పుల బాధను లేకుండా చేసేది 48. అతిబల విద్య అంటే? - చూపు, మనసు, శరీరం, పని, అనే నాలిగింటి చేత శత్రువును పొరపాటుపడేలా చేసేది, ఈ మంత్రాన్ని మననం చేసేవాడు ప్రయోగించే ఆయుధానికి, తిరుగులేని తనాన్ని ఇచ్చేది 49. తాటకను రాక్షసివి కమ్మని శపించినవాడు? - అగస్త్యుడు 50. తాటక రాక్షసి కాకమునుపు ఎవరు? - సుకేతుడను యక్షుని కుమార్తె.