Sunday, September 25, 2016

నొసటన్ వ్రాసిన వ్రాలు కన్న గలదా నూరేండ్లు చింతించిన్


నొసటన్ వ్రాసిన వ్రాలు కన్న గలదా నూరేండ్లు చింతించిన్


సాహితీమిత్రులారా!


మనది భారతదేశం
మనకు కర్మసిద్ధాంతంతో చాలా
ఎక్కువ సంబంధం ఉంది.
ఏదానికైనా రాత ఉండాలంటూంటాం.
కావున దాన్నే ఒకకవి ఈ చమత్కారపద్యంగా
చెప్పాడు. మన పూర్వులకు చాలమందికి
ఈ పద్యపాదం సామెతాగా వాడటం కద్దు.


రసవాదంబులు పెక్కు నేర్చిన మహారాజేంద్రులన్ గెల్చినన్
వెసతో మంత్రములుచ్ఛరించిన మహావిద్యల్ ప్రసంగించినన్
అసహాయంబగు శూరతం గనిన దానంబోధి లంఘించినన్
నొసటన్ వ్రాసిన వ్రాలు కన్న గలదా నూరేండ్లు చింతించినన్


ఈ పద్యం విధి వ్రాత గొప్పతనాన్ని తెలుపూంది.
బ్రహ్మ పుట్టిన ప్రతిప్రాణికి నొసటిపై వారివారి సుఖదు:ఖాలను
ముందుగానే వ్రాస్తాడనేది మన వారి నమ్మకం.
అందువల్ల మనిషి రసవాద విద్యను
(బంగారం తయారుచేసేది) నేర్చుకున్నా,
రాజులతో పోరాడి గెలిచినా,
మంత్రాలను బాగా జపించినా,
గొప్పవిద్యలు నేర్చుకొని
శాస్త్రవాదాలు చేసినా,
ఎవరూ తోడులేకుండా శూరత్వం చూపినా,
సముద్రం దాటినా కూడా
నొసటిమీద బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాతప్రకారమే జరుగుతుంది
గాని అంతకుమించి స్వశక్తితో మనిషి ఏదీ సాధించలేడని - తాత్పర్యం. 

No comments:

Post a Comment