Monday, June 13, 2016

అర్చకుని వాక్యము నిక్కముగా శిరోజముల్ విరివిగ జూపి


అర్చకుని వాక్యము నిక్కముగా శిరోజముల్ విరివిగ జూపి


సాహితీమిత్రులారా!

తాడేపల్లి పానకాలరాయ కవి రచించిన
"మనసా! హరిపాదము లాశ్రయింపుమా!" అని మనసా శతకం లోని పద్యం
ఒకదాన్ని తెలుసుకొని ఉన్నాము.
ఇపుడు చిత్తమా! అనే మకుటంతో వ్రాసిన
శతకంలోని పద్యం చూడండి.
అనేక గాథలను పొదిగి కూర్చిన శతకం ఇది.
ఈ పద్యంలోనూ ఒక గాథ ఇమిడి ఉంది చూడండి.


విరిసరు లీయ కైకొనుచు వింతనెరుక సరులందు గాంచి భూ
వరుడలుగన్ త దర్చకుని వాక్యము నిక్కముగా శిరోజముల్
విరివిగ జూపి ఆ బెడద వీడగ జేసెను మున్ను కాకుళాం
తరమున అట్టి శ్రీహరి పదమ్ములు కోరి భజించు చిత్తమా!


ఈ పద్యంలోని గాథ -
 శ్రీకాకుళాంధ్ర విష్ణువు దేవాలయ అర్చకుడు శృంగారి.
స్వామి పూజకోసం కోసిన పూలను అతని ప్రియురాలు
సిగలో తురుముకొన్నది. హడావిడిలో ఆ పూలను పూజకు
తీసుకు వెళ్ళాడు పూజారి.
దేవుని పూజించిన పూలమాలను ప్రసాదంగా రాజుకు పంపాడు పూజారి.
అందులో ఉన్న వెంట్రుకను చూసి రాజు మండిపడ్డాడు.
అర్చకుని పిలిపించి అడిగితే "స్వామి శిరోజమే" అన్నాడు.
"ఱంకు నేర్చినమ్మ బొంకునేర్వదా!" అన్నట్లు.
"రాతి విగ్రహానికి శిరోజాలెక్కడి" వన్నాడు ప్రభువు.
"నిరూపించకపోతే శిక్షిస్తా"నన్నాడు.
తన భక్తుడైన అర్చకుని కాపాడటానికి ఆంధ్రవిష్ణువు మరునాడు
రాజు వచ్చిన సమయానికి శిరోజాలను చూపించాడు.
రాజు దిగ్భ్రాంతుడై అర్చకుని భక్తిని మెచ్చుకొన్నాడు.
ఇది పద్యంలోని గాథ.
ఈ కవి ఈ రెండు శతకాలనేగాక పార్థసారథి, లక్ష్మీనృసింహ,
రుక్మిణీపతి శతకాలు కూడా రచించాడట.


No comments:

Post a Comment