Friday, May 20, 2016

నడుమే పసలేదుగాని నారీమణికిన్!


నడుమే పసలేదుగాని నారీమణికిన్!


సాహితీమిత్రులారా!

ఇంటిపేరు "నస" - కవిత్వం బహు"పస" అని అంటూ ఉంటారు.
ఆయనే చేమకూర వెంకటకవి.
ఈయన విజయవిలాస, సారంగధర మొదలైన కావ్యాలను రచించినవారు.
విజయవిలాసం అనేది అర్జునుని తీర్థయాత్ర.
దీనిలో ముగ్గురు నాయికలతో అర్జునుని విలాసం.
అందులోని 1-104వ పద్యం ఇది చూడండి.

కడుహెచ్చు కొప్పు దానిన్ 
గడవన్ జనుదోయి హెచ్చు, కటి యన్నిటికిన్
కడుహెచ్చు, హెచ్చు లన్నియు
నడుమే పసలేదుగాని నారీమణికిన్!

ఇది చిన్నపద్యం.
దీనిలో కవి సుభద్ర
కొప్పూ, స్తనాలూ, కటిప్రదేశమూ, నడుమూ వర్ణిస్తున్నాడు.

సుభద్ర కొప్పు పెద్దది.
దాన్ని మించి చనుకట్టు పెద్దది.
అన్నిటికంటె కటిప్రదేశము పెద్దది.
అన్నీ పెద్దవేకాని
నడుమే సారంలేనిది స్వల్పవిషయమని భావం.

కవి ఏదో లోపం చెబుతున్నట్లు చెబుతున్నాడు
కాని ఇదిలోపంకాదు.
నడుం ఎంత సన్నగా ఉంటే అంత అందమంటారు.
అందగత్తెలు సింహమధ్య, అణుమధ్య అని అనడం
సర్వసాధారణంకదా!

ఎంత చమత్కారంగా వర్ణించాడో కదా! ఈ పద్యాన్ని.

No comments:

Post a Comment