Thursday, May 19, 2016

శ్రీరస్తు! భవదంఘ్రి చికురంబులకు


శ్రీరస్తు! భవదంఘ్రి చికురంబులకు


సాహితీమిత్రులారా!

శ్రీనాథమహాకవి ఆశీర్వాదపదాలను చమత్కారంగా చతురంగా
ప్రయోగించి రసజ్ఞుల హృదయాలను ఆకర్షించిన
సౌందర్యవర్ణన పద్యం
పరికించండి.

శ్రీరస్తు! భవదంఘ్రి చికురంబులకు మహా భూర్యబ్దములు సితాంభోజ నయన!
వరకాంతిరస్తు! తావకముఖ నఖముల కాచంద్రతారకంబబ్జ వదన!
మహిమాస్తు! నీ కటి మధ్యంబులకు మన్ను మిన్నుగ లన్నాళ్ళు మించుబోడి!
విజయోస్తు! నీ గాన వీక్షల కానీల కంఠ హరిస్థాయిగా లతాంగి!
కుశలమస్తు! భవచ్ఛాత కుంభ కుంభ
జంభ భిత్కుంభి కుంభా భిజృంభమాణ
భూరి భవదీయ వక్షోజములకు మేరు
మందరము లుండు పర్యంత మిందువదన!


ఈ పద్యంలో పాదాది కేశ పర్యంతం వివిధ అవయవాలను జంటలుగా
తీసుకొని శుభవచనాలు పలికాడు కవిసార్వభౌముడు.

ముందు పాదాల నుంచి ముంగురులదాకా ఒక్కసారి పరకాయించి చూశాడు.
వాటికి దీర్ఘాయువగు గాక - అని ఆశీర్వదించాడు.
ఎదురుగా వస్తున్నది కాంత,
ముఖం కనిపించింది. నఖాలు కనిపించాయి.
చంద్రుడు నక్షత్రాలు ఉన్నంతవరకు వాటికాంతి ఉండుగాక - అని ఆశీర్వదించాడు.
వదనాన్ని చంద్రబింబంతోను, గోళ్ళను నక్షత్రాలతోను పోల్చటం సంప్రదాయం.
తరువాత పిరుదులు, నడుము - వరుసగా మన్ను మిన్ను ఉన్నంతకాలం
వాటి మహిమ ఉండును గాక!
- అని(ఇక్కడ క్రమంగా తగిన ఉపమానాలే, వైశాల్యానికి మన్ను - భూమి,
శూన్యత్వానికి సన్నగనానికి నడుము మిన్ను(ఆకాశం)),
గాన(మాట), వీక్షలు(చూపు) నొమలిగొంతులా, లేడి కన్నులలా విజయం పొందునుగాక!
ఇక వేరువేరు అవయవాలను వదలి సార్థకమైన
జంట వక్షోజాలను గ్రహించి బంగారు కుండలవలె, ఐరావత కుంభాల వలె
అలరేటి మేరు మందర పర్వతాలు
ఉన్నంతకాలం కుశలం కలుగుగాక! -
అని తృప్తితీర ఆశీర్వదించాడు.

No comments:

Post a Comment