Monday, October 29, 2018

సంకల్పం


సంకల్పం




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి............

ఇప్పుడు కాకపోతే, మరెప్పుడు ? మనం కాకపోతే మరెవ్వరు ?

అమెరికా దేశంలో, మిచిగన్‌రాష్ట్రంలో, గేంజెస్‌అన్న ఊరులో ఉన్న వివేకానంద మొనాష్టరీలో ఆగష్టు నెల ఆఖరు వారం కలసిన వంద మంది భారతీయులులని రెండు రోజులుగా అలోచింపజేస్తున్న ప్రశ్నలివి.

బ్రిటీష్‌పాలన నుండి రాజకీయ స్వాతంత్య్రం సంపాదించుకొని కొన్ని ఏళ్ళు పైబడ్డా,ఎన్నో రకాలుగా వెనుకబడి, సుమారు సగానికిసగం జనం నిరక్షరాస్యతతో, కులాల కుమ్ములాటలతో,మనిషి స్వార్ధపు మూర్ఖత్వానికి మతంముసుగుతో, అన్ని రంగాలలో లజ్జలేని లంచగొండితనంతో, అధికార దాహంలో ప్రజాసేవ పేరుతో పదవులెక్కుతున్న రాజకీయ నాయకులతో, దిక్కుతోచక నిస్పృహతో నిలబడిఉన్న సామాన్యుడికి ఉత్తేజం కలిగించేలాంటి ఉద్యమం కావాలి. అది ఇప్పుడు కాకపోతే, మరెప్పుడు.

ఆ దేశంలో పుట్టీ, ఆ దేశంలో పెరిగి, ఆ దేశంలో ఉన్న విద్యా సౌకర్యాలని పూర్తిగా ఉపయోగించుకొని, పట్టాలు పుచ్చుకొని, విదేశం వచ్చి వివిధ రంగాలలో నిలదొక్కుకొని, కొద్దో గొప్పో పేరు సంపాయించుకొని,ఆ దేశానికి కావలసినది చెయ్యగల స్ధితిలో ఉన్న మనం కాకపోతే మరెవ్వరు.

” ఎన్నో వనరులతో, శతాబ్దాలుగా స్వశక్తిపై ఆధారపడి, స్వంత బుద్ధితో, విద్యా, వ్యవసాయ,వ్యాపార రంగాలలో ముఖ్యమైన దేశంగా నిలబడ్డ భారత దేశం ఈనాడు ఇంత వెనుకబడ్డ దేశంగా ఉండనవసరం లేదు. బాధ్యతాయుతమైన భారతీయులుగా దేశం బాగుకై మీ మీ పరిధులలో,మీ మీ శక్తి కొద్ది, మీరు చెయ్యగలిగినది చెయ్యండి ” అన్న డాక్టర్‌ భాగవతుల పరమేశ్వర రావు గారి పిలుపునందుకొని సమావేశమైన వాళ్ళ సామూహిక ఆలోచనల సారమిది.

ఆషా, ఎ. ఇ. డ్‌, ఐ. ఎల్‌ పి., వంటి సంస్ధల సభ్యులు, అమెరికా దేశంలో వివిధ రాష్ట్రాలలో డాక్టర్‌ పరమేశ్వర రావు గారి సభలకి వచ్చిన వారి ప్రతినిధులతో ఆ ప్రదేశం నిండిపోయింది.దేశం బాగుకోసం అంతమంది కలవడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఎవరి మొహంలో చూసినా ఉత్సాహం పెల్లుబుకుతున్నది. అందరికి అందరూ సుమారుగా కొత్తవారే. ఒకరిని ఒకరు పలుకరించుకొంటూ, పరిచయాలు పెంచుకొంటున్నారు. చాలామంది వయస్సులో చిన్నవారే, కానీ అందరూ పెద్ద పెద్ద చదువులు
చదివినవారే ! గుంపులు గుంపులుగా, పచ్చిక మీద కూర్చొని, చెట్ల కింద నిలబడి రకరకాల విషయాలని తీవ్రంగా చర్చించుకొంటున్నారు. సరిగ్గా అటువంటి సమయంలో నా దృష్టి ఒంటరిగా,అందరికీ దూరంగా ఉన్న ఒకతని మీద పడింది. అతన్ని నిన్న మధ్యాహ్నం భోజనాల దగ్గర కలిసాను.” పేట్‌” అని పరిచయం చేసుకొన్నాడు. అతని పూర్తి పేరు వాయువేగుల పతంజలిట. విష్ణుభొట్ల రామన్న గారితో కలసి వచ్చాడుట. మద్రాసు ఐ. ఐ. టి. లో ఇంజనీరింగ్‌ , తరవాత స్టాన్‌ఫోర్డ్‌యూనివర్సిటీలో పి. హెచ్‌.డి. గత ఎడాదిగా న్యూయార్క్‌ లో ఉద్యోగం చేస్తున్నాడుట. అమెరికా వచ్చి ఐదేళ్ళే అయిందిట. ఎక్కువమందితో పరిచయం చేసుకొన్నట్లు లేడు. అందుకే ఒంటరిగా ఉన్నాడని దగ్గరకి వెళ్ళి పలకరించాను.

“ఏమిటీ ఇలా ఒక్కరు ఉన్నారు ?” అన్నాను.

“మా గ్రూపు వాళ్ళు లిటరసీ పెంచడంపై డిస్కస్‌చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం లిటరసీ పెంచడం జరగని పని అని నా ఉద్దేశ్యం ” అన్నాడు.

” మరి మీ ఆలోచన ఏమిటి ?” అన్నాను.

“లిటరసీ పెంచాలి. ప్రస్తుతం ఉన్న 52 శాతం తో భారతదేశం అభివృద్ధి సాధించడం జరగని పని.చిన్న చిన్న హెల్పుల వల్ల యూజ్‌అట్టే ఉండదు. పెద్ద ఎత్తున లిటరసీ టేకప్‌చెయ్యాలి ” అన్నాడు.

“పెద్ద ఎత్తున అంటే …” అన్నాను వివరంగా చెప్పమన్న భావంతో.

” నాకు ఓ 100, 000 డాలర్లు సంపాదించి, ఇండియా వెళ్ళి అక్కడ ఉన్న ఓ ఆర్గనైజేషన్‌తో కలసి కాని, లేదా ఓ ఆర్గనైజేషన్‌పెట్టి వందలకొద్దీ వాలంటీర్లని పెట్టి, వేలకొద్దీ ఇల్లిటరేట్సుని, లిటరేట్సుగా చెయ్యాలని ఉంది ” అన్నాడు అవేశంగా.

” అది మంచి ఉద్దేశ్యమేగానీ, ఇటువంటి విషయాలలో అంటే సంఘసేవలో డబ్బు కోసమో,ఎదుటి వారి కోసమో ఎదురు చూడడం అనవసరం. పైగా ఆ డబ్బు కాని, మనుషులుకాని సమకూరేసరికి పనిచెయ్యడానికి కావలసిన అనుభవం రావాలంటే ఊహ తోచిన నాటినుండి ఎంతలో వీలయితే అంతలో,పని చేయడం మొదలు పెట్టాలి. ”

” కానీ రిజల్స్టు ?” అన్నాడు ప్రయోజనం ఉండదన్న భావంతో.

ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే, సమాధానం నా చేతులోనే ఉన్నట్టు తోచింది. వెంటనే ” మీరు తెలుగు చదువుతారా ? ” అని అడిగాను.

“షూర్‌ ” అన్నాడు.

“అయితే నా స్వంత అనుభవాన్ని ఓ కధ రూపంలో వ్రాసాను. ఈ కధ చదవండి. మీ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు ” అని నేను వ్రాసిన కధ కాపీ అతనికి ఇచ్చాను.

ఇంతలో డాక్టర్‌ రాణి చింతం గారు రమ్మంటున్నారని నాకు కబురు వచ్చింది. ఆమె ఇక్కడికివచ్చిన వారందరకి కాఫీ, టీ, భోజనాలన్నింటీని అందించే బాధ్యత తీసుకొన్నారు. ఆమెకు సహాయం అందించడానికి నాలాంటివారు కొద్ది మంది వాలంటీర్లు ఉన్నారు. ఏదో పని ఉండి పిలిచి ఉంటారు.

” ఓ అరగంట తరవాత వచ్చి కలుస్తాను ” అన్నాను.

” చాలా థేంక్సండి. ఇప్పుడే చదువుతాను” అని అతను అక్కడే కూర్చొని చదవడం మొదలుపెట్టాడు.

1998 జనవరి మొదటి వారంలో భువనేశ్వర్‌ వెళ్ళాం నేను, నా భార్య చిత్ర. చిన్నప్పుడు నాతో కలసి చదువుకొని, పాతికేళ్ళుగా అక్కడే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కిషోర్‌ అతని భార్య కమల ఉదయాన్నే రైల్వే స్టేషన్‌కు వచ్చి మమ్మల్ని ఆదరంగా వాళ్ళింటికి తీసుకుని వెళ్ళారు.

” కిషోర్‌! ఈ మాటు కోణార్క తప్పకుండా వెళ్ళాలి ” అన్నాను కబుర్ల్ల్లలో.

” తప్పకుండా, కానీ మరీ రెండు రోజులే ఉంటానంటే ఎలారా ?” అన్నాడు.

” రేపే వెళదాం. మీరిద్దరు కూడా రండి. అందరం కబుర్లు చెప్పుకుంటు హాయిగా గడుపుదాం ” అన్నాను.

” సరే. అయితే ఉదయాన్నే నాలుగు గంటలకి బయలుదేరితే సూర్యోదయానికల్లా కోణార్క చేరుకోవచ్చు. అప్పుడయితే, ప్రశాంతంగా ఆ గుడిని, గుడి వెనుకగా సూర్యోదయాన్ని చూడవచ్చు.ఆ తరవాత అయితే జనం ఎక్కువై అంతా గాభరా గాభరాగా ఉంటుంది. ఉదయాన్నేగాని, లేదా పౌర్ణమినాడు రాత్రి కాని ప్రాకారం చుట్టూ ఉన్న చెట్ల క్రిందో, నాట్య వేదికమీదనో కూర్చొని చూస్తూ, ఆ అందాల్నిఆస్వాదిస్తే కానీ కోణార్క గొప్పదనం అర్ధం కాదు, ఆనందించలేము ” అన్నాడు కిషోర్‌ తన్మయత్నంతో.

” సరే, అలాగే ” అన్నాను.

ఆరోజంతా చిన్ననాటి కబుర్లు, అమెరికా విశేషాలు, పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్‌లు,చెదరిపోయిన మిత్రుల గురించి, చనిపోయిన ఉపాధ్యాయుల గురించి, ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం మధ్యాహ్నం భోజనాలు అయ్యేంత వరకు. తరవాత ఓ రెండు గంటలు నిద్రపోయి లేచాము. కమల అందించిన టీ త్రాగుతూ ఉంటే, “రేపు తెల్లవారు ఝామున చాలా చలిగా ఉంటుంది. నువ్వేమైనా స్వెట్టరు గట్రా తెచ్చావా ” అని అడిగాడు కిషోర్‌.

” లేదే ” అన్నాను.

” సర్లే. మావి ఇస్తాం ” అన్నాడు.

” అసలు ఇండియాలోనే మంచి స్వెట్టర్లు దొరుకుతాయంటారు. ఇక్కడ కొని పట్టుకువెళితే బాగుంటుంది కదా ! ” అంది చిత్ర.

” అవును. అది మంచి అయిడియా” అని చిత్రతో అని, ” కిషోర్‌్‌ సాయంత్రం అలా ఊరిలో తిరిగి వచ్చినట్లుంటుంది, ఏదైనా స్వెట్టర్లు అమ్మే షాపుకి తీసుకువెళ్ళు ” అన్నాను.

” పరదేశీ బాబు అన్న పేరుతో ఓ పెద్ద బట్టల షాపు ఉంది. అందులో మంచి స్వెట్టర్లు దొరుకుతాయి ” అన్నాడు కిషోర్‌.

“అదేమిటి ? ఆ పేరు అలా ఉంది ?”

” అవును. కొంచెం వింత పేరే ! కానీ మంచి పేరున్న షాపు. అక్కడ బేరాలు ఉండవు. మంచి నాణ్యమైన బట్టలు. పైగా షాపుకు వచ్చిన వాళ్ళందరిని వాళ్ళ అభిప్రాయాన్ని వ్రాసి సంతకం పెట్టమంటారు. అలా చేసినందుకు ఓ మంచి పెన్ను ఇస్తారు “.

ఆరు గంటలకల్లా అందరం తయారై ఊరిమీద పడ్డాం. ఇరవై ఏళ్ళ తరవాత మళ్ళీ ఈ ఊరు చూస్తున్నాను. ఇదివరకు విశాలంగా అనిపించిన రోడ్లు ఇప్పుడు, జనాభా పెరుగుదల వలన కాబోలు, ఇరుకుగా అనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనుష్యులే, చిన్న చిన్న దుకాణాలే, ఇరుకు అన్న భావం మనసంతా
ఆవరిస్తుంది.

ఓ రెండు గంటలు ఊరంతా తిరిగి, సుమారు ఎనిమిది గంటలకు ” పరదేశీ బాబు ” అన్న పేరు పెద్ద పెద్ద అక్షరాలతో, అధునాతన పద్ధతిలో అలంకరించబడి ఉన్న ఓ విశాలమైన షాపులో అడుగు పేట్టాం. అడుగు పెట్టీ పెట్టగానే ఓ అందమైన అమ్మాయి ఎదురు వచ్చి వినయంగా అహ్వానించింది. ఏ బట్టలు కొనడానికి వచ్చేమో అడిగి వాటి కోసం ఎటువైపు వెళ్ళాలో చూపించి, అవి కొనడం అయిన తరవాత షాపు అంతటిని చూడమని కోరింది. కాష్‌కౌంటర్లకి ఓ 20 అడుగులకు ముందుగా ఉన్న ఓ టేబుల్‌ చూపించి, ఇక్కడ మా అభిప్రాయాలను షాపు విడిచి వెళ్ళే ముందు వ్రాసి సంతకం పెట్టమని ” పరదేశీ బాబు ” తరఫున ప్రార్ధిస్తున్నాను అని చక్కనైన ఇంగ్లీషు ఉచ్చారణతో భాషా దోషాలు లేకుండా చెప్పింది. అది విని ఆశ్చర్య పోయాను.

” ఇంత మంచి ఇంగ్లీషా ! ” అన్నాను ఆశ్చర్యంలోంచి తేరుకొంటూ.

” ఈ షాపులో పనిచేసే వాళ్ళు ఒరియాతో పాటు రెండు మూడు భాషలు మాట్లాడుతారు. అందరు ఇంగ్లీషు మాట్లాడుతారు, అదీ చాల చక్కగా ” అన్నాడు కిషోర్‌ ప్రసంసాపూర్వకంగా.

కావల్సిన స్వెట్టర్లు తీసుకొని, షాపంతా తిరిగి చూసి, బిల్లు చెల్లించడానికి కాష్‌కౌంటర్ల వైపుకి కదిలాం. ఎదురుగా ” ఈ షాపుపై మీ అభిప్రాయాలను తెలియజేయండి ” అని 12 భారతీయ భాషల్లో పెద్ద అక్షరాలతో వ్రాసి ఉన్న బోర్డు, దాని ప్రక్కనే ఓ టేబులు, టేబులు వెనక నవ్వు మొహంతో కూర్చొని ఉన్న అమ్మాయి కనిపించింది. ఆ టేబులు దగ్గరకు రాగానే, ” మీ అభిప్రాయం ఇక్కడ వ్రాసి పెట్టండి ” అని వినయంగా ఓ పుస్తకాన్నిఅందిస్తూ అడిగింది.

” అలాగే ” అని ” ఎక్సలెంట్‌” అని వ్రాసి సంతకం పెట్టాను. నా సంతకం పక్కనే చిత్ర కూడా సంతకం పెట్టింది. కిషోర్‌, కమల ఇంతకు ముందే వ్రాసాం అని చెప్పారు. ఆ అమ్మాయి వెంటనే రెండు పెన్నులు తీసి నాకు,చిత్రకి ఇచ్చింది. అవి తీసుకొని కాష్‌కౌంటర్ల వైపు వెళ్ళాం. అక్కడ మాకంటే ముందుగా వచ్చి నిలబడ్డవారి వెనుక క్యూలో నిలబడ్డాం. అలా నిలబడే షాపంతా కలయ చూసాను. షాపంతా చాలా అందంగా అమర్చారని అనిపించింది. అభిప్రాయ సేకరణ టేబుల్‌ దగ్గర కూర్చోన్న అమ్మాయి ఆమె చేతిలో ఉన్న కాగితంలోకి, అభిప్రాయం సేకరించిన పుస్తకంలోకి పదే పదే చూస్తున్నట్లు గమనించాను. ఉన్నట్టుండి ఆ అమ్మాయి ఒక్క ఉదుటన కుర్చీలోంచి లేచి, పరుగెట్టుకుంటూ షాపులో భాగంగా ఉన్న పై అంతస్ధుకు చేరుకొంది. షాపులో ఉన్న వాళ్ళందరి దృష్టి పరిగెత్తుతున్న అమ్మాయి మీదే ఉంది.కొద్ది క్షణాలలో పై అంతస్ధులో ” ఆఫీస్‌” అని వ్రాసి ఉన్న తలుపు తీసుకొని లోపలికి వెళ్ళింది. కొద్ది క్షణాలు గడిచాయి. ఎవరి పనులు వారు చెయ్యడం మొదలు పెట్టారు. మేం బిల్లులు చెల్లించడానికి ముందుకు కదిలాం. కాషియర్‌ మేం అందించిన రసీదు తీసుకొని, చెల్లించవలసిన సొమ్ము చెప్పి టకటక వ్రాయడం ఏదో మొదలు పెట్టింది. నేను పర్సు తీసి డబ్బులు లెక్కపెడుతున్నాను. అప్పటిదాకా చకచక పని చేస్తున్న కాషియర్‌ పని ఆపి, ఒక్క ఉదుటన లేచి నిలబడింది.

” ఏమైంది ?” అని అడిగాను.

” మేడం ” అంది.

నేను వెనక్కి తిరిగి చిత్ర వైపు చూసేంతలో నా పక్కగా నాలుగు ఆడుగుల దూరంలో ఏ భావం వ్యక్తం చెయ్యకుండా అన్ని భావాలను ఇముడ్చుకొందా అన్నట్లు అనిపించే విశాలమైన మొహంతో, యూనివర్సిటీ రోజులలో ఎన్‌ సి. సి. ఆఫీసర్‌ గా ఉన్న అంజలిని శర్మని గుర్తుకు తెప్పించే ఓ అమ్మాయి రెండు చేతులు జోడించి నిలబడి నన్ను చూసి ” నమస్తే ” అంది. ఆమె వెనుకగా అభిప్రాయం తీసుకొన్న అమ్మాయి మేం అభిప్రాయం వ్రాసిన పుస్తకం పట్టుకొని వెనక నిలబడి ఉంది. నేను కొద్దిగా తడబడుతూ ప్రతి నమస్కారం చేసాను.

” ఈ సంతకం మీదేనా ?” అని ఆ పుస్తకంలో ఉన్న నా సంతకం వైపు వేలు చూపిస్తూ అడిగింది. నా కోసం వాళ్ళు వెతుకుతున్నారన్న ఆలోచన నన్ను కొద్దిగా ఆశ్చర్యంతో నన్ను కలవర పెట్టింది.

” అవును ” అన్నాను మెల్లగా.

” మీరు 20 సంవత్సరాల క్రిందట భువనేశ్వర్‌ వచ్చారు కదూ !” అని అడిగింది.

” అ, అ అవును సుమారుగా …”

” ఈ కాగితంపై ఉన్న సంతకం కూడా మీదేనా ” అని పఠం కట్టి ఉన్న నా సంతకం ఫోటో కాపీ చేసి ఉన్న కాగితాన్ని చూపించి అడిగింది.

మొదటనుండి నా సంతకంలో ఆట్టే మార్పులేదు. ఆ కాగితం మీదనున్నది నా సంతకమే. సులభంగానే గుర్తు పట్టాను. సంభాషణ అంతా ఇంగ్లీషులోనే సాగుతున్నది.

” అవును ” అన్నాను నిశ్చయంగా.

” బాబూజీ !” అని ఆ షాపు అంత ప్రతిధ్వనించేలా ఒక్కసారి అరచి, చటుక్కున నా కాళ్ళపై పడి, తన చేతులతో నా రెండు కాళ్ళని చుట్టేసింది. ఉద్వేగంగా ఏదేదో అంటున్నది. అర్ధమవడంలేదు.

నన్ను ఆశ్చర్యం, ఉద్వేగం ఒక్కసారి ఆవరించి గాభరా పెట్టాయి. ఆ స్ధితిలోనే వంగుని, ” లేవండి,లేవండి. అలా కాళ్ళమీద పడకూడదు. అసలు విషయం ఏమిటి ? ఏం జరిగింది ? నా కోసం ఎందుకు వెతుకుతున్నారు ? మీ రెవరో నాకు తెలియదు ? ” అన్నాను.

ఆమె నా కాళ్ళు వదలకుండానే ” ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. లక్ష సంతకాల తరవాత మీ సంతకం కనిపించింది. మీరు దొరికారు. నేను మిమ్మల్ని వదలలేను. నా తనివి తీరా నా మనస్సులో ఇన్నేళ్ళుగా దాచుకున్న నా కృతజ్ఞతని మీకు తెలుపుకోవాలి బాబూజీ, బాబూజీ !! ” అంటూ అవేశంగా పరిసరాలని మరచి, ఒదిలితే ఎక్కడ జారిపోతాయో అన్నంత గట్టిగా నా కాళ్ళను పట్టుకొంది.

నేను నిస్సహాయంగా నిలబడి సహాయం కోసం మా ఆవిడ చిత్ర వైపు చూసాను. నా చూపును అర్ధం చెసుకున్నదానిలాగా ముందుకు వచ్చి వంగుని, నా కాళ్ళ దగ్గర ఉన్న ఆ అమ్మాయిని తన చేతులతో పట్టుకొని మీదకు లేపి నిలబెట్టింది. కానీ ఆ అమ్మాయి ఇంకా ఉద్వేగంతో చిత్ర భుజంపై వాలి ఉంది. షాపులో ఉన్న వాళ్ళంతా
మా చుట్టూ మూగి ఉన్నారు.

ఆ సంతకం నా సంతకమేనా ? నా సంతకానికి పఠం కట్టి ఉంచడమేమిటి ? ఆ సంతకానికి ఈ అమ్మాయికి సంబంధమేమిటి ? గతంలో ఈ అమ్మాయికి నాకు ఉన్న సంబంధం ఏమిటి ? నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నది ? నన్ను పట్టుకుందుకేనా ఈ అభిప్రాయ సేకరణ ? మనిషిన పోలిన మనుషులు
ఉంటారంటారు. సంతకాన్ని పోలిన సంతకం ఉండదా ? ఇందులో ఏ పొరపాటు లేదుకదా ? ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను.

ఇంతలో ఆ షాపు స్టాఫ్‌తేరుకొని, చిత్ర భుజంపై ఒరిగి ఉన్న ఆ అమ్మాయిని, మా నలుగురిని పై అంతస్తులో ఉన్న ఆ ఆఫీసుగదిలోకి తీసుకు వెళ్ళారు. ఆ ఆఫీసు గది ముందు అనుపమ పట్నాయక్‌ ఎమ్‌ ఎ., మేనేజింగ్‌ డైరెక్టర్‌ అని వ్రాసి ఉన్న బోర్డు ఉంది. లోపల కుర్చీలతో, సోఫాలతో అధునాతన పద్ధతిలో అమర్చిన విశాలమైన
ఆఫీసు ఉంది.ఎడమవైపున్న సోఫాలో కూర్చోమని సూచించారు. ఆ సోఫాకు ఎదురుగా ఉన్న సోఫాలో ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు. అంతలోనే మంచినీళ్ళు, వేడి వేడి టీలు వచ్చాయి. మంచినీళ్ళు, టీ అందరకి అందించారు. ఆమె ముందుగా కొంచెం మంచినీళ్ళు త్రాగి, తేరుకొని, స్టాఫ్‌ఇచ్చిన తువ్వాలుతో ముఖం తుడుచుకొని, నా మొహంలోకి చూస్తూ, ” మీరు ఇరవై ఏళ్ళ క్రిందట భువనేశ్వర్‌ వచ్చారు గుర్తుందా ?” అని నా జ్ఞాపకాలని గుర్తు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదానిలా అంది ” మీరు మా నాయన కూరల దుకాణానికి వచ్చారు…..” ఏమేమో చెపుతున్నాది. ఇరవై ఏళ్ళ క్రిందట భువనేశ్వర్‌ వచ్చినపుడు జరిగిన విశేషాలని గుర్తుకు తెచ్చుకుందుకు ప్రయత్నిస్తున్నాను నేను.

నేను ఉద్యోగప్రయత్నం మీద ఇంటర్య్వూ కోసం భువనేశ్వర్‌ వచ్చాను. కోణార్క్‌ కూడా చూద్దామని అనుకున్నాను. కాని వెళ్ళలేదు ఎందుచేత …?

అప్పుడు భువనేశ్వర్‌ ఇంత పెద్ద ఊరు కాదు. జనం బాగా తక్కువ. ఊరు విశాలంగా ఉన్నట్లు గుర్తు. కిషోర్‌ ఓ చిన్న గదిలో అద్దెకు ఉండే వాడు. నేను నాలుగు రోజులు ఉందామని కూడా వచ్చాను. అప్పుడు ” మదరాసీ ” హోటళ్ళు లేవు. కిషోర్‌ ఒరియా భోజనానికి అలవాటు పడ్డా, నా కోసం ఇంట్లోనే వంట చేసేవాడు. ఇంటర్య్వూ అయిన నాటి రోజు సాయంత్రం సామానులు, కూరలు కొనడానికని బజారుకు వెళ్ళాము.

” బాబూజీ !” గౌరవం, ఆప్యాయత మేళవించి పిలిచిన ఆ పిలుపుకు నా ఆలోచనలు తెగిపోయాయి. ” చిన్న వయసులో, చింపిరి తలతో, చీమిడి ముక్కుతో, చిరిగిన బట్టలతో, మట్టి కొట్టుకుపోయిన వంటితో, చదవలేక,చదువు రాక, చదువుకోమనే దెబ్బలతో, ఏడుపుతో, కన్నీళ్ళు నిండిన కళ్ళతో గుర్తుకు వచ్చానా ?” అని తోర్‌ దత్‌పొయట్రీ లాంటి భాషలో ఇంగ్లీషులో అడిగింది. మెల్లి, మెల్లిగా కూరగాయల తట్టల మధ్య కూర్చొని ఉన్న ఓ చిన్నపిల్ల గుర్తుకు రావడం మొదలయ్యింది. పూర్తిగా గుర్తుకు రాగానే ఎదురుగా కూర్చొని ఉన్న ఆమె కన్నీళ్ళు నిండిన కళ్ళల్లోకి చూసాను.

చక్కని సాంప్రదాయపు కేశాల కూర్పుతో, మిసమిసలాడుతున్న చెంపలమీద, మెరుస్తున్న కన్నీటి తడితో, పసుపు ఎరుపు రంగు మేలు మేళవింపుతో, మగ్గాన నేసిన మంచి చీరలో, వయసు తెచ్చి ఇచ్చిన వన్నెవెలుగుతో మెరుస్తున్న మేనుతో, ఈమె చదవనిది లేదేమో అని అనిపించే భాషా జ్ఞానంతో, భావోద్వేగాన్ని ప్రజ్వలిస్తున్న కళ్ళతో ఉన్న ఈమె ఆ పిల్లా ? నా కళ్ళముందే అందమైన సీతాకోక చిలుక అప్పుడే రెక్కలు విచ్చుకున్న భ్రాంతి కలిగింది.

మసక వెలుతురులో 30 35 సంవత్సరాల వ్యక్తి, అతనికి ఎదురుగా ఓ 6 7 ఏళ్ళ అమ్మాయి, చుట్టూ కూరగాయల తట్టలు ఒకదాని తరవాత మరొకటి గుర్తుకు వస్తున్నాయి. పిల్ల ఏడుపు వినిపిస్తున్నాది. ఏడుపు మధ్యలో ఏదేదో ఒరియాలో అంటున్నాది. అతను తండ్రి కాబోలు కొడుతున్నాడు. కొడుతూ అరుస్తున్నాడు. ఒరియా భాష రాకపోవడం వలన ఏమీ అర్ధం కావడం లేదు. తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. కిషోర్‌ సామానులు కొనడం పూర్తి అయిన తరువాత ఆ ఏడుస్తున్న పిల్ల ఉన్న కూరల దుకాణానికి వెళ్ళాం. ఆ పిల్లని, తండ్రిని దగ్గరగా చూడటం కుదిరింది. మేం రాగానే అతను పిల్లను కొట్టడం ఆపి మా వైపు తిరిగి కూరలు ఏరుకొందుకు తట్ట అందిస్తూ, పిండి తీసుకొని మొహానికి రాసుకున్న తీరులో, నవ్వు తీసుకొని మొహానికి పులుముకున్నాడా అన్నట్లు నవ్వాడు ఒక్క క్షణం సేపు.

ఆ పిల్ల మేం దగ్గరకు రాగానే ఆపలేక ఆపలేక ఆపినట్లు ఏడుపు ఆపింది. అయినా మధ్య మధ్యలో బెక్కుతూనే ఒరియాలో ఏదో అప్పజెపుతున్నట్లు చెపుతోంది. విరిగిపోయిన పలక, చిరిగిపోయిన పుస్తకం …

ఆ తండ్రి నలిగిన బట్టలతో, రేగిన జుత్తుతో, ముడతలు పడ్డ నుదురుతో, చాలా కాయ కష్టం చేసి రాటుదేరిన చేతులతో, నిర్భాగ్యపు బ్రతుకుకు నకలుగా, నిరాశ ముద్దలలాంటి కళ్ళతో, మాసిన గడ్డంతో,బ్రతుకుమీదో వ్యాపారం మీదో పిల్లదాని చదువుమీదో మనుషులమీదో లేక వీటన్నింటిమీదో, దీనిమీద అని నిర్దుష్టంగా చెప్పలేని కసి, కోపం అతని మొహమంతా మబ్బులా కమ్మేసింది.

కూరలు కొనడం అయిపోయిన తరవాత రూమ్‌కి వస్తుంటే కిషోర్‌ ని అడిగాను. “ఆ పిల్ల ఎందుకు ఏడుస్తోంది ? ఆ తండ్రి ఎందుకు కొడుతున్నాడు ? చదువుకోవడం లేదు అనేనా ?”

” ఆ!. సుమారుగా అంతే. పుస్తకాలు కొనకుండా బడికి రావద్దన్నారని, అందుచేత పుస్తకాలు కొనమంటుంది. బడిలో అందరు మంచి బట్టలు కట్టుకు వస్తున్నారని, తనకు అలాంటి బట్టలు కావాలని. ఆ పిల్ల ఎక్కాల పుస్తకం కొన్నా ఇంకా ఎక్కాలు రాలేదని, పుస్తకాలు కొనడానికే డబ్బులు చాలక పోతుంటే, ఇంక మంచి మంచి బట్టలు ఎక్కడనుంది తేగలనని ఆ తండ్రి అంటున్నాడు. నీకూ చదువబ్బదు, నాలాగే ఈ కూరల తట్టలే గతి. నా బ్రతుకు ఈ కూరల తట్టల మధ్యనే తెల్లవారుతుంది అని తిట్టుకుంటున్నాడు”. ఆ కబుర్లలో రూం కి వచ్చాం. రాత్రి ఆ పిల్ల ఏడుపు గుర్తుకు వచ్చి మెలుకువ వచ్చింది. ఆ తరవాత నిద్ర పట్టలేదు. ఆ పిల్ల మొహం పదే పదే
గుర్తుకువచ్చి ” చదువంటే డబ్బులని” స్కూల్లోనూ “చదువంటే దెబ్బలని” ఇంట్లోనూ ఒక దురభిప్రాయాన్ని ఆ చిన్నారి మనసులో నాటుతుంటే నాకు చాలా బాధ కలిగింది. ఆ పిల్లకి ఎలాగైనా చదువుకోవాలనే ఆసక్తి కలిగించాలని అనిపించింది. ఆ ఊరిలో ఇంకా ఉండేది ఒక్క రోజు మాత్రమే. మర్నాడు కోణార్క్‌ వెళ్ళాలని  అనుకున్నాను. నాకా పిల్లతో కాని వాళ్ళ నాన్నతో కాని మాట్లాడ్డానికి ఒరియా రాదు. ఏంచేసినా అది ప్రోత్సాహకరం అయ్యేదే కానీ ఆ పిల్ల చదువు భాద్యత మొత్తం తీసుకోడానికి నేను ఆ ఊర్లో ఉండను. ఉద్యోగం లేదు. మరేం చెయ్యాలి ? ఇలా ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారు ఝామున నిద్ర పోయాను.

మర్నాడు ఉదయం కిషోర్‌ నిద్రలేపాడు. కోణార్క్‌ వెళ్ళడానికి ఆలశ్యం అయిపోతోందన్నాడు.

” కోణార్క్‌ వెళ్ళడం లేదు ” అన్నాను నేను లేచి.

” అదేం ? ” అన్నాడు. ” మరేం లేదు. నా దగ్గర 200 రూపాయలే ఉన్నాయి. అవి పెట్టి ఆ పిల్లకి కావల్సిన పుస్తకాలు బట్టలు కొని ఇచ్చి చక్కగా చదువుకోమని చెప్పాలనుకుంటున్నాను.” అన్నాను.

” ఏం పిల్ల ? ఆ కూరగాయల కొట్టతని పిల్లా ?”

” అవును ” అన్నట్టు బుర్ర ఊపాను.

” మరి కోణార్క్‌ ప్రయాణం ….” అన్నాడు కిషోర్‌.

” ప్రయాణం అంత ముఖ్యం కాదు. విపరీతంగా వెనకబడి ఉన్న మన దేశానికి అక్షరాస్యత అత్యంత అవసరం. ఆడపిల్లలు చదువుకుంటే ఆమె పిల్లలు నిరక్షరాస్యులవ్వరు. ఆ కుటుంబం నిరక్షరాస్యత నుండి బయట పడుతుంది. కాబట్టి, నేను కోణార్క్‌ వెళ్ళడం కన్నా అదే డబ్బుతో ఆ పిల్ల చదువుకి ఉత్ప్రేరకంగా తోడ్పడడం మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నాను” అన్నాను.

కిషోర్‌ తెల్లబోయి చూస్తున్నాడు.

” నువ్వు ఆఫీసుకు వెళ్ళే దారిలో ఉన్న ఏదైనా ఓ పుస్తకాల షాపులో నన్ను విడిచిపెట్టి వెళ్ళు. ఆ తరవాత అక్కడ దగ్గరలో ఉన్న బట్టల దుకాణానికి వెళ్ళి బట్టలు కూడా కొని సాయంత్రం ఆ పిల్లకి ఇచ్చి వద్దాం ” అన్నాను.

సాయంత్రం మళ్ళీ ఆ కూరల దుకాణానికి వెళ్ళి ఉదయం కొన్న ఒరియా, ఇంగ్లీష్‌పుస్తకాలు, పెన్సిళ్ళు, ఓ రెండు పెన్నులు, కొన్ని రబ్బర్లు, బట్టలు ఇచ్చి, ” చదువుకో! బాగా చదువుకో ! చాలా పెద్దదానివి అవుతావు. నీకు కావలసినవి అన్నీ దొరుకుతాయి ” అని ఒరియాలో కిషోర్‌ చేత చెప్పించి, అవే మాటలని కిషోర్‌ చేత ఒరియాలో వ్రాయించి క్రింద నా సంతకం పెట్టి ఇచ్చాను. వాళ్ళు ఒరియాలో అన్నవాటిని ” కృతజ్ఞత “లని కిషోర్‌ నాకు తెలుగులో తరవాత చెప్పాడు. ఆ తరవాత ఏంజరిగిందో మరి తెలియదు. “ఆ పిల్లే ఈ పిల్లా?” అని ఆమె మొహంలోకి చూస్తూ ” అవును. అప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చినట్లు గుర్తు. ” అన్నాను.

” బాబూజీ, ఇవిగో ఆ పుస్తకాలు ” అని ఎదురుగా ఉన్న అందంగా నగిషీ చెక్కిన పెట్టె లోంచి కొన్ని పాత పుస్తకాలు తీసి కళ్ళకు అద్దుకొని నా ఎదుట పెట్టి ” ఆ రోజు మీరిచ్చిన ఈ పుస్తకాలు నాకు వరాలు. అప్పటినుండి శ్రద్ధగా చదువుకున్నాను. మా నాయన నా హైస్కూల్‌ చదువు పూర్తి కాగానే బట్టల వ్యాపారం మొదలు
పెట్టించాడు. మీ మాటలు మీది గురితో ఏర్పడ్డ చదువుమీది అభిమానం నన్ను వదలలేదు. ఉదయం వ్యాపారం,సాయంత్రం చదువు. చదువుతున్నకొద్దీ చదువు ఇచ్చే ఆనందాన్ని అస్వాదించ సాగేను. వ్యాపారంలో కూడా నా చదువు చాలా ఉపయోగపడడం చూసి మా నాయన నన్ను చదువుకోమని ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అలా ఎమ్‌ ఎ. దాకా చదివాను.” అనిలేచి, గోడకు తగిలించిఉన్న ఉత్కల్‌ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్టులను తెచ్చి చూపించింది.

” మిమ్మల్ని లెఖ్క పెట్టలేనన్ని సార్లు తలుచుకొని ఉంటాను. పరీక్షలు పాస్‌అయినప్పుడల్లా ఇదంతా మీ దయ వలనే అని అనుకుంటుంటాను. మీ పట్ల నాకున్న కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలా అని చాలా రోజులు ఆలోచించి, అఖరుకు మీ కిష్టమైన పనే చేసాను. చూడండి ” అని ఓ ఆల్బం తెరిచి గత 10 ఏళ్లగా ఏడాది వారీగా అమర్చిన ఆడపిల్లల గ్రూప్‌ఫొటోలని చూపించి ” ప్రతీ ఏడాది సుమారు వంద మంది చదువుకోడానికి స్ధోమత లేనివారిని చదివిస్తున్నాము. వాళ్ళని తిరిగి పెద్దవాళ్ళయ్యాక కనీసం పదిమందిని చదివించమని కోరుతున్నాం. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుందనుకుంటాను బాబూజీ !”

” నిజంగానే మంచి పని. చాలా ఆనందంగా ఉంది ” అన్నాను చెమర్చిన కళ్ళతో.

” బి. ఎ. పాస్‌కాగానే మిమ్మల్ని కలవాలన్న కోరిక అతి గట్టిగా అనిపించింది. మీ సంతకం ఉందిగానీ,మీ పేరు తెలియ లేదు. ఒరియా వాళ్ళు కాదని మాత్రం తెలుసు. మిగిలిన ఆశ ఒక్కటే. మీరు మళ్ళీ భువనేశ్వర్‌ వచ్చి మా షాపుకు వచ్చినట్లయితే ఈ సంతకం ద్వారా మిమ్మల్ని కలవవచ్చు అని తోచి ఈ సంతకాల పద్ధతి పెట్టాం. మా నాయన కూడా మిమ్మల్ని కలవాలని చాలా ఎదురు చూసాడు. అనారోగ్యంతో మంచంమీద ఉన్నా మీరు దొరికారా అని అడుగుతుండేవాడు. చనిపోయే ముందుకూడా మిమ్మల్ని గుర్తు చేసుకొని ఎప్పుడైనా కలిస్తే తన తరఫున కూడా మీకు పాదాభివందనం చెయ్యమన్నాడు ” అని ఉద్వేగంతో నా కాళ్ళకి మరో సారి నమస్కారం పెట్టింది.

నా నిలువెల్లా ఆనందాశ్చర్యాలతో ముంచెత్తబడుతున్న ప్రకంపనాలు పదే పదే ప్రవహిస్తున్నాయి. మాట్లాడాలని ఉంది కానీ గొంతునుండి మాటలు రావడం లేదు. గత 20 ఏళ్ళుగా విదేశాలలో పని చేస్తూ సంపాదించిన పురస్కారాలన్నింటి కంటే ఆమె చేసిన నమస్కారం అత్యున్నతమైనదిగా తోచింది. ఆ రోజు చేతిలో ఉన్న 200 రూపాయలు ఈ పిల్ల చదువుకు ఖర్చు చెయ్యడం కంటే మంచి పని నా జీవితంలో ఇంకేమీ లేదేమో అని అనిపించింది.అయితే ఆ అమ్మాయి తన జీవితంలో ఇంత ఎత్తు ఎదగడానికి కారణం నేనే అని, ఆ గొప్పదనం నాకే ఆపాదించబడడం అంత సబబు అనిపించ లేదు. అందుకే నోరు విప్పి ” నీ పట్టుదల,కృషి, మేధతో, విశాల దృక్పధంతో ఈ స్ధితికి వచ్చావు. కాని నా పాత్ర ఇందులో ఉత్ప్రేరకంగా పనిచెయ్యడం మాత్రమే. నువ్వు చాలా అభినందనీయురాలవు. ఎంతో మంది ఆడపిల్లలకి నువ్వు మార్గదర్శకురాలివి. అటువంటి నీ అభిమానానికి ఎంతో ఆనందిస్తున్నాను ” అన్నాను ప్రతీ పదాన్ని నొక్కి పలుకుతూ.

మేం ఇద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అంతా మమ్మల్నే చూస్తున్నారు అన్న ఊహ అప్పుడే కలిగింది.

” బాబూజీ, మీరు మా ఇంటికి రావాలి. మాతోనే ఉండాలి. ఇన్నేళ్ళుగా నా మనసులో మీతో చెప్పుకుంటున్నమాటలన్నీ మీతో చెప్పాలి.”

” అలాగే ” అన్నాను.

” మరి కోణార్క్‌ వెళ్ళాడమో …” అన్నాడు కిషోర్‌.

” రేపు కోణార్క్‌ వెళ్ళాలనుకొంటున్నారా ! రేపొక్కసారి మానుకొని మరోసారి వెళ్ళకూడదా ?” అని ప్రశ్న లాంటి అభ్యర్ధన చేసింది అనుపమ పట్నాయక్‌

” అలా అయితే ఇది 20 ఏళ్ల తరవాత మరో సారి అవుతుంది ” అన్నాడు కిషోర్‌.

ఎలా అన్న ఆమె ప్రశ్నకు సమాధానంగా 20 ఏళ్ళ క్రిందట నేను కోణార్క్‌ వెళ్ళడం ఎందుకు అవ్వలేదో చెప్పాడు.

అదివిని అనుపమ పట్నాయక్‌ మౌనంగా, నీళ్ళు నిండిన కళ్లతో కృతజ్ఞతతో మరోసారి చూసింది.

ఆ రాత్రి అందరం అనుపమ పట్నాయక్‌ కోరికపై ఆమె అతిధులమైనాం.

నేను వంటింటిలో చెయ్యవలసిన సహాయం చేసి వచ్చేసరికి పతంజలి నేనిచ్చిన కధ చదవడం పూర్తి చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు.

” ఇప్పుడేమంటారు ? ” అన్నాను. అతను అందిస్తున్న కాగితాలను అందుకుంటూ..

” సంకల్పం, ఆచరణ ముఖ్యం. మరి నేను వెళ్ళి మా గ్రూప్‌లో జాయిన్‌అవ్వాలి. థేంక్సు ” అన్నాడు అతను.

” మంచిది ” అన్నాను తృప్తిగా.
-----------------------------------------------------------
రచన: కలశపూడి శ్రీనివాసరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment