Sunday, December 30, 2018

పువ్వులు.. పువ్వులు.. పువ్వులు ..


పువ్వులు.. పువ్వులు.. పువ్వులు ..



సాహితీమిత్రులారా!

గుంటూరు శేషేంద్ర శర్మగారి కవితను ఆస్వాదించండి-

నవ్వుల జల్లులు కురిశాయి నా మీద
పుష్పవాణి పలికింది
బిడ్డా! పువ్వుల్ని తెలియని వారే అందరూ లోకంలో
పూరేకుల రంగులు చూసి పరవశులౌతారా
మూర్చపోతారు పరాగ పరీమళాలకు వశీకృతులై
దేవుడ్ని పూజిస్తారు వాటి గొంతులు కోసి
దండలల్లి ధరించుకుంటారు వాటి గొంతులు కోసి
అజ్ఞానులు – సమగ్ర పుష్పజ్ఞానం కావాలంటే
దర్శన శక్తి కావాలి మానవ నేత్రాలకు
అది సిద్ధిస్తుంది చిత్తాన్ని ఏకాగ్రం చేసి
తపస్సు చేసినప్పుడే –
అట్టి నేత్రాలు పుష్పాన్ని చూస్తే పుష్పపు
లోతుల్లోకి పోతాయి చూపులు
ఆశ్చర్య జనకములు ఆ లోతులు!
పుష్పం ఫలాన్ని కంటుంది
ఫలం గర్భంలో బీజం ఉంటుంది.
బీజంలో వృక్షం ఉంటుంది – ఇలా
ఇదొక అవిచ్చిన్న సృష్టి వలయం
పుష్పం లేకపోతే సృష్టి లేదు –
పుష్పాలన్నీ తల్లులే’
సృష్టిలో అన్ని ప్రాణుల్లో నూటికి యాభై
పుష్పవతులౌతాయి
ఆ ప్రాణుల్లో మనుష్య జాతి ఒకటి –
పుష్పవతులైన మానవీయ జాతి వారందరూ
మాతృదేవతలే
భార్య కూడా భర్తకు మాతృదేవతయే ఇది
కీలక రహస్యం – ఇది కీలక సత్యం
ఈ సత్యాన్ని ఉల్లంఘించిన వాడు
పాప పుణ్యాలనేవి ఉంటే
పాపగ్రస్తుడే అవుతాడు
జాగ్రత్త!
-------------------------------------------------------
రచన: గుంటూరు శేషేంద్ర శర్మ, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment