Saturday, November 3, 2018

భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం-1


భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం-1



సాహితీమిత్రులారా!

ఆంధ్ర జాతీయమహాకవి బమ్మెర పోతనామాత్యుడు విరచించిన పరమపవిత్రమైన శ్రీ మహాభాగవతంలో భక్తకవి బొప్పన గంగనామాత్యుడు పరిపూర్ణించిన పంచమ స్కంధం గంభీరమైన తత్త్వార్థబోధకత వల్ల, తిరుగులేని కవితారామణీయకం మూలాన రసోదంచితమని పేరెన్నిక గన్నది. ఈ పంచమ స్కంధాన్ని ‘సకలసుకవిజనానందకరం’గా సుజనమనోహరంగా ఆంధ్రీకరించి, చరిత్రలో పోతన్న గారి సహపంక్తికి నోచుకొన్న మహాకవి బొప్పరాజు గంగనామాత్యుడు నిజంగా ధన్యజీవి. శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించి, ఆ స్వామి వైభవప్రకాశనకు తన కవితను పరికరింపజేసి, పోతనగారి వలెనే తాను తరింపగోరి తెలుగు జాతిని తరింపజేసిన పుణ్యధను డాయన. ఈ కథాకథనముఖాన శృంగార వైరాగ్యాలకు ఆలవాలమైన మనువంశ రాజపురుషుల యొక్క జీవితసందేశబోధకు, విరాట్పురుషుడు కల్పించిన ఈ భువనకోశవర్ణనకు, పాపులకు గమ్యస్థానాలయిన నరకలోకాల వర్ణనకు అవకాశం లభించి భగవన్మహిమను, భగవల్లీలలను నోరారా వర్ణించి తన శిక్షణను, కారయిత్రీశక్తిని సార్థకం చేసుకొన్నాడు.

గంగనార్యుని పద్యశైలి మనోహరంగా ఉంటుంది. అనువాదం మూలానికి అత్యంతవిధేయం. ఎక్కడైనా వ్యాఖ్యానసాపేక్షములైన దళాలు కనిపిస్తే వాటిని శ్రీధరస్వామి భావార్థదీపికా వ్యాఖ్యను అనుసరించి తెలుగు చేశాడు. శ్రీధరస్వామి భావార్థదీపికలో లేకుండా – ఆ తర్వాత వెలసిన వీరరాఘవుని భాగవతచంద్రచంద్రికా వ్యాఖ్యలో మాత్రమే ఉన్న పంక్తులు కొన్ని గంగనార్యుని అనువాదంలో యథాతథంగా కానవస్తాయి. అవి తాళపత్రాలలో పూర్వకాలంలోనే చేరినవో లేక ఎవరో ఇటీవలి కాలంలో చేర్చినవో వ్రాతప్రతులన్నింటినీ పరిశీలించితే కాని నిర్ధారించటం సాధ్యం కాదు.

అనువాదపద్ధతిని చూస్తే గంగనార్యునికి తన కథాకథననైపుణిని, పద్యనిర్మాణకౌశలాన్ని ప్రదర్శించటం కంటె సన్నివేశాన్ని సుభగంగా నడుపుకొని పోవడమే సమ్మతమని అనిపిస్తుంది. పోతనగారి వలె సంస్కృతానికి సమసంస్కృతంగా, వ్యాఖ్యలను మించిన వ్యాఖ్యగా పద్యాన్ని కదను తొక్కించాలనే అభినివేశం ఉన్నవాడు కాదు. అందువల్ల సాత్త్వికమైన మార్గాన్ని ఆశ్రయించి ధారాళమైన ధారాకౌశలంతో కథను సరసంగా సంక్షేపించాడు. వేదాంతఘట్టాలలో కొంత తొట్రుపాటున్నప్పటికీ శృంగారసన్నివేశంలో కూర్పు సరసంగానే కొలువు తీరింది. అప్రతీతపదాలతో ప్రౌఢమైన ప్రయోగాలను చేయటం కంటె మూలాన్ని సరళంగా తెలుగు చేయటమే ఆయన అభిమతం. అనువాదకళలో మారన, వెన్నెలకంటి సూరనల వలె పౌరాణిక కవుల కోవకు చెందినవాడు.

1. గంగనామాత్యుని జీవిత విశేషాలు
తెలుగు కవులలో పెక్కుమంది వలెనే గంగనామాత్యుని జీవితవిశేషాలేవీ చరిత్ర కెక్కలేదు. స్కంధాంతగద్యలలో — “ఇది శ్రీసకలసుకవిజనానందకర బొప్పనామాత్యపుత్త్ర గంగనార్యప్రణీతం బైన శ్రీమద్భాగవతమహాపురాణంబు నందు,” అని చెప్పుకొన్నదానిని బట్టి నియోగి బ్రాహ్మణుడని, బొప్పనామాత్యుల వారి తనయుడని మాత్రమే తెలుస్తున్నది. సకలసుకవిజనానందకరుడు కావటానికి ఏమేమి వ్రాశాడో మనకిప్పుడు తెలియదు. ఈయన నిజాము రాష్ట్రవాసి అని ఆంధ్రకవితరంగిణిలో చాగంటి శేషయ్యగారు ఊహించారు.

గంగన అన్నపేరు తెలంగాణంలోని నేటి ధర్మపురి చెంత పోతన్నగారికి శ్రీరామచంద్రప్రభువు సాక్షాత్కారం సిద్ధించి, శ్రీమహాభాగవతావరణకు కారణతీర్థమైన పుణ్యగంగనే సూచిస్తున్నదనీ, గంగనామాత్యుడు ఆ సమీపప్రాంతవాసి అనీ అక్కడి పెద్దలంటారు. బమ్మెర పోతనామాత్యులవారు దత్తమండలంలోని ఒంటిమిట్టకు చెందినవారని విశ్వసించిన విమర్శకులెవరూ ఈయన ప్రాంతీయతను గురించి చర్చింపలేదు. అంతమాత్రాన ఈ వివాదం పరిష్కృతమైనట్లు భావించటం సరికాదు. ఉభయవాదాలను ఇంకా సమీకరించి, నిజాన్ని నిగ్గు తేల్చవలసి ఉన్నది. భాగవతకవులు తెలంగాణానికే చెందినవారయినా, రెండు ప్రాంతాలలో సంచరించి ఉండరని, ప్రాంతీయాభిమానాలు వట్టి నిరాధార కల్పనలని నిర్ణయించటం కష్టం.

ఇంతవఱకు సాహిత్య చరిత్రకారులు గంగనార్యుని కాలాదికం నిర్ణయించేందుకు సాధనాలేవీ చూపలేదు. ఏకాదశ స్కంధాన్ని రచించిన వెలిగందల నారయకు తర్వాతి వాడని కొందఱు, షష్ఠస్కంధాన్ని రచించిన ఏర్చూరి సింగనకు సమకాలికుడని కొందఱు భావిస్తున్నారు. అయితే, వారెవరూ గుర్తింపని సాహిత్యికవిశేషం ఒకటున్నది. ఆ విశేషాన్ని వివరిస్తాను:

        1.1. గంగనార్యుడు – హరిభట్టు

గంగనార్యునికి అత్యంత సమీపకాలికుడైన మహాకవి హరిభట్టు రచించిన మత్స్యపురాణంలో, గంగనార్యుని పంచమ స్కంధ పద్యాన్ని పోలిన రచన ఒకటి కనుపిస్తుంది. మత్స్యపురాణం 1912లోనే అచ్చయినప్పటికీ అంత ప్రసిద్ధికి రానందువల్ల ఈ విషయం చరిత్రకారుల దృష్టికి రాలేదు. మత్స్యపురాణ – పంచమ స్కంధాలలోని ఆ పద్యాలు రెండింటినీ సరిపోల్చి, ఎవరు ఎవరికి అనుకర్తలో నిశ్చయింపగలిగితే ఈ చిక్కుముడి వీడుతుందని నా భావం.

ఆ రెండు పద్యాలనూ చూడండి –

గ్రైవేయకంకణాంగదహారకుండలప్రభ లలితస్ఫూర్తిఁ బరిఢవిల్ల
నవరత్నకీలితోన్నతకిరీటద్యుతు లాశావకాశంబు లలమికొనఁగఁ
గటివిలంబితహేమకాంచీవిలగ్నమై రాజితపీతాంబరంబు మెఱయ
శ్రీవత్సకౌస్తుభశ్రీరమాయుక్త మై తులసికాదామంబు తొంగలింప

నతిరయంబున గరుడవాహనసమేతుఁ
డగుచు విష్ణుండు శంఖచక్రాది విశ్రు
తాయుధంబుల ధరియించి యవనిపతికి
దక్షణంబున నచట బ్రత్యక్ష మయ్యె. — (హరిభట్టు మత్స్యపురాణము, 4-140)

ఇది హరిభట్టు మత్స్యపురాణంలోని పద్యం. కంఠసీమను దివ్యహారాలు, ముంజేతుల కంకణాలు, కాలి అందెలు, వక్షఃస్థలాన వెలలేని ముత్యాల దండలు, చెవులకు మకరకుండలాల వెలుగు శృంగారవిస్ఫురణతో అతిశయిస్తుండగా; నవరత్నాలు పొదిగిన సమున్నతమైన కిరీటము యొక్క దీధితులు ఎల్లదిక్కులను ఆవరింపగా; నెన్నడుమును ఆశ్రయించిన బంగరు మొలత్రాడుకు దీటుగా పసిమి వన్నె పట్టుపంచె మిరుమిట్లు గొలుపుతుండగా; భృగుమహర్షి కన్నుమిన్ను గానక తన్నినపుడు రొమ్మున తత్పదాఘాతరూపమై ఏర్పడిన శ్రీవత్సమనే మచ్చ, మునుపు దేవదానవులు క్షీరసముద్రాన్ని చిలికినపుడు ఆవిర్భవించిన కౌస్తుభరత్నం, ఆ కలశరత్నాకరం నుంచే వెలువడిన శ్రీదేవితో కూడి ఆయన వక్షోలంకృతమైన తులసీదళ మాలిక నూత్నవికాసమును పొందగా; శరణాగతరక్షణత్వరతో గరుత్మద్రథాన్ని అధిరోహించి శంఖచక్రాదులైన విఖ్యాతాయుధాలను చేతబట్టి ఆ క్షణమందే శ్రీమహావిష్ణువు భూమిపతి కన్నుల ముందు ప్రత్యక్షమైనాడు – అని భావం. ఇక పంచమ స్కంధంలో గంగనార్యుని పద్యాన్ని చూడండి:

అంత నావిష్కృతకాంతచతుర్భుజంబులును, బీతాంబరంబును వెలుంగ
శ్రీవత్సకౌస్తుభశ్రీరమాచిహ్నంబు లురమందు రమ్యమై యిరవుపడఁగ
శంఖచక్రగదాంబుజాతఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెఱయ
నతులితనవరత్నహాటకాంకితనూత్నఘనకిరీటద్యుతుల్ గడలుకొనఁగఁ

గర్ణకుండలకటిసూత్రకనకరత్న
హారకేయూరవరనూపురాదిభూష
ణముల భూషితుం డైన శ్రీనాయకుండు
దంపతుల కప్పు డెదురఁ బ్రత్యక్ష మయ్యె. — (గంగనార్యుని పంచమ స్కంధము, 1-43)

రెండు పద్యాలలోని వర్ణనాంశమూ ఒక్కటే. ఆర్తుల మ్రోల శరణాగతత్రాత అయిన శ్రీహరి సాక్షాత్కారం. హరిభట్టు పద్యంలోని “నవరత్నకిరీటోన్నతద్యుతు లాశావకాశంబు లలమికొనఁగ” అన్న పాదం గంగనార్యుని పంచమ స్కంధం లోని “అతులితనవరత్నహాటకాంకితనూత్నఘనకిరీటద్యుతుల్ కడలుకొనఁగ” అన్నదానికే పర్యాయం. హరిభట్టు పద్యంలోని “శ్రీవత్సకౌస్తుభశ్రీరమాయుక్తమై తులసికాదామంబు తొంగలింప” అన్న పాదం పంచమ స్కంధం లోని “శ్రీవత్సకౌస్తుభశ్రీరమాచిహ్నంబు లురమందు రమ్యమై ఇరవు పడఁగ” అన్నదానికి పూర్తిగా సమానం. హరిభట్టు పద్యంలోని “విష్ణుండు శంఖచక్రాదివిశ్రుతాయుధంబుల ధరియించి యవనిపతికి దక్షణంబున నచటఁ బ్రత్యక్ష మయ్యె” అన్న పాదం పంచమ స్కంధం లోని “కర్ణకుండల కటిసూత్ర కనకరత్నహారకేయూర వరనూపురాదిభూషణముల భూషితుండైన శ్రీనాయకుండు దంపతుల కప్పు డెదురఁ బ్రత్యక్ష మయ్యె” అన్న పరిసమాపక వాక్యానికి ప్రతిబింబన్యాయంగా సరిపోలి ఉన్నది. హరిభట్టు పద్యంలోని “శంఖచక్రాదివిశ్రుతాయుధంబుల ధరియించి” అన్న దళం కూడా “శంఖచక్రగదాంబుజాతఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెఱయ” అన్న పంచమ స్కంధ పద్యపాదం లోనిదే.

గంగనార్యుడు, హరిభట్టు రచించిన ఈ రెండు పద్యాలూ ఒకదానికొకటి ప్రతిబింబాలన్న విషయం వేరే చెప్పనక్కరలేదు.

గంగనార్యుని పద్యానికి మూలమైన సంస్కృత భాగవతంలో నాభి మహారాజు చేసిన యజ్ఞంలో వేదికపై శ్రీమహావిష్ణువు అవతరించినప్పటి వర్ణన ఆ సందర్భంలో ఈ విధంగా ఉన్నది:

వ. అథ హ త మావిష్కృతభుజయుగలద్వయం హిరణ్మయం పురుషవిశేషం కటికౌశేయాంబరధర మురసి విలసచ్ఛ్రీవత్సలలామం దరవరవనరుహవనమాలాచ్ఛూర్యమృతమణిగదాదిభి రుపలక్షితం స్ఫుటకిరణప్రవరమణిమయమకుటకుండలకటకకటిసూత్రహారకేయూరనూపురా ద్యంగభూషణవిభూషితం…” (అధ్యాయం 3; వచనం 3)

(అంతట నాభిరాజుకు యజ్ఞేశ్వరుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన సాలంకృత చతుర్భుజాలను కలిగి ఉన్నాడు. హిరణ్మయతేజస్సు ఉట్టిపడుతున్న పురుషోత్తమరూపంలో ఉన్నాడు. కటిదేశాన పసిమివన్నె పట్టుపంచెను ధరించాడు. రొమ్మున శ్రీవత్సచిహ్నం మెరుములీనుతున్నది. పాంచజన్య శంఖము, వైజయంతీ వనమాల, సుదర్శన చక్రము, కౌస్తుభ మణి, కౌమోదకీ గద అమృతాయమానంగా విరాజిల్లుతున్నాయి. కాంతులను విరజిమ్ముతున్న మణిమయకిరీటం, చెవులకు మకరకుండలాలు, దండకడియాలు, బాహుపురులు, బంగరు మొలత్రాడు, కాలి అందెలు మొదలైన అంగభూషణాలతో భూషితుడై ఉన్నాడు)

ఈ మూలంలోని “ఆవిష్కృతభుజయుగలద్వయం” అన్నదే గంగనార్యుని అనువాదనంలో “ఆవిష్కృతకాంతచతుర్భుజంబులు” అయింది. తక్కిన దళాలన్నీ సంస్కృతమూలాన్ని యథాతథంగా ఆవిష్కరిస్తున్నాయి. సంస్కృతాంధ్రాలు రెండింటిని సరిపోల్చితే గంగనార్యుని పద్యం భాగవత మూలానికి యథాతథానువాదమని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. మత్స్యపురాణంలో ఈ ఘట్టంలోని వర్ణన హరిభట్టు పద్యానికి మూలమని ఊహించేందుకు ఏ మాత్రం వీలులేకుండా ఉన్నది. అందువల్ల హరిభట్టు పద్యమే గంగనార్యుని పద్యానికి అనుసరణమని, మత్స్యపురాణ రచనాసమయంలో హరిభట్టు ముందు భాగవత పంచమ స్కంధ పద్యమే నిలిచి ఉన్నదని, గంగనార్యుని పద్యం హరిభట్టు పద్యానికి అనుకరణం కాదని, మనము నిశ్చయింపవచ్చును. హరిభట్టు గంగనార్యుని పై పద్యాన్ని అనుకరింప లేదని; భాగవతమూలాన్ని తానుకూడా పలుమార్లు చదివినందువల్ల అందులో తనకు నచ్చిన ఒక భాగాన్ని మెచ్చి స్వతంత్రంగా అనుసరించాడని వాదించేందుకు వీలులేకుండా ఉభయపద్యాల సంవాదశిల్పమే సాక్ష్యం ఇస్తున్నది. ఈ సాక్ష్యాన్ని బట్టి గంగనార్యుని కాలనిర్ణయం సాధ్యమవుతున్నది.

హరిభట్టు చేసిన మత్స్యపురాణం అనువాదం క్రీ.శ. 1525 నాటిదని, అంతకు మునుపు క్రీ.శ. 1500 నాటికే ఆయన ముందుగా భాగవతంలోని ఏకాదశ – ద్వాదశ స్కంధాలను; ఆ తర్వాత క్రీ.శ. 1520 ప్రాంతాల భాగవత షష్ఠ స్కంధాన్ని పూర్తిచేశాడని విమర్శకులు భావిస్తున్నారు. గంగనార్యుని పంచమ స్కంధం క్రీ.శ. 1500 నాటికి పూర్వమే వెలసి ఉన్నందువల్ల – దానిని చదువుకొన్న హరిభట్టు తన అనువాదానికి పంచమ స్కంధాన్ని చేపట్టక విడిచివేశాడని భావించటం సమంజసంగా ఉంటుంది. కనుక గంగనార్యుని కాలం హరిభట్టు ఏకాదశ స్కంధానువాదానికి కనీసం అయిదు లేదా పదేండ్ల మునుపు – అంటే, క్రీ.శ. 1490 నాటికి పూర్వం అవుతుంది. ఆ ప్రకారం బొప్పరాజు గంగనార్యుడే బమ్మెర పోతన గారికి అత్యంత సమీపకాలికుడు, సన్నిహితుడు అని స్పష్టపడుతున్నది.

పోతన గారి శ్రీమహాభాగవతం క్రీ.శ. 1480 నాటికి పాక్షికంగానైనా ఉత్సన్నమైపోయింది. 5, 6, 11, 12 స్కంధాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తక్కినవి అక్కడక్కడ పాడయ్యాయి. గంగనార్యునికి ఆ విషయం తెలిసి, పోతన గారి పంచమ స్కంధం ప్రతులు లోకంలో లేవని నిశ్చయించుకొన్నాకనే తన అనువాదయజ్ఞానికి ఉపక్రమించి ఉంటాడు. అందువల్ల పుణ్యగంగకు సమీపప్రాంతవాసి అని పెద్దలు భావించినది తర్కసహమే అవుతుంది. పోతన గారి అనువాదం కొంత పంచమ స్కంధంలో ఉన్నదని, గంగనార్యుడు కేవలం లుప్తపూరణం మాత్రమే చేశాడని, పంచమ స్కంధం పూర్తిగా గంగనార్యుని రచన కాకపోవచ్చునని చాగంటి శేషయ్యగారి వంటి కొందరు విమర్శకు లన్నారు. అది కేవలం ఊహ మాత్రమే. అందుకు ఎటువంటి ఆధారమూ లేదు. పోతన గారే తన శిష్యుడైన గంగనార్యునికి ఈ భాగాన్ని అప్పజెప్పి వ్రాయించి ఉండవచ్చుననటమూ భావ్యం కాదు. పోతన గారు అప్పజెప్పి ఉంటే, రచన స్వరూపం ఆయన పర్యవేక్షణలో సాగినట్లుగా లేదు. అంతేకాక పోతన్న గారి ఇతరస్కంధాలలోని పద్యాల అనుకరణలు – మరీ ముఖ్యంగా సప్తమ, అష్టమ స్కంధ పద్యాలకు అనుకరణలు ఇందులో కనుపిస్తాయి. అందువల్ల పోతన్న గారి భాగవతం పరిసమాప్తమై, వారు పరమపదించిన కొంతకాలానికి తర్వాతనే ఈ ఉత్సన్నపూరణం మొదలైనదని ఊహింపవచ్చును. ఈ పంచమ స్కంధం అనువాదానికి శ్రీకారం చుట్టేముందు గంగనార్యుడు తనకు లభించిన పోతన గారి భాగవత భాగాన్ని పూర్ణంగా భావగతం చేసుకొన్నాడు. గురుశిష్యులు ఏకకాలంలో రచనను కొనసాగించివుంటే అది సాధ్యం కాదు.

అందువల్ల క్రీస్తుశకం 1485 – 90ల నడిమి కాలంలో తన అనువాదాన్ని పూర్తిచేసే నాటికి సుమారు 50 – 55 సంవత్సరాల వాడనుకొంటే గంగనార్యుని జీవితకాలం స్థూలంగా క్రీ.శ. 1430(±) – 1490(±) అని నిర్ణయించటం సమంజసంగా ఉంటుంది.
-----------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment