Sunday, July 15, 2018

విశ్వగుణాదర్శ కావ్యపరిచయం


విశ్వగుణాదర్శ కావ్యపరిచయం





సాహితీమిత్రులారా!



పదిహేడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో చాలా మార్పులు వచ్చాయి. నిజానికి ఈ మార్పులు అంతకుముందు నుంచీ జరుగుతున్నా, పదిహేడో శతాబ్దంలో ఇవి నిబ్బరంగా ఉధృతంగా ఊపందుకున్నాయి.

అంతవరకూ సామాజికంగా పెద్ద ప్రాధాన్యత లేని కొన్ని కులాల వాళ్ళు ఈ కాలంలో ప్రధాన స్థానంలోకి వచ్చారు. ఈ కులాల వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఒకపక్క వ్యాపారంలో సమర్థులు, మరొకపక్క యుద్ధంలో వీరులు. వీళ్ళు ప్రముఖులై దక్షిణదేశంలో (ఇప్పటి తమిళనాడులో) రాజ్యాధికారం సంపాదించుకున్నారు. నాయక రాజ్యం వీరి రాజ్యమే. అప్పటి సామాజిక వర్గీకరణ రీత్యా వీళ్ళు ఎడమచేతి కులాలు అనే విభాగంలో చేరతారు. భూమి ప్రధానమైన ఆస్తిగా, భూమి మీద తమ ఆధిపత్యం ప్రధానమైన సామాజిక గౌరవంగా రాజకీయ ప్రాబల్యాన్ని పొందినవాళ్ళు కుడిచేతి కులాలనీ, వ్యాపారం ప్రధానంగా చేసుకున్నవాళ్ళు ఎడమచేతి కులాలనీ అప్పటి వాడుక. ఈ కులాల సంప్రదాయాలూ, ఆచారాలూ ఒకదానికొకటి విరుద్ధంగా ఉండేవి.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుగా విభజింపబడిన చాతుర్వర్ణ వ్యవస్థకి నిజంగా కులవ్యవస్థతో జన్యజనక సంబంధం లేదు. అసలు చాతుర్వర్ణ వ్యవస్థ ఎప్పుడూ జనబాహుళ్యం అనుసరించిన సామాజిక వ్యవస్థ కాదు. కాని సంస్కృతభావ ప్రపంచంలోనూ, శాస్త్రాలలోనూ, సాహిత్యంలోనూ దానికి బలమైన అస్తిత్వం ఉంది. అంచేత అదే మొదట ఏర్పడిన సామాజికవ్యవస్థ అనీ, దానిలోంచే కుల వ్యవస్థ పుట్టిందనీ చాలామంది నమ్ముతారు. ఆ సంగతి ఎలా ఉన్నా, కులసమాజంలో పైకి ఎదగాలనుకునేవారి మనసుల్లో వర్ణవ్యవస్థ బలంగా ఉంది. కుడిచేతి కులాలలో మోతుబర్లు రాజ్యాధికారం చేతిలోకి రాగానే తమకన్నా కొన్ని తరాల ముందే వేదాధ్యయనాదుల వల్ల చాతుర్వర్ణ వ్యవస్థలోకి ఎదిగిన ‘పెద్ద బ్రాహ్మణుల’ సాయంతో క్షత్రియత్వాన్ని పొందడానికి ప్రయత్నించేవారు. స్థానికంగా ఉండి, పూజారి పనులు చేసే ‘చిన్న బ్రాహ్మణులు’ ఇందుకు పనికిరారు కాబట్టి వేదాధ్యయనం చేసే పెద్ద బ్రాహ్మణులని పైనుంచి రప్పించి వారికి అగ్రహారాలు ఇచ్చి తమ రాజ్యంలో నివాసం ఏర్పరచేవారు. (కులవ్యవస్థలో ఉండి పూజారి పనులు చేసేవారినీ, వర్ణ వ్యవస్థలోకి ఎదిగి వేదాధ్యయనం చేసేవారినీ, ఉమ్మడిగా బ్రాహ్మణులు అని వ్యవహరించడం వల్ల కలిగిన గందరగోళాన్ని నివారించడం కోసం ఈ పెద్ద బ్రాహ్మణులు, చిన్న బ్రాహ్మణులు అనే విభజన చేస్తున్నాను).

ఇది ఇలా ఉండగా, పదిహేడో శతాబ్దంలో ఎడమచేతి కులాలలో మోతుబర్లు కూడా రాజ్యాధికారం సంపాదించి రాజులయ్యారు. అయితే కుడిచేతి కులాలలోంచి వచ్చిన పూర్వపు రాజులకీ, ఈ ఎడమచేతి కులాల రాజులకీ పెద్ద తేడా ఉంది. ఎడమచేతి వాళ్ళుగా, ఈ రాజులు వర్తకులు కూడా. వర్తకులుగా వైశ్యులు కావలసిన వాళ్ళు రాజ్యాధికారం వల్ల రాజులు కూడా కావడంతో వైశ్య క్షత్రియత్వాలు ఒకచోట కలిసిపోయి, చాతుర్వర్ణ భావన కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడింది. దానితోపాటు, ఈ ఎడమచేతి కులాల రాజు తానే దేవుడిగా పూజలందుకున్నాడు. దేవాలయంలో దేవుడూ, రాజప్రాసాదంలో రాజూ, ఒకడుగానే భావించబడడంతో, రాజుకి క్షత్రియత్వమూ అవసరం లేకపోయింది. ఆ క్షత్రియత్వం ఇచ్చే బ్రాహ్మణుడూ అవసరం లేకపోయాడు.

ఇంతకుముందు రాజు దైవాంశ సంభూతుడే కాని దేవుడు కాడు. రాజే దేవుడైపోవడంతో, రాజుకి అందరూ – స్థానికంగా ఉన్న చిన్న బ్రాహ్మణులతో సహా – సేవకులు అయ్యారు. బ్రాహ్మణుడి స్థితి రాజుకి క్షత్రియత్వం ఇచ్చే ఉన్నతస్థాయి నుంచి రాజుకి సేవకుడయే కిందిస్థాయికి దిగజారింది. దీనితో పాటు రాజే వర్తకుడు కూడా కావడంతో, రాజ సంపాదనలో డబ్బుకు ప్రాధాన్యం వచ్చింది. అంటే రాజ్యంలో డబ్బుకు ప్రాధాన్యం వచ్చింది. అంతకుముందు భూమికి ప్రాధాన్యం, అంటే భూమి రూపంలో ఉన్న ఆస్తికి ప్రాధాన్యం వున్న సమాజంలో హెచ్చుతగ్గులు స్థిరంగా ఉండేవి. ఒకరు పుట్టిన కులం ద్వారా వారికి సమాజంలో స్థానం నిర్ణయమైపోయేది. భూమికి ఉన్న ప్రాధాన్యత తగ్గి డబ్బుకి ప్రాధాన్యత రావడంతో డబ్బు సంపాదించిన వాళ్ళకి సమాజంలో గౌరవం రావడం మొదలయింది.

డబ్బుకి ప్రాధాన్యం రావడం సమాజంలో పెద్ద మార్పుకి దారి తీసింది. స్వయంశక్తి వల్ల సంపాదించుకున్నది డబ్బు. ఆ డబ్బు సంపాదించుకున్న వాళ్ళు సమాజంలో ప్రముఖ స్థానంలోకి రావడం అంటే, పుట్టిన కులం వల్ల కాకుండా తన సొంత సామర్థ్యం వల్ల, మనిషి పైకి రావడానికి వీలు ఏర్పడిందన్నమాట. కులానికన్నా, గుణానికి విలువ పెరిగిందన్న మాట. దీనివల్ల అంతవరకూ తక్కువ కులాలుగా ఉన్నవాళ్ళు డబ్బు గడించి పైకి రావడానికి అవకాశం ఏర్పడింది.

వేసరపు జాతిగానీ
వీసము తా జేయనట్టి వీరిడి గానీ
దాసి కొడుకైనగానీ
కాసులు గలవాడె రాజు గదరా సుమతీ

అన్న సుమతీ శతక పద్యం ఈ కాలానిదే అని నిశ్చయంగా చెప్పలేను కానీ, ఆ కాలంలో ఇలాంటి మాటలు పెద్ద కులాలవారు, ఈ కొత్తగా పైకొస్తున్న కులాల మనుషుల్ని గురించి అనుకుంటూ వుండేవారనే అనుకుంటాను.

ఇది సమాజంలో చాలా పెద్ద మార్పు. ఇలాంటి మార్పు అప్పటి మనుషుల్లో వారి స్థితిని బట్టి, అలజడినో, ఆశనో, ఉత్సాహాన్నో, నిర్వేదాన్నో కలిగిస్తూ వుండి వుండాలి. అలాంటి కాలంలో వేంకటాధ్వరి రాసిన పుస్తకం ఈ విశ్వగుణాదర్శం.

ఈ పుస్తకంలో ఒకపక్క తురుష్కులు, మరొకపక్క పాశ్చాత్యులు, అనేక స్వదేశీ కులాలవాళ్ళు, రోజులు మారుతున్నందుకు విచారిస్తున్న వాళ్ళు, మారుతున్నందుకు సంతోషిస్తున్న వాళ్ళు – వీరందరి ప్రసక్తీ వస్తుంది.

ఆకాశంలోకి ఎగిరి అక్కణ్ణుంచి భూమి మీద జరుగుతున్న మార్పుల గురించి వ్యాఖ్యానాలు చేసే ఇద్దరు గంధర్వుల్ని పాత్రలు చేసి, వాళ్ళ మాటల ద్వారా మనకి ఆ సమాజాన్ని విహంగ వీక్షణం చేసే అవకాశం కల్పిస్తాడు వేంకటాధ్వరి.

ఈ ఇద్దరు గంధర్వుల్లో విశ్వావసువు ఒకమాట చెప్తే, దానికి వ్యతిరేకంగా కృశానువు ఇంకో మాట అంటాడు. లోకంలో ఒక పరిస్థితిని గురించి ఒకే స్థిరమైన అభిప్రాయం వుండదనీ, దాన్ని ఇంకో కోణం నుంచి చూస్తే అది ఇంకోలా కనిపిస్తుందనీ, ఆధునికులు అనుకునే విమర్శనాత్మక దృక్పథం ఈనాటికే బలపడిందనీ, ఈ పుస్తకం మనకు గుర్తు చేస్తుంది.

ఉదాహరణకి-

హంత! సంతత మత్యంత దురిత నిరతాః
యవనా ఏవ తావదమీషు విషయేషు
ప్రాచుర్యతః పర్యటంతి పస్య సఖే!

అవనావతీత పవనాశ్వ శోభినో
భవ నాగశాయి భవ నావమర్దితః
యవనాశ్చరంతి భువనాతిభీషణాః (409)

తురకలు దేశమంతా తిరుగుతున్నారు. బ్రాహ్మణుల్నీ, దేవాలయాల్నీ ధ్వంసం చేస్తున్నారు అని కృశానువు అంటే, వెంటనే విశ్వావసువు:

సత్యమేవ మధ్యాప్యేతేషు తురుష్క యవననే ప్యనన్య
సాధారణ విక్రమే గుణమముం గృహాణ

అలా అనకు- వాళ్ళు ఎంత వీరులో చూడు, తురుష్కులు అనన్య సాధారణ విక్రమం కలవారు అని వాళ్ళలో సుగుణాలు మెచ్చుకుంటాడు.

ఆంగ్లేయులని కృశానువు

హూణాః కరుణాహీనా స్తృణవత్ బ్రాహ్మణ గణం నగణ యంతి
తేషాం దోషాః పారేవాచాం యే నాచరంతి శౌచమపి (410)

ఈ ఇంగ్లీషు వాళ్ళు దయలేని వాళ్ళు. బ్రాహ్మణుల్ని గడ్డిపోచల్లా చూస్తారు. వాళ్ళ దోషాలు చెప్పనలవి కాదు. వాళ్ళు శుభ్రంగా కూడా వుండరు, అని దూషిస్తే, విశ్వావసువు-

ప్రసహ్య న హరంత్యమీ
పరధనౌఘ మన్యాయతో
వదంతి న మృషావచో
విరచయంతి వస్త్వద్భుతం
యధావిధి కృతాగసాం
విదధతి స్వయం దండనం
గుణా నవగుణా కరేష్వపి
గృహాణ హూణే ష్వమూన్ (414)

వాళ్ళు పరుల డబ్బుని అన్యాయంగా తీసుకోరు. అబద్ధాలు చెప్పరు. అద్భుతమైన కొత్త కొత్త వస్తువులు తయారుచేస్తారు. తప్పు చేసిన వాళ్ళని చట్టప్రకారం దండిస్తారు. నువ్వు చెప్పిన అవగుణాలతో పాటు వాళ్ళలో ఈ సుగుణాలు కూడా వున్నాయి అంటాడు.

గ్రామగ్రామే నివసతి చిరా
త్స్వామిభావేన శూద్రో
భృత్యోభూత్వాపఠతి గణనాం
బ్రహ్మణ స్తస్య పార్శ్వే
వేదాధ్యాయీ సర ఇవ మరౌ
క్వాపి కశ్చిత్ యది స్యాత్
అత్రామత్రప్రకరకరణే
వర్తతేఽ సౌ నియుక్తః (219)

ఎక్కడపడితే అక్కడ శూద్రులు రాజరికం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర బ్రాహ్మణులు కరణీకం చేస్తూ, సేవకులుగా బతుకుతున్నారు. ఎక్కడేనా వేదం చదువుకున్న బ్రాహ్మడు ఒకడు ఎడారిలో మంచినీటి చెరువు లాగా వుంటే, వాడు అంటు గిన్నెలు తోముకుని బతుకుతున్నాడు, అని కృశానువు పడే బాధ ఆనాటి సమాజంలో అంతవరకూ శూద్రులుగా పరిగణించబడిన వాళ్ళు రాజులవడం, వేదాధ్యయనం చేసి రాజులకి క్షత్రియత్వం ఇచ్చే బ్రాహ్మణవర్గం క్షీణించడం, బ్రాహ్మణులు లౌకిక వృత్తులలో ప్రవేశించి రాజ సేవకులుగా తయారవడం – ఈ మార్పుని సూచిస్తుంది.

సంస్కృతంలో రాసిన ఈ గ్రంథంలో సంస్కృత భాషని ఈసడించడానికి కూడా ఈ గంధర్వులు జంకరు.

ఉపాదేయం ప్రాజ్ఞైరుచిత విషయం ద్రావిడవచో
వ్యయుక్తార్థం హేయం భవతి వచనం సంస్కృత మపి (364)

మంచి విషయమయితే ద్రావిడభాషలో ఉన్నా పరిగ్రహించవలసిందే, చెడ్డ విషయం సంస్కృతంలో చెప్పినా పరిహరించవలసిందేనని నిష్కర్షగా చెప్తాడు విశ్వావసువు.

శౌచత్యాగిషు హూణకాదిషు ధనం
శిష్టేషు చ క్లిష్టతాం
దుర్మేధస్సు ధరాధిపత్య మతులం
దక్షేషు భిక్షాటనం
లావణ్యం లలనాసు దుష్కులభవా
స్వగ్రాసు నీరూపతాం
కష్టం సృష్టవతా త్వయా హతవిథే
కిన్నామ లబ్ధం ఫలం (412)

లోకం అంతా చెడిపోతోంది, శుచీశుభ్రం లేని ఈ పాశ్చాత్యులకి బోలెడు డబ్బుంది. శిష్టులు దరిద్రులవుతున్నారు. అజ్ఞాని రాజవుతున్నాడు. చదువుకున్నవాడు అడుక్కు తింటున్నాడు. తక్కువ కులాల ఆడవాళ్ళు అందంగా పుడుతున్నారు. అగ్రకులాల వాళ్ళు అందవికారంగా వుంటున్నారు. ఓ బ్రహ్మా, నీ సృష్టి చూడు ఎంత ఘోరంగా వుందో అనే ఈ శ్లోకం ఆనాటి సమాజం పొందుతున్న విప్లవాత్మకమైన మార్పుల్నీ, అందువల్ల అగ్రకులాల్లో కలుగుతున్న అలజడినీ, స్పష్టంగా తెలియజేస్తుంది.

సంస్కృత సాహిత్యం కాలంతో పాటు మారుతోందనీ, ఆధునికం అనదగ్గ కొత్తదనాన్ని పరిగ్రహించి, తన కాలపు సమాజంలో విశేషాల్ని సవిమర్శకంగా ప్రపంచిస్తోందనీ చెప్పడానికి ఈ పుస్తకం మంచి ఉదాహరణ.

సాహిత్యంగా ఇది పరమ రమణీయమైన రచన. సాంప్రదాయిక సాహిత్య మర్యాదల్ని ఆధునికీకరిస్తూ, కొత్త మార్గాల్ని సంస్కృత సాహిత్యం అనుసరించగలదని వేంకటాధ్వరి తన వినూత్న ప్రక్రియ ద్వారా ప్రదర్శించాడీ గ్రంథం ద్వారా. ఒక భాష బతికి వుందా, చచ్చిపోయిందా అన్న విషయం భాషాగతమైనది కాదనీ, ఆ భాష వాడేవాళ్ళ సామర్థ్యానికి సంబంధించిన విషయమనీ బోధపడుతుంది ఈ పుస్తకం చదివితే.

ఇలాంటి పుస్తకం ఒకటి వుందని కూడా చాలామందికి తెలియని పరిస్థితిలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు దీనికి సమర్థమైన వ్యాఖ్య రాసి తెలుగువాళ్ళకి అందుబాటులోకి తెచ్చారు. ఆయనకి తెలుగువాళ్ళు చాలా కృతజ్ఞంగా వుంటారు.

ఈ పుస్తకానికి పంచాంగం దేవరాజ పెరుమాళ్ళయ్య గారు ప్రతిపదార్థం, తాత్పర్యం రాసి ప్రతీ శ్లోకానికీ తెలుగుపద్యంలో అనువాదం చేశారు. దీన్ని 1914లో ఆర్. వేంకటేశ్వర అండ్ కో., మద్రాసు, వారు ప్రచురించారు. ఇప్పుడీ పుస్తకం అచ్చులో దొరకదు. శ్రీకాంతశర్మ గారి వ్యాఖ్యానం దేవరాజ పెరుమాళ్ళయ్య గారి వ్యాఖ్యానం కన్నా ఎక్కువ వివరాలతో, పాండిత్య విశేషాలలో ఆసక్తి గలవారు చదువుకోడానికి వీలుగా వుంది.

పండితులకే పరిమితమైపోయిన పుస్తకాలకి తెలుగులో ప్రామాణికమైన ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ రావాలి. పండితులు తక్కువైపోయి, ఈ తరహా పుస్తకాలు మూలపడిపోయి, ఎవరికీ కొరుకుపడక, వాటిని వివరంగా చదువుకోడానికి ఆసక్తి వున్నవాళ్ళకి కూడా అవకాశం లేకపోయే దురవస్థ తెలుగులో ఏర్పడి చాలా కాలమైంది. పాత పుస్తకాలకు, రెండు తరాలకు పూర్వం రాయబడిన ప్రామాణిక వ్యాఖ్యలు ఇప్పుడు అచ్చులో దొరకవు. ఒకవేళ దొరికినా అవి ఈనాటి పాఠకులకి బోధపడవు. ఈ పరిస్థితిని సవరించి, పాత పుస్తకానికి ఇప్పటి తెలుగులో సంపూర్ణమైన వ్యాఖ్యలు రాయగలవారు ఎక్కువమంది లేరు.

ఇది ఇలా వుండగా, ఇప్పటి పాఠకులకి పాండిత్య విషయాలు అక్కరలేదనీ, అవన్నీ చాదస్తంగా చెప్పకుండా, మాటలు అర్ధమయేలాగా సరళమైన భాషలో రాస్తే సరిపోతుందని, ఒక ‘అపండిత వాదం’ చాలామంది చేయడం నేను విన్నాను. మనుచరిత్రకి ఇలాంటి వ్యాఖ్యానమే, జూలూరి అప్పయ్యగారి చేత, రాయించిన సీ. పీ. బ్రౌన్ ఈ వాదానికి ఆద్యుడు. పాత పుస్తకాలని సమర్ధులైన పండితుల దగ్గర కూలంకషంగా చదువుకున్న వాళ్ళు వున్న రోజుల్లో ఇలాంటి వాదం వల్ల లాభమే కానీ నష్టం వుండేది కాదు. పండితుల కొరత లేకుండా, తరం తర్వాత తరం పండితులు తయారవుతున్న దేశంలో పండిత వ్యాఖ్యలు నోటిమాటల్లో వుంటే ఎవరికీ ఇబ్బంది కూడా వుండేది కాదు. కానీ ఇవాళ తెలుగుదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి వుంది. పండితులు అనే జాతి దాదాపుగా నశించిపోయింది. ‘ఆముక్తమాల్యద’కి, ‘శృంగార నైషధాని’కి వ్యాఖ్యానం రాసిన వేదం వేంకటరాయ శాస్త్రి, ‘మనుచరిత్ర’కి, ‘ప్రభావతీ ప్రద్యుమ్నాని’కి వ్యాఖ్యానం రాసిన వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి లాంటి వాళ్ళు ఇప్పుడు లేరు. ఒకవేళ ఎక్కడైనా వున్నా వాళ్ళ చేత వ్యాఖ్యానాలు రాయించి ప్రచురించే వాళ్ళు కూడా లేరు.

ఆ పండితులకున్న విజ్ఞానం పాత కాలపు విలువల్ని పునరుద్ధరించేదనీ, అది ఈ కాలానికి అఖ్ఖర్లేదనీ, పైగా అది అభివృద్ధికి ఆటంకమనీ ఒక అభిప్రాయం, అవివేచితంగా ఆధునికుల మనసుల్లో చోటు చేసుకుంది. ఒకరకమైన విజ్ఞానాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రవృత్తినీ, ఆ విజ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే వివేకాన్నీ, ముద్దగా కలిపేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. ఉదాహరణకి, అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించే తార్కిక విజ్ఞానమూ, అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించడం వల్ల కలిగే జీవన ప్రవృత్తీ – ఈ రెండూ ఒకటి కావు. ఇందులో మొదటిది అద్వైత సిద్ధాంతాన్ని స్పష్టంగా బోధపరచుకోడానికి అవసరం. ఆ సిద్ధాంతాన్ని అన్వయించుకోగల సామర్ధ్యం ప్రతీ తరంలోనూ కొంతమందికైనా కావాలి. ఇక ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించే వాళ్ళు ఉండాలా అన్నది మనం నిర్ణయించువలసిన విషయం కాదు. ఆధునిక వ్యాఖ్యలలో ప్రతిపాదించవలసిన విషయమూ కాదు. పాత సిద్ధాంతాల మీద అనిష్టత వెర్రితలలు వేసి, అసలు ఆ పుస్తకాలను చదవగల సమర్ధతను ఈసడించుకొనే పరిస్థితి విజ్ఞానానికి ఉపయోగించదు. సాహిత్య గ్రంధాల విషయంలో కూడా ఇంతే.

ఈ పరిస్థితిని నివారించి అన్ని పుస్తకాలూ వైజ్ఞానికులకు అందుబాటులోకి తేవడానికి పూర్వగ్రంధాలకు ఇప్పటి భాషలో వ్యాఖ్యలు కావాలి. పైగా, ఆ వ్యాఖ్యలు ఆ పుస్తకాల్లోని క్లిష్టతను ఒదిలేసి సరళం చేసే అపండిత వ్యాఖ్యలుగా వుండకూడదు.

శ్రీకాంతశర్మ గారి వ్యాఖ్యానం ఈ అవసరాన్ని గుర్తించి రాసిన వ్యాఖ్యానం. ఇలాంటి పుస్తకం ప్రచురించే సంకల్పం తానా ప్రచురణ విభాగం వారికి కలగడం నిజంగా మెచ్చుకోదగిన విషయం. మామూలుగా ప్రచురణకర్తలు ప్రచురించే తరహా పుస్తకాలు కాకుండా, మంచి పుస్తకాలు, బాగా ప్రచురించాలని తానా అభిలాష. బాగా ప్రచురించాలనే ఊహ వెనకాతల వున్న పట్టుదల, ఈ పుస్తకం ప్రచురించడానికి అనుసరించిన పద్ధతిలో కనిపిస్తుంది. అచ్చులో ఈ పుస్తకం చూసిన వెంటనే పాఠకులు ఈ విషయాన్ని గ్రహిస్తారు. ఈ పుస్తకాన్ని ప్రచురించాలని ఎంచుకోవడం లోనూ, ప్రచురించిన పని లోనూ చూపించిన ప్రత్యేకత తెలుగు ప్రచురణ రంగంలో ఒక కొత్త మార్పుకి కారణం కావాలని ఆశిద్దాం.
-----------------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment