Sunday, May 26, 2019

అగ్రగామి సాహిత్యాచార్యుడు - పింగళి లక్ష్మీకాంతం


అగ్రగామి సాహిత్యాచార్యుడు - పింగళి లక్ష్మీకాంతం




సాహితీమిత్రులారా!

పింగళి లక్ష్మీకాంతం గారు తెలుగు సారస్వత ప్రపంచానికి పరిచయం చేయవలసిన పనిలేదు. కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా, వక్తగా, సాహిత్యాచార్యుడిగా వాసికెక్కిన వారు పింగళి లక్ష్మీకాంతం గారు. తెలుగు జాతికి - ఆంధ్ర సాహిత్య చరిత్రను అందించారు. పదహారు వందల ఏళ్ళ పాటు విలువడిన గ్రంధాలన్నీ చదివి, ఆకళించికుని సమగ్ర చరిత్ర వ్రాసి తెలుగు ప్రజలకు కానుకగా ఇచ్చారు పింగళి లక్ష్మీకాంతం గారు. తెలుగులో ఉద్దండ మహా పండితులుగా వెలిగారు. వారి జీవితానికి సార్ధకత ఏర్పరచుకున్నారు. చెళ్ళపిళ్ళ వారి శిష్యుడిగా తెలుగు నాట - అవధాన ప్రక్రియలు నిర్వహిస్తూ, తెనుగు భాషా ప్రవీణుడిగా నిలిచారు. సాహిత్యాచర్య వృత్తిలో ఉండి తన తెలుగు ఉనికితో అనేకానేక తెలుగు అధ్యాపకులను తీర్చి దిద్ది తెలుగు సాహిత్య, భాషా వికాసానికి తోడ్పడ్డారు.

తన సాహిత్య శిల్ప సమీక్ష గ్రంధంలో పాశ్చ్యాత్య కావ్య విమర్శ సిద్ధాంతాలకీ, భారతీయ అలంకారారిక సిద్ధాంతాలకీ వస్తుతహ వుండే భేద, సాధౄశ్యాలను వివరించారు లక్ష్మీకాంతం గారు. అంతే కాదు సాహిత్య కళ, కళలు, విద్యలు, కావ్యనిర్వచనము, కవిత్వము, చందస్సు, రసాన్వరూపము, సృంగార భేదములు, రసభాసము, భావకవిత్వము, వస్తుకవిత్వము, నాకటలక్షణములపై శీర్షికలు వ్రాసి అందించారు. వీరు రచించిన " సాహిత్య శిల్ప సమీక్ష " సాహిత్య విమర్శన గురించి తెలుసుకోవాలన్న వారు తప్పక చదవవలసిన గ్రంధం.

జననం, చదువు, కొలువు:

లక్ష్మీకాంతం గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆర్తమూరు లో జనవరి 10, 1894 న, ఓ సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి వెంకట రత్నం గారు, తల్లి కుటుంబమ్మ. లక్ష్మీకాంతం గారి పూర్వికులు పింగళి సూరన్న గారట. ప్రాధమిక విద్య, గూడూరు, రేపల్లె లో అభ్యసించి, బందరు నుండి బి ఏ పట్టా సాదించారు. కొంత కాలం " కాపియిస్ట్ " గా పనిచేశారు. తరువాత బందరు నోబెల్ స్కూల్ లో, నోబెల్ కాలేజి లో అధ్యాపకుడిగా పనిచేశారు. కొన్ని రోజులు మద్రాసు ఓరియంటల్ గ్రంధాలయంలో పరిశొధకుడిగా పనిచేశారు. 1931 నుండి 1949 వరకు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అధ్యక్షుకులుగా వ్యవహరించారు. తెలుగు, సంస్కృత భాషా బోదనకు ప్రణాలికలను రూపొందించారు. బి ఏ, ఎం ఏ విద్యార్ధులకు ఇతిహాసం, తెలుగు సాహిత్య విమర్సల గురించి బోదించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా విభాగానికి అధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. వీరి శిష్యులు తెలుగు నాట అనేక కళాశాలలో అధ్యాపకులుగా ఉన్నారు. లక్ష్మీకాంతం గారు, తిరుపతి వేంకటవ కవులలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి శిష్యులు.

కొంత కాలం ఆల్ ఇండియా రేడియో కి సాహిత్య సలహాదారుగా ఉన్నారు. ఈ తరుణంలో అనేక సంస్కృత రూపకాలను రూపొందించారు. 1954 లో లక్ష్మీకాంతం గారు కేంద్ర సాహిత్య అకాడమి కార్య నిర్వాహక సభ్యుడిగా వ్యవహరించారు. 1961 లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో ఆచార్యుడిగా చేరారు. 1968 నుండి తెలుగు అకాడమి కార్య నిర్వాహక సబ్యుడిగా, అకాడమిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. లక్ష్మీకాంతం గారు " అవధాన " ప్రక్రియలో కూడా చురుక్గా పాల్గొనేవారు.

కాటూరి వెంకటేశ్వరరావు గారితో కలసి కవిత్వం వ్రాస్తూ - పింగళి - కాటూరి జంట కవులు గా ప్రసిద్ధులైయ్యారు. "తొలకరి ", " సౌదర్యానందం " ఈ జంట కవుల రచనలు. " ఆంధ్ర సాహిత్య చరిత్ర " సంకలనం చేశి తెలుగు జాతికి అందించారు. ఆంధ్ర సాహిత్య చరిత్ర రచించి ఒక కొత్త ఒరవడి సృష్టించారు.

ఆంధ్ర సాహిత్య చరిత్ర:

ఆంధ్ర సాహిత్య చరిత్రను పది ప్రకరణలలో వివరించారు. అవి:

- ప్రజ్ఞాన్నయ్య యుగంలో కవిత్వార్భవము (1000 క్రీ. శ. వరకు)
- నన్నయ్య యుగము (1000-1100 క్రీ. శ. వరకు)
- శివకవి యుగము (1100-1225 క్రీ. శ. వరకు)
- తిక్కన్న యుగము (1225-1320 క్రీ. శ. వరకు)
- ఎర్రాన్న యుగము (1320-1400 క్రీ. శ. వరకు)
- శ్రీనాధ యుగము (1400-1500 క్రీ. శ. వరకు)
- శ్రీ కృష్ణ దేవరాయల యుగము (1500-1600 క్రీ. శ. వరకు)
- దఖినాంధ్ర (నాయక రాజ) యుగము (1600-1775 క్రీ. శ. వరకు)
- క్షీణ యుగము (1775-1875 క్రీ. శ. వరకు)
- ఆధునిక యుగమౌ (1875 క్రీ. శ. మొదలు)

సుప్రసిద్ధ సాహిత్యకారుడు - ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి కార్యదర్శి శ్రీ దేవులపల్లి రామానుజరావు ఈ పుస్తకానికి తొలి పలుకు వ్రాశారు. పింగళి లక్ష్మీకాంతం గారు ఎం ఏ విద్యార్ధులకు అనేక సంవత్సరాలు బోదిస్తూ తన అనుభవాలను క్రోడీకరిస్తూ ఈ గ్రంధాన్ని రూపొందించారు. తన కృతి సమర్పణలో లక్ష్మీకాంతం గారు ఇలా రాసారు:

ఇది జనించిన నలుబది యేండ్లనుండి
సరస సాహిత్య విజ్ఞాన సత్రమనుచు
ఆశ్రయింపని తెలుగు విద్యార్ధి లేడు
చొచ్చి చూడని తెల్గు వ్యాసుండు లేడు.

ఈ సంకలనంలో తెలుగు జాతి చరిత్రను ప్రస్తుతీకరించారు. ప్రజల భాష, ఆస్థాన భాష, ప్రాచీన భాషల గురించి వివరించారు. తెలుగు భాషా చరిత్ర లో తెనుగు ఎంత ప్రాచీన భాషో తెలుపుతూ 633 క్రీ. శ. లో జయసిమ్హ వల్లభుని కాలం నాటి " విప్పర్తి " శాసనము, మంగి దొరరాజు కాలం నాటి " లక్ష్మీపుర " శాసనం, 727 ఖ్రీ. శ. " అహదనకర " శాసనము - ఇలా అనేక శాసనాధారతో చరిత్రని పొందుపరిచారు.

నన్నయ్యకు పూర్వమే ఆంధ్రంలో మాత్రాగణ బద్ధములను, అక్షరగణ బద్ధములను ఆయన పద్యములు వ్రాయబడినవని ప్రత్యక్ష ప్రమాణాలతో, శాసనాల ఆధారముగా విస్లేషించి ఉదాహరించారు.

అరవం (తమిళం) లో " యాప్పిరంగన్ " అన్న చందశ్శస్త్రం (ఇది నన్నయ్యకు పూర్వము) లో వాంచయ్య అన్న తెలుగు లక్షణ వేత్త రచించిన గ్రంధం గురుంచి ప్రస్తావించారు. తెలుగు భాషకు చాళుక్య రాజుల సేవలను నిసితముగా విస్లేషించి వ్రాసారు. లక్ష్మీకాంతం గారికి చరిత్ర పట్ల ఎంతటి అపార అవగాహన ఉన్నదో అని చెప్పడనికి ఇది ఒక తార్కాణం.

కవితావిర్భవము నుండి సమకాలీన సాహిత్యం వరకు తెలిసిన మహాపండితుడు. మార్గ కవిత, దేశి కవిత (చాళుక్యుల నాటి పాలనలో), భారతాంధ్రీకరణ పద్ధతి, పల్కూరి సోమనాధుడు - వారి గ్రంధాల సమీక్ష, మత పరిస్థితి, భాషా పరిస్థితి, గోన బుద్ధారెడ్డి, చక్రపాణి రంగనాధుడు, నిర్వచనోత్తర రామాయణము, వర్ణలలు-చిత్రణము, భాషా సృష్టి, కేతన, కాచవిభుడు - విట్టలుడు, మంచన, మారన - మార్ఖండేయ పురాణము, ఎర్రాప్రగడ - రామాయణము, హరివంశము, లక్ష్మీ నరసిమ్హ పురాణము, భాస్కర రామాయణము, నాచన సోముడు - ఎర్రన్న సోమనలు, మహాకవి శ్రీనాధుని - నైషధీయ చరిత విమర్శ, అనువాధ పద్ధతి, హర విలాసము, భీమేశ్వర పురాణము, క్రీడాంభిరామము, కాశీ ఖండము, శివరాత్రి మహత్యము, పలనాటి వీర చరిత్ర, శ్రీనాధుని శైలి, (గురించి రాసారు), పఒతన - అనువాధ సరణి, భోగినీ దండకము, వీరభద్ర విజయము, జక్కన, అనంతామాత్యుడు, గౌరన మంత్రి, దగ్గుపల్లి దుగ్గన, పిల్లలమర్రి పిన వీరన్న, జైమినీ భారతము, దూబగుంట నారాయణ కవి, భైచరాజు వెంకటనాధుడు, పిడపర్తి సోమన, నంది మల్లయ్య - ఘంట సింగన, కొరవి గోపరాజు, వెన్నెలకంటి అన్నయ్య, ఇలా అనేక మంది గురుంచి, వారి రచనల గూర్చి విసిదీకరించారు తన గ్రంధంలో.

బసవపురాణం, శివతత్వసారము, సంగీత రత్నాకరం, పద్మావతీ దండకము, చంద్రననా దండకము, పద్మిణీ దండకం, విద్యావతీ దండకం, వీరభద్ర విజయము, విక్రమార్క చరిత్ర (జక్కన) - ఇలా తెలియని గ్రంధాలను కూడా వెలుగులోకి తెచ్చారు. అలానే కవులను కూడా పరిచయం చేశారు. వారిలో:

- చంద్ర కవి - మైసూరు రాజు కృష్ణ ప్రభువు ఆస్థాన కవి
- నుదురుపాటి సాంబన్న - పుదుపుకోట (పుదుప్కొట్టై) లోని తొండమాన్ ఆస్థాన కవి
- లక్ష్మీ దాస కవి
- గణపవరపు వెంకట కవి (విద్యావతీ దండకం) ఉన్నారు.

ఇలా, ప్రమాణంలో లేని వారినీ - వారి గ్రంధ విషయాలను వెలుగులోకి తెచ్చిన ఘనులు శ్రీ లక్ష్మీకాంతం గారు.

ఈ రచనలో మరో విషేషం ఉంది. అది ఏమిటీ అంటే - వ్రాత ప్రతులలో లేని పద్యాలను కూడ ఇందులో ప్రస్తుతీక్రించారు. అంటే ఈయన ఎన్నో గ్రంధాలను చదివి, వాటిలోని సూక్ష్మాలతో సహా రూపాంతరం చేశారు. ఉదాహరణకి విక్రమార్క చరిత్ర (జక్కన, వ్రాసినది) - ఈ గ్రంధాన్ని వెన్నెలకంటి సిద్ధన మంత్రికి అంకితమివ్వబడినది; ఇది 1423 - 1447 ఏ. డి. వరకూ విజయనగర రాజ్యమును పాలించిన ప్రౌడ దేవరాయల కాలనాటిదని తన పరిశొధనలో కనిపెట్టి, ఆ విషయాలను ఈ సంపుటంలో పొందుపరిచారు. అలానే శ్రీనాధునికి ముత్యాలశాలలో కనకాభిషేకము చేసిన విజయనగర ప్రభువు ప్రౌడ దేవరాయలే అన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.

శ్రీ లక్ష్మీకాంతం గారి ఇతర రచనా కృతులు:

- సాహిత్య శిల్ప సమీక్ష
- మధురాపండితరాజము
- గంగాలహరి
- తేజోలహరి
- అత్మాలహరి
- ఆంధ్ర వాంజ్మయ చరిత్ర
- గౌతమ వ్యసాలు
- నా రేడియో ప్రసంగాలు
- ఆల్ మెన్ ఆర్ బ్రదర్స్
- తొలకరి
- సౌందర్యానందం

తెలుగు జాతికి ఆంధ్ర సాహిత్య చరిత్రను అందించారు. పదహారు వందల ఏళ్ళ పాటు విలువడిన గ్రంధాలన్నీ చదివి, ఆకళించికుని సమగ్ర చరిత్ర వ్రాసి తెలుగు ప్రజలకు కానుకగా ఇచ్చారు పింగళి లక్ష్మీకాంతం గారు. తెలుగులో ఉద్దండ మహా పండితులుగా వెలిగారు. వారి జీవితానికి సార్ధకత ఏర్పరచుకున్నారు. చెళ్ళపిళ్ళ వారి శిష్యుడిగా తెలుగు నాట - అవధానిగా, తెనుగు భాషా ప్రవీణుడిగా నిలిచారు. ఆచర్య వృత్తిలో ఉండి తన తెలుగు ఉనికితో అనేకానేక తెలుగు అధ్యాపకులను తీర్చి దిద్ది తెలుగు సాహిత్య, భాషా వికాసానికి తోడ్పడ్డారు. 1972 లో, తన డెబ్బై ఏనిమిదవ ఏట స్వర్గస్తులైయ్యారు, కానీ వీరి గ్రంధం " ఆంధ్ర సాహిత్య చరిత్ర " తర తరాలకు తెలుగు భాషా ప్రాభవాన్ని చాటుతూనే ఉంటుంది.
--------------------------------------------------------
తెలుగు తేజోమూర్తులు 
నిర్వహణ : ఈరంకి వెంకట కామేశ్వర్    
సుజనరంజని సౌజన్యంతో

No comments:

Post a Comment