Monday, November 1, 2021

శతక పద్యం

 శతక పద్యం





సాహితీమిత్రులారా!



అయ్యలరాజు రామభద్రునికి ముత్తాత
అయిన అయ్యలరాజు తిప్పయ్య
కృత రఘువీరా జానకీనాయక శతకంలోని
ఈ పద్యం చూడండి-

రవిసూనున్ బరిమార్చి యింద్రసుతునిన్ రక్షించినా డందునో
రవిసూనున్ గృప నేలి యింద్రసుతు బోరం ద్రుంచినా డందునో
యివి నీయందును రెండునుం గలవు నీకేదిష్టమో చక్కగా
రవివంశాగ్రణి తెల్పగదవయ్య రఘువీరా జానకీనాయకా

సూర్యుని కుమారుని చంపి ఇంద్రకుమారుని
రక్షించినాడని అందునా
రవికుమారుని కృపతో నేలి
ఇంద్రకుమారుని యుద్ధంలో చంపినాడందునా
నీకేది ఇష్టమో చెప్పవయ్య ఓ రువంశ వీరుడా!
జానకీనాయకా! ఓ రామా! అని అడుగుతున్నాడు

ఇందులో రెండింటియందు రవికుమారుడు,
ఇంద్రకుమారుడు అని అనడంతో కొంత పురాణ
ఇతిహాస పరిజ్ఞానం అవసం ఏర్పడుతున్నది.

రామాయణంలో వాలి ఇంద్రుని కుమారుడు,
సుగ్రీవుడు సూర్యునికుమారుడు
ఇక్కడ ఇంద్రునికుమారుని చంపాడు.

భారతంలో అర్జునుడు ఇంద్రునికుమారుడు,
కర్ణుడు సూర్యునికుమారుడు ఇక్కడ
సూర్యకుమారుడైన కర్ణుని చంపించాడు

రెండూ నువ్వే చేశావుకదా
వీటిలో నీకేది ఇష్టమో చెప్పవయ్యా
ఓ శ్రీరామచంద్రా అంటున్నాడు కవి.
ఎలా చెప్పగలడు మరి

ఇలాగే తిక్కన ఒక ప్రశ్నవేశాడు
హరిహరనాథునికి -
ఓ ప్రభూ, నీకు అస్థిమాల ఇష్టమా,!
కౌస్తుభం ఇష్టమా!, కాలకూటం రుచిగా ఉంటుందా?
యశోదాదేవి చనుబాలు రుచిగా ఉంటాయా?
సెలవియ్యవయ్యా -
అని అంటే ఏది కాదంటాడు ఆయన.

No comments:

Post a Comment