Tuesday, February 2, 2021

నాతిగల బ్రహ్మచర్యము నా తరమా

 నాతిగల బ్రహ్మచర్యము నా తరమా



సాహితీమిత్రులారా!



నూజివీడు సంస్థానాధిపతి నారయప్పారావుతో

ఒక కరణముకవి ఈ పద్యం మొరపెట్టుకున్నాడట.

జమాబందీ సమయంలో కరణాలు చాలామంది

వచ్చి నూజివీడులో చాలా రోజులుండాల్సివచ్చేదట.

భూములకు సంబంధించిన రెవిన్యూ లెక్కల వివరాలు

అన్నీ జమాబందీలో తేల్చేవారు. అందుకు చాలకాలం పట్టేది.

 అప్పుడు పరస్థలనివాసంవలన తనకు కలిగిన ఇబ్బందిని

కవి ఈ చాటుపద్యంలో చెప్పాడు

శీతల స్నానంబును

భూతల శయనంబు నొంటిపూటశనంబున్

నాతిగల బ్రహ్మచర్యము

నా తరమా పూటగడప నారయభూపా!

ప్రతిరోజూ చన్నీళ్ళస్నానం,

నేలమీద నిద్రించటం,

ఒకపూట భోజనం,

భార్య ఉండికూడ బ్రహ్మచర్యాన్ని గడపటం

- ఈ పద్ధతితో రోజులు గడపటం

 నా వశంఅవుతుందా నారయప్రభూ! - అని భావం

No comments:

Post a Comment