Monday, July 27, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం




సాహితీమిత్రులారా!


శ్రీనాథుడు "ఫుల్లసరోజనేత్ర అల పూతన చన్నుల చేదుద్రావి" -
అనే పద్యం శ్రీకృష్ణునిమీద చెబితే
పెరంబూదూరు రాఘవాచార్యులుగారు
శంకరునిమీద ఈ పద్యం చెప్పాడు చూడండి.

గరళంబుం దిగ మింగినానని మహాగర్వంబుచే నుంటి వీ
వరయంగా మునగాల సీమ ఫలితం బై పేరు జెన్నొందుబం
దరు పొట్టీల ప్రసాదముం దినినమీ దన్ శ్రీధరాఖ్యుండవీ
కరణిన్మెక్కకపోతివేని బిరుదుల్గాల్పందగున్ శంకరా!

ఈ పద్యం నేటి తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా
చందుపట్ల గ్రామనివాసి అయివ
పెరంబూదూరు రాఘవాచార్యులు గారు
వారానికొకసారి కోరాడ ప్రాంతపు మునగాల
పరగణాలోని గంగిశెట్టి గూడెం(బరాఖత్ గూడెం) అనే
గ్రామంలోని దేవాలయ ఉత్సవయాజ్ఞీకానికి వెళ్ళినపుడు
అక్కడివారు వడ్డించిన అన్నం తినలేక వ్యంగ్యంగా చెప్పినది.

ఓ శంకరా! నీవు పూర్వం హాలాహలం మ్రింగినానని చాల గర్వంతో ఉన్నావు.
కాని ఈ మునగాల సీమలో పండే బందరు పొట్టీల(ఒకరకం బియ్యం) అన్నం తిని
హరించుకుంటే అప్పుడు నిన్ను శ్రీధరుడు (విషాన్ని ధరించినవాడు) అని పిలువచ్చు.
ఆ అన్నం తినలేకపోతే నీకున్న ఆ బిరుదులు కాల్చదగినవి గాని సార్ధకమైనవికావు -
అని వ్యంగ్యంగా హాస్యపూరితంగా చెప్పాడట.

No comments:

Post a Comment