Monday, September 5, 2016

చమత్కారం గణేశం


 చమత్కారం గణేశం



సాహితీమిత్రులారా!

సాహిత్యంలో కొన్ని గణేశ ప్రార్థనల్లోని
చమత్కారాలు ఇక్కడ చూడండి
                         
 అల్లసాని పెద్దన మనుచరిత్రలో చేసిన గణేశ ప్రార్థన పద్యం ఇది.
అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట దొండము నవ్వలి చన్గబళింపఁబోయి యా వంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి వే మృణాళాంకుర శంకనంటెడి గజాస్యునిఁగొల్తు నభీష్టసిద్ధికిన్

ఇది ఆంధ్రకవితా పితామహుని సృష్టి. ఇందులో ఆంధ్రకవితకు పితామహుడు
అంటే తాత కాదు పితామహుడు అంటే బ్రహ్మ అనిఅర్థం.
అంటే ఆంధ్రకవితకు బ్రహ్మ అయిన వాని సృష్టి
ఈ చమత్కార పద్యం.
దీని భావం కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణగారి
మాటల్లో విందాం.

అంకము, జేరి - తొడనెక్కి, తల్లితీసి తొడనెక్కించుకోలేదు. ఇతడే ఎక్కినాడు.
శైలతనయాస్తన దుగ్ధములు - తల్లి అయిన పార్వతి చనుబాలు. ఆమె కొండకూతురు. 
                                            ఆమె యందు స్తన్యసమృద్ధి ఎంత ఉండునో తెలియదు.
బాల్యాంక విచేష్టన్ - బాల్యమునకు చిహ్నమైన విశేషమైన చేష్టతో, శైశవము కాదు బాల్యం 
                             అంటే మకురుపాలు తాగుచున్నాడేమో.
తొండమున నవ్వలి చన్గబళింపఁబోయి - పిల్లలు పాలు త్రాగుతూ విడిగా ఉన్న చేతితో తల్లి రెండవ ఱొమ్మును  స్పృశించుదురు, పుణుకుదురు. ఈ చేష్టసరియే ఈ విఘ్నేశ్వరుడు తల్లి యొక్క రెండవ చన్ను తొండంతో గ్రహించబోతున్నాడు. తనకు చేయి   ఉన్నది కదా!
ఇది బాల్యాంక విచేష్టము కాదు.
ఏనుగు మొగము కలిగి  ఉన్నవాని లక్షణము.
అవ్వలి చన్ కబళింపఁబోయి -  కబళించుట అనగా తినుట, కబళము - ముద్ద,  
                                            చన్నును కబళింప బోవుటయేమి సరే!
ఆవంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి - వెదకినాడు కుచము కనిపించలేదు. హారముగా ఉన్న పాము  కనిపించింది. అహివల్లభుడే హారము. దానిని చూచినాడు. చూచినాడనగా తెలిసికొన్నాడని అర్థం. కాంచి అనకూడదు. అతడు అహివల్లభ హారముగా తెలిసికొనలేదు. అచట అహివల్లభ  హారము ఉండటంచేత అది               మృణాళాంకురం అనుకున్నాడు.  
మృణాళాంకురం- తామర యొక్కతూటి మొక్క.
అహివల్లభుడు అనగా వాసుకి. సర్పములకు రాజు. అతడు శివునికి ఆభరణం. అతన్ని మృణాళాంకురంగా అనుకోవడం ఎలా ఆవాసుకి శరీరం మహాదీర్ఘము, మహాస్థూలము అయి ఉండాలి. 
ఇది అర్థనారీశ్వర మూర్తి యొక్క వర్ణన. ఇతడు గజాస్యుడు ఏనుగు మొగంవాడు.
అభీష్టసిద్ధికై ఇతనిని కొలుచుటలో అతనియందభీష్టములు సమకూర్చు లక్షణములు లేవు.
అలాంటి లక్షణాలు వర్ణింపబడలేదు. వ్యుత్పత్తి చేత గజ శబ్దం అర్థం మదంకలది - అని. యదార్థం గ్రహించలేనిది. ఇది లోకం స్వభావం. ఈ లోకమే విఘ్నేశ్వరుని ముఖం. ఈ లోకం వట్టి భ్రాంతిమయం.  తెలిసికూడా వట్టి భ్రాంతి. అర్థనారీశ్వరుడు అనగా లోకము యొక్క మహాతత్వం. పుంజీభూతమై అట్టి దేవతా రూపం కట్టినాడు. పార్వతి, దుర్గ,ప్రకృతి - పంచభూతముల సమాహారం. పరమేశ్వరుడు ఈ పంచభూతముల యందు అభివ్యాప్తమైన చైతన్యం. ముఖ్యప్రాణం. విజ్ఞానమయ బ్రహ్మ మొదలైనవి కావచ్చు.  వారికి ముఖము మదముతో నిండిన కొడుకు పుట్టాడు. మదాన్ని మినహాయిస్తే వీడు పరమ చైతన్య స్వరూపం. అతనిని కూడా దేవతగా కన్పించి - మన మదం మనకు తగ్గరాదు - మన పనులు మనకు కావాలని అలాంటి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాము.
ఈ విధంగా సాగింది వివరణ విశ్వనాథవారి కావ్యపరీమళం (వ్యాససంపుటి) లో. 
=======>>>>>>>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<<<<<<<<<<=================

ఇదొక అరుదైన వింత గణపతి ప్రార్థన చూడండి.

అరుదుగ వామభాగలలనాకలనాచలనాత్ముఁడైన యా 
హరుగురుఁగాంచి తానును దదాకృతియౌగతి నేకదంతుఁడై
కరికరణీగుణంబులు మొగంబునఁ దాల్చి జగంబు లేలు నాం
తరకరుణాననాథు గణనాథు మరిద్గణనాథుఁ గొల్చెదన్
                                                            (కావ్యాలంకారసంగ్రహము -1-6)

తన తండ్రి అయిన ఈశ్వరుడు అర్థనారీశ్వరుడు
అంటే సగం పురుషభాగము సగం స్త్రీ భాగము కలవాడు.
అలాగే నేను కూడ  అర్థనారీశ్వరుడని ఈ రూపం ధరించాడట గణపతి.
అంటే గణపతి స్వరూపంలో ఒక భాగంలో దంతం ఉంటుంది
మరో భాగంలో దంతం ఉండదు అందుకే ఆయన్ను ఏకదంతుడంటారు.
ఏనుగుల విషయానికొస్తే దంతాలున్నది మగ ఏనుగు దాన్ని కరి అంటారు.
దంతాలు లేని దాన్ని కరణి(ఆడ ఏనుగు) అంటారు.
అందు వల్ల గణపతి ముఖంలో ధంతం ఉండేభాగం పురుషభాగం
అలాగే దంతంలేని భాగం స్త్రీభాగం.
కావున గణపతి కూడ అర్థనారీశ్వర తత్వం కలవాడే.
కావున తన తండ్రి ఈశ్వరునితో సమానుడు.
అటువంటి గణనాథుని నేను కొలుస్తానంటున్నాడు
మన కావ్యాలంకారసంగ్రహము(నరసభూపాలీయము)లో
భట్టుమూర్తి(రామరాజభూషణుడు)
.
ఈ భావన ఈయనకు ఎలావచ్చిందంటే ఈయనకు 8 శతాబ్దాల
ముందు ఉన్న మహాపండితుడు శివభక్తుడు అయిన
హలాయుధుడు అనే ఆయన కూర్చిన హలాయుధస్తవములో
ఇలాంటి భావన ఉన్న శ్లోకం ఉందట.
ఆ శ్లోకం

విఘ్నం నిఘ్నన్ ద్విరదవదన:  ప్రీతయేవో2స్తు నిత్యం
వామేకుంఠత్ ప్రకటిత బృహదక్షిణేస్థూల దంత:
య: శ్రీకంఠం పితరమునుయాశ్లిష్ట వామార్థదేహం
దృష్ట్వానూనం స్వయమపి దధావర్థనారీశ్వరత్వం

ఈ విషయం "గణపతి-తెలుగు సాహిత్యం" అనే వ్యాసంలో
నిడుదవోలు వెంకట్రావుగారు
భారతి మాసపత్రికలో వివరించారు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<


అప్పకవీయంలోని ఈ విఘ్నేశ్వర స్తుతి చూడండి.

తనయుని యొక్క యెత్తుననె దక్షజయు న్నిటలాక్షుఁడున్ముదం
బున నిరిచెక్కులుం గదిసి ముద్దు గొనంగ నొకింత నెమ్మొగం
బనువుగ వెన్కకుం దిగిచి యత్నవిహీనపరస్పరాస్యచుం
బనలు దల్లిదండ్రులకుఁ బన్నుగఁ గూర్చు గజాస్యు నెన్నెదన్
                                                                                   (1-22)

ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు
తమ కుమారుడైన గణపతిని
వారిద్దరిమధ్య కూర్చోబెట్టుకొని
ఇద్దరూ ఒకేమారు అతనిని ముద్దు
పెట్టుకోవాలనుకున్నారు.
తీరా వారట్లు ముద్దు పెట్టుకొనె సమయంలో
గణపతి తనముఖం క్రిందికి దించుకున్నాడు.
దానితో అనుకోకుండా పార్వతీ పరమేశ్వరులిద్దరూ,
ఏ ప్రయత్నం లేకుండానే, ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు.
ఆవిధంగా తల్లిదండ్రులను కూర్చిన గజాస్యుని
నేను ప్రార్థిస్తున్నాను
అంటున్నాడు
అప్పకవి.
ఈ పద్యం
ఎంత చమత్కారపూరితం!
ఎలాంటి ఊహ!
ఎంత నవీనం ఈ కల్పన.
మహాద్భుతం కదా!

(((((((((((((((((((((((((((((((((((((((((000000000000000000000000)))))))))))))))))))))))))))))))))))))))))))


శ్రీకాంతో మాతులోయస్య జననీ సర్వమంగళా
జనక: శంకరోదేవ: తం వందే కుంజరాననమ్

మామ లక్ష్మీకాంతుడు(విష్ణువు), తల్లి సర్వమంగళ(పార్వతీదేవి)
తండ్రి శుభములనుకూర్చే దేవుడు (శంకరుడు)
అయిన ఏనుగు మొగమువానికి నమస్కారం.

No comments:

Post a Comment