మూడు ముళ్ళు వేసేటప్పుడు జీవితానికి చిక్కుముళ్ళు వేసుకుంటున్నామని తెలియక మురిసిపోయి, ఆ తరువాత ఎంత ప్రమాదంలో పడ్డామో తెలుసుకుని జడిసిపోయి.. నోరెత్తలేక, చెవులు మూసుకోలేక, ముఖంతో నవ్వుతూ, మనసుతో ఏడుస్తూ, జీవితమనే బండికి ఎద్దులా మారి భార్యనే వెలకట్టలేని బరువును మహరాణిలా ఎక్కించుకుని, ఈడుస్తూ ఒగరుస్తూ జీవిస్తున్న ప్రతి భార్యాబాధిత భర్తకు ఈ అష్టకం అంకితం.
మనవి:
భార్య అనే రెండక్షరాల బ్రహ్మపదార్థం మీద నాకున్నవి భయభక్తులేగాని, మరొకటి కాదని సహృదయులైన భార్యలు, విధేయులైన వారి భర్తలు గమనించ ప్రార్థన.
ప్రథమం ఆవలింతంచ - ద్వితీయం కళ్లు ముయ్యడం - తృతీయం త్రుళ్ళిపడటం - చతుర్థం చెంపదెబ్బచ - పంచమం పారిపోవడం - ఇదీ ఒకప్పటి పురాణ ప్రవచన లక్షణమట. అంటే.. ప్రవచనకారుడు రాగాలు తీసుకుంటూ తన మానాన తాను పురాణం చెప్పుకుపోతుంటే.. ఆ పురాణం వినడానికి వచ్చిన వారు ముందు ఆవలింతలు తీస్తుంటారట. అటుపై మెల్లిగా నిద్రలోకి జారుకుంటూ కళ్ళు మూసుకుంటారట. ఇంతలో చిన్న శబ్దం వినిపించినా త్రుళ్ళిపడి లేస్తారట. ఆపై చెంప మీద వాలిన దోమను ఠపీ మని కొట్టుకుంటారట. ఇక చివరిగా ఇక్కడ కూర్చోవడం మా వల్ల కాదు బాబోయ్ అనుకుంటూ పారిపోతారట. ఈ మాటలు ఒకప్పటి ప్రవచనాల తీరుపై ఎవరో సంధించిన వ్యంగ్యాస్త్రం. అందుకే పురాణంలాగే పురాణ ప్రవచనకారులకు కూడా పంచలక్షణాలుండాలేమో అనిపిస్తుంటుంది. అవి..
ఒకటి.. రామాయణ భారత పురాణాదుల మీద, వేదవేదాంగాల మీద, సంపూర్ణమైన సాధికారత కలిగినవారై ఉండాలి.
రెండు.. పురాణసాహిత్యంలో పైకి అసంబద్ధంగా కనిపించే కొన్ని విషయాల అసలు రహస్యాలను ప్రామాణికంగా విశదీకరించగలిగిన ప్రజ్ఞాశాలురై ఉండాలి.
నాలుగు.. సందర్భోచితమైన హాస్యచతురత కలిగినవారై ఉండాలి.
అయిదు.. అన్నిటికన్నా ముఖ్యంగా ఉపాసనాబలం కలవారై ఉండాలి.
ఇవీ ఆ అయిదు లక్షణాలు. వాల్మీకిమహర్షి నారదమహర్షిని పదహారు మహోన్నత లక్షణాలు కలిగిన నరుడు ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడిగినప్పుడు, ఆ దేవర్షి.. అటువంటి వాడు ఉండటం దుర్లభమే కానీ.. ఒకే ఒక్కడు మాత్రం ఉన్నాడన్నాడు. అతడే మర్యాదాపురుషోత్తముడైన శ్రీరాముడు. అలానే మనం పైన చెప్పుకున్న అయిదు లక్షణాలూ కలిగిన ప్రవచనకర్త ఉండటం దుర్లభమే కానీ.. అటువంటి వారూ ఒక్కరున్నారు. ఆయనే పౌరాణిక సార్వభౌమునిగా పేరెన్నికగన్న మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారు. వారి ప్రవచనాల విశిష్టతను మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం.
మనలో చాలామందికి అప్పుడప్పుడూ వైరాగ్య భావన కలుగుతుంటుంది. ఆ సమయంలో ఇక ఏ పనీ చేయబుద్ధికాక, నిరాశానిస్పృహలు వచ్చేస్తుంటాయి. మనకే కాదు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తికి కూడా ఈ వైరాగ్య భావన కలిగింది. అయితే అది మనకు వచ్చేటటువంటి వైరాగ్యం కాదు. మనకి వైరాగ్యభావన సాధారణంగా మూడు సందర్భాలలో కలుగుతుంటుంది. అవి పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. అయితే రామచంద్రునకు కలిగింది ఏ కొద్దిసేపో ఉండే ఇలాంటి వైరాగ్యభావన కాదు. లోకాన్ని పరిశీలనగా చూసి, ఆత్మవిచారం చేయడం వల్ల కలిగిన వైరాగ్యం. అయితే స్వధర్మాన్ని ఆచరించే విషయంలో ఆయనకు కలిగిన సంశయం వల్ల ఈ వైరాగ్యభావన చింతగా మారింది. అటువంటి స్థితిలో ఉన్న శ్రీరామునకు వసిష్ఠ మహర్షి ఉపదేశించినదే ఈ యోగవాసిష్ఠం. దినినే వాసిష్ఠ రామాయణం అని, శ్రీవాసిష్ఠ గీత అని కూడా అంటారు. భగవద్గీతలో ఉన్న అనేక శ్లోకాలు ఈ యోగవాసిష్ఠంలోని శ్లోకాలను పోలి ఉంటాయి. వసిష్ఠ రామ సంవాదమైన ఈ యోగవాసిష్ఠాన్ని మొదట బ్రహ్మదేవుడు నిషధ పర్వతంపై మహర్షులకు బోధించాడు. ఆ తరువాతకాలంలో వాల్మీకి మహర్షి ఈ యోగవాసిష్ఠాన్ని తన శిష్యుడైన భరద్వాజునకు, ఆపై అరిష్ఠనేమి అనే మహారాజుకు బోధించాడు. 32 వేల శ్లోకాలు కల ఈ యోగవాసిష్ఠంలో ఆరు ప్రకరణాలున్నాయి. అవి.. వైరాగ్య ప్రకరణం, ముముక్షు ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, ఉపశమ ప్రకరణం, నిర్వాణ ప్రకరణం. ఏ ప్రకరణంలో ఏముందో ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం-
ధర్మసంస్థాపనార్థమై శ్రీకృష్ణపరమాత్మ ఈ భూమి మీద అవతరించి అర్జునుడిని మిషగా పెట్టి ఉపనిషత్ సారమైన భగవద్గీతను మనకు అనుగ్రహించాడు. అటుపై కొంతకాలానికి అవతారపరిసమాప్తి చేసి వైకుంఠానికి వెళ్లిపోయినా, భూలోకవాసుల మూఢత్వాన్ని గురించిన చింతమాత్రం స్వామికి అలానే ఉండిపోయింది. తన భర్త చింత చూసిన అమ్మవారు ఆనాడు స్వామి ఉపదేశించిన గీతాసారాన్ని భూలోకవాసులు ఆచరణలో పెట్టేలా చేయాలని సంకల్పించింది. అందుకోసమని తానే స్వయంగా ఈ భూమి మీద గోదాదేవి అన్నపేరుతో అయోనిజగా అవతరించింది. తిరుప్పావై అనే దివ్యప్రబంధాన్ని మనకు ప్రసాదించింది. 30 పాశురాల ఆ తిరుప్పావైలో ఏముందో ఈరోజు చెప్పుకుందాం.
సినారె చమక్కులు - సి. నారాయణరెడ్డి గారి చమత్కారములు
సాహితీమిత్రులారా!
“నేను పుట్టకముందే
నెత్తిమీద నీలితెర
కాళ్ళకింద ధూళిపొర”
అంటూ మొదలుపెట్టి సువిశాల విశ్వంభరను తన అక్షరాలలో మనకు సాక్షాత్కరింపజేసి, తెలుగు పాఠకలోకం ప్రణమిల్లుతుండగా, తాను జ్ఞానపీఠమెక్కిన కవితా ఘన జగజెట్టి మన సింగిరెడ్డి నారాయణరెడ్డి.
పగలే వెన్నెలలు కురిపించి జగములను ఊయలలూగించినా, రాక్షస స్త్రీతో చాంగురే బంగారు రాజా అంటూ హొయలు ఒలకబోయించినా, గున్నమామిడి కొమ్మమీదున్న రెండు గూళ్ళ గురించి బాలమిత్రులతో ముద్దుముద్దుగా పలికించినా, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం అని ప్రబోధించినా, నల్లని రాళ్ళలో దాగిన కన్నులకోసం, బండల మాటున మ్రోగిన గుండెలకోసం వివరించినా, వస్తాడు నా రాజు ఈరోజు అంటూ విరహగీతాలు ఆలపింపజేసినా, ఎంతటి రసికుడవో తెలిసెరా అంటూ కవ్వింపు నాట్యాలు చేయించినా, సుయోధన సార్వభౌముడితో చిత్రం భళారె విచిత్రం అంటూ యుగళగీతం పాడించినా, తాండ్రపాపారాయుడికి అభినందన మందారమాలలు వేయించినా, వటపత్రశాయికి వరహాలలాలి పాడుతూ జోకొట్టి నిద్రబుచ్చినా అది సినారె గారికే చెల్లుతుంది. అందుకే..
ఆ పెదవి మెదిపితే ఆణిముత్తెపు జల్లు
ఆ కలము కదిపితే అందాల హరివిల్లు
అయన కలం “బంగారు కడ్డి”
అయన పేరు “నారాయణరెడ్డి”
అంటూ సినారె గారి గురించి మృదుమధురంగా కవితాగానం చేశారు మన మధురకవి కరుణశ్రీ గారు. జగమెరిగిన నారాయణరెడ్డి గారి, పాటల్లో మెరుపుల గురించి, మనం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. అందుకే ఈరోజు ఆయన మాటల్లో విరుపుల కోసం కాసింత చెప్పుకుందాం. ఇక ఈనాటి సినారె చమక్కుల్లోకి ప్రవేశిద్దాం.
కలియుగ భీముడు ‘కోడి రామ్మూర్తి నాయుడు’గారి జీవిత కథ| చేసిన విన్యాసాలు
సాహితీమిత్రులారా!
సంజీవనీ పర్వతాన్ని అమాంతం పైకెత్తి అవలీలగా దానిని యుద్ధభూమికి చేర్చిన హనుమంతుని గురించీ, తన పిడిగుద్దులతో బకాసురుడు, హిడింబాసురుడు వంటి రాక్షసుల్ని నుజ్జునుజ్జు చేసి చంపిన భీమసేనుడి గురించీ మనం బోలెడన్ని కథలు చెప్పుకుంటూ ఉంటాం. ఎంతకాదన్నా మహాబలులు, సింహబలులు అంటే మనకు తెలియకుండానే ఏదో అభిమానం ఉంటుంది. మరి అలాంటి బలశాలురు కేవలం ప్రాచీన కాలంలోనే ఉండేవారా? అంటే.. కాదు. మనకాలంలో కూడా ఉన్నారు. అందుకు ఉదాహరణే కలియుగ భీముడిగా, జగదేకమల్లునిగా పేరు గడంచిన కోడి రామమూర్తి నాయుడు గారు. ఆయన కథను, మహాబలుడిగా ఆయన చేసిన విన్యాసాలనే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం.
వాల్మీకి రామాయణానికి వచనంలో వచ్చిన ఉత్తమ తెలుగు అనువాదమేది?
సాహితీమిత్రులారా!
వాల్మీకి రామాయణాన్ని భక్తి ప్రపత్తులు కలిగిన ఎందరో పండితులు తెలుగులోకి అనువదించారు. శ్రీరామచంద్రమూర్తిని హృదయం నిండా నింపుకుని ఉండటం చేతనూ, రామకథ మీద ఉన్న అపారమైన ఆపేక్ష చేతనూ, నేను ఆ అనువాదాలలో ఎన్నింటినో చదివాను. అలా నేను చదివిన వచన అనువాదాలలో ఉత్తమస్థాయివని భావించిన వాటి వివరాలను మీతో పంచుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను. జై శ్రీరామ్!
తంత్ర అంటే టెక్నిక్. ఎలాంటి టెక్నిక్ అంటే.. మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకునేలా చేసే టెక్నిక్. ఈ తంత్రాల్లో రెండు రకాలున్నాయి. క్రియా తంత్రాలు, జ్ఞాన తంత్రాలు. మంత్రాలు, యంత్రాలు ఉపయోగించి చేసేవి క్రియా తంత్రాలు. అటువంటి వాటి అవసరం లేకుండా కేవలం మన బుద్ధిని మాత్రమే ఉపయోగించి చేసేవి.. జ్ఞాన తంత్రాలు. మనం చెప్పుకోబోయే విజ్ఞాన భైరవ తంత్ర అటువంటి జ్ఞానతంత్రమే. ఇది చాలా ప్రాచీనమైన తంత్రం. ఈ విజ్ఞాన భైరవ తంత్రాలో మొత్తం 112 టెక్నిక్స్ ఉన్నాయ్. ఇవన్నీ పరమశివుడు పార్వతీదేవికి చెప్పినవి. ఈ టెక్నిక్స్లో ఏదో ఒక టెక్నిక్ని సాధన చేసి.. మన ఆలోచనకు కూడా అందనంత గొప్ప స్థితిని చేరుకోవచ్చు. బుద్ధుడు కూడా ఈ 112 టెక్నిక్స్లో ఒకదానిని సాధనచేసే జ్ఞానోదయం పొందాడు. ఈ విజ్ఞాన భైరవ తంత్ర ఎలా పుట్టింది. ఈ తంత్రాన్ని సాధన చేయడానికి నియమాలేమన్నా ఉన్నాయా? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.
మన భరతభూమిలో పుట్టినవారిలో ఎందరో కవులున్నారు. మరెందరో తాత్త్వికులూ ఉన్నారు. అయితే మహాతాత్త్వికుడే కాకుండా, మహోత్కృష్ట కవి కూడా అయిన దైవాంశ సంభూతుడు మాత్రం ఒక్కరే ఉన్నారు. ఆసేతు హిమాచలం పాదచారియై పర్యటించి, అనేకరకాల అవైదిక మతాల ప్రభావంతో అస్తవ్యస్తమైన ఈ సమాజాన్ని, మళ్ళీ జ్ఞానమార్గం వైపు నడిపించినవాడు, దేశం నలుమూలలా ధర్మరక్షణకై నాలుగు పీఠాలు స్థాపించి, భరతజాతికి దిశానిర్దేశం చేసిన మహాపురుషుడు, “బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ న పరాః” - పరబ్రహ్మము మాత్రమే సత్యము, ఈ కనబడే జగత్తంతా మాయ. జీవాత్మ పరమాత్మ వేరువేరు కాదు. ఉన్నది ఒక్కటే పదార్థం - అంటూ అద్వైత సిద్ధాంతానికి అసలు సిసలు వ్యాఖ్యనం చేసిన అపరశంకరావతారుడు… జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యులు.
మనలో చాలామంది నిత్యం పారాయణ చేసే, కనకధారాస్తవం, భజగోవింద స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, శివపంచాక్షరీ స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, గణేశ పంచరత్న స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఇలా అనేక దైవప్రార్థనలకు కర్త మన ఆది శంకరుల వారే. ఇక శంకరులవారు తన కవిత్వాన్నంతా రంగరించి మనకు అందించిన అమృతపాత్రలు రెండు. అవి… ఒకటి శివానందలహరి. రెండవది… సౌందర్యలహరి.
అటువంటి సౌందర్యలహరి నుండి ఒక శ్లోకాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఈ శ్లోకంలో శంకరభగవత్పాదులవారు అమ్మవారి కళ్ళు పలికించే నవరసాల వర్ణన చేశారు. నిజానికి ఈ శ్లోకంలో కనబడేవి ఎనిమిది రసాలే. ఆ తొమ్మిదవ రసమైన శాంతము అన్నది జగన్మాత సహజస్థితిని సూచిస్తుంది.
“వీళ్ళెవరు” అనే ఈ కార్యక్రమంలో … “పురాణ పాత్రలు - కథలు” అనే ఉపశీర్షికలో ప్రత్యక్షనారాయణుడిగా కొలువబడే సూర్యభగవానుని గురించి, అతని కుటుంబం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.
మన ప్రాచీన కవుల దగ్గరనుండి నేటి ఆధునిక కవులు రచయితల పరిచయాలను సంగ్రహంగా పరిచయం చేయడానికి ప్రారంభించిన కార్యక్రమమే ఈ "మన కవులు రచయితల చిరు పరిచయాలు". అందులో భాగంగా ఈరోజు మనం కవి, కథకుడు, నవలా రచయిత, ఆచార్యుడు, కళా దర్శకుడు, పత్రికా సంపాదకుడూ అయిన అడవి బాపిరాజు గారి గురించి చెప్పుకుందాం.
ఈరోజు.. మన సాహిత్యంలోని చమత్కారాలనూ, మన సాహితీకారులు విసిరిన చమక్కులను చెప్పుకుని కాసేపు నవ్వుకుందాం. ఇలాంటి చమక్కులెన్నింటినో సేకరించి శ్రీరమణగారు “హాస్యజ్యోతి”గాను, ద్వానాశాస్త్రిగారు “తెలుగు సాహిత్యంలో హాస్యామృతం”గాను, ఆచార్య తిరుమల గారు “నవ్వుటద్దాలు” గాను, మృణాళిని గారు “తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు” గాను, ఇంకా ఎందరో ప్రసిద్ధులు మరెందరో ప్రఖ్యాతుల జీవితాలలోని చమత్కారఘట్టాలను సంకలనాలుగా చేసి మనకు అందించారు. అటువంటి సునిసితమైన హాస్య సన్నివేశాలను చదువుతున్నా, వింటున్నా మనసంతా తేలికపడి కాసింత హాయిగా ఉంటుంది. ఇది వరకు కూడా, మన అజగవలో “కడుపుబ్బా నవ్వించే ప్రముఖుల ఛలోక్తులు”, “శ్రీశ్రీ చమక్కులు”, “చురుక్కుమనిపించే విశ్వనాథ చమక్కులు”, “హాయిగా నవ్వించే సినీ ప్రముఖుల చమక్కులు” అనే శీర్షికలతో నాలుగు భాగాలుగా నవ్వుకున్నాం. మరోసారి నవ్వుకోవడానికి ఈ “ప్రముఖుల మాటలు - నవ్వుల మూటలు” భాగంలో ప్రవేశిద్దాం.
సృజనాత్మకతను, రచనా శక్తిని పెంపొందించే దేవీ అశ్వధాటీ స్తోత్రం, అర్థముతో సహా!
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ
అంటూ.. వాక్కు, అర్థము ఒకదానిని విడిచి, మరొకటి ఎలా ఉండలేవో, అలాంటి కలయికే కలిగి, అర్ధనారీశ్వర తత్వంతో విరాజిల్లే ఆ ఆదిదంపతులను, తనకు శబ్దార్థ జ్ఞానము అనుగ్రహించమంటూ, తన రఘువంశ మహాకావ్య ప్రారంభానికి ముందు, ప్రార్థించాడు, మహాకవి కాళిదాసు. ఇప్పటికీ ఎంతోమంది, తమ రచనలు ప్రారంభించే ముందు, ఈ శ్లోకాన్నే ప్రార్థనా శ్లోకంగా వాడటం పరిపాటి.
అలానే, వేరొక సందర్భంలో.. ఆ మహాకవి, తనకు ఆశుకవితాశక్తిని ప్రసాదించమంటూ, ఆ జగన్మాతను, అద్భుతమైన రీతలో స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం నడక ఎలా ఉండాలో, ముందుగానే కాళిదాసు నిశ్చయించుకోవడం వల్ల అశ్వధాటీ వృత్తంలో రచన సాగించాడు. అందుకే ఈ 13శ్లోకాల నడకలోనూ ఆ సొగసు, ధాటి కనబడుతుంది. పండితపామర జనరంజకమైన ఈ శ్లోకాలను చదువుతుంటే.. కవులైన వారికి, తమకూ ఇలాంటి రచన ఒకటి చెయ్యాలనిపిస్తుంది. పామరులకు ఇలాంటి స్తోత్రాలు మరిన్ని వినాలనిపిస్తుంది. మొత్తంగా చూస్తే.. అందరికీ ఈ స్తోత్రం హృదయోల్లాసాన్ని కలిగిస్తుంది. అలానే.. హృదయాన్ని అమ్మ పాదపద్మాలపై ఉంచి, ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల, ఆ జగదంబ అనుగ్రహం పరిపూర్ణంగా లభించి, ఆశుకవితా శక్తి కలుగుతుందన్నది ఋుషులవంటి మన పెద్దలు చెప్పినమాట. ముందుగా ఆ స్తోత్రాన్ని ఒకసారి చదువుకుని, తరువాత ఒక్కో శ్లోక భావాన్నీ సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఇక దేవీ అశ్వధాటి స్తోత్రాన్ని మొదలు పెడదాం..
అంటూ తాను వలచిన వనితను ఉబ్బేశాడో రసికుడు. నువ్వు తిడుతున్నా తియ్యగానే ఉంటుందని ప్రియుడు అంత మురిపెంగా అంటుంటే, పెదవుల్లో మధువులు కురిపించని ప్రేయసి ఉంటుందా. అలానే ఆమెకు ప్రియునిపై కోపమొచ్చి నీ సంగతేంటో తేలుస్తానాగు అన్నట్లుగా తన కొంగును నడుముకు బిగిస్తుంటే.. వెంటనే అతగాడు..
“నడుము బిగియించు చుంటివి నన్ను దునుమ
నాకు తెలియులే నీ కెంత నడుము కలదొ?” అన్నాడు తడుముకోకుండా. “నా మీద కోపంతో నడుం బిగిస్తున్నావ్ కానీ.. ఇంతకూ అసలు నీకు నడుమెక్కడుందీ” అని ఆ గాలిబ్ గీతాల కుర్రవాడు అంటుంటే ఆ జవ్వని పొంగిపోకుండా ఎలా ఉంటుంది. ఆమె కోపమంతా కరిగిపోక ఏం చేస్తుంది. అసలు మన కవులు పురుషుల్ని పొగిడినా, స్త్రీలను పొగిడినా ఈ నడుముని మాత్రం విడిచిపెట్టరు. ఇక ఆ తరునాత సంగతులు వినడానికి వీడియోలో ప్రవేశిద్దాం.
శృంగార నాయికలు - కావ్య నాయికలు - పద్మినీ జాతి మొదలైన స్త్రీజాతుల లక్షణాలు
సాహితీమిత్రులారా!
పద్మినీ, చిత్రిణీ, శంఖినీ. హస్తినీజాతి స్త్రీల లక్షణాలు
క్రితం భాగంలో మనం కావ్య శృంగార నాయకులలో ఉన్న విభాగాల గురించీ, పురుషులలో ఉన్న చతుర్విధ జాతుల గురించీ చెప్పుకున్నాం. ఈరోజు త్రివిధ కావ్యనాయికల గురించి అష్టవిధ శృంగారనాయికల గురించి, చతుర్విధ స్త్రీజాతుల గురించీ తెలుసుకుందాం.
కావ్య నాయికలు:
స్వీయ
పరకీయ
సామాన్య
ఇందులో స్వీయ మరలా మూడు విధములు..
ముగ్ధ
మధ్య
ప్రౌఢ
అలానే పరకీయ..
కన్య, అన్యోఢ అని రెండు విధములు.
శృంగార నాయికలు అష్ట విధములు:
స్వాధీనపతిక
వాసకసజ్జిక
విరహోత్కంఠిత
విప్రలబ్ధ
ఖండిత
కలహాంతరిత
ప్రోషితభర్తృక
అభిసారిక
స్త్రీ జాతులు నాలుగు:
పద్మిని - Padmini
చిత్రిణి - Chitrini
శంఖిని - Sankhini
హస్తిని - Hastini
మన సినిమాలలో హీరోలు పదిమందినో ఇరవైమందినో ఒక్కసారే చితక్కొట్టెయ్యగలరు. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే, బాధితుల పక్షాన నిలబడి పోరాడగలరు. తమవారి జోలికి ఎవరన్నా వస్తే వాళ్ళకు బుద్ధిచెప్పనూ గలరు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే వాళ్ళు మంచి మనసు కలిగి ఉంటారు. చాలా అందంగా కూడా ఉంటారు. అలానే హీరో కోసం ప్రాణాలివ్వడానికైనా వెనుకాడరు. ఇటువంటి లక్షణాలున్న హీరోహీరోయిన్లను మనం ఎంతగానో అభిమానిస్తాం. కొండొకచో ఆరాధిస్తుంటాం కూడా. అసలు మన ప్రాచీన కావ్యాలలోనూ, నాటకాల లోనూ కథానాయకునికి, కథానాయికకి ఉండవలసిన లక్షణాల గురించి ఏం చెప్పారు. నాయికా నాయకులలో ఎన్ని విభాగాలున్నాయి; మొదలైన వివరాలను ఈ నాయికలు - నాయకులు అనే రెండు భాగాలలో తెలుసుకుందాం.
ముందుగా ఈరోజు నాయకుల గురించి చెప్పుకుందాం.
ఆనాటి కాలంలో రాజుని విష్ణ్వంశ సంభూతుడిగానే ప్రజలు భావించేవారు. అతని గుణగణాలు, నడవడిక, జీవనవిధానం సామాన్య ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసేవి. అందుకే ఒక సామాన్యుని కథ కంటే, పరిపాలకుడైన ఒక రాజు చరిత్ర మీదనే ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ కారణం చేతనే కావ్యాలలోనూ, నాటకాలలోనూ ఆదర్శప్రాయుడైన రాజునే నాయకునిగా ఉంచి రచనలు చేసేవారు మన ప్రాచీన కవులు. అయితే చాలా కొద్ది కావ్యాలలో మాత్రం ఉత్తమలక్షణాలు కలిగిన ఇతర వర్ణములవారు కూడా నాయకులుగా ఉంటుండేవారు.
ఈరోజు మనం కావ్య, శృంగార నాయకుల కోసం, పురుషులలో జాతుల కోసం, నాయకులకు సహాయకుల కోసం చెప్పుకుందాం.
పొన్నియిన్ సెల్వన్ కు నన్నయ భారతానికీ ఉన్న సంబంధం ఏమిటి?
సాహితీమిత్రులారా!
క్రీ.శ. 955 ప్రాంతంలో తంజావూరుని రాజధానిగా చేసుకుని గండరాదిత్యచోళుడు చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు తన తమ్ముడైన అరింజయచోళునితో కలసి అధికారం పంచుకుంటూ పరిపాలన చేశాడు. ఈ గండరాదిత్యుని కొడుకు మధురాంతక ఉత్తమచోళుడు. అయితే గండరాదిత్యుడు, అరింజయచోళుడు మరణించాక, అరింజయుని కుమారుడైన సుందరచోళుడు సింహాసనమెక్కాడు. ఈ సుందరచోళునికి ఆదిత్య కరికాలన్, అరుణ్మోలివర్మన్ అనే ఇద్దరు కుమారులు, కుందవై అనే కుమార్తె పుట్టారు. సుందరచోళుని తరువాత చోళ సామ్రాజ్యానికి వారసుడు అతని పెద్ద కొడుకైన ఆదిత్యకరికాలన్. ఈ ఆదిత్య కరికాలన్ చాలా పరాక్రమశాలి. యుద్ధాలలో ఆరితేరినవాడు. పాండ్యరాజైన వీరపాండ్యుని యుద్ధంలో ఓడించి, పారిపోతున్న అతగాడిని వెంటాడి మరీ తల నరికాడు. ఆ సంఘటన పాండ్యదే శరాజభక్తుల రక్తాన్ని ఉడికించింది. ఎలా అయినాసరే ఆదిత్యకరికాలుని హత్యచేయాలని వాళ్ళు తీర్మానించుకున్నారు. మరోప్రక్క గండరాదిత్యుని కుమారుడైన మధురాంతక ఉత్తమచోళుడు కూడా తాను సింహాసనం ఎక్కడానికి పావులు కదపసాగాడు. మొత్తం మీద అనేక కుట్రల ఫలితంగా ఆదిత్యకరికాలన్ హత్య చేయబడ్డాడు. ఈ ఆదిత్య కరికాలన్ యువరాజుగానే కాక, రాజుగా కూడా కొద్దికాలంపాటూ రాజ్యపాలన చేశాడన్నది కొందరు చరిత్రకారుల అభిప్రాయం.
"మృచ్ఛకటికమ్" అన్నమాటను సంధిగా విడదీస్తే.. మృత్+శకటికమ్ అవుతుంది. మృత్ అంటే మట్టి అనీ, శకటికమ్ అంటే చిన్నబండి అనీ అర్థం. కనుక.. మృచ్ఛకటికమ్ అన్నమాటకు చిన్నబండి అనిఅర్థం. ఈ నాటకంలో రెండు కథలున్నాయి. ఒకటి.. వసంతసేన, చారుదత్తుల ప్రేమకథ అయితే.. రెండవది.. క్రూరుడైన రాజుపై ప్రజలు తిరుగుబాటు చేసి, ఒక గోపాలకుణ్ణి రాజును చేసే కథ. ఇక మనం కథలోకి ప్రవేశిద్దాం.
భారతదేశంలో పుట్టిన బౌద్ధం, చైనాలో పుట్టిన తావోయిజం కలసి జెన్ అనే ఒక అద్భుతమైన ధర్మం పుట్టిందన్నది పరిశోధకుల మాట. ఈ జెన్ బాగా ప్రాచుర్యం పొందింది మాత్రం జపాన్ దేశంలో. నిజానికి ఈ జెన్ అనేది ఒక మతం కాదు. ఒక జీవన విధానం. సూత్రాలూ, సిద్ధాంతాలతో దానికి పనిలేదు. జెన్ చేసే పని మనల్ని మనం తెలుసుకునేలా చేయడం. రేపటి గురించిన భయాన్నీ, నిన్నటి గురించిన బాధనూ తొలగించి వర్తమానంలోని ఆనందాన్ని మనం పొందేలా చేయడం. ఎంతో సరళంగా మనకు అర్థమయ్యేలా సత్యాన్ని బోధించే అనేక జెన్ కథలు లోకంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. అటువంటివాటిలో ఓ అయిదు కథల్ని ఈరోజు మనం చెప్పుకుందాం.
“విజ్ఞానాన్ని కలిగించేది విద్య - ఆనందాన్ని కలిగించేది కళ” అన్నారు మన పెద్దలు. అసలు ఆ మాటకొస్తే మనం నేర్చుకున్న విద్యను ప్రదర్శించడం కూడా ఒక కళే. ఉదాహరణకు వైద్యం వేర్చుకోవడం ఒక విద్య. నేర్చుకున్న ఆ వైద్యవిద్యతో రోగుల రోగాలను సరైన రీతిలో తగ్గించగలగడం ఒక కళ. ఒకే తరహా వైద్యవిద్య అభ్యసించినవాళ్ళు ఎందరో ఉంటారు. కానీ, వారిలో కొందరికే దానిని సమర్థవంతంగా ఉపయోగించే కళ అబ్బుతుంది. అలానే మిగిలిన విద్యలు కూడాను. సరే ఇక కళల్లోకి వద్దాం. “కవిత్వము, సంగీతము, చిత్రలేఖనము, విగ్రహ శిల్పము, నాట్యము” ఈ అయిదింటినీ లలిత కళలు అంటారు. వీటి గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. వీటిలో కవిత్వాన్ని, సంగీతాన్ని చరకళలనీ, చిత్రలేఖనము, విగ్రహ శిల్పము స్థిర కళలనీ, నాట్యము సమాహార కళ అనీ వ్యవహరిస్తూ ఉంటాం. మరి అయితే ఈ అరవై నాలుగు కళల సంగతేమిటి? ఈ కళలకు సంబంధించిన వివరాలు ఏ గ్రంథంలో ఉన్నాయి. ఈ అరవై నాలుగు కళల్లో ఏ కళ ఎందుకొరకు ఉపయోగపడుతుంది? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.
మనకు ఈ 64 కళల ప్రస్తావన వాత్స్యాయన కామశాస్త్రంలో కనబడుతుంది. అందులో మొదటి అధికరణమైన సాధారణాధికరణములో మూడవ అధ్యాయమైన విద్యాసముద్దేశములో ఈ చతుష్షష్టి కళల వివరణ ఇవ్వబడింది. ఈ 64 కళలనే మూల కళలు అని కూడా అంటారు. సుమారు 95 సంవత్సరాల క్రితమే ఈ వాత్స్యాయన కామసూత్రాలను శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు తెలుగులో అనువదించారు. ఆ గ్రంథంలో ఇవ్వబడిన ఈ అరవై నాలుగు కళలకు చక్కని వ్యాఖ్యానం కూడా చేశారు. ఇక ఆ అరవై నాలుగు కళలకు సంబంధించిన పాఠంలోకి వెళదాం.
వేదము అనే మాట విద్ అనే ధాతువు నుండి పుట్టింది. ఏది తెలుసుకుంటే మరేదీ తెలుసుకోవలసిన అవసరము లేదో ఆ పరిపూర్ణజ్ఞానమే వేదము. ప్రత్యక్ష ప్రమాణం చేతకానీ లేదా తర్కంచేత కానీ తెలుసుకోలేనటువంటి బ్రహ్మపదార్థాన్ని ఎలా తెలుసుకోవాలో ఈ వేదం చెబుతుంది. ఈ వేదాలనే శ్రుతులు అని కూడా పిలుస్తారు. అలానే వేదములకు భాష్యం వ్రాసిన సాయణాచార్యులవారు.. “ప్రతీజీవీ తనకు ఇష్టమైనవి పొందడానికి, ఇష్టములేనివాటిని తొలగించుకోవడానికి, మంత్రజపాలు, హోమాలూ వంటి అలౌకికములైన ఉపాయాలను తెలియజేసేదే వేదము” అన్నారు. “అనంతా వై వేదాః” అన్న మాటను బట్టి ఈ వేదములు అనంతములు. అలానే ఇవి అపౌరుషేయములు. అంటే ఒకరిచేత వ్రాయబడినవో, పుట్టించబడినవో కావు. వేదములు సాక్షాత్తూ పరమాత్మయొక్క నిశ్వాసము. ఆ అనంతమైన వేదాలనుండి అతి కొద్ది భాగాన్నే మన మహర్షులు గ్రహించి లోకకల్యాణం కోసమై మానవాళికి అనుగ్రహించారు. వేదవ్యాసుల వారు ఆ కొద్దిపాటి వేదభాగాన్నే బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అనే పేర్లతో విభజించి మనకందించారు. ఈ ఋుగ్, యజుర్, సామ, అథర్వ వేదాలనూ, వాటి శాఖలనూ ప్రచారంలోకి తీసుకురావడానికి వాటిని వరుసగా తన శిష్యులైన పైలునికీ, వైశంపాయనునికీ, జైమినికీ, సుమంతునికీ అప్పగించాడు. పూర్వం ఈ నాలుగు వేదాలకూ కలిపి 1131 శాఖలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటిలో కేవలం 7 శాఖలు మాత్రమే లభిస్తున్నాయి. అంటే మనకిప్పుడు లభిస్తున్న వేద విజ్ఞానం అసలులో ఒక్కశాతం కూడా కాదన్న మాట. ఈ వేదాలు మళ్ళీ మూడు భాగాలుగా ఉంటాయి. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము. వేదాల అంతరార్థాన్ని మంత్రాల రూపంలో చెప్పేవి సంహితలు. ఆ మంత్రాలలో ప్రతీ మాటకూ అర్థం చెప్పి, వాటిని యజ్ఞంలో సరైన రీతిలో వాడడానికి ఉపయోగపడేవి బ్రాహ్మణాలు. సంహితలోని మంత్రాలకు, బ్రాహ్మణాలలోని కర్మలకూ వెనుకనున్న అంతరార్థాన్ని వివవరించేవి అరణ్యకాలు. అంటే ఒక కర్మ ఎలా చెయ్యాలో అన్నదానికంటే కూడా అసలు ఆ కర్మ ఎందుకు చెయ్యాలి? అన్నదానినే.. ప్రధానంగా చెప్పేది అరణ్యకం. ఈ అరణ్యకాల చివరిలోనే ఉపనిషత్తులుంటాయి. వేదాలకు చివరిలో ఉండేవి కనుక వీటినే వేదాంతములు అని పిలుస్తారు. మొత్తంగా చూస్తే ఈ వేదాలను కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. సంహితలు, బ్రాహ్మణాలు కర్మకాండలోకి వస్తే.. ఉపనిషత్తులతో కూడిన అరణ్యకాలు జ్ఞానకాండలోనికి వస్తాయి.
కర్మకాండను అధ్యయనం చేసిన జైమినీ మహర్షి.. వేదములలో కర్మకాండ భాగమే గొప్పదన్నాడు. ఆయన చేసిన ఆ కర్మకాండ విశ్లేషణకే పూర్వమీమాంస శాస్త్రమని పేరు. అలానే జ్ఞానకాండను విశ్లేషించిన వేదవ్యాసుడు అదే వేదముల సారమన్నాడు. దానికే ఉత్తరమీమాంస అని పేరు. ఉపనిషత్తులతో పాటూ, బ్రహ్మసూత్రములు, భగవద్గీత కూడా ఉత్తరమీమాంసలోకే వస్తాయి.
వేదాల తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి యజ్ఞాలవంటి విధుల ద్వారా ఒక జీవనవిధానాన్ని చెబుతుంది కర్మకాండ. అలా చేయడం ద్వారా కొంతకాలానికి శరీరమూ, మనస్సూ శుద్ధి అవుతాయి. చిత్తశుద్ధి కలుగుతుంది. మన బుద్ధికి సత్యాన్ని గ్రహించే శక్తి లభిస్తుంది. అప్పుడు ఉపనిషత్తులను అధ్యయనం చేస్తే జీవాత్మ, పరమాత్మల అద్వైత స్థితి అనుభవంలోకి వస్తుంది. వేదముల పరమప్రయోజనం మానవుడు జీవన్ముక్తుడు అవ్వడమే, అంటే ఈలోకంలో ఉండగానే మోక్షాన్ని పొందడం. అప్పుడు మాత్రమే వేదాల సారమైన నాలుగు మహావాక్యాలు విశదమవుతాయి.
ఇక ఇప్పుడు నాలుగు వేదాల గురించీ సంగ్రహంగా చెప్పుకుందాం.
మహాకవి శ్రీశ్రీకి, కవిసమ్రాట్ విశ్వనాథకూ మధ్య ఎన్నో స్పర్థలుండేవనీ, ఒకరంటే ఒకరికి అస్సలు పడదనీ, సంప్రదాయవాదియైన విశ్వనాథకూ, విప్లవపంథా తొక్కిన శ్రీశ్రీకి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేదనీ చెబుతూ అనేక కథనాలు యూట్యూబ్ వీడియోల్లోను, ఫేస్బుక్ పోస్టుల్లోనూ దర్శనమిస్తుంటాయి. అసలు నిజంగా వారిద్దరి మధ్యా అంతటి శతృత్వం ఉండేదా? ఉంటే ఆ స్పర్థకు కారణాలేమిటి? అలానే వారు ఒకరినొకరు అభిమానించుకున్న సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే అవి ఏవి? మొదలైన విషయాలను ఈనాటి మన కవిసమ్రాట్టు మహాకవుల రాగద్వేషానుబంధం శీర్షికలో చెప్పుకుందాం.
మనం చదివే పుస్తకాల్లోనూ, చాలామంది ప్రముఖుల ప్రసంగాల్లోనూ కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అసలీ అర్థశాస్త్రంలో ఏముంది? ఇది కేవలం ధనానికి సంబంధించిన శాస్త్రమేనా? లేక మరేమన్నా విషయాలు ఇందులో ఉన్నాయా? అసలిది ఎంత పెద్ద గ్రంథం. ఈ గ్రంథాన్ని తెలుగులో చదవాలంటే ఇప్పుడు లభ్యమవుతుందా? ఇంతకీ ఈ చాణక్యుడు ఏ కాలం వాడు? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈనాటి మన కార్యక్రమం “కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఏముంది?”
ఈ భేతాళ కథలు గుణాఢ్యుడనే కవి రచించిన బృహత్కథలోనివి. ఈ బృహత్కథ సుమారు 2000 సంవత్సరాల క్రితం పైశాచీ ప్రాకృత భాషలో రాయబడింది. ఆ తరువాత 1000 సంవత్సరాలకు సోమదేవసూరి అనే కవి బృహత్కథలో కొంతభాగాన్ని కథాసరిత్సాగరం అన్న పేరుతో సంస్కృతంలో రాశాడు. అటుపై ఎంతోమంది రచయితలు వీటిని తెలుగులోకి అనువదించారు. మనకు చందమామ పత్రిలో కూడా భేతాళ కథలు ధారావాహికగా వచ్చేవి. కాకపోతే అవన్నీ కల్పిత కథలే. అంటే గుణాఢ్యుని కథలు కాదన్న మాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి మాత్రం 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన అసలైన భేతాళ కథలు. భేతాళ కథల్లో కనబడే రాజని మనం విక్రమార్కుడిగా చాలా చోట్ల చదువుకున్నాం కానీ.. నిజానికి మూలం ప్రకారం ఆ రాజు పేరు త్రివిక్రమసేనుడు. ఇక మనం “భేతాళపంచవింశతి”గా పిలవబడే భేతాళ కథల్లోకి ప్రవేశిద్దాం.
మన ఇతిహాసాల మీద, పురాణాల మీద ఎంతో గౌరవభావం ఉన్నవారిని కూడా కొన్ని ధర్మసందేహాలు ఇబ్బందిపెడుతుంటాయి. అటువాంటి వాటిలో ఒకటి ద్రౌపదీదేవి పంచపాండవులకు భార్యకావడం. ఒక స్త్రీకి అయిదుగురు భర్తలు ఉండటం సమంజసమేనా? అన్నది మనలో కొంతమందికి ఉన్న సందేహం. ఈ సందేహం మనబోటివారికే కాదు.. ద్రౌపదీదేవి తండ్రి అయిన ద్రుపదమహారాజుకి కూడా వచ్చింది. ఈ కథలో కాస్తంత వెనక్కు వెళితే.. ఇక వీడియో ద్వారా వినండి-
శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తి తల మీద పాదం ఉంచి, అతడిని రసాతలానికి పంపించివేశాడు. బలి సత్యసంధతకు మెచ్చి, రాబోయే మన్వంతరంలో అతనికి ఇంద్రత్వం కూడా ప్రసాదించాడు. అలా రసాతలంలో ఉండిపోయిన బలిచక్రవర్తిని, అనుకోకుండా కలుస్తాడు రావణుడు. అప్పుడు ఏం జరిగింది. రావణుడు ఎలా భంగపాటు చెందాడు, అన్న విషయాలకు సంబంధించిన కథ ఒకటి మనకు రామాయణం ఉత్తరకాండలో వస్తుంది. ఇక కథ వినండి-
కాశీమజిలీ కథలు 4 - శూరసేన మహారాజు కథ - కృష్ణదేవరాయల జనన కథ
సాహితీమిత్రులారా!
క్రిందటి భాగంలో మణిసిద్ధుడు కోటప్పకు కాశీమహిమ కోసం చెబుతూ, అందులో అంతర కథగా అగస్త్యుడు తన భార్య లోపాముద్రకు చెప్పిన శివశర్మ కథను చెప్పడం, ఆ తరువాత కోటప్ప మణిసిద్ధునితో కాశీప్రయాణానికి సిద్ధపడటం, కానీ తనకు కాశీవెళ్ళే దారిలో ఏ విషయం మీద సందేహం వచ్చినా ఆ వివరం చెప్పాలని షరతు విధించడం, ఆ తరువాత వాళ్ళు మొదటి మజిలీకి చేరుకోవడం, వంటకు కట్టెలు తేవడానికి వెళ్ళిన కోటప్ప ఆకాశంలో వెళుతున్న కీలురథాన్ని చూసి, దాని కథ చెప్పమని మణిసిద్ధుడిని అడగటం, సిద్ధుడు ఇచ్చిన మణి ప్రభావం వల్ల మణిసిద్ధుడికి ఆ కీలు రథం చరిత్రంతా తెలిసి, అది కోటప్పకు చెప్పడానికి సిద్ధపడటం వరకూ కథను చెప్పుకున్నాం. ఇప్పుడు మణిసిద్ధుడు కోటప్పకు చెప్పిన శూరసేన మహారాజు కథను చెప్పుకుందాం.
క్రితం భాగంలో మనం వింధ్యపర్వత గర్వాన్ని అణచి, లోకాలను కాపాడిన అగస్త్యులవారి కథను చెప్పుకున్నాం. ఆ తరువాత అగస్త్యులవారు భార్యా సమేతంగా దక్షిణదేశ పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ శ్రీశైలం వెళ్ళడం, అక్కడ లోపాముద్రాదేవి… శిఖర దర్శనమాత్రం చేత ముక్తినిచ్చే శ్రీశైలం కన్నా, మరణిస్తేనే ముక్తినిచ్చే కాశీ ఏవిధంగా గొప్పదని అడగడం. అందుకు అగస్త్యులవారు కాశీ గొప్పతనాన్ని తెలియజేసే శివశర్మ కథ చెప్పడానికి సిద్ధమవడం వరకూ కథ చెప్పుకున్నాం. ఇప్పుడు అగస్త్యుల వారు చెప్పిన శివశర్మ కథలోకి ప్రవేశిద్దాం.
మనుస్మృతి మీద జరిగినన్ని వాదోపవాదాలు మరే గ్రంథం మీదా జరగలేదు. ఇంతటి వివాదాస్పదమైన గ్రంథం ఇంకొకటి లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ గ్రంథం గురించిన చర్చ నడుస్తూనే ఉంటుంది. అసలు ఈ మనుస్మృతికి ఈ కాలపు సమాజానికీ సంబంధం ఉందా? మనువు స్త్రీల గురించి, శూద్రుల గురించి ఏం చెప్పాడు? అలానే మన హిందూ మతంలో అస్పృశ్యత, సతీసహగమనం లాంటివి ఉన్నాయా? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.
క్రితంభాగంలో మనం మణిసిద్ధుడి వృత్తాంతం, ఒక సిద్ధుడి ఉపదేశానుసారం అతను కాశీప్రయాణానికి సిద్ధమవడం. తనతో కాశీకి రావలసినదిగా ఒక పశువుల కాపరిని అడగటం. అందుకు అతగాడు కాశీ గొప్పతనం గురించి తనకు చెప్పమనీ, అది తనకు నచ్చితేనే వస్తాననడం. సరేనన్న మణిసిద్ధుడు కథ చెప్పడానికి ఉద్యుక్తుడవడం, వరకూ కథ చెప్పుకున్నాం. ఈరోజు మణిసిద్ధుడు ఆ గొల్లవానితో చెప్పిన కాశీ మహిమను గురించిన కథ చెప్పుకుందాం.
కథల్లో కాశీమజిలీ కథల అందం వేరు. ఈ కథల రచయిత మధిర సుబ్బన్న దీక్షిత కవి గారు. నిజానికి వివిధ ప్రాంతలలో జానపదులు చెప్పుకునే కాశీమజిలీ కథలను పోగేసి, వాటికి మరిన్ని కల్పనలు జోడించి, వాటన్నింటినీ కలిపి 12 సంపుటాలుగా తీసుకు వచ్చారు సుబ్బన్న దీక్షితులు గారు. ఈ విషయాన్ని క్రీ.శ. 1900లో అచ్చయిన తమ “కాశీమజిలీ కథలు” మొదటి సంపుటి పీఠికలో ఆయనే చెప్పుకొచ్చారు. అంటే మొదటి సంపుటి అచ్చయ్యి ఇప్పటికి 120 సంవత్సరాల పైమాటే అన్నమాట. అప్పటి పుస్తక భాష గ్రాంథికం కనుక, అది ఇప్పటి తరంలో అందరికీ అర్థమయ్యే అవకాశం చాలా తక్కువ కనుక, సరళమైన భాషలో, కథలో ఎటువంటి మార్పులూ చెయ్యకుండా, కుదిరినప్పుడల్లా, ఒక్కో కథా చెప్పుకుంటూ వెళతాను.
గుణనిధి అనే బ్రాహ్మణుడు మణిసిద్ధునిగా మారి, కోటప్ప అనే ఒక గొల్లపిల్లవాడిని వెంటబెట్టుకుని 360 మజిలీలతో కాశీ పట్టణాన్ని చేరుకుంటాడు. ఆ మజిలీలలో మణిసిద్ధుడు కోటప్పకు చెప్పిన కథలే ఈ కాశీమజిలీ కథలు. అద్భుతమైన కల్పనలు, మోతాదు మించని శృంగారం, కడపుబ్బా నవ్వించే హాస్యం, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే నాయికానాయకుల బుద్ధిచాతుర్యం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, ఇలా ఒకటేమిటి, నవరసాలూ మేళవించబడిన కథలివి. ఇంతమంచి కథలను మనకు అందించిన మధిర సుబ్బన్న దీక్షిత కవి గారికి నమస్కరించుకుంటూ… మనం కూడా కాశీమజిలీయాత్ర మొదలు పెడదాం.
ఈరోజు మనం చెప్పుకోబోతున్న కాఫీ దండకాన్ని రచించినది సంస్కృతాంధ్రాలలో మహా పండితుడైన శ్రీ పోకూరి కాశీపతి గారు. గద్వాల సంస్థానాధీసుడు ఈయనకు కవిసింహుడనే బిరుదునిచ్చి తన ఆస్థాన కవిగా నియమించుకున్నాడు. వీరికి నిఘంటువులన్నీ కంఠోపాఠంగా ఉండేవట. వీరు పండితుడే కాదు మంచి కవికూడా. కాశీపతిగారు సారంగధరీయమనే త్ర్యర్థి కావ్యాన్ని రచించారు. అంటే కావ్యంలో ఉన్న పద్యాలన్నీ మూడేసి అర్థాలను కలిగి ఉంటాయి. ఒకలా అర్థం చెప్పుకుంటే పార్వతీకళ్యాణం, ఇంకొకలా అర్థం చెప్పుకుంటే తారాశశాంకం, మరొకలా చూస్తే సారంగధరుని కథ వస్తుంది. ఈ కాశీపత్యావధానులు గారు గొప్ప శతావధాని కూడా. 1920 ప్రాంతంలో, అంటే ఇప్పటికి వందేళ్ళ క్రితం, ఆయన అప్పటి మద్రాసులో నగరంలో అష్టావధానం చేస్తున్నారట. అప్పుడు పృచ్ఛకులలో ఒకరైన తాపీధర్మారావుగారు పోకూరి కాశీపతి గారిని కాఫీపై దండకమొకటి ఆశువుగా చెప్పమన్నారట. అలా కాశీపతిగారు అప్పటికప్పుడు చెప్పిన ఆ కాఫీ దండకాన్నే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.
లంకాధిపతి అయిన రావణాసురుడు ఎలా ఉండేవాడు? ఎలాంటి దుస్తులు ధరించేవాడు. అతని వాహనం ఏమిటి? అతడిని మొదటిసారి చూసినప్పుడు హనుమంతుడు ఏమనుకున్నాడు? రావణుని చూడగానే రామచంద్రమూర్తికి ఎటువంటి భావన కలిగింది? మొదలైన విషయాల గురించి పరమ ప్రామాణికమైన వాల్మీకి రామాయణంలో ఏం చెప్పబడి ఉందో ఈరోజు చెప్పుకుందాం.
భాసో హాసః అంటూ కవితా కన్యకకు భాసమహాకవి దరహాసం వంటివాడని కీర్తించాడు జయదేవుడు. కాళిదాసభవభూతులకంటే పూర్వుడైన ఈ భాసుడు 24 రూపకాలు రచించినట్లుగా తెలుస్తోంది. కానీ అందులో 13 నాటకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటన్నింటిలోకీ ప్రతిమా నాటకం, చారుదత్తం, స్వప్న వాసవదత్తమనే నాటకాలు మరింత ప్రఖ్యాతి పొందాయి. ఈరోజు మనం స్వప్న వాసవదత్త నాటకం గురించి చెప్పుకుందాం. ఈ నాటకం గురించి చెప్పుకోవాలంటే మనం ముందుగా ప్రతితిజ్ఞాయోగంధరాయణమనే మరో భాసనాటకం గురించి కూజా కొద్దిగా చెప్పుకోవాలి. ఎందుకంటే స్వప్నవాసవదత్త నాటకం ఆ ప్రతిజ్ఞాయౌగంధిరాయణ నాటకానికి కొనసాగింపువంటిది.
కాళిదాసు భోజరాజు ఆస్థానంలో మొదటిసారి ప్రవేశించే సమయంలో కొందరు పండితులు అడ్డుపడతారు. వారికి బుద్ధి చెప్పడానికన్నట్టుగా నోరుతిరగడం కష్టమైన అయిదు పద్యాలను చెప్పి, వాటిని తిరిగి చెప్పమంటాడు కాళిదాసు. చదువుతుంటే మధ్యమధ్యలో నాలుక మడతపడేలా ఉండే ఆ పద్యాలు చెప్పలేక చేతులెత్తేస్తారు ఆ పండితులు. అలా కాళిదాసు ప్రతిభకు తార్కాణం నిలచిపోయాయా పద్యాలు. ఆ పద్యాల అర్థాల గురించి ఇంత వరకూ ఏ పుస్తకాలలోనూ రాలేదు కానీ, పిల్లలకు నోరు తిరగడానికి వాటిని భట్టీయం వేయించడం మాత్రం పూర్వపురోజుల్లో ఉండేదట. అలాంటి క్లిష్టమైన పద్యాలలో ఒకదానిని ఈరోజు మనం చెప్పుకుందాం. అంతేకాక అటువంటి కష్టమైన పద్యాన్ని చాలా సులువుగా ఎలా భట్టీయం వేసి అప్పచెప్పవచ్చో కూడా చెప్పుకుందాం. ముందుగా ఆ పద్యం.
ఇదీ ఆ పద్యం. మొదటి రెండు పాదాలూ కష్టం మీద పలకొచ్చుకానీ, మూడూ నాలుగు పాదాలను చూస్తే మాత్రం భయం వేస్తుంది. అయితే ఇటువంటి పద్యాలలో పలకడానికి కష్టంగా ఉన్న పదాలను విడదీసి వ్రాసుకుని చదివితే.. అప్పుడు మనకు సులభంగా నోరుతిరుగుతుంది. అటుపై ఆ పదాలనే వేగంగా పలకడం సాధన చేస్తే సరిపోతుంది. మనకు లెక్కల్లో కూడా చూడండి.. పదహారుని ఇరవైమూడుతో గుణిస్తే ఎంత అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి. మనం అప్పుడు ముందు మూడుతో పదహారుని గుణించి, ఆ తరువాత రెండుతో దుణించి, వాటిని ఒక క్రమ పద్ధతిలో వ్రాసి కూడతాం. కానీ అంతకన్నా సులువైన పద్ధతి ఒకటుంది. 23ని ఇరవైగా మూడుగా విడదీస్తే.. పదహారు ఇరవైలు 320, పదహారు మూళ్ళు 48. ఈ రెండూ కలిపితే 368. ఇలా చెయ్యాలన్నా కొంత సాధన చెయ్యాలి. కానీ ఈ విధానం అంతకు ముందు విధానం కన్నా సులభమైనది. అలానే పద్యం విషయంలో కూడా. ఈ పద్యాన్ని మనం ఇలా విడదీసి వ్రాసుకుందాం.
ఈరోజు మనం ఆధునిక కవులలో మహాకవులు అనదగ్గవారి చేతనే కైమోడ్పులు అందుకున్న మహోన్నత కవి, భావకవితా ప్రపంచపు రవి అయిన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవిత్వం గురించి మాట్లాడుకుందాం.
ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా తిరుగుతోంది. మన దేశంలో రాముణ్ణి పూజించేవాళ్ళకు, ద్వేషించేవాళ్ళకు లోటులేదుగా. అలా ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అందుకే ఆయనెప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటాడు. రాముణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి బాగుపడిన వాళ్ళూ ఉన్నారు. రాముణ్ణి తిడుతూ, ప్రచారంలోకి వచ్చి సంపాదించుకున్నవాళ్ళూ ఉన్నారు. అంటే వాళ్ళవీళ్ళకూ అందరికీ రాముడి వల్ల మంచే జరిగిందన్న మాట. అదే రామనామం గొప్పతనం. ఇక ఈ ప్రశ్నకు సమాధానంలోకి వెళదాం..
శ్రీరాముని వంశవృక్షం - రాముని పూర్వీకులు - రాముని వంశీకులు
సాహితీమిత్రులారా!
సూర్యవంశ రాజుల పరంపర మొదటి నుండి చివరి వరకూ!-
శ్రీరాముడు సూర్యవంశపు రాజనీ, పాండవులు చంద్రవంశ క్షత్రియులనీ, శ్రీకృష్ణుడు యందువంశ తిలకుడనీ ఇలా మనం పుస్తకాలలో చదువుతూ ఉంటాం. ప్రవచనాలలో వింటూనే ఉంటాం. అయితే ఈ వంశాలేమిటి? ఈ వంశాలలో ప్రసిద్ధులైన రాజులెవరు? ఎవరి తరువాత ఎవరు రాజ్యానికి వచ్చారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవడం మనకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మన భరతభూమిని పరిపాలించిన రాజుల పరంపర మీద అవగాననూ పెంపొందిస్తుంది. అందులో భాగంగా ఈరోజు మనం సూర్యవంశ రాజుల పరంపర కోసం చెప్పుకుందాం.
ఇందులో రామాయణంలో చెప్పబడిన సూర్యవంశ వర్ణన, భాగవతంలో చెప్పబడిన సూర్యవంశ వర్ణన కూడా వివరిస్తున్నాను.
మన అమ్మమ్మలూ నాయనమ్మలు భారతరామాయణాల నుండి, పురాణాలనుండీ ఎన్నో పిట్టకథలు చెప్పేవారు. సరదాగానూ చమత్కారంగానూ ఉండే ఆ చిన్నచిన్న కథలు నిజానికి మూలంలో ఉండేవి చాలా తక్కువ. అంటే వ్యాసుడు, వాల్మీకీ చెప్పినవి కావన్న మాట. కానీ అవన్నీ ఆయా పౌరాణిక పాత్రల గొప్పతనాన్ని చెప్పేవిగానో, భక్తిభావం కలిగించేవిగానో, సమాజానికి ఎదో ఒక మంచి సందేశాన్ని అందించేవిగానో ఉండటం వల్ల ఆ చిట్టిపొట్టి కథలు ఒక తరం నుండి మరొక తరానికి అందుతూనే ఉన్నాయి. మనలను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. అలాంటి కథలలో ఒక దానిని ఈరోజు చెప్పుకుందాం.
అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు ఈ ఏడుగురినీ సప్త చిరంజీవులంటారు. ఈ సప్త చిరంజీవులతో పాటూ మార్కండేయుని కూడా కలిపి నిత్యం స్మరించుకునేవారు సర్వవ్యాధులనుండీ రక్షణ కలిగి, అపమృత్యు భయంలేకుండా, నిండు నూరేళ్ళూ జీవిస్తారన్నది పెద్దలు చెప్పిన మాట. చిరంజీవి అంటే చిరకాలం పాటూ జీవించేవాడు అని అర్థం. మనం ఈరోజు ఆ చిరంజీవులందరి కోసం సంగ్రహంగా చెప్పుకుందాం.
తిరుక్కుఱళ్. తిరు అంటే గౌరవవాచకం. మనం సంస్కృతంలోనూ, తెలుగులోనూ “శ్రీ”ని ఎలా అయితే గౌరవసూచకంగా వాడతామో, అలానే తమిళంలో “తిరు” అన్న మాటను వాడతారు. ఉదాహరణకు తిరుమల అన్న మాట తీసుకుంటే.. తిరు అంటే పవిత్రమైన లేదా పూజనీయమైన అని అర్థం. మల అంటే పర్వతం. అలానే తిరుకొలను అంటే పుష్కరిణి అని అర్థం. తిరుప్పావై అంటే పవిత్రమైన లేదా శుభం కలిగించే వ్రతం అని అర్థం. ఇక “కుఱళ్” అంటే రెండు పాదాలున్న పద్యం. కాబట్టి తిరుక్కుఱళ్ అంటే పవిత్రమైన పద్యం అన్న మాట.
తెలుగు జానపద కథల్లోకెల్లా గొప్పదిగా భావించబడే కథ బాలనాగమ్మ కథ. మాయలూ మంత్రాలతో, మాయలఫకీర్ కుతంత్రాలతో, బాలవర్థిరాజు సాహసాలతో మొదటినుండీ చివరి వరకూ కూడా పాఠకులనూ శ్రోతలనూ ఉర్రూతలూగించే ఇటువంటి కథ మరలా తెలుగు జానపద కథాసాహిత్యంలో రాలేదన్నది మన అమ్మమ్మలు, నాన్నమ్మలూ చెప్పే మాట. నేను కూడా ఈ కథను నా చిన్నప్పుడు మా నాన్నమ్మ నోటి ద్వారా కనీసం యాభైసార్లైనా విని ఉంటాను. ఎన్నిసార్లు విన్నా అదే కొత్తదనం, అదే ఆశ్చర్యం, అదే ఆనందం. అటువంటి అద్భుతమైన ఆ బాలనాగమ్మ కథను మన అజగవ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక కథలోకి ప్రవేశిద్దాం.
కడుపుబ్బా నవ్వించే, సాంఘిక దురాచారాలను నిరసించే గొప్ప నాటకం
క్రితం భాగంలో మనం మధురవాణి, గిరీశం, రామప్ప పంతులు, పూటకూళ్ళమ్మ, వెంకటేశం మొదలైన పాత్రలతో నడిచిన కన్యాశుల్కం ప్రథమాంకాన్ని చెప్పుకున్నాం. వెంకటేశానికి చదువు చెప్పే మిషతో గిరీశం వెంకటేశంతో పాటూ వాళ్ళ అగ్రహారానికి బయలుదేరివెళ్ళడంతో ప్రథమాంకం ముగుస్తుంది. ఈ ప్రథమాంకంలో వచ్చిన పాత్రలలో ముఖ్యమైనవి మాత్రం మధురవాణి, రామప్పపంతులు, గిరీశం. ఇందులో మధురవాణి ఒక వేశ్య, రామప్ప పంతులు రామచంద్రపురం అగ్రహారం కరణం, ఇక గిరీశం గురించి చెప్పేదేముంది. తన తెలివితేటలతో వాక్చాతుర్యంతో అవతలివారిని బురిడీకొట్టిస్తూ బ్రతికే జిత్తులమారి పాత్ర అతనిది. ఇక ఈ ద్వితీయాంకంలో మనకు వెంకటేశం తండ్రి, కృష్ణరాయపురం అగ్రహారీకుడూ అయిన అగ్నిహోత్రావధాన్లు, ఆ అగ్నిహోత్రావధాన్లు భార్య వెంకమ్మ, కూతురు బుచ్చమ్మ, బావమరిది కరటక శాస్తుల్లు, ఆ కరటకశాస్తుల్ల శిష్యుడు ప్రధానంగా కనబడతారు. ఈ కరటక శాస్త్రులు విజయనగరం సంస్కృత నాటక కంపెనీలో విదూషకుడు. ఇక ద్వితీయాంకంలోకి ప్రవేశిద్దాం.
కడుపుబ్బా నవ్వించే, సాంఘిక దురాచారాలను నిరసించే గొప్ప నాటకం.
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ప్రబోధించిన మహాకవి మన గురజాడ అప్పారావు గారు. అప్పటికాలంలో వేళ్ళూనుకు పోయిన బాల్యవివాహాలవంటి సాంఘిక దురాచారాలను చూసిన ఆ కవిహృదయం ద్రవించిపోయింది. అయిదారేళ్ళ ఆడపిల్లల్ని డబ్బు కక్కూర్తితో యాభై అరవై ఏళ్ళ ముసలాడికిచ్చి పెళ్ళి చేసే, దుర్మార్గమైన ఒక ఆచారాన్ని రూపుమాపడానికీ ఆయన కంకణం కట్టుకున్నారు. అంతేగాక పుస్తకభాషను గ్రాంథికం నుండి వాడుకభాషకు మార్చడానికి గిడుగు రామ్మూర్తి పంతులుగారితో కలసి ఆయన చేసిన కృషి అంతా ఇంతాకాదు. సమాజం విజ్ఞానవంతంగా మారడానికి వాడుకభాషే పుస్తకభాషగా ఉండాలని ఆయన బలంగా నమ్మారు. అటువంటి వాడుకభాషనే ఆయుధంగా చేసుకుని బాల్యవివాహాలనే ఒక సాంఘిక దురాచారాన్ని నిర్మూలించడానికి ఆయన చేసిన ప్రయత్నమే కన్యాశుల్కం నాటకం. హాస్యరస ప్రధానంగా కనిపించే ఈ నాటకం అంతర్లీనంగా ముక్కుపచ్చలారని ఆడపిల్లలు బాల్యవివాహాల పేరుతో ఎలా బలైపోతున్నారో మనకు చూపిస్తుంది. కేవలం ఈ ఒక్క దురాచారమేగాక, ఆనాటి సమాజనికి పట్టిన మరెన్నో రుగ్మతలను కూడా మన కళ్ళకు కట్టిస్తుంది, సుమారు 130 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ప్రదర్శింపబడిన ఈ కన్యాశుల్కం నాటకం ఇప్పటికీ తెలుగువారిని అలరిస్తూనే ఉంది. ఈ నాటకం పుస్తక రూపంగా వచ్చి కూడా సుమారు 125 సంవత్సరాలు కావస్తోంది. ఇటువంటి ఓ గొప్ప రచనను మన అజగవ ఛానల్ ద్వారా మీకు వినిపించడానికి ప్రయత్నిస్తున్నాను. నిడివి పెద్దదైన ఈ నాటకానికి, ఎటువంటి మార్పులూ చేర్పులూ చేయకుండా, కొన్ని భాగాలుగా చేసి మీకు అందించబోతున్నాను. మీ అభిమానాన్నీ, ఆశీర్వచనాన్నీ ఆకాంక్షిస్తున్నాను. ఇక నాటకంలో ప్రవేశిద్దాం.
వ్యాసవాల్మీకుల తరువాత ఆ స్థాయిలో మనం గౌరవించుకునే కవి.. మహాకవి కాళిదాసు. మన దేశంలో పుట్టిన మహాకవులందరిదీ ఒక ఎత్తైతే.. కాళిదాసు ఒక్కడిదీ ఒక ఎత్తు ఎత్తు. మరలా కాళిదాసు రచనల్లో రఘువంశం, కుమారసంభంవం, అభిజ్ఞానశాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం ఇవన్నీ ఒక ఎత్తైతే “మేఘ సందేశం” ఒక్కటే ఒకెత్తు. ఈ మేఘ సందేశం కావ్యం అసలు పేరు మేఘదూతం. ఇది కేవలం 120 శ్లోకాలున్న ఒక చిన్న కావ్యం. ఈ కావ్యంలో ఉన్న గమ్మత్తేమిటంటే.. కథ అంత ప్రత్యేకంగా ఉన్నట్టేమీ అనిపించదు. కానీ కథనం, ఆ వర్ణనలు అసాధారణంగా అనిపిస్తాయి. అందుకే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ శ్లోక తాత్పర్యాలతో ఈ ఉన్న పుస్తకం కొనుక్కుని చదవండి. లేదా archive.orgలో వేదం వేంకటరాయశాస్త్రిగారి వ్యాఖ్యానంతో కూడా PDF లభిస్తుంది. ఆ పుస్తకం copyright పరిధిలోకి రాదు కనుక, హాయిగా డౌన్లోడ్ చేసి చదువుకోండి. నిజానికి ఈ ఒక్క పుస్తకాన్నే కాదు.. కాళిదాసు రచనలన్నీ కూడా మనం చదవాలి. అప్పుడు కలిగే ఆనందం వేరు. జర్మన్ మహాకవి గోథే మీద కూడ కాళిదాసు ప్రభావం చాలా ఎక్కువ. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం చదివిన ఆ గోథే అందులోని రచనా విన్యాసానికి ముగ్ధుడైపోయి వీధిలోకి వచ్చి ఆనందంతో నృత్యం చేశాడట. మన కాళిదాసుకు అలాంటి అభిమానులు ఎందరో ఉన్నారు. మనలో కొందరికి ఉన్న బుద్ధిమాంద్యం చేత, బానిస బుద్ధిచేత సుమారు 2000 సంవత్సరాల క్రితం వాడైన మన మహాకవి కాళిదాసుని అటూఇటుగా 500 సంవత్సరాల క్రితం వాడైన షేక్స్స్పియర్తో పోల్చి సంబరపడుతుంటాం. మన కాళిదాసుని ఎవ్వరితోనూ పోల్చలేం. ఒకవేళ పోల్చాల్సి వస్తే.. ఏ వ్యాసునితోనో, వాల్మీకితోనో పోల్చాలి. సరే.. ఇక మేఘసందేశం కథలోకి వెళదాం.
మదురై నగరాన్ని మంటలలో ముంచెత్తిన కణ్ణగి కథ! రెండవ భాగం!
క్రితం భాగంలో మనం కణ్ణగీ కోవలుల వివాహం గురించీ, మాధవీ కోవలుల ప్రేమ గురించీ, ఒక చిన్న అపార్థం వల్ల వారిద్దరూ విడిపోవడం గురించీ, పరివర్తన చెందిన కోవలుడు తన భార్యతో కలసి మదురై నగరానికి బయలుదేరడం గురించి, మధ్యలో వారికి కౌంతిని అనే యోగిని కలవడం గురించీ చెప్పుకుని, వారు ముగ్గురూ కలసి మదురై నగర పొలిపమేరలలో ఉన్న ఓ గ్రామాన్ని చేరుకోవడం దగ్గర కథను ఆపాం. ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం.
ఎంతో దూరం నుండే వినవస్తున్న బ్రాహ్మణుల వేదఘోష, సైనికుల కవాతు చప్పుళ్ళు, ఏనుగుల ఘీంకారములు, గుర్రాల సకిలింపులు, మీనాక్షీసుందరేశ్వర ఆలయాలలో మ్రోగుతున్న ఘంటారావములతో ఒక సరికొత్త వాతావరణంలోకి ప్రవేశించిన అనుభూతి కలిగింది వారికి. ఆ ఆశ్చర్యానుభూతితోనే వైగై నదిని సమీపించిన వారు ఆ నది సౌందర్యానికి మరింత అబ్బురపడ్డారు. అలా వాళ్ళు ఆనాటికి ఆ గ్రామంలోనే విడిది చేశారు. ఆ మరునాడు కోవలుడు కణ్ణగికి అనేక జాగ్రత్తలు చెప్పి, కౌంతిని యోగినికి నమస్కరించి మదురై నగరానికి వెళ్ళాడు. అక్కడ వర్తకం వీధిలో ఉన్న అనేకమంది వర్తకులతో సంభాషించి, సాయంత్రం అయ్యేలోగా తిరిగి తాము విడిది చేసిన గ్రామానికి వచ్చేశాడు. ఆరాత్రి కోవలుడు కణ్ణగికి మదురైనగర విశేషాలను చెబుతూ, తాము త్వరలో అక్కడ ఎంత గొప్ప జీవితాన్ని గడపబోతున్నామో వివరిస్తూ మురిపించాడు. కణ్ణగి కూడా సంతోషసాగరంలో మునిగిపోయింది.
మదురై నగరాన్ని మంటలలో ముంచెత్తిన కణ్ణగి కథ! మొదటి భాగం!
ఈ సిలప్పదికారమ్అనే రచన తమిళ పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. దీనిని ఇళంగో అడిగళ్ అనే రాచకవి రచించాడు. ఇతడు జైనుడు. సిలంబు అంటే మంజీరం. అంటే కాలికి పెట్టుకునే అందె అన్నమాట. అదికారమ్ అంటే ప్రభావం. కనుక సిలప్పదికారమ్ అంటే మంజీర మహిమ అని అర్థం చెప్పుకోవచ్చు.
పూర్వం దక్షిణ భారతదేశంలో తమిళప్రాంతాన మూడు మహా సామ్రాజ్యాలుండేవి. అవి చోళ, పాండ్య, చేర సామ్రాజ్యములు. అందులో ధనధాన్యాలతో తులతూగే చోళ సామ్రాజ్యాన్ని కావేరీ పట్టణం రాజధానిగా చేసుకొని కరికాలచోళుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. కావేరీ పట్టణానికి పుహార్ అనే మరో పేరు కూడా ఉంది. ఆ నగరం వాణిజ్యానికి కూడా ఎంతో ప్రసిద్ధి చెందిది. ఆ పట్టణంలో మహానాయకుడనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను మహాధనికుడు, ధర్మాత్ముడు కూడా. అతనికి ఒక్కతే కూతురు, పేరు కణ్ణగి. మహాసౌందర్యవతి. అంతకుమించి సౌశీల్యవతి కూడా. కణ్ణగికి పదమూడవ సంవత్సరం రాగానే, ఆమెకు తగిన వరునికోసం వెదకటం మొదలుపెట్టాడు మహానాయకుడు.
ఆ నగరంలోనే మహాసత్త్వుడనే మరో వైశ్యప్రముఖుడు ఉండేవాడు. అతడు గొప్ప ఐశ్యర్యవంతుడుగా, మహాదాతగా కీర్తి గడించాడు. అతగాడు చోళరాజైన కరికాలచోళునకు అత్యంత ఆప్తుడు కూడా. ఆ మహాసత్త్వునకు కోవలుడనే ఒక కొడుకున్నాడు. ఆ కోవలుడు విద్యాధికుడు, సంస్కారి. సంగీతసాహిత్యాలలో దిట్ట. అతను పదహారేళ్ళ ప్రాయంవాడు కాగానే అతని తండ్రి అతనికి మంచి సంబంధాల కోసం వెతకసాగాడు. ఆ విషయం తెలుసుకున్న మహానాయకుడు మహాసత్త్వుని కలసి, కోవలుడిని తన అల్లుడిగా చేసుకోవాలన్న కోరికను వెల్లడించాడు. అందుకు మహాసత్త్వుడు కూడా ఎంతో ఆనందంగా అంగీకరించాడు. అటుపై ఒక శుభముహూర్తంలో కణ్ణగీ, కోవలుల వివాహం మహావైభవంగా జరిగింది.
ఆ తరువాత కొంతకాలానికి కణ్ణగి అత్తవారింటికి కాపురానికి వచ్చింది. మహాసత్త్వుడు తన కొడుకు కోడలు ఏకాంతంగా గడపడానికని ఒక దివ్యమైన భవనాన్ని కట్టించి, దాసదాసీజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నూతన దంపతులు క్షణకాలం పాటూ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా, ఎంతో అన్యోన్యంగా కాలం గడపసాగారు. కణ్ణగి తన భర్తను అన్ని విధాలా సంతోషపెడుతూనే, దానధర్మాది కార్యక్రమాలు కూడా నిరాఘాటంగా చేస్తుండేది. వ్యాపారదక్షత కలిగిన కోవలుడు తమ వ్యాపారాన్ని సమర్థతతో నిర్వహిస్తూ సంపదను ఇబ్బడిముబ్బడిగా పెంచసాగాడు. ఇలా చూడముచ్చటైన ఆ జంటను చూసి బంధుమిత్రులంతా ఎంతో మురిసిపోతుండేవారు.
అలా కొంతకాలం గడిచింది. ఇదిలా ఉండగా ఒకనాడు కరికాలచోళుని ఆస్థానంలో మాధవి అనే నర్తకి నాట్యప్రదర్శన ఇచ్చింది. ఆమె నాట్యానికి అబ్బురపడిన ఆ చోళ చక్రవర్తి ఆమెకు పచ్చలహారాన్ని బహుమతిగా ఇచ్చాడు. సాధారణంగా రాజసభలో జరిగే నాట్యప్రదర్శనలకు నగరంలోని ప్రముఖులు వెళ్ళడం సర్వసాధారణం. అలా ఆనాటి ప్రదర్శనకు కోవలుడు కూడా వెళ్ళాడు. మాధవిని చూడగానే అతని హృదయం నిండా ఆమె ప్రతిబింబమే నిండిపోయింది. మాధవికి కూడా మొదటి చూపులోనే కోవలునిపై ప్రేమ కలిగింది.
ఆముక్తమాల్యద కావ్యాన్ని రచించింది సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు రాయలవారికి కలలో కనబడి, తనపై తెలుగులో ఒక కావ్యం వ్రాయమని కోరాడు. అలా భగవంతుని ఆదేశంతో వ్రాయబడిన కావ్యమే ఈ ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అంటే తాను ధరించిన పూమాలను భగవంతునికి సమర్పించినది అని అర్థం. అంటే ఇది గోదాదేవి కథన్న మాట. గోదాదేవి కథతో పాటు ఇందులో ఇంకా ఖాండిక్య, కేశిధ్వజుల కథ, యమునాచార్యుని కథ, మాలదాసరి కథ వంటి కొన్ని ఉపకథలు కూడా ఉన్నాయి. తన ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల ప్రతిభకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైన రీతిలో ఈ కావ్యాన్ని రచించారు రాయలవారు. ఇక మనం ఆముక్తమాల్యద కథలోకి వెళదాం.
వరవిక్రయం, మధుసేవ, చింతామణి ఈ మూడు నాటకాలు సుమారు వందేళ్ళ క్రితం నాటివి. వీటి రచయిత కాళ్ళకూరి నారాయణరావు గారు. వీరు మంచి రచయిత మాత్రమే కాదు.. గొప్ప సంఘసంస్కర్త, జాతీయవాది కూడా. వీరు వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ వరవిక్రయ నాటకాన్ని, ఇంటిని ఒంటిని గుల్ల చేసే మద్యపానానికి వ్యతిరేకంగా మధుసేవ నాటకాన్ని రచించారు. ఇక ఆనాటి సమాజంలో చాలా కుటుంబాలను ఛిద్రం చేసిన జాడ్యం వేశ్యావ్యామోహం. ఈ జాడ్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి నారాయణరావుగారు రచించిన మరో రచనే ఈ “చింతామణి” నాటకం.
పరమ భాగవతోత్తముడైన లీలాశుకుని జీవిత కథ ఆధారంగా ఆయన ఈ నాటకాన్ని రచించారు. లీలాశుకుడంటే శ్రీకృష్ణకర్ణామృతం రచించిన మహాత్ముడు. మనం ఎక్కువగా వినే.. “కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం” అనే శ్లోకం ఈ లీలాశుకుడు రచించిందే.
ఇక ఈ చింతామణి నాటకం అప్పట్లో విపరీతమైన జనాదరణ పొందింది. ఈ నాటకం ప్రభావంతో వేశ్యల ఇంటికి వెళ్ళే మగాళ్ళ శాతం చాలావరకూ తగ్గిపోయిందట. అంతేకాదు ఎంతోమంది వేశ్యలు తమ వేశ్యావృత్తి వదిలివేసి తమ జీవనానికి న్యాయమైన మార్గాలు ఎంచుకున్నారట. అంతగొప్ప నాటకాన్ని, కొన్ని నాటకాల కంపెనీల వాళ్ళు పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. జనాన్ని ఆకర్షించడం అనే పేరు చెప్పి ఆ నాటకంలో ద్వంద్వార్థాలను, ఆశ్లీలతను జొప్పించారు. కొన్ని వర్గాలను కించపరచేలా అసభ్యమైన సంభాషణలు కూడా ఇరికించేశారు. దానితో ఇది చిలికి చిలికి గాలివానై ఈ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిషేధించేంత వరకూ వెళ్ళింది. నిజానికి నిషేధించాల్సింది నాటకాన్ని కాదు. ఈ నాటకంలో జొప్పించిన అసభ్యతను. గతం 30 సంవత్సరాలుగా ప్రదర్శితమవుతున్న చింతామణి నాటకానికి, కాళ్ళకూరి నారాయణరావుగారు రచించిన చింతామణి నాటకానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. మన భాషాభిమానులంతా పూనుకుంటే అసలైన చింతామణి నాటకానికి తిరిగి ఊపిరిపొయ్యవచ్చు. ఇక “చింతామణి” నాటకంలో కథేమిటో చూద్దాం.
పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి?
సాహితీమిత్రులారా!
అంశం - పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి?
మన ఊర్లలో పోలేరమ్మ, మావుళ్ళమ్మ మొదలైన గ్రామదేవతలకు జాతర్లు జరుగుతున్నప్పుడు ఆ యా దేవతలతో పాటూ పోతురాజుని కూడా పూజించడం చూస్తుంటాం. మన జానపదసాహిత్యంలో కూడా మనకీ పోతురాజు పేరు వినబడుతూనే ఉంటుంది. ఇంతకీ ఈ పోతురాజెవరు? గ్రామదేవతలుగా అనేకచోట్ల పూజలందుకునే అతని అక్కలెవరు? అసలు వారి పుట్టుక వెనుకనున్న ఆసక్తికరమైన కథేమిటి? మొదలైన విషయాలను ఈరోజు చెప్పుకుందాం.
మన పురాణవాఙ్మయంలో కానీ, రామాయణభారతాలలో కానీ పోతురాజు కథకు సంబంధించిన ఆధారాలు కనబడవు. కానీ జానపదుల నోళ్ళలో వందల సంవత్సరాలుగా నానుతూ ఈ కథలు చిరంజీవత్వాన్ని సంపాదించుకున్నాయి.
ఈ కథే కాదు, మనం పూజించే గ్రామదేవతలకు సంబంధించిన కథలుకానీ, అయ్యప్పస్వామి, కన్యకాపరమేశ్వరీ వంటి ప్రసిద్ధ దేవతల కథలుకానీ మనకు పురాణాలలో కనబడవు. ఈ కథలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే గ్రంథస్థం చేయబడినవి. వీటిలో కొన్ని కథలకు లిఖితపూర్వకమైన ఆధారాలు కూడా ఉండవు. అంతమాత్రం చేత మన గ్రామదేవతల ప్రాశస్త్యానికి గానీ, మనకు వారిపై ఉండే భక్తిభావానికి గానీ వచ్చిన ఇబ్బందేమీ లేదు కదా! పరిశోధక పరమేశ్వరులైన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు "క్రీడాభిరామం" పీఠికలో వ్రాసిన విషములే ఈ వీడియోలో చెప్పబడిన కథకు ఆధారం. ప్రభాకరశాస్త్రిగారీ కథను ఆదిలక్ష్మీ విలాసం, కామేశ్వరీ చరిత్ర అను గ్రంథములనుండి సేకరించారు.