Showing posts with label డా. ఏల్చూరి మురళీధరరావు. Show all posts
Showing posts with label డా. ఏల్చూరి మురళీధరరావు. Show all posts

Monday, November 5, 2018

భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం-2


భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం-2



సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి.........

2. పంచమ స్కంధం – అధ్యాత్మయాత్రికులకు దారిదీపం
ఉపనిషత్తులలో వ్యష్టి సమష్టి స్థూల సూక్ష్మ కారణరూపాలైన ఎటువంటి ఉపాధులు లేని శుద్ధచైతన్యము యొక్క స్థితివర్ణన ఉన్నట్లు ఇందులో ప్రత్యస్తమితభేదము (భేదభావాలు నశించినది), సత్తామాత్రము (త్రైకాలికాభేద్యమైన బ్రహ్మసత్త, తత్త్వజ్ఞానం చేత నశించే వస్తుభేదసత్త, అధిష్ఠాన సాక్షాత్కారం చేత తొలగిపోయే ప్రాతిభాసికీ సత్త), వాచామగోచరము (వాక్కులకు అందనిది), స్వసంవేద్యము (అనుభవము చేత తెలిసికొనదగినది) అయిన బ్రహ్మముయొక్క వివరణ విద్యార్థి అరచేతిలో ఉసిరికను పెట్టి దాని రంగును, రుచిని, పరిమాణాన్ని, వస్తుగుణాన్ని సప్రమాణంగా నిరూపించినంత విశదంగా విలసిల్లింది. ఇందులో మహాపురాణ దశలక్షణాలలో ఒకటయిన స్థితి లేదా స్థానము అనే అంశం వర్ణితమయిందని పెద్దలంటారు. స్థితి ర్వైకుణ్ఠవిజయః అని సంస్కృతభాగవతం అంటున్నది. అంటే, లోకంలోని దుష్టశక్తులపై భగవంతుని యొక్క విజయమని అర్థం. భగవంతుని సృష్టిలో మహదాదితత్త్వాల విలసనకు, ఆ తత్త్వగతుడైన జీవుని ఉనికికి స్థితి అని పేరు. జీవునియొక్క ఆ ‘స్థితి’ లేదా ‘స్థానము’నకు నిమిత్తమైన భగవంతుని దుష్టసంహారలీల ఈ స్కంధంలో నోరారా వివరింపబడింది.

లోకద్రోహినరేంద్రా
నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా
వైకుంఠనాథు విజయం
బాకల్ప ‘స్థాన’ మయ్యె నవనీనాథా! (2-261)

అని ద్వితీయ స్కంధంలో శుకయోగి పరీక్షిత్తుకు ఈ స్థితిలక్షణాన్ని నిరూపిస్తాడు.

        2.1. షట్చక్రోపాసన: విరాట్పురుషతత్త్వం

అద్వితీయమైన బ్రహ్మపదార్థంపైని చిత్తాన్ని నిలిపేందుకు ఉద్దేశించిన ఈ పంచమ స్కంధానికి ఉపాసకుల మతంలో ధారణా స్కంధము అనికూడా పేరున్నది. ధారణ అంటే చిత్తవృత్తిని అదుపులోకి తెచ్చుకొని, ధ్యేయవస్తువుపై ఒకేచోట నిలిపి ఉంచటమని అర్థం. మూలాధారంలో దాగివున్న కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే ప్రక్రియలో శరీరంలోని వివిధచక్రాలకు ఆధారనిలయాలైన మూలము, నాభి, హృదయము, కంఠము, భ్రూమధ్యము, బ్రహ్మరంధ్రము – ఇత్యాదులలో కాని, బాహ్యములైన విష్ణురూపాలపైని కాని మనస్సును ఏకాగ్రంగా తదాకారవృత్తితో నిలకడగా ఉంచే యోగవిశేషం ఇందులో ఉపదేశింపబడింది. అందువల్ల భగవానుడైన విరాట్పురుషుని స్థూలదేహము యొక్క భౌతికవర్ణన, భూగోళ వర్ణన, ఖగోళ వర్ణన, పాతాళలోక వర్ణన ఈ స్కంధంలో ఎంతో విపులంగా ఉన్నాయి. జీవన్ముక్తివివేకాన్ని కోరి షట్చక్రోపాసన కావించే యోగసాధకులు ఈ లోకాలను ధ్యానధారణలో నిలుపుకొని, విరాట్పురుషతత్త్వావధారణ మూలాన కేవలానుభవానందస్వరూపమైన బ్రహ్మవస్తువును దర్శించాలని దీని తాత్పర్యం.

        2.2. జీవుల కర్మఫలవిచారం

పంచమ స్కంధంలో భువనకోశవర్ణన అతివిపులంగా ఉన్నది. ఈ భువనకోశంలో వెలసిన వివిధలోకాలలో సమస్త చరాచరజీవకోటీ నెలకొని ఉన్నది. ఆ జీవకోటి తమతమ ఏయే కర్మఫలంగా ఎటువంటి జీవితం అనుభవింపవలసి ఉంటుందో మనము ఈ స్కంధాన్ని చదివి తెలుసుకోవచ్చు. పూర్వకర్మమనేదొకటి ఉన్నదని, జీవులు పూర్వపు జన్మలలో చేసుకొన్న పుణ్యపాపకర్మలను బట్టి వారివారికి ఆయా సుఖదుఃఖాలు యథాయథంగా నిర్దిష్టసమయాలలో కలుగుతుంటాయని శుకయోగి భాగవతాన్ని బోధిస్తున్న పలుసందర్భాలలో పరీక్షిత్తుకు చెప్తాడు. ఫలానుభవాన్ని గోచరింపజేసేది ఆ మునుపు చేసిన కర్మమేనని, ప్రకృతిబద్ధులు రాగద్వేషాలను అదుపులో ఉంచుకొనకపోతే ముప్పు తప్పదని వివరించాడు. అందువల్ల ఈ స్కంధంలో జీవులాచరించే దుష్కర్మలకు ఫలితమైన నరకలోకాల వర్ణన అతివిపులంగా చేయబడింది. అది చదివినవారు తామంతకు మునుపు చేసిన చెడుపనులకు పశ్చాత్తాపాన్ని పొంది, పాపవర్తనను మాని, భక్తిభావాన్ని అలవరచుకొని సాధుస్వభావులు కావడానికి ఈ వర్ణనమంతా ఉపకరిస్తుంది.

సంస్కృతంలో ఈ పంచమ స్కంధం ఇరవై ఆరు అధ్యాయాల సంక్షేపరచన. అందులో ఉన్న 666 శ్లోకాలు, గద్యాలలో నిడివిని బట్టి శ్లోకాలకంటె గద్యభాగమే ఎక్కువ. శ్లోకాలు వృత్తవైవిధ్యానికి, క్షణక్షణం మారే చిత్రగతులకు పుట్టినిళ్ళు. తెలుగులో ఈ మొత్తం రెండు ఆశ్వాసాలుగా 352 గద్యపద్యాలలో ఇమిడిపోయింది. గంగనామాత్యునికి ఛందోవైవిధ్యం పట్ల ప్రత్యేకాభిమానమేమీ లేనందున తెలుగు కావ్యాలలో సుప్రసిద్ధాలైన చంపకోత్పల శార్దూలమత్తేభ వృత్తాలను; జాత్యుపజాతులలో ఆటవెలది, తేటగీతి, సీసము, కందాలను; ఆశ్వాసాంతాలలో మాత్రం ఒక మాలినిని, ఒక మత్తకోకిలను ఎన్నుకొన్నాడు. భాషలో విశేషప్రయోగాలను చేయలేదు. ప్రాసస్థానంలో రేఫ-శకటరేఫల సాంకర్యం చేయరాదన్న లక్షణకవుల కోవలోనివాడు కాడు. ఆయన దృష్టంతా దురవగాహమైన వేదాంతార్థాన్ని సర్వసుబోధంగా తెలుగుచేయటం పైనే నిలిచింది. జీవవిచారం, కర్మవిచారం, తత్త్వవిచారం, బ్రహ్మవిచారం ఆయనకు అభిమానవిషయాలు.

        2.3. జీవులకు వృత్తికల్పన

దుష్టశక్తులపై శ్రీ భగవానుని విజయమైన ‘స్థితి’ని వర్ణించిన తర్వాత శుకయోగి పరీక్షిత్తుకు ‘వృత్తి’ని వివరించి చెప్తాడు. ఈ ‘వృత్తి’ యొక్క నిర్వచనం సంస్కృత భాగవతం పన్నెండవ స్కంధంలో

వృత్తి ర్భూతాని భూతానాం చరాణా మచరాణి చ
కృతా స్వేన నృణాం తత్ర కామాచ్చోదనయాపి చ. (12. 7. 13)

అని కనిపిస్తుంది. సర్గ విసర్గాలతో ఈ సృష్టిలో వెలసిన చరాచరజీవులూ సంతోషంగా జీవించేందుకు గాను వాటివాటికి అనువైన వృత్తులను కల్పించటం – అని ఈ మాట అర్థం. ఆ వృత్తులలో ఉన్నవారు స్వభావప్రేరణ వల్ల ఆచరించే వివిధశుభాశుభకర్మముల యొక్క ఫలితవిచారం – ముఖ్యంగా అశుభకర్మముల యొక్క విపరీతపరిణామాల విపులమైన చర్చ ఈ స్కంధంలో చేయబడింది.

        2.4. పురాణరచనాశిల్పం

కథాప్రసక్తనీయాలైన అంశాలను సాంగోపాంగంగా నిర్వర్ణించటమే గాక, ప్రధానమైన ఇతివృత్తానికి ఎటువంటి ప్రత్యక్షసంబంధం లేని అనేక గౌణవిషయాలను వర్ణించటం కూడా మహర్షిప్రోక్తములైన పురాణముల రచనాశిల్పంలో ఒక భాగం. అయితే ఆ విషయాలన్నీ పౌరాణికంగా ఎటువంటి పూర్వోత్తరాన్వయమూ లేని నిరాధార రచనలు కావు. భగవదవతారం ఏయే కాలాలలో జరిగిందో, ఆయా కాలాలలోని భగవదంశసంభూతులైన రాజుల వంశాలను సగౌరవంగా వర్ణించటం కూడా వేదవ్యాసమహర్షి రచనాశిల్పంలో భాగమే. అందువల్ల ఈ స్కంధంలో ముమ్మొదట స్వాయంభువ మనువు కాలం నుంచి ఆ యుగసంధికాలం వరకు భూమండలాన్ని పరిపాలించిన అనేకమంది రాజుల పుణ్యచరిత్రలను పేర్కొనటం జరిగింది. నాలుగవ స్కంధంలో స్వాయంభువుని పెద్దకొడుకైన ఉత్తానపాదుని మొదలుకొని, ప్రాచీనబర్హి కాలం దాకా వెలసిన రాజుల కథలను గురించి వివరించిన తర్వాత ఈ ఐదవ స్కంధంలో మనువు రెండవ కొడుకైన ప్రియవ్రతుని వంశక్రమం చెప్పబడింది.

ప్రియవ్రతుడు అన్నగారు ఉత్తానపాదుని వలెనే ధర్మమార్గరతుడై మనువంశరాజులకు ఆదర్శంగా రాజ్యపాలన కావిస్తాడు. పుట్టుకతోనే ఆయనకు మహాపురుషలక్షణమైన శమదమాదిసద్గుణసంపత్తి చేకూరుతుంది. జన్మాంతరసంస్కారం వల్ల వైరాగ్యోదయం కలిగి, నారదమహర్షి వంటి మహాత్ముని ఉపదేశభాగ్యం లభిస్తుంది. నివృత్తిమార్గం లోకి ప్రవేశించినా, రాజధర్మగతుడై ఉంటూనే సంసారబంధాలకు అతీతంగా వర్తించటం నేర్చుకొంటాడు. భువనకోశానికి కేంద్రబిందువుగా ఉన్న జంబూద్వీపాన్ని, దాని చుట్టూ ఇతరద్వీపాలను, సముద్రాలను ఉపకల్పించి, భూతలంలో అనేకానేక నదీపర్వతాలను నెలకొల్పిన పుణ్యాత్మునిగా అతనికి ప్రసిద్ధి కలుగుతుంది. ఒకప్పుడు సూర్యుడు ఆకాశమార్గాన సంచరిస్తున్నపుడు ప్రియవ్రతుడు సూర్యరథాన్ని అనుసరించి తన రథాన్ని నడిపించాడట. అతని రథచక్రాల ఒరపిడి వల్ల నేల చీలి, సముద్రాలు ఏర్పడినట్లు ఈ కథ మనకు చెబుతున్నది. ఆ విధంగా ఏర్పడిన ద్వీపాలు, సముద్రాలను గురించిన విపులమైన వర్ణనం ఈ భాగంలో వస్తుంది.

ప్రియవ్రతుని కొడుకు అగ్నీధ్రుడు – ధర్మసమ్మతంగా, సకల ప్రజానురంజకంగా రాజ్యపాలన చేసినవాడు – చివరికి ఒక అప్సరస సౌందర్యానికి ముగ్ధుడై, ఆమె యందు నాభి అనే మహనీయుణ్ణి సుతునిగా పొందుతాడు. నాభి కాలంలో వైదికకర్మలు నిర్నిరోధంగా కొనసాగుతాయి. భగవదవతారం ఎటువంటి పుణ్యధనుల ఇండ్లలో సంభవిస్తుందో చెప్పటానికి ఈ ఉపక్రమణిక అంతా ఉపకరిస్తుంది.

        2.5. శ్రీ ఋషభావతారం, నవయోగుల కథ

నాభిరాజు ఒకప్పుడు వేదోక్తప్రకారం ఒక మహాయజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞవేదికపై శ్రీ మహావిష్ణువే సాక్షాత్కరించి, స్వయంగా తాను నాభి యింట జన్మింపగలనని వరాన్ని ప్రసాదించి, తన వాగ్దానం ప్రకారం వారింట ఋషభుడనే పేరిట ఉదయించి, రాజర్షితల్లజు డవుతాడు. ఆ విధంగా గృహస్థాశ్రమంలో ఉంటూనే మానవులు పరమహంసపదాన్ని చేపట్టవచ్చునని శ్రీ ఋషభావతారం లోకానికి వెల్లడిచేస్తుంది.

ఋషభునికి నూరుమంది కొడుకులు పుడతారు. వారిలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు, విదర్భుడు, కీకటుడు అని తొమ్మిదిమంది పేర్లమీద దేశాలను ఏర్పరించి ఋషభుడు వారివారికి ఆయా దేశాల రాచరికం అప్పగిస్తాడు. ఎనభైఒక్కమంది కొడుకులు బ్రహ్మావర్తంలోని వివిధప్రాంతాలకు వెళ్ళి బ్రహ్మనిష్ఠులై బ్రాహ్మణ్యంలో స్థిరపడతారు. తొమ్మిదిమంది మాత్రం విషయవాసనలకు దూరంగా ఉంటూ అధ్యాత్మవిద్యాసంపన్నులై నవయోగులని ప్రఖ్యాతిని గడిస్తారు. వారిలో పెద్దవాడి పేరు ‘కవి’ కావటం వల్ల వారికి నవకవులని కూడా ప్రసిద్ధి ఏర్పడింది. కంటికి కనుపిస్తున్న ఈ సమస్తభూతసృష్టి ఏ విధంగా ఏర్పడింది? భగవంతుడు నిజంగా ఉన్నాడా? లేడా? అని సందేహించేవారికోసం వారు లోకసంచారం చేసి, స్థూల సూక్ష్మాత్మకమైన చరాచరవిశ్వమంతా భగవద్రూపమే అని, భగవదన్యమైన వస్తువు వేరొకటి లేదని – ఒక్కొక్కరూ ఒక్కొక్క విధమైన ప్రమాణాన్ని చూపిస్తూ ప్రచారం చేస్తారు. భరతవర్షంలో ఆరూఢభక్తుడైన విదేహదేశాధిపతి నిమి సత్త్రయాగం చేస్తున్నప్పుడు వారక్కడికి వెళ్ళి ఆయనకు అధ్యాత్మతత్త్వాన్ని బోధిస్తారు. ఆ కథంతా భాగవతం ఏకాదశ స్కంధంలో సాకల్యంగా వివరణకు వస్తుంది.

నవయోగులలో పెద్దవాడైన కవి రాజుకు ఆత్యంతికక్షేమానికి భాగవతధర్మమొక్కటే సిద్ధిసాధకమని విశదీకరిస్తాడు. కర్మమునందు కర్తృత్వము (ఈ పని చేసినది నేను కాబట్టి కర్త అయినవాని ఫలము నాది), భోక్తృత్వము (జాగ్రత్ స్వప్న సుషుప్తులనే అవస్థలలో భోగకర్తను నేను) అన్న జీవవిచార భావాలు లేనప్పుడు భగవత్ప్రేరణ సిద్ధించి భక్తిమార్గం అలవడుతుందని ఆయన ఉపదేశసారం. ఆ తర్వాత కవి తమ్ముడు రవి నిమిరాజుకు భాగవతుల లక్షణాలను చెబుతాడు. మనస్సు భగవంతునికి సమర్పితమైనప్పుడు జీవునియొక్క వాసనాప్రేరితాలైన కర్మలన్నీ వేయించిన విత్తనాలలాగా అంకురించే శక్తిని కోల్పోతాయని, అందువల్ల కర్మఫలాన్ని అనుభవించేందుకు మళ్ళీ జన్మమంటూ ఉండదని, ప్రారబ్ధం నశించిన తర్వాత భోగ్యావసరం లేక జీవన్ముక్తి కలుగుతుందని వివరిస్తాడు. మూడవవాడు అంతరిక్షుడు విష్ణుమాయ వలన సంసారబంధం కలుగుతున్నదని, ఆ మాయాశక్తి వలన పుట్టిన మహదాదితత్త్వాలు ఆ శక్తి ఉపసంహృతమైనప్పుడు తొలగిపోతాయని అంటాడు. నాల్గవవాడు ప్రబుద్ధుడు రజోగుణపరిణామంగా ప్రవర్తిల్లే అధర్మకార్యమైన దుఃఖనివృత్తికి భక్తి ఒక్కటే కర్తవ్యమని ప్రబోధిస్తాడు. బాహ్యాభ్యంతరాలలో శుచిగా ఉండటం, సాధుజనుల సహవాసం, సాత్త్వికాహారం, స్వధర్మనిష్ఠ, మనోవాక్కాయముల పవిత్రత, సర్వకాల సర్వావస్థలలో కష్టాలను సహింపగల ఓరిమి, బ్రహ్మయజ్ఞనిర్వహణార్థం వేదాధ్యయనం, ఆత్మవంచన పరవంచనలు లేని ఆర్జవం, శీతోష్ణసుఖదుఃఖాదిద్వంద్వాలకు సహిష్ణుత, ఋతుకాల భార్యాసంగమరూపమైన బ్రహ్మచర్యం, త్రికరణశుద్ధిగా ఇతరులను హింసింపకుండటం, తనను బ్రహ్మముగా అనుభవానికి తెచ్చుకొనేందుకు ప్రయత్నించటం, నిత్యసంతుష్టి, భాగవతశాస్త్రమునందు ఆస్తిక్యబుద్ధి, సంచారశీలమైన మనస్సుయొక్క గతిని ప్రాణాయామంతోనూ, ఇహపరాలు రెండింటికీ పనికిరాని వాక్ప్రచారాన్ని మౌనంతోనూ, కర్మచాంచల్యాన్ని కోరికలను నిగ్రహించుకోవటం ద్వారాను నియమింపగలగటం, పాపసంకల్పాలను దరిచేయనీయని అంతఃకరణశుద్ధి, సత్యసంధత మొదలుగా గల భక్తిపరమాదర్శాలను ఉపదేశిస్తాడు. ఆ తర్వాత పిప్పలాయనుడు ముందుకు వచ్చి రాజుకు భగవత్స్వరూపాన్ని ధ్యానించటం ఎలాగో నేర్పి, శరీరగతులు ఆత్మజ్ఞానాన్ని పొంది అహంకారలయాన్ని సాధించటమే పరమార్థసాధకమని ప్రబోధించిన విషయం అచ్చమూ భాగవత విషయతాత్పర్యమే. మాలిన్యం లేని మనస్సులో తప్ప ఆత్మబింబదర్శనం సాధ్యం కాదని ఆయన అంటాడు. పిప్పలాయనుని తమ్ముడు ఆవిర్హోత్రుడు నిమిరాజుకు కర్మయోగాన్ని కరతలామలకం చేస్తాడు. ఇంద్రియజయాన్ని సాధించినవారే కర్మత్యాగానికి అర్హులని బోధిస్తాడు. అహంకారమనే హృదయగ్రంథిని త్రెంచివేసి, సర్వకర్మములను భగవంతునికి సమర్పిస్తే క్రమక్రమంగా నైష్కర్మ్యసిద్ధి కలుగుతుందని, భగవన్మహిమానుభవాన్ని చెందిన ఆత్మనిష్ఠే సన్మార్గమని ఆయన ప్రవచనం. ఆ తర్వాత ద్రమీళుడు ధర్మోద్ధరణార్థం భగవంతుడు వివిధకాలాలలో అవతరించినప్పటి గుణకర్మవిశేషాలను వివరించి, ఆ లీలలను సన్నుతించటం నేర్పుతాడు. తదనంతరం చమసుడు వేదోక్తకర్మలను సాధనాలుగా గ్రహించి వాటి పరిణామస్వరూపమైన ఆనందాన్ని పొందగోరినవారి వివేకస్థితిని, భగవత్ప్రాప్తిమార్గాన్ని విశదీకరిస్తాడు. నవకవులలో చివరివాడు కరభాజనుడు తన అన్నలు పరిపరి విధాలుగా చెప్పిన విషయమంతటినీ ఒక్క ‘భక్తి’ అన్న సద్ధర్మంలో ఇమిడ్చి, భగవంతుని ఆరాధనాపద్ధతులను, యుగయుగాలలో ఆయన మూర్తద్రవ్యాన్ని ఆశ్రయించి క్రియాచరణానికి పూనుకొన్నప్పటికి రూపనామాలను, గుణకర్మలను నిరూపించి, భగవన్నామసంకీర్తన వల్ల మనోమాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో రాజుకు చెబుతాడు. ఏకాదశ స్కంధంలో మనకు వారి అమోఘమైన ఆ దర్శనసారం పరిచయ మవుతుంది.

చిత్రమేమంటే, పంచమ స్కంధం ఆరంభంలో పరీక్షిత్తు శుకయోగిని కర్మబంధాలలో తగుల్కొనక ఆత్మారాములైన ఉత్తానపాద ప్రియవ్రతుల వంటి పుణ్యధర్ములకు సంసారాసక్తి ఏ కారణం వల్ల ఏ విధంగా కలిగిందని అడుగుతాడు. శుకయోగి అందుకు సమాధానంగా మహాపురుషుల జీవితాలలో ఎటువంటి ఎటువంటి ఊహింపరాని ఘటనలు జరుగుతాయో వివరించటం మొదలుపెడతాడు. ఋషభపుత్త్రులను గురించి, ఋషభపుత్త్రులలో నవయోగులను గురించి ప్రస్తావన వచ్చేసరికి అధ్యాత్మశాస్త్రగంభీరిమ వల్ల విషయం విషయాంతరంలోకి దూకుతుందని తెలిసిన శుకయోగి వారి పేర్లను మాత్రం చెప్పి,

“వ. (తొమ్మండ్రును) భాగవతధర్మప్రకాశకు లైరి; భగవన్మహిమోపబృంహితంబు లగు వారల చరిత్రంబులు ముందఱ నెఱింగించెద” (5-1-64)

అని ఈ పంచమ స్కంధంలో వారి గురించి విస్తరింపక తర్వాత చెబుతానని విషయాన్ని అప్పటికి దాటవేస్తాడు. మహాపురుషులకు భవబంధాలు ఎట్లా కలుగుతాయి? అని పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెబుతాడు. అంతటితో శుకయోగి ఆ విషయాన్ని మర్చిపోతాడని మనమనుకోకూడదు. ఆ తర్వాత ఎప్పుడో ఏకాదశ స్కంధంలో వాసుదేవ నారద సంవాదం వచ్చినపుడు ఆకస్మికంగా ఈ నవయోగుల ప్రస్తావనను తెస్తాడు. నారదుడు విదేహదేశపు రాజు నిమికి ఋషభపుత్త్రులు చేసిన పరమార్థోపదేశాన్ని వివరించినట్లుగా చెబుతూ శుకయోగి ‘తర్వాత చెబుతా’నని ఈ పంచమ స్కంధంలో అన్నమాటను గుర్తుంచుకొని నవయోగుల కథనప్పుడు సవిస్తరంగా చెబుతాడు. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే – ఎక్కడి పంచమ స్కంధం! ఎప్పటి ఏకాదశ స్కంధం! భాగవత కర్త కథాకథనంలోని చిన్న చిన్న విషయాలను కూడా ఏ మాత్రం మర్చిపోకుండా ఎంత శ్రద్ధగా గుర్తుంచుకొని పూర్వోత్తరాలను ఎంత సమయోచితంగా అనుసంధిస్తాడో ఈ సన్నివేశాన్ని బట్టి పాఠకులు సులభంగానే గ్రహిస్తారు. పోతనగారి భాగవతం ఎంత దురుద్ధరమైన స్థితిలో మన చేతికందినా, పంచమ స్కంధాన్ని తెలుగుచేసిన బొప్పరాజు గంగన కాని, ఏకాదశ స్కంధాన్ని పరిపూర్ణించిన వెలిగందల నారయ కాని ఈ విషయంలో తొట్రుపడక జాగరూకులై ఉండటం విశేషం.

మళ్ళీ ప్రకృతకథకు వద్దాము. ఋషభుడు సలక్షణంగా రాజధర్మాన్ని నిర్వహించి, పరమార్థవిదుడై అంత్యకాలంలో పరమహంస జీవితం గడుపుతాడు. ధర్మతత్పరు లైనవారు ఆయన జీవితోదంతాన్ని, బోధనల సారాన్ని ఈ స్కంధంలో తప్పక తెలుసుకోవాలి. జైన మతస్థులు కూడా తమ అధ్యాత్మగురువులైన తీర్థంకరులలో ఒకరిగా శ్రీ ఋషభాచార్యులను పరిగణించటం విశేషం. భారతీయధర్మంలో వెలసిన వివిధ మతాల తులనాత్మకపరిశీలన కావించేవారు వీరిరువురి బోధనలను తప్పక అధ్యయనం చెయ్యాలి.

        2.6. జడభరతుని కథ: భక్తితత్త్వం

ఋషభదేవుని సుతులందరిలో పెద్దవాడు అతని తర్వాత రాజ్యానికి వచ్చిన సుప్రసిద్ధుడు భరతుడు. ప్రజానురంజకుడైన ఆ రాజు పేరుమీదుగా అప్పటి వరకు అజనాభవర్షమని పిలువబడుతున్న భూమిభాగానికి భారతవర్షమని సరికొత్తగా వ్యవహారం ఏర్పడింది. సార్వభౌముడై దేశాన్ని ఒక్క గొడుగు క్రింద పరిపాలించి, ముసలితనం వచ్చాక అతను రాజధర్మానుసారం వానప్రస్థాన్ని స్వీకరిస్తాడు. మనోలయానికి అడ్డు నిలిచే బంధహేతువులైన సర్వసంగాలను త్యజించి, తపోదీక్షను గైకొన్న ఆ మహానుభావుడు అంత్యకాలం సమీపించిన చివరి రోజులలో కర్మవశాన మళ్ళీ బంధాలలో చిక్కుకొని, ఒక జింకపిల్ల పైని మమకారం పెట్టుకుని, అదే ప్రాణంగా జీవిస్తూ, ఆ బంధం వల్ల ఉత్తరజన్మలో హరిణమై పుడతాడు. ఆ విధంగా జననమరణాల చక్రభ్రమణంలో కొట్టుమిట్టుకులాడి, కొంతకాలానికి మళ్ళీ మనుష్యజన్మను పొందిన తర్వాత – కర్మలన్నీ ఫలకారణాలేనని గ్రహించి, కర్మారంభాన్ని కూడా విడిచిపెట్టి, నిష్కామజడత్వాన్ని అవలంబించి, జడభరతుడని పేరుపొందుతాడు.

ఒకనాడు తన ప్రాంతానికి వచ్చిన రహూగణుడనే రాజుకు భరతుడు పరమార్థసారాన్ని, జీవేశ్వరుల తత్త్వాన్ని వివరించటం ఈ స్కంధంలో పరమగంభీరంగా అమరింది. విష్ణుపురాణంలోని రెండవ అంశంలోనూ ఈ జడభరతోపాఖ్యానం ఒక గంభీరమైన భాగం. డా. వేదుల సూర్యనారాయణ శర్మగారు తమ గొప్ప రచన అంతరార్థభాగవతములో ఈ సన్నివేశం అంతరార్థాన్ని అద్వైతపరకంగా వివరించారు:

“ఈ కథ కర్మవాసనలు ఎట్లు పరిణమిస్తాయో విప్పిచెప్పింది. పుణ్యకర్మలతో ముక్తిసాధనలు నడిపినవారు కూడా చివరకు ఏదో ప్రబలమైన కర్మవాసనచే తిరిగి జన్మం పొందుతారనీ, మృగంగా పుట్టిన జన్మలో కూడ పూర్వజన్మజ్ఞానంతో తరించడం జరుగుతుంటుందని, అసంగయోగం ఒక్కటే కర్మవాసనలు నశింపు చేయగలదనీ, అసంగయోగం జీవితాంతం వరకూ నడిపినపుడు మరణకాలంలో జన్మవాసనలేవీ స్ఫురింపవనీ, అదే మోక్షహేతువానీ, ముక్తిమార్గానికి అసంగయోగ ప్రాధాన్యాన్ని వివరించడమే ఈ కథాకల్పనకు కారణంగా గమనించాలి. అసంగయోగం వల్ల జ్ఞానావిర్భావమూ, జ్ఞానావిర్భావం వల్ల అసంగయోగమూ లభించడానికి పరస్పరకారణాలుగా తెలిసికొని అసంగంతో జ్ఞానాన్ని, జ్ఞానంతో అసంగతత్త్వాన్ని అలవరచుకోవాలి.

భరతుడంటే జీవుడు. భరత అంటే బరువు యొక్క భావం అని అర్థం. భారం వహించడం అన్నమాట. భరత కలవాడు భరతుడు అవుతాడు. వాసనాభారం వహించిన జీవుడు ఇచ్చట భరతుడుగా చెప్పబడ్డాడు. భరతుడు రెండు జన్మలలోను భరతుడుగానే పేరు పెట్టబడ్డాడు. దానినిబట్టి భరత శబ్దానికి అంతరార్థంవుందనీ, వాసనాభారం వహించే జీవుడని దానికి అంతరార్థమనీ తెలిసికోవాలి. రెండవజన్మలో అంగిరసుడు అనేవాడు భరతుని తండ్రి. అంగము అనేదే స్వార్థంలో అణ్ ప్రత్యయం చేస్తే దేహము అనే అర్థంలో అంగము అవుతుంది. అంగము అంటే దేహం అన్నమాట. అంగము కలది అంగీ అని అవుతుంది. రసం అంటే జన్మనిచ్చే వాసన అని అర్థం వుంది. కాన దేహధారణకు కారణరూపమైన వాసనయే అంగీరసుడంటే. ఆ వాసనారూపం వల్లనే జీవుడు పుట్టేడు. అతడే భరతుడనే అంతరార్థం ఇందులో వస్తుంది. ఇదే అంగీరసుని పుత్రుడు భరతుడన్న కథావాక్యానికి అంతరార్థంగా భావించాలి.

అంగీరసునకు ఇద్దరు భార్యలు. అనగా అపరాశక్తి, పరాశక్తి. వాసనలు రెండు రకాలు. తిరిగి తిరిగి జన్మనిచ్చేవి ఒక రకం వాసనలు. అవి అపరాశక్తివి. ముక్తినిచ్చే సత్కర్మవాసనలు మఱొక రకం. అవి పరాశక్తివి. మొదటిది ప్రవృత్తిమార్గం కలది. రెండవది నివృత్తిమార్గం కలది. అంగిరసునికి మొదటి భార్యవల్ల తొమ్మండుగురు బిడ్డలు కల్గేరు. అంటే అపరాశక్తి వల్ల నవవిధములైన రసములు పుట్టేయన్నమాట. అవే కర్మవాసనాప్రాబల్యం కల్గి ‘పునరపి జననం పునరపి మరణం’ కల జన్మపరిభ్రమణం ఇచ్చే నవరసాల కర్మలు. అవి అపరాశక్తి యొక్క ప్రవృత్తిమార్గం వల్లనే కల్గుతాయనేదే అంగీరసునికి ప్రథమభార్య యందు తొమ్మండుగురు కొడుకులు పుట్టేరన్నదాని అంతరార్థంగా భావింపవచ్చు. అంగీరసుని రెండవ భార్య అనగా పరాశక్తి యొక్క మార్గం. వెంటనే ఆ జన్మలోనే ముక్తినివ్వగల సత్కర్మవాసనలు దానివల్ల ఫలిస్తాయి. ఆమెవల్ల పురుషుడు, స్త్రీ పుట్టేరు. పురుషుడు అంటే జీవుడు తనలోనికి చేర్చుకొనే పరమాత్మ. స్త్రీ అంటే ఆ పరమాత్మ వుండటానికి కారణమైన జీవునియొక్క సాత్త్వికగుణ ప్రకృతి అని అంతరార్థం. ప్రకృతిపురుషవివేకంతో ఆ జన్మలో సత్కర్మవాసనా నాశం కల్గి ముక్తి లభిస్తుందని చెప్పడానికే ముక్తి నొందవలసిన భరతుడు అంగీరసుని రెండవ భార్యకు అనగా పరాశక్తికి పుత్రుడుగా పుట్టేడని చెప్పడం జరిగింది. అంగీరసుని మొదటిభార్య బిడ్డలు భరతుని ఆదరించలేదని చెప్పడం, అపరాశక్తికి సంభవించిన ఐహికములైన వాసనలేవీ భరతుణ్ణి అంటియుండలేదని చెప్పడమే అని భావించాలి.” — (1999 నాటి ముద్రణ: పుటలు. 94 – 95)

ఈ జడభరతోపాఖ్యానం భాగవత పంచమ స్కంధంలోని ముఖ్యఘట్టాలలో ఒకటి. ఇందులోని ప్రతీకలను శంకర – మధ్వ – రామానుజుల అద్వైత – ద్వైత – విశిష్టాద్వైత దర్శనాల సారాన్ని అనుసరించి వ్యాఖ్యాతలు వివిధరీతుల విపులంగా వివరించారు. ఆ వివరణకు వారు ప్రమాణీకరించిన ఉపనిషద్వాక్యావళిని పాఠకులు శ్రద్ధాసక్తులతో సమన్వయించుకొని, నిత్యానుసంధానంలో మననం చేయవలసి ఉంటుంది. అదీగాక ఆ వ్యాఖ్యలను బట్టి పాఠకులకు శ్రీమద్భాగవతాన్ని సాధకులు ఎన్ని విధాలుగా దర్శింపవచ్చునో తెలుసుకొనే అవకాశం ఉంటుంది. అతిగహనమైన వేదాంతసారాన్ని బోధిస్తూ అద్భుతమైన సంవిధానశిల్పంతో ఎంతో ఆకర్షణీయంగా రచింపబడిన ఖండం ఇది.

        2.7. భువనకోశ వర్ణనం

మనువంశ రాజుల కథాకథనం తర్వాత ప్రధానంగా ఇందులో భువనకోశపు స్వరూపవర్ణన ఉన్నది. ఆధునికవిజ్ఞానశాస్త్రంతో పరిచయం ఉన్న పాఠకులకు ఇందులోని భూగోళ ఖగోళ విజ్ఞానాల స్వరూపమంతా శాస్త్రదృష్టి లోపించిన కట్టుకథే కాని కంటికి కనిపించే భౌతికసత్యం కాదన్న అపార్థం కలిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రసక్తమైనది కేవలం ఐహికదృష్టితో కావించిన వర్ణన కాదని మనము గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని గ్రహించినవాడు కనుకనే పరీక్షిత్తు ఈ సన్నివేశంలో –

“గుణమయంబును, స్థూలరూపంబును నైన శ్రీహరి శరీరం బగు నీ లోకంబునందు నిలిపిన చిత్తం బగుణం బగు; సూక్ష్మంబును, నాత్మజ్యోతియు, బ్రహ్మంబు నైన వాసుదేవుని యందు నిల్చు.” (5-2-14)

అని శుకయోగితో అంటాడు. సత్త్వరజస్తమస్సులతో కూడిన ఈ సమస్తవిశ్వం ఆ విశ్వాత్ముని యొక్క స్థూలరూపమని భావించి, ఆ స్థూలరూపంలో గోచరిస్తున్న అద్భుతావహమైన సౌందర్యాన్ని, మహిమను ధ్యానంలో ధారణ చేసినట్లయితే, శ్రీ వాసుదేవుని సర్వాంతర్యామితను స్వానుభవంలో అర్థం చేసికొని, ఆ పరమేశ్వరుని సూక్ష్మతత్త్వాన్ని దర్శించటం సాధ్యమవుతుంది. సకలలోకోత్తరుడని మనము భావిస్తున్న ఆ భగవానుని ఉనికి కల్పితమాత్రం కాదని; కేవలసత్యమని తెలియజెప్పడమే ఈ సన్నివేశ వర్ణనలోని అంతరార్థం. నిర్గుణమైన ఆత్మతత్త్వాన్ని తంత్రమార్గంలో తెలుసుకొనగోరినవారు ప్రాథమికదశలో యంత్రాలకిచ్చే ప్రాధాన్యం ఎటువంటిదో, భువనకోశవర్ణనలో భూగోళస్వరూపానికి ఉన్న ప్రాధాన్యం కూడా అంతే. ఇదంతా ధ్యానానికి కూర్చున్న సాధకుల కోసం.

        2.8. సాధనరహస్యం

భగవత్తత్త్వరహస్యాన్ని తెలుసుకోవటం అంత సులభం కాదు. ఎక్కడో ఏదో చదివినంత మాత్రాననో, ఎవరో ఏదో చెబితేనో అది బోధపడదు. అందుకే దానిని కేవలానుభవానందస్వరూపం అన్నారు. ఈశ్వరుని శక్తివిలాసం ఎంత ఇంద్రియాతీతమో అంత ఇంద్రియానుభవయోగ్యం. గురువు యొక్క సదుపదేశాన్ని పొంది, సాధన మొదలుపెట్టి, ఈ భువనాల స్వరూపాన్ని ధ్యానిస్తుంటే క్రమంగా ఈశ్వరుని దివ్యశక్తి మానవమనోమందిరంలోకి ప్రవేశిస్తుందని శ్రీమద్భాగవతం బోధిస్తున్నది. విశ్వరూపాన్ని గ్రహించి అటువంటి దివ్యానుభవాన్ని సాధించిన సాధకులే సిద్ధులు. ఆ సిద్ధి సాధనకోసమే భాగవతాన్ని శుకయోగి పరీక్షిత్తుకు వినిపిస్తాడు. లేకపోతే, నిర్విక్రియుడైన శుకమహర్షి స్వయంగా తానై వచ్చి వినుపింపగోరటం ఏమిటి? శాపగ్రస్తజీవితాన్ని గడుపుతూ, ప్రాయోపవేశం చేసి, కర్మావధికోసం ఎదురుచూస్తున్న పరీక్షిత్తు ఆ విశ్వరూపుని కథను మనసారా వినటం ఏమిటి? స్వరబ్రహ్మభూషితమైన వాగ్వీణపై వేదవ్యాసమహర్షి ఆ ఆత్మసంగీతాన్ని మనకోసం శ్రవణపర్వంగా మ్రోగించటంలోని అంతరార్థం ఏమిటి? శ్రవణ మననాదుల యందు శ్రద్ధావంతులైన సాధకులకు, భాగవతధర్ములకు రమ్యమైన కథాతత్త్వముఖంగా బ్రహ్మోపపదేశమే.

ఈ పంచమ స్కంధమంతా భగవంతుని స్థూలరూపాన్ని ధ్యానమార్గంలో దర్శించి, స్వప్రకాశానందమయమైన ఆయన సూక్ష్మరూపాన్ని స్వానుభవంలో తెలుసుకొనగోరిన సాధకుల మననధారణ కోసమే తప్ప కేవలం భూగోళ ఖగోళ విజ్ఞానాలను సమీకరించాలనే ఐహికదృష్టి శుకయోగికి లేదు. ఆ విధమైన ధ్యానధారణ వల్ల శుద్ధము (ఎన్నడూ ఎటువంటి దోషాలూ లేని ఆత్మము యొక్క స్వస్వరూపం), బుద్ధము (బోధరూపమైనది), ముక్తము (బంధాలకు అతీతమైనది), కేవలము (అద్వితీయమైనది), అఖండము (అనంతము, అఖిలాత్మకము అయినది), సచ్చిదానందస్వరూపము (నిత్య జ్ఞాన సుఖైక స్వరూపమైన బ్రహ్మము) అయిన భగవత్తత్త్వాన్ని గ్రహించినవారికి – స్థూలరూపం నుంచి సూక్ష్మరూపంలోకి ప్రవేశింపజేసే సాధనరహస్యం అర్థమవుతుందని ఆయన ఉద్దేశం.

        2.9. నరకలోకాల వర్ణన

పంచమ స్కంధం చివర వివిధ నరకలోకాల వర్ణనం ఉన్నది. నరకము అంటే నృ = మానవులయొక్క, అక = పాపముల ఫలితాన్ని అనుభవించటానికి విధింపబడిన భోగస్థానమన్నమాట. ఆ నరకములు అనేకప్రకారాలుగా ఉంటాయి. వాటిలో ఇరవైఎనిమిదింటి వివరణ ఈ స్కంధంలో చేయబడింది. అవన్నీ వివరణమాత్రానికే గాని చేసికొన్నవారికి చేసికొన్నంత ఫలితం. ఆ లోకాలన్నీ యాతనాభూములు. అక్కడ కేవలం జీవుల యొక్క పాపాలకు శిక్ష విధించటం ఒక్కటే ఉద్దేశం కాదు. లోకంలో ప్రతిషిద్ధలక్షణమైన అధర్మాన్ని కావించేవారి శ్రద్ధావైసాదృశ్యం బహురీతులుగా ఉన్నట్లే, వారికి కలిగే కర్మఫలాలు కూడా బహురీతులుగా ఉంటాయి. అనాదిసిద్ధమైన అవిద్య వలన కామనలు చెలరేగి పాపకర్మలను చేయించినప్పుడు, అందుకు పరిణామంగా సిద్ధించే ఫలాలను అనుభవించటం వల్ల జీవునికి మళ్ళీ చిత్తపరిశుద్ధి, నైర్మల్యం కలుగుతాయి. అందుచేతనే ఆనాటి పౌరాణికులు యాతనానుభవంలో మనస్సును పశ్చాత్తాపతప్తం కావించి, ఆ పాపసంకల్పాలు మళ్ళీ తలయెత్తకుండా ప్రక్షాళింపగల మహాశక్తి ఉన్నదని నిశ్చయించారు. ఆ విధంగా దుష్కర్మఫలాన్ని అనుభవించిన జీవునికి మళ్ళీ సన్మార్గంలోకి ప్రవేశించి, ఆత్మౌన్నత్యాన్ని సాధించేందుకు మరొక అవకాశం లభిస్తుంది. అందుచేత దోషకర్మకు ప్రాయశ్చిత్తంగా కష్టాలను విధించటం జరిగింది.

3. శ్రీరామాంకితమా? శ్రీకృష్ణాంకితమా?
పోతనగారు తెనుగుచేసిన భాగవతం శ్రీరామచంద్రునికి అంకితమైంది. “పలికించెడువాఁడు రామభద్రుం” డని పోతనగారు తానే ప్రథమ స్కంధం అవతారికలో (1-16) చెప్పుకొన్నారు. భాగవతం ప్రథమ స్కంధాంతంలోనూ, ద్వితీయ స్కంధం మొదలుకొని ద్వాదశ స్కంధం వరకు గల స్కంధాది స్కంధాంతాలలో ఉన్న పద్యాలన్నీ – ఒక్క ఈ పంచమ స్కంధంలోనూ, ఏర్చూరి సింగనామాత్యుని షష్ఠ స్కంధంలోనూ తప్ప – అన్నీ శ్రీరామాంకితం గానే ఉన్నాయి. ప్రథమ స్కంధం మొదట గల ఇష్టదేవతాప్రార్థనలో శ్రీరామస్తుతిని గల పద్యాలు లేవు. ప్రథమ స్కంధంలోని తొలిపద్యం శ్రీకృష్ణాంకితంగా ఉన్నది. అవతారికాలోని అంకితం పద్యాలు శ్రీకృష్ణాంకితంగా ఉన్నాయి. పోతనగారికి శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించి –

“మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబు దెనుంగు సేయుము; నీకు భవబంధంబులు దెగు” (1-15)

అని ఆనతిచ్చేంతవరకు ఆయనకు శ్రీరామచంద్రార్పణం చేయాలన్న ఉద్దేశం రాలేదేమో అనుకోవాలి. ఆ మహాకవి చిత్రించిన నాటకీయమైన అవతారికలోని సన్నివేశకథనానికి లోగిన విమర్శకులు కృతిరచన పూర్తయిన తర్వాత కృత్యాదిరచన జరిగినందువల్ల పెక్కు మార్పులు చోటుచేసుకొన్నాయేమో అన్న అంశాన్ని పరిశీలించినట్లు కనబడదు. అవతారికను బట్టి భగవత్సాక్షాత్కారం జరిగిన తర్వాతనే ఆయన కృతిరచనకు శ్రీకారం చుట్టాడని నిశ్చయించాలి. కృతిరచనకు, కృత్యాదిరచనకు నడిమికాలంలో తనకు అంకితం చేయమని అడిగిన రాజును ధిక్కరింపవలసివచ్చిందేమో. మనుజేశ్వరాధములను తిరస్కరింపవలసివచ్చిందేమో. అగ్నికి ఆజ్యం తోడయినట్లు ఓరుగల్లుపై మహమ్మదీయుల దండయాత్ర మరికొంత కాలానికి జరిగి స్కంధాల విధ్వంసానికి మరింత దోహదమయిందేమో చెప్పలేము. అందదుకులుగా ఉన్న అవతారికను వ్రాతప్రతులతో మళ్ళీ ఒకసారి సరిపోల్చి పునఃపరిష్కరిస్తేనే గాని భాగవతకావ్యస్వరూపాన్ని గురించి నిర్ధారణగా ఏ సంగతీ చెప్పటానికి వీలులేకుండా ఉంది.

భాగవతం ఆద్యపద్యం శ్రీకృష్ణస్తుతి. స్కంధాద్యంతపద్యాలలో శ్రీరామాంకితం కాని పద్యాలు గంగనార్యుని ఈ పంచమ స్కంధంలోనూ, సింగనామాత్యుని షష్ఠ స్కంధంలోనూ తప్ప మరెక్కడా లేవు. సింగనామాత్యుని షష్ఠ స్కంధంలోని తొలిపద్యంలోని విశేషణాలు లక్ష్మీసమేతుడైన శ్రీమహావిష్ణువును ప్రతిపాదిస్తున్నాయి. వాటిని శ్రీరామాంకితంగా అన్వయించటం సమంజసంగా ఉండదు. పోతనగారి వలెనే ఏర్చూరి సింగన తొలిపద్యాన్ని శ్రీకృష్ణాంకితం గానూ, స్కంధాంతంలో శ్రీరామాంకితం గానూ పద్యాలను కూర్చాడనుకోవాలి. షష్ఠస్కంధం చివర “రాజీవరాజపూజా, శ్రీజిత గోపీకటాక్షసేవాంతరవి, భ్రాజితమూర్తి! మదోద్ధత, రాజకులోత్సాద! రామరాజాఖ్యనిధీ!” అని ఉన్న (6-527) పద్యంలోని రామరాజాఖ్యనిధీ! అని ఉన్న దళాన్ని బట్టి ఆ స్కంధాంతపద్యాలను శ్రీరామాంకితంగా అన్వయించుకొంటే పోతనగారి మార్గం అప్రతిహత మైనట్లవుతుంది. కొన్ని వ్రాతప్రతులలో షష్ఠ స్కంధం మొదట “శ్రీ విశ్వభారభరణ, ప్రావీణ్యవిభాసమాన ఫణిరాణ్ణిభబా, హావిపులవిజయదోహల, రావణమదకరిమృగేంద్ర! రామనరేంద్రా!” అన్న అద్భుతావహమైన పద్యమొకటి ఉన్నది కాని, అది పోతనగారి మార్గానుసారి కాదని కాబోలు, పరిష్కర్తలు దానిని స్వీకరింపలేదు. మునుపే చెప్పినట్లు పోతనగారి ప్రథమ స్కంధంలోని తొలిపద్యం, అవతారికలోని షష్ఠ్యంతాలూ శ్రీకృష్ణాంకితంగా ఉన్నాయి. ప్రథమ స్కంధం చివరి నుంచి పద్యాలు శ్రీరామాంకితంగా ఉన్నాయి. ఈ పంచమ స్కంధం వ్రాతప్రతులు పెక్కింటిలో ఆశ్వాసాదిపద్యం శ్రీకృష్ణపరం గానూ, కొన్నింటిలో మాత్రం శ్రీరామపరం గానూ ఉన్నది. శ్రీరామపరంగా ఉన్న ఆ పద్యంలోని విశేషణాలు కొంత ప్రాథమికంగానూ, ఆ రచన కొంత కృతకంగానూ కనుపించటంవల్ల గంగనార్యుడు తన వంతు భాగవతభాగాన్ని శ్రీకృష్ణాంకితం చేశాడనే పూర్వముద్రణల పరిష్కర్తలు నిర్ణయించారు.

శ్రీకర! కరుణాసాగర!
ప్రాకటలక్ష్మీకళత్ర! భవ్యచరిత్రా!
లోకాతీతగుణాశ్రయ!
గోకులవిస్తార! నందగోపకుమారా! (5-1-1)

ఇది పంచమ స్కంధంలోని మొదటి ఆశ్వాసంలోని తొలిపద్యం. సలక్షణంగా ఉన్నది. దీని స్థానంలో –

శ్రీసీతానయనోత్పల!
శ్రీసతిసహజన్మ! త్రిదశసేవిత! యాశా
వాసప్రకాశ! జయ భా
షాసురపతిహరణ! రామచంద్రనృపాలా!

అని కొన్ని కొన్ని వ్రాతప్రతులలోని పద్యం. ఎవరో పద్యరచనలో అకృతకృత్యులైన సామాన్యుల కూటరచనమని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. దీనిని ప్రమాణంగా స్వీకరించటం కంటె గంగనామాత్యుడు తన పంచమ స్కంధాన్ని శ్రీకృష్ణాంకితం చేశాడనే భావించటం మేలు.

ద్వితీయాశ్వాసం చివరను –

జలజభవాదిదేవమునిసన్నుత! తీర్థపదాంబుజాత! ని
ర్మలనవరత్ననూపురవిరాజిత! కౌస్తుభభూషణాంగ! యు
జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ! శ్రీ
నిలయశరీర! కృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా! (5-2-163)

శ్రీతరుణీహృదయస్థిత!
పాతకహర! సర్వలోకపావన! భువనా
తీత! గుణాశ్రయ! యతివి
ఖ్యాతసురార్చితపదాబ్జ! కంసవిదారీ! (5-2-164)

దండితారిసమూహ! భక్తినిధాన! దానవిహార! మా
ర్తాండమండలమధ్యసంస్థిత! తత్త్వరూప! గదాసికో
దండసుదర్శనాంక! సుధాకరార్కసునేత్ర! భూ
మండలోద్ధర! ణార్తపోషణ! మత్తదైత్యనివారణా! (5-2-165)

అన్న పద్యాలున్నాయి. ఇవి శ్రీకృష్ణాంకితాలు. వీటిలో మొదటి పద్యం కొన్ని వ్రాతప్రతులలో –

జలజభవాదిదేవమునిసన్నుత! తీర్థపదాంబుజాత! ని
ర్మలనవరత్ననూపురవిరాజిత! కౌస్తుభభూషణాంగ! యు
జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ! శ్రీ
నిలయ! నిశాచరేంద్రఘననీరదమారుత! రాఘవేశ్వరా!

అన్న రూపంతోనూ, చివరి పద్యం –

దండితారిసమూహ! భక్తినిధాన! దానవిహార! మా
ర్తాండవంశసుధాబ్ధిపూరసుధామయూఖ! గదాసికో
దండసుదర్శనాంక! సుధాకరార్కసునేత్ర! భూ
మండలేశ! నతార్తిపోషణ! మత్తదైత్యనివారణా!

అన్న మార్పుతోనూ శ్రీరామాంకితంగా ఉన్నాయి. రెండవ పద్యం ఏ మార్పూ లేకుండా శ్రీకృష్ణస్తుతిపరకంగానే ఉన్నది. ఎందువల్లనో శ్రీకృష్ణాంకితంగా ఉన్న పద్యాలూ, శ్రీరామాంకితంగా ఉన్న పద్యాలూ రెండూ సంతృప్తికరంగా లేవు. ఉన్నంతలో ఏదో ఒక అర్థం చెప్పుకొని సరిపెట్టుకొనవలసినట్లే ఉన్నాయి కాని, మహాకవిరచితాలుగా కనబడవు. “ఉ,జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ!” అన్నప్పుడు ఉజ్జ్వల = ప్రకాశమానమైన, తులసీ = తులసి మాల యొక్క, కురంగమద = కస్తూరీమృగమదము యొక్క, వాసన = వాసనము (సురభీకరణము, గుబాళింపు) చేత, వాసిత = పరిమళిస్తున్న, దివ్య = మనోహరమైన, దేహ = శరీరము గల స్వామీ అని అర్థం చెప్పుకోవాలి. మొదటి పద్యంలో “జలజభవాదిదేవమునిసన్నుత! తీర్థపదాంబుజాత!” అన్న తర్వాత, వెంటనే ఆ రెండవ పద్యంలో పునఃకథితంగా “అతివిఖ్యాతసురార్చితపదాబ్జ!” అనటం సముచితంగా లేదు. శ్రీకృష్ణార్థంలో “శ్రీనిలయశరీర! కృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా!” అన్నదాని కంటె శ్రీరామాంకితంగా ఉన్నప్పటి “శ్రీనిలయ! నిశాచరేంద్రఘననీరదమారుత! రాఘవేశ్వరా!” అన్న దళమే కొంత భావశుద్ధితో సమంజసంగా అనిపిస్తుంది. శ్రీకృష్ణాంకితంగా శ్రీ = లక్ష్మీదేవికి, నిలయ = ఆవాసమైన, శరీర = తనువు గలవాడా, కృష్ణ = శ్రీకృష్ణా, ధరణీధర = భూదేవిని వక్షఃస్థలమున ధరించిన స్వామీ అని విడదీయటమూ, ఆ సమస్తభిన్నమైన రూపచిత్రమూ సరిగా లేవు. అంతకంటె, శ్రీనిలయ = శ్రీదేవీస్వరూపిణి అయిన సీతాదేవికి ఆవాసస్థానమవైన ప్రభూ, నిశాచరేంద్ర = రాక్షసరాజు లనెడి, ఘననీరద = దట్టంగా కమ్ముకొన్న మబ్బులకు, మారుత = తూలగొట్టే వాయుదేవుడ వైనవాడా అని శ్రీరామపరంగా అర్థం చెప్పుకోవటం సులభం. రెండింటిలో ఏ పాఠాన్ని తీసుకొందామన్నా ఆ వెంటనే ఉన్న (5-2-164) పద్యంలోని “శ్రీతరుణీహృదయస్థిత” అన్న సంబుద్ధి కొంత చర్చనీయం. ఇందాక శ్రీదేవికి ఆవాసమైన అన్నాడు కాబట్టి, ఇప్పుడు శ్రీదేవి హృదయంలో నెలకొన్నవాడు (ఆమె తన శరీరమందు, తాను ఆమె హృదయమునందు ఉన్న దంపతులు వారు) అని భావించాలి. “పాతకహర! సర్వలోకపావన!” అన్నదీ సరిగా లేదు. ఈ పంచమ స్కంధంలో వివిధపాపాలను చేసినవారికి భోగస్థానములైన వివిధనరకాల విపులవర్ణన ఉన్నది కాబట్టీ, శ్రీమన్నారాయణుని నామసంకీర్తనం సర్వపాపాలను హరింపజేస్తుందన్న ప్రస్తావం ఉన్నది కాబట్టీ “పాతకహర!” అన్న శ్రీకృష్ణసంబోధన సార్థకం గానే ఉన్నది కాని, ఆ వెంటనే సర్వలోకాలను పవిత్రీకరించేవాడా అర్థంలో “సర్వలోకపావన!” అన్న పునరుక్తి ఏ మాత్రం సమంజసంగా లేదు. పైగా మొదటి ఆశ్వాసం మొదటి పద్యంలోని “లోకాతీత! గుణాశ్రయ!” అన్నదే ఇందులో “భువనాతీత! గుణాశ్రయ!” అని పునరావృత్తమయింది. వ్రాతప్రతులను మళ్ళీ ఒకసారి తైపారువేసి పాఠాలన్నింటిని సమీకరించి సరిచూస్తే కాని సరైన పాఠమేదో, గంగనామాత్యుని రచన ఏదో తెలియరాని అస్తవ్యస్తపరిస్థితి నెలకొని ఉన్నది. పోతనగారి వలె ఆశ్వాసాదిని శ్రీకృష్ణాంకితం గానూ, ఆశ్వాసాంతంలో శ్రీరామాంకితం గానూ సరిచేయాలని తొలిరోజులలోనే ఎవరైనా ప్రయత్నించారేమో! అనుకొనవలసి వస్తున్నది. ప్రస్తుతస్థిత్యనుసారం అర్థావగతిని బట్టి బొప్పరాజు గంగనామాత్యుని పంచమ స్కంధం శ్రీకృష్ణాంకితమని అనుకోవటమే మేలు.
-----------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

Saturday, November 3, 2018

భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం-1


భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం-1



సాహితీమిత్రులారా!

ఆంధ్ర జాతీయమహాకవి బమ్మెర పోతనామాత్యుడు విరచించిన పరమపవిత్రమైన శ్రీ మహాభాగవతంలో భక్తకవి బొప్పన గంగనామాత్యుడు పరిపూర్ణించిన పంచమ స్కంధం గంభీరమైన తత్త్వార్థబోధకత వల్ల, తిరుగులేని కవితారామణీయకం మూలాన రసోదంచితమని పేరెన్నిక గన్నది. ఈ పంచమ స్కంధాన్ని ‘సకలసుకవిజనానందకరం’గా సుజనమనోహరంగా ఆంధ్రీకరించి, చరిత్రలో పోతన్న గారి సహపంక్తికి నోచుకొన్న మహాకవి బొప్పరాజు గంగనామాత్యుడు నిజంగా ధన్యజీవి. శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించి, ఆ స్వామి వైభవప్రకాశనకు తన కవితను పరికరింపజేసి, పోతనగారి వలెనే తాను తరింపగోరి తెలుగు జాతిని తరింపజేసిన పుణ్యధను డాయన. ఈ కథాకథనముఖాన శృంగార వైరాగ్యాలకు ఆలవాలమైన మనువంశ రాజపురుషుల యొక్క జీవితసందేశబోధకు, విరాట్పురుషుడు కల్పించిన ఈ భువనకోశవర్ణనకు, పాపులకు గమ్యస్థానాలయిన నరకలోకాల వర్ణనకు అవకాశం లభించి భగవన్మహిమను, భగవల్లీలలను నోరారా వర్ణించి తన శిక్షణను, కారయిత్రీశక్తిని సార్థకం చేసుకొన్నాడు.

గంగనార్యుని పద్యశైలి మనోహరంగా ఉంటుంది. అనువాదం మూలానికి అత్యంతవిధేయం. ఎక్కడైనా వ్యాఖ్యానసాపేక్షములైన దళాలు కనిపిస్తే వాటిని శ్రీధరస్వామి భావార్థదీపికా వ్యాఖ్యను అనుసరించి తెలుగు చేశాడు. శ్రీధరస్వామి భావార్థదీపికలో లేకుండా – ఆ తర్వాత వెలసిన వీరరాఘవుని భాగవతచంద్రచంద్రికా వ్యాఖ్యలో మాత్రమే ఉన్న పంక్తులు కొన్ని గంగనార్యుని అనువాదంలో యథాతథంగా కానవస్తాయి. అవి తాళపత్రాలలో పూర్వకాలంలోనే చేరినవో లేక ఎవరో ఇటీవలి కాలంలో చేర్చినవో వ్రాతప్రతులన్నింటినీ పరిశీలించితే కాని నిర్ధారించటం సాధ్యం కాదు.

అనువాదపద్ధతిని చూస్తే గంగనార్యునికి తన కథాకథననైపుణిని, పద్యనిర్మాణకౌశలాన్ని ప్రదర్శించటం కంటె సన్నివేశాన్ని సుభగంగా నడుపుకొని పోవడమే సమ్మతమని అనిపిస్తుంది. పోతనగారి వలె సంస్కృతానికి సమసంస్కృతంగా, వ్యాఖ్యలను మించిన వ్యాఖ్యగా పద్యాన్ని కదను తొక్కించాలనే అభినివేశం ఉన్నవాడు కాదు. అందువల్ల సాత్త్వికమైన మార్గాన్ని ఆశ్రయించి ధారాళమైన ధారాకౌశలంతో కథను సరసంగా సంక్షేపించాడు. వేదాంతఘట్టాలలో కొంత తొట్రుపాటున్నప్పటికీ శృంగారసన్నివేశంలో కూర్పు సరసంగానే కొలువు తీరింది. అప్రతీతపదాలతో ప్రౌఢమైన ప్రయోగాలను చేయటం కంటె మూలాన్ని సరళంగా తెలుగు చేయటమే ఆయన అభిమతం. అనువాదకళలో మారన, వెన్నెలకంటి సూరనల వలె పౌరాణిక కవుల కోవకు చెందినవాడు.

1. గంగనామాత్యుని జీవిత విశేషాలు
తెలుగు కవులలో పెక్కుమంది వలెనే గంగనామాత్యుని జీవితవిశేషాలేవీ చరిత్ర కెక్కలేదు. స్కంధాంతగద్యలలో — “ఇది శ్రీసకలసుకవిజనానందకర బొప్పనామాత్యపుత్త్ర గంగనార్యప్రణీతం బైన శ్రీమద్భాగవతమహాపురాణంబు నందు,” అని చెప్పుకొన్నదానిని బట్టి నియోగి బ్రాహ్మణుడని, బొప్పనామాత్యుల వారి తనయుడని మాత్రమే తెలుస్తున్నది. సకలసుకవిజనానందకరుడు కావటానికి ఏమేమి వ్రాశాడో మనకిప్పుడు తెలియదు. ఈయన నిజాము రాష్ట్రవాసి అని ఆంధ్రకవితరంగిణిలో చాగంటి శేషయ్యగారు ఊహించారు.

గంగన అన్నపేరు తెలంగాణంలోని నేటి ధర్మపురి చెంత పోతన్నగారికి శ్రీరామచంద్రప్రభువు సాక్షాత్కారం సిద్ధించి, శ్రీమహాభాగవతావరణకు కారణతీర్థమైన పుణ్యగంగనే సూచిస్తున్నదనీ, గంగనామాత్యుడు ఆ సమీపప్రాంతవాసి అనీ అక్కడి పెద్దలంటారు. బమ్మెర పోతనామాత్యులవారు దత్తమండలంలోని ఒంటిమిట్టకు చెందినవారని విశ్వసించిన విమర్శకులెవరూ ఈయన ప్రాంతీయతను గురించి చర్చింపలేదు. అంతమాత్రాన ఈ వివాదం పరిష్కృతమైనట్లు భావించటం సరికాదు. ఉభయవాదాలను ఇంకా సమీకరించి, నిజాన్ని నిగ్గు తేల్చవలసి ఉన్నది. భాగవతకవులు తెలంగాణానికే చెందినవారయినా, రెండు ప్రాంతాలలో సంచరించి ఉండరని, ప్రాంతీయాభిమానాలు వట్టి నిరాధార కల్పనలని నిర్ణయించటం కష్టం.

ఇంతవఱకు సాహిత్య చరిత్రకారులు గంగనార్యుని కాలాదికం నిర్ణయించేందుకు సాధనాలేవీ చూపలేదు. ఏకాదశ స్కంధాన్ని రచించిన వెలిగందల నారయకు తర్వాతి వాడని కొందఱు, షష్ఠస్కంధాన్ని రచించిన ఏర్చూరి సింగనకు సమకాలికుడని కొందఱు భావిస్తున్నారు. అయితే, వారెవరూ గుర్తింపని సాహిత్యికవిశేషం ఒకటున్నది. ఆ విశేషాన్ని వివరిస్తాను:

        1.1. గంగనార్యుడు – హరిభట్టు

గంగనార్యునికి అత్యంత సమీపకాలికుడైన మహాకవి హరిభట్టు రచించిన మత్స్యపురాణంలో, గంగనార్యుని పంచమ స్కంధ పద్యాన్ని పోలిన రచన ఒకటి కనుపిస్తుంది. మత్స్యపురాణం 1912లోనే అచ్చయినప్పటికీ అంత ప్రసిద్ధికి రానందువల్ల ఈ విషయం చరిత్రకారుల దృష్టికి రాలేదు. మత్స్యపురాణ – పంచమ స్కంధాలలోని ఆ పద్యాలు రెండింటినీ సరిపోల్చి, ఎవరు ఎవరికి అనుకర్తలో నిశ్చయింపగలిగితే ఈ చిక్కుముడి వీడుతుందని నా భావం.

ఆ రెండు పద్యాలనూ చూడండి –

గ్రైవేయకంకణాంగదహారకుండలప్రభ లలితస్ఫూర్తిఁ బరిఢవిల్ల
నవరత్నకీలితోన్నతకిరీటద్యుతు లాశావకాశంబు లలమికొనఁగఁ
గటివిలంబితహేమకాంచీవిలగ్నమై రాజితపీతాంబరంబు మెఱయ
శ్రీవత్సకౌస్తుభశ్రీరమాయుక్త మై తులసికాదామంబు తొంగలింప

నతిరయంబున గరుడవాహనసమేతుఁ
డగుచు విష్ణుండు శంఖచక్రాది విశ్రు
తాయుధంబుల ధరియించి యవనిపతికి
దక్షణంబున నచట బ్రత్యక్ష మయ్యె. — (హరిభట్టు మత్స్యపురాణము, 4-140)

ఇది హరిభట్టు మత్స్యపురాణంలోని పద్యం. కంఠసీమను దివ్యహారాలు, ముంజేతుల కంకణాలు, కాలి అందెలు, వక్షఃస్థలాన వెలలేని ముత్యాల దండలు, చెవులకు మకరకుండలాల వెలుగు శృంగారవిస్ఫురణతో అతిశయిస్తుండగా; నవరత్నాలు పొదిగిన సమున్నతమైన కిరీటము యొక్క దీధితులు ఎల్లదిక్కులను ఆవరింపగా; నెన్నడుమును ఆశ్రయించిన బంగరు మొలత్రాడుకు దీటుగా పసిమి వన్నె పట్టుపంచె మిరుమిట్లు గొలుపుతుండగా; భృగుమహర్షి కన్నుమిన్ను గానక తన్నినపుడు రొమ్మున తత్పదాఘాతరూపమై ఏర్పడిన శ్రీవత్సమనే మచ్చ, మునుపు దేవదానవులు క్షీరసముద్రాన్ని చిలికినపుడు ఆవిర్భవించిన కౌస్తుభరత్నం, ఆ కలశరత్నాకరం నుంచే వెలువడిన శ్రీదేవితో కూడి ఆయన వక్షోలంకృతమైన తులసీదళ మాలిక నూత్నవికాసమును పొందగా; శరణాగతరక్షణత్వరతో గరుత్మద్రథాన్ని అధిరోహించి శంఖచక్రాదులైన విఖ్యాతాయుధాలను చేతబట్టి ఆ క్షణమందే శ్రీమహావిష్ణువు భూమిపతి కన్నుల ముందు ప్రత్యక్షమైనాడు – అని భావం. ఇక పంచమ స్కంధంలో గంగనార్యుని పద్యాన్ని చూడండి:

అంత నావిష్కృతకాంతచతుర్భుజంబులును, బీతాంబరంబును వెలుంగ
శ్రీవత్సకౌస్తుభశ్రీరమాచిహ్నంబు లురమందు రమ్యమై యిరవుపడఁగ
శంఖచక్రగదాంబుజాతఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెఱయ
నతులితనవరత్నహాటకాంకితనూత్నఘనకిరీటద్యుతుల్ గడలుకొనఁగఁ

గర్ణకుండలకటిసూత్రకనకరత్న
హారకేయూరవరనూపురాదిభూష
ణముల భూషితుం డైన శ్రీనాయకుండు
దంపతుల కప్పు డెదురఁ బ్రత్యక్ష మయ్యె. — (గంగనార్యుని పంచమ స్కంధము, 1-43)

రెండు పద్యాలలోని వర్ణనాంశమూ ఒక్కటే. ఆర్తుల మ్రోల శరణాగతత్రాత అయిన శ్రీహరి సాక్షాత్కారం. హరిభట్టు పద్యంలోని “నవరత్నకిరీటోన్నతద్యుతు లాశావకాశంబు లలమికొనఁగ” అన్న పాదం గంగనార్యుని పంచమ స్కంధం లోని “అతులితనవరత్నహాటకాంకితనూత్నఘనకిరీటద్యుతుల్ కడలుకొనఁగ” అన్నదానికే పర్యాయం. హరిభట్టు పద్యంలోని “శ్రీవత్సకౌస్తుభశ్రీరమాయుక్తమై తులసికాదామంబు తొంగలింప” అన్న పాదం పంచమ స్కంధం లోని “శ్రీవత్సకౌస్తుభశ్రీరమాచిహ్నంబు లురమందు రమ్యమై ఇరవు పడఁగ” అన్నదానికి పూర్తిగా సమానం. హరిభట్టు పద్యంలోని “విష్ణుండు శంఖచక్రాదివిశ్రుతాయుధంబుల ధరియించి యవనిపతికి దక్షణంబున నచటఁ బ్రత్యక్ష మయ్యె” అన్న పాదం పంచమ స్కంధం లోని “కర్ణకుండల కటిసూత్ర కనకరత్నహారకేయూర వరనూపురాదిభూషణముల భూషితుండైన శ్రీనాయకుండు దంపతుల కప్పు డెదురఁ బ్రత్యక్ష మయ్యె” అన్న పరిసమాపక వాక్యానికి ప్రతిబింబన్యాయంగా సరిపోలి ఉన్నది. హరిభట్టు పద్యంలోని “శంఖచక్రాదివిశ్రుతాయుధంబుల ధరియించి” అన్న దళం కూడా “శంఖచక్రగదాంబుజాతఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెఱయ” అన్న పంచమ స్కంధ పద్యపాదం లోనిదే.

గంగనార్యుడు, హరిభట్టు రచించిన ఈ రెండు పద్యాలూ ఒకదానికొకటి ప్రతిబింబాలన్న విషయం వేరే చెప్పనక్కరలేదు.

గంగనార్యుని పద్యానికి మూలమైన సంస్కృత భాగవతంలో నాభి మహారాజు చేసిన యజ్ఞంలో వేదికపై శ్రీమహావిష్ణువు అవతరించినప్పటి వర్ణన ఆ సందర్భంలో ఈ విధంగా ఉన్నది:

వ. అథ హ త మావిష్కృతభుజయుగలద్వయం హిరణ్మయం పురుషవిశేషం కటికౌశేయాంబరధర మురసి విలసచ్ఛ్రీవత్సలలామం దరవరవనరుహవనమాలాచ్ఛూర్యమృతమణిగదాదిభి రుపలక్షితం స్ఫుటకిరణప్రవరమణిమయమకుటకుండలకటకకటిసూత్రహారకేయూరనూపురా ద్యంగభూషణవిభూషితం…” (అధ్యాయం 3; వచనం 3)

(అంతట నాభిరాజుకు యజ్ఞేశ్వరుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన సాలంకృత చతుర్భుజాలను కలిగి ఉన్నాడు. హిరణ్మయతేజస్సు ఉట్టిపడుతున్న పురుషోత్తమరూపంలో ఉన్నాడు. కటిదేశాన పసిమివన్నె పట్టుపంచెను ధరించాడు. రొమ్మున శ్రీవత్సచిహ్నం మెరుములీనుతున్నది. పాంచజన్య శంఖము, వైజయంతీ వనమాల, సుదర్శన చక్రము, కౌస్తుభ మణి, కౌమోదకీ గద అమృతాయమానంగా విరాజిల్లుతున్నాయి. కాంతులను విరజిమ్ముతున్న మణిమయకిరీటం, చెవులకు మకరకుండలాలు, దండకడియాలు, బాహుపురులు, బంగరు మొలత్రాడు, కాలి అందెలు మొదలైన అంగభూషణాలతో భూషితుడై ఉన్నాడు)

ఈ మూలంలోని “ఆవిష్కృతభుజయుగలద్వయం” అన్నదే గంగనార్యుని అనువాదనంలో “ఆవిష్కృతకాంతచతుర్భుజంబులు” అయింది. తక్కిన దళాలన్నీ సంస్కృతమూలాన్ని యథాతథంగా ఆవిష్కరిస్తున్నాయి. సంస్కృతాంధ్రాలు రెండింటిని సరిపోల్చితే గంగనార్యుని పద్యం భాగవత మూలానికి యథాతథానువాదమని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. మత్స్యపురాణంలో ఈ ఘట్టంలోని వర్ణన హరిభట్టు పద్యానికి మూలమని ఊహించేందుకు ఏ మాత్రం వీలులేకుండా ఉన్నది. అందువల్ల హరిభట్టు పద్యమే గంగనార్యుని పద్యానికి అనుసరణమని, మత్స్యపురాణ రచనాసమయంలో హరిభట్టు ముందు భాగవత పంచమ స్కంధ పద్యమే నిలిచి ఉన్నదని, గంగనార్యుని పద్యం హరిభట్టు పద్యానికి అనుకరణం కాదని, మనము నిశ్చయింపవచ్చును. హరిభట్టు గంగనార్యుని పై పద్యాన్ని అనుకరింప లేదని; భాగవతమూలాన్ని తానుకూడా పలుమార్లు చదివినందువల్ల అందులో తనకు నచ్చిన ఒక భాగాన్ని మెచ్చి స్వతంత్రంగా అనుసరించాడని వాదించేందుకు వీలులేకుండా ఉభయపద్యాల సంవాదశిల్పమే సాక్ష్యం ఇస్తున్నది. ఈ సాక్ష్యాన్ని బట్టి గంగనార్యుని కాలనిర్ణయం సాధ్యమవుతున్నది.

హరిభట్టు చేసిన మత్స్యపురాణం అనువాదం క్రీ.శ. 1525 నాటిదని, అంతకు మునుపు క్రీ.శ. 1500 నాటికే ఆయన ముందుగా భాగవతంలోని ఏకాదశ – ద్వాదశ స్కంధాలను; ఆ తర్వాత క్రీ.శ. 1520 ప్రాంతాల భాగవత షష్ఠ స్కంధాన్ని పూర్తిచేశాడని విమర్శకులు భావిస్తున్నారు. గంగనార్యుని పంచమ స్కంధం క్రీ.శ. 1500 నాటికి పూర్వమే వెలసి ఉన్నందువల్ల – దానిని చదువుకొన్న హరిభట్టు తన అనువాదానికి పంచమ స్కంధాన్ని చేపట్టక విడిచివేశాడని భావించటం సమంజసంగా ఉంటుంది. కనుక గంగనార్యుని కాలం హరిభట్టు ఏకాదశ స్కంధానువాదానికి కనీసం అయిదు లేదా పదేండ్ల మునుపు – అంటే, క్రీ.శ. 1490 నాటికి పూర్వం అవుతుంది. ఆ ప్రకారం బొప్పరాజు గంగనార్యుడే బమ్మెర పోతన గారికి అత్యంత సమీపకాలికుడు, సన్నిహితుడు అని స్పష్టపడుతున్నది.

పోతన గారి శ్రీమహాభాగవతం క్రీ.శ. 1480 నాటికి పాక్షికంగానైనా ఉత్సన్నమైపోయింది. 5, 6, 11, 12 స్కంధాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తక్కినవి అక్కడక్కడ పాడయ్యాయి. గంగనార్యునికి ఆ విషయం తెలిసి, పోతన గారి పంచమ స్కంధం ప్రతులు లోకంలో లేవని నిశ్చయించుకొన్నాకనే తన అనువాదయజ్ఞానికి ఉపక్రమించి ఉంటాడు. అందువల్ల పుణ్యగంగకు సమీపప్రాంతవాసి అని పెద్దలు భావించినది తర్కసహమే అవుతుంది. పోతన గారి అనువాదం కొంత పంచమ స్కంధంలో ఉన్నదని, గంగనార్యుడు కేవలం లుప్తపూరణం మాత్రమే చేశాడని, పంచమ స్కంధం పూర్తిగా గంగనార్యుని రచన కాకపోవచ్చునని చాగంటి శేషయ్యగారి వంటి కొందరు విమర్శకు లన్నారు. అది కేవలం ఊహ మాత్రమే. అందుకు ఎటువంటి ఆధారమూ లేదు. పోతన గారే తన శిష్యుడైన గంగనార్యునికి ఈ భాగాన్ని అప్పజెప్పి వ్రాయించి ఉండవచ్చుననటమూ భావ్యం కాదు. పోతన గారు అప్పజెప్పి ఉంటే, రచన స్వరూపం ఆయన పర్యవేక్షణలో సాగినట్లుగా లేదు. అంతేకాక పోతన్న గారి ఇతరస్కంధాలలోని పద్యాల అనుకరణలు – మరీ ముఖ్యంగా సప్తమ, అష్టమ స్కంధ పద్యాలకు అనుకరణలు ఇందులో కనుపిస్తాయి. అందువల్ల పోతన్న గారి భాగవతం పరిసమాప్తమై, వారు పరమపదించిన కొంతకాలానికి తర్వాతనే ఈ ఉత్సన్నపూరణం మొదలైనదని ఊహింపవచ్చును. ఈ పంచమ స్కంధం అనువాదానికి శ్రీకారం చుట్టేముందు గంగనార్యుడు తనకు లభించిన పోతన గారి భాగవత భాగాన్ని పూర్ణంగా భావగతం చేసుకొన్నాడు. గురుశిష్యులు ఏకకాలంలో రచనను కొనసాగించివుంటే అది సాధ్యం కాదు.

అందువల్ల క్రీస్తుశకం 1485 – 90ల నడిమి కాలంలో తన అనువాదాన్ని పూర్తిచేసే నాటికి సుమారు 50 – 55 సంవత్సరాల వాడనుకొంటే గంగనార్యుని జీవితకాలం స్థూలంగా క్రీ.శ. 1430(±) – 1490(±) అని నిర్ణయించటం సమంజసంగా ఉంటుంది.
-----------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

Saturday, October 13, 2018

విశ్వనాథ: వివాహాశీస్సులు


విశ్వనాథ: వివాహాశీస్సులు




సాహితీమిత్రులారా!



1976 ఆగస్టు నెలలో ఎం.ఎ పూర్తయిన తర్వాత భీమవరానికి ఉపకంఠాన ఉండి గ్రామంలో ఏదో కార్యక్రమానికి వెళ్ళి మద్రాసుకు తిరిగి వెళ్తూ విజయవాడలో రెండు రోజులున్నాను. అప్పుడు మా పూజ్య గురుదేవులు శ్రీ పొట్లపల్లి సీతారామారావు గారింటికి వెళ్ళాను.

మా గురువుగారు విశ్వనాథ వారి అగ్రశ్రేణి శిష్యులలో ఒకరు. యస్.ఆర్.ఆర్. కాలేజీలో ఉద్యోగం. అచ్చపు జమీందారీ వంశం. నిలువెత్తు ఆజానుబాహు విగ్రహం. చుట్టుపక్కల నాలుగంచులకు మారుమోగే కంచు కంఠం. విలువైన పసిమి పట్టు వస్త్రాలు ధరించి మంగళకరమైన రూపశోభతో చెలువొందుతూ అంబాసడర్ కారు దిగి మందగమనంతో తరగతి గదికి నడిచి వస్తుంటే ఆ రాజసానికి ఎక్కడెక్కడివాళ్ళూ విస్తుపోయి చూసేవారు, ఆ మహావిద్వాంసుని. కళాశాల ప్రిన్సిపాలు రాజమన్నారు గారు విశ్వనాథ శిష్యవర్గంలో ప్రముఖులు. మంచి కవి కూడాను. అందువల్ల గురువు గారంటే ప్రాణం ఆయనకు.

నవయువకుడుగా ఉన్న రోజుల్లో సంస్కృతంలో మురారి అనర్ఘరాఘవం, కృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద పాఠం చెప్పించుకోవాలని నూజివీడు నుంచి వచ్చి విశ్వనాథ వారిని అడిగారట మా గురువు గారు. ఆయన మొదలుపెట్టారట. రెండూ ఇద్దరికీ కంఠస్థాలే. ఐనా, ఆయన చెప్పటం, ఈయన వినటం. కొన్నాళ్లయ్యాక విశ్వనాథ వారు ఊరికే సమయం వృధా పోతున్నది కాదూ, ఏ తెలుగు ఎం.ఏ పరీక్షకో కడితే బాగుంటుంది అన్నారట. గురువు గారు తెలుగు ఎం.ఏ ఉత్తీర్ణులయ్యారు. ఊరికే చదువు వృధా పోవటం ఎందుకూ, మన కాలేజీలో చేరవచ్చునుగా అన్నారట, విశ్వనాథ. గురువుగారు యస్.ఆర్.ఆర్. కాలేజీలో ఆంధ్రోపన్యాసకునిగా చేరారు. నా అదృష్టం కొద్దీ కళాశాలలో వారి సన్నిధి సేవ లభించింది. 1971 నుంచి 73 దాకా చదువుకొన్నాను. ఆ తర్వాత మళ్ళీ అదే వెళ్ళటం.

నేను వెళ్ళిన రోజుల్లో మా గురువుగారు ‘ఊర్వశి’ అని పద్యకావ్యం వ్రాస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘ఊర్వశి’ ఒక అలంకారకౌస్తుభం. దాని సొగసులను వర్ణించేందుకు ఒక వేదం వెంకటరాయశాస్త్రి గారో, ఒక వెల్లాల సదాశివశాస్త్రి గారో, పంతుల లక్ష్మీనారాయణశాస్త్రి గారో దిగి రావాలి. ఆ రోజు కూర్చిన పద్యాలను ముక్తాముక్తంగా వినిపించాక గురుదేవులు నన్ను, మాష్టారింటికి వెళదామా, చిన్న పని కూడా ఉంది, అన్నారు. భక్తుణ్ణి పిలిచి, భగవంతుణ్ణి చూస్తావా! అని అడిగినట్లు. ఇద్దరమూ కలిసి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారింటికి వెళ్ళాము.

మేము వెళ్ళే సరికి విశ్వనాథ వారు పడక కుర్చీలో ఠేమిణీ తీరి ఉన్నారు. ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకులు శ్రీ పులుపుల శివయ్య గారి బంధువు దత్తాత్రేయరావు గారని వారి యెదురుగా కుడివైపు మంచం మీద సతీసమేతంగా సవినయంగా కూర్చొని ఉన్నారు. వారి మేనకోడలిదో, మేనకోడలి బంధువులదో – పెళ్ళట. ఇంకెవరో ఒకరిద్దరున్నారు. విశ్వనాథ వారి భార్యవైపు బంధువొకరు ఉన్నారు. అప్పట్లో ‘వేయి పడగలు’ నవలను ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు. నేను డి.యన్.ఆర్ కాలేజీలో విద్యార్థిగా ఉండటం వల్ల వారు నాకు సుపరిచితులే.

పులుపుల శివయ్యగారు కమ్యూనిస్టు పార్టీ తొలి తరం నాయకులలో ఒకరు. మంచి పండితులు, హృదయం ఉన్న కవి. పలనాటి సీమలో వారిని యెరుగని వారెవరు? అభ్యుదయోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలంలో ఆయన పాటలు పాడని వారెవరు? మా నాన్నగారికి రాజకీయాలలో ప్రవేశం ఇప్పించిన బాల్యగురువు. ఉన్నదంతా దేశానికి త్యాగం చేసి చివరి రోజులలో లేమి మూలాన చాలా బాధలు పడ్డారు. ఆ సంగతులన్నీ మాట్లాడుకొన్నాము.

పరిచయాలయ్యాక, వారు సత్యనారాయణ గారింటికి వచ్చిన పని తెలిసింది.

ఆ దంపతులు పెళ్ళి యేర్పాట్ల సన్నాహంలో తలమునకలుగా ఉన్నారట. విశ్వనాథ సత్యనారాయణ గారిచేత పెళ్ళికి ఆశీర్వాద పద్యాలను చెప్పించుకొంటే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుందని, మౌక్తికోపమానంగా వంశవర్ధకమైన సంతానం కలుగుతుందని వాళ్ళ నమ్మకం. ఇంటికి వచ్చి అడిగారట. ఆ రోజులలో మూడు వందల రూపాయలను, విలువైన మంచి శాలువను, తాంబూలంలో మామిడి పళ్ళ విందుతోపాటు గురువు గారికి సమర్పించుకొన్నారట. విశ్వనాథ వారు చెబుతుంటే మా గురువుగారు వ్రాసిపెట్టారట. పద్యాలను అచ్చుకిచ్చి, ప్రూఫులను చూపించేందుకు ఆ దంపతులు వచ్చారట.


వివాహాశీస్సులు

ప్రూఫు కాగితాలు రెండు ప్రతులను తెచ్చారు. విశ్వనాథ వారు పైపైని చూచి, ఒకటి నాకు, ఒకటి మా గురువు గారికి ఇచ్చారు. గురువుగారు తల పంకించి, పద్యాలను సరి చూసి, శ్రీకృష్ణభక్తి పరిమళాలు చిమ్ముతున్న ఆ పద్యప్రసూనాల ప్రతిని అప్పుడే విచ్చిన విరజాజి పూలను గుడిలో పూజారిగారి చేతిలో పెడుతున్నట్లుగా అంజలిబంధంలో అందంగా అందజేశారు, వారికి.

చల్లగా, బంధుమిత్రుల కడుపు చల్లగా, పిల్లాపాపలతో హాయిగా ఉండి ఉంటారు ఆ ఆశీర్వచస్సులకు నోచుకొన్న వధూవరులిప్పుడు పుణ్యదంపతులై.

నా వద్దనున్న ప్రతిని నా కోసం దాచుకొన్నాను నేను. ఏమి పద్యాలవి!

భాగవతం భావగతమైన భక్తిపరులకు గోపికా గీతలు దర్శనమిస్తాయి అందులో. ముద్దకట్టిన ఉపనిషత్సారనవనీతం అది. గోగోపగోపీగణావృతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమరసధార అది. దుగ్ధార్ణవశాయి తానే దోగ్ధగా నిలిచి మనకోసం పిండిపెట్టిన పసిడి పలుకుల పంచామృతం.

మహాకవి శ్రీ విశ్వనాథ స్వయంగా కూర్చిన తాత్పర్యార్థంతో వెలుగులీనుతున్న అక్షరాలవి.

ఇంత కాలం శ్రీ విశ్వనాథ సాహిత్యంలో అప్రకాశితంగా నిలిచిపోయిన ఈ అనర్ఘ పద్యముక్తావళిని తొలిసారి ప్రచురణగా ‘ఈమాట’ పఠితృలోకానికి సమర్పిస్తున్నాను — ఇది మీ అందరికి కంఠస్థగితమై, దీని దీధితి దెసల కొసల దాకా దేదీప్యమానం కావాలన్న శుభాకాంక్షితంతో.

గీ.   రతనపిలు, తన చిన్న కుఱ్ఱి, తొలియీఁత
      నుఱ్ఱుకట్టఱి తీసిన ముఱ్ఱుపాలు
      తానె పిదికి తాఁగాచిన తనదు జున్ను
      తానె తినుసామి మీకు సాబానపాడు!

గీ.   కఱ్ఱియావొండు పాల్దీయగాను తాన
      మెడమలచి తాననుకొను సామిఁ గనుగొంచు
      జుఱ్ఱుచును దానిపెరుగును, గఱ్ఱుమంచు
      త్రేచు చిన్నికన్నడు మిమ్ముఁ బ్రోచుఁగాక!

ఆ.   అతడు రక్షసేయు నాస్వామి మిమ్మును
       పొట్టియావు, దూడపొడుగు, పొదుగు
       నందకున్న దూడ కందిచ్చి దూడయుఁ
       దాను చెఱుసగంబు త్రావునెవడు!
----------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

Saturday, February 24, 2018

మతుకుపల్లి వారి సరస్వతీ స్తుతి


మతుకుపల్లి వారి సరస్వతీ స్తుతి




సాహితీమిత్రులారా!
Image may contain: 1 person
ముఖపుస్తకంలో Dr. ఏల్చూరి మురళీధరరావుగారు పోస్ట్ చేసిన
సరస్వతీదేవి ప్రార్థన  వారిమాటల్లో చూద్దాం-
ఈనాటి సుప్రభాత వేళ శ్రీ మతుకుమల్లి నృసింహశాస్త్రి గారి అజ చరిత్రమును చదువుతున్నప్పుడు అవతారికలో ఈ స్తుతి కనబడింది. దైవదత్తమైన ఆ మహాపాండితికి, అపూర్వమైన ఆ కల్పనాశిల్పశోభకు, అపారమైన ఆ భక్తిపారమ్యానికి ఆశ్చర్యాతిశయం కలిగింది. ఇంతటి గాఢబంధంతోనూ, గంభీరమైన భావసంపుటితోనూ రచితమైన సరస్వతీ సంప్రార్థన ఇంకొకటి ఇంతవరకు నాకు కానరాలేదు. సర్వవిధాల ఆయన కవితాధోరణి నిరుపమానం అనిపించింది. అర్థతాత్పర్యాలతో ప్రకటించినట్లయితే కావ్యం విద్యార్థిలోకంలో సుప్రతిష్ఠితమై ఉండేదని అనిపించింది.

అద్భుతావహమైన ఆ పద్యరాజం ఇది:

ఘన ఘనశ్రీ సముత్కటజటా వర పదక్రమయుక్త్రయీమయ రమ్యవేణి 
నానాస్వరవ్యంజనప్రతానానూనశబ్ద మహాశబ్దశాస్త్రవీణ
భూరిగుణవిశేషపుంజైకనిత్యసంబంధవత్తర్కవిభ్రాజిరశన
సరససాలంక్రియోజ్జ్వలసువర్ణపదోరుసంగీతసాహితీస్తనభరాఢ్య

క్షిప్రసద్గతిముఖరభాట్టప్రభాక
రీయమంజీరయుగరమణీయచరణ
జలజ నిత్యప్రగల్భవాచాల వాణి
నిలచుఁ గాఁత మదీయాస్య జలరుహమున.

♦️ ఘన ఘనశ్రీ ... రమ్యవేణి – ఘన = దట్టముగా క్రమ్ముకొన్న, ఘన = మేఘము యొక్క, శ్రీ = శోభవంటి శోభచే, సముత్కట = విరివియైన, జటా = కేశముల అల్లికచే, వర = శ్రేష్ఠమైన, పద = స్వరూపముతోడి, క్రమయుక్ = విధానమును కలిగిన, త్రయీమయ = మూడు పాయలతో సంలగ్నమైన, రమ్యవేణి = అందమైన వేనలిని కలిగినదియును –

(ఘన = సంపుటీకరింపబడిన, ఘన = ఘనము అను పేరు గలిగిన గానఫణితి తోడను, శ్రీసముత్కటజటా - శ్రీ = బ్రహ్మవిద్యాసిద్ధికై, సముత్కట = నేర్చికొనుటకు విషమమైన, జటా = జట అను పేరుగల ఫణితి తోడను, వరపదక్రమయుక్ – వర = కోరదగిన, పద = పదము అను పేరు గల పాఠవిశేషము తోడను, క్రమ = క్రమము అను పేరితోడి పాఠక్రమము తోడను, యుక్ = కూడినట్టి, త్రయీమయ = ఋగ్యజుస్సామములను మూడు వేదములు మూడు పాయలుగా ప్రవహించుచున్న, రమ్యవేణి – అందమైన వాక్స్రవంతిని గలదియును - అని ఇంకొక అర్థం);

♦️ నానా ... వీణ – నానా = సాహిత్యమునందు అనేక ప్రకారములైన, స్వర = అచ్చుల యొక్క (ఉదాత్త అనుదాత్త స్వరిత ప్లుతములను ఉచ్చారణవిశేషముల యొక్క), వ్యంజన = హల్లుల యొక్క, ప్రతాన = విరివిచే ఏర్పడునట్టి, అనూన = సార్థకములైన, శబ్ద = పదసంపదతోడి, మహాశబ్దశాస్త్ర = విస్తారమైన వ్యాకరణశాస్త్రమునకు ప్రాణశక్తిని కూర్చు, వీణ = వీణాదండమును కలిగినదియును –

(నానా = సంగీతమునందు బహుత్వసిద్ధి గల, స్వర = స్వతోరంజకములైన సప్తస్వరముల యొక్క, వ్యంజన = సువ్యక్తమగు, అనూన = శ్రుతిస్ఫుటవైఖరిని పరిపూర్ణముగా కలిగిన, శబ్ద = ధ్వన్యాత్మకమైన, మహాశబ్దశాస్త్ర = సంగీతశాస్త్రమునకు మూలకందమైన, వీణ = వీణాదండమును కలిగినదియును – అని ఇంకొక అర్థం);

♦️ భూరి ... రశన - భూరి = అధికతరమైన, గుణవిశేషపుంజ = సత్యదయాది గుణవిశేష పరంపరతో, ఏక = ఐక్యమును భజించి, నిత్యసంబంధవత్ = ఎల్లప్పుడు కూడియుండవలెనడి, తర్క = ఆకాంక్షచే, విభ్రాజి = ప్రకాశమానమైన, రశన = నాలుకను కలిగినదియును –

(భూరి = విస్తారమైన భూమికతోడి, గుణవిశేషపుంజ = చతుర్వింశతి తత్త్వములను నిరూపించు గుణముల సముదాయముతో, ఏక = కైవల్యరూపమైన, నిత్యసంబంధవత్ = నిత్యత్వసిద్ధిని (సంసర్గమును) కలిగిన, తర్క = తర్కశాస్త్రము యొక్క వికసనముచే, విభ్రాజి = మెరయుచున్న, రశన = మొలత్రాడు కలిగినదియును – అని ఇంకొక అర్థం);

♦️ సరస ... భరాఢ్య - సరస = రసవంతమైన, స+అలంక్రియా = సరిగమపదని అను సప్తస్వరముల అందమైన కూర్పుచే సిద్ధించు అలంకారముల ప్రయోగము చేత, ఉజ్జ్వల = ఔజ్జ్వల్యము అను శాస్త్రధర్మమును గల, సు+వర్ణ = షడ్జాది స్వరముల యొక్క గతివిశేషములను ప్రకటించు రచనముల చేతను, పద = పదములు అను రచనావిశేషముల చేతను, ఉరు = విస్తారమైన, సంగీత = సంగీతశాస్త్రము యొక్క మాధుర్యముతో నిండినట్టిదియును –

సరస ... భరాఢ్య - సరస = నవరసముల కూడిక చేత, స+అలంక్రియా = కావ్యశోభాకరములైన అలంకారముల ప్రయుక్తి చేత, ఉజ్జ్వల = విశదమైన, సువర్ణ = అక్షరరమ్యత గల, పద = అర్థవంతములైన సుశబ్దములచే నిండి, ఉరు = విశాలమైన, సాహితీ = సాహిత్యశాస్త్ర మధురిమను ప్రసాదించునట్టిదియును అగు,

స్తనభరాఢ్య – స్తనభర+ఆఢ్య = (ఒకటి ఆపాతమధురమగు సంగీత రసము చేతను, వేరొకటి ఆలోచనామృతమగు సాహిత్య రసము చేతను నిండిన) వక్షోజముల యొక్క బరువుచే, ఆఢ్య = కూడినట్టిదియును;

♦️ క్షిప్ర = శీఘ్రగతిని గల, సద్గతిముఖర – సద్+గతి = అందమైన నడకచే, ముఖర = గలగల చప్పుడుచేయుచున్న, భాట్ట ప్రభాకరీయ = మీమాంసా శాస్త్రములో కుమారిల భట్ట మతము, ప్రభాకర మతము అను రెండు మార్గములచే నిర్మింపబడిన, మంజీరయుగ = కాలి అందెల జంటచే, రమణీయ = అనుక్షణము సరిక్రొత్తదిగా భాసించు, చరణ జలజ = పాదపద్మములు గల,

♦️ నిత్యప్రగల్భవాచాల – నిత్య = ఎల్లప్పుడు, ప్రగల్భ = ప్రత్యుత్పన్నమైన ప్రతిభను ప్రకాశింపజేయు, వాచాల = వాక్యరీతిని కలిగిన,

♦️ వాణి = సరస్వతీదేవి,

♦️ మదీయ = నా యొక్క; ఆస్యజలరుహమున – ఆస్య = ముఖమనెడి, జలరుహమున = పద్మమునందు; నిలచున్+ కాఁత = నిలచియుండును గాక. అని!

Sunday, June 18, 2017

శివామృత లహరి


శివామృత లహరి




సాహితీమిత్రులారా!




డా. ఏల్చూరి మురళీధరరావుగారి కృత
శివామృత లహరి చూడండి-


శ్రీనాదాంతవిభావనీయపరమశ్రేయోనిధానా! త్రివే
దానుస్వారవిధాన! వైదికలతాంతారూఢతత్త్వైకవి
ద్యానన్యాదృశకేళిరమ్య! ప్రణవధ్యానైకగమ్యా! స్వస
ర్గానూనస్థితిసంహృతిత్రితయముక్తాకార! విశ్వేశ్వరా!

కలరూ పేర్పడరాని వైద్యుతలతాకల్పంబవై పొల్చి, పెన్
వెలుఁగై నిల్చిన నాదబిందుసుకళాభిజ్ఞాస్పదభ్రూయుగీ
విలసన్మధ్యతలావతార! కరుణావిస్తార! నాలోన ని
న్నెలమిం దాపము తీఱఁ జూచుటెపుడోయీ, స్వామి విశ్వే శ్వరా!

ఓంకారాభిధమంత్రబంధశుభవర్ణోర్జస్వలప్రౌఢిమా
లంకర్మీణ! భవార్తభక్తజనకల్యాణైకపారీణ! భా
వాంకూరశ్లథనైకదక్ష! దురితవ్యాఘ్రౌఘహర్యక్ష! య
స్తుంకారమ్మును జూపి బాపవె మనోదుఃఖమ్ము విశ్వేశ్వరా!

సేవింతున్ నిగమాగమాంకితశుభశ్రీనామధేయున్, నినున్
భావింతున్ జతురాస్యకేశవనిలింపాదృష్టచూడాపదుం,
గావింతున్ భవదీయదాసజనకైంకర్యంబు, నీ పాదరా
జీవద్వంద్వనిరంతరార్చనవిధిన్ జీవింతు విశ్వేశ్వరా!

చిరమై శారదచంద్రికారుచిరమై శీర్యణ్యగంగాశుభా
కరమై శాంతజితేంద్రియప్రకరమై కైవల్యమందారసుం
దరమై విద్రుతభక్తలోకదరమై ధర్మానుసంధానసు
స్థిరమై పొల్చెడు వెల్గు నిన్ను నొకఁడే సేవింతు విశ్వేశ్వరా!

నతభక్తార్ణవచంద్రమండలఘృణీ! నైజాత్మయోగారణీ!
స్తుతకల్యాణమణీ! జటాటదమరస్రోతస్వినీధోరణీ!
శ్రితలోకైకశిరోమణీ! శ్రుతిశిరస్సీమంతముక్తామణీ!
ప్రతిమానన్యు నినున్ భవాబ్ధితరణీ! ప్రార్థింతు విశ్వేశ్వరా!

నీవై యుంచెదు మంటినేల మొలకన్; నీర్వోసి పేరాదటం
జేవ న్నించెద; విట్లు పెంచెదవు హృత్సీమన్ వెలుంగై మ ము
న్నీవే నొంచెద; వింకఁ ద్రుంచెదవునున్ నీలాభ్రధూర్జాట జూ
టీవిస్తీర్ణసురాపగాశివచిరంటీరమ్య! విశ్వేశ్వరా!

బ్రతుకెల్లన్ వరిబీడుగా నెఱియలై వాటిల్లు నెచ్చోట నీ
వు తిరంబై కొలువున్న చిన్నెలివి కాబోలు న్వగ, ల్లేవడుల్
జత గోరంబుల పంటలయ్యె నను నొల్లంబోక చూ
పితి వీ నిన్నుఁ దలంచు నెమ్మదిఁ దమిన్ విశ్వాత్మ! విశ్వేశ్వరా!

తరణాతీతభవాబ్ధిలో మునిఁగి శ్రీ తారుణ్య కారుణ్య స
ద్వరణామోఘగుణౌఘగాన మొనరింతున్ స్వామి ! రాని మ్ము త్వ
చ్చరణాంభోజము లాత్మ నిల్పికొను దాసశ్రేణిపైఁ గొంత నీ
కరుణాపూర్ణకటాక్షవీక్షణము నాకై కొంత విశ్వేశ్వరా !

శర్వాణీరమణీమణీహృదయశశ్వత్పద్మభృంగాణ! నీ
నిర్వాణప్రదనిర్మలాకృతిని మౌనిప్రాజ్ఞు లూహింప దృ
క్పర్వంబై యగుపింతు వెట్లు దయఁ బ్రోవన్ రావె తండ్రీ! నను
న్నర్వాచీనవటద్రుమూలఫలవిద్యామూర్తి! విశ్వేశ్వరా!