Friday, July 30, 2021

జేబుదొంగలు(నాటిక)

 జేబుదొంగలు(నాటిక)





సాహితీమిత్రులారా!

"జేబుదొంగలు" – నాటకం

నవలామూలం - విశ్వనాథ సత్యనారాయణ

 రేడియో నాటికీకరణ - విశ్వనాథ పావని శాస్త్రి

 నిర్వహణ - వై సరోజా నిర్మల

ఆస్వాదించండి-


Wednesday, July 28, 2021

ఇంతమాత్రానికే ఇంత గర్వం అవసరమా!

ఇంతమాత్రానికే ఇంత గర్వం అవసరమా! 




సాహితీమిత్రులారా!



రాజమందిరంలో నిరాటాకంగా తిరిగే రాజసేవకులు 

అదే తమపాలిటికి గొప్పగా భావించి గర్వించి 

రాజదర్శనానికొచ్చే పండితులను చూచి చూడనట్టుగా

వ్యవహరిస్తూ కసరుకొంటూ విర్రవీగితిరిగే వారిపై

ఒక కవిగారు పిల్లిపై పెట్టి ఈ విధంగా ఒక శ్లోకం చెప్పారు 

గమనింపగలరు-

మా గర్వ ముద్వహ బిడాల! మహీపతీనా

మంతఃపురం మణిమయం సదనం మమేతి

పట్టాభిషేకసమయే పృథివీపతీనాం

బాహ్య ట్థితస్య కలభస్య హి మండనశ్రీః!


ఓసీ పిల్లీ! నీవు మణిమయమైన రాజాంతఃపురంలో తిరుగుతున్నావని

ఇదే నా స్వంతిల్లని గర్వపడకురాజులకు పట్టాభిషేక మహోత్సవం జరిగే 

సమయంలో వెలుపలున్నగున్నయేనుగుకే అలంకార వైభవం కాబట్టి 

అలాంటి శుభసమయాల్లో నీమొగం చూచేవాళ్ళేవుండరు. పైగా 

నిన్ను చూస్తే అపశకునంగా భావిస్తారు. ఇంతమాత్రానికే 

ఇంత గర్వం అవసరమా - అని భావం

Monday, July 26, 2021

నీకాలెంత కందిందో!

 నీకాలెంత కందిందో!


సాహితీమిత్రులారా!



తిమ్మన పారిజాతాపహరణంలో
సత్యభామ కృష్ణుని తన్ని సన్నివేశం
మనకు తెలిసిందే మరి అలాంటిదే
ఈ శ్లోకం చూడండి.

ప్రియురాలికి ఇష్టంలేని పనేదో చేటడంచే
కోపశీలఅయిన ఆమె ప్రణ కోపంతో పతిని తన్నింది.
అతడు ఆమెపై గల రాగాతిశయంతో
అనునయిస్తూ పలికినది ఈ శ్లోకం.

దాసే కృతాగసి భవే దుచిత: ప్రభూణాం
పాదప్రహార ఇతి సుందరి! నాస్మిదూయే
ఉద్యత్క ఠోరపులకాంకుర కంటకాగ్రై
ర్యత్ఖిద్యతే మృదు పదం వమ సా వ్యథా మే


సేవకుడు తప్పరుచేసినపుడు యజమాని కోపంతో
తన్నడం సరైనదే. నేను నీకు దాసుడును
నీ విషయంలో అపరాధం చేసినందుకు నన్ను
నీవు పాదప్రహారం చేసినందుకు బాధపడను.
కాని నీ పాదస్పర్శచేత నా శరీరం పుకించి నిక్కబొడిచిన
ముల్లులలాంటి రోమాల వల్ల కోమలమైన
నీ పాదానికి నొప్పికలిగిందేమోనని
నేను బాధపడుతున్నాను- అని శ్లోక భావం.

Saturday, July 24, 2021

మమ్మల్నంటే మేమనమా

 మమ్మల్నంటే మేమనమా




సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం చూడండి-
ఎంత చిత్రంగా ఉందో

రామకృష్ణపరమహంస, రమణమహర్షి లాంటివాళ్ళు
మొదట ప్రపంచానికి అర్థంకాక పిచ్చివాళ్లనుకుంది.
కానీ వారు ప్రపంచాన్నీ అలాగే అనుకున్నారు.
అలాంటి విషయం వివరించే శ్లోకమే ఇది చూడండి-

జ్ఞాత తత్త్వస్య లోకోయం జడోన్మత పిశాచివత్
జ్ఞాత తత్త్వోపి లోకస్య జడోన్మత్త పిశాచివత్

మిథ్యా ప్రపంచాన్ని అర్థం చేసుకొన్న జ్ఞానికి
లోకం వెఱ్ఱివాళ్ళమయమని అనిపిస్తే
మరి మొదటినుండి తత్త్వజ్ఞానులున్ని
అందరినీ వెఱ్ఱివాళ్ళకిందే జమకట్టింది
ఈ మాయాలోకం- అని భావం

అంతే కదా మరి
మమ్మల్ని వెర్రివాళ్లంటే
మేమనమా


Thursday, July 22, 2021

దుర్గ అంటే ఏమిటో ?

 దుర్గ అంటే ఏమిటో ?




సాహితీమిత్రులారా!



దుర్గ అంటే మనకు అమ్మవారని మాత్రం తెలుసు.
అసలు ఆపేరులోని రహస్యం ఏమిటి అంటే
ఈ శ్లోకం చూడాల్సిందే

దైత్య నాశార్థ వచనో కార పరికీర్తిత:
కారో విఘ్న నాశశ్చ వాచకో వేదసమ్మత:
రేఫో రోగఘ్న వచనో శ్చ పాపఘ్న వాచక:
భయ శత్రుఘ్న వచనాశ్చాకార: పరికీర్తిత:
                                                          (ముండమాలా తంత్రం)

దుర్గ అనే పదంలో ఐదు అక్షరాలు ఉన్నాయి.
అవి రెండు అచ్చులు, మూడు హల్లులు.
అవి ద్ - ఉ, ర్ - గ్ - అ - అనేవి
ఇందులో ద్, ర్, గ్ అనే మూడు హల్లులు, ఉ, అ అనే రెండు  అచ్చులు. వీటివల్ల
దకారం అంటే ద - అనే అక్షరం వల్ల  దైత్యనాశనం జరుగుతుందట.
ఉకారం అంటే  - అనే అక్షరం వల్ల విఘ్ననాశనం జరుగుతుందట.
రేఫో అంటే ర - అనే అక్షరం వల్ల రోగనాశనం జరుగుతుందట.
 అనే అక్షరం వల్ల పాపనాశనం జరుగుతుందట.
 - అనే అక్షరం వల్ల శత్రునాశనం జరుగుతుందట.


ఆ ఐదు అక్షరాలకలయికతో దుర్గ
అనే పదం ఏర్పడుతుంది కావున
ఆ పదాని అంత మహత్తుంది.
ఇది మనం చెప్పిన మాటలు కాదు
మన పెద్దలు చెప్పినవి.
అటువంటి దుర్గామాతకు నమస్కారం.

Tuesday, July 20, 2021

శివుడు కొండలపై ఎందుకుంటాడు?

 శివుడు కొండలపై ఎందుకుంటాడు?




సాహితీమిత్రులారా!



పూర్వం ఏ ఇంటిలో పట్టినా

నల్లులు విపరీతంగా ఉండేవి.

ఇక దోమల సంగతి చెప్పక్కరలేదు.

సీతారామయ్య అనే ఐయన ఇంటికి

వెళ్ళిన కవిగారు వాటితో పడిన బాధను

పద్యంలో ఇలా చెప్పారు చూడండి-


నల్లులు లేవని వస్తిమి,

కొల్లలుగా చేరఁడేసి గోడలవెంటన్

నల్లులకు తోడు దోమలు

చిల్లులుబడఁ గుట్టెనయ్య సీతారామా!


ఎంత కసిగా కుట్టాయో పాపం

దాంతో ఏకంగా పద్యం తన్నుకొచ్చింది.

శివుడద్రిపై శయనించుట

రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం

డవిరతమును శేషునిపై

పవళించుట నల్లి బాధ పడలేక సుమా!


శివుడు కైలాసపర్వతంపై పడుకోవడం

సూర్యచంద్రులు ఆకాశంలో ఉండటం

విష్ణువు పాముపైనుండి దిగకుండా

పడుకోనుండడం ఎందుకంటే

నల్లి బాధ పడలేకట

కవి నల్లి బాధను ఎంతగా భరించారో

అది ఇంత చమత్కారంగా చెప్పాడు.

ఇప్పుడు దాదాపు నల్లు అంతరించాయని

అనుకుంటాను అందుకే కొందరికి నల్లి అంటే

ఏమిటో తెలియడంలేదు. మంచిదే

కవిగారు చెప్పినట్లు కాకుండా శివుడు సూర్యచంద్రులు

విష్ణువు పడుకోవడానికి వేరేమైన ప్రత్యామ్నాయం

దొరకవచ్చు.

Sunday, July 18, 2021

మనమిద్దరం లోకనాథులమే

 మనమిద్దరం లోకనాథులమే




సాహితీమిత్రులారా!



ఈ చమత్కార శ్లోకం చూడండి-
సమాస చమత్కారం చెప్పే శ్లోకం ఇది-

అహం చత్వంచరాజేంద్ర! 
లోకనాథా వుభావపి
బహువ్రీహి రహం రాజన్! 
షష్ఠీతత్పురుషో భవాన్



ఓ రాజా! నీవు, నేను ఇద్దరం
కూడ లోకనాథులమే సుమా!
కాని ఒక్కటే చిన్న భేదం
బహువ్రీహి ప్రకారం నేను లోకనాథణ్ణి,
నీవేమో షష్ఠీతత్పురుష ప్రకారం లోకనాథుడవు
- అని భావం

బహువ్రీహి సమాసం అన్యపద ప్రధానం కావున
లోకః నాథః యస్యసః - లోకనాథః అని
అంటే లోకమే నాథుడు(రక్షకుడు)గా కలవాణ్ణి నేను.

లోకానికి నాథుడవు(ప్రభువు)నీవు -
దీనిలో షష్ఠీత్పురుష సమాసం ఉంది.

లోకంపై ఆధారపడి బ్రతికేవాణ్ణి నేను.
లోకాన్ని పాలించేవాడవు నీవు
- అని భావం.
సమాసంలో రెండర్థాలకూ
లోకనాథః - అనే రూపమే ఉంటుంది
కావున కవి ఈ విధంగా చమత్కరించాడు.

Friday, July 16, 2021

చిల్లర దేవుళ్లు (నాటిక)

 చిల్లర దేవుళ్లు (నాటిక)


సాహితీమిత్రులారా!

రేడియోలో ప్రసారమైన

చిల్లర దేవుళ్లు - నాటకం , 

రచన - దాశరథి రంగాచార్య

సమర్పణ - శారదా శ్రీనివాసన్

ఆస్వాదించండి-




Wednesday, July 14, 2021

''మామగారు పెళ్లి కొడుకాయనే" - నాటకం

 ''మామగారు పెళ్లి కొడుకాయనే" - నాటకం  




సాహితీమిత్రులారా!

''మామగారు పెళ్లి కొడుకాయనే" - నాటకం , 

రచన - జంధ్యాల , నిర్వహణ - రామం

గతంలో రేడియోలో ప్రసారమైన నాటకం

ఆస్వాదించండి-



Monday, July 12, 2021

గణపతి - రేడియో నాటకం

 గణపతి - రేడియో నాటకం 




సాహితీమిత్రులారా!

శ్రీ చిలకమర్తి లక్ష్మి నరసింహం విరచిత హాస్య రసాయనం

గణపతి నాటకం రేడియో నాటిక ఆస్వాదించండి-



Saturday, July 10, 2021

వినాయకుడు పిల్లికి దండంపెట్టాడా!

వినాయకుడు పిల్లికి దండంపెట్టాడా!




సాహితీమిత్రులారా!



ఒక కవి ఎంతవారైనా సమయానుకూలంగా

ప్రవర్తించాలని అన్యాపదేశంగా ఈ శ్లోకం కూర్చారు

గమనించండి-


గణేశ స్త్సౌతి మార్జాలం స్వవాహ సాభిరక్షణే

మహా నపి ప్రసంగేన నీచాన్ సేవితు మిచ్ఛతి


గణపతి పిల్లి స్తుతిస్తున్నాడట-

ఎందుకనగా తనవాహనమై ఎలుకను రక్షించుకోవటానికి

దానిని స్తుతించకపోతే అది తన వాహనాన్ని 

ఎక్కడ మ్రింగేస్తుందోనని దాన్ని స్తుతిస్తున్నాడట

అంతటి దేవుడు కూడ ఆవిధంగా చేయవలసి వచ్చిందంటే 

గొప్పవాడు కూడ సందర్భాన్ని బట్టి నీచులను సేవించవలసి 

వస్తుందని శ్లోకంలో సమర్థించబడింది. కాబట్టి కవికి తటస్థించిన

సందర్భం కూడ అలాంటిదేనని అన్యాపదేశంగా కవి చెబుతున్నాడు.

Thursday, July 8, 2021

కాళ్లకూరి నారాయణరావు - వరవిక్రయం

 కాళ్లకూరి నారాయణరావు - వరవిక్రయం




సాహితీమిత్రులారా!

కాళ్లకూరి నారాయణరావుగారి  

వరవిక్రయం రేడియో నాటిక 

ఆస్వాదించండి-





Tuesday, July 6, 2021

అన్నిటికి మూలం కోరికే కదా!

 అన్నిటికి మూలం కోరికే కదా!




సాహితీమిత్రులారా!



ఈ చమత్కార శ్లోకం చూడండి-

రత్నాకరే పరిహృతా వసతిః కిమన్యత్
అంగీకృతః కఠిన వేదన దుఃఖ భారః
వక్షోజ కుంభ పరిరంభణ లోలుపేన
కిం కిం నతేన విహితం బతమౌక్తికేన


ముత్యానికి వక్షోజాలను కౌగిలించుకోవాలనే
ప్రగాఢమైన కోరిక కలిగింది. వెంటనే
సముద్ర(రత్నాకర)నివాసాన్ని వదలుకొంది.
రంధ్రం చేయటంలోగల బాధ(దుఃఖము)ను ఓర్చుకొంది.
వక్షోజాలను నిరంతరం కౌలించుకోవాలనే కోరికే ఇన్ని
బాధలను సంహిపచేసింది - అని భావం.

అదే కదా కోరికలేకపోతే ఏంచేస్తాం
అన్నిటికి మూలం కోరికే కదా

Sunday, July 4, 2021

ఈకాలంలో ఇలాంటి స్త్రీలున్నారా

ఈకాలంలో ఇలాంటి స్త్రీలున్నారా




సాహితీమిత్రులారా !



నెల్లూరును పరిపాలించిన మమసిద్ధికి,
కాటమరాజుకు పుల్లరి(పశువులను మేపగా
ఇచ్చే సుంకము) విషయంలో పోరు ఏర్పడింది.
మనుమసిద్ధి పక్షాన ఖడ్గతిక్కన యుద్ధం చేస్తూ
సైన్యం చిందర వందర కాగా రణరంగం వదలి
ఇంటికి వచ్చాడు. అప్పుడు అతని భార్య తిక్కనకు
స్నానానికి నీళ్ళుతోడి నులకమంచం అడ్డం పెట్టి,
పసుముద్దకూడ పెట్టిందట. అది చూచిన తిక్కన
ఇదేమిటని అడగ్గా ఈ పద్యం చెప్పిందట-

పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెందున్
ముగురాడువారమైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్

అన్నదట.
శత్రువులకు వెన్నిచ్చి పారిపోతే
మగతనం ఉన్న వారు నవ్వరా
వగపెందుకు  ఇప్పటి వరకు
ఇద్దరమే ఆడవాళ్ళం ఉన్నాము.
(ఆమె వాళ్ళఅత్త)- ఇకముందు మనం ముగ్గురము
ఆడవాళ్ళవుతాము - అని హేళన భావంతో పలికింది.

ఆ వీరపత్ని పేరు మాంచాల

ఇపుడు ఇలాంటి స్త్రీలు లెవరైనా ఉన్నా
భర్తకు పౌరుషం తెప్పించి యుద్ధానికి పంపగలిగే
వీరపత్నులు. ఆలోచించాలి
ఆనాటి స్త్రీలకు నేటి స్త్రీలకు ప్రతి విషయంలోను.

Friday, July 2, 2021

కవిచమత్కారం

కవిచమత్కారం




సాహితీమిత్రులారా!



1925 ప్రాంతంలో బెజవాడలో పిసుపాటి చిదంబరశాస్త్రిగారు
శతావధానం చేస్తుండగా ఒక పృచ్ఛకుడు
ఎవరికీ దిక్కుతోచని సమస్యను ఇచ్చాడు.
దీనితో సదస్యులు దిగ్భ్రాంతి చెందారు.
సమస్య ఇది-
కాఖాగాఘాకిఙ కాటన్నాయాటాఙ

చిదంబరశాస్త్రిగారు చిరునవ్వుతో
వ్రాసుకోండి అన్నారు.
అర్థరహితమైన ఈ సమస్యను ఎలా పూరిస్తారా? అని అందరూ
ఆశ్చర్యంతో చూస్తున్నారు.
శాస్త్రిగారు ఇలా పూరించారు.

చాఛాజాఝాచి ఙ చంచన్నాయా ఛీఙ
తాథాదాధాతిఙ తాతన్నాయా థూఙ
పాఫాబాభాపిఙ పాపన్నాయా పీఙ


ఇది వినేసరికి  పృచ్ఛకుడు బిత్తరపోయాడు.
కాస్తలో తేరుకొని "పూరణకేమైనా అర్థముందా?" అని ప్రశ్నించాడు.
"మీ సమస్యకు అర్థం ఉంటే మా పూరణకు అర్థం ఉంటుంది"- అన్నారు శాస్త్రిగారు.

అప్పుడు సమస్యార్థాన్ని పృచ్ఛకుడు ఇలా వివరించాడు.
              కాటన్నాయడనే ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి చదువు అబ్బలేదు.
కానీ తాను గొప్పవాడినని పొగిడించుకోవాలని తపన. అలా పొగిడించుకొని
వారికి తృణమో పణమో ఇచ్చేవాడు. మిగతా వారికి పైసా కూడా విదిల్చేవాడు కాదు.
ఈ రహస్యం తెలుసుకొన్న ఒక చతుర పండితుడు అతని దగ్గరికి వెళ్ళి తాళం వేస్తూ
ఈ సమస్యను గానం చేసి గొప్ప సత్కారం పొందాడు.

అప్పుడు శాస్త్రిగారు "ఈ విశాల విశ్వంలో మీ కాటన్నాయని వంటివారు
చంచన్నాయుడు, తాతన్నాయుడు, పాపన్నాయుడు అనే లుబ్దాగ్రేసర
చక్రవర్తులు ఉన్నారు. మీ పండితుని కన్నా మా పండితులు అధిక
విద్యాప్రౌఢులు కనుకనే అన్యాపదేశంగా ఛీ, థూ - అని వారి మూర్ఖతను
నిందిస్తూనే పొగిడినట్టుల భాసింప చేసి గౌరవం పొందారు." అని వివరించేసరికి
సభ్యులంతా కరతాళ ధ్వనులతో పిసుపాటివారిని అభినందిచారు.

పృచ్ఛకుడు కూడా  తనదారంటే వచ్చిన శాస్త్రిగారి చాతుర్యానికి కాదనలేక
హృదయపూర్వకంగా సంతృప్తిని, సంతోషాన్నీ వ్యక్తపరిచాడట.