Tuesday, July 30, 2019

మాదీ, రాజుగారిదీ!


మాదీ, రాజుగారిదీ!




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...............

“సూరపరాజుగారి ఇల్లెక్కడా?” వాకబు చేశాడు చినరాజు, ఊరి మొగదల్లోనే పనిచేస్తున్న కూలీలని.

‘సూరపరాజుగారా, ఆ పేరున్నోరొకరే మా ఊళ్ళో! అదిగో వస్తన్నారు, సూడండ’ని తప్పుకున్నారు కూలీలు.

“ఏవండో! సూరపరాజుగారు! నవస్కారవండి. ఆయ్! తమకోసమే బయలెల్లేనండి, ఎదకబోయిన తీగ కాలికి సుట్టుకోటం అంటే ఇదేనండి, తవరు ఊరి మొగదలే దర్శనవిచ్చేరు,” అని ఆగి గస పోసుకున్నాడు చినరాజు.

ఎవరూ? అన్నట్టు చూశాడు సూరపరాజుగారు చుట్ట ముట్టిస్తూ.

“ఆయ్! మాది పాణింగిపిల్లండి, మమ్మల్ని సినరాజుగారంటారండి. ఆయ్! మా ఊళ్ళో కందాల రాజుగారని ఉన్నోరండి. ఆయ్! ఆయన కొకతే కొవార్తెండి. పెళ్ళీడు కొచ్చిందండి. సక్కని సుక్కంటారండి. తవకో కొవారుడని తెలిసి, తవతో సుట్టరికం కలుపితే, అని ఆశండి, తవరెక్కడికో దయసేస్తన్నారు, ఈ ఇసయం తవకి ఇంటికాడే ఇన్నవిద్దారకున్నానండి, తవరిక్కడే దర్శనమిచ్చీ తలికి…” అని ఆగాడు చినరాజు.

“సేలోకెల్తన్నాం! దయసేయండి, అలా ఎల్లొద్దాం,” అంటూ ముందుకు దారి తీశాడు సూరపరాజుగారు.

పెళ్ళి సంబంధం ఉందని చెప్పడానికి వచ్చిన మధ్యవర్తికి తమ సాధనసంపత్తుల గురించి చెప్పుకోవడం మగపెళ్ళివారికి వాడుకే! అందుకు సూరపరాజుగారు కొంత దూరం సాగిన తరవాత…

“అల్లదివో సూశారా! అనపడతాంది కాలవ, ఆయ్! అది మాసేలకి నీల్ల కోసం తెల్లోళ్ళు తొవ్వించినదండి. ఇది పంట కాలవండి. పెద్ద కాలవమీద మాకోసమే లాకోటి కట్టిచ్చారండి. రెండు పంటలకి నీటికి కొఱవ లేదండి. ఆయ్! ఇక్కడ మొదలండి, ఇదిగిదిగో! ఇటు సూడండి. అల్లదిగో సింతసెట్టండి, అది దచ్చిన సరద్దండి, అల్లాపడతన్నాది కొబ్బరి సెట్లొరస, అదండి పచ్చిమ సరద్దు, ఆయ్! ఇటు సూడండి తాడిసెట్ల గుంపు, అదండి ఉత్తర సరద్దు. నూటొక్క ఎకరవండి, బంగారం పడుద్దండి, నిజంగానే బంగారం పండుద్దనుకునీరు, ఇత్తనవేస్తే రెప్ రెప్ లాడత వస్తాదండి మొలక. ఆయ్! అల్లదే దూళ్ళ సాలండి పాతిక్కాళ్ళండి.”

చెప్పుకుపోతున్నాడు సూరపరాజుగారు, అతని వాక్ప్రవాహం, అడ్డుకట్టలేని కొత్త గోదావరిలా సాగిపోతూనే ఉంది. వింటున్న చినరాజుకి లంగరందడం లేదు. ‘సూద్దారి’ అని సరిపెట్టుకున్నాడు.

ఇంతలో ఎవరో మనిషి కనపడ్డాడు, విత్తనాల గంపతో. “సూరయ్యా! ఏటి సేత్తన్నారీయాలా?” అని ఆరా తీసిన సూరపరాజుకి, పక్కనున్న కొత్తమనిషిని చూసిన సూరయ్య “పడవటేపు పాతికెకరాల సెక్కలో పెసలు జల్లుతున్నావండి” అన్జెప్పి వెళ్ళిపోయాడు.

సూరపరాజుని చూస్తే ఎండిపోయిన పుగాక్కాడలా, పొగచూరుకుపోయినట్టున్నాడు తప్పించి నూటొక్క ఎకరాల ఆసామీలా ఆనలేదు. మాటల్జూస్తే వామ్మో! ఇక్కడా లంగరందని చినరాజు ‘ఇంతకీ తవదెంత ఎవసాయం’ అడగలేకపోయాడు. ‘సరే, ఇంకా సూద్దారని’ చినరాజు అనుకుంటూ ఉండగా, ఊరి బాట పట్టేరు.

ఎక్కడో పెద్ద బంగళా ముందు తేల్తావనుకున్నాడు చినరాజు, కాని చిన్న సందులోకి దారి తీశాడు సూరపరాజు. రెండు గదులు, వసారా ఉన్న చిన్న ఇంటి ముందు వసారాలో నిలబడి “ఏవండో సత్తిరాజుగారు! తవరోమాట చెయినేసుకోవాలి, పాణింగిపిల్లి నించి అబ్బాయిరాజుగారికి సవందం సెప్పటానికొచ్చేరు. కందాలరాజుగారి కువార్తెంట, సినరాజుగారు దయసేశారు. పట్టిమంచం పంపించండి,” అన్నాడు.

ఉడతలు పీకిన తాటి టెంకలాటి జుట్టుతో, మోకాళ్ళ మీదకి పోతున్న మాసిన చీరతో, అష్టవంకర్లు తిరిగున్న నులక మంచం పట్టుకొచ్చి వేసి ‘సిత్తగించండ’ని లోపలికి సద్దుకుందొకావిడ. ఆ ఇంట్లో మరో ప్రాణి ఉన్నట్టనిపించలేదు చినరాజుకి. ఈ మంచం తెచ్చినావిడెవరూ? అర్థంకాలేదు. నిలువుగుడ్లేసుకుని చూస్తూ ఉండిపోయాడు.

‘తవరు కూకోండంటే తవరు ముందు కూకోండనుకుంటూ’ ఇద్దరూ నిలబడ్డారు. ఏదో చెబుతున్న సూరపరాజుగారు మర్యాదల్లో లోపమేదో ఉన్నట్టనిపించి, “సత్తిరాజుగారు! కాఫీ, మంచి తీర్థం…” అంటూ ఆగిపోయాడు.

విన్న చినరాజు “అబ్బే! ఉప్పుడేం ఒద్దండి, కతికితే అతకదంటారండీ,” అని మొహమాటపడ్డాడు. “తవరు తోళెం పుచ్చుకోండి,” అని మొహమాటపెడుతుండగా లోపల్నుంచి ఓ రెండు గ్లాసుల్లో కాఫీ లాటి ద్రవాన్ని పట్టుకొచ్చి ఒకటి సూరపరాజుకిచ్చి మరోటి చినరాజు ముందుపెట్టి ‘అన్నయగారు, కూకోండి. తవరు కాఫీ తోళెం పుచ్చుకోండ’ని చెప్పి లోపలికెళిపోయింది, ఇందాకా మంచం తెచ్చినావిడ. అష్ట వంకర్లు తిరిగున్న మంచం మీద కూచుంటే ఏమవుతుందోనని భయపడిన చినరాజు భయంతోనే కుక్కిమంచం దండి మీద బొట్టమోపుగా కూచున్నాడు.

కాఫీ పుచ్చుకుంటున్న చినరాజుకి ఆవిడే సూరపరాజుగారి ధర్మపత్ని అని తెలిసిపోయింది. తనొచ్చిన పని మళ్ళీ చెప్పి “మా రాజుగారికి ఇసయం ఇన్నవిస్తావండి. ఎళ్ళొస్తామండి, దయుంచండి.” అని బయటికొచ్చాడు.

వెళ్ళొస్తానని వీడ్కోలు తీసుకుని బయటికొచ్చాడు గాని, చినరాజుకి మనసు మనసులో లేదు. కాఫీ తెచ్చినావిడ సూరపరాజు భార్యేనని అర్థమయింది. కాని ఆ ఇల్లాలిని చూస్తే ఏబ్రాసిలా కనపడింది. ఇల్లు చూస్తే పూరింటికి ఎక్కువా పెంకుటింటికి తక్కువా అన్నట్టుంది. ఇంతకీ సూరపరాజు వ్యవసాయమెంతో, సిరి సంపదలేంటో సూచనగా తెలుస్తున్నా రూఢిగా తెలీలేదు. వినపడుతున్న మాటకీ కనపడుతున్న నిజానికీ లంగరందక కొట్టుకుంటున్నాడు. విషయం రూఢిగా తెలుసుకుంటే కందాలరాజుగారి కూతురికి కాకపోయినా మరొహరికి చెప్పచ్చనుకుంటూ కాలు సాగించాడు.

“ఎవరూ? సినరాజుగారేనా?” అంటూ ఓ వ్యక్తి అటకాయించాడు.

అడ్డొచ్చిన వ్యక్తిని తేరపారి చూసిన చినరాజు “ఆయ్! మీరంటండీ పులిరాజుగారూ, ఈ ఊళ్ళో ఉంటన్నారా! తెలీదు సుమా!” అన్నాడు. ఇద్దరూ అల్లుకుపోయారు, కుశల ప్రశ్నలనుంచి చిన్నప్పటి ముచ్చట్ల దాకా.

“దయసేయండి! ఇదే మా హవేలీ!” అంటూ ఓ మధ్య తరగతి పెంకుటిట్లోకి దారి తీశాడు పులిరాజు. స్వాగత సత్కారాలు నడుస్తున్నాయి, కబుర్లూ నడుస్తుండగా,

పులిరాజు “సినరాజుగారు! తవరేదో రాసకార్యం మీద దయసేసినట్టుంది,” అన్నాడు లౌక్యంగా.

“తవరి గేమంలో నూటొక్క ఎకరాల కావందు సూరపరాజుగారి కొవారుడికి పెళ్ళి మాటలకోసం వచ్చేము,” అని తాను ఉదయం వచ్చింది మొదలు జరిగినదంతా పులిరాజుకు చెప్పి, “ఏటండీ సూరపరాజుగారి మాటలు కోటలు దాటతన్నాయి, కాళ్ళు గడపలు దాటలేదు. ఆయన చెప్పినదానికి మేము సూసినదానికీ…” అని నాన్చేశాడు.

పులిరాజు సూరపరాజు మాట మధ్యలోనే అందుకుని “తేడా గురిచ్చా తవరి అనుమానం. ఆయ్! తవరు సూసిన నూటొక్క ఎకరాల సెక్కలో వందెకరాలు మా ఊరి పెదరాజుగారిదండి, ఒక్కెకరవూ సూరపరాజుగారిదండి. తవరికో అనుమానం వచ్చుద్ది, ఒక్కెకరవూ సూరపరాజుగారికెలా దఖలు పడిందీ అని, ఇనండి. మా పెదరాజుగారి ముత్తాతగారు కాలం జేసినపుడు, సూరపరాజుగారి తాతగారికీ ఎకరం నేలా దానం జేసేరండి, ఓ మూల. దానం జేసినాగానండి, ఎవసాయం తవరే సేసి అయివేజు సూరపరాజుగారి కుటుంబానికి పంపడం తరాలుగా జరిగిపోతన్నదండి… ‘మాదీ, మా రాజుగారిదీ కలిపి నూటొక్క ఎకరాల ఎవసాయం’ అనే సూరపరాజుగారి మాట, అలా నిలబడిపోయిందండి. అంతేనండి, సూరపరాజుగారికి మరో యాపకం లేదండి, రోజూ ఓపాలి పొలవెల్లి చూసొస్తంటారండి,” అని ముగించాడు పులిరాజు.

“అదాండీ సంగతీ! ఇసయం తెలీక కొట్టేసుకున్నావండి. మా కందాల రాజుగారి కొవార్తెకి కాపోతే మరోరికనుకోండీ, గంతకి తగిన బొంతకి. దయుంచండి, శలవిప్పించండి. ఉంటావండి,” అంటూ బయటకు దారి తీశాడు చినరాజు.
----------------------------------------------------
రచన: చిర్రావూరి భాస్కరశర్మ, 
ఈమాట సౌజన్యంతో

Sunday, July 28, 2019

సింహాసనం


సింహాసనం




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి.................

ప్రతి రోజూ ఐదు నిముషాలు ఆలస్యంగా వచ్చే సోమబాలాకి ముప్పై ఏళ్ళు దాటివుండవు. మనిషి ఆరుడుగుల పొడవుంటాడు. చేవదేరిన అడుగుమాను దుంగలను సునాయాసంగా భుజాల మీదకెత్తుకుని గాల్లోకి విసిరెయ్యడం చూశాను. అలా ఎత్తుకునేప్పుడు నిక్కపొడుచుకునే వాడి కండరాలు భుజాన్ని చీల్చుకుని బయటకొచ్చేస్తాయేమో అన్నంత భయంకరంగా ఉంటాయి. తన చేతిలో ఉన్న కార్డ్ చాచిపట్టుకొని ప్రస్తుతం చేతులు కట్టుకుని నా ముందు నిల్చున్నాడు. నా ముందు ఎప్పుడూ కుర్చీలో కూర్చోడు. ఐదు నిముషాలు ఆలస్యంగా వచ్చినందుకు కార్డ్ మీద ఇన్-టైమ్ ఎర్ర అక్షరాలతో అచ్చయ్యి ఉంది.

వెయ్యిమంది కార్మికులు పనిచేసే ఈ ఫ్యాక్టరీలో ఆరు నెల్ల క్రితమే టైమ్ స్టాంప్ మెషిన్‌‌లు రెంటిని పెట్టారు. కార్మికులు రాగానే ముందు కార్డ్ మెషీన్‌లో పెడితే అది ఇన్-టైమ్ స్టాంప్ వేస్తుంది. అలానే వెళ్ళేముందూ చేయాలి. ఐదు నిముషాలు ఆలస్యం అయితే పదిహేను నిముషాల కూలి కత్తిరించబడుతుంది. పది నిముషాలు ఆలస్యం అయితే అర్ధగంట కూలి, అర్ధగంట ఆలస్యం అయితే రెండు గంటల కూలి. ఒక గంట ఆలస్యంగా వస్తే కార్మికుడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు.

సోమబాలా రోజూ ఆలస్యంగా వస్తున్నాడు కాబట్టి నా దగ్గరకొచ్చాడు. ఈ ఫ్యాక్టరీ కొలంబోనుండి 125 కిలోమీటర్ల దూరాన ఉండే గింతోట అన్నచోట ఉంది. నూటికి నూరుపాళ్ళు సింహళులు ఉండే ప్రాంతం అది. అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళలో నేనొక్కణ్ణే తమిళుణ్ణి. వంద సింహళ పదాలకు మించి నాకు మాట్లాడటం చేతకాదు. నేను చెప్పదలచుకున్నదేదైనా నా ఈ వంద పదాల పదజ్ఞానంతోనే వ్యక్తపరచాలి.

“అసలు నీ సమస్యేంటి? నువ్వు ఆలస్యంగా రావడంవల్లేగా కూలీ కత్తిరించుకుంటున్నారు? ఇంటినుండి ఐదునిముషాలు ముందు బయల్దేరచ్చు కదా?” అనడిగాను.

సోమబాలా తలవంచుకునే ఉన్నాడు. ఏదో చెప్పదలచుకున్నాడు. వాడివల్ల కాలేదు. అంత బలశాలి అయిన ఒకడు నా ముందు ఇలా తలవంచుకుని నిల్చోవడం నాకే ఇబ్బందిగా అనిపించింది. ‘సరే వెళ్ళు’ అనగానే వెళ్ళిపోయాడు. మరో కార్మికుడు మెడ వంచుకుని తల మాత్రం లేపి చూశాడు. కొలిమిలో కొట్టి సాగదీసినట్టు పొడవుగా ఉన్నాదు. ఎంట్రీ కార్డు చేతబట్టుకుని లోపలికొచ్చాడు.

ప్రభుత్వం నడిపే ఈ ప్లయ్‌వుడ్ కంపెనీ ఇరవై ఏళ్ళుగా నడుస్తోంది. రోజూ పెద్ద పెద్ద లారీల్లో చెట్లు కొట్టేవాళ్ళు వాళ్ళు నరికిన అడవి మానుల దుంగలు తెచ్చి పేర్చిపోతారు. ఆ ప్రాంతమంతా కర్ర వాసన కమ్ముకుని ఉంటుంది. బ్రహ్మాండమైన మెషిన్‌లలోకి కన్వేయర్ల మీద ఇటునుండి వెళ్ళే దుంగలు పలుచని రేకుల్లా అటువైపు వచ్చిపడుతుంటాయి. ఈ రేకులను అడ్డంగా, నిలువుగా పేర్చి 3, 5, 7, 9 అని అంటించి, వొత్తి పలురకాల మందంతో పలకలు తయారు చేస్తారు. అవి నున్నగానూ తేలికగానూ ఉంటాయి. అయితే మామూలు కర్ర పలకలకంటే గట్టిగా ఉంటాయి. కాబట్టి వీటి వ్యాపారం కూడా అమోఘంగానే జరుగుతోంది.

ఫ్యాక్టరీలో పనిచేసే పనివాళ్ళలో అందరికంటే ఎక్కువ చదువుకున్నవాడు సోమబాలా. అయితే వాడు మెషిన్‌ల దగ్గర పని చెయ్యడు. దుంగలను గ్రేడింగ్ చేసే విభాగంలోనో, మెషిన్‌లోకి పంపించే సెక్షన్‌లోనో లేడు. రేకులను పేర్చి అంటించే సెక్షన్‌లోనో పాలీష్ చేసే సెక్షన్‌లోనో కూడా వాడు పని చేయడు. కలప పొట్టునూ చెత్తనూ ఊడ్చే పనో, లారీలు దుంగలను కుప్ప పోసే చోట శుభ్రం చేసే పనో చేస్తుంటాడు. వాడు కేవలం మానులను చూసే వందలాది వృక్షాలను గుర్తుబట్టగలడు. ఏ మాను దేనికి పనికొస్తుంది, వాటి బలం, ప్రత్యేకతలు, చరిత్ర–ఇవి వాడికి వెన్నతో పెట్టిన విద్య. వడ్రంగిపనిలో నైపుణ్యం ఉన్నవాడు. వాడి కులవృత్తి అది. అయినప్పటికీ ఈ ఫ్యాక్టరీలో అందరి వేళాకోళాలనూ భరిస్తూ కిందస్థాయి పనివాడుగా పనిచేస్తున్నాడు.

ఒకరోజు సోమబాలా అర్ధగంట ఆలస్యంగా వచ్చినందుకు అతని మేనేజర్ ఛండాలంగా తిట్టాడు.

“ఆలస్యంగా వచ్చినందుగ్గాను నీ జీతమెలానూ పట్టుకుంటున్నారు. నిన్ను అలా తిట్టడం దేనికి?” అని అడిగాను.

“నేను కిన్నర కులంవాడిని. అంటే తక్కువ కులం. మమ్మల్ని అలానే తిడతారు.” అన్నాడు.

“నీకు అలవాటైపోయిందా?” అనడిగాను.

నా చెవి దగ్గరకొచ్చి “ఫ్యాక్టరీ పెద్ద మేనేజర్‌ది ఏం కులమో తెలుసా?” అనడిగాడు.

“తెలియదు.” అన్నాను.

“దేవ కులం.”

“అంటే?”

“పూర్వకాలంలో రాజులందరూ దేవ కులస్తులే. కాబట్టి పై జాతి,” అన్నాడు. తల అటూ ఇటూ తిప్పి చూసి మెల్లగా “మీకో విషయం తెలుసా? మన జనరల్ మేనేజరు ఒక సింహాసనం చేయిస్తున్నారు,” అన్నాడు.

“సింహాసనమా! దేనికి?”

“కూర్చోడానికే!”

“జనరల్ మేనేజర్‌గారికి ఆయన పూర్వీకులు కూర్చున్నట్టు సింహాసనంలో కూర్చోవాలని మనసులో కోరిక పుట్టినట్టుంది. అడవులనుండి వచ్చి దిగే కర్రల్లో యోగ్యమైనవాటిని ఎంచుకుని మంచి సింహాసనం చెయ్యమని ఆర్డర్ వేశాడు. దానికి నియమించబడ్డవాడు అసమర్థుడు, అబద్ధాలకోరు. పండి రాలిన గుమ్మడికాయ నెత్తిన పడిందని జంకకుండా చెప్పే రకం. వాడికి వడ్రంగి పనీ తెలీదు, శిల్పాలు చెక్కడమూ రాదు. ఎన్నో విలువైన కర్రలను పాడు చేశాడు. సింహాసనపు కోళ్ళు సింహం కాళ్ళలా ఉండాలన్నారు జనరల్ మేనేజరు. వీడికి గాడిద కాళ్ళు చెక్కడం కూడా రాదు.”

“జనరల్ మేనేజర్ కోసం ఒకటి రెండు కర్రలు వృధా అయితే ఫ్యాక్టరీకి పెద్ద నష్టమొచ్చేస్తుందా ఏంటి?”

“మీరే ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు పాడు చేస్తున్నది మామూలు మానులు కాదు. చాలా విలువైనవి, అరుదైనవి. ఈ దేశాన్ని మునుపు పాలించిన ఆంగ్లేయులు కదుబెరియ మానులను వందలాది నౌకల్లో ఇంగ్లాండుకు తీసుకెళ్ళిపోయారు. వందేళ్ళు చేవదేరిన కదుబెరియ చెట్లను వాళ్ళు నరికినప్పుడు, కొత్త చెట్లేమీ నాటలేదు. ఇంగ్లాండులో ఆ మానులతో చేసిన బల్లలమీద, కుర్చీలమీద కూర్చుని భోజనాలు చేస్తున్నారు. అలాంటి మానులు వాళ్ళకు మరెక్కడా దొరకవు. అంత నున్నగా బలంగా ఉంటాయి. మెరుగుపెట్టిస్తే ముఖం చూసుకోవచ్చు. అలా మెరుస్తాయి. వాళ్ళు నాశనం చేసింది చాలదన్నట్టు పని రానివాళ్ళు కూడా నాశనం చేస్తున్నారు. కళానైపుణ్యం ఏ కోశానా లేనివాళ్ళు చెట్లు నరికే పని చెయ్యొచ్చు గానీ, కర్ర వస్తువులు చెయ్యకూడదు. తలలో ఏదైనా ఉంటేనే కాదా అది కర్రమీద కళగా మారేది?”

సోమబాలా ఇంతలా కోప్పడటం నేనెప్పుడూ చూడలేదు.

“సింహాసనానికి ఏ కర్రయితే ఉచితం అని నిన్నడిగితే నువ్వు ఏం చెప్తావు?“

“మునుపొక తెల్లదొర గవర్నర్‌గా ఉండేవాడు. వాడి పేరు సర్ రాబర్ట్ బ్రౌన్రిక్. వాడు కాలమందర్ మానులను కబళించి ఇంగ్లాండుకు తీసుకెళ్ళాడట. వాడి ఇంటికి తలుపులు కూడా ఆ కర్రలతోనే చేయించాడట. ఇప్పుడు జరుగుతున్నది అంతకంటే రోతగా ఉంది. ఇక్కడ చెక్క తరుగు, పొట్టు ఊడ్చే పని చేస్తున్నవాడినే అయినప్పటికీ నేను ఈ దుర్మార్గాలను చూసి ఓర్చుకోలేకపోతున్నాను.”

నేనడిగిన ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పనేలేదు వాడు.

“చెట్లమీద ఇంత ప్రాణం పెట్టుకున్న నువ్వెలా ఈ వృత్తిలోకి వచ్చావు?”

“ఇంకేముంటుంది? మానులమీదున్న ప్రేమవల్లే. ఇలా ప్రతి రోజూ మానులతో గడపగలుగుతున్నాను. వాటి చరిత్రని చదువుతున్నాను. ఎన్ని రకాలు! 60 అడుగులు 70 అడుగులు పొడవున్న మానులు. 20 అడుగుల చుట్టుకొలతున్న మానులు. వందలేళ్ళు జీవించిన మానులు. అయితే వీటిని నాశనం చెయ్యడాన్ని చూస్తూ సహించలేకున్నాను. ఈ వృత్తి నాకు సరైనది కాదు. మీరేమనుకుంటారు?”

“నువ్వు చాలా ప్రశ్నలడుగుతావు.”

“ప్రశ్నలే ప్రధానం. జవాబులు కావు. ప్రపంచం ప్రగతి గతిలో సాగేది ప్రశ్నల వల్లే. ఇలాంటివి చూస్తూ ఊరుకోలేను.”

“మరేం చెయ్యగలవు?”

“నాకు చెట్లను నాశనం చేసి దానిలో దొరికే డబ్బుతో బతకాలని లేదు. ఎప్పుడో ఒకరోజు ఈ ఉద్యోగం వదిలేస్తాను.” అంటూ పనిలోకి వెళ్ళాడు.

నా టైపు మెషిన్‌లో యూ, కే, ఎక్స్ అక్షరాలు కొట్టినప్పుడు పేపర్‌కి అంటుకుంటాయి. ప్రతిసారీ వేలితో అక్షరం అచ్చును లాగి వదలాలి. ఆ అక్షరాలు రాని వాక్యాలను సృష్టించుకుని టైప్ చేసుకుంటూ ఉన్నాను. పని కొలిక్కివచ్చిన సమయాన గడపలో నీడగా కదలిక. తలెత్తి సోమబాలాని చూసి నివ్వెరబోయాను. ముఖము, జుట్టు, చేతులు, కాళ్ళు అంతా కర్ర ధూళితో కప్పుకుపోయుంది. నడుస్తున్న కర్రలా ఉన్నాడు. అడ్డంగా కోసిన ఒక పలక నెత్తిన పెట్టుకునున్నాడు. గుండ్రటి ఆ పలక అంచులను చేతులు చాచినా అందుకోలేము. దాని చుట్టుకొలత ఎంత కాదనుకున్నా ఇరవై అడుగులుండచ్చు. బిగసిన వాడి భుజాల కండరాలను చూస్తేనే తెలుస్తోంది ఆ పలక ఎంత బరువుగా ఉందోనని! దాన్ని జాగ్రత్తగా నేల మీద దించి పెట్టేసి, “ఇదేం మానో తెలుసా?” అన్నాడు.

“తెలియదు.” అన్నాను.

“బేయోబాబ్స్. సింహళంలోనూ అరవలోను దీన్ని పెరుక్కా మాను అంటాము. వేలాది సంవత్సరాల క్రితం ఈ చెట్టు ఆఫ్రికానుండి వచ్చింది. కాండం మీద ఈ రింగులు ఎంచి చూస్తే దాని వయసెంతో తెలుస్తుంది. దీని వయసెంతో తెలుసా? 400 సంవత్సరాలు. నాలుగు వందల సంవత్సరాల చెట్టుని నరికేశారు. ఇలాంటి మాను మనకు ఇంకొకటి కావాలంటే మనం నాలుగు వందల సంవత్సరాలు ఎదురు చూడాలి. ఇదిగోండి, ఈ నడిమధ్యన ఉంది చూశారూ? ఈ చుక్కే ఇది మొలిచిన కాలం. రాజా విమలధర్మ సూర్యా పరిపాలించిన కాలం. 400 ఏళ్ళ క్రితం కండిని పరిపాలించినవాడు. క్రైస్తవ మతం నుండి భౌద్ధమతానికి మారినవాడు. పెద్ద సైన్యంతో వచ్చిన పోర్చుగీసులను తన చిన్న సైన్యంతో అతి చాతుర్యంగా ధ్వంసం చేసినవాడు. వాడి కాలంలో పుట్టిన చెట్టిది. ఇదిగోండి ఈ వలయం దగ్గర లంకాపురి చివరి రాజు సిఱివిక్రమ్‌రాజసింగెను బ్రిటీష్‌వారు వేలూరు చెరశాలకు తీసుకెళ్ళి బంధించారు. ఈ వలయం దగ్గర శ్రీలంకకు స్వాతంత్రం వచ్చింది…” ఇలా చెప్పుకుంటూ పోయాడు.

“అంత కచ్చితంగా చెప్పగలవా?”

“చెప్పగలను. అంతేకాదు. ఈ చెట్టు చాలా అరుదైన వృక్షం. ప్రభుత్వం చివరిగా తీసుకున్న లెక్కల ప్రకారం, ఈ దేశంలో ఇవి కేవలం 40 చెట్లే ఉన్నాయి. దాన్లో ఒకదాన్నిప్పుడు నరికేశారు. నాకు చాలా బాధగా ఉంది. చెట్లను నరికి దానితో వచ్చే డబ్బుతో పొట్టపోసుకోవడం సిగ్గేస్తుంది. నేను ఈ ఉద్యోగం మానేస్తాను.”

“నువ్వు ఉద్యోగం మానేయలేవు. నీకు మానులమీదున్న అపేక్ష నిన్ను వదిలివెళ్ళనివ్వదు. వాటి సాంగత్యం కావాలి నీకు.” అన్నాను.

మళ్ళీ కొన్నాళ్ళకు సోమబాలా కనిపించకపోయేసరికి వాడు చెప్పినట్టు ఉద్యోగం మానేశాడనుకున్నాను. అయితే ఒక రోజు పొద్దున కార్డ్ పట్టుకుని నా ముందు నిలబడ్డాడు.

“ఏంటి? మళ్ళీనా?” అని ముఖం చిట్లించాను.

వాడికి కోపం వచ్చేసింది. వాడెప్పుడూ అలా మాట్లాడిందెరుగను. “నేనేమైనా చిన్నపిల్లాడ్నా? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడంవల్ల ప్రయోజనమేముంది? నాకు తెలుసు నేనెందుకు ఆలస్యంగా వస్తున్నానో. మా ఇంట్లో ఉన్నది నేనూ, మా నాన్న మాత్రమే. నేను ఇంట్లో లేనప్పుడు ఆయన బయటకెళ్ళి తిరిగొచ్చే దారి మరిచిపోయి తప్పిపోతుంటారు. ఆయనకి మతిమరుపు వ్యాధి. మాకు మరెవరి సహాయము లేదు. నేను పొద్దున ఆయనకి స్నానం చేయించి, తినిపించి పడుకోబెట్టి, మోకాలికి ముద్దుపెట్టి, మంచంతోబాటు ఆయన్ని తాడుతో కట్టేసి ఉద్యోగానికి వస్తాను. ఈ పనుల వల్ల కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. సాయంత్రం వెళ్ళి ఆయన కట్లిప్పి వదిలిపెడతాను. మళ్ళీ ఆయనకి స్నానం చేయించి, తినిపించి, మోకాలికి ముద్దుపెట్టి నిద్రపుచ్చుతాను. నేను ఆలస్యంగా వస్తే నా జీతంలో కొంచం పట్టుకుంటారు. దీనివల్ల వచ్చే నష్టమేంటి? నేనేమైనా మెషిన్ నడుపుతున్నానా? ఊడ్చి శుభ్రంచేసే పనేగా? ఆలస్యంగా వచ్చినా పని అవుతోందిగా?”

అప్పుడనగా ప్రియాంక లోపలికి వచ్చింది. జనరల్ మేనేజర్ సెక్రెటరీ. ఇక్కడ పనిచేసే ఏకైక మహిళ. ఆమె ధరించిన వస్త్రం పూర్వకాలపు రాణుల వస్త్రంలాగా కాళ్ళకిందదాకా పొడవుగా నేలమీద జీరాడుతుండటంవల్ల అడుసులో నడుస్తున్నట్టు ఒక్కో అడుగు పైకి ఎత్తిపెట్టి నేలని గట్టిగా తొక్కుతున్నట్టు నడుస్తోంది. నేనెంతో శ్రమపడి టైపు చేసిన ఒక కాగితం తిరిగిచ్చింది. ‘యూ’నో లేక ‘కే’నో సరిగ్గా టైపవ్వలేదని మేనేజర్ చెప్పుంటారు.

“టైపురైటర్ పాతదయిపోయింది, సర్వీస్ చేయించాలి.” అన్నాను.

ఆమె దానికి ఏమీ మాట్లాడకుండా, కళ్ళు పైకి ఎగరేసి, నాటకీయంగా చూసి వెళ్ళిపోయింది.

నేను సోమబాలాతో “ఈ అమ్మాయిని నీ వెంట తీసుకెళ్ళు. ఆమె వేసుకున్న గౌను నువ్వు ఊడవవలసినదంతా ఊడ్చేస్తుంది!” అన్నాను.

సోమబాలా పొట్ట పట్టుకుని మరీ పడిపడి నవ్వాడు. నవ్వేప్పుడు కూడా వాడి కండలు తిరిగిన భుజాలు పొడుచుకునే ఉన్నాయి.

గది సంతోషంతో నిండిపోయాక అడిగాను, “నీకు సాయం చేసేందుకు ఎవరూ లేరా?”

“నేనెందుకు మరొకరి దగ్గర సాయం అడగాలి? ఇది నా బాధ్యత కదా? చెట్టుకు మధ్య భాగమే బలం. గట్టిబడి ఉక్కులా ఉంటుంది. ఆ చెట్టులో మొట్టమొదటి భాగమూ అదే. అయితే చెట్టుకి కావలసిన ఆహారాన్ని సరఫరా చెయ్యడం ఆ భాగంవల్ల కాదు. చెట్టుయొక్క తాట భాగమే ఆహారాన్నీ నీటినీ సరఫరా చేస్తుంది. ఆ భాగం లేతది, వయసులో చిన్నది. మనుషులూ అంతే. పెద్దలు కుటుంబానికి బలం. కొత్తతరం వాళ్ళే సంపాదనలవీ చూసుకోవాలి.”

ఆ తర్వాత వాడు రాత్రి షిఫ్టుకు మారినట్టు తెలిసింది. తర్వాత వాడిని కలిసే సందర్భమే రాలేదు. ఒక రోజు రాత్రివేళ లారీలో వచ్చిన దుంగలు కట్లు తెగి దొర్లిపోసాగాయట. ఆ చోటు వాలుగా ఉండటంతో అవి వేగంగా దొర్లుకుంటూ వెళ్ళడం సోమబాలా చూశాడు. అక్కడ పనిచేస్తున్నవారి మీదకి వెళ్ళుంటే కచ్చితంగా ఒకరిద్దరి ప్రాణాలు పోయేవి. సోమబాలా ఒక్క ఉదుటున దూకి ఓ పెద్ద దుంగను నిలువుగా విసిరేసి దొర్లుతున్న దుంగల్ని ఆపి ప్రమాదం జరగకుండా రక్షించాడు. మరుసటి రోజు ఫ్యాక్టరీ అంతా అదే వార్త.

ఫ్యాక్టరీలో ప్రతి ఏడూ జరిగే వార్షికోత్సవాలలో గుర్తింపు బహుమతి ఈ ఏడు వాడికే వస్తుంది అని మాట్లాడుకున్నారంతా. నేనూ అలానే అనుకున్నాను, మనుషుల ప్రాణాలను కాపాడాడు ‌అని. అయితే ఎటువంటి బహుమతీ ఇవ్వలేదు, గుర్తించనూలేదు. జనరల్ మేనేజర్ అన్నారని బయట జనం చెప్పుకున్న పుకారేంటంటే ‘వాడికి బహుమతి ఇవ్వడంకంటే ఒక తమిళుడికి ఇవ్వచ్చు!’ అని.

“నిన్ను గుర్తించి నీకు బహుమతిస్తారని నువ్వు ఎదురు చూశావా?” అని అడిగాను.

వాడన్నాడు, “దుంగలు దొర్లగానే నేను పరుగున వెళ్ళి ఆపాను. ఏ ఆపదా జరగకూడదని. అప్పుడు బహుమతి వస్తుందా రాదా అనేం ఆలోచించలేదు. ఎవరికి ఏది రాసిపెట్టుందో అదే జరుగుతుంది.”

నేనేం మాట్లాడలేదు.

“నేను ఉద్యోగం మానేస్తున్నాను.” అన్నాడు.

నేనేం చెప్పలేక అక్కడనుండి వెళ్ళిపోయాను.

సోమబాలా ఉద్యోగమేమీ మానలేదు. రెండు వారాల తర్వాత నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. నా పెట్టె సర్దుకుని బస్ కోసం వెళ్తుంటే, సగం దారిలో సోమబాలాని ఒకసారి కలవాలనిపించింది. వాడు నైట్ షిఫ్ట్‌లో ఉన్నాడు. ఫ్యాక్టరీ రాత్రి వేళలో వేరేలా కనిపించింది నాకు. గుమ్మం దగ్గర రెండు పెద్ద టైమ్ పంచింగ్ మెషిన్‌లు. పొద్దున వేళైతే ఆ మెషిన్‌ల ముందు పెద్ద వరుసల్లో కార్మికులు నిల్చున్న దృశ్యం గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు అక్కడ ఒక్కరూ లేరు.

సోమబాలాని వెతుక్కుంటూ వెళ్ళాను. వాడు మామూలుగా ఉండేచోట లేడు. మెషిన్‌లు చెవులకు తూట్లుపెట్టేంత శబ్దం చేస్తున్నాయి. తలెత్తి నన్ను చూసి మళ్ళీ పనిలో పడిపోయాడు.

“నువ్వు మామూలుగా ఉండేచోట వెతికాను.”

తల పైకెత్తకుండానే జవాబు చెప్పాడు. “ఎన్నో నెలల సమయాన్నీ, అపురూపమైన మానులనూ వృధా చేసేశారు. ఇప్పటికి ఆ పని నాకిచ్చారు. ఒకప్పుడు కండిని పాలించిన రాజులు తమ రాజభవనాల్ని అలంకరించడానికి వాడుకున్నది ఈ కర్రనే. దీని పేరు హూలన్‌హిక్. ఇది ఎలానో తెల్లోళ్ళ దృష్టినుండి తప్పించుకుంది. ఈ కర్రనుండి వచ్చే సునాసన సౌధమంతా నిండిపోయేదట. నలుపన్నది రంగే కాదంటారు శాస్త్రవేత్తలు. మెరుగు పెట్టినకొద్దీ దీని వన్నె పెరుగుతూ ఉంటుంది. దీనిలా మెరిసే నల్లటి మాను ప్రపంచంలో మరోటి లేదు!”

కుర్చీ చేతులపై నోరు తెరచిన రెండు సింహాలు తద్రూపంగా చెక్కబడున్నాయి. కాళ్ళు ఉరకడానికి సిద్ధంగా ఉన్న సింహపు కాళ్ళలానే ఉన్నాయి. పాపాయిని హత్తుకున్నంత లాఘవంగా చేయిపిడికి మెరుగు పెడుతున్నాడు. నునుపు దేరుతూ నల్లగా మెరుస్తోంది. వాడు పనిలో నిమగ్నమైపోయున్నాడు. కళల్లో పడితే అన్నీ మరచిపోతారు కాబోలు!

“ఇటువంటి చారలు మరే మానులోనూ చూడలేము. ఈ మానుకు మాత్రమే ఇలాంటి క్రమమైన చారలిచ్చే కణాలుంటాయి. అందుకే దీన్ని కర్రలకల్లా రాజు అంటారు.”

“సింహాసనం చేస్తున్నావా?” మాటలు పొడిగించాలన్నట్టు.

ఎక్కడా కేంద్రీకరించని చూపు చూడటం వాడికి అలవాటయినట్టుంది. “నేను కూర్చోటానికి ఒక ఆసనం చేస్తున్నాను. ఒక రాజు కూర్చుంటే మాత్రమే అది సింహాసనం అవుతుంది.”

“నేను ఉద్యోగానికి రాజీనామా చేసేశాను. నీతో చెప్పివెళ్దాం అని వచ్చాను.”

వాడేం మాట్లాడలేదు. శ్రద్దగా మెరుగు పెడుతున్నాడు. వాడి బుర్రలో ఏదో మెదలింది. అయితే దాన్ని చెప్పలేకపోతున్నాడు. వాడికి రావాల్సిన జీతాన్ని ఎడాపెడా కోసినవాడితో ఏంటి మాట్లాడేది అని వాడు అనుకుని ఉండచ్చు.

నేను కొలంబో వెళ్ళే చివరి బస్ ఎక్కి కూర్చున్నాను. మూడు గంటల ప్రయాణం. ఒక ముసలాయన మంచానికి కట్టబడి ఉన్న దృశ్యం కళ్ళముందు కదిలింది. ఆరవ జార్జ్ రాజు కూర్చోడానికి యోగ్యమైన నున్నని సింహాసనం తయారుచెయ్యబడుతున్న దృశ్యం కూడా కళ్ళముందు కదిలింది. తర్వాత ఎర్ర ఇంకుతో అచ్చువేయబడిన అట్టలను చేతబట్టుకుని వరుసగా కార్మికులు నిల్చున్న దృశ్యం. బస్సు తనదారిని తానే వెలుగు పరచుకుంటూ చీకటికేసి కాంతిరేఖలా పరుగుతీస్తోంది. ఎప్పుడోగాని దొరకని నడిజాము మెలుకువ ఘడియలు, తన తండ్రికంటే చెట్ల మానులను ఎక్కువగా ఆరాధించే ఒకణ్ణి గురించి ఆలోచించడంలో గడిచాయి.
----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్ 
మూలం: ఎ. ముత్తులింగం
మూలం: ‘సిమ్మాసనం’. ఆట్టుప్పాల్ పుట్టు(2017) 
(మేకపాల పుట్టు) అన్న కథల సంపుటినుండి.
ఈమాట సౌజన్యంతో

Thursday, July 25, 2019

దిష్టి


దిష్టి




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి..................
ఒక రచయితకి మూఢనమ్మకాలు వుండకూడదు కదా? దిష్టి తగిలిందనో, తగులుతుందనో ఎవరైనా అంటే, ఇదేం మూర్ఖత్వం అని ఖండించాలి. కామన్‌మేన్‌కీ రచయితకీ తేడా ఉంది కదా! చూడండి, నేనే ఇప్పుడు దిష్టి గురించి రాయాల్సొచ్చింది. మరిప్పుడు దీన్నేమనాలి? గ్రహబలం సరిగ్గా లేదనుకోవాలా, బ్యాడ్ టైమ్స్ నడుస్తున్నాయి అనుకోవాలా?

ఇదంతా 2017 డిసెంబర్ 18వ తారీకున తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలైంది. ఎప్పట్లాగానే నాలుగు గంటలకు లేచి మేడమీంచి కిందికి దిగి వచ్చాను. పెరటి తలుపు తీస్తే పప్పు, జోరో లఘుశంక తీర్చుకోవడానికి పరుగెత్తుతాయి. లేవగానే నేను చెయ్యాల్సిన మొదటి పని అదే. అప్పుడు మేము ముదలియార్ వీధిలో ఉండేవాళ్ళం. ఇండిపెండెంట్ హౌస్. ఆ రోజు తలుపు తియ్యగానే పొట్ట లోపలికి అతుక్కుపోయి, బక్కచిక్కి, చూడగానే జాలి పుట్టేట్టున్న ఒక పిల్లిపిల్ల గుమ్మం దగ్గరే కనిపించింది. ఆకలితో కుయ్యి కుయ్యిమని నీరసంగా ఏడుస్తోంది. నెలరోజుల పిల్లయుంటుంది. క్యాట్ ఫుడ్ కొంచం తీసి పెట్టడమే ఆలస్యం… అబ్బబ్బా, మాటల్లో ఎలా చెప్పను! మ్మ్…మ్మ్… అని అరుస్తూ ఆ బౌల్ మీద పడిపోయి ఆవురావురుమంటూ తినేసింది. ఓ మై గాడ్! ఎన్ని జన్మలెత్తినా ఆ క్షణాలను మరిచిపోలేను. ఆకలేసిన ప్రాణికి అన్నమే దైవం. ఆహారమే పరమార్థం. అయితే ఆకలెయ్యాలి. ఛ! ఛ! ఆకలి అన్న మూడక్షరాల పదం తలుచుకోగానే లోపల కలిగే భావం గురించి కాదు నేను చెప్పేది. ఆహారం దొరుకుతుందన్న ఆనవాలు, నమ్మకం కూడా లేనప్పుడు పుట్టే ఆకలి. ఒక విమాన ప్రమాదాన్ని ఊహించుకోండి. మీరు మాత్రమే బ్రతికారు. ఆల్ప్స్ కొండల్లోనో, అమేజాన్ అడవుల్లోనో, లేదా ఒక నిర్మానుష్యమైన దీవిలోనో పడిపోయారు. అప్పుడు పుట్టే ఆకలి. చివరికి సాటి ప్రయాణికుడి శవాన్ని కొరుక్కొని తినగలిగే ఆకలి. అలాంటి ఆకలి గురించి చెప్తున్నాను.

ఆ పిల్లిపిల్ల తిని ఎన్ని రోజులైందో ఏమో. దాన్ని చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ రోజు నా పుట్టినరోజు. దేవుడు నాకెటువంటి బహుమతిని ఇచ్చేడో కదా అనుకున్నాను. కడుపు నిండేంతవరకు ఆత్రంగా తిని, ఆ తర్వాత కొంచం నెమ్మదినెమ్మదిగా తినసాగింది పిల్లిపిల్ల. అక్కడే కూర్చున్నాను. మొత్తం తినేశాక నా ఒడిలోకి ఎక్కి పడుకుని నిద్రపోయింది. చాలాసేపు అలానే కూర్చుండిపోయాను. ఇంతకంటే జీవితంలో ఆనందకరమైన క్షణాలేముంటాయనిపించింది నాకు. ఆధ్యాత్మికులు జీవన సాఫల్యం అంటారే, అలాంటిది. ఆకలేసినవాడికి అన్నం పెట్టడం కంటే మరొక సాఫల్యం ఉంటుందా? తర్వాత ఆ పిల్లిపిల్లను పప్పు, జోరోల కంటబడకుండా బయట స్కూటర్‌లో పెట్టాను.

ఇప్పటికే ఇంట్లో చింటూ ఉంది. జోరోకి (గ్రేట్ డేన్) పిల్లులంటే పడదు కాబట్టి చింటూనీ జోరోనీ వేరువేరుగా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. దానికి తోడు చింటూ భలే చురుకు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పుడూ శబ్దం చేస్తూనే వస్తుంది. వెంటనే జోరోని గదిలో వేసి తలుపు పెట్టేసేవాళ్ళం. చింటూ తినగానే బయటకు వెళ్ళిపోతుంది. లేదా డాబామీదున్న గదికెళ్ళి పరుపు మీద పడుకుని నిద్రపోతుంది. ఆ గది తలుపు వేసేస్తే ఇక జోరోనుండి భయం ఉండదు. మెల్లమెల్లగా ఆ పద్దతినే ఈ పిల్లిపిల్ల కూడా అలవాటు చేసుకుంది. దీనికి గెయ్రో అని పేరు పెట్టింది అవంతిక. ఇలాంటి పేర్లెలా పెడుతుందో! అసలు ఆలోచించే అవనరం కూడా ఉండదు తనకు. మనసులో ఆ సమయానికి ఏదనిపిస్తే అదే పేరు.

భయపడకండి, వాటినెలా పెంచామో చెప్పి మిమ్మల్ని బోరు కొట్టించను. ఒక్క వాక్యంలో ముగించేస్తాను. 2018 జనవరి 30వ తేదిన జోరో కాలం చేశాడు. తేదీలు నాకు గుర్తుండవు కాని అది జనవరి ముప్పై కాబట్టి మరిచిపోలేకున్నాను. గ్రేట్ డేన్ ఆయువు ఏడేళ్ళే. అయితే జోరో పదేళ్ళు బతికాడు.

వియోగ బాధకి కాలం ఓ గొప్ప ఔషధం అన్నది నిజమే. జోరో చనిపోయి ఏడాది దాటింది. ఆ బాధనుండి పూర్తిగా కోలుకున్నాను. అప్పట్లో పిచ్చి పట్టినట్టు ఉండేది. జోరో జ్ఞాపకాల గొలుసులతో కట్టి, నన్ను సముద్రం లోతుల్లోకి విసిరేసినట్టుండేది. శరీర బాధని తట్టుకోవచ్చు కానీ మనోవేదన తట్టుకోవడం చాలా కష్టం. ‘బుర్రలో వేయి తేళ్ళు’ అని ఎన్నోసార్లు రాశాను కాని, అది ఆ రెండు రోజుల్లో నేను మొదటిసారి అనుభవించాను. ఫోన్ రింగయినప్పుడు కూడా కనీసం ఎత్తలేకపోయాను. ఒకట్రెండు కాల్స్ తీసుకున్నా కానీ అటునుంచి మనిషి గొంతు వినపడగానే భోరుమని ఏడ్చాను. నా ఏడుపు నాకే వింతగా అనిపించింది. జోరో పోయిన మరుసటి రోజు ఉదయం పరామర్శించేందుకు ఒక ఫ్రెండ్ వచ్చారు. నేను నిల్చునే పెద్దపెట్టున ఏడవటం మొదలెట్టాను. సంగీతం, రచన, ఆధ్యాత్మికత, దేవుడు–ఇవేవీ నా బాధను తగ్గించలేకపోయాయి. మరో మిత్రుడు వచ్చి నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్నంతసేపూ బానే ఉన్నాను. మూడు గంటల తరువాత తిరిగి ఇంట్లోకి రాగానే మళ్ళీ జ్ఞాపకాల గొలుసులు నన్ను చుట్టుకున్నాయి. నా కథల్లో రాసినట్టే నేనూ శోకసాగరంలో ముణిగిపోయాను. నాకు పిచ్చి పట్టేస్తుందేమోనని చాలా భయపడ్డాను. ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో ఇంకో ఫ్రెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా సీరియల్ చూడమని సలహా ఇచ్చాడు. గేమ్ ఆఫ్ త్రోన్స్ మొదలుపెట్టాను. మెల్లమెల్లగా మనసు తేరుకుంటున్నట్టనిపించింది.

జోరో పోయిన కొన్ని రోజులవరకూ ఆ సంగతి తెలిసి పరామర్శించడానికి ఫోన్ చేసిన మిత్రులెవ్వరితోనూ నేను ఫోన్‌లో మాట్లాడలేదు. జోరోకి నాకు మధ్య ఉన్న ప్రేమ అటువంటిది. మరి అంత లోతైన ప్రేమ, ఉన్నట్టుండి జోరో పోయినప్పుడు ఇంత బాధను కలగచేసేట్టయితే, అసలు ఆ ప్రేమ అవసరమా? అనిపించింది. అంటే, పెంచుతూ ప్రేమించకపోవడం అనేది అసంభవం కాబట్టి, నేను అసలు జోరోని పెంచే ఉండకూడదు. ఇప్పుడు జోరో లేకుండాపోవటం నన్నొక మానసిక రోగిని చేసింది.

‘జ్ఞాపకాలు దుఃఖకారణాలు. గతంలో బ్రతడం వల్ల విషాదమే మిగులుతుంది. అందువలన జ్ఞాపకాలను చంపుకోవాలి.’ అయితే ఈ జ్ఞాపకాలను చంపుకోవడం ఎలా? మనల్ని మనం ఎలా బంధవిముక్తులను చేసుకోవాలో బాబాలు, గురువులు చాలా చిట్కాలే చెప్పివున్నారు. ఉన్నట్టుండి ఒకతని ఆరేళ్ళ కూతురు చనిపోయింది. బాబాగారికి ప్రియ శిష్యుడతను. బాబా దగ్గరకెళ్ళి మొరపెట్టుకున్నాడు. ‘ఏడవకు, నీ కూతురు నీ దగ్గరకంటే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండే మరో చోట పుట్టింది. ఇదిగో చూడెంత హాయిగా ఉందో!’ అని చూపించాడు బాబా. ఆయన చెప్పిందంతా బుర్రకు అర్థం అవుతుంది. అయినా మనసుకు అర్థంకాదే! జోరో ఎడబాటుని భరించలేకపోతున్నాను. అన్నానని కాదు కాని, జోరో తిండికి నెలకు షుమారు ఇరవై వేలు ఖర్చయ్యేది. అలా నెలనెలా ఖర్చు పెడుతున్నప్పుడు నాకు కొంచం కంగారుగానే ఉండేది. ఎప్పడు దీనినుండి నాకు విముక్తి? ఇలా అయితే నేను సౌత్ అమెరికా టూర్ ఎప్పుడు వెళ్ళేది? ఇలా. ఒక రోజు అర్జంటుగా ఏదో రాస్తూ ఉన్నాను. ఇంట్లో చేపలు లేవు. జోరో చేపలు లేనిదే తినడు. ముందురోజు కూడా తినలేదు. కాని నాకు టైము లేదు. పత్రికకు అర్జంటుగా రాసి పంపించాలి. ఇంతలో రచయిత ప్రభు కాళిదాస్ వచ్చారు. ఆయన శాకాహారి. అయినా నాకోసం అంగడికెళ్ళి చేపలు కొనుక్కొచ్చిపెట్టారు.

చూడండి, అప్పుడేమో ‘ఎంతకాలమిలా’ అని చిరాకుపడ్డాను. ఇప్పుడేమో ‘ఎందుకింత తొందరగా పోయావు జోరో? ఇంకా కొన్నిరోజులు బతికుండాల్సింది’ అని పిచ్చివాడిలా ఏడుస్తున్నాను. నా ఏడుపును మీరు సులభంగానే ఊహించుకోవచ్చు. అదేమీ మౌనంగా కళ్ళనీళ్ళు తుడుచుకోవడం కాదు. ఉన్నట్టుండి పెద్దగా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేవాణ్ణి. స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటాను. ఉన్నట్టుండి జోరో జ్ఞాపకమొచ్చి భోరున ఏడుస్తాను.

‘ఈ ఇంట్లో ఇక ఉండద్దు’ అంది అవంతిక. ‘నువ్వు అప్పుడప్పుడూ ట్రిప్పులకెళ్ళిపోతుంటావు. ఈ ఇంట్లో నేనొక్కదాన్నీ ఉండలేను. ఎటువంటి భద్రతా లేదు. అసలే దొంగల భయం ఉన్న ఏరియా.’ అంది. జోరో ఉన్నప్పుడు ఇంటి లోపలికి ఒక బల్లిని కూడా రానియ్యలేదు. ఆకులు కదిలినా సరే జోరో భౌ భౌలతో వీధి దద్దరిల్లిపోయేది. అయినా, ‘ఇప్పుడెందుకు ఇల్లు మారడం? ఇంటి ఓనర్ కూడా ఇంకో ఐదారేళ్ళు ఇక్కడే ఉండండి అని బలవంతపెట్టారు. పదేళ్ళనుండి ఈ ఇంటిలోనే ఉన్నాము. ఇల్లు కూడా అన్ని రకాలుగానూ సౌకర్యంగానే ఉందికదా,’ అన్నాను అవంతికతో. దొంగల భయం ఎక్కడైనా ఉండేదే కాని, అవంతిక ఇల్లు మారాల్సిందే అని పట్టుబట్టింది.

జోరో పోయిన తర్వాత ఒక రోజు మా పనమ్మాయికి వడ్డీకి డబ్బులిచ్చిన ఒకామె మా ఇంట్లోకొచ్చి పనమ్మాయితో గొడవకు దిగింది. ఆమె జుట్టు పట్టుకుని కింద పడేసి కొట్టింది. దీని గురించి పోలీసులతో చెప్పలేము. ఎందుకంటే నిజజీవితం చాలా కఠినమయినది. మా పనమ్మాయి ఆ వీధిలో చెత్త ఊడ్చే పాకీ రాజేంద్రన్ భార్య. ఆ వచ్చినామె ‘ఒసేయ్, చెత్తలోడి పెళ్ళామా! నీకింత పొగరా?…” అంటూ తిట్టింది. ఇంతకంటే ఆమె అన్న మాటలను ఇక్కడ రాయటం అసాధ్యం.

పోలీసులకెందుకు చెప్పలేమంటే, వాళ్ళు ఆ చెత్త ఊడ్చే రాజేంద్రన్‌ను స్టేషన్‌కి తీసుకెళ్ళి ఉతుకుతారు. ఇంతకుముందు ఈ వీధిలోనే ఒక ఇంట్లో యాభై కాసుల బంగారు నగల దొంగతనం జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో కనిపించినవారిలో రాజేంద్రన్ కూడా ఒకడు.‘పట్టుకోండి ఆ చెత్తూడ్చేవాణ్ణి’ అనేది పోలీసుల లాజిక్. నేను దీని గురించి పత్రికలో రాసి రాజేంద్రన్‌ని విడిపించాను. రాజేంద్రన్ నిజంగానే అమాయకుడు. అతని బతుకే వీధుల్లో కదా? అలాంటిది సీసీటీవీ కెమెరాలో అతని ముఖం ఎందుకు కనిపించదు?

ఒక ఆడ రౌడీ మా ఇంట్లో దూరి మా పనిమనిషిని లాగి కొట్టి గొడవకు దిగుతుంది. అయినా నేను పోలీసులకు ఫోన్ చెయ్యలేను. పోలీసులకు చెప్తే ముందుగా రాజేంద్రన్‌ను విచారించాలని తీసుకెళ్ళి ఇదివరకున్న కోపాన్నంతా కలగలిపి వాడి మక్కెలిరగ్గొడతారు. అదే జోరో ఉండుంటే ఆ రౌడీ రాలుగాయి ఇంటి గేటు తీసుకుని పెరట్లోకి అడుగుపెట్టగలిగేదా?

ఆ మరుసటిరోజు పొద్దున్నే వరండా కంబి గేటు తీసిన శబ్దం. వరండా గేటు తీయగల ఒకే ఒక వ్యక్తి అవంతిక మాత్రమే. అయితే తనేమో పెరట్లో ఉంది. నేను నా రాత పని ఆపి వెళ్ళి చూస్తే సన్యాసి దుస్తుల్లో ఉన్న ఒక అరవయ్యేళ్ళ వ్యక్తి. పుష్టిగా ఉన్నాడు. ముఖంలోనూ, చూపులోనూ సన్యాసికుండాల్సిన శాంతం, కరుణలాంటివేవీ లేవు. పప్పు ఎటువంటి శబ్దం చెయ్యకుండా పడుకుని ఉంది. కనీసం కదలను కూడా లేదు. జోరో అయుంటే ఈ పాటికి ఆ మనిషినుండి రెండు కేజీల కండ ఒలిచేసి ఉండేది. అసలు ఆ మనిషి లోపలికొచ్చే అవకాశమే ఉండేది కాదు.

ఆ మనిషితో ఏం మాట్లాడాలో నాకు తెలీలేదు. ‘గేటు తీసుకుని లోపలికి రావడమే కాకుండా లోపలి తలుపు కూడా తీసుకుని రాడానికి ప్రయత్నిస్తున్నాడే’ అని నా రక్తం మరిగిపోతోంది. నేనప్పుడున్న ఆలోచనల్లో ఏం మాట్లాడాలో నాకు తోచలేదు. అవంతికని పిలిచాను.

‘ముందు మీరు బయటకెళ్ళండి’ అంది వేలు చూపిస్తూ.

‘మీకు దేవుడి కటాక్షం దొరుకుతుంది, దొరుకుతుంది’ అని ఏదో ఆఫీసర్లా చెప్తున్నాడు దర్పంగా.

‘ఏదైనా కానివ్వండి. ముందు గేటు బయట నిల్చుని చెప్పండి. ఏదైనా ఉంటే కాంపౌండ్ గేటుకవతలనుండి బెల్లు కొట్టాలి గాని సరాసరి ఇలా లోపలికి రావడమేంటి?’ అంది అవంతిక.

అతన్నింక ఏమీ మాట్లాడనివ్వకుండా బయటకు పంపించి కాంపౌండ్ గేటుకు తాళమేసింది. రోజుకు నలుగురైనా వచ్చి దేవుడు పేరు చెప్పి అడుక్కోవడం జరుగుతుందిక్కడ. భిక్షం పెట్టేవరకు చెవులు తూట్లుపడేలా గేటు లేదా బెల్లు కొడుతూనే ఉంటారు. జోరో మొరిగిందంటే ఆ అరుపులకే దడుచుకుని పారిపోయేవాళ్ళు పూర్వం.

అడుక్కునేవాళ్ళ పద్ధతే మారిపోయింది. అందరూ దేవుళ్ళ పేరు చెప్పి అడుక్కుంటున్నారు. భిక్షం పెట్టకుంటే శాపాలు పెడుతుంటారు. మామూలు భిక్షగాళ్ళను చూడటమే అరుదైపోయింది. బాబా పేరు చెప్పుకుంటూనో, జంధ్యం, పిలక పెట్టుకునో, సన్యాసి వేషం వేసుకునో, నలుగురైదుగురు కలిసికట్టుగా వచ్చి బెదిరించి కూడా భిక్షమడుగుతున్నారు. చూడ్డానికి ఒక్కొక్కడూ పహిల్వానుల్లా ఉంటారు. ఇవ్వలేదంటే శాపాలు పెట్టడం.

అవంతిక చెప్పింది నిజమే. జోరో లేకుండా ఈ ఇంటిలో ఉండలేం.

ఇక తప్పక ఇల్లు వెతకడం మొదలుపెట్టాం. ఇల్లు వెతికే అందరికీ ఎదురయ్యే మూడు ఇబ్బందులివే: 1. ముస్లిములకు ఇల్లు దొరకదు. 2. మాంసాహారం తినేవాళ్ళకి ఇల్లు దొరకదు. 3. కుక్కలు పెంచుకునేవారికి ఇల్లు దొరకదు. నాకు ఇల్లు ఇవ్వను అనేందుకు రెండు కారణాలున్నాయి: మాంసాహారం, కుక్కలు. అద్దె ఇల్లు వెతికే తంతంతా ఒక చదరంగం ఆటగాడి ఎత్తుగడలతో జరుగుతున్నట్టుగా ఉంది. అయితే, జోరో పోయిన నాల్రోజులకే ఇల్లు దొరికింది. ఇప్పుడుంటున్న ఇంటి నుండి కుడి వైపుకు వెళ్తే శాంతోమ్ హై రోడ్. రోడ్డుకవతల వైపున్న అపార్ట్‌మెంట్స్‌లో ఇల్లు దొరికింది. ఇక్కణ్ణుండి ఐదు నిముషాల నడక దూరం. అపార్ట్‌మెంట్స్‌ కాబట్టి ఎప్పుడూ సెక్యూరిటీ వాళ్ళుంటారు.

కొత్త ఇంటికి మారిపోయాం. అయితే చింటూని, గెయ్రోని ఎలా కొత్తింటికి తీసుకెళ్ళడం? మీకు తెలీయందేమీ కాదు. కుక్కలు మనం ఎక్కడికెళ్తే అక్కడికి మనతోపాటే వచ్చేస్తాయి. పిల్లులు అలా కాదు. అవి వాటి నివాసాలను అంత సులువుగా మార్చుకోలేవు. ఉన్నచోటనే ఉంటాయి. అయినప్పటికీ చింటూనీ, గెయ్రోనీ వేర్వేరుగా బుట్టల్లో పెట్టుకుని తీసుకొచ్చాము. చింటూని బుట్టనుండి బయటకు తీయగానే పిట్టలా ఎటో ఎగిరిపోయింది. వాటికి దారి తెలీకూడదని మేము రాత్రి పది దాటాకే తీసుకొచ్చాము. అయినా అంత రద్దీగా వున్న హైవేను ఎలా దాటెళ్ళిందో మరి! అందుకనే చింటూని తీసుకెళ్ళడానికి నాకు మనసొప్పలేదు. ఎలాగోలా అది పాతింటికి వెళ్ళిపోతుందని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ ఇంటి దగ్గర చింటూకి స్నీకీ అనే ఒక ప్రేయసి ఉంది. నిజానికి స్నీకీ మరో పెద్దపిల్లికి ప్రేయసిగా ఉండేది. ఆ సంగతి మొదలుపెడితే మనం ఇప్పుడెక్కడెక్కడికి వెళ్ళిపోతామో… అదొక పెద్ద ప్రేమకావ్యం!

సరే, వీలైనంత క్లుప్తంగా చెప్తాను. ఆ పెద్దపిల్లి చూడటానికి రౌడీలా ఉంటుంది. చూడటానికేంటి? అసలది రౌడీ పిల్లే. ఇక్కడ మీరొకటి తెలుసుకోవాలి. మనుషుల్లో జ్ఞాని, పండితుడు, అమాయకుడు, దొంగ, వెధవ, మోసగొండి, పోకిరి, మహాత్మ, మంచివాడు, చెడ్డవాడు, చాదస్తుడు, ఛాందసుడు అని రకరకాలు ఉన్నట్టే పిల్లుల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. రౌడీ పిల్లి, పండిత పిల్లి, శాంతమూర్తి పిల్లి, దొంగ పిల్లి, మంచి పిల్లి, అమాయక పిల్లి, కాలాంతక పిల్లి, మోసగొండి పిల్లి, హంతక పిల్లి అని పలు రకాలున్నాయి. స్నీకీ ఒరిజినల్ ప్రియుడు రౌడీ పిల్లి. చింటూ ఏమో ఇంటలెక్చువల్ టైప్. (వాన్ గోని గుర్తుకు తెచ్చుకోండి). ముందు చింటూ రౌడీ పిల్లితో ఎలాంటి తగవుకూ పోలేదు. స్నీకీని అప్రోచ్ అయి తన కోరిక చెప్పిందనుకుంటాను. అయితే స్నీకీ ఆ వివాహేతర సంబంధాన్ని నిరాకరించి చింటూని కొరికి మరీ వెంటబడి తరిమింది. మేము చింటూ దెబ్బలకు మందు పూశాం. అది ఒకసారితో ఆగలేదు. చింటూ మళ్ళీ మళ్ళీ మెడ మీద, ఒంటి మీద పంటి గాట్లు తగిలించుకుని వచ్చేది. ఎన్నిసార్లయినా ఇదే తంతు. మేము గాయాలకు మందులు రాయడం, అది మళ్ళీ కొరికించుకుని రావడం. చింటూ ఒళ్ళంతా ఆ దెబ్బలనుంచి పుండ్లు పడ్డాయి. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ఇంజక్షన్ కూడా చేయించాము. కొన్ని రోజులు మామూలుగానే ఉండి, ఒకరోజు మళ్ళీ తన ఒన్ సైడ్ లవ్‌ని చెప్పి ఒంటిమీద గాట్లు పెట్టించుకొని వచ్చింది. ఈసారి ఆ రౌడీ పిల్లి కూడా కొరికినట్టుంది. కాని, అక్కడే ఆ రౌడీ పిల్లి తన జీవితంలోనే చాలా పెద్ద తప్పు చేసింది. ఎప్పుడైతే ఆ రౌడీ పిల్లి చింటూని కొరికి తరిమిందో అప్పుడే స్నీకీ చింటూ ప్రేమను అంగీకరించింది. ఆ తర్వాత స్నీకీకి రౌడీ పిల్లి అనవసరం అయిపోయిందనుకుంటాను. నేను పిల్లిని కాను కాబట్టి ఇంతకంటే ఈ వివరాలలోకి వెళ్ళలేకపోతున్నాను.

ఒక విషయం చెప్పడం మరిచిపోయాను. స్నీకీ నడుము ఊపుకుంటూ (అలనాటి నటి బి. సరోజాదేవిలాగ) అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చేదిగానీ తన మకాం మాత్రం మార్చుకోలేదు. పక్కవీధిలోనే ఉండేది. అప్పుడు ఒకానొక రోజు ఉన్నట్టుండి చింటూ కనిపించకుండా పోయింది. అవంతిక ఎక్కడెక్కడో వెతికింది. అయితే స్నీకీ మాత్రం వేళకు వచ్చి తిని వెళ్ళిపోయేది. అవంతిక దిగులు పెట్టుకుంది. నాకు కూడా మనసు వికారంగా అయిపోయింది. బీచ్‌కి వెళ్ళిన బిడ్డ కనిపించకపోతే ఎలా ఉంటుంది? ఒక రోజు రెండు రోజులు కాదు; ఒక వారం దాటింది. అది నాలుగు గంటలకొకసారి తినకుండా ఉండలేదు. అందునా చేపల్లో కొరమీనులు మాత్రమే తినేది. ఇంకేదీ తినేది కాదు. ఎక్కడికెళ్ళుంటుంది? ఎన్ని రోజులు తినకుండా ఉంటుంది? ఇన్ని రోజులు తినకుంటే చచ్చిపోదూ? ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా చింటూ దొరకాలని రకరకాల ఎమోటికాన్లతో ప్రార్థనలు చేశారు. పిల్లులు మిస్టీరియస్ ఏనిమల్స్ అని ఒక ఫ్రెండన్నాడు: ‘అవి నిగూఢమైనవి; ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వెళ్తాయి, ఎక్కడ ఉంటాయి అనేది అసలు పసిగట్టలేము.’ అని.

అవంతిక చుట్టుపక్కల ఉన్న వీధులన్నీ తిరిగి వెతికింది. ‘పక్కవీధిలో వెతికావా? స్నీకీ ఉండే వీధిలో?’ అని అడిగాను. ‘మొట్టమొదట వెతికింది అక్కడే’ అంది. అయితే ఎక్కడికెళ్ళుంటుంది? ఒక వారం తర్వాత మళ్ళీ పక్కవీధిలో వెతకడానికి వెళ్ళాం. మమ్మల్ని చూసి ‘మ్యావ్’ అనుకుంటూ వచ్చింది చింటూ. ఇంతకీ ఏం జరిగిందంటే, రౌడీ పిల్లినుండి స్నీకీని పర్మనెంటుగా దూరం చెయ్యడానికి చింటూ అక్కడే స్నీకీతోనే ఉండిపోయింది; నిముషమైనా ఎడబాయకుండా. ఓసి దీని పాసుగూలా! కింగ్ సైజు బెడ్డు మీద వైభవంగా నిద్రపోయిన చింటూ తన ప్రేయసి కోసం రోడ్లమీద పడుకుంది. బిచ్చగాడుపిల్లిలా మారిపోయింది. తెల్లటి చర్మం నల్లబడి, దుమ్ము కొట్టుకపోయి, ఎముకలు కనిపించేలా చిక్కిపోయింది. ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చాం. మమ్మల్ని స్నీకీ వెంబడించింది. మామూలుగా రెండుమూడు స్పూన్ల నీళ్ళు తాగే చింటు ఆ రోజు రెండున్నర గ్లాసులు తాగింది. దేవుడా, ఒక వారంగా తిండీ తిప్పలు లేకుండా, చివరికి నీళ్ళు కూడా తాగకుండా ఉందది.

కొత్తిల్లు మరింత దూరం అవుతుంది కాబట్టి చింటూని తీసుకురావద్దని అనుకున్నాం. తీసుకొచ్చి, అది రోడ్లు దాటేప్పుడు కార్ల కిందో, లారీల కిందో పడి చచ్చిపోవడం కంటే స్నీకీతో అక్కడే ఉండనిద్దాం, అనుకున్నాను, కానీ ఎందుకో తెచ్చాం. అయితే దాని అదృష్టం! వాహనాలను తప్పించుకుని రోడ్డు దాటుకుని వెళ్ళి స్నీకీతో చేరిపోయింది. ఆ తర్వాత అవంతిక రోజూ పొద్దునా రాత్రీ రోడ్డు దాటుకుని వెళ్ళి చింటూకీ, స్నీకీకీ ఆహారం, నీళ్ళు పెట్టొచ్చేది. స్కూటర్‌ మీదే వెళ్ళేది. ఒక రోజు స్కూటర్‌ని ఏదో బైక్ గుద్ది చిన్న యాక్సిడెంట్ కూడా అయింది.

కానీ గెయ్రో ఈ అపార్ట్‌మెంట్‌లో ఉండగలిగింది. గెయ్రో సాధు పిల్లి. ఎవరి జోలికీ పోదు. ఏ పిల్లితోనూ గొడవకు దిగదు. ప్రేమలో పడలేదు. అయితే లిబిడో ఉంది. ఆడపిల్లుల వెంట పడుతుంది; కాని అది తరిమితే తగువు పడకుండా తిరిగి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో కొంచం మారాం చేసింది. అవంతిక కాళ్ళను కొరికేది. రోజురోజుకీ దాని కోపం పెరుగుతుండటం చూసి, ఈ కొత్త ఇల్లు నచ్చలేదని పాతింటి దగ్గరే వదిలిపెట్టి వచ్చింది అవంతిక. రోజూ ఆహారం పట్టుకెళ్ళి పెట్టొచ్చింది. ఇలా పదిహేను రోజులు గడిచింది. అంతటితో తన అజ్ఞాతవాసం ముగించుకోవాలనుకుందేమో, అవంతికను చూడగానే ఏడుపు మొదలుపెట్టింది. తన వెనకనే వచ్చి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుంటే, అవంతిక తీసుకొచ్చేసింది.

ఆ పదిహేను రోజులు గెయ్రో ఎలా గడిపి ఉంటుంది? దానికక్కడెవరూ స్నేహితులు లేరు. చింటూ, స్నీకీ ఎప్పుడూ గెయ్రోని తమ జట్టులో చేర్చుకోలేదు. ఇంటిలోనే రాజులా బతికింది. వీధుల్లో ఎలా గడిపిందో? దానివల్లకాక మళ్ళీ ఇక్కడికే వచ్చేసింది. తర్వాతెప్పుడూ అవంతికని కొరకలేదు. కోపం ప్రదర్శించలేదు. ఈ అపార్ట్‌మెంట్‌లో అందరితో కలిసిపోయింది. అందరితోనూ స్నేహంగా ఉంది. అందరూ దాన్ని ముద్దు చేశారు. గెయ్రో అని ఎవరైనా పిలిస్తే తిరిగి చూసి దీర్ఘంగా మూ…వ్ అని బదులిచ్చేది. అవంతికను మువ్ మువ్ అని పిలిచేది.

అమ్మయ్య, అన్నిరకాలుగా సెటిలయ్యాం అనుకున్నాను. అనుకున్న రెండు వారాలకు ఒక రోజు గెయ్రో కనిపించకుండా పోయింది. ఈ విషయం ఎవరికి చెప్పినా వాళ్ళకది అర్థంకావటంలేదు. ఎందుకంటే ఎవరికీ గెయ్రో ఏంటో తెలీదు. గెయ్రో వేరే పిల్లుల వెనక వెళ్ళే రకం కాదు. ఈ అపార్ట్‌మెంట్‌ కాంపౌండ్ దాటి ఎక్కడికీ వెళ్ళదు. ఎప్పుడూ వెళ్ళిందీ లేదు. అయితే, అందరూ–పిల్లులంతే, ఉన్నట్టుండి ఎటయినా వెళ్ళిపోతాయి; మళ్ళీ వచ్చేస్తాయి–అన్నారు. నాకూ అవంతికకు మాత్రం ఇది అలాంటి బాపతు ఇన్సిడెంట్ కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

అన్నట్టు, ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మరిచిపోయాను. గెయ్రో కనిపించకుండా పోయిన రోజుకు ముందురోజు మా ఎదురు ఫ్లాట్‌లో ఉండే ఆవిడ గెయ్రోని చూసి ‘అమ్మో! ఎంత పెద్ద పిల్లీ?!’ అని దిష్టి పెట్టిందట. కొన్నిటిని అభినయించి మాత్రమే చూపించగలం. ఆ ‘అమ్మో’ మామూలు అమ్మో కాదు, ఒక భయంకరమైన ‘అమ్మో!’ అమ్మో! ఎంత పెద్ద పిల్లీ?! అని అలా దిష్టి పెట్టిన ఆవిడకి పిల్లులంటే పడదన్నది అదనపు సమాచారం. మా అపార్ట్‌మెంట్ వాచ్‌మేన్ దగ్గర ఎప్పుడూ పిల్లల గురించి కంప్లయింట్ చేస్తుంటుందట. పిల్లులేమైనా ఆమె ఇంట్లో జొరబడి దొంగతనం చేస్తున్నాయా? అలాంటిదేమీ లేదు. ఈ అపార్ట్‌మెంట్‌ కాంపౌండ్‌లో మూడు పిల్లులున్నాయి. బ్రౌనీ, పుస్సీ, బ్లాకీ. బ్రౌనీ, బ్లాకీలు మగ పిల్లులు. పుస్సీ ఆడ పిల్లి. ఏ పిచ్చి మొద్దెధవ దానికి పుస్సీ అని పేరు పెట్టాడో మరి, దాన్నొదిలేయండి. ఆ మూడు పిల్లులకూ మేము ఇక్కడికి వచ్చినప్పట్నుండీ రోజూ తిండి పెడుతున్నాం. అవి కూడానూ తిండి కోసం వెతుక్కుంటూ వేరెక్కడికీ వెళ్ళవు. అపార్టుమెంట్లవాళ్ళు పెట్టేవే చాలు. చక్కగా తింటాయి. కింద కాంపౌండ్‌ లోపలే పడుంటాయి. అప్పుడప్పుడూ అవి ఆవిడ కంటపడుతున్నాయట. అది ఆమెకు నచ్చలేదట. ‘ఛీ… పిల్లులంటేనే నాకు అసహ్యం!’ అని వాచ్‌మేన్‌తో చెప్పి వాపోయేదట.

ఆవిడ ‘అమ్మో! ఎంత పెద్ద పిల్లీ?!’ అని దిష్టి పెట్టిన మరుక్షణం నుండి అవంతిక కలవరించడం మొదలుపెట్టింది. ఎదురింటామెవి కొరివి కళ్ళు, దిష్టి పెట్టేసింది అని మళ్ళీ మళ్ళీ అనేది. గెయ్రోకి దిష్టి తీయమని మా పనమ్మాయికి చెప్పింది అవంతిక. పనమ్మాయి మర్నాడు తీస్తానని చెప్పింది. దిష్టి పెట్టి 24గంటలైనా కాలేదు ఈ లోపు గెయ్రో కనిపించకుండా పోయింది. గెయ్రో కనిపించకుండా పోయినప్పట్నుండీ ఎదురింటావిడకి తిట్లభిషేకం మొదలయింది. ఆమెకు వినిపించేలా కాదనుకోండి, నాకు మాత్రమే వినిపించేలా. పాపిష్ఠి కళ్ళు, కొరివి కళ్ళు, పాపిష్ఠి కళ్ళు, కొరివి కళ్ళు!

ఎవరైనా పట్టుకెళ్ళి వండుకు తినేశారా అని నాకు అనుమానం మొదలైంది. నా జీవితంలో నేను ఇంతలా బాధపడింది లేదు అనే చెప్పాలి. జోరో చివరి శ్వాస వదిలినప్పుడు పిచ్చిపట్టినవాడిలా అయ్యాను. చాలా ఏడ్చాను. అయినప్పటికీ జోరోది ఒక నిండైన జీవితం అన్న తృప్తి ఉండేది. ఎంత గొప్ప ఆయుర్దాయం! ఏడేళ్ళు బతకాల్సింది నిండుగా పదేళ్ళు బతికింది. చివరి దశలో కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు, పెట్టలేదు. నా ఒడిలో పడుకుని ప్రాణం విడిచిపెట్టింది. అయితే ఇప్పుడు గెయ్రో ఎక్కడికెళ్ళిందీ తెలీటంలేదు. చుట్టుపక్కల అందరినీ విచారించాం, వెతికిన చోటే వెతికాం. పిల్లికోసం వెతుకుతున్నందుకు వింతగా చూసేవాళ్ళు. ‘పిల్లులంతేనండి. ఉన్నట్టుండి వెళ్ళిపోతాయి. అదే తిరిగి వచ్చేస్తుందిలెండి…’ అనేవాళ్ళు. ‘అది మిగతా పిల్లుల్లా కాదురా ఫూల్స్!’ అని మనసులోనే తిట్టుకొనేవాణ్ణి. అవంతిక పిచ్చి పట్టినట్టయిపోయింది. తను సరిగ్గా నిద్రపోవటంలేదు, తినటంలేదు. నిద్ర మధ్యలో నేను లేచినప్పుడు చూస్తే బాల్కనీలో నిల్చుని గెయ్రో గెయ్రో అని పిలుస్తూ వుండేది. ‘పిలిచి ప్రయోజనంలేదు అమ్మూ, నీ గొంతు వినిపించే దూరానుంటే వచ్చేసేది కదా?’ అని ఓదార్చేవాణ్ణి. గెయ్రో నాలుగు గంటలకొకసారి తినేది. మాతో దాగుడుమూతలు కూడా ఆడుకునేది. ఎక్కడైనా దాక్కుని మమ్ముల్ని వెతకమనేది. వెతికేప్పుడు మువ్ మువ్ అని గొంతిచ్చేది. ఎప్పూడూ మియావ్ అని మాత్రమ్ అస్సలు అనేది కాదు.

“అయ్యో! ఎంత దారుణం. ఎక్కడికెళ్ళింది నా బుజ్జిపిల్లి? చచ్చిపోయిందంటే సరే, ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటాం. కానీ ఇలా కనిపించకుండా పోతే ఏమనుకోవాలి? ఏదైనా ప్రమాదంలో చిక్కుకుని మన సాయంకోసం ఎదురుచూస్తుందేమో?” అని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేది అవంతిక.

గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెటర్నిటీ వార్డుకు వెళ్ళారా ఎప్పుడైనా? ప్రతి గోడమీదా ‘పసికందులను జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్నెత్తుకుపోయే దొంగలు తిరుగుతుంటారు’ అని రాసుంటుంది. మెటర్నిటీ హాస్పిటళ్ళలో పసిపిల్లల్ని దొంగిలించడం చాలా సులువు. బిడ్డను కన్న అలసటతో తల్లి నిద్రపోతుంటుంది. ఆమెను చూసుకోటానికొచ్చిన బంధువులామె ఏ టీ, కాఫీ తీసుకురాడానికో వెళ్ళినపుడు, నిద్రపోతున్న పసికందును తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారు. దేనికి? చేయీ, కాలూ తీసేసి బిచ్చగాళ్ళను చేసి సంపాయించుకోడానికి. మంచి డబ్బు. మన దేశంలో సులువుగా డబ్బు సంపాయించగల పెద్ద వ్యాపారం బిచ్చమెత్తించడం. ఇంకా వివరంగా కావాలంటే స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా చూడండి. భారతదేశపు పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర పసిపాపల్ని చంకనేసుకుని ఒక తల్లి అడుక్కోవడం చూసే ఉంటారు. ఆ పసికందులందరూ ఇలా దొంగిలించబడ్డవారే. అలా ఒక బిడ్డను పోగొట్టుకున్న తల్లి స్థితిలో ఉన్నాం మేము.

దిష్టి అన్నది నిజమా? రచయితనయిన నేను ఇలాంటివన్నీ నమ్మొచ్చా?

నేనిప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి. ఒకప్పుడు డీయెంకే పాలనలో ఐదేళ్ళపాటు తమిళనాడంతా కరెంటు కోతలు విపరీతంగా ఉండేవి. కడలూర్‌లాంటి ఊళ్ళలో రోజుకు 18 గంటలు కరెంటు కోత ఉండేది. మరికొన్ని చోట్లయితే 20 గంటల కరెంటు కోత కూడా ఉండేది. చెన్నై రాజధాని కాబట్టి ఇక్కడ కేవలం 6 గంటలు మాత్రమే కరెంటు కోత ఉండేది. మంత్రులుండే ఏరియాలకు మాత్రం మినహాయింపు. అప్పుడు మా వీధిలో ఒక మాజీ మంత్రి ఉండేవారు. అతను ఏడీయెంకే. పాలనలో ఉన్నదేమో డీయెంకే. మాజీ అయితేనేం? మంత్రేగా? కాబట్టి మా వీధిలో మాత్రం కరెంటు కోతే ఉండేది కాదు. ‘ఈ విషయం ఎక్కడైనా రాసేవు, వెంటనే కరెంట్ కోసేస్తారు’ అని నన్ను గట్టిగానే హెచ్చరించింది అవంతిక. నేను కూడా కరెంటు కోతకు భయపడి దాని గురించెక్కడా పెన్ను కదపలేదు. నాలుగేళ్ళ తర్వాత ఒక రోజు రాఘవన్‌తో మాటల్లో ఈ విషయం ప్రస్తావించాను. ‘ఆహా, మీరు అదృష్టవంతులు!’ అని అన్నాడు. రాఘవన్ చాలా సహృదయుడు. ఎవరిని చూసీ దిష్టి పెట్టే రకం కాదు. అసలు అతనివి కొరివికళ్ళు కానే కావు. ప్రపంచశాంతీ, శ్రేయస్సూ కోరుకునే రకం. మీరు అదృష్టవంతులు అన్నది కూడా అతను దీవెనలాగే అన్నాడు. మరుసటి రోజే ఫుల్ బ్లాకవుట్! పొద్దున ఆరు నుండి రాత్రి ఎనిమిది వరకు కరెంటే లేదు. దీని గురించి నేను రాఘవన్‌కి చెప్పలేదు, నొచ్చుకుంటాడని.

మరొక సంఘటన నలభై ఏళ్ళ క్రితం దిల్లీలో జరిగింది. అక్కడ నాకు మారియప్పన్ అని ఒక స్నేహితుడుండేవాడు. ఒక ఆదివారం నన్ను భోజనానికి రమ్మని అతను తన ఇంటికి పిలిచాడు. అతని కొడుక్కి రెండేళ్ళు. వాడు బట్టల్లేకుండా ఇల్లంతా దోగాడుతున్నాడు. బొద్దుగా, పుష్టిగా, ముద్దుగా, గుండ్రటి పిర్రలతో చూడ్టానికి చిన్న సైజు సుమో వీరుడిలా ఉన్నాడు. ఆ విషయం నేను మారియప్పన్‌తో అన్నాను. అతను నవ్వాడు. వారం తర్వాత అతన్ని మళ్ళీ కలిసినపుడు చెప్పాడు: పొయ్యిమీదనుండి దించిన కుక్కర్ మీద దర్జాగా కుర్చున్నాడట పిల్లాడు. చర్మమంతా కాలి పోయిందట. మారియప్పన్ తీవ్రమైన హేతువాది. అంతకంటే ఏమీ చెప్పలేదు. అప్పట్నుండి నేనెవర్నీ, దేన్నీ మెచ్చుకోవటంలేదు.

దిష్టి దృష్టి వల్లే కాదు, మాట వల్ల కూడా వస్తుందేమో. మాటలో ఉంటుంది ఆ కిటుకు. మొట్టమొదట నేను చెన్నై వచ్చినపుడు, ఒక స్నేహితున్ని కలవడానికి చిన్మయానగర్ వెళ్ళాను. వర్షాకాలం. రోడ్లంతా బురద కొట్టుకుపోయి ఏదో ఆఫ్గన్ విలేజ్‌లా అనిపించింది నాకు. నేను చెన్నైలో ఉన్నంతకాలం చిన్మయానగర్‌లో ఉండను, ఒట్టు అన్నాను. అప్పటికి నేను అవంతికను కలవలేదు. తర్వాత కలిశాను. అవంతిక చిన్మయానగర్‌లో ఉండేది. కాబట్టి పన్నెండేళ్ళు చిన్మయానగర్‌లోనే మకాం పెట్టాల్సివచ్చింది.

ఇంతకంటే ఇంకో ఒక సంఘటన జెర్రుల గురించి. గాయత్రి చెప్పిన విషయం ఇది. ఆమెకు ప్రదీప్ అని ఒక ఫ్రెండున్నాడు. అతని ఇంట్లోకొచ్చిన జెర్రి గురించి చాలా దిగులుగా చెప్పాడట. ఎందుకంటే అతనికి దోగాడే చంటిపాప ఉంది. అప్పుడు గాయత్రి, ‘ఈ ఇంటికొచ్చి పదేళ్ళయింది. అదృష్టవశాత్తూ ఇంతవరకెప్పుడూ జెర్రులు రాలేదు.’ అన్నదట. సరిగ్గా గాయత్రి తన స్నేహితుడితో అలా చెప్పిన మరుసట్రోజు పొద్దున డైనింగ్ టేబిల్ కింద జెర్రి పాకుతూ కనిపించిందట.

గెయ్రో కనిపించకుండా పోయిన మూడో రోజు. పొద్దున పది గంటలకు అవంతిక ధ్యానం చెయ్యడానికి కూర్చుంటూ, ‘గెయ్రో దొరికితేగానీ నేను ధ్యానం నుండి లేవను’ అంది. మధ్యాహ్నం భోజనానికి కూడా లేవలేదు. మూడు గంటలకు లేచి మేడ మీదకెళ్ళింది. అక్కడినించి కిందకు దిగి, మా అపార్ట్‌మెంట్ పక్కన కొన్నేళ్ళుగా తాళమేసి ఉన్న ఇంటికి వెళ్ళింది. ‘గెయ్రో ఇక్కడ ఇరుక్కుపోయుంది’ అంది. ఎవరూ నమ్మలేదు. ‘అదెలా చెప్పగలరు ఇక్కడే ఉందని? మీకెలా తెలుసు?’ అని గేలి చేశారు.

ఆ ఇంటికి తాళమేసుండటంతో మేడమీదకెక్కి చూడాల్సి వచ్చింది. కొంత దూరాన కరెంటు డిపార్ట్‌మెంట్‌వాళ్ళు మరమ్మత్తు పనులు చేస్తూ కనిపించారు. ఈ ఇంటిమీదకెక్కగలరా? అని వాళ్ళనడిగింది.

ఒకతను నిచ్చెన వేసి ఎక్కాడు. పైకి వెళ్ళి గొంతెత్తి మియావ్ మియావ్ అంటూ కిటికీలవీ తడుతూ వెతికాడు. ‘ఇక్కడ పిల్లేదీ లేదు మేడమ్!’ అన్నాడు.

‘గెయ్రో అని పిలవండి.’

‘గెయ్రో గెయ్రో’ అని పిలిచాడు.

‘అవును మేడమ్! ఇంటికి వెనక వైపు బావిలాంటి గొయ్యి ఉంది మేడమ్. అక్కన్నుండి అరుస్తోంది. పైకెక్కడం దానివల్ల కాలేదు.’

తర్వాత అక్కడనుంచి నిచ్చెన వేసి గెయ్రోని ఎత్తుకొచ్చాడు. అది కూడా బెదిరిపోకుండా అతని చేతిలో దీనంగా కూర్చొని ఉంది.

దాటేప్పుడు పొరపాటున ఆ గొయ్యిలో పడిపోయినట్టుంది. నీరసంగా బక్కచిక్కిపోయుంది. అవంతిక పట్టుదల వదులుకోకుండా ప్రయత్నించింది కాబట్టే కనిపెట్టగలిగాం. అదే ‘ఎటో వెళ్ళింది, వెళ్ళినట్టే తిరగొస్తుంద’ని వదిలేసుంటే? ఆలోచిస్తేనే గుండె తరుక్కుపోతుంది. తిండి నీళ్ళు లేకుండా ఆకలితో చచ్చిపోయుండేది. కుళ్ళిపోయి కంపుకొట్టి ఉండేది. ఆ గొయ్యినుండి అది ఎంత గట్టిగా అరిచినా వీధికివతలకి వినిపించదు.

ఆ రోజు నేను, అవంతిక బీచ్‌కెళ్ళాము. ఇక్కణ్ణుండి ఐదు నిముషాలు నడిస్తే బీచ్. పాతింటి నుంచి మరో నాలుగు నిముషాలెక్కువ పట్టొచ్చంతే. కానీ అక్కడున్న అన్నేళ్ళలో ఎప్పుడూ బీచ్‌కెళ్ళలేదు.

“ఈ రోజెందుకు రావాలనుకున్నావు?” అనడిగాను.

“ధ్యానం నుండి లేచి డాబా మీదకెళ్ళాను. అక్కణ్ణుండి సముద్రానికేసి చూసి, సముద్రం తల్లిని అడిగాను. ‘ఈ ప్రపంచానికంతటికీ తల్లివి నువ్వు. మరి నా బిడ్డకు ఏమైందో చెప్పు,’ అని మొరపెట్టుకున్నాను. మరుక్షణం ఆ ఇల్లు నా కంటపడింది.” అంది.

“శుభం. దిష్టితో పోయింది నీ దృష్టితో వచ్చేసింది!” అన్నాను.
---------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్, మూలం: చారు నివేదిత, 
కథ మూలం: దిరుష్టి, ఈమాట సౌజన్యంతో

Tuesday, July 23, 2019

కామవేదము: పరిచయం


కామవేదము: పరిచయం



సాహితీమిత్రులారా!


పుస్తక పరిచయం
తమిళములో తిరుక్కుఱళ్ [1] ఒక మహా గ్రంథము. దీనిని తిరువళ్ళువర్ కవి రచించాడు. ఇతడు సంగ కాలపు కవి. కవి సమూహమునకు సంగ(ఘ)ము అని పేరు. ఈ సంగ కాలము ఎప్పటిదన్నది ఇంకా వివాదాంశమే. కొందరు క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దము నాటిదంటారు, మరి కొందరు క్రీస్తు పూర్వము ఒకటవ శతాబ్దము నాటిదంటారు. ఇంకా కొందరు క్రీస్తు శకము నాలుగవ శతాబ్దము అంటారు.


తిరువళ్ళువర్ విగ్రహం (1976)
వళ్ళువర్ కొట్టం, నుంగంబాక్కం, చెన్నై
సంగ కాలాన్ని మూడు భాగాలుగా విడదీస్తారు, అవి తలైచ్చంగం (ప్రథమ సంఘము), ఇడైచ్చంగం (మధ్య సంఘము), కడైచ్చంగం (చివరి సంఘము). తిరువళ్ళువర్ జన్మస్థానము నేటి చెన్నై నగరములోని మైలాపూరు ప్రాంతము. ఇతడు నివసించిన కాలము (కడైచ్చంగం నాటిది) కూడ సంగకాలములా వివాదాంశమే. ఇతని కాలాన్ని క్రీస్తుపూర్వమునుండి ఎనిమిదవ శతాబ్దము[2] వరకు అంచనా కట్టుతారు. కొందరు తిరువళ్ళువర్ ఒక జైనుడు అని కూడ చెబుతారు.

భారతదేశములో చాల మంది కవులవలె తిరువళ్ళువర్ గురించి కూడ మనకు ఎక్కువ విషయాలు తెలియవు. జనులు విశ్వసించిన కథలే కాలక్రమేణ చరిత్రగా[3] మారాయి. వళ్ళువర్ తండ్రి బ్రాహ్మణుడు, తీర్థయాత్ర చేస్తుండగా మరో బ్రాహ్మణుని ఇంటిలో ఒక కన్యను చూచి పెళ్లి చేసికొన్నాడు. ఆమె తక్కువ కుల స్త్రీ అంటారు. వాళ్లిదరికి ఏడుగురు పిల్లలు పుట్టారు. తీర్థ యాత్రా సమయములో ఎక్కడ పుట్టిన బిడ్డను అక్కడే ఎవరికో పెంచుకోడానికి వదిలి వెళ్లేవారట. అందులో ఏడవ బిడ్డ మైలాపురములో జన్మించిన వళ్ళువర్. నేడు కూడ ఆదిద్రావిడులలో వళ్ళువర్ అనే ఒక తెగ ఉన్నది. వళ్ళువర్ విద్యాభ్యాసము చేసి పెద్దవాడై వాసుకి అనే ఒక ఉత్తమురాలిని పెళ్లి చేసికొన్నాడు. వృత్తి రీత్యా ఇతడు ఒక నేతగాడు. ఏలేలసింగడు అనే వాడివద్ద దారము కొని, బట్టలను నేసి వాడికే అమ్మే వాడట. ఎక్కువ ప్రలోభాలు లేని వృత్తి నేత వృత్తి అని భావించి ఈ వృత్తిని ఎన్నుకొన్నాడట సుప్రసిద్ధ కవి కబీర్ కూడ ఒక నేతగాడే. తరువాత సింగడు ఇతనికి శిష్యుడయ్యాడు. చని పోయిన పిదప తన దేహాన్ని జంతువులు తినడానికి ఉపయోగించమని అడిగాడట.

ఇతడు వ్రాసిన తిరుక్కుఱళ్‌లో నేడు 1330 పద్యాలు దొరుకుతాయి. వీటిని మూడు వర్గాలుగా విభజిస్తారు, అవి – అఱత్తుప్పాల్ (ధర్మ వేదము), పొరుట్పాల్ (అర్థ వేదము), కామత్తుప్పాల్ (కామవేదము). తమిళములో ఈ కావ్యాన్ని ముప్పాల్ (త్రివర్గము), ఉత్తరవేదం, తమిళ్ మఱై అని కూడా అంటారు. ఈ కవిని నాయనార్, నాన్ముగనార్ (చతుర్ముఖుడు), దేవర్ అని అంటారు. తిరుక్కుఱళ్‌ను ద్రావిడ వేదము అనుట పరిపాటి.

తిరుక్కుఱళ్ గొప్పదనమును గురించి ఇక్కడ ఒక రెండు మాటలు చెప్పాలి. ఇందులోని 1330 పద్యాలు ఒకే ఛందస్సులో ఉన్నాయి. దానిని వెణ్బా అంటారు. సామాన్యముగా వెణ్బాకు నాలుగు పాదాలు ఉంటాయి, మొదటి మూడు పాదాలలో నాలుగు గణాలు (గణమును తమిళములో శీర్ అంటారు), చివరి పాదములో మూడు గణాలు ఉంటాయి. కుఱళ్ వెణ్బా అనే వెణ్బా ఒక ద్విపద. ఇందులో మొదటి పాదములో నాలుగు గణాలు, రెండవ పాదములో మూడు గణాలు ఉంటాయి. కురళ్ వెణ్బాలో వ్రాయబడి ఉండడమువలన ఈ పుస్తకానికి తిరుక్కుఱళ్ అని పేరు వచ్చింది. తమిళ పద్యాలలో సామాన్యముగా ఒక గణములోని పదము మరో గణములోనికి చొచ్చుకొని పోదు. ఏడు గణాలతో లేక ఏడు పదాలతో భావ గాంభీర్యాన్ని నింపడం సులభమైన విషయము కాదు. కాని వళ్ళువర్ ఒక చిన్న పద్యములో ఎన్నో భావాలను ఉంచగలిగాడు. అందుకే ఆవగింజలో సప్త సముద్రాలను పెట్టడము వళ్ళువరుకు మాత్రమే సాధ్యమని ప్రస్తుతించారు.

సామాన్యముగా భారతీయ భాషలలోని కావ్యాల కథలు, పద్యాలు దేవుళ్లను గురించో లేకపోతే రాజులను గురించో ఉంటాయి. మతముతో ప్రసక్తి లేనివి చాల తక్కువ. అంటే secular poetry అరుదు. సంస్కృతములో భర్తృహరి సుభాషితాలు, అమరు శతకము, ప్రాకృతములో గాథాసప్తశతి ఈ కోవకు చెందినవి. కాని తమిళములో దైనందిన జీవనములో తోచే సంఘటనల పైన కవితలు, పద్యాలు, పుస్తకాలు చాల ఉన్నాయి. తిరుక్కుఱళ్ ఇట్టిదే. అందువల్ల నాటినుండి నేటివరకు తిరువళ్ళువర్‌ను ఒక అత్యుత్తమమైన కవిగా పరిగణిస్తారు.

చల్లా లక్ష్మీనారాయణశాస్త్రి తిరుక్కుఱళుపైన ఒక ప్రాచీనకవి వ్రాసిన దానిని ఆధారము చేసికొని కింది పద్యాలను వ్రాసినారని చల్లా రాధాకృష్ణశర్మ[2] తెలిపారు –

కొంచెపు నీటి బిందువున గోచరమైన మహా తరు క్రియన్
సంచిత పుణ్యరాశి యనజాలిన తావక భావజాల మ-
భ్యంచితరీతిమై ద్విపదలందె కుదించి రచించినట్టి నీ
యంచిత పుణ్యమూర్తికి జొహారు లివే తిరువళ్ మహాకవీ

త్రవ్వినకొలంది చెలమ నేర్పడిన నీర
మట్లు, చదివినకొలది భావైకరాశి
నలరు భవదీయ సత్కవితామృతతాప్తిఁ
బారమే లేదు రసికప్రపంచమునకు

తిరుక్కుఱళ్ మొట్టమొదటి భాషాంతరీకరణము తెలుగులో 19వ శతాబ్దపు ఉత్తరార్ధములో జరిగింది. మలయాళ భాషలో దీనికన్నా పాతదైన ఒక వ్రాతప్రతి ఉందని చెబుతారు, కాని తెలుగు అనువాదమే అన్ని భాషలలో మొదటిది అంటారు. కనుపర్తి వేంకటరామ విద్యానందనాథులు తెలుగులో ప్రథమ అనువాదకులు. తరువాత చొక్కం నరసింహులు నాయుడు, పూతలపట్టు శ్రీరాములు రెడ్డి, ముదిగంటి జగ్గన్న శాస్త్రి, శొంఠి శ్రీపతి శాస్త్రి మున్నగువారు తర్జుమా చేసారు. నా గురువుగారైన సాధన వీరాస్వామి నాయుడు చేసిన అనువాదాలు ప్రజామత వారపత్రికలో 1950లలో ప్రచురించబడేవి. గురుచరణ్ తెలుగులో 14 అనువాదాలు ఉన్నాయని[4] అన్నారు. తెలుగులో తిరుక్కుఱళ్‌కు త్రివర్గదీపిక, త్రివర్గము అని పేరుంచారు. రెడ్డి[3], గురుచరణ్[4] అనువాదాలు మనకు సులభముగా లభిస్తాయి.

నా దగ్గర చాలా కాలముగా ఒక చిన్న తిరుక్కుఱళ్ పుస్తకము [5] ఉన్నది, అందులో ఒక వైపు పద్యము, ఒక వైపు తాత్పర్యము ఉన్నది. తిరుక్కుఱళ్ పద్యాలతో యోగి శుద్ధానంద భారతి ఆంగ్లానువాదము[6], పోప్ చేసిన ఆంగ్లానువాదము[7] ఇంటర్నెట్ ద్వారా మనకు చదువ వీలగును. నేను నా అనువాదాలను పై మూడు పుస్తకాలపైన ఆధారము చేసికొని వ్రాసినాను. నేను ఎంచుకొన్న ఛందస్సు దేశి ఛందస్సులైన ఆటవెలది, తేటగీతి, సీసము, కందము, ద్విపద. ఇవన్నీ రెండు పాదాలకే పరిమితము (సగము కందము, ఆటవెలది, తేటగీతి; ఒక సీస పాదము). ఉపజాతులకు తెలుగులో ప్రాస అనవసరమైనా, ఎక్కువగా ప్రాస ఉంచడానికి ప్రయత్నించాను. కామత్తుపాల్ అనబడే కామవేదములో 250 పద్యాలు ఉన్నాయి. పద్యాలకన్నిటికీ అనువాదాలను చేసినా, అన్నిటినీ ఇక్కడ ప్రచురించ దలచుకోలేదు. అర్థరీత్యా, భావరీత్య నా దృష్టిలో ఉత్తమమని తోచిన పద్యాలను మాత్రమే ఎంపిక చేసి గ్రంథాలయములో ఉంచాను. మీ ఆసక్తిని రేకెత్తించడానికి కొన్ని పద్యాలను ఇక్కడ ఇస్తున్నాను.

అణంగుకొల్ ఆయ్ మయిల్ కొల్లో కనంగుళై
మాదర్‌కొల్ మాలుమ్ ఎన్ నెంజు (1081)

            అమరవనితయొ, యందాల నెమలియేమొ
            రమణభూషిత నన్నిట్లు భ్రమల ముంచె

ఉరుదోఱు ఉయిర్‌తళిర్ప త్తీండలాల్ పేదైక్కు
అమిళ్‌దిన్ ఇయన్ఱన తోళ్ (1106)

            అతివ రెండు చేతులు నిజ మమృతమయము
            ప్రతి కవుంగిలి క్రొంగ్రొత్త బ్రదుకు నిచ్చు

వాళ్‌దల్ ఉయిర్కన్నళ్ ఆయిళై శాదల్
అదర్కన్నళ్ నీంగుం ఇడత్తు (1124)

            సకియతో జీవిత మ్మది స్వర్గసమము
            సకియ లేక జీవిత మది చావె నాకు

తెరిందుణరా నోక్కియ ఉణ్‌గణ్ పరిందుణరా
ప్పైదల్ ఉళప్పదు ఎవన్ (1172)

            నాఁడు తప్పుఁ జేసెగద నీ నయనయుగము
            నేఁడు బాధతో నేడ్చె నీ పాడు కనులు

మఱైపెఱల్ ఊరార్కు అరిదన్ఱాల్ ఎంబోల్
అఱైపఱై కణ్ణార్ అగత్తు (1180)

            దండురా వేసెనో రెండు కళ్లిచ్చట
            నుండ దిక రహస్య మొక్క నాఁడు

విడా అదు శెన్ఱారై క్కణ్ణినాల్ కాణ
ప్పడా అది వాళి మది (1210)

            చనకోయి నెలరాజ, నను వీడెఁ బ్రియుఁ డిందు,
            నను వీడి మదినుండి చనఁడు వాఁడు

కయలుణ్ కణ్ యానిరప్ప త్తుంజిఱ్ కలందార్కు
ఉయలుణ్మై శాట్రువేన్ మన్ (1212)

            మూయవే చేప కన్నులా, మూసి నిదుర
            పోయి, కలలందుఁ గానవే మోహమయుని

కాలై అరుంబి ప్పగలెల్లాం పోదాగి
మాలై మలరుం ఇన్నోయ్ (1227)

            విరియు ప్రభాతాన, పెరుగు దిన మెల్ల,
            విరహ రోగము సంధ్య వెతల నిచ్చు

మఱైప్పేన్‌మన్ కామత్తై యానో కుఱిప్పిన్ఱి
త్తుమ్మల్‌పోల్ తోన్ఱివిడుం (1253)

            వమ్ము కామమ్ము దాచు యత్నమ్ము నాకు
            తుమ్మువలె వచ్చు నొక్క క్షణమ్ములోన

వరుగమన్ కొణ్‌గన్ ఒరునాళ్ పరుగువన్
పైదల్ నోయ్ ఎల్లాం కెడ (1266)

            వచ్చుఁ దానొక దిన మిచ్చుఁ బీయూషమ్ముఁ
            దెచ్చు నానందమ్ము చచ్చు వెతలు

పుల్లా తిరా అప్పులత్తై అవర్ ఉఱుం
అల్లల్ నోయ్ కాణ్గం శిరిదు (1301)

            అలుక నటియించు, చేరకు మతని నీవు
            కలగని మ్మతని యెడద, కనగ మనము

ఉణలినుం ఉండదు అఱల్ ఇనిదు కామం
పుణర్దలిన్ ఊడల్ ఇనిదు (1326)

            తినుటకన్నను జీర్ణించుకొనుట మిన్న
            కినుక మిన్న కవుగిలించుకొనుటకన్న

గ్రంథసూచి
1.తిరుక్కుఱళ్
2.తమిళ సాహిత్య చరిత్ర – చల్లా రాధాకృష్ణశర్మ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1976.
3.త్రివర్గము (తిరుక్కుఱళ్) – పూతలపట్టు శ్రీరాములు రెడ్డి, 1955.
త్రివర్గము
4.తిరుక్కుఱళ్ (తెలుగు) – గురుచరణ్ అనువాదములు.
5.తిరుక్కుఱళ్ – పాల్వణ్ణనార్, శ్రీమగళ్ కంపెనీ, చెన్నై, 1966.
6.తిరుక్కుఱళ్ (తమిళ్) – శుద్ధానంద భారతియార్ అనువాదములు.
Tirukkural – G. U. Pope translations.
-----------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

Monday, July 22, 2019

కార్తీక శివజ్యోత్స్న


కార్తీక శివజ్యోత్స్న




సాహితీమిత్రులారా!

శా. ప్రారంభించి చకోరపోతము మహీయజ్జ్యోత్స్నయం దుత్సవ
       శ్రీరంజిల్లుచు సోలుచుండు గతి నా చిత్తంబు నీ దివ్యశృం
       గార ధ్యానమునం దహర్నిశము జొక్కంజేయవే దేవ శ్రీ
       గౌరీలోచననర్తకీనటనరంగస్థాన సర్వేశ్వరా!

కార్తీకపు చిరుచలిలో పున్నమి రాతిరి ఆరుబయటో డాబాపైనో పడుకొని, పిండారబోసినట్టు ఆకాశమంతా పరుచుకున్న తెలివెన్నెలని కనులతో, తనువుతో, మనసుతో జుఱ్ఱుకోవడం ఒక అందమైన అనుభూతి. అప్పుడు మనం అచ్చంగా ఒక చకోరపక్షి అయిపోతాం. శివభక్తులయితే బహుశా, కైలాసంలో సాక్షాత్తూ ఆ సర్వేశ్వరుని దర్శించినట్టే అనుభూతి పొందినా ఆశ్చర్యం లేదు. నెలతాలుపుకీ వెన్నెలకీ ఏదో అనాది అనుబంధం! అలాటి అనుబంధమే యీ పద్యం వ్రాయడానికీ కవిని పురికొల్పిందేమో!

ఇది అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకంలోని పద్యం. ఈ అన్నమయ్య తాళ్ళపాక అన్నమయ్య కాదు, యథావాక్కుల అన్నమయ్య. ఇతను పదమూడవ శతాబ్దానికి చెందిన శైవకవి. తెలుగు సాహిత్యంలో శతకాలకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శతకసాహిత్యానికి చాలా విస్తృతి ఉంది. మనకు శతకాలు వేలాదిగా కనిపిస్తాయి. తెలుగులో శతకాలకు మూలం శివకవులే. మొదటగా లభించిన శతకం మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారమని సాహిత్యకారులు భావిస్తున్నారు. ఆ తర్వాత మరొక శతాబ్దానికి వెలసినవి యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వరశతకమూ, పాల్కురికి సోమన వృషాధిపశతకమూను. అన్నమయ్య సోమనలలో ఎవరు ముందు ఎవరు వెనుక అన్న విషయం గురించి వాదోపవాదాలున్నాయి. అన్నమయ్య తన గురువు పేరు ‘ఆరాధ్య సోమేశ్వరు’డని చెప్పుకున్నాడు. అతను పాల్కురికి సోమనాథుడే అని నిడదవోలు వెంకటరావుగారు అభిప్రాయపడ్డారు. కాని యితను వేరనీ, పాల్కురికి సోమన అన్నమయ్యకు తరువాత వాడనీ శతకవాఙ్మయసర్వస్వము వ్రాసిన విద్వాన్ వేదము వేంకటకృష్ణశర్మగారు అన్నారు. ఆ గ్రంథానికి పీఠిక వ్రాసిన మల్లంపల్లివారు కూడా దానితో ఏకీభవించారు.

ముందువెనుకల మాట ఎలా ఉన్నా, తెలుగు సాహిత్యాన్ని శతకాలతో సుసంపన్నం చేసిన ఘనత మాత్రం శివకవులదే! శతకాలను చాటుప్రబంధాలుగా పూర్వ లాక్షణికులు పేర్కొన్నారు. వీటినే ముక్తకాలని కూడా అంటారు. చాటువులలో కథా పాత్రల ప్రమేయం లేకుండా కవి నేరుగా తన సొంత అభిప్రాయాలనూ, భావాలనూ, అనుభూతులనూ వ్యక్తీకరిస్తాడు. శతకాలలో అధికశాతం భక్తిశతకాలే. భక్తులు భగవంతునిపై తమకున్న అమితభక్తిని రకరకాలుగా చాటుకునే పద్యాలతో నిండి ఉంటాయి. ఇందులో ఎక్కువగా భగవత్‌స్తుతి, ఆత్మార్పణా కనిపిస్తాయి. మతపరమైన ఆచారాలు, తత్త్వము, భక్తుల కథలూ భక్తిశతకాలలో భాగమే. ముఖ్యంగా శివకవుల శతకాలలో వీరశైవ మతాన్ని గురించి చాలా సమాచారం దొరుకుతుంది. వారు సాహిత్యాన్ని మతప్రచారానికి సాధనంగా వాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే శివకవుల యితర శతకాలతో పోలిస్తే యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వరశతకంలో వీరశైవం తీవ్రరూపంలో కనిపించదు. ఇతను లింగధారణ చేసిన జంగముడు కాదని తన గురించి అతను చెప్పుకున్న వివరాలబట్టి అనుకోవచ్చు. ఈ శతకంలో తన గురించీ, కృతిరచనా కాలాన్ని గురించీ కవి కచ్చితమైన వివరాలని ఇవ్వడం ఒక విశేషం. తనని యజుశ్శాఖకి చెందిన ఆరాధ్యబ్రాహ్మణునిగా చెప్పుకోవడాన్ని బట్టి, యితను వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన శైవుడు అనిపిస్తుంది. ఇతను అద్వైతాన్ని కూడా ఆమోదించినట్టుగా వేదం వేంకటకృష్ణశర్మగారు భావించారు. కాని నాకు అది పూర్తిగా నిజం కాదని అనిపించింది. ఎందుకంటే, ఒక పద్యంలో “సోహం” “సోహం” అనేవాడు “మోహధ్వాంతములో మునింగిన మహామూఢు”డనీ, “అతిభ్రష్టు”డనీ, అతను శివునికి చాలా దూరంగా ఉండిపోతాడనీ, ఎవడయితే అహంకారాన్ని వీడి సద్భక్తితో నీకు “దాసోహం” అంటాడో, అతనే నీవై ఉంటాడనీ వర్ణిస్తాడు. ఇక్కడ “సోహం” అనే అద్వైతమతాన్ని చాలా స్పష్టంగా ఖండించడం గమనించవచ్చు. భక్తునికి భగవంతుని స్థానాన్ని యివ్వడం శైవవైష్ణవ మతాల రెంటిలోనూ కనిపిస్తుంది. కాని అది అద్వైతభావన కాదు. అన్నమయ్య యీ శతకంలో జ్ఞానమార్గాన్ని ఖండించి, కర్మ భక్తి మార్గాలను బోధించినట్టుగా నాకనిపింది.

ఈ శతకంలోని మరొక విశేషం ఏమిటంటే, ఇతర శివకవుల శతకాలతో పోలిస్తే, యిందులో కవిత్వం పాలు ఒకింత ఎక్కువగా గుబాళించింది. పాల్కురికి సోమన వృషాధిపశతకంలో భక్తి, మతవిషయాలతో పాటు మనలని ఆకర్షించేది అందులోని భాషాగరిమ. అందులో పద్యాలు శబ్దాలంకారశోభితాలు. రకరకాల భాషలలో, మణిప్రవాళశైలిలో ఉన్న పద్యాలు కూడా అందులో కనిపిస్తాయి. ఈ సర్వేశ్వరశతకంలో, సమాసబందురమైన చిక్కని ధారతో పాటుగా, చక్కని పోలికలూ దృష్టాంతాలూ అర్థాంతరన్యాసాలంకారాలు మన మనసులని మురిపిస్తాయి. అలా నా మనసుని ఆకట్టుకొన్న ఒక పద్యమే యీ నెల వెన్నెల పద్యం.

పోతము అంటే పక్షిపిల్ల. చకోరపోతము అంటే ఒక పిల్ల చకోరం అన్న మాట. పిట్ట గొంతే కొంచెం, అందులో పిట్టపిల్లది ఇంకెంత చిన్న గొంతుకుంటుంది! కాని పిల్లలకు సహజంగా ఆత్రం ఎక్కువ. ఇష్టమైనది తాగేటప్పుడో తినేటప్పుడో వారు పడే ఆత్రం భలే ముచ్చటగా ఉంటుంది. తనని తాను అలాంటి చకోరపు పిల్లగా అభివర్ణించుకుంటున్నాడు కవి. అందుకే ఆరంభంలోనే “ప్రారంభించి” అన్నాడు. అంటే ప్రయత్నంతో కూడి అని అర్థం. వెన్నెలేమో “మహీయజ్జ్యోత్స్న.” అంటే దిగ్దిగంతాల దాకా వ్యాపించిన గొప్ప వెన్నెల. అంత వెన్నెలనీ తాగేయాలని యీ చకోరపోతానికి ఉత్సాహం. ఆ ఉత్సాహంలో అది నిరంతరంగా సొక్కిసోలుతూ ఉంటుంది. సరిగ్గా అలాగే, శివుని దివ్యమైన శృంగార ధ్యానములో తన చిత్తం నిమగ్నమైపోయేలాగా అనుగ్రహించమని కోరుకుంటున్నాడు కవి. ఇక్కడ దివ్యశృంగారము అంటే దివ్యమైన సౌందర్యం. నింగీనేలా అంతటా పరచుకున్న వెన్నెలంత దివ్యసౌందర్యం శివునిది. ఒక్కసారి ఆలోచించి చూస్తే, వెన్నెలకీ శివునికీ ఎంత దగ్గరి పోలికో మనకి అవగతం అవుతుంది! వెన్నెల ఎప్పుడూ రాత్రే ప్రకాశిస్తుంది. అంచేత అది నలుపు తెలుపుల చిత్రమైన సమ్మేళనం. శివుడూ అంతే! ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, అతను ఎంతటి జ్ఞానమూర్తియో, అంతటి తామసికశక్తి. మనం చిత్రించుకున్న భౌతిక రూపాన్ని ఊహలోకి తెచ్చుకున్నా, అతను నలుపు తెలుపుల చిత్ర సంగమమే! శివుడు స్వయంగా తెల్లని తెలుపు, పక్కనే వామభాగంలో అమ్మవారు శ్యామలాస్వరూపంలో వెలుగుతూ ఉంటారు. తలపైన గంగమ్మ, నెలపూవు, ధవళకాంతులీనుతూ ఉంటారు. మెడలోని నాగన్నా, గొంతుకలోని గరళమూ, కట్టిన గజచర్మమూ నల్లగా నిగారిస్తూ ఉంటాయి. ఆ శివస్వరూపమే కార్తీకపు వెన్నెల. వెన్నెలనయితే కనులతో చూడవచ్చు, మనసుతో ఆస్వాదించవచ్చు. మరి శివుని దివ్యశృంగారమో? అది కనులకి కడుతుందా? మన కళ్ళకి అది సాధ్యంకాదు. అందుకే ఆ దివ్యసౌందర్యాన్ని ధ్యానిస్తానని అంటున్నాడు కవి. అయితే, అంతటి మహాదేవుని శృంగారమూ, ఒకే ఒక కంటిజతకి కనిపిస్తుంది. మామూలుగా కనిపించడం కాదు, నిరంతరం ఆ చూపులకి గమ్యస్థానమే ఆ సౌందర్యం! ఆ నేత్రాలు ఎవరివో, పద్యం చివరిపాదంలో ఒక అద్భుతమైన విశేషణంతో చెప్పాడు కవి. “శ్రీగౌరీలోచననర్తకీనటనరంగస్థాన” – పద్యానికంతటికీ మకుటాయమానమైన ప్రయోగం ఇది! శ్రీగౌరి – పార్వతీదేవి, లోచన – కనులనే, నర్తకీ – నర్తకి, నటన – నాట్యానికి, రంగస్థాన – రంగస్థానమైన ఓ సర్వేశ్వరా. పార్వతీదేవి కన్ను అనే నర్తకి (కనులు రెండయినే చూపు ఒకటే కాబట్టి) నిరంతరం నాట్యం చేసే రంగస్థలం అట శివుడు! ఎంత గొప్ప ఊహ చూడండీ యిది! అమ్మవారి చూపులు ఎప్పుడూ అయ్యవారిపైనే కదులుతూ ఉంటాయన్న విషయాన్ని ఎంత అందంగా చెప్పాడు అన్నమయ్య! “గౌరీలోచన నర్తకీ నటన రంగస్థాన సర్వేశ్వరా!”

చాటుసాహిత్యంలో తరచూ కనిపించే లక్షణం – పద్యాల గురించీ, కవుల గురించీ జనవ్యవహారంలో వ్యాప్తమైయ్యే కథలు. ఈ శతకం గురించి కూడా అలాంటి ఐతిహ్యం ఒకటి ఉంది. అన్నమయ్య యీ శతకాన్ని రచించడం మొదలుపెట్టినప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడట. ప్రతి పద్యాన్నీ ఒక తాటాకు మీద వ్రాసి కృష్ణానదిలో వదిలిపెడతాననీ, అది తిరిగి వస్తే స్వామి ఆ పద్యాన్ని స్వీకరించినట్టు భావించి శతకరచన కొనసాగిస్తాననీ, ఎప్పుడైనా ఒక పద్యం తిరిగి రాకపోతే, అక్కడితో ఆపేసి గండకత్తెర వేసుకొని ప్రాణత్యాగం చేస్తాననీ ఆ ప్రతిజ్ఞ. అలా సాగుతున్న రచనలో ఒక పద్యం దగ్గరకి వచ్చేటప్పటికి అది తిరిగి రాలేదట. అప్పుడు తన శపథం ప్రకారం మెడ కత్తిరించుకొనేందుకు సిద్ధపడితే ఒక పసులకాపరి ఒక తాటాకుని తెచ్చి యిచ్చాడట. దాని మీద తన పద్యం కాకుండా అదే మకుటంతో మరొక పద్యం ఉన్నదట. దానిని, శతకరచన కొనసాగించమన్న శివుని ఆజ్ఞగా భావించి, ఆ పద్యాన్ని కూడా స్వీకరించి శతకాన్ని పూర్తి చేశాడని కథ. శతకంలో తిరిగిరాని పద్యమూ, తిరిగి వచ్చిన కొత్త పద్యమూ రెండూ ఉన్నాయి! నా దృష్టిలో కవిత్వపరంగా చూస్తే, ఆ రెంటిలోనూ, తిరిగిరాని అన్నమయ్య పద్యం ఉత్తమమైనది. తాత్త్వికదృష్టితో ఆలోచిస్తే, తిరిగివచ్చిన రెండో పద్యం ఉన్నతమైనది! సరే ఇంత చెప్పుకున్నాక ఆ రెండు పద్యాలనూ కూడా చదివి ఆస్వాదించండి మరి.

తిరిగిరాని అన్నమయ్య పద్యం:

తరులం బువ్వులు పిందెలై యొదవి, తత్తజ్జాతితో బండ్లగున్
హర! మీ పాదపయోజ పూజితములై యత్యద్భుతం బవ్విరుల్
కరులౌ, నశ్వములౌ, ననర్ఘమణులౌ, గర్పూరమౌ, హారమౌ
దరుణీరత్నములౌ, బటీరతరులౌ, దథ్యంబు సర్వేశ్వరా!

తిరిగివచ్చిన పద్యం:

ఒక పుష్పంబు భవత్ పదద్వయముపై నొప్పంగ సద్భక్తి రం
జకుడై పెట్టిన పుణ్యమూర్తికి బునర్జన్మంబు లేదన్న, బా
యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచుం బెద్ద నై
ష్ఠికుడై యుండెడివాడు నీవగుట దా జిత్రంబె సర్వేశ్వరా!
--------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

Saturday, July 20, 2019

పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము


పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము




సాహితీమిత్రులారా!

ఇంచుమించుగా గురజాడ వారు, గుత్తునా ముత్యాల సరములంటూ నూత్నకవితా ద్వారానికి తోరణాలు కడుతున్న కాలంలో శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారి వల్ల వెలుగులోకి వచ్చిన పురాతన కృతి నన్నెచోడుని కుమారసంభవం. ఈ కవి నన్నయకు పూర్వపు వాడని, కాదు తరువాతి వాడని, సాహిత్యప్రపంచంలో వాదోపవాదాలు జరిగాయి. పొంగులు చల్లారేక, నన్నయకు తరువాతి వాడన్నవాదం ప్రస్తుతానికి నిలిచింది. భవిష్యత్తులో మరి కొన్ని పరిశోధనలు జరిగి, రుజువులు, ఆధారాలు దొరికి, కొత్త సిద్దాంతం వచ్చే వరకు ఇదే ప్రస్తుతానికి ప్రామాణికం అనుకోవాలి. నిజానికి, కవి ఏకాలం వాడు? అన్నది అతని కావ్యాన్ని మరింత బాగా అర్ధం చేసుకోవడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది గాని, కవితామాధుర్యాన్ని ఆస్వాదించడానికి కవికాలం అంత ముఖ్యం కాదు అనే చెప్పాలి.

నన్నెచోడునికి వర్ణనలంటే వల్లమాలిన అభిమానం. తెలుగులో అష్టాదశ వర్ణనలు ఇమిడిగ్గా పొందుపరుచుకున్న ఏకైక కావ్యం అని కుమారసంభవం పేరు తెచ్చుకుంది. దీనిని మించిన విశేషం ఏమిటంటే సాధారణంగా, వర్ణన అన్న మాటకి ‘వివరించి చెప్పే విషయం’ అనే అర్థం లోక ప్రసిద్ధం అయినా, చాలా సందర్భాలలో నన్నెచోడుని వర్ణనలు మాత్రం క్లుప్తత, రమణీయ భావనాశ్రయత అనే మరో రెండు ప్రత్యేక లక్షణాలకి లక్ష్యాలుగా నిలిచి పోయాయి. ‘వర్ణనలెల్లచో వర్ణనకెక్కంగ’ వ్రాస్తానని చెప్పుకున్న ఈ కవి కావ్యంలో ఉన్న వర్ణనల గురించి మనం మాట్లాడుకోవాలంటే… ఎక్కడ మొదలు పెట్టాలి? పర్వత వర్ణనా? పురవర్ణనా? ఋతువర్ణనా? ప్రకృతి వర్ణనా? యుద్ధవర్ణనా? విరహవర్ణనా? సిరిగల వారింటి విందుభోజనంలా ఉన్న వీటిని అన్నిటినీ ఒక్కసారి ఆస్వాదించి, అరిగించుకునే శక్తి మనకి లేదు కనుక, ప్రస్తుతానికి పార్వతి తపోవర్ణనని మాత్రం ఆకళింపు చేసుకుని, ఆస్వాదించేందుకు ప్రయత్నం చేద్దాం.

ప్రబంధయుగానికి కొన్ని వందల ఏళ్ళు ముందుగా పుట్టిన సలక్షణమైన ప్రబంధం కుమారసంభవం. కవితామార్గంలో కొత్తపుంతలను తొక్కడమే ఆధునికతకు నిర్వచనం అయితే అప్పటి సాహితీ ప్రపంచానికి కొత్తవైన ప్రబంధ లక్షణాలనే ముత్యాలతో కుమారసంభవకావ్యమాలను ఆనాడే గుచ్చాడు నన్నెచోడుడు.

ఇందులో కథావస్తువు హిమవంతుని కూతురుగా జన్మించిన పార్వతి పరమేశ్వరుని సేవించడం, మన్మథదహనం, పార్వతి తపస్సు, శివపార్వతుల కల్యాణం, కుమారస్వామి జననం, తారకాసుర సంహారం. దీనికి పూర్వరంగంగా సతీపరమశివుల ప్రణయం, గణపతి జననం ఆదిగా గల కథలు. తరతరాల కవులను ప్రభావితం చేసిన మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత కుమారసంభవ కావ్యంలోని పార్వతిజననం మొదలుగా గల కధావృత్తాంతం తన కావ్యంలో వస్తువైనా, దీన్ని తనదైన రచనగా రచించడమే కాదు, కొన్ని కొన్ని చోట్ల కాళిదాసు చేతనే ‘శెభాస్’ అనిపించుకునేటట్లు వ్రాశాడని మహామహులెందరో అభిప్రాయపడ్డారు.

పార్వతి తపోవర్ణన ఘట్టం కుమారసంభవంలోని ఆరవ ఆశ్వాసంలో ఉంది. జంగమ మల్లికార్జునుని వద్ద పాశుపతదీక్ష పొందిన దగ్గరనుండి ఇంచుమించు 75 గద్యపద్యాలలో ఋతువర్ణనతో కలిపి పార్వతి తపోవర్ణన కొనసాగింది. సంస్కృత కుమారసంభవంలో ఐదవ సర్గలో ఈ తపోవర్ణన దాదాపు ఇరవై శ్లోకాలలో జరిగింది. ప్రకృతే అమ్మ వారు. అమ్మవారే ప్రకృతి – ఇలా ఆ జగజ్జనని కంటే అభేద్యమైన ప్రకృతిని వర్ణించడంలో ఆమె తపోవర్ణనని పొందుపరచడం ఎంతో సమంజసం. మహాకవి కాళిదాసు పరిచిన ఈ దారిని ఎంతో ఠీవిగా నడిచాడు రాచకవి నన్నెచోడుడు.

తపఃకాంక్ష
మన్మథ దహనానంతంరం విరహాగ్నిలో వేసారిన గౌరి, తపోమహిమతో పరమేశ్వరుని పతిగా పొందుతాను అనే నిశ్చయానికి వచ్చింది. ఇది విన్న తల్లిదండ్రులు, హితవుకోరిన వృద్దాంగనలు పరిపరివిధాల నచ్చచెప్పినా వినక, “నాకు ఈ భవమున ఈశ్వరుండ పతి. ప్రాణము, దేహము, చిత్తవృత్తులున్ శివపదపంకజార్పణము సేసితి” అని బదులు ఇచ్చింది. గతంలో నారదుడు, ‘ఈ దేవి లోకజనని, మహాదేవునకు అగ్రమహిషియై, పేర్మి సురేంద్రాదులకు అర్చితయగును,’ అని చెప్పిన మాటలను స్మరించిన హిమవంతుడు కుసుమకోమలి యైన తన కుమార్తె తపోదీక్ష వహించడానికి అనుమతించాడు.

తపోవన ప్రవేశం
ఈ తపస్సుకు నాంది ఆ దేవి అడవిలో అడుగుపెట్టడం. అరుణాంఘ్రితలదీప్తిన్ అవనీతలంబెల్ల పద్మరాగస్థల భాతిన్ ఒనర… అన్న పద్యంలో ఇలా వర్ణిస్తాడు నన్నెచోడుడు:

అడవిలో అడుగు పెట్టిన అగజాత ఎర్రని పాదాల కాంతి వల్ల భూమి అంతా పద్మరాగాలతో నిండినట్టు ఉందట. దిక్కులనే కలువలు ఆమె ముఖచంద్రికలతో అకాలంలో (పట్టపగలు) వెన్నెల వెలుగులను పొందాయాట. ఆమె పెదవుల కాంతితో అడవిలో ఉన్న తీగెలన్నీ చిగురించినట్టు ఉందట. ఆమె శరీరం మీద ఉన్న పరిమళాలను గ్రహించడం వల్లే గాలి గంధవాహనుడనే పేరు తెచ్చుకున్నాడట. అక్కడ తిరుగుతున్న నెమళ్ళు, మెరుపు తీగెల్లాంటి ఆమె కన్నుల కాంతులను చూసి, వర్షం రాబోతోందని ఉత్సాహ పడుతున్నాయిట.

ఇలా తన ‘ప్రకృతి’ అంటే తన సహజ స్వభావం లాంటి ప్రకృతి (వనప్రదేశం)లోకి పార్వతిని ప్రవేశపెట్టడం అన్నది ఎంత ఉదాత్తమైన భావం?

ఇలా అరణ్యాన ప్రవేశించిన ఉమ శబరులు, ఎఱుకలు, భిల్లులు ఆదిగా గల ఆటవీకుల్ని చూసింది. అటుపై వెదురుబియ్యాన్ని దంచుతూ, చుట్టూ చేరిన లేళ్ళను పరవశింప జేస్తూ, మనుష్యరూపాన ఉన్న శివుని వంటి జంగమ మల్లికార్జునుని స్తుతిస్తూ, పెక్కు రాగాల్లో ఎంతో అతిశయంగా పాటలు పాడుతున్న శబర వనితలను చూసింది. అటుపై ముని పల్లెను చేరుకుంది. అక్కడ వేదజ్ఞాన సంపన్నుడు, ఆత్మజ్ఞాని, మోక్షాసక్తుడు అయిన మల్లికార్జునుని దర్శించింది.

నన్నెచోడుడు సప్తసంతానాలలో ఉత్కృష్టమైన ఈ కావ్యకన్యకకు తన గురువు జంగమ మల్లికార్జునుని కృతిభర్తగా నిర్ణయించుకున్నాడు.

నింగి ముట్టియున్న జంగమ మల్లయ
వరమునందుఁ గనిన వస్తుకవితఁ
దగిలి వారియంద నెగడింతు రవికి దీ
పమున నర్చ లిచ్చు పగిది వోలె.

మహోన్నతుడైన మల్లికార్జునుని దయ వల్ల ప్రాప్తించిన తన వస్తుకవితను, దీపంతో సూర్యుడికి అర్చనలు చేసిన విధంగా తిరిగి ఆయనకే సమర్పించుకుంటాను, అంటూ తన గురుభక్తిని ప్రకటించాడు. గురువు, ప్రభువు, ఇష్టదైవము అయిన జంగమ మల్లికార్జునుని స్తుతించి ఉన్నతస్థానంలో ఉంచి, అంతటితో ఆగకుండా, ఈ కథాసందర్భంలో తన గురువును సాక్షాత్తూ మహేశ్వరియైన ఆ పార్వతీదేవికే దీక్షా గురువును చేశాడు.

జంగమ మల్లికార్జునుని సమీపించిన ఆ ఈశ్వరి అతని వద్ద శైవాగమనియతి ప్రకారం శివదీక్షను పొంది, పరమశివుని శీఘ్రంగా ప్రసన్నం చేసుకునే మంత్ర ధ్యాన వ్రతాచారాలను ఉపదేశాలుగా పొంది, ఆయన అనుమతితో తపశ్చర్యకు సంసిద్ధురాలయింది.

తపోవేష ధారణ
ముందుగా, విభూతి పూత, నారచీరలు, రుద్రాక్షలు, జటలు మొదలైన వాటితో తపోదీక్షకు తగిన వేషధారణ చేయవలసి వుంది. ఈ సందర్భంలో పార్వతి వర్ణన:

పవడంపులత మీదఁ బ్రాలేయపటలంబు
        పర్వె నా మెయి నిండ భస్మమలఁది,
లాలితంబగు కల్పలత పల్లవించె నాఁ
        గమనీయ ధాతువస్త్రములు గట్టి,
మాధవీలత కలిమాలికల్ ముసరె నా
        రమణ రుద్రాక్షహారములు వెట్టి,
వర హేమలతికపైఁ బురినమ్మి యూఁగె నా
        సన్నుతంబగు నెఱిజడలు పూని,

హరుఁడు మాహేశ్వరీరూపమైన చెలువ
మభినయించెనొ యని మును లర్థిఁ జూడ
గురుతపశ్శక్తి మూర్తి సేకొనిన కరణిఁ
దగిలి యుమ తపోవేషంబుఁ దాల్చి పొల్చె. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 82)

పగడపు తీగె మీద మంచు కప్పుకుందా అన్నట్లు శరీరమంతా తెల్లని విభూతిని పూసుకుని, చిగురించిన అందమైన కల్పవృక్షపులత అనిపించేటట్లు చక్కని కావిరంగు నారచీరలను కట్టుకుని, మాధవీలత మీద నల్లని తుమ్మెదలు ముసురుకున్నాయా అన్నట్లు రుద్రాక్షమాలలు ధరించి, శరీరమనే బంగారు తీగెపై నెమలి పురి విప్పి ఆడుతోందా అన్నట్టు చక్కని జడలు ధరించి, మహత్తరమైన తపశ్శక్తే ఈ ఆకారంతో వచ్చిందేమో అనిపించే విధంగా ఆ గిరిజ తపోచితమైన వేషధారణ చేసింది. ఆ రూపాన్ని, సాక్షాత్తూ పరమేశ్వరుడే మనోహరమైన స్త్రీరూపాన్ని ధరించి వచ్చాడేమోనని మునులందరూ కోరికతో ముచ్చట పడి మరీ చూస్తున్నారు.

ఇక్కడ పార్వతి సౌకుమార్యాన్ని సూచిస్తూ పగడపు తీగె, కల్పవృక్షపు తీగె , మాధవీలత, హేమలత వంటి ఉపమలతో వర్ణించడం, ముందుముందు ఈ లతాంగి, ఈ కుసుమకోమలి చెయ్యబోయే ఘోరమైన తపస్సును కన్నవారిలో, విన్నవారిలో — ఆ పార్వతా? ఈ తపస్సు చేస్తోంది! అనే అబ్బురపాటుకు — పూర్వరంగాన్ని అమరుస్తున్నట్టు ఉంది. అంతేకాదు, పరమేశ్వరుడే స్త్రీ రూపం ధరించాడా? అనడంలో ఆమె మనసంతా నిండి అంతర్గతమైన ఉన్న శివుని రూపం ప్రత్యక్షంగా చూసే వారికి కనబడుతూ, శివసాక్షాత్కారం తథ్యం అని చెప్పుతున్నట్టుంది.

తపోదీక్ష పూనిన వారు వీతరాగులు కావాలి. అంటే అన్నిటి మీద మమకారాన్ని లేదా అనురాగాన్ని వదలిపెట్టాలి. రాగ శబ్దానికి ఉన్న రంగు, అనురాగము, అనే రెండర్థాలతో దీని సమర్ధన ఎలా ఉందో చూడండి.

మేని కుంకుమరాగంబు, మెలత తోఁపు
మోవి తాంబూలరాగంబు మొగిన పాసి,
చారుతర మయ్యెఁ జూడ నా శైలతనయ
వీతరాగంబు ప్రకటించు విధము వోలె. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 84)

పర్వత రాజపుత్రి తాపసియై శరీర లేపనాలు, తాంబూల సేవనం విడిచిపెట్టటం వల్ల శరీరంపై ఉండే కుంకుమరాగము, పెదవిన ఉన్న ఎఱ్ఱని తాంబూలపు రంగు, రెండు ఆమెని వీడి పోయాయి. అలంకరణలకు దూరం అయినా, తపోదీక్ష పూనిన గౌరి, దానికి అనుగుణంగా, అనురాగము లేదా మమకారాన్ని వదిలి వేసిన దాని వలె మరింత శోభాయమానంగా కనబడుతున్నది.

పార్వతి తపస్సు
గౌరివనంలో గౌరీదేవి స్నానార్చన హోమాదినిత్యకర్మలతోను, శాకాహార, ఫలాహార, పర్ణాహార, జలాహారాది మహాతపోవ్రతాలతోను, బొటనవేలిపై నిలబడి, బాహువులను పైకెత్తి, నాలుగగ్నుల మధ్యన నిలుచుండి, మార్తాండుని కేసి చూస్తూ, ప్రాణాయామాది నియమాలను పాటిస్తూ, ఇంకా ఎన్నెన్నో నిష్ఠలను ఆచరిస్తూ, నిరంతరం పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఘోరతపోదీక్షలో ఉంది. ఇలా తపోదీక్షలో ఉన్న ఆ నారీమణి శరీరం నుంచి ఆమె సహజసౌందర్యం తొలగిపోతోంది. ఇది ఎలా ఉందంటే — ముంగురుల అందాన్ని తుమ్మెదలలోను, మందగమనాన్ని హంసలలోను, ముఖకాంతిని తామరలలోను, శరీరకోమలత్వాన్ని తీగెలలోను, చంచలమైన చూపులను లేళ్ళలోను, దాచి పెట్టిందా అన్నట్టుగా ఇవన్నీ తపస్సు చేస్తున్న కారణంగా ఆమెలో కనబడటంలేదు.

కఠోరతపోదీక్షలో శాంభవి శరీరం నానాటికి కృశించడాన్ని నన్నెచోడుడు ఈ క్రింది పద్యంలో అత్యద్భుతంగా వర్ణించాడు.

ఉగ్రతపమునఁ దోడ్తోన విగ్రహంబు
చాల శోషించెఁ బ్రాలేయశైల తనయ
యర్ధనారిగాఁ దన దేహ మభవు మేన
నల్ప మల్పము నంటించునట్ల వోలె. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 92)

ఆమె శరీరం శుష్కించిపోవడం ఎలా ఉంది? హిమవత్పుత్రి ఆ పరమేశ్వరుడి శరీరంలో సగభాగం కావడానికి గాను తన దేహాన్ని కొద్దికొద్దిగా ఆ శివుని శరీరానికి అంటిస్తోందా, అన్నట్టుగా ఉగ్ర తపస్సు వల్ల క్రమక్రమంగా తన శరీరాన్ని శుష్కింప జేస్తున్నది. ఇలా మహోన్నతమై, అత్యద్భుతమై, మనసుని స్పందింప జేసే భావాన్ని వ్యక్తం చెయ్యడానికి కందాన్నో, గీతాన్నో ఎంచుకోవడం నన్నెచోడుని ప్రత్యేకత.

ఇలా పార్వతి తపస్సు చేస్తుండగా, వర్షాకాలం వచ్చిందంటూ మొదలు పెట్టి 15 పద్యాలలో నింగి నున్న ఇంద్రధనుస్సు నుంచి నేలనున్న ఇంద్రగోపాల (ఆరుద్ర పురుగులు) దాకా అత్యద్భుతంగా వర్ణన సాగుతుంది. వాటిలో…

పరమస్నేహము హృత్సరోరుహమునం బాత్రంబు గావించి, సు
స్థిరతం బుణ్యదశం దపోగ్ని మది నుద్దీపించి, బ్రహ్మాండ క
ర్పరఖండంబున, మంత్రకజ్జలమొగిన్ ఫాలాక్షుఁ గూర్పింప, న
గ్గిరి రాజాత్మజ వట్టె నా నమరి, నింగిం బర్వె నీలాభ్రముల్. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 96)

అన్న పద్యంలో పార్వతి తపస్సు యొక్క ప్రస్తావన వస్తుంది. శివుని మీద ప్రేమతో అతనిని పొందాలని తపస్సు చేస్తున్న పార్వతి, తన హృదయాన్ని పాత్ర చేసి, అందులో తన ప్రేమనే చమురును పోసి, చలించని పుణ్యమనే వత్తిని ఉంచి, తన తపోగ్నితో వెలిగించి, ఆకాశం అనే కుండపెంకు మీద ఆ దీపపు వత్తి నుండి వచ్చే పొగతో, ఫాలాక్షుని వశం చేసుకోవడానికి ‘మంత్రపు కాటుకను’ పట్టుకుంటోందా అన్నట్టు ఆకాశంలో నల్లటి మేఘాలు వ్యాపించాయి. ఇది కూడా ఆకాశం దాకా ఎదిగిన మరో అద్భుతమైన ఊహ.

అమరె నెఱిజడలపై ను
త్తమరుచి నవజలకణములు దగిలి బెడంగై
యుమ తపమున కెదమెచ్చి త
దమరులు ముత్యముల సేస లలికిన భంగిన్. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 108)

ఇక ఇటువంటి వర్షఋతువులో నీట నిలబడి తపోదీక్షలో ఉన్న పార్వతి అందమైన జటల మీద పడ్డ తొలకరి వాన చినుకులు ఆమె తపస్సుకు మెచ్చి దేవతలు ముత్యాలసేసలు జల్లారా అన్నట్టు కనబడుతున్నాయట. తరువాత శరదృతువు వచ్చింది. అలా వచ్చిన ఆ శరత్కాలం తన కుమార్తెకు పరితాపాన్ని కలిగిస్తోందని హిమవంతుడు దానిపై దండెత్తి వెళ్ళాడా అన్నట్టు భూమి అంతా మంచుపొరలు కమ్ముకోవడంతో హేమంతఋతువు మొదలైంది. ఆ వెనుకనే శిశిరఋతువు ప్రవేశించింది.

ఇక్కడ మరో చక్కని వర్ణన: హేమంతశిశిరాల్లో ఆ ఉమ నిరాహారిణి అయి, నిత్యమూ నీటిలో నిలబడి తపస్సు కొనసాగించింది. హేమంతఋతువులో కప్పుకున్న మంచువల్ల చెట్లను, తీగెలను ఉన్న పువ్వులన్నీ నశించిపోవడం సహజం. కొలనులలో ఉండే కలువలు, కమలాలు కూడా ఋతుధర్మాన్ని అనుసరించి కనుమరుగవుతాయి. మరి తిరిగి రాబోయే వసంతంలో నాటడానికి విత్తనాలు దాచుకోవడం కూడా లోకసహజమైన విషయమే. పార్వతిని వర్ణించడానికి నన్నెచోడుడు ఈ విషయాన్ని వాడుకున్న విధానం మెచ్చదగింది.

తనరి హేమంతమగుడుఁ బద్మంబు లడఁగి
పోవఁ బోయినఁ గొల నొక్క పువ్వు తనకు
విత్తుగా డాఁచికొనియున్న విధము పోలె
శైలసుతముఖ ముదకవాసమున నొప్పె. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 126)

శిశిరంలో మెడలోతున ఉన్న నీళ్ళలో నిలబడి తపస్సు చేస్తున్నది పార్వతి. అప్పుడు ఆమె ముఖం, ముందుగా వచ్చిన హేమంతఋతువులో తనలో ఉన్న పద్మాలన్నీ నశించి పోగా ఒక్క పూవును మాత్రం ఆ కొలను విత్తనంగా దాచుకుందా అన్నట్టు ఉన్నది.

శిశిరం దాటి వసంతము, దానివెనుక, పేరు తలుచుకుంటేనే చాలు హృదయం కందిపోయే విధంగా ఉన్న గ్రీష్మం వచ్చేయి. మరి ఈ గ్రీష్మఋతువులో పార్వతి పట్టపగలు మండుటెండలో పంచాగ్నుల మధ్య నిలిచి, ఆకాశంలో మండుతున్న సూర్యబింబం కేసి దృష్టి కేంద్రీకరించి తపస్సు చేస్తోంది. అదికూడా వట్టినేల మీద కాదు మండుతున్న బండ రాతిపై నిలబడి ఉంది. కవి దీన్ని ఎలా చూస్తున్నాడో చూడండి.

పరితాపోగ్ర నిదాఘవేళ శిలపైఁ బంచాగ్ని మధ్యంబునన్
బరమధ్యాన సమేతయై నిలిచి విభ్రాజిల్లె నుద్యత్తప
శ్చరణాలంకృత శైలనందన కనత్సంధ్యారుణాంభోధరో
త్కరమధ్య స్థితకాంతకాంతియుతశీతద్యోతి లేఖాకృతిన్ — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 142)

ఉద్యత్ తపశ్చరణాలంకృత, శైలనందన, పరితాపోగ్ర నిదాఘవేళ, శిలపైఁ బంచాగ్ని మధ్యంబునన్, బరమధ్యాన సమేతయై నిలిచి, కనత్సంధ్యారుణాంభోధరోత్కరమధ్య స్థితకాంతకాంతియుతశీతద్యోతి లేఖాకృతిన్ విభ్రాజిల్లెన్. – అన్నది అన్వయం.

మహాతాపాన్ని కలిగిస్తున్న ఎండవేళ (పరితాపోగ్ర నిదాఘవేళ) చుట్టూ నాలుగు అగ్నులు, ఆకాశంలో మండుతున్న సూర్యగోళం, ఆ వేడికి ఎర్రబడి మండుతున్న బండరాయి -– ఇవన్నీ నిలువ సాధ్యం కాని పరితాపాన్ని కలిగించే పరిస్థితులు. మనకి ఊహించుకుంటేనే భయం వేసే ఈ సన్నివేశంలో ఆ హైమవతి ఎలావుందో చూడండి. తాను పూనుకున్న తపోదీక్షే ఆమెకో అలంకారం. మండుతున్న అగ్నిగుండాలు సంధ్యాకాలంలో ఆకాశంలో మెరిసే మేఘాల వలె ఉన్నాయి. వాటి మధ్య నిలబడ్డ ఆ గిరిజ మనోజ్ఞమైన కాంతితో మెరుస్తున్న చంద్రరేఖలా ఉందట. చల్లని కొండరాజు హిమవంతుని కూతురు, రేపు లోకాలని చల్లగా చూడబోయే తల్లి, మరి ఆమె చల్లని చంద్రలేఖలా మెరవడంలో వింత ఏముంది?

అది మండువేసవి కాలం. మిట్టమధ్యాహ్నం వేళ సమయంలో ఆమె చుట్టూ ఉన్న అగ్నులు ఎండవేడికి ఊరుకుంటాయా మరింత చిటపటలాడుతాయి, సెగలు కక్కుతూ పైకి లేస్తాయి. అయినా పార్వతి మాత్రం కాలిబొటన వేలిని స్థిరంగా నెలకు నొక్కి పట్టి, తల పైకెత్తి, మండుతున్న సూర్యబింబాన్ని కన్నార్పకుండా చూస్తోంది. ఆమె ముఖమేమో పద్మం. ఆమె కనులేమో కలువలు. వీటి సాయంతో కవి ఇంద్రజాలం చేస్తున్నాడు.

ఖరకర కరహతి ముఖసర
సిరుహము కడువంది కాంతి సెడ నయనేందీ
వరము లలరె గిరిజ తప
స్స్థిరశక్తిని బగలు రేయి సేసెనొ యనగాన్. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 144)

ఉన్నది పట్టపగలు మిట్ట మధ్యాహ్నం. సూర్యకిరణాల దెబ్బకు ఆమె ముఖం సూర్యుడు అస్తమించిన రాత్రి వేళలో ముడుచుకు పోయిన పద్మంలా వాడిపోయింది. కాని చల్లని చంద్రకిరణాలతో వికసించే కలువల్లాంటి ఆమె కళ్ళు మాత్రం మిల మిలా మెరుస్తున్నాయి. ఇది ఎలా కనబడుతోంది అంటే ఆ పార్వతి తన తపశ్శక్తితో పగటిని రాత్రిగా మార్చేసిందేమో అన్నట్టుగా ఉందట. పగలు పద్మం వాడిపోవడం ఏమిటి? కలువలు కళకళలాడడం ఏమిటి? ఇంద్రజాలం కాకపోతే?

తపఃప్రభావం
ఇంత ఘోరమైన తపస్సు చేసినా ఆ శివుడు ప్రసన్నుడు కాలేదు, అయినా పట్టు విడువకుండా అగజ తన తపస్సును కొనసాగించింది. చివరకు చర్మము, బొమికలు తప్ప వేరేమీ మిగులనట్టుగా చిక్కి, ఎండు కర్రలా మారింది. శైలకన్యక చేసే ఈ తపస్సు చూసి దేవతలు ఇది లోకములలో అరుదు అని ఆశ్చర్యపడి, మెప్పుకోలుగా ముత్యాలు జల్లారు. ఇంతకుముందు ఎవరూ ఎరుగని విధంగా దీక్ష పూని తపస్సు చేస్తున్నది గౌరి. దాని ప్రభావం ప్రత్యక్షంగా కనబడసాగింది.

చిర సద్బ్రహ్మతపోధనావలి తపస్తేజంబులుం బేర్మితోఁ
దిరమై పొల్పగు దేవ తాపస తపస్తేజంబులుం గౌరి సు
స్థిర భావోగ్రతపోగ్ర తేజమున నిస్తేజంబులై యుండె న
త్యురు చండాంశుకకర ప్రభా ప్రతిహత ద్యోతిః ప్రభాభాసమై. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 151)

చిర సద్బ్రహ్మతపోధనావలి తపస్తేజంబులున్, పేర్మితోన్ తిరమై పొల్పగు దేవ తాపస తపస్తేజంబులున్, గౌరి సుస్థిర భావోగ్ర తపోగ్ర తేజమున, అత్యురు చండాంశుకకర ప్రభా ప్రతిహత ద్యోతిః ప్రభాభాసమై, నిస్తేజంబులై యుండెన్ -– అన్నది అన్వయం.

చాలా కాలంగా తపస్సు చేస్తున్న బ్రాహ్మణ ముని సంఘాల తపోవికాసాలు, సుస్థిరమైన దేవతాసమూహాల తపస్సుల ప్రకాశం, గౌరి అచంచలదీక్షతో చేస్తున్న ఈ ఘోరమైన తపస్సు యొక్క తేజస్సు వల్ల, చండకిరణుడైన సూర్యుని తీక్షణమైన కిరణాల దెబ్బతో కాంతి విహీనాలైన నక్షత్ర కాంతుల వలె ఉన్నాయి. బ్రాహ్మణుల,ఋషుల తపస్సు మహాతేజోవంతమైంది. అలాగే దేవతల తపఃప్రభావం తేజస్సులో దానికి తీసిపోయేది కాదు. మరి ఈ రెండు ప్రకాశవంతమైన వెలుగులు, చండకిరణుడైన సూర్యప్రభలతో సమానమైన శైలజ తపఃప్రభల ధాటికి ఆగలేక నిస్తేజాలయ్యాయి.

మరి ఈ తపశ్శక్తి సకలలోకాలలో ఎలాంటి కల్లోలం కలిగించిందంటే — భూమి కంపించిపోయింది, సూర్యచంద్రులు గతులు తప్పారు, నక్షత్రాలు రాలి నేలన పడ్డాయి, పర్వతాలు బద్దలయ్యాయి, సముద్రాలు ఇంకిపోయాయి. బ్రహ్మ తల్లడిల్లాడు. ఇంద్రుడు భయపడ్డాడు. వాసుకి విషం కక్కుకున్నాడు. చివరికి విష్ణుమూర్తి కూడా మనసులో కలత పడ్డాడు. ఆమె తపోభారాన్ని భరించలేక కూర్మం కూడా కూలబడింది. భూలోకంలో ఉన్న సప్త సముద్రాలు వేడిపెనం మీద పడ్డ నీరు లాగ చప్పున ఇంకి పోయాయి. ఆ వేడికి బంగారుకొండ మేరు పర్వతం సహితం మూసలో పోసిన బంగారం లాగ కరిగి ద్రవంగా మారింది.

తారకము లెల్ల రుచిరాం
గారంబుల కరణి వెలిఁగెఁ గమలారి తమో
హారులు క్రాగిన రజత మ
హారజతాదర్శనంబు లనఁ దనరి రెడన్. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 156)

ఆ ఉగ్రతకి ఆకాశాన్న ఉన్న తారలన్నీ నిప్పుకణికలయ్యాయి. కాలి మండుతున్న బంగారపు అద్దం లాగ సూర్యుడు, వెండి అద్దం లాగ చంద్రుడు కనబడ్డారు. అగ్నిస్వభావం మండించడం, వ్యాపించడం. అందుకనే ముల్లోకాలకు ఎగబ్రాకిన తపోగ్నిని ఇలా వర్ణిస్తున్నాడు కవి.

పోండిగ నగజ తపశ్శిఖి
మూండు జగంబులను దీవ్రముగఁ బర్వినఁ బ్ర
హ్మాండము గాఁచిన కాంచన
భాండము క్రియఁ దాల్చెఁ దత్ప్రభాభాసితమై. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 157)

తేజోభరితమైన పార్వతి తపోగ్ని మూడులోకాల్లో వ్యాపించింది. దాని కాంతితో బ్రహ్మాండమంతా కాల్చిన బంగారు కుండలా మెరిసిపోతోంది. ఇంక ముల్లోకాల్లోనూ భయపడనిది, చలించనిది, కాలనిది, కూలనిది ఏదైనా ఉందా? ఉంది మరి. అదే ఆ వెండికొండ (రజతాచలము) దాని మీద ధ్యానమగ్నుడైన ఆదిదేవుడు.

గిరిసుత తపః ప్రభాతికి
తరతరమ చలించి రజత ధరణీధర మ
చ్చెరువుగ జిర్రునఁ దిరిగెం
బురహరుతోఁ గూడ వెండి బొమ్మరము క్రియన్. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 158)

పైన చెప్పిన విధంగా అంతటా పరుచుకుంటూ వెళ్ళిన ఆ గౌరి తపోగ్ని యొక్క తేజస్సు క్రమంగా ఆ కొండను కూడా కదల్చివేసింది. అంతటితో ఆగలేదు. అందరూ ముక్కున వేలేసుకునే విధంగా, ఆ కొండ తన మీద కూర్చున్న త్రిపురారితో కూడా కలిసి వెండి బొంగరంలా గిర్రుమని తిరిగిపోయింది.

ఇలా కొండతో కదిలినది శివుడే కాదు అతని మనసు కూడా కదిలింది. మునుపు తనను దరిజేరిన ఆ గౌరిని చేబట్టక, కోపంతో మన్మధుని దహించి, హిమగిరిని వదలి తపసి అయ్యాడు. తన ఈ పొరపాటును తానే నిందించుకుని, విరహవేదనకు లోనవుతాడు. చివరకు శంకరుడు కర్తవ్యాన్ని ఆలోచించి, కపట వటువుగా ఆ పార్వతి వద్దకు వెళ్లి, తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి ప్రత్యక్షమవుతాడు. తరువాత అరుంధతి సమేతంగా సప్తఋషులను రావించి, వివాహప్రయత్నం మొదలుపెట్టి, పార్వతిని పరిణయమాడటం జరుగుతుంది.

అది పార్వతి తపానికి ఫలం. స్థాణువును సహితం బొంగరంలా తిప్పిన చైతన్యమే ఆమె తపశ్శక్తి. ఆ అరుదైన తపస్సుకు త్రినేత్రుడు లొంగి పోయాడు. ఆమె పాణిని గ్రహించడమే కాదు తన మేనిలో సగం ఆమెకు ధారపోసి అర్ధనారీశ్వరుడయ్యాడు.

కావ్యపీఠికలో వర్ణనలు, అలంకారాలు, ఉదాత్తమైన భావాలు మొదలైనవి వస్తుకవితా లక్షణాలుగా చెప్పుకున్నాడు నన్నెచోడుడు. ప్రకృతిశోభని వర్ణించడం వస్తుకవిత అయితే, కుమారసంభవం కావ్యంలో ప్రకృతిని, ప్రకృతిస్వరూపం అయిన పార్వతిని, జోడించి వర్ణించిన ఈ ఘట్టం దానికి చక్కని ఉదాహరణ. అడుగడుగున సహజసుందరమైన ఉపమలు, మనసును అబ్బురపరిచే ఉత్ప్రేక్షలు, ఈ వర్ణనలను ‘వర్ణనాచిత్రాలు’గా, ‘వర్ణచిత్రాలు’గా చూపిస్తాయి. అంతే కాదు నన్నెచోడుడు తన కవిత్వాన్ని గురించి, వర్ణనలెల్ల చో వర్ణన కెక్కంగ… అలంకారముల తాన్ అలంకరింపన్, ఆదరించి విని సదర్థాతిశయమున, బుధులు నెమ్మనమున నిధులు నిలుప… అని కావ్యారంభంలో చెప్పినట్టుగానే ఈ కవిరాజశిఖామణి వర్ణనలు చదువరుల హృదయాల్లో పదిలంగా నిలిచిపోతాయనడంలో అతిశయోక్తి లేదు.
---------------------------------------------------------
రచన: కాశీనాధుని రాధ, 
ఈమాట సౌజన్యంతో

Friday, July 19, 2019

నన్నయ్య తీర్చిన గడసరి సొగసరి


నన్నయ్య తీర్చిన గడసరి సొగసరి





సాహితీమిత్రులారా!


తే. నన్ను మున్న యెఱుంగు; దిన్నాతి నాకు
      దాసి, వృషపర్వుఁ డను మహాదానవేంద్రు
      కన్య, నాయొద్ద నెప్పుడుఁ గదలకుండు,
      ననఘ! మఱి దీని శర్మిష్ఠ యండ్రు జనులు

కథతో సంబంధం లేకుండా చదివి ఆనందించగలిగే పద్యాన్ని కిందటి నెల చూశాం కదా. దానికి పూర్తి వ్యతిరిక్తమైన పద్యమిది. దీని వెనక బోలెడంత కథ ఉంది. అది తెలిస్తే కాని యిందులోని సొగసు తెలిసిరాదు. ఇవి దేవయాని యయాతితో అంటున్న మాటలు. దేవయాని ఎవరు? యయాతి ఎవరు? శర్మిష్ఠ ఎవరు?

సంస్కృత మూలానికి కాస్తంత భిన్నంగా, ప్రత్యేకంగా, నన్నయ్యగారు తీర్చిదిద్దిన పాత్ర దేవయాని. శుక్రాచార్యుని గారాబుకూతురామె. శర్మిష్ఠ రాక్షసరాజు వృషపర్వుని కూతురు. శర్మిష్ఠాదేవయాను లిద్దరూ చిన్నప్పటినుండీ కలిసి పెరిగిన నెచ్చెలులు. అయితే ఒకరోజు చిన్న జట్టీ వచ్చి ఇద్దరికిద్దరూ ఎవరు గొప్పంటే ఎవరు గొప్పని వాదులాడుకొంటారు. శర్మిష్ఠ పొరపాటున దేవయాని దుస్తులు ధరిస్తుంది. అదీ ఆ జట్టీకి కారణం! ఆ తగువు పెరిగి పెరిగి, శర్మిష్ఠ కోపంతో దేవయానిని ఒక పాడుబడిన చిన్నబావిలో తోసేసి వెళ్ళిపోతుంది. నహుషకుమారుడైన యయాతి అనే రాజు వేటకై ఆ ప్రాంతానికి వస్తాడు. నీళ్ళకోసం వెతుకుతూ ఆ బావి దగ్గరకు వచ్చి, అందులో పడి ఉన్న దేవయానికి “జలధివిలోలవీచివిలసత్కలకాంచిసమంచితావనీతల వహన క్షమంబయిన” తన దక్షిణహస్తాన్ని అందించి ఆమెని బయటకి తీస్తాడు. అలా ఆమెని రక్షించి, తన దారిన తాను వెళ్ళిపోతాడు.

దేవయాని జరిగిన అవమానాన్ని తన తండ్రి శుక్రాచార్యునికి చెప్పి, వృషపర్వుని రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోదామంటుంది. శుక్రాచార్యుడు కూతురి మాట కాదనలేడు. ఇంతలో యీ సంగతి తెలిసిన వృషపర్వుడు శుక్రాచార్యుని దగ్గరకు వచ్చి, వెళ్ళవద్దనీ, దేవయాని కోరింది జరిపిస్తాననీ వేడుకొంటాడు. శర్మిష్ఠ, తన వేయిమంది చెలికత్తెలతో సహా, తనకు దాసి కావాలని దేవయాని కోరుతుంది. అలా విధిలేక శర్మిష్ఠ దేవయాని దాసిగా మారి ఆమెకు సేవలు చేస్తూ ఉంటుంది. ఒకనాడు విధివశాత్తూ యయాతి మళ్ళీ దేవయాని ఉన్న వనానికి వస్తాడు. “అతిశయ రూపలావణ్య విభ్రమ గుణసుందరియైన” శర్మిష్ఠని చూసి, ఆమె ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో, “మీరెవ్వరివారలు మీ కులగోత్రనామంబు లెఱుంగవలతుం జెప్పుం”డని అడుగుతాడు. అప్పుడు దేవయాని చెప్పిన సమాధానం, ఈ పద్యం.

ఈ సందర్భంలో సంస్కృత భారతంలో దేవయాని సమాధానాన్ని గమనిస్తే, నన్నయ్యగారి కూర్పులోని విశేషం చక్కగా బోధపడుతుంది. సంస్కృతభారతంలో, యయాతి శర్మిష్ఠ రూపలావణ్యాలను చూసి ఆమె గూర్చి ప్రత్యేకంగా తెలుసుకోవాలని అడిగినట్టుగా లేదు. ఇద్దరినీ చూసి వారి గురించి తెలుసుకోవాలని అడిగినట్టు ఉంది. అయితే, పూర్వం దేవయానిని నూతి నుండి బయటకు తీసినప్పుడే ఆమె గురించి యయాతికి తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ఆమె గూర్చి అడగవలసిన పని లేదు. అయినా అడిగాడంటే, అది శర్మిష్ఠ గురించి తెలుసుకోవడానికే అయ్యుండాలి. ఈ విషయం సంస్కృతభారతంలో దేవయానికి తట్టినట్టుగా అనిపించదు. ఆమె యయాతికి యిలా బదులిస్తుంది:

ఆఖ్యాస్యామ్యహమాదత్స్వ వచనమ్ మే నరాధిప
శుక్రో నామా సురగురుః సుతామ్ జానీహి తస్య మామ్
ఇయమ్ చ మే సఖీ దాసీ యత్రాహమ్ తత్ర గామినీ
దుహితా దానవేంద్రస్య శర్మిష్ఠా వృషపర్వణః

తాను శుక్రాచార్యుని కూతురునని చెప్పి, తర్వాత శర్మిష్ఠ గురించి చెపుతుంది. సంస్కృతభారతంలో దేవయాని అహంకారిగా, పెంకిఘటంగా మాత్రమే కనిపిస్తుంది. తెలుగు భారతంలో ఆమె అసాధ్యురాలు, గొప్ప గడసరి కూడా! యయాతి ప్రశ్నలోని ఆంతర్యం యిట్టే కనిపెడుతుంది. అందుకే మొదలుపెడుతూనే, “నన్ను మున్న యెఱుంగుదు” – నేను నీకు ముందే తెలుసు, అని అంటుంది. అంటే, నేనెవరో నీకు తెలుసు కాబట్టి, నువ్వు తెలుసుకొనేందుకు కుతూహలపడుతున్నది శర్మిష్ఠ గురించని నాకు తెలిసిపోయింది సుమా అని! ఆ తర్వాత శర్మిష్ఠ గురించి చెప్పినదంతా ఇంచుమించు సంస్కృతభారతంలో ఉన్న మాటలే. కాని చెప్పిన విధానమూ, వాడిన పదాలూ, దేవయాని మాటల్లోని కాకువును స్పష్ఠంగా ధ్వనింపజేస్తాయి. గొంతులో వినబడే కాకువు చదివే పద్యంలో ధ్వనించాలంటే, కవికి శబ్దశక్తి పూర్తిగా తెలిసి ఉండాలి. వాగనుశాసనుడైన నన్నయ్యగారికి శబ్దం పైనున్న అధికారం అపారం!

శర్మిష్ఠ గురించి చెప్పడం మొదలుపెడుతూనే, “ఇన్నాతి నాకు దాసి” అని తెగేసి చెప్పింది. పైగా, సంస్కృతంలో ఉన్న ‘సఖి’ శబ్దం తెలుగులోకి రాలేదు. దేవయానికి శర్మిష్ఠపై ఉన్న తిరస్కారభావమంతా పద్యంలో ధ్వనించాలి కదా మరి. ఆ మాటతో వెంటనే యయాతి నీరుగారిపోవాలి, తాను యిష్టపడినది ఒక దాసినా అని. ఆ తర్వాత “వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య” అని చెప్పింది. సంస్కృతంలో లేని ‘మహా’ తెలుగులో వచ్చి చేరింది. ఆ పదాన్ని పలికేటప్పుడు దేవయాని గొంతులో వినిపించే వ్యంగ్యమంతా అందులోని ఆ దీర్ఘం వ్యంజింపజేస్తోంది. అంతటి మహా రాక్షసచక్రవర్తి బిడ్డను దాసిగా చేసుకొన్నాను అనే గర్వం ఒక వైపు, అలాంటి నన్ను గూర్చి ఆలోచించవేమన్న పోటు మరొక వైపు ఆ మాటలో ఘాటుగా స్ఫురిస్తున్నాయి. ఆ తర్వాత, సంస్కృతంలో యత్రాహం తత్ర గామినీ అన్న వాక్యం “నా యొద్ద నెప్పుడు కదలకుండు”గా మారింది. అంటే, ఈమెని సులువుగా ఎగరేసుకు పోదామని అనుకుంటున్నావేమో, ఆ పప్పులేం ఉడకవు! అని హెచ్చరిస్తోందన్న మాట! ఆమె నీకు దక్కాలంటే, ముందు నువ్వు నా వశం కాక తప్పదన్న ధ్వని కూడా అందులో ఉంది. “అనఘ!” అనడంలో అబ్బో! ఎంత పుణ్యం చేసుకొన్నావో, ఇలాంటి దాసిపై మోజు పడ్డావు! అన్న హేళన.

ఆఖరిగా పేరు చెప్పింది. ఆ చెప్పడంలో ఎంత వాడిగా చెప్పింది! “మఱి, దీని శర్మిష్ఠ యండ్రు జనులు” అంది. మఱి అన్న పదం పాదపూరణ కోసం వేసిన వ్యర్థపదం కాదు. సరే యింక, చెప్పక తప్పదు కదా — అనే అయిష్టమంతా అందులో ఉంది. “అండ్రు జనులు” అనడంలో, బిందుపూర్వక డకారరేఫలు, శర్మిష్ఠపై దేవయానికున్న అసూయాద్వేషాలను చాలా చక్కగా మనకి వినిపిస్తాయి. ఇలా యీ చిన్న పద్యంలో, శబ్దార్థాల ద్వారా, దేవయాని ఆభిజాత్యాన్నీ గడుసుదనాన్నీ అద్భుతంగా చిత్రించారు నన్నయ్యగారు. ఈ పద్యాన్ని గురించి ఆచార్య శలాక రఘునాథశర్మగారన్న మాటలు ప్రత్యక్షరసత్యాలు: “ఈ చిన్న పద్యంలో కథ మొత్తంలో పరచుకొని ఉన్న దేవయానీ ప్రవృత్తికి సంబంధించిన ఆంతర్యాన్ని ఎంతగా కుదించి నిక్షేపించాడో భావించినపుడు నన్నయ లోతులు మనకు స్ఫురిస్తాయి.”

నన్నయ్యగారు తీర్చిన దేవయాని కథలో నాకు మరొక విశేషం కూడా గోచరించింది. దేవయాని ముందు కచుని మనసారా ప్రేమిస్తుంది. మృతసంజీవని విద్య నేర్చుకోవడం కోసం శుక్రాచార్యుని వద్ద శిష్యునిగా చేరిన బృహస్పతి కొడుకు కచుడు. గురుపుత్రి సహోదరితో సమానమని దేవయాని కోర్కెను తిరస్కరిస్తాడు కచుడు. దానితో కృద్ధురాలై, కచుడు నేర్చిన విద్య అతనికి పనిచేయదని శాపమిస్తుంది. అధర్మంగా తనను కోరుకోవడమే కాకుండా, కాదన్నందుకు తనకి అన్యాయంగా శాపమిచ్చినందుకు, దేవయానికి బ్రాహ్మణేతరునితో వివాహం జరుగుతుందని ప్రతిశాపమిస్తాడు కచుడు. ఆ తర్వాత యయాతిని చూసి అతనిపై దేవయాని మనసు పడినట్టుగా సంస్కృతభారతం చదివితే మనకు అనిపిస్తుంది.

ద్వాభ్యామ్ కన్యా సహస్రాభ్యామ్ దాస్యా శర్మిష్ఠయా సహ
త్వదధీనాస్మి భద్రమ్ తే సఖా భర్తా చ మే భవ

అంటూ యయాతిని అర్థిస్తుంది. అలా కోరుకోవడానికి కారణం యయాతిపై ప్రీతి తప్ప మరొకటి కనిపించదు. కచుని ప్రేమించిన దేవయాని, మళ్ళీ యయాతిపై మోజుపడటం నన్నయ్యగారికి నచ్చినట్టు లేదు. యయాతికి దేవయానిపై ఆసక్తి లేదన్న అంశం స్పష్టం. మరి అలాంటివాడిని దేవయాని కోరి పెళ్ళిచేసుకోమని అడగడానికి కారణం ఏమిటి? తాను ఎలాగూ బ్రాహ్మణేతరుణ్ణి పెళ్ళాడాల్సి ఉంది కాబట్టి, యయాతివంటి మహారాజైతే బాగుంటుందని ఆమె భావించిందా? అలా అనుకొన్నా, కోరి యయాతిని పెళ్ళాడమని అడగడం దేవయాని వ్యక్తిత్వానికి అంతగా పొసగని విషయం. మూలభారత కథలో మరొక అసంగతం కూడా ఉంది. దేవయానిని నూతి నుండి వెలుపలకు తీసినప్పుడే యయాతికి ఆమె ఎవరో పరిచయం అవుతుంది. అప్పటికే యయాతి గురించి దేవయానికి తెలిసినట్టుగా ఆమె మాటల్లో వ్యక్తమవుతుంది. కాని మళ్ళీ వనంలో కలుసుకొన్నప్పుడు యయాతి శర్మిష్ఠదేవయానుల గురించి తెలుసుకోవాలని వారి కులగోత్రాలను అడుగుతాడు. దేవయాని తన వివరాలు చెప్పి, యయాతి వివరాలను కూడా అడుగుతుంది. ఇది కూడా పొసగని విషయం. ఈ అసంగతాలను పరిష్కరిస్తూ, కథని ప్రసన్నంగా నడిపించారు నన్నయ్యగారు.

“అతిశయరూపలావణ్యగుణసుందరి యయిన శర్మిష్ఠ నెఱుంగ వేఁడి” యయాతి వారి వివరాలను అడిగాడని చెప్పడం ద్వారా, యయాతి దేవయానిపై కాక శర్మిష్ఠ పైననే మనసు పడ్డాడన్న విషయం సుస్పష్టం చేశారు. అలాగే దేవయాని సమాధానంలో, ఆమె ఆ విషయం గ్రహించిందన్న అంశాన్ని చక్కగా ధ్వనింపజేశారు. ఆమె ఆభిజాత్యమూ, శర్మిష్ఠ పట్ల ఆమెకున్న ఈర్ష్యా తిరస్కారమూ కూడా స్పష్టంగా తెలుస్తున్నాయామె మాటల్లో. తనని కాదని తనకు దాసి అయిన శర్మిష్ఠను యయాతి వంటి మహారాజు చేపట్టడం దేవయాని సహించలేని విషయం. దానికి విరుగుడు ఒక్కటే, యయాతిని తానే పెళ్ళాడటం. యయాతి ప్రశ్న అడిగిన క్షణంలోనే యిదంతా దేవయాని మనసులో ఆలోచించుకొన్నది. సమయం వృధా చేయదలుచుకోలేదామె. అందుకే, తన వివరాలు చెప్పడం కాని, యయాతి గురించి అడగడం కాని ఏమీ చెయ్యదు. శర్మిష్ఠ గురించి చెప్పిన వెంటనే, యయాతి తనను వివాహమాడాలని కోరిందామె. అది కూడా అభ్యర్థన కాదు, ఆదేశం! ఆ జాణ పలుకులు ఎలా ఉన్నాయో చూడండి:

నిగ్రహ మేది నన్నుఁ దరణిప్రభ! కూపము వెల్వరించు నాఁ
డుగ్రమయూఖసాక్ష్యముగ నున్నతదక్షిణపాణిఁ జేసి భూ
పాగ్రణి! నాదు దక్షిణకరాగ్రము వట్టితి, కాన మున్న పా
ణిగ్రహణంబు సేసి, తది నీయెడ విస్మృతిఁ బొందఁ బాడియే!

ఇదీ నన్నయ్యగారి దేవయాని! మొదలుపెడుతూనే నిష్ఠూరాలు! తప్పంతా యయాతిపై తోసేసింది. తనను రక్షించడంలో అతను నిగ్రహాన్ని కోల్పోయాడట! అంటే ఏమిటి? నేనేదో అడిగితే మాత్రం, నువ్వు కన్యవు, నేను నిన్ను తాకడం న్యాయం కాదు – అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోవాలా? ఇక్కడ, నిగ్రహము అంటే నింద, అవమానం అన్న అర్థంలో, నిగ్రహము ఏది – అంటే, నా అవమానాన్ని తొలగించి – అనే అర్థాన్ని తి.తి.దే. వారి ప్రతిలో యిచ్చారు. “నిగ్రహమేద” అనే పాఠాంతరం కూడా ఉందని, అది మరింత ఉచితమని కూడా అన్నారు (నా అవమానం తొలగిపోయేటట్టుగా నన్ను నూతినుండి బయటకు తీసావని.) కాని “నిగ్రహ మేది” అంటే – నీ నిగ్రహాన్ని కోల్పోయి, రక్షించే నెపంతో పరాయి స్త్రీ చేయిపట్టుకున్నావు, అనే అర్థమే నాకు సరైనదని అనిపిస్తోంది. శలాకవారు తమ భారత ధ్వని దర్శనము అనే గ్రంథంలో కూడా యిదే అర్థాన్ని యిచ్చారు. ఆ రోజు నన్ను బావినుండి బయటకు తీసే సందర్భంలో సూర్యుని సాక్షిగా నీ ఉన్నతమైన దక్షిణహస్తంతో నా దక్షిణహస్తాన్ని పట్టుకున్నావు. కాబట్టి ముందే నన్ను పాణిగ్రహణం చేశావు. అది నువ్వు మరచిపోవడం న్యాయమా? అని యయాతిని నిలదీసింది! కచుణ్ణి వివాహమాడమని కోరినప్పుడు “వివాహము నీకు నాకు మున్ భావజశక్తి నైనయది” అని చెప్పింది. యయాతితోనేమో “ఉగ్రమయూఖసాక్ష్యముగ మున్న పాణిగ్రహణమయిందని” అంటున్నది. అదీ దేవయాని గడసరితనం. సూర్యుడు సర్వసాక్షి. అగ్నిస్వరూపం. కాబట్టి అగ్నిసాక్షిగా తమ పాణిగ్రహణం జరిగిపోయిందని తిరుగులేని తర్కాన్ని ప్రయోగించింది. ఈ పాణిగ్రహణానికి యింతటి వైశిష్ట్యం ఉండబట్టే, ఆ సన్నివేశం పాఠకుల మనసులలో ముద్రపడిపోయేలా, జలధివిలోలవీచి… అనే అద్భుతపద్యంలో దాన్ని వర్ణించారు నన్నయగారు. పాణిగ్రహణంబు అనే పదంలో ‘గ్ర’కారం ప్రాసస్థానంలో ఉండడం, దేవయాని ఆ విషయాన్ని నొక్కి చెప్పడాన్ని స్పష్టంగా వ్యంజింపజేస్తుంది. ఇది నన్నయగారి శబ్దాధికారానికి మరొక మచ్చుతునక. చివరిగా, “అది నీయెడ విస్మృతి పొంద పాడియే” అనడంలో, అది మరిచి నువ్వు శర్మిష్ఠపై మోజుపడడం నీకు తగదన్న నిష్కర్ష చక్కగా ధ్వనిస్తోంది.

ఈ సన్నివేశమంతా నన్నయగారి ప్రసన్నకథాకలిత అర్థయుక్తికి ఒక మంచి ఉదాహరణ. మహాభారతం ఆదిపర్వంలోనూ అరణ్యపర్వంలోనూ అనేక ఉపకథలు వస్తాయి. ఆ ఉపాఖ్యానాలన్నిటినీ నన్నయగారు ఎంతో ప్రసన్న గంభీరంగా తీర్చిదిద్దారు. లోనారసి చూసేవారికి ఆయన కథ నడిపే తీరులో, పాత్రల స్వభావస్వరూపాలను అర్థవంతమైన మాటలద్వారా రూపుకట్టే రీతిలో, ఎన్నెన్నో విశేషాలు దర్శనమిస్తాయి. తవ్విన కొద్దీ ఊరే అమృతజల నన్నయగారి కవిత్వం. అందులోని మరిన్ని లోతులను మరోసారి పరిచయం చేసుకొందాం.
------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, July 17, 2019

ఊయలూగే అమ్మాయిలు


ఊయలూగే అమ్మాయిలు





సాహితీమిత్రులారా!

మ.   తమి బూదీగల తూగుటుయ్యలల బంతాలాడుచుం దూగనా
         కొమరుంబ్రాయపు గబ్బి గుబ్బెతల యంఘ్రుల్ చక్కగా జాగి మిం
         టి మొగంబై చనుదెంచు ఠీవి గనుగొంటే దివ్య మౌనీంద్ర నా
         కమృగీ నేత్రల మీద గయ్యమునకున్ గాల్సాచులా గొప్పెడున్

పై పద్యమూ, దానిలోని ఉత్ప్రేక్ష, నారదుడికి బాగా నచ్చింది. ఆ పద్యం చెప్పినతన్ని “బళిరా, సత్కవివౌదు” అని ప్రశంసించాడు కూడా.

పూర్వకాలంలో పల్లెటూళ్ళల్లో అట్లతద్ది పండగకి వయసులో ఉన్న ఆడపిల్లలు ఊరి బయట తోటల్లోని చెట్లకు మోకులతో ఉయ్యాలలు వ్రేలాడేసుకొని పోటాపోటీగా ఊగేవారు, ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అని పాడుకుంటూ. పల్లెల్లోని ఆడపిల్లలకి అంతకంటే విశేషమైన వినోదాలు గానీ, వ్యాయామం కలిపించే ఆటలగ్గానీ అవకాశాలేముండేవి? బారా కష్టా, అష్టా చెమ్మా, అచ్చనగాయలూ లాంటి ఇళ్ళల్లో ఆడుకునే ఆటలు, వెన్నెల కుప్పలు, దాగుడు మూతలు, ఉయ్యాల తూగులు లాంటి ఆటలే గదా వారికి. పండగ సందర్భంగా ఆడేవీ, ప్రత్యేకించి పోటీలు పడి ఆడేవి కాబట్టిన్నీ, పరువంలో ఉన్న ఆడపిల్లలు పాల్గొనేవి అయినందున మనోహరంగా వుంటాయి కాబట్టిన్నీ, ఇవి మరచిపోలేని విధంగా మన సంస్కృతిలో భాగాలైపోయి, తలచుకుంటుంటేనే ఆహ్లాదకరంగా వుంటాయి. పోటీలు పడి ఊగడమంటే ఎవరు ఎంత వేగంగా ఊగుతారు, ఎవరు ఎంత ఎత్తుకు ఊగుతారు అనేవి స్పర్థానిర్ణాయకాలు. అలా ఊగడంలో కాళ్ళు ఆకాశం వైపు చూపిస్తూ పైకి లేవడం — అదో సొగసు. ఆ ఆటలు నిన్నా మొన్నటి దాకా వుండేవి. ఇప్పుడెక్కడో సకృత్తుగా గానీ చూడము. పై పద్యం వ్రాసిన కవిది పదహారో శతాబ్దం. అంటే ఐదొందల యేళ్ళ క్రిందట్నుంచీ, ఆ ఆటలు ఉన్నాయనేది నిశ్చయం.

ఇంతకూ విషయమేమిటంటే నారద మహర్షి, అతని శిష్యుడైన మణికంధరుడనే గంధర్వునితో కలిసి శ్రీకృష్ణుని దర్శించుకుందామని ద్వారకకు వస్తున్నాడు. ఆయన త్రిలోకసంచారి గదా. మామూలుగా కాలినడకన గానీ, ఏదో రథాల మీద రావడం గానీ ఆయనకు కుదరదు. ఆకాశ మార్గాన సంచరిస్తుంటాడు. ఆయన చేతులో మహతి అనే వీణ ఉంటుంది. అప్పుడప్పుడూ దాన్ని మోయడానికైనా ఒక మనిషి పక్కనుండాలి. ఈ మణికంధరుడితో కలిసి, ఆకాశ విహారం చేస్తూ ద్వారక సమీపానికి వచ్చి దిగబోతుండగా క్రింద పూదోటలో చెట్లకు ఉయ్యాలలు కట్టి కొంతమంది అమ్మాయిలు ఊగుతున్నారు. “తమితో (తమకంగా) పూదీగలు తూగుటుయ్యలలు పంతాలాడుతూ,” ఊగుతున్నారు. వారేమీ పసిపిల్లలు కారు. “కొమరుం బ్రాయపు గబ్బి గుబ్బెతలు.” వారు ఉయ్యాల లూగుతుంటే వారి అంఘ్రులు (పాదాలు) చక్కగా సాగి, మింటి మొగమై (ఆకాశం వైపు) చనుదెంచే ఠీవిని చూచి మణికంధరుడికి, క్రింద ఉన్న అందాల భామలు స్వర్గంలో ఉండే దేవతా స్త్రీల మీదకి కయ్యానికి కాల్సాచుతున్నట్లున్నదట. ఆ ముక్కే పై పద్యంగా చెప్పాడు దివ్యమౌనీంద్రుడైన నారదునితో. ఊహ ఎంత అందంగా ఉందో దాని వ్యక్తీకరణ కూడా అంత సొగసు గానూ ఉంది కదా.

కొమరుంబ్రాయపు గబ్బి గుబ్బెతలు పరువం లోనూ, సౌందర్యం లోనూ నాకమృగీ నేత్రలకు (దేవతా స్త్రీలకు) ఏమాత్రం తీసిపోరు అని చెప్పడం అక్కడి సందర్భం. అక్కడ వారి కాళ్ళు మింటి మొగమై సాగుతుండడం అనేదాన్ని కయ్యానికి కాలు దువ్వడం అనే చక్కటి జాతీయంతో అన్వయించి — అప్సరసలనైనా గెలవగలము అందంలో అని చెప్పే తీరుగా ఉంది అని — వర్ణించడం మనోజ్ఞంగా వుంది. నారదుడంటే మునీంద్రుడు. మణికంధరుడేమో గంధర్వుడు. విరాగి కాడు. అందుకని అమ్మాయిలను చూడగానే కొంచెం ముచ్చట పడింది అతని మనస్సు. నారదుడు అతని ముచ్చటకు ముచ్చట పడి, “సెబాశ్, మంచి కవివోయి నువ్వు,” అని మెచ్చుకోవడమే కాకుండా ఆ ఊహకు తన ఉత్సాహాన్ని కొంత జోడించి, “కయ్యానికి కాల్సాచడం” మాత్రమేనా? “త్రైవిష్టప స్త్రీల యౌదల్ దన్నన్ జనునట్లు మించెననినన్ దప్పేమి, యొప్పేయగున్” అని ముక్తాయించాడు. అది ఇంకో పద్యమూ, ఇంకో ముచ్చటాను. అయితే నారదుని లాంటి మహానుభావుడు ఏ మాటా వ్యర్థంగా మాట్లాడడు గదా. ఆయన అన్న మాటల్లో భావి కథార్థ సూచన కూడా వుంటుంది. ఆ అమ్మాయిలను నారదుడు, మణికంధరుడే కాక అదే సమయంలో ఆకాశవిహారం చేస్తున్న రంభా నలకూబరులు కూడా చూస్తారు. నారదుడు, మణికంధరుడు మాట్లాడుకునే మాటలనీ వింటారు. క్రింద ఉయ్యాలూగే అమ్మాయిల్లో కలభాషిణి అనే అమ్మాయి కూడా ఉంటుంది. దేవతా స్త్రీలను చులకనగా మాట్లాడినందుకు రంభకు కోపం కూడా వస్తుంది. ఆ తర్వాత జరిగే కథ, అదొక అక్షరాలా అపూర్వము, అనితర సాధ్యము అయిన అద్భుత కల్పన. అది అలా ఉంచుదాం.

పై పద్యము, ఆ ఆద్భుతమైన కథ, కళాపూర్ణోదయం అనే గొప్ప కావ్యం లోనివి. కవి పేరు పింగళి సూరన.

సూరన మహా విలక్షుణుడైన కవి. కళాపూర్ణోదయం దానికదే సాటి యైన అద్భుత కావ్యం. నిజానికి సూరనను గురించి గాని, కళాపూర్ణోదయం గురించి గాని ఏదో అలా అలా మాత్రమే తెలిసిన తెలుగు సాహిత్యాభిమానులకు, కట్టమంచి రామలింగారెడ్డి గారు విపులంగా చేసిన విమర్శనము ఆ కవి ఎడా, ఆ కావ్యం ఎడాపెడా కొత్త ద్వారాలు తెరిచిందనే చెప్పాలి. వారి సమీక్ష వెలుగులో ఆ కావ్యం యొక్క అందాలను హార్దికంగా అందుకున్నారు. అప్పటినుంచీ సూరన అంటే — అనేకానేక కవుల్లో ఆయనా ఒక కవి అనీ, కళాపూర్ణోదయం అంటే అనేకానేక కావ్యాల్లో అదీ ఒకటి అని మాత్రమే అనుకోవటం ఆగిపోయి — ఆ కవి యొక్క, ఆ కావ్యం యొక్క విలక్షణతను గుర్తించడమూ, ఆనందించడమూ, మెచ్చుకోవడమూ ప్రారంభమైంది.

షేక్‌స్పియర్ వ్రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కథకూ కళాపూర్ణోదయం కథకూ పోలికలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయని విమర్శకులు గమనించి చెప్పారు. పదహారో శతాబ్దంలో షేక్‌స్పియర్ సాహిత్యం సూరన తెలుసుకోవడానికి గాని, సూరన కవిత్వాన్ని షేక్‌స్పియర్ చూడ్డానికి గానీ అవకాశాలు ఊహించను గూడా లేము గదా. ఏకకాలంలో, వేర్వేరు ఖండాలలో ఉన్న ఇద్దరు ప్రతిభావంతులు ఒకే రకమైన కల్పనలు కావించడం – కాకతాళీయమైనా – గొప్ప సంగతే. (కళాపూర్ణోదయం సరళమైన వచనంలో ఈమాట గ్రంథాలయంలో ఉన్నది. ముఖ్యంగా వెల్చేరు నారాయణ రావు గారు సౌండ్ ఆఫ్ ది కిస్ పేరుతో ఆంగ్లంలో ఈ కథని అనువదించడమే కాకుండా, ఈ కావ్యానికున్న విలక్షణతను విడమర్చి చెప్పి తద్వారా దక్షిణ భారతదేశంలో 16వ శతాబ్దిలోనే వెలువడిన ఆధునిక నవలగా ఈ కావ్యాన్ని ఉదహరించారు.)

కళాపూర్ణోదయం దానికదే సాటి. కథ ఒక మహాద్భుతమైన కల్పన. పద్యాల్లో నిబంధించబడిన నవల అది. అలాంటిలాంటి నవల కాదు. నాలుగైదు సార్లు చదివినా ఆ కథలోని బంధాలు పట్టుకోవడం అంత తేలిక కాదు. కేవలం కథ అలా ఉంచితే కవిత్వం కూడా చాలా గొప్ప స్థాయి లోదే. సంభాషణల నిర్వహణలో సూరన, తిక్కన తోనే పోటీ పడగలుగుతాడని తెలిసిన పెద్దలు అంటారు. కవిత్రయమూ, పోతనా, శ్రీనాథుడూ సంస్కృత కావ్యాలను అనువాదం చేస్తే, పెద్దనాదులు పురాణాల్లోని ఒక చిన్న కథనో, ఘట్టాన్నో తీసుకొని అందమైన ప్రబంధాలుగా నిబంధిస్తూ వుంటే, సూరన సంపూర్ణంగా ఒక విలక్షణమైన దారి తొక్కి ఒక కొత్త ప్రయోగానికి సాహసం చేశాడు. పురాణాల్లో లేని దాన్ని స్వకపోల కల్పనం చేసి, తన శేముషితో దాన్ని ధగద్ధగాయమానంగా, ఆంధ్ర రసజ్ఞ లోకం ముందు నిలిపాడు. భట్టుమూర్తి – ఒక సాధారణీకరణంగా వ్రాసిన పద్యంలో కేవలం కల్పనా కథలు కృత్రిమ రత్నాలు అన్నాడు అది పింగళి సూరనను గురించి, కళాపూర్ణోదయం గురించే అని వుంటాడని నా అనుమానం. కళాపూర్ణోదయపు ప్రకాశానికి కళ్ళు మిరుమిట్లు గొలుపగా ఈర్ష్యతో అన్న మాటే ఇది. పురాణాల్లో లేనంత మాత్రాన అది కృత్రిమమని నిరసించడం — కొత్తదనాన్ని అంగీకరించలేక పోవడమే.

సూరన కవిత్వం చదవడం ఒక గొప్ప అనుభవం. పై పద్యము, ఆపైన నారదుడు చెప్పిన పద్యము, ఆ కావ్యం లోని వందలాది మంచి పద్యాల్లో మచ్చుకు రెండు. నారదుని పద్యం పుర్తిగా ఇదుగోండి.

బళిరా సత్కవి వౌదు నిక్కము తగన్ భావించ నీవన్నయా
యెలబ్రాయెంపు మిటారి కత్తెల బెడంగే నెందునుం గాన వా
రల డోలాచలనోచ్చలచ్చరనముల్ త్రైవిష్టప స్త్రీల యౌ
దల దన్నం జనునట్లు మించె ననినన్ దప్పేమి యొప్పేయగున్

రసజ్ఞశేఖరులైన  పాఠకులకు ఈ పద్యాలు నచ్చి తీరుతాయి.
-------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో