Saturday, May 20, 2017

తపోభంగ యత్నం - 1


తపోభంగ యత్నం - 1




సాహితీమిత్రులారా!


భారవి కిరాతార్జునీయంలో
అర్జునుడు ఇంద్రకీలాద్రిపై
తపస్సు చేస్తుండగా దాన్ని
భగ్నం చేయడానికి అప్సరసలు
చేసిన యత్నం ఇక్కడ గమనిద్దాం-

శ్రుతిసుఖముపవీణితం సహాయై
రవిరలలాంఛనహారిణశ్చ కాలాః
అవిహితహరిసూనువిక్రియాణి
త్రిదశవధూషు మనోభవం వితేనుః (10-38)

అప్సరసలకు సహాయంగా వచ్చిన
గంధర్వుల వీణాగానం, ఋతువుల
ఫలపుష్పాదుల విజృంభణ అర్జునుణ్ణి
ఏ మాత్రం చలింపచేయలేదు. కాగా
ఆ అప్సరసల మనస్సుల్లో మన్మథుని
ప్రవేశపెట్టి కలచినవి అనగా తన
ఆయుధం శత్రువుపై గాక తనకే చేటు
చేసినట్లుందని భావం.

న దలతి నిచయే తథోత్పలానాం
న విషమచ్ఛదగుచ్ఛయూథికాసు
అభిరతిముపలేభిరే యథాసాం
హరిత నయావయవేషు లోచనాని (10-39)

అప్సరసల నేత్రాలు అర్జునుని అంగప్రత్యంగాల్లోనే
నిమగ్నమయ్యాయి. వికసించిన మల్లె మొదలైన
పూగుత్తులు వారిని ఆకర్షించలేక పోయాయి. దీని
ద్వారా వారి చక్షుః ప్రీతి అనే మన్మథ వికారం
చెప్పాడు కవి.

మునిమభిముఖతాం నినీషవో యాః
సముపయయుః కమనీయతాగుణేన
మదనముపదధే స ఏవ తాసాం
దురధిగమా హి గతిః ప్రయోజనానామ్   (10-40)

అప్సరసలు తమ అందంతో అర్జునుణ్ణి
వశం చేసుకోతలచారు. కాని అర్జునుడే
వారిలో మన్మథ భావాల్ని కలుగజేశాడు
నిజంగా మన ప్రయోజనాల పరిణామం
ఎట్లా ఉంటుందో తెలుసుకోవటం కష్టమే.
అర్జునుని వశం చేసుకోవటానికి బదులు
తామే అతని వశమైనారని భావం.





No comments:

Post a Comment