Sunday, May 27, 2018

నివేదిక: సంస్కృత సంగోష్ఠి


నివేదిక: సంస్కృత సంగోష్ఠి



సాహితీమిత్రులారా!




ఈ నివేదికను ప్రతి భారతీయుడు చదవాలనే దానితో
మన పాఠకులకు అందుబాటులో ఉంచడం జరిగింది
తప్పక చదవగలరని ఆశ............

భవన్స్ వివేకానంద కళాశాల భాషావిభాగ ప్రాంగణంలో జనవరి 2018, 24-25 తేదీలలో సంస్కృత సంగోష్ఠి నిర్వహించబడింది. సంగోష్ఠి విషయాంశం: ఆధునిక కాలంలో సంస్కృత సాహిత్యం యొక్క ఆవశ్యకత, ఆచరణీయత.


విస్తారమైన సంస్కృత సాహిత్యంలో లభిస్తున్న అనేక శాస్త్ర, సామాజిక గ్రంథాలలోని వివిధ అంశాల మీద దృష్టి సారిస్తూ, వాటి ద్వారా ప్రస్తుత కాలంలోని మేధోస్థాయిని పెంచుకోడం మానవాళికి ఎలా ఉపయోగకరమనే విషయం మీద అనేక శోధపత్రాలు, విశేషజ్ఞుల అభిప్రాయాల మేళవింపుతో ఈ సంగోష్ఠి ఆసక్తికరంగా సాగింది. బెంగళూరు, చెన్నై, కాకినాడ, విశాఖపట్టణము, తిరుపతి, కొవ్వూరు, రాజమహేంద్రవరము మొదలైన విభిన్న ప్రాంతాల నుంచి మరియు జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి అధ్యాపకులు, పరిశోధకులు విభిన్న అంశాలకు సంబంధించిన 47 పరిశోధనా పత్రాలను సమర్పించారు.

మొదటిరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృతవిభాగాధ్యక్షులు ప్రొ. ఎ. రాములు అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ విశ్రాంత డిజిపి డా. కె. అరవిందరావు విశిష్ట అతిథిగా వ్యవహరించారు. జీయర్ ఇంటెగ్రేటెడ్ వైదిక అకాడమీకి చెందిన వైదిక సంశోధన ప్రచురణ విభాగాధ్యక్షులు ఎస్. వి. రంగరామానుజాచార్యులు కీలకోపన్యాసం చేశారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎయిర్ కమోడోర్ జె. ఎల్. ఎన్. శాస్త్రి, ప్రధానోపాధ్యాయులు ప్రొ. వై. అశోక్ పాల్గొన్నారు.


రెండవరోజు అంతిమ సమావేశానికి శ్రీరాజరాజేశ్వర సంస్కృత కళాశాల విశ్రాంత న్యాయోపన్యాసకులు మహామహోపాధ్యాయ నల్లగొండ పురుషోత్తమ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంస్కృతభారతి నుంచి శ్రీ ఎ. ఆర్. ఎస్. ఎస్. బాలాజీ ఆతిథ్య ఉపన్యాసం ఇచ్చారు. ఉస్మానియా బోర్డ్ ఆఫ్ స్టడీస్‌కు చెందిన సంస్కృతభాషావిభాగాధ్యక్షులు డా. విద్యానంద్ ఆర్య నిర్ణేతగా వ్యవహరించారు. ఈ ద్విదిన సంగోష్ఠిని కళాశాల భాషావిభాగ్యాధ్యక్షులు శ్రీమతి సి. కామేశ్వరి, సంస్కృతోపన్యాసకులు శ్రీమతి మీనారాణి, వారి విద్యార్థి బృందం ప్రశంసార్హమైన నిబద్ధతతో అంకితభావంతో సమయపాలనతో నిర్వహించారు. ఈ రెండు రోజుల సంగోష్ఠి లోని కీలకోపన్యాసములు, పత్రసమర్పణలు, సమర్పించిన పత్రములపై వక్తల అభిప్రాయములు సంస్కృతభాషలోనే జరగడం అత్యంత ఆనందదాయకమైన విషయం.

సమర్పించిన పత్రాల వివరాలు
వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పరిశోధకులు మొత్తం 47 పత్రాలను సమర్పించారు. రెండు వేదికల మీద ప్రసంగాలు, చర్చలు ఆసక్తికరంగా సాగినాయి.

1. సంస్కృత విజ్ఞానము
చిన్మయవిద్యాలయ నుంచి వచ్చిన దత్తసాయి భౌగోళిక విషయాల్లో భాగంగా భాస్కరాచార్య విరచిత సిద్ధాంతశిరోమణి గ్రంథంలోని గురుత్వాకర్షణ శక్తి గురించిన విషయాలను వివరించారు.

ఆకృష్టి శక్తిస్తు మహీ యత్ స్వస్థమ్ గురు స్వాభిముఖమ్ స్వ శక్త్యా।
ఆకృష్యతే తత్ పతతీవ భాతి సమే సమంతాత్క్వ పతత్వియం ఖే॥ (సి.శి.-1114 AD)

భూమి యందు ఆకర్షణశక్తి గలదు. తన ఆకర్షణశక్తితో భూమి పదార్థాలను తనవైపు లాగుతుంది. ఆ పదార్థాలు ఆ ఆకర్షణశక్తివల్లనే భూమి మీద పడతాయి. ఆకాశంలోని వివిధ గ్రహాల ఆకర్షణ శక్తుల వల్ల సమతుల్యత నిలిచియుంటుంది.

ఆర్యభట్టు యొక్క సూర్యకేంద్రిత సిద్ధాంత విషయంలో గ్రహాలు స్వంత కక్ష్యలో వర్తులాకారంలో పరిక్రమించడాన్ని గురించి ప్రస్తావించారు.

కక్ష్యా ప్రతిమండలగా భ్రమంతి సర్వే గ్రహాః స్వచారేణ।
మందోచ్చాదనులోమం ప్రతిలోమశ్చైవ శీఘ్రోచ్ఛాత్॥
                                       (ఆర్యభటీయం –కలాక్రియాపాదః -3.17) 499AD.

ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుందో బృహద్ సంహితా అనే గ్రంథంలో ఉన్నదని చూపించారు.

సూర్యస్య వివిధవర్ణాః పవనేన విఘట్టితాః కరాః సాభ్రే।
వియతి ధనుః సంస్థానాః యే దృశ్యంతే తదింద్రధనుః॥ 
                                             (బృహద్ సంహితా – 35 అధ్యాయః)

భ్రుగు సంహితలో రవాణా ముఖ్యంగా మూడు విధాలని, నౌకాయానం, భూయానం, ఆకాశయానమని వివరిస్తూ, 16 భిన్న రకాలైన విమానాల నిర్మాణం, ఉపయోగాల గురించి వివరించారు. వాటి పేర్లు – ఉష్మంభార ఉష్మపా ఉష్మహనో రాజామ్లతృంగవీరహా పంచాఘ్నో అగ్నితృంగభారహనశీతాహ్నో విషంభర విశల్యకృత్ విజమిత్రో వాతామిత్రశ్చేతి।

రక్తప్రసరణం గురించి –

హృదో రసో నిస్సరతి తస్మాదేతి చ సర్వశః ।
సిరాభిహ్రుదయం వైతి తస్మాత్తత్ప్రభావాః సిరాః ॥
                                                               (భేలా సంహితా-20-3)

కృత్రిమ గర్భధారణ గురించి (టెస్ట్ ట్యూబ్ బేబీ) –

సత్రే హ జాదావిషితా నమోభిః కుంభే రేతః సిషిచతుః సమానమ్।
తతో హ మాన ఉదీయా మధ్యాత్ తతో జాతమృషీ మాహుర్వశిష్ఠమ్॥
                                                                          (ఋగ్వేదః – 7.33.13) (4)

గణితానికి సంబంధించిన పింగళసూత్రం-
గాయత్రే షడ్సంఖ్యాంమర్ధే పనీతే ద్వయంకే అవశిష్ఠస్త్రయస్తేషు 
రూపమపానీయ ద్వయాంకాధః శూన్యం స్థాప్యమ్”
 (పింగళాచార్యాః , చంద్రశాస్త్ర – 200 బిసి.)-
తదితర విషయాలను వివరించారు.

2. ఆరోగ్యవృద్ధికి తోడ్పడే భారతీయభోజనవిధి
సంస్కృత అకాడమీ నుంచి డా. సంతోష్ కుమార్ జోషి గారు ఆహారస్వీకరణ గురించి సంస్కృతగ్రంథాల్లోని ప్రముఖ చర్చలను ప్రస్తావించారు. వాగ్భటుని అష్టాంగహృదయంలోని ఎనిమిదవ అధ్యాయంలో జఠరాగ్ని గురించిన చర్చను, తొమ్మిదవ అధ్యాయంలోని ఆహారసమయంలో నీరు త్రాగే పద్ధతులను వివరించారు.

భోజనాదౌ పిబేత్తోయమగ్నిసాదం కృశాంగతామ్।
మధ్యేచాగ్నిం వివర్ధేత అంతే శ్రేష్ఠం రసాయనమ్॥

(భోజనం ముందు, మధ్యలో కాకుండా చివరలో ద్రవ్యాలు తీసుకోవాలి.)

అత్యంబుపానాన్నవిపచ్యతేన్నమ్। (నీరు ఎక్కువ త్రాగడం జీర్ణానికి ఉపయోగపడదు.)
అనంబుపానాచ్చ స ఏవ దోషః। (నీరు తక్కువ త్రాగడం కూడ సరికాదు.)

నాదేయం కౌపం చ జలం మేళయిత్వా న పిబేత్ ఏకమేవ నద్యా వా కూపస్య.
(నదీ, బావుల జలాన్ని కలిపి త్రాగడానికి వాడకూడదు.
ఏదో ఒకదాన్నే వాడడం మంచి పద్ధతి.)

అశ్వచాలనాది వ్యాయామోత్తరకాలం న పిబేత్ జలమ్। 
(గుఱ్ఱపుస్వారీ వంటి వ్యాయామాలనంతరం వెంటనే నీరు త్రాగరాదు.)

అతి తృషితోఽపి న బహు పిబేత్ । ముహుర్ముహుః వారి పిబేత్। 
(అతిగా దాహం వేస్తున్నప్పుడు ఒక్కసారే అధిక జలం తీసుకోరాదు. కొద్దికొద్దిగా త్రాగవలెను.)

విరుద్ధ ఆహార పదార్థాల కూడని మేళవింపులను గురించి వివరిస్తూ-

రంభాఫలం త్యజేత్ తక్రదధిబిల్వఫలాన్వితమ్.
(పెరుగు, మజ్జిగలతో అరటిపండును కలిపి తినరాదు.)

కృతాన్నం చ కషాయం చ పునరుష్ణీకృతం త్యజేత్
( వండిన పదార్థాలను, కషాయాలను తిరిగి వేడిచేయరాదు.)

ఏకత్ర బహుమాంసాని విరుధ్యంతే పరస్పరమ్ (ఒకేసారి విభిన్న మాంసాలను తినరాదు)
మత్స్యానూపమాంసం చ దగ్ధయుక్తం వివర్జయేత్. (చేపలను పాలతో కలిపి తినరాదు.)

చారుచర్య అను గ్రంథంలోని భోజన వేళలను, విధులను, భోజన పాత్రలను గురించిన శ్లోకాలను, స్వర్ణమయపత్రాణి(పైత్యక్షోభనివారకం) రౌప్యపాత్రాణి (పైత్యప్రకోపం, శ్లేష్మహారకం) కాంస్యపత్రాణి(రక్తపైత్య హారకం) రమ్భాపత్రమ్ (కఫవాతహరః) పలాశపత్రమ్ (పైత్య శ్లేషవికారహరం ) – ఈ ఆకులలో తినడం వలన కలిగే లాభాలను వివరించారు. బ్రహ్మపురాణం లోని పంక్తి భోజన నియమాలను(టేబుల్ మానర్స్ వంటిది) వివరించారు.

గ్రసనావసరే తస్మాత్ కణో నావకిరేత్। (మెతుకులు వెదజల్లబడకుండా ఆహారం తీసుకోవాలి)
విశేషాన్ముఖవ్యాదానపపి న స్యాత్। కరాగ్రం ముఖే చాధికం న ప్రవిశేత్। (ఆవలింతలు కూడదు, వేళ్ళు మరీ నోటిలోనికి జొనిపి తినరాదు.)
ఇతస్తతో న పశ్యేత్ శనైః శనైః భుంజీత। (అటూ ఇటూ చూడకుండా నెమ్మదిగా భుజించాలి.)

ఆరోగ్యసంరక్షణార్థం కూడా జీవితంలో పాటించవలసిన నియమాలననేకం చెప్పారు.

అత్యాహారాద్భవేద్వ్యాధిరనాహారాద్బలక్షయః। (ఆహారం అధికం ఐతే వ్యాధి, అల్పం ఐతే బలక్షయము కలుగుతుంది.)
సమాహారాద్బలం సమ్యగాయుర్వర్ధనముత్తమమ్।। (సమతుల్య ఆహారం వలన ఉత్తమ బలము, ఆయుష్షు పెరుగుతుంది.)

ఏకశాయీ ద్విభోజీ చ షణ్మూత్రీ ద్విపురీషకః।
స్వల్పసంగమకారీ చ శతవర్షాణి జీవతి॥

3. ఉపనిషత్తుల్లోని విద్యావిధానాలు
ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కృష్ణచైతన్య పది ఉపనిషత్తుల్లోని విషయాలను క్లుప్తంగా వివరిస్తూ, వేదాంత విషయాలు మాత్రమే కాక వీటిలో సత్యాన్వేషణ, మానవసౌభ్రాతృత్వం గురించిన అంశాలను విస్తారంగా చర్చించబడినాయని తెలిపినారు.

ఈశావాస్యోపనిషత్ లో శ్లోకం గమనిస్తే
యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి|
సర్వభూతేషు చాత్మానాం తతో న విజుగుప్సతే॥ (ఈ. 6)

మానవజాతి జరుపుతున్న మారణహోమాలన్నిటికీ కారణమైనవి ఇతరులది తనకు కావాలన్న లోభము, ఇతరులపై ద్వేషము. అన్ని భూతాలలో (కేవలం మానవులలోనేకాదు) ఉన్నది ఒక్క ఆత్మనే , తనకు కలిగే నొప్పిని ఇంకొకరికి ఇవ్వకుండా ఉండగలగాలనే సూత్రం విస్తరించి బాల్యంనుంచీ వివరించగలిగితే శాంతి కోసం ప్రత్యేక ప్రయత్నాలవసరం రాదు. మనిషి మానవత్వం ఎదగడమే విద్య యొక్క పరమార్థం అనే అంశంలో ఏ విభేదాలకూ ఆస్కారం లేదు కదా.

కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః।
ఏవం త్వయి నాన్యతోఽస్తి న కర్మ లిప్యతే నరే॥ (ఈ.2)

ఏ కర్మ(పని) అయినా చేసేటపుడు అనుకూల, ప్రతికూల ఫలితాలకు సిద్ధంగా ఉండాలి అని బోధించే ఈ సూత్రం చక్కగా తెలుసుకోగలిగిన ఏ విద్యార్థీ చిరువయసులో ఆత్మహత్యల గురించి ఆలోచించడు.

కుతో వా ఇమాః ప్రజాః ప్రజాయంత ఇతి (ప్ర.1-3)

ఈ మొత్తం విశ్వం ఎలా ఆవిర్భావించింది వంటి శాస్త్రీయమైన ప్రశ్న, చర్చలను లోకానికి పరిచయం చేయవలసిన అవసరం ఉంది.

తమసోమా జ్యోతిర్గమయ (బృ.1.3.28)

చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించవలసి ఉందనే ఇటువంటి సత్యం సర్వకాలాలకూ అత్యావశ్యకమైన బృహద్విద్య.

అన్ని రకాల పాఠ్యపుస్తకాలలో వివరించి చెప్పవలసిన జీవనసూత్రాలివి.

4. బీజోత్పత్తి–భూమి నిరూపణం
చెన్నె రాణీ మేరీ కళాశాల సంస్కృతవిభాగ్యాధక్షురాలు డా. ఉమా మహేశ్వరి శార్ఙ్గధరుడు సేకరించిన శార్ఙ్గధరపద్ధతి అనే గ్రంథంలో రాజనీతి, ధనుర్వేదము, రసాయన, అర్థశాస్త్రము, ఔషధవిద్యలతో పాటు ప్రముఖంగా వృక్షాయుర్వేదమనే విభాగంలోని ఉపవన వినోదం అనే అధ్యాయంలో చెప్పబడిన బీజోత్పత్తి, భూమినిరూపణం, మొక్కల్లోని వైవిధ్యత, నాటు పద్ధతులు, బావులు త్రవ్వడం, బావులకై భూపరీక్ష, తరుచికిత్సలు మొదలైన అనేకవిషయాలను గురించి వివరించారు.

అడవులు, అనూపాలు, సామాన్యాలు అని భూమి మూడు వర్గాలుగా విభజింపబడినది. అందులో సారాన్ని, రంగును బట్టి తిరిగి ఆరురకాలుగా చెప్పబడింది. నాటు కాలము, నీరు పెట్టు పద్ధతులు, వృక్షరక్షణ మొదలైన విషయాలు వివరింపబడినవి.

దశపుత్రసమో ద్రుమః (ఉ.వి.5) – పునరుత్పత్తి అత్యంత ముఖ్యమైన అంశమైన ప్రాణికోటిలో ఈ విధంగా ఒక చెట్టును పెంచడం పదిమంది పుత్రులతో సమానం అన్న భావన బహుగొప్పది. ఏ చెట్లు నాటడం వల్ల నరకబాధలుండవో చెప్తూ కూడా పర్యావరణ పరిరక్షణ కు దోహదం చేస్తున్న ఈ క్రింది శ్లోకాలు గమనించదగ్గవి.

అశ్వత్థమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశచించిణీకాః।
కపిత్థబిల్వామలకత్రయం చ పంచామ్రవాపీ నరకం న పశ్యేత్॥

ఒకరావిచెట్టును, ఒక వేపచెట్టును, ఒక మర్రిచెట్టును, ఒక చించిణీక(?) వ్రుక్షాన్ని, ఒక వెలగచెట్టును, ఒక మారేడు చెట్టును, మూడు ఉసిరిక చెట్లను, ఐదు మామిడిచెట్లను నాటి బావి ఏర్పాటుచేసి రక్షించేవాడికి నరకబాధ ఉండదు.

యస్తు సంరోపయేద్బిల్వం శంకరం ప్రీతి కారకమ్।
తత్కులేపి సదా లక్ష్మీః సంతిష్ఠేత్పుత్రపౌత్రికీ॥ (ఉ.వి.9)

శంకరునికి ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షాన్ని నాటి సంరక్షించడం వలన ఆ వంశంలో ధనము, పుత్రపౌత్రాదులు ఎప్పటికీ ఉండడం జరుగుతుంది.

సమ్యక్కృష్టే సమే క్షేత్రే మాషానుప్త్వా తిలాంస్తథా।
సునిష్పన్నానపనయేత్తత్ర బీజోప్తిరిష్యతే॥ (ఉ.వి.50)

పాలను, తిలాభస్మాన్ని గోమయాన్ని బీజరక్షణకు ఉపయోగించే విధానం చెప్పబడింది.

హేమంతే శిశిరే దేయం జలం చైకాంతరే దినే।
వసంతే ప్రత్యహం గ్రీష్మే సాయం ప్రాతర్నిషేచనమ్॥ (ఉ.వి.72)

వర్షాసు చ శరత్కాలే యదా వృష్టిర్న దృశ్యతే।
తదా దేయం జలం తజ్ఝైరాలబాలే మహీరుహమ్॥ (ఉ.వి.73)

హేమంత శిశిరాలలో రోజు విడిచి రోజు, వసంతం లో రోజూ, గ్రీష్మంలో రోజుకు రెండు సార్లు పొద్దున, సాయంత్రం, వర్ష, శరత్ ఋతువులలో వర్షం లేదనుకున్నపుడు మాత్రం నీళ్ళు పట్టాలి.

ఇంకా పిడుగులు పడినపుడు చెట్లరక్షణ, చెట్లు పెద్దగా పెరగడానికి వలసిన పద్ధతులన్నీ చర్చించబడినాయి.

5. పాండులిపిలో (మాన్యుస్క్రిప్ట్) లభ్యమౌతున్న ప్రాచీన రచనలు.
తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి చెందిన పరిశోధకులు రాహుల్ దేబ్ హల్దార్ పాండులిపిలో ఉన్న రచనల సంరక్షణ, శాస్త్రపరిశోధనలో వాటి ప్రాముఖ్యతలు, వినియోగాల ఆవశ్యకతను గురించి వివరించారు.

హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్
తత్త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే ॥ (ఈ.15)

ఆవరించిన భ్రమలను తొలగించి సత్యావిష్కరణ చేయడానికి శోధన అవసరం.

ఇదివరకు లేని నూతనతథ్యాల ఆవిష్కరణలకు, ఇప్పటికే ఉన్నసిద్ధాంతాల పునర్మూల్యాంకనకు పరిశోధన అనేది నిరంతరం జరుగవలసి ఉంటుంది. పునర్మూల్యాంకనకు లభ్యమౌతున్న ప్రాచీన గ్రంథాల మూల ప్రతులను వాటి పాండులిపి (మాన్యుస్క్రిప్ట్-చేతివ్రాత)లను సాకల్యంగా, లోతుగా పరిశీలించడం ఈ ప్రక్రియలో ముఖ్యమైన అంశం.

పాండులిపిలో రచనలు రాతిపలకలు, మట్టిపలకలు,చర్మపత్రాలు, తాటియాకులు, భూర్జపత్రాలు, చెక్కపలకలు మొదలైన వాటిలో లభ్యమౌతున్నవి. ఆకారాన్ని బట్టి గండీ, కచ్ఛపీ, ముష్టీ, సమ్ముటఫలకమ్, ఛేదపాటీ అనే రకాలు, లేఖనశైలిని బట్టి త్రిపాఠః, పంచపాఠః, శుండాకారః, సచిత్రపుస్తకం, స్వర్ణాక్షరలిపి, రజతాక్షరలిపి, సూక్ష్మాక్షరలిపి, స్థూలాక్షరలిపి అనే వర్గాలున్నాయి.

పాండులిపిలో ఉన్న వాఙ్మయపరిశోధన క్రింది విషయాలలో జరుగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

వైదిక లౌకిక దర్శనవాఙ్మయము
గ్రంథాల సమీక్షాత్మకాధ్యయనము
మాతృకాసంపాదనము
సంస్కృతవిద్వాంసుల వ్యక్తిత్వము
పరిశోధనకు అవకాశమున్న నూతన క్షేత్ర ఆవిష్కరణ.
బ్రాహ్మీలిపిలో ఉన్న ఉత్తర, దక్షిణ బ్రాహ్మీలిపి, వాటిలోని ఉపవర్గాల గురించి కూడా వివరంగా చర్చించబడింది.

సత్యనిర్ధారణకు మూలగ్రంథాల పరిశోధన, అందుకు మూలగ్రంథాల పరిరక్షణ చాలా అవసరమని నిర్ధారించిన పత్రమిది.

6. కాకతీయకాలంనాటి నృత్తరత్నావళి
వరంగల్ ఎస్. వి. ఎస్. ఎ. పీజీ కళాశాలనుంచి ప్రకాష్ పేరిణి నృత్యం గురించి జాయపసేనాని విరచిత నృత్తరత్నావళి అను సంస్కృతగ్రంథం నుంచి ప్రస్తావిస్తూ, యుద్ధకాలాలలో సైన్యం యొక్క ఉత్సాహ వర్ధనానికై శాస్త్రీయంగా రూపొందించిన పద్ధతులను గురించి వివరించారు.

కాకతీయుల కాలంలో సంస్కృత సాహిత్యం కూడా ఇతోధికంగా ప్రజాదరణ పొందింది. విద్యానాథుని ప్రతాపరుద్రయశోభూషణం, రెండవ ప్రతాపరుద్రుని యయాతి చరితం, ఉషారాగోదయం, వీరభల్లట దేశికుని నాట్యశేఖరమ్, గంగాధర కవి యొక్క రాఘవాభ్యుదయః, చంద్రవిలాసః, మహాభారతనాటకమ్, నరసింహ కవి యొక్క కాదంబరీ నాటకమ్, వేదాంతదేశికుని యాదవాభ్యుదయః, అగస్త్యుని బాల భారతమ్, గంగాదేవి యొక్క మధురావిజయమ్ మొదలైనవి రచింపబడినాయి. ప్రతాపరుద్రీయంలో చెప్పబడినట్లు విద్యానాథుని కాలంలో 200 మంది సంస్కృతకవులుండేవారని, లలితకళల ప్రయోజనం గురించి వివరిస్తూ భరతముని ప్రణీత నాట్యశాస్త్రంలో ఉన్న నాట్యం యొక్క ఉద్దేశ్యాన్ని చెప్పే శ్లోకాన్ని ఉటంకించారు.

దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినామ్
విశ్రాంతిజనం కాలే నాట్యమేతద్భవిష్యతి॥

దుఃఖితులకు, శ్రామికులకు, శోకార్తులకు, తపస్విజనులకు, నాట్యం విశ్రాంతి నిస్తుంది.

ప్రస్తుతాంశం జాయసేనాపతి విరచిత నృత్తరత్నావళి మొత్తం ఎనిమిది అధ్యాయాలు కలది. మొదటి నాలుగధ్యాయాలు మార్గ వృత్తి, చివరి నాలుగధ్యాయాలు దేశివృత్తి నాట్యలక్షణాలను వర్ణిస్తాయి.

రంగభూమి (వేదిక) పై ప్రవేశం గురించి-

సమపాదేన వా తిష్టన్ భుజంగత్రాసితేన వా।
కృతే యవనికాక్షేపే సతి రంగభువం విశేత్॥

రాసకనృత్తమ్ లో నాయికల నృత్యం గురించి-

బంధం పిండ్యాదిమాశ్రిత్య యస్మిన్ షోడశనాయికాః।
నృత్యంతి ద్వాదశాష్టౌ వా రాసకం తత్ ప్రకీర్తితమ్॥ (12)

రాసకనృత్త వస్త్రధారణ-

చేలమధోరుక్తం యద్వా కూర్పాసం కంచుకం తథా।
ధార్మిల్లం వేణికాం వాపి తత్తద్దేశానుసారతః॥ (13)

కందుకనృత్తమ్ గురించి-

దత్వాఽన్యాసాం నిజాన్ గృహ్ణత్యః పరతః పరాన్।
మిథో వినిమయేనైతాన్ స్వీకుర్యత్యః కదాచన॥
నృత్యంతి వనితా యత్ర తత్ స్యాత్ కందుక నర్తనమ్ । (17)

పత్రసమర్పణల అనంతరం ప్రసంగించిన వక్తలు ఇప్పటికే సంస్కృతంలో ప్రామాణ్యంగా భావించి వివిధ భాషల్లోకి అనువదింపబడి, దేశవిదేశాలకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పరిశోధనకు ఆధారంగా తీసుకోబడిన/బడుతున్న విషయాంశాలు మాత్రమే కాకుండా, భారతీయసమాజానికే విశిష్టత అయినటువంటి ఆత్మానాత్మ వివేకానికి సంబంధించిన అంశాలను పరిశోధకులు స్వీకరించి, నేటి కాలపు వైచారికతలో వాటిని ప్రతిక్షేపించవలసి ఉంటుందని సూచించారు. ఇంకా సంస్కృతగ్రంథాల్లోని ధర్మచర్చ, నైతికబోధ, భాషరమ్యత, స్వచ్ఛభారత కల్పన, ఆధునిక పరికరాలతో చేరువవుతున్న సంస్కృతం, నాటి కాలపు స్త్రీ సాధికారత, గురుపరంపర, గరుడ-భాగవత-మార్కండేయ పురాణాల్లో వర్ణింపబడిన గర్భస్థపిండాభివృద్ధి శిష్యలక్షణాలు వంటి అనేక విషయాంశాలతో పత్ర సమర్పణలు సరళసంస్కృతంలో సాగినవి. అంశాన్ని పరిచయం చేయడంలోనే కొందరు పత్రసమర్పకులకు ఇచ్చిన సమయం ముగిసిపోవడం విచారకరం. పత్రసమర్పకులు ఇచ్చిన సమయంలో ప్రముఖ అంశాలను తమ ప్రసంగంలో తెలిపేందుకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదనిపించింది.


భౌతిక విషయ పరిశోధనలోని ప్రాథమిక ఆధారజ్ఞానం ఇతర సమాజాలలోని అదే జ్ఞానానికి ప్రత్యామ్నాయంగా సంస్కృత గ్రంథాలలో బలంగా నిలబడుతూ వైజ్ఞానిక రంగం యొక్క ఆమోదాన్ని పొందింది. అయితే ఇతర భాషా గ్రంథాలలో చర్చింపబడని ఉపవాస విధి, ప్రదక్షిణ వంటి కొన్ని విశేషాంశాలు ఆధ్యాత్మిక ఔన్నత్యానికి, విశ్వమానవశ్రేయస్సుకు సంబంధించినవి సాధికారకంగా నిరూపించడం సంస్కృత పండితుల, పరిశోధకుల తక్షణ కర్తవ్యమని దిశానిర్దేశం చేశారు. సమర్పించిన అన్ని పత్రాలతో సచిత్రకంగా శోధపత్రసంకలనం విడుదల జరిగింది.

సమర్పించిన పత్రాల విషయాంశాల వైవిధ్యత, భాషాశుద్ధి మరి ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకొని తొమ్మిదింటిని ఎన్నికచేసి, ఆయా పత్రసమర్పకులను తమ పరిశోధనలోని కీలకాంశాలను తిరిగి క్లుప్తంగా సమర్పించమని కోరినారు. ఆ కార్యక్రమమంతా వీడియోరికార్డ్ చేసి వాటిలో అధ్యాపక రంగ పత్రసమర్పకులకు ఒకరికి, పరిశోధక రంగ పత్రసమర్పకులకు ఒకరికి ఉత్తమపత్ర బహుమతి ప్రదానం చేసినారు.

భవిష్యత్తులో మరింత పరిశోధన, జరుగవలసిన అధ్యయనం గురించి సంస్కృతపండితుల దృష్టిని ఆకర్షించి ఈ సంగోష్ఠి విజయవంతమైనదని చెప్పవచ్చు.
-------------------------------------------------------
రచన: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి, ఈమాట సౌజన్యంతో...

1 comment:

  1. రాజు గారు !! అద్భుతమైన విషయాలు పంచారు. ధన్యవాదములండి. కానీ.... శ్లోకాలలో చాలా అక్షరదోషాలున్నాయండి. ఉదా: సరిచేసిన కొన్ని శ్లోకాలని క్రింద ఇస్తున్నాను !!
    *ఆకృష్టి శక్తిస్తు మహీయత్ స్వస్థం గురు స్వాభిముఖమ్ స్వశక్త్యా |*
    *ఆకృష్యతే తత్ పతతీవ భాతి సమే సమన్తాత్వ చ పతత్యయం రవేః ||*

    *కక్ష్యా ప్రతిమణ్డలగాభ్రమన్తి సర్వే గ్రహాః స్వచారేణ |*
    * మన్దోచ్చాదనులోమం ప్రతిలోమఞ్చైవ శీఘ్రోచ్చాత్ ||*
    (ఆర్యభటీయం – కాలక్రియాపాదః-3.17 – 499 A.D.)
    The mean planets move on their orbits and true planets in the eccentric circles
    (అసాధారణ వర్తులాకార కక్ష్య). All the planets whether moving on their orbits or in eccentric circles move with their own motion, anti-clockwise from their *apogees (భూమి నుంచి ఉండే అత్యధిక దూరం)* and clockwise from their *perigees(ఆకాశమందు గ్రహపథములో యితర గ్రహములకన్న భూమికి సమీపముగా ఉండే ప్రదేశము)*.

    *సూర్యస్య వివిధవర్ణాః పవనేన విఘట్టితాః కరాః సాభ్రాః |*
    *వియతి ధనుః సంస్థానాం యే దృశ్యంతే తదింద్రధనుః ||*
    (బృహద్ సంహితా - వరాహమిహిరుడు - 35 అధ్యాయః {ఇన్ద్రాయుధలక్షణాధ్యాయః})
    *భావము:-* ఆకాశం మేఘావృతమై ఉన్నపుడు, గాలి వలన చెదిరిన సూర్యుని వివిధ వర్ణ కిరణాలు, ధనురాకారంగా గోచరించి ఇంద్రధనుస్సుగా పేర్కొనబడతాయి. (ఇక్కడ- పవనేన (గాలి వలన చెదిరిన) అనే పదాన్ని కిరణాల విశ్లేషణ అనే అర్థంలో స్వీకరించాలి)

    ... *ఉష్మంభర ఉష్ణపా ఉష్ణహనో రాజామ్లతృంగవీరహా* *పంచాగ్నో అగ్నితృంగభారహనశీతాహ్నో విషంభర విశల్యకృత్ విజమిత్రో వాతామిత్రశ్చేతి |*

    *హృదో రసో నిస్సరతి తస్మాందేవ చ సర్వశః |*
    *సిరాభిహృదయం చైతి తస్మాత్తత్ప్రభవాః సిరాః ||*
    (భేలా సంహితా-20-3)

    *కృత్రిమ గర్భధారణ గురించి (టెస్ట్ ట్యూబ్ బేబీ)...*
    *సత్రే హ జాతావిషితా నమోభిః కుంభే రేతః సిషిచతుః సమానమ్ |*
    *తతో హ మాన ఉదీయాయ మధ్యాత్తతో జాతమృషిమాహుర్వసిష్ఠమ్ ||*
    (ఋగ్వేదః – 7వ మండలం. 33వ సూక్తం. 13వ మంత్రం)

    ReplyDelete