Wednesday, May 23, 2018

కవిత్వం, ఆధునికత, సాహిత్యం - 2


కవిత్వం, ఆధునికత, సాహిత్యం - 2





సాహితీమిత్రులారా!


మనం - "కవిత్వం, ఆధునికత, సాహిత్యం"అనే వ్యాసాన్ని
చూచాం. దానికొనసాగింపు రెండవ భాగం ఈ రోజు గమనించండి
దీన్ని ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు వ్రాశారు
అంతర్జాలమాసపత్రిక ఈమాటలో నవంబర్ 2002న
ఈ వ్యాసం ప్రచురితమైంది. ఇక చదవండి......

ప్రసిద్ధమైన లేదా ప్రతిభావంతమైన ఏ రచనకీ ఇది ప్రాచీనం, ఇది ఆధునికం అన్న విలువ లేదు! కవిత్వం అన్నది గోదావరి నది లాంటిది. ఎక్కడో బ్రహ్మగిరి, త్రియంబకేశ్వరంలో పుట్టి చిన్న వాగులాగ ప్రారంభమై, ఒక కాలువలాగ పారి, ఒక పెద్ద నదిగా మారి, అది మహారాష్ట్రలోకి వెళ్ళకుండా, మరో మలుపు తీసుకొని, నేరుగా ఆంధ్రదేశంలోకి వచ్చి, అఖండ గోదావరి అయిపోవడం అనేది ఒక పెద్ద ప్రక్రియ జరిగింది. ఇందులో ఈ నది అనేకమైన వాతావరణాల్లోంచి, అనేకమైన బాహ్య దృశ్యాల్లోంచి ప్రయాణించుకుంటూ వచ్చింది. అదేవిధంగా, సాహిత్యం అన్నది కూడా, గోదావరి నదిలాగా, అనుస్యూతమైనది. అంటే, ఎడతెగని ఒక పరిపూర్ణ ధారగా ప్రవహిస్తూ ముందుకు వచ్చింది. అలాగే, ఇది ప్రాచీనం, ఇది ఆధునికం అన్న తేడాలు లేకుండా ఉంది సాహిత్యం. సాహిత్యం అన్నది సాహిత్యం, కానిది కాదు. ప్రముఖ కధకుడు రాచకొండ విశ్వనాధా శాస్త్రి గారు ఒక మాటనే వారు. కవిత్వం అనగా నేమి? దానికుండే లక్షణాలు ఏమి? అని మాట్లాడుతుంటే, చాలా సింపుల్‌గా “What is poetry  is poetry and what is not poetry is not poetry”  అనేవారు. నిర్వచనాల్లో కవిత్వం ఉండదు. కవిత్వంలో కవిత్వం ఉంటుంది. మనం మూడు వంతులు నిర్వచనాల్లో ఇరుక్కుపోయి అసలైన విషయాలకి దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కనక ప్రాచీనత ఆధునికత లేదా సమకాలీనత ఆధునికత వంటి విషయాలు పెట్టుకోటం అనేది కుదరనటువంటి విషయం. “ఇది ప్రాచీన సాహిత్యం కాబట్టి దీన్ని నేను ఆదరిస్తాను, ఇది ఆధునిక సాహిత్యం కాబట్టి దీన్ని నేను తిరస్కరిస్తాను, లేదా ఆధునిక సాహిత్యాన్ని మాత్రమే ఆదరిస్తాను, ప్రాచీనమైన సాహిత్యాన్ని నేను అంగీకరించను..” అని ముందుగా కొన్ని నిర్ణయాలు చేసుకోటం సరైన పద్ధతి కాదు. ఇది మొదటిగా జరిగే ప్రాధమికమైన అపోహ!

రెండవ అపోహ ఏమిటంటే పద్య కవిత్వం, వచన కవిత్వం లేదా గేయ కవిత్వం ప్రక్రియా భేదాల్ని బట్టి ఇది ఉత్తమమైనది, ఇది అధమమైనది అన్న అభిప్రాయాల్ని మనం తరచు చూస్తూ ఉంటాం! ఇటువంటి అభిప్రాయాల్ని ఎవరు, ఎందుకు ప్రచారం చేస్తారంటే ఒక ప్రక్రియని గాఢంగా అభిమానించినవారు, అంతకు మించినది మరొకటి లేదు అని గాఢంగా విశ్వసించిన వాళ్ళు దీని మీద ఉండే తీవ్రమైన అభిమానం మిగిలిన వాటిపై తీవ్రమైన అసంతృప్తిగా పరిణమించే అవకాశం ఉండటం వల్ల తరచు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి అభిప్రాయాలు, ఈనాడుఆనాడు అని కాకుండా, ఏనాడూ ఉన్నాయి.

కాళిదాసు ఒక అద్భుతమైన శ్లోకం రాసాడు. అది ఆయన రచించిన నాటక రచనల్లో మొట్టమొదటిది “మాళవికాగ్ని మిత్రం” అన్న నాటకంలోది. అగ్నిమిత్రుడనే రాజుగారు, వాళ్ళ అంతఃపురంలోకి అనుకోకుండా వచ్చి చేరిన ఒక అమ్మాయి, వాళ్లకి సంబంధించిన ప్రణయ నాటకం ఇది. ఆ నాటకం మొట్టమొదట్లో  “పురాణమిత్యేవ నసాధు సర్వం, నచాపి కావ్యం నవమిత్య వధ్యమ్‌, సంతః పరీక్ష్యాంతరత్‌ భజంతే, మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః ” అని. ఈ శ్లోకానికి అర్ధం “ప్రాచీనమైనది అంతా స్వీకరించతగినది కాదు. ఇది కొత్తది కదా అని దానిని తిరస్కరించటం లేదా ఉదాశీనంగా చూట్టం కూడా సరైన పద్ధతి కాదు.వివేకవంతులైన వ్యక్తులు, పరీక్షగా దాన్ని గురించి ఆలోచన చేసి, ఏది ఉత్తమమైనదో దాని పట్ల అభిమానాన్ని ప్రకటిస్తారు. ఈరకమైన విచక్షణతోటి ఆలోచించని వ్యక్తులు , ఇతరులు ఏది చెపితే దాన్ని నమ్ముతూ ఉంటారు”. తరవాత ఈమాటలే అలంకారికులు, సమర్ధులైన కవులు చెప్పారు. ఈ ఇతివృత్తం రచనకి పనికి వస్తుంది, ఇది పనికి రాదు అనేటువంటి విభేదాల్ని మన మొత్తం ప్రాచీన సాహిత్యంలో (అటు తెలుగులోకాని, ఇటు సంస్కృతంలో కాని) చూసుకుంటూ వస్తే, ఆధునిక సాహిత్యంలో కూడా అనేక ఉద్యమాలవల్ల ప్రభావితులైన వాళ్ళు కూడా ఏనాడూ ఈవిషయాన్ని మాట్లాడ లేదు. ఎందుకంటే, “లక్షణాన్ని చెబుతున్నాను, దీన్ని నేను నిర్వచిస్తున్నాను. ఇది నేను ఇలాగే ఉండాలని నిర్దేశిస్తున్నాను” అనేవారికి, ఒక రకమైన తర్కం ఉంటుంది. ఇలాంటి చోట మనోధర్మం కంటే, బుద్ధిధర్మం ఎక్కువగా పనిచేస్తుంది. కాని, సాహిత్యాన్నికాని, ఇతర కళలనుగాని, ఒక ఆర్ద్రమైన దృష్టితో చూసేటువంటి వాళ్ళు, దాన్ని స్వీకరించేటువంటి వాళ్ళు మనోధర్మం ఉపయోగిస్తారు. మనోధర్మంతో ఏకళనైనా చూడటం అనేది అత్యవసరమైన విషయం. అలా చూసిన రోజున, కాలసంబంధమైనటువంటివి గాని, ప్రక్రియా సంబంధమైనటువంటివి గాని, హద్దులుగా కాని, అడ్లుగాగాని మనకి కనపడవు.

ఇంకొక విచిత్రమైన పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. సాధారణంగా మనం “ఆధునికత సమకాలీనత” అన్న రెండు మాటల్లో చాలా పొరపాటు పడుతూ ఉంటాం! “అధున” అన్న సంస్కృత పదానికి “నేడు” అని అర్ధం. “సమకాలీనత”కి కూడా అర్ధం అలాగే కనపడుతుంది. కాని, కళాదృష్టితో ఈ రెండు మాటల్ని చూసినపుడు, దానికి ఒక చిన్న అర్ధచ్ఛాయ భేదం కనపడుతుంది. ఉదాహరణకి, కవిత్వం గురించి ఆలోచిద్దాం! ఈనాటి కాలంలో, పద్యరచన అనేది ఒక చిన్న ప్రక్రియ. కుటుంబ సంక్షేమం గురించి, చెట్ల పెంపకం గురించి, వాతావరణ కాలుష్య నివారణం గురించి పద్యాలు రాసి, “నేను ఆధునిక కవిని” అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆధునికం అంటే సమకాలీన సమస్యల్ని, ఉటంకిస్తూ, వచనంలో ఉండే విషయాన్ని, పద్యీకరించటం లేదా ఛందఃకరణం చెయ్యటం అని కొందరి అభిప్రాయం. కాని ఆధునికత అంటే ఇది కాదు!

“ఆధునికత” అనేది మన కాలంలో, మనం జీవిస్తున్నప్పుడు చెప్పబడేటువంటి విషయమే కాదు. ప్రతి కాలంలోనూ కొందరు ఆధునికులు ఉంటారు! నన్నయ్య కంటే తిక్కన్న, తిక్కన్న కంటే శ్రీనాధుడు, శ్రీనాధుడు కంటే పెద్దన్న, అతనికంటే దక్షిణాంధ్రాలో వచ్చిన ఒక చేమకూర వేంకట కవో, లేకపోతే ఆ పెద్దన్న గారి పక్కనే ఉండే రామరాజభూషణుడనే భట్టుమూర్తో ఆధునికులు అవుతారు. ఎందుకంటే ఎవళ్ళూ కూడా ఇంకోళ్ళా రాయలేదు. నిన్నటివాడి కంటే, భిన్నమైన దృష్టితోటి, ఒక కొత్త రచనా సంవిధానంతో, ఒక కొత్త విషయాన్ని ప్రతిపాదించడంతో, వాళ్ళు ముందుకు వచ్చారు. ఆధునికులు దీన్ని “సొంతగొంతు వెతుక్కోటం” అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకసారి ప్రముఖ మ్యూజిక్‌ కంపోజర్‌ రమేష్‌ నాయుడు గారితో పాట కంపోజింగ్‌లో, ఏదో కబుర్లు చెప్పుతూ మాట్లాడుతుంటే, ఒకతను వచ్చాడు. “నేను పాడతానండీ, సినిమాల్లో అవకాశం కావాలి” అన్నాడు. “నాయనా, నువ్వు ఏం పాడతావు?” అని నాయుడుగారు అడిగితే, “నేను ఘంటసాల లాగా పాడతానండీ” అన్నాడు. అందుకు సమాధానంగా రమేష్‌ నాయుడుగారు “బాబూ, ఘంటసాలగారే బతికున్నారు, ఘంటసాలగారిలాగా పాడక్కరలేదు, నీలాగ నువ్వు పాడే వసతి ఏమైనా ఉంటే చెప్పు, మనం ఆలోచిద్దాం” అన్నారు. అలాగే ఏ కాలంలో అయినా, నీలాగ నువ్వు ఏమైనా చెయ్యగలవా?

ఏ సందర్భంలో అయినా ప్రతి కళ వెనుక ఒక శాస్త్రం ఉంటుంది. చాలా నాటుగా చెప్పాలంటే,  సైకిల్‌ తొక్కటం నేర్చుకుంటే ఎలా వస్తుందో, పద్యం రాయటం కూడా నేర్చుకొంటే అలా వస్తుంది. అయితే, మామూలుగా ఉండే ఆవరణం, దానికుండే సాంకేతిక విషయాలు, ఎవరికైనా నేర్పగలం. కాని, దానికి మించిన మనో ధర్మం ఒకటి ఉంటుంది. ఆ మనోధర్మాన్ని వీటికి కలిపినపుడు మాత్రమే ఆ కళ నీసొంతంగా, నీకు సంబంధించిన ఒక ఆవిష్కృతి లేదా దాన్ని వ్యక్తం చెయ్యటంలో ఒక విశిష్టత కనిపిస్తుంది. చాలా మంది సంగీత విద్వాంసుల దగ్గర సంగీతం నేర్చుకుంటారు. మరి ఆంధ్రదేశంలో సంగీత విద్వాంసులు అనేసరికి ఒక వోలేటి వెంకటేశ్వర్లు గారో, ఒక నేదునూరి కృష్ణమూర్తి గారో, ఒక బాలమురళీకృష్ణ గారో లేదా దక్షిణదేశానికి వెళ్ళినప్పుడు మధురై శేషగోపాలం లాంటివాడో, ఎమ్‌. ఎస్‌. సుబ్బులక్ష్మి గారో, డి. కె. పట్టమ్మాళ్‌ గారో వాళ్ళ పేర్లే ఎందుకు గుర్తుకు వస్తాయి? కొన్ని వందలమంది సంగీత కళాశాలల్లోగాని, గురువుల వద్ద కానీ సంగీతం నేర్చుకొన్నారే? అని అంటే, ఆ నేర్చుకొన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, పాడే విధానంలో, ఆ రసాన్ని ఆవిష్కరించే విధానంలో, ఒక మనోధర్మాన్ని మనం వ్యక్తం చేసినప్పుడు ఆ కళ నీ”సొంతం” అవుతుందన్నమాట! ఆ సొంతం అవడం ఎప్పుడైతే ఉందో అది రెండు వందలేళ్లక్రితం అయినా కావచ్చు, ఈవాళ కావచ్చు, ఇంకో వంద సంవత్సరాలు పోయిన తరవాత కావచ్చు ఈ కళ అనేది అనుస్యూతమైన, ఎప్పటికప్పుడు కొనసాగే స్రవంతి అని అనుకుంటే, ఇందులో ఫలానా భాగం రైటు, ఫలానా భాగం రైటు కాదు, ఇది అంగీకార్యం, ఇది అంగీకారం కాదు అని అక్కడా లేదు! ఏ కళను మనం చూసినా, ప్రాచీన ఆధునిక భేదాలు కాని, లేదా ఈనాడు జరుగుతున్న విషయాన్ని నేను స్వీకరిస్తున్నాను కనుక ఇది ఆధునికం అని చెప్పడం సరి కాదు. “ఆధునికం” అంటే ఏమిటంటే, నీమనోధర్మాన్ని నిన్నటివాడికంటే, వేరేవిధంగా చెప్పడం అన్నమాట! ఆధునికం అన్నది కాలసంబంధం కాదు! ఆధునికత అన్నది మనోధర్మానికి సంబంధిించినది. ప్రబంధాల గురించి మనం అనేకం వింటూ ఉంటాం! ప్రబంధాలలో 18 వర్ణనలు ఉంటాయి. నాయికా, నాయకులు ఉంటారు. శృంగార రసం వర్ణింపబడుతుంది. ఇలా రొడ్డు కొట్టుడుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇది గతానుగతికంగా మనం చెప్పుకొనేది. కాని ప్రబంధయుగం మొత్తం పెద్దన్న గారిని మొదలుకొని దక్షిణాంధ్ర యుగంలో వచ్చిన చేమకూర వేంకట కవి, రంగాజమ్మ, ముద్దు పళని వరకు ఇలాగ 200 లేదా 300 ఏళ్ళు మనం వెళ్ళినట్టయితే, ఎవడిలాగ మరొకడు ఎప్పుడూ రాయలేదు. తరవాత భావకవులు వచ్చేసరికల్లా, వాళ్ళెవరూ ప్రబంధకవుల్లాగా ఇతి వృత్తాలు రాయలేదు. కనుక, కాలం మారుతున్నప్పుడు, కాలంలో అభిరుచులు మారుతున్నప్పుడు, కాలపరంగా ఇతర విషయాలు ప్రభావితం చేస్తున్నప్పుడు వాటిల్లో కళా సంబంధమైన అభిరుచుల వల్ల, కొత్త, కొత్త విషయాలు, కొత్త, కొత్త మార్పుల వల్ల, కొత్త మనోధర్మంతోటి సాహిత్యం చెప్పడం అనేది సంభవిస్తుంది.అప్పుడు అది నిన్నటి వాడికంటే భిన్నంగా కనిపిస్తుంది.ఆ కనిపించడంలో ఉన్న వైవిధ్యాన్ని మనం చూడాలిగానీ, నిన్నటిది చాలా గొప్పది, ఈవాళ వచ్చేటువంటిది కాదు అనే కాల సంబంధమైన నిర్ణయాల్తోటి మనం ఆలోచన చెయ్యకూడాదు.

క్రియేటివ్‌ ఆర్ట్‌ విషయంలో నువ్వేమిటి, నువ్వు సాంకేతికంగా నేర్చుకొన్నది ఎలా చెబుతున్నావు? అన్నది ముఖ్యం. మనకి చమత్కారంగా పద్యం రాయటం విషయంలో ఉన్న కవిత్వపు భ్రమల గురించి ఒక్కటి చెపుతూ ఉండేవారు. చాలా మందికి భ్రమేమిటంటే, ఫలానా ఆయన పద్యాలు రాస్తాడంటే ఆయన కవి అని! పద్యం రాయటం అంటే వచనంలో ఉన్న కొన్ని పదాల్ని ఛందస్సులోకి పెట్టటం అన్నమాట. ఏలూరులో నా మిత్రుడు ఒకడు, ఒక ప్రెస్‌ బోర్డు మీద ఒక రెండు లైన్లు రాయించాడు. “కలరు ప్రింటర్సు, బైండర్సు, కార్డుబోర్డు బాక్సుమేకర్సు, ఏలూరు, పవరుపేట” అని. ఈ రెండులైన్లు తేటగీతి పద్యపాదాలు. “ఆంధ్ర పత్రిక ఇచ్చట అమ్మబడును” శుభ్రమైన తేటగీతి పాదం ఇది. “కప్పులందున చేతులు కడుగరాదు” అది కూడా పద్యపాదమే! ఈ ఛందఃకరణం చెయ్యడం మాత్రమే కవిత్వం అయితే, అనేక విషయాలు కవిత్వం అవుతాయి. ఆయుర్వేద గ్రంధాలు పద్యాల్లో రాసిన వాళ్ళున్నారు. నీతి విషయాల్లో ఉత్తినే ఉండే స్టేట్మెంట్స్‌ పద్యల్లో చెప్పిన వాళ్ళున్నారు. ఇదే కనుక కవిత్వం అయితే, ఆంధ్ర పత్రిక ఎడిటోరియల్‌ కూడా కవిత్వమే అవుతుంది!
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment