Sunday, November 24, 2019

నాతి నోట నువ్వు గింజ


నాతి నోట నువ్వు గింజ




సాహితీమిత్రులారా!


నాతి నోటిలో నువ్వుగింజ నానదు,” అని నానుడి. అంటే, ఆడ కూతురు దగ్గర రహస్యం దాగదు అని అర్థం. రహస్యం దాచలేని సంగతి అలాఉంచి, నువ్వుగింజ నానదు అనెందుకన్నారో, నాకు ఇప్పటికీ బోధపడలేదు. నువ్వుగింజలు అలా నీళ్ళల్లో వెయ్యంగానే నాని పోవే? నువ్వుపప్పు, అవే తెల్ల నువ్వులు నల్లనువ్వులకన్నా కాస్త తొందరగా నానుతాయేమో! అంతే. నల్లనువ్వులు నోటిలో వేసుకోని చూశా. అవి నానటానికి చాలాకాలం పట్టింది. నీళ్ళల్లో వేసి కూడా చూశాను. అప్పుడు అవి ఏమీ తొందరపడలేదు, నానటానికి. అంతకన్నా పెసలు తొందరగా నానాయి. ఇది స్వానుభవం. మరి ఈ నువ్వుల నానుడి ఎలావచ్చిందో నాకు అంతుపట్టలేదు.

పోతే, ఆడవారు రహస్యం ఎంతమాత్రం దాచలేరు అన్న విషయం. ఆ కథ తరువాత చెపుతా. “ఇదిగో! ఏవమ్మోయ్! మళ్ళి ఎవ్వరితో అనబోకేం! నీకు ఒట్టేసి చెపుతున్నా,” అని చెప్పిన మరుక్షణమే ఆ రహస్యం మనోవేగంతో, ఏతత్బృందంలో జట్టుగాఉన్న ఆడవాళ్ళందరికీ, ఒకరినించి మరొకరికి, నోటిమాటగా చేరిపోతుంది. కాదు కాదు, జారిపోతుంది. ఆహా! తెలిసెన్ అనుకున్నా.

నా ఉద్దేశంలో, నువ్వుగింజ నానడం నానుడి, ఇలా సవరించాలి. ” నొటిలో నువ్వుగింజ ఆనదు,” అని. అంటే, జారి పడిపోతుందీ అని అసలు అర్థం. అయితే, ఆడవారికి రహస్యం చెప్పడంలో ఒక సుఖం ఉంది. ఎవరికి వారే, వాళ్ళొక్కళ్ళకే ఈ రహస్యం తెలిసినట్టు, అవసరమైతే గుట్టుగా ఉంచగలరు. అక్కడే, మగవాళ్ళకీ, ఆడవాళ్ళకీ ఉన్న పెద్ద తేడా. మగవాళ్ళు పబ్లిగ్గా, గ్రూపులో వాగేస్తారు. అందుకని, ఏ ముఖ్య రహస్యమూ మగవాళ్ళకే చెప్పకూడదు, ఎందుకంటే, వాళ్ళు బాకా రాయుళ్ళు కాబట్టి.

ఆడవాళ్ళు రహస్యం దాచలేకపోవడం అనే కథకి శ్రీమాన్ వేద వ్యాసుడు గారే కారణం.

మహాభారత యుద్ధం ముగిసింది. జ్ఞాతులు, సామంతులు, మొత్తం కురువంశం పాండవుల చేతిలో కృష్ణుడి చేతిచలవవలనా, స్వర్గస్థులయ్యారు. కర్ణుడి మరణంతో అసలు కథ ముగిసిందనే అనచ్చు.

శాంతి పర్వం ప్రారంభంలో, శోకవ్యాకులుడై పరితపిస్తున్న ధర్మరాజుకి, నారదుడు కర్ణుడి కథ యావత్తూ చెపుతాడు. కర్ణుడి పుటుక రహస్యం, అతనికి జరిగిన అన్యాయం, శాపాలు, వగైరా అన్నీ పూసగుచ్చినట్టు చెపుతాడు. ఇది వింటున్న కుంతి తాను ఎందుకు కర్ణుడి పుటుక గురించి ఏ శాపకారణంగా చెప్పలేకపోయిందో వివరిస్తూ, ధర్మరాజుని ఉపశమింప చేయ పోఓనుతుంది. ధర్మరాజుకి కుంతిపై కోపం వస్తుంది, అసహ్యం పుడుతుంది. కుంతి కర్ణుడి గురించి ఎంత బాధ పడిందో ధర్మరాజుకేం తెలుస్తుంది?

ధర్మరాజు చేత వేదవ్యాసుడుగారు పలికిస్తున్నాడు:

భవత్యా గూఢా మంత్రత్వాత్ పీడితో స్మిత్యువాచతాం
శశాప చ మహాతేజాః సర్వలోకేషు చ స్త్రీయాః
న గుహ్యం ధారయిష్యన్ తిత్యతి దుఃఖ సమన్వితః — 12.6.10

అంటే స్థూలంగా అన్వయం : నీవు (కుంతిని ఉద్దేసిస్తూ) ఈ రహస్యం దాచిపెట్టి ఇంత అనర్థం తెచ్చిపెట్టావు. అందుకుగాను ఇకముందు స్త్రీ జాతి అంతా, రహస్యం దాచలేని శక్తిహీనులుకావాలని శపిస్తున్నాను, అని.

తిక్కన గారు తెలుగులో చక్కటి తేటగీతిలో ఇదేవిషయం చెప్పారు.

అంగజానమ్ములకు రహస్య రక్ష-
ణంబునందలి శక్తి మనంబులందు
కలుగ కుండెడు మెల్ల లోకముల నని శ-
పించె నా ధర్మదేవతా ప్రియ సుతుండు. — 12.1.41

దీనికి తాత్పర్యం చెప్పడం అవమానించడమే అవుతుంది. ధర్మజుడి శాపకారణంగా నాటినుంచి, స్త్రిలు రహస్యం తమలో దాచుకోలేరుట. అది కథ.

ఈ శాపం కూడా ఒకందుకు మంచిదే. రహస్యాలు, అందులోనూ, యుద్ధ ప్రేరణకి వినాశానికీ తెరువైన రహస్యాలు, దాచకపోవడమే మంచిది కదూ! కుండ బద్దలుకొట్టి రహస్యాలు బయట పెడితే, అసలు యుద్ధాలు వచ్చేవే కావేమో! లేదా, అన్యాయంగా ఉత్తిపుణ్యానికే కాలుదువ్వి మొదలెట్టే యుద్ధాలు, స్త్రీ జాతి ఆపగలదేమో! అలా మొదలైన యుద్ధాలు స్త్రీలే అంతం చెయ్యగలరేమో, చూడాలి.
---------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment