Wednesday, August 31, 2016

పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు......


పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు......


సాహితీమిత్రులారా!

మన కవికోకిల కవితావిశారద గుర్రం జాషువాగారు
నవ్వును గూర్చి చెప్పిన పద్యం చూడండి

నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్
దివ్వెలు, కొన్ని నవ్వులెటుతేలవు, కొన్ని విషప్రయుక్తముల్,
పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైనవే
నవ్వులు, సర్వదుఖ:శమనంబులు, వ్యాధులకున్ మహౌషధుల్

చూడండి ఎంత సులభపదాలతో
నవ్వును చిత్రించాడో జాషువగారు

మైత్రి కావాలంటే ఇవిమానుకోవాలె


మైత్రి కావాలంటే ఇవిమానుకోవాలె


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి

వాగ్వాదం - అర్థసంబంధం- పరోక్షే దారభాషణమ్
యత్ర మిత్రత్వ మిచ్ఛన్తి తత్ర త్రీణి నకారయేత్

వాదనచేయటం
ధనసంబంధమును పెట్టుకోవడం
భర్తలేని సమయంలో భార్యతో మాట్లాడటం
అనే ఈ మూడు పనులు మైత్రికావాలంటే మానాలె

Tuesday, August 30, 2016

పెనిమిటిగని జారనవ్వు


పెనిమిటిగని జారనవ్వు


సాహితీమిత్రులారా!

ఒక కవిగారు చెప్పిన
ఈ చమత్కార పద్యం చూడండి.

అనిబారిన విధి నవ్వును,
ధనసంపద నవ్వు  నుచిత దానహీనున్
తనయుని ముద్దాడంగా
పెన్మిటిగని జారనవ్వు పిచ్చెయ రేచా!

ఓ పిచ్చయరేచా!
యుద్ధంనుండి పారిపోతే విధి నవ్వుతుందట.
ధనసంపదలతో ఉండి తగినరీతి దానం చేయనివాని
చూచి ధనం నవ్వుతుందట.
కొడుకును భర్త ముద్దాడుతుంటే, తన కొడుకేనని భ్రమతో
ఎంత ముద్దాడుతున్నడు అని జారస్త్రీ నవ్వుతుందట.

పంచప్రాణాలు ఎక్కడ ఉంటాయి?


పంచప్రాణాలు ఎక్కడ ఉంటాయి?


సాహితీమిత్రులారా!

మాట్లాడితే నా పంచప్రాణాలు నీవే అంటుంటారు కదా
అసలు పంచప్రాణాలు ఎక్కడ ఉంటాయి
ఈ శ్లోకంలో చూడండి

హృది ప్రాణో గుదే పాన: సమానో నాబి సంస్థిత:
ఉదాన: కంఠదేశస్థో వ్యాన: సర్వశరీరగ:

మన శరీరంలో ప్రాణవాయువులు ఐదు
వాటిని ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములు అంటారు.
అవి మన శరీరంలో హృదయంలో ప్రాణవాయువు,
గుదములో అపానవాయువు, నాభియందు సమానవాయువు,
కంఠంలో ఉదానవాయువు, శరీరమంతా వ్యానవాయువు ఉంటుంది.
ఇవి పంచప్రాణాలు ఉండే ప్రదేశాలు.

Monday, August 29, 2016

తన్నీరుగారి కన్నీరు తుడువగలమా?


తన్నీరుగారి కన్నీరు తుడువగలమా?


సాహితీమిత్రులారా!

పద్యం మీది ఆకాంక్షతో తెలుగుతల్లి ఆవేదనను
తన్నీరు బాలాజిగారి కలంకంటినుంచి స్రవించిన
వేదనాశ్రువులను చూద్దాం
అవి తుడువగలమో లేదో
తరువాత ఆలోచిద్దాం.

ఆంధ్రదేశంబున అద్దంకిసీమలో
       పండరంగ జనిత పసిడిబాల
నన్నయ కాలాన నడకలు నేర్వగ
        కవిబ్రహ్మ పలుకుల కమ్మనిసుధ
శ్రీనాథు నీడలో సిరిమువ్వ హొయలతో
       నాట్యమాడినయట్టి నవ్యతార
పోతనకలమున పొందుగఁ జారిన
         మందారమకరంద మరుల జాణ
ముక్కుతిమ్మనార్యు ముద్దు ముచ్చట్లతో
పెద్దనాది కవుల పేర్మితోడ 
పరిఢవిల్లె తెలుగు ప్రాబంధనాయిక
కృష్ణరాయఁజేరి కృపనుఁబొంద

ముత్యపు సరులతో మోదముఁబొందగ
        గురజాడవారిచే గూర్చఁబడియె
నండూరి ఎంకితో నాయుడుబావకు
       పాటలు నేర్పించి పరవశించె
శ్రీశ్రీ యొసగినట్టి చెంగావి వన్నెల
         సింగారపు ఝరీల చీరగట్టె
భావాభ్యుదయ మేలి పరిఫుల్లరూపమై
        విశ్వంభరాలలో వినుతికెక్కె
అన్యభాష పదాలకు స్తన్యమిచ్చి
నవల, నాటక చరితల నడతఁ బెంచి
తనరె పరిపూర్ణ రాశియై తనదు యింట
నేడు తెలుగమ్మకు నిలువ నీడలేదు

అలాంటి తెలుగుమ్మ ఇలా అంటూంది.

తల్లిపాలు త్రాగి తల్లిని మరచిన 
తల్లి రొమ్ము గ్రుద్దు తనయులార
మాతృక్షీర మధురిమలను మరచినారు
దాది ప్రేమ మాటు దాగినారు

ముదుసలియగు మీయమ్మను 
ముదుసలిశాలకు తరుమగ మురుతురు కొడుకా
ముదుసలియగు ఈ యమ్మను 
ముదసలిశాలకు తరుమగ మోదములేదే

ఆ తల్లి తెలుగు బిడ్డలను 
ఇలా ప్రాధేయపడుతూంది.

చేరదీయుము నన్ను మీసేవఁజేతు
ఆదరింపుము నన్ను మిమ్మాదరింతు
అమ్మప్రేమ, అమ్మనుడియు యమృతముగను
మాతృభాషను, మాతను మరువకెపుడు 

మాతృభాషాదినోత్సవశుభాకాంక్షలు


మాతృభాషాదినోత్సవశుభాకాంక్షలు


సాహితీమిత్రులారా!

మన మాతృభాష - తెలుగు. దాని వెలుగు ఎలా వెలుతోందో
మనందరికీ తెలుసు. కానీ మనం పండుగలు జరుపుతుంటాం.
మరచి పోతుంటాం. మరచిపోవటం మానవనైజం ఐక్యరాజ్యసమితివారు
చెప్పేదాకా మన భాష పరిస్థితి మనకు తెలియలేదా
అంటే మనం ఎంత గాఢనిద్రలో ఉన్నమో? వారు చెప్పేది చెప్పారు వినేది వన్నాం.
అయినా మానుకున్నామా మనపద్ధతి.
మానుకోం అదంతే కానీ కొందరు భాషాయావతో ఏదేదో రాస్తుంటారుకదా
కానీ కన్నీరు పెట్టరుకదా అసలు భాషకే ముప్పొచ్చిందని చెబుతుంటే
పద్యం పోయిందని కొందరు. గాయాలు చేసే గేయాలొచ్చాయని కొందరు.
మనపదాలే మరుగై పోతున్నాయని కొందరు
ఇలా వార్తల్లో చూస్తుంటే వీళ్ళకు పిచ్చిలే అని నవ్వికునే వారు కొందరు.
అలా అని మన ఉనికికే ప్రమాదమైందని తెలిసికూడా నిమ్మకు నీరెత్తిట్లు ఉండగలమా ?
ఏది ఏమైనా ప్రజలకోసమన్నా ఏదో కొంత చేయాలి అదే ఈ మాతృభాషాదినోత్సవం.
ఈ పండుగ అయిపోగానే మరీ పండక్కే మాతృభాష గుర్తుకు వస్తుంది.
ఇదంతా ఏమిటి? ఎందుకు? అంటే నేటి మన సమాజంలో బ్రతకటానికి
జీవనపోరాటానికి  ఆంగ్లంకావాలి. అదిలేకపోతే జీవనంలేని స్థాయికి పోయిందివాళ.
భాషను ప్రేమతో ప్రేమించేవారు లేరు ఉన్నా భాషాభిమానంవేరు జీవనవిధానం వేరు
దీనివల్లనే మనకు ఆంగ్లమాధ్యమ పాఠశాలల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.
దానికి ప్రభుత్వాలు కారణంకాదు ప్రజలే కాని ఒకవైపు ప్రభుత్వాలను అనడం
మనకు అలవాటేకదా!
మన అలవాటుగా చెప్పుకోవాలి కాబట్టి అందరికి
మాతృభాషాదినోత్సవశుభాకాంక్షలు

గిడుగు వ్యావహారిక అడుగు


గిడుగు వ్యావహారిక అడుగు

                                                                                    -అలంకారం విజయకుమార్

సాహితీమిత్రులారా!

సంస్కృత పదబంధాల గ్రాంథికభాషా సంకెళ్ళలలో బందీగా ఉన్న తెలుగును
వ్యావహారికభాషా ఉద్యమంతో పోరాడి సంకెళ్ళనుండి విముక్తికలిగించిన
భాషాభిమాని మన గిడుగు. వ్యావహారిక భాష పుస్తకాలలో పనికిరాదని
వాదించిన పండితులకు వ్యావహారికభాషలోని మాధుర్యాన్ని చవిచూపించినవాడు
మన గిడుగువారు.

మనం మాట్లాడే భాష పుస్తకాలుగా ఎందుకు పనికిరాదని
నిలదీసిన అడిగి పోరాడి గెలిచిన ఘనుడు గిడుగు ప్రాత: స్మరణీయుడు.
లిపిలేని సవర భాషకు లిపికూర్చి తన సమయాన్ని,
ధనాన్ని సర్యస్వాన్ని అంకితంచేసిన మహామనిషి
మన గిడుగువేంకటరామమూర్తిగారు.

100 సంవత్సరాల క్రితం గిడుగు చేసిన పోరాట ఫలితమే
నేటి మన పాఠ్యపుస్తకాలలోని జనసామాన్య భాష.
ప్రజల వ్యవహారంలో ఉన్నభాషే జీవభాషని
చాటిచెప్పిన మొదటివాడు గిడుగు.

తెలుగును ఇటాలియన్ ఆప్ ది ఈస్ట్ అనడమేగాని,
దేశభాషలందు తెలుగు లెస్స అనడమేగాని
తెలుగు వాడుక భాషలోని అసలుసిసలైన జాతీయనుడికారాల
మాధుర్యం వాడుక భాష వల్లనేకాని గ్రాంథికభాష వల్లకాదని బల్లగుద్ది
మరీ వాదించినవాడు గిడుగువారే.

గిడుగువారి జీవిత విశేషాలలోకెళితే
ఈయన 1863 ఆగష్టు 23న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో
వీర్రాజు, వెంకమ్మ అనే దంపతులకు జన్మించాడు.
విక్రమదేవ వర్మ వీరికి బాల్యస్నేహితులు. "నేను సంపాదించిన విద్యకు
మూలద్రవ్యమనదగిన భాషాజ్ఞానాన్ని భాషాభిమానాన్ని
నాకు కలిగించినవారు బొంతల కోడూరు "శిష్టి" కరణాలు-
 బైరాగి పట్నాయకులుగారు" - అని గిడుగువారు చెప్పుకొనేవారు.

మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో విజయనగరంలో
విద్యాభ్యాసం చేశారు. గురజాడ, ఆదిభట్ల వీరికి సహపాఠులు.
ఆ తర్వాత మెట్రిక్ పాస్ అయిన తరువాత
కలెక్టరాఫీసులో కొంతకాలం పనిచేసి,
పర్లాకిమిడి హైస్కూలులో చేరారు.
అక్కడ బి.ఏ. ప్రైవేటుగా చదవడం ప్రారంభించారు.
ఆయన తొలిసంతానం సీతాపతి 1885లో జన్మించారు.
అప్పటికి వారి బి.ఏ. పూర్తయింది. చిలుకూరి నారాయణరావుగారు
గిడుగువారి ప్రియ శిష్యులు. గిడుగువారిది ముక్కుసూటిగా పోయే వ్యక్తిత్వం.
చివరిలో వీరికి చెవుడు వచ్చిందట. గిడుగువారంటే అందరికీ భయమేనట.
ఈయన చివరికి 22 జనవరి 1940లో మరణించారు.

వ్యావహారిక భాషావాదాన్ని ప్రారంభించిన గిడుగువారు
 గ్రాంథిక భాషాద్వేషికాదు. ఆయన ప్రాచీన సాహిత్యంలో చదవని గ్రంథంలేదు.
తెలియని అర్థంలేదు - పదస్వరూపంలేదు.
గ్రాంథిక వాదులందరికంటే గొప్ప పాండిత్యం, భాషాధికారం గల గొప్ప
పండితుడు గిడుగువారు. అమోఘమైన జ్ఞాపకశక్తి కలవాడు.
ఇటువంటి వారి జన్మదినాన్ని మాతృభాషా దినోత్సవంగా
జరుపుకోవడం చాల సంతోషకరమైనది.
వారిని ఈరీతిగా మనం స్మరించుకొనే భాగ్యం మనకు దక్కింది.

చివరగా ఇక్కడ నార్ల చిరంజీవిగారి
ఒక చిన్ని పద్యాన్ని స్మరించుకుందాం

మధుర మధురమైన మనభాష కంటెను
చక్కనైన భాష జగతిలేదు
తల్లిపాలకంటె తనయునకేపాలు
బలమునీయగలవు తెలుగు బిడ్డ


అదొక్కటేకాదు ఇదికూడా ఉండాలె


అదొక్కటేకాదు ఇదికూడా ఉండాలె


సాహితీమిత్రులారా!


మంచి పేరు అందం ఉంటేచాలదు
దానికితోడు మంచి మనసు కూడా
ఉండాలండున్నాడు కవి నిజమేకదా!
కవి అన్యాపదేశంగా చెప్పిన
ఈ శ్లోకం చూడండి

దిఙ్మండలం పరిమళై: సురభీ కరోషి
సౌందర్య మావహసి లోచన లోభనీయం
అహో! రసాలఫలవర్య! తవాస్మిదూయే
యత్తుందిలంచ కఠినం హృదయం బిభర్షి

ఓ తీయ మామిడి ఫలమా!
నీ సువాసనతో దిక్కులు పరిమళించుచున్నవి.
బంగారు రంగుతో సుందరంగా ఉన్నావు.
కాని కఠినమైన పెద్దటెంకను మనస్సుగా ధరించటం
మాత్ర బాధగా ఉంది - అని భావం.

Sunday, August 28, 2016

ఎవరుమేలంటారు?


ఎవరుమేలంటారు?


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి
ఎంత చమత్కారంగా ఉందో!

వరం తస్కర సంబంధ: సుజనై: సహ సంగమాత్
తస్కరోహి హరత్యర్థం సాధుస్తు హృదయం హరేత్

సజ్జన సంబంధంకంటే
దొంగ సంబంధమే మంచిది
ఎందుకంటే దొంగ ధనాన్ని
మాత్రమే దోచుకుంటాడు
మరి సజ్జనుడో హృదయాన్నే
దోచుకుంటాడు.
మరి ఎవరి సంబంధం మేలంటారు?

ఏవి విషముతో సమానం?


ఏవి విషముతో సమానం?


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి.

అనభ్యాసే విషం శాస్త్రం
అజీర్ణే భోజనం విషమ్
దరిద్రస్య విషం గోష్ఠీ
వృద్ధస్య తరుణీ విషమ్


అభ్యాసము చేయనివానికి శాస్త్రం విషం
అజీర్ణంగా ఉన్నపుడు భోజనము(తినడమే)విషం
దరిద్రునికి మంచివిషయాలు వినడం విషం
ముసలితనంలో పడుచు పెళ్ళాము విషం

ఇవన్నీ విషాలే లేదా విషంతో సమానమైనవే.
వీటిలో కాదనేదేదైనా ఉందా?  లేదుకదా!

Saturday, August 27, 2016

ప్రాజ్ఞుల కిచ్చిన భాగ్య మబ్బదే?


ప్రాజ్ఞుల కిచ్చిన భాగ్య మబ్బదే?


సాహితీమిత్రులారా!


మనదేశంలో పొగాకు అడుగు పెట్టిన దగ్గరనుంచి
చుట్ట నస్యం రూపాల్లో మొదట, బీడీ, సిగరెట్ గా
తరువాత ప్రజలను ఆకర్షించింది.
నస్యానికి సభాపూజ్యత రావడం వల్ల దానిమీద
పద్యాలు చాలామంది రాశారు. వాటికి సంబంధించిన చాటువులను
వేటూరివారు, దీపాలవారు సేకరించి ప్రకటించారు.
నస్యం తయారీ పద్ధతిని సూచిస్తూ ఒక కవి
ఇలారాశాడు చూడండి.

మట్ట పొగాకులో నడుమ మందము గల్గినచోట తీసి తా
పట్టుగ పక్వశుద్ధిగను బాగుగ కాచి ఒకింత సున్నమున్
బట్టన వ్రేల నొత్తి తన బల్మికొలందిగ నల్చి నస్యమున్ 
బట్టపు డబ్బిలో నునిచి ప్రాజ్ఞుల కిచ్చిన భాగ్యమబ్బదే?

ఇది ఇలా అయితే కృష్టిపాటి వేంకట సుబ్బకవి అనే ఆయన నస్యప్రియుడు.
ఆయనకు ఓబళాచార్యుడనే పండితునికి జరిగిన సంభాషణ
తెలుగు సంస్కృత పద్యాలుగా వెలిశాయి.

కృష్టిపాటి వేంకట సుబ్బకవి -

నస్యము లేదుగా పవననందన దివ్య కటాక్ష వీక్షణా
వశ్య వరప్రభావ విభవానుభ వాద్భుత భూమి భృద్ధను:
కైశ్య ఘుమంఘుం ఘమిత గాంగఝరీ విలుఠత్తరంగ సా
దృశ్య కవిత్వ తత్వ ముఖరీకృత వేంకట సుబ్బ సూరికిన్

అనగా
ఓబళాచార్యుడు -

కోకో! నస్య మవస్య మీశ్వర జటాకోటీరటద్యోధునీ
ప్రాకాశోర్మి సకాశ పేశల సుశబ్ద ప్రక్రియోపక్రమా
నేక గ్రంథ నిబంధ నార్జిత సమున్నిద్ర ప్రతాప ప్రధా
స్తోక శ్రీకర కృష్టిపాటికుల సింధు స్వచ్ఛ చంద్రోదయా!

అన్నాడట.

బుక్కపట్టణం తిరుమల తాతాచార్యుడు
నస్యం ఇవ్వని శాస్త్రిని ఎలా దూషించాడో చూడండి.

శాస్తుర్లట ఈ నీచుడు
పాస్తొత్తుల మగడు వీని పరువేమోకా
కాస్తింత నస్యం మడిగిన
నాస్తే యని పలుక వీని నాలుక పీకా 

అన్నాడట.
చూడండి
నస్యం ఎంతగా మాదకద్రవ్యంలా ఉండినదో ? ఆకాలంలో. 

ఇది గుర్తించడంలేదు


ఇది గుర్తించడంలేదు


సాహితీమిత్రులారా!


వాల్మీకి రామాయణంలోని ఈ శ్లోకం చూడండి.

నందంత్యుదిత ఆదిత్యే
నందంత్యస్తమితే రవౌ,
ఆత్మనో నావబుద్ధ్యంతే
మనుష్యా జీవితక్షయమ్

మనుష్యులు సూర్యుడు
ఉదయించుచుండగా సంతోషిస్తున్నారు
అలాగే సూర్యుడు అస్తమించుచుండగా సంతోషిస్తున్నారు.
 అయితే ఒక్క సూర్యోదయంతో ఒక్క సూర్యాస్తమయంతో
తమ జీవితం తరిగిపోతున్నదని గుర్తించలేకున్నారు.- అని భావం.
నిజమేకదా!
కాదంటారా?

Friday, August 26, 2016

ఆమెతో తన్నులు తిన్నామేలె


ఆమెతో తన్నులు తిన్నామేలె


సాహితీమిత్రులారా!


ఈ చమత్కార శ్లోకం చూడండి

అరసిక జనై: సంభాషణత:
రసిక జనైస్సహ కలహం శ్రేయ:
లంబకుచాలింగనత: లికుచ
కుచాయా: పాదతాడనం శ్రేయ:

రసజ్ఞత ఎరుగని వారితో మాట్లాడటం కంటె,
రసికులైన వారితో కలహము మేలు.
వ్రేలాడు కుచములున్న ఆమెను కౌగిలించుటకంటె,
గజనిమ్మలవంటి చన్నులున్న
ఆమెతో తన్నులు తినటం మేలు - అని భావం.

ఎవరిని ఎలా వశంచేసుకోవాలి?


ఎవరిని ఎలా వశంచేసుకోవాలి?


సాహితీమిత్రులారా!


వశంచేసుకోవడమంటే అంతసులువైన పనికాదు.
అది ఎవరిని ఎలా వశపరచుకోవాలా అనేది
కూడ ఒక ప్రత్యేక విషయమే ఈ శ్లోకంలో
ఆ విషయాన్ని వివరించారు చూడండి.

ఉత్తమం ప్ణిపాతేన శూరం భేదేన యో జయేత్
నీచం అల్పప్రదానేన సమశక్తిం పరాక్రమై:

ఉత్తముని నమస్కారంతో వశపరచుకోవచ్చు
అదే బలవంతుడైతే భేదోపాయముచేత వశపరచుకోవచ్చు.
మరి నీచుడైతే వానికి లంచమే వశపరుస్తుంది.
ఇక సమశక్తివంతుడైతే పరాక్రమమే వశపరచుకోవడాని మార్గం.

చూడండి ఎంత మంచి విషయాన్ని చెప్పాడో కవి.

శ్రీ సాయి శతకము


శ్రీ సాయి శతకము

                                   -----శ్రీ అలంకారం కోటంరాజు


సాహితీమిత్రులారా!

(41వ పద్యం నుండి 50 పద్యాల వరకు శ్రీ సాయిశతకము)

సన్యాసిన్ గొలువంగ నేమియగు - యీ సంసార మాధుర్య - శ్రీ
విన్యాసంబందియే మెఱుంగునని - నేవిన్నాను, అన్నారు - నే
ధన్యుండితకు వారి మాట వినకన్ ధ్యానించుచున్నాను - గా
దే! న్యగ్రోధ మహాకృతీ! మనుపు షిర్దీ సాయినాథ ప్రభూ!     -41

ఉన్మత్తాకృతి నీది చూడ, నిను నీ యుర్వీస్థలిన్ యెవ్వరున్
కన్నోసామి తలంపబో రెవరు - నేకాంతంబు నీకేల - యే
త్నమధ్యంబున యేమినీకొఱిగె - సందర్భంబుగాదే యిటన్
ఏన్మాత్రంబు దలంచుచుందు నెద షిర్దీ సాయినాథ ప్రభూ!    -42

కాలూనంగను లేని యూబి యిది నే కష్టించి కష్టించి - నీ
కాళుల్ బట్టితి ప్రోవు మంచు దయతో కామ్యంబు లీడేర్చి - సు
శ్రీలంగూర్చగ జేతువో! యెవడు నేజేయంగ వీడందు వో!
రేలిట్లే తలపోయుచుంటి గద! షిర్తీ సాయినాథ ప్రభూ!   - 43

క్రమ్మన్ జూడుము కారుమబ్బగమి నాకామ్రేడితంబౌచు, యీ
దుమ్మేమో ననుముంచి వేసినది చేతోమోద మెట్లబ్బు, చి
క్కమ్ముల్ మూతికి గట్టినట్లొ యే కాంతిచ్ఛటాపుంజముల్
దు్మేక్కించును నాకు యింక ధర షిర్దీ సాయినాథ ప్రభూ!  -44

తరువాతంచును తేపవేసితివి యాతర్వాత తర్వాత - యీ
తరమాయెన్న యిది నాడె పూర్తియయినన్ దాన్మేలుయేమౌనొ? యీ
తిరకాసుల్ యికనైన మానుకౌను నాతీరేమి కన్గొందు - సు
స్థిరమంచెంచెద నీదు బాసటెద షిర్దీ సాయినాథ ప్రభూ!  -45

జనితోన్మాదముతోడ లెక్కగొనకన్ సంసార చక్రంబులో
నను దేహమ్మిటు నల్గినూకయె గదా! నానాటికిన్ క్రుంగి, కా
చిన యీ కాయలజూచి కొంచు తుదకున్ స్రీకాంతుడంచెంచి, యీ
దిన మందే నిను జేర వచ్చితిని షిర్దీ సాయినాథ ప్రభూ!   - 46

ఏదోదారి, యిదొక్కటైనను ధరన్ ప్రీతిన్ దలుర్పంగ - నీ
వేదో దారిని జూపగా గలవు యంచెంచున్ ప్రజానీక మీ
రేదో దారిని జూపులుంచితిరి - సారింపంగలేవా? ధరన్
ఈదీనాళిని బ్రోవనీవయగు షిర్దీ సాయినాథ ప్రభూ!   - 47

నైరాశ్యమ్మిది యెంత యెంత యయి యీనాడెంతయై నిల్చెనో!
యీరోజేనను కన్ను విచ్చి కనుమా! యీవెంత దైవంబవై
నా? రూఢంబయి పోయె, యిద్ది, నను యీ నాడైన బ్రోవంగదే!
ధీరాత్ముండవు నిన్ను యెన్నెదను షిర్దీ సాయినాథ ప్రభూ!   - 48

గారింపంగను యేల మమ్మిటుల విఖ్యాతెట్లు నీకబ్బు, శో
భా రమ్యాకృతి నీయెడంద గద యీ బ్రహ్మాండ భాండంబు, కూ
లారింపంగను, బెంపనీవెయట దుర్మార్గంబు ద్రుంపంగ, నీ
వే! రా ఖడ్గము బట్టి చెండుమిక షిర్దీ సాయినాథ ప్రభూ!   - 49

వాలారుంగొనగోళ్ళ మీటితివి గావా మాదు డెందాలు, గీ
తాలాపంబులు నించ, నెంచగ మనస్తాపంబు, మాయింప, బెం
బేలిప్డేల, తమంత వేల్పిట మమున్ బెంచంగ లోటేమి? యో
లీలామానుష విగ్రహుండ! ధర షిర్దీ సాయినాథ ప్రభూ!   - 50

Thursday, August 25, 2016

కారుచీకటివంటి చోరులను తెగటార్చి....


కారుచీకటివంటి చోరులను తెగటార్చి....


సాహితీమిత్రులారా!


సంస్కృతంలో మయూరకవి సూర్యశతకం చేశాడు.
దాన్ని అనేకమంది అనేక భాషల్లోకి అనువదించారు.
అలా అనువదించినవారిలో తెలుగువారు ఉన్నారు.
మయూర క్రేంకృతి పేరున
జంధ్యాల వేంకటేశ్వరశాస్త్రిగారు అనువదించారు
అందులోని రెండవ శ్లోకం అనువాదం ఇక్కడ చూద్దాం.


భక్తిప్రహ్వాయ దాతుం ముకుళపుటకుటీకోటర క్రోడలీనాం
లక్ష్మిమా క్రష్టుకామా ఇవ కమలవనోద్ఘాటనం కుర్వతే యే
కాలాకారాంధకారాన సపతిత జగత్సాధ్వసధ్వంస కల్యా:
కల్యాణం వ: క్రియాసు: కిసలయరుదస్తే కరా భాస్కరస్య

సూర్యుడు తన భక్తుల్ని శ్రీమంతుల్ని చేద్దామని లక్ష్మీదేవికోసం వెదకసాగాడు.
ఈ వెదకులాటలో సూర్యుడు కాస్తా కనుమరుగయ్యాడు.
అంతలో అంధకారం వ్యాపించింది. కమలాలు ముడుచుకు పోయాయి.
తిమిరాసురుడు లక్ష్మిని నళిన గుహల్లో బందీ చేశాడు.
లోకం చీకట్లో చీకాకై పోయింది.

జగత్తుకే కన్నైన కమలబాంధవుడు లక్ష్మికి
విముక్తి కలిగించటాని కంకణం ధరించాడు.
ఉపకారానికి ఉపక్రమించాడు.
ఆ క్షణమే అంధకాసురులపై దండెత్తాడు.
తన సహస్రకిరణాల వంటి బాణాలనువేసి
తిమిర సైన్యాన్ని పారద్రోలి తిమిరాన్ని అంతంచేశాడు.
లోకం భయాన్ని వదలింది.

పద్మవనాలు వికసించాయి.
లక్ష్మీదేవి కళకళలాడుతూ భక్తుల్ని కటాక్షించింది.
విష్ణవు వక్షస్థలంపై లక్ష్మి ప్రకాశించింది.
భక్తులకై లక్ష్మిని విడిపించటం -
భార్యాభర్తల్ని కలపటం -
అంధకారాన్ని హరించటం
ఆర్తులను ఆపదల్లో ఆదుకోవడం అనేవి -
ఆదిత్యునికి అతి సహజగుణాలు.

లోకమంతా ఉత్సాహకాంతులు వెల్లివిరిశాయి.
మంగళతోరణాలు ద్వారాలపై మిలమిలలాడాయి.
మామిడి చిగురాకు తోరణ కిరణాలు దశదిశలా వ్యాపించాయి.
దేవాలయాల్లో మంగళతూర్యనాదాలు మ్రోగాయి.
స్వామి దర్శనమిచ్చాడు. లోకానికి మేలు కలిగింది.

ఈ భావంతో కూర్చిన పద్యం ఇది చూడండి.

ముకుళిత పంకజమ్ములలోన బందియౌ 
                   ఇందిర చెరవిడిపించదలచి
ఆ సుందరీమణి నత్యంత హర్షాన
                   శ్రీవిష్ణుమూర్తి కర్పించ నెంచి
ముదముతో రాజీవ హృదయమ్ము విచ్చగా
                   నీటుగా తగిన ఏర్పాటుచేసి
కారుచీకటివంటి చోరుల తెగటార్చి
                   జగతికి శ్రేయమ్ము సలుపగోరి

పచ్చనాకుల తోరణ పంక్తినుండి
అరుణకిరణాలు లోకాన బరపి నేడు
వచ్చుచున్నది దివ్య దివాకరార్చి
అనుజ! పల్కుమా! వేగమ్ము స్వాగతమ్ము!

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు



శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు శ్రేయోభిలాషులకు 
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు



కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్ష:స్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణంసర్వాంగే హరి చందనం చ కలయం  కంఠే చ ముక్తావళిం గోపస్ర్తీ పరివేష్టితోవిజయతే గోపాల  చూడామణీ


మన్మథ బాణములనగా ఎలాంటివి?


మన్మథ బాణములనగా ఎలాంటివి?


సాహితీమిత్రులారా!

శాలివాహన గాథాసప్తశతిని చాల మంది అనువదించినారు.
వారిలో రాళ్లపల్లి అనంత కృష్ణశర్మగారొకరు.
ఆయన అనువాదంలోని ఒకగాథ చూడండి.

ఒకానొక మగువ మన్మథబాణాలు అంటే ఎలాంటివి? -  అని
మరొక ప్రౌఢస్త్రీని అడిగిందట.
దానికి ఆమె సమాధానం ఈ పద్యంలో చూడండి.

ఎదురిపడి, ముందుకుఁజని,
పదపడి వెనుదిరిగి, ప్రియుఁడు పఱపిన మోహో
న్మద దృష్టులె మాపాలికి 
మదనశరము; లెవ్వరెట్లు మదిని దలఁచినన్ 
                                 (శాలివాహన గాథాసప్తశతి -142)

ఎవరు ఏమనుకొన్నా ప్రియుడు చూచిన
మోహముతో కూడిన చూపులే మాపాలిటి
మన్మథబాణాలు - అని అన్నదట.

ఇది వాహవరాయడు అనే కవి రచించినది
హాలుడు తన సప్తశతిలో సంకలనము చేసినాడు.

Wednesday, August 24, 2016

వీరి వద్దకు వట్టి చేతులతో పోరాదు


వీరి వద్దకు వట్టి చేతులతో పోరాదు


సాహితీమిత్రులారా!

కొందరి దగ్గరకు పోయేసమయంలో
రిక్తహస్తాలతో(వట్టిచేతులతో) పోరాదు.
ఈ శ్లోకంలో చూడండి.

అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధ బాలకౌ
రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుమ్


అగ్నిహోత్రము దగ్గరకు - గృహమునకు - పంట పొలమునకు -
గర్భవతి చెంతకు - వృద్ధ బాలకుల చూచుటకు - రాజు, దేవుని, గురువును దర్శించుటకు - వట్టిచేతులతో పోరాదు.

తనరు వంశ కీర్తి తనయ వల్ల


తనరు వంశ కీర్తి తనయ వల్ల


సాహితీమిత్రులారా!

నేటికాలంలో ఆడపిల్ల పుడితే చాలా మంది
తప్పనిసరి పరిస్థితిలో పెంచుకొంటున్నారు
కొందరైతే గర్భంలోనే ఆడపిల్లలను చంపేస్తున్నారు.
ఇలాంటి వారికై మన యువకవి
మహతీ సేవకులు తన్నీరు బాలాజిగారి
పద్యాలను మనం చూసి
అలాంటి వాళ్ళకు చూపుదాం.

ఆడపిల్ల జనింప యవనికి బరువండ్రు
          అవని దేవతని యంజలింత్రు
ఎదుగు తనయఁజూచి ఎదను కుంపటియండ్రు
         నిక్కమైన సతిని నిప్పుయండ్రు
అమ్మాయి జన్మంబు అడవిలో మానండ్రు
         వెలసిన దేవత వేప యండ్రు
అమ్మాయిఁ బుట్టంగ అయ్యదిగాల్పడు
         ఇంటికి దీపము యింతియండ్రు
తనయుడుదయింప పుకింత్రు తల్లిదండ్రి
తనయఁబుట్టిన శోకించు తల్లిగూడ
అర్థనారీశుని నుతించు  యవనిలోన
ఆడమగ తేడఁజూప ఈయవనిలేదు

చదువులతల్లి యా సరస్వతి బ్రహ్మకు
        నాల్గుముఖంబులన్ నాల్కయయ్యె
సిరుల పంటయగు యాశ్రీలక్ష్మిని హరియు 
        నిక్కముగ ఎదలో నిల్పుకొనియె
సగముతనువునిచ్చి సతికి యా శ్రీపార్వ
         తీశుడు అర్థనారీశుడయ్యె
ముగ్గురు మూర్తుల మూలపుటమ్మను
       ఆదిశక్తిగ నంతా యాదరింత్రు
చెట్టు పుట్టలోన స్త్రీదైవమునుఁ జూచి
రాతిరప్పలోన నాతిఁజూచి
చద్దిముద్దఁబెట్టి చక్కగ మ్రొక్కడి 
తల్లులార! మరియు తండ్రులార!

ఆడపిల్లయన్న అలుసుగాఁజూడకు
అబలకాదు నెలత సబలఁజూడ
కొడుకుకన్న బిడ్డ కురిపించు ప్రేమరా
తనరు వంశ కీర్తి తనయ వల్ల

Tuesday, August 23, 2016

వృద్ధనారీ పతివ్రతా!


వృద్ధనారీ పతివ్రతా!


సాహితీమిత్రులారా!

వృద్ధనారీ పతివ్రతా! -  అని లోకంలో
ఒక సామెత వాడటం కద్దు.
దీని పూర్తి శ్లోకం చూడండి.

అశక్తస్తు భవేత్సాధు:
బ్రహ్మచారీ తు నిర్ధన:
వ్యాధితో దైవభక్తశ్చ
వృద్ధనారీపతివ్రతా!


బలహీనుడు మంచివానిగా బ్రతుకుతాడు
ఎందువల్లనగా ఏ దాన్నీ ఎదిరించలేడుగదా!

ధనహీనుడు డబ్బులేనివాడు బ్రహ్మచర్యం పాటిస్తాడు
ఎందువల్లనగా ఏ స్త్రీనైనా కోరితే దానికి డబ్బవసరంకదా!

వ్యాధిగ్రస్తుడు దైవభక్తితో ఉంటాడు
వైద్యుని వల్లకానిది దేవుడేకదా చేయాల్సింది.

వృద్ధనారి పతివ్రతేకదా
ఎటూ వయసు మీరిన ఎవరు కోరుదురు.
కావున
ఈ శ్లోకం  సర్వదా ఆమోదమైనదేగా!

భానుబింబంబు గన్నుల పండువయ్యె


భానుబింబంబు గన్నుల పండువయ్యె


సాహితీమిత్రులారా!


సూర్యోదయాన్ని ఒక్కొక్క కవి ఒక్కోరకంగా వర్ణించాడు.
ఇక్కడ మనం నాచనసోముని
ఉత్తరహరివంశములోని సూర్యోదయాన్ని చూద్దాము.

కుంకుమ హత్తించి కొనగోరఁ దీర్చిన
       పుహూతునిల్లాలి బొట్టనంగఁ
జక్రవాకములకుఁ జల్లఁగా మందు ద్రా
      గించిన చెంద్రంపు గిన్నెయనఁగఁ
బార్వతీ బతికిఁ బ్రభాత భూపతి గొన్న
      యలరు గెందమ్మి కోహళి యనఁగఁ
తొలిదిక్కు తొయ్యలి చెలులపైఁ జల్లంగ 
       నిండ ముంచిన పైడికుండ యనఁగ
మేరు ధరణీధరంబుతో మేలమాడ
నుదయగిరిరాజు దల యెత్తెనో యనంగ
గ్రమముతో నించుకించుక గాన నగుచు
భానుబింబంబు గన్నుల బండువయ్యె
                                        (ఉత్తరహరివంశము 3-86)

నొసటియందు కుంకమను అత్తి అలంకరించి కొనగోటితో
దానిని గుండ్రంగా ఉండునట్లు సవరించిన ఇంద్రుని ఇల్లాలైన
శచీదేవి యొక్క ఎఱ్ఱని సింధూరతిలకము వలెను.

ఎడబాటు చెంది తపించుచున్న చక్రవాకపు జంటకు
చల్లదనము పొందుటకు అవసరమైన పానీయమును
త్రాపింప జేసిన ఎర్రని పాత్రవలెను.

శివునకు ప్రభాతకాలమనెడు రాజు పూజకై గ్రహించిన
వికసించిన ఎర్రదామర మొగ్గవలెను.

తూర్పుదిక్కాంత తన చెలికత్తెపై
జలక్రీలలో పాల్గొనంటూ,
వారిపై చల్లుటకు నీరు ముంచిపెట్టిన
బంగారు కుండ కుండవలెను.

మేరుపర్వతరాజుతో సల్లాపము చేసి
పరిహసించుటకు తన ఎత్తును పెంచుటకై
ఉదయగిరులరాజు తల పైకెత్తినట్లును,

ఆకాశముపైకి క్రమక్రమముగా వచ్చుచు,
సూర్యబింబము,
కన్నులకు మహానందము కూర్చెను - అని భావం.

Monday, August 22, 2016

భార్యకు భర్త ఎలాంటివాడు?


భార్యకు భర్త ఎలాంటివాడు?


సాహితీమిత్రులారా!

మనదేశంలో పెళ్ళయిన పడుచుకు
చెప్పేనీతుల్లో ఇది ఒకటి.
భర్తను ఎంతగా గారవించాలి
భర్త భార్యకు ఎలాంటివాడు? -  అనే విషయాలను
అప్పగింతలకంటే ముందుగా చెప్పి
అత్తవారింటికి పంపుతారు.
ఇదికదా మన ఆచారం.
శకుంతలాపరిణయంలోని ఈపద్యం చూడండి.

వనితకు విశిష్టదైవము జీవితేశుండు
              భామకు ముంగొంగు  పసిడి భర్త
సుదతికి నరలేని చుట్టంబు పెనిమిటి
             తరుణికి ప్రాణమిత్రుండు ధవుడు
వనజలోచనకుఁ బెట్టనికోట దయితుండు
             నాతికి సకలార్థదాత ప్రియుడు
కాంతకు మానరక్షకుఁడింటియాతండు
             సతికి వాఱడిలేని హితుఁడు వరుఁడు
కంబుకంఠికి నిత్యశృంగార విభవ
వల్లికకు నాలవాలంబు వల్లభుండు
పల్లవోష్ఠికి సౌభాగ్య భాగ్యలక్ష్మి
గణన మొనరింపనేల యేడ్గడయు మగఁడు
                                       (శకుంతలా పరిణయము)

వనితకు ఇష్టదైవము,
భామకు కొంగు బంగారం,
స్త్రీకి అరమరికలులేని చుట్టం ,
ప్రాణస్నేహితుడు, పెట్టనికోట,
సకలప్రయోజనాలను చేకూర్చే దాత,
మానరక్షకుడు,
ఏ నష్టము కలిగించని హితుడు,
నిత్య శృంగారానుభవమనే వైభోగలతకు
పాదు- ఆలవాలమైనవాడు,
చిగురాకులాంటి పెదవికలిగిన భార్య సౌభాగ్యం -
పసుపు కుంకుమలు అనే భాగ్యలక్ష్మి మగడే.
ఇన్ని భాగ్యలక్ష్ములను లెక్కపెట్టడమెందుకు
ఇల్లాలికి ఏడుగడ మగడే - అని సారాంశం.

(ఏడుగడ = (ఏడు + కడ) - గురువు, తల్లి, తండ్రి, పురుషుడు,
విద్య, దైవము, దాత - అనే ఏడు. సప్తప్రాకారాలుగల)

విషమును కంఠమున దాచాడుకదా!


విషమును కంఠమున దాచాడుకదా!

సాహితీమిత్రులారా!



ఈ శ్లోకాన్ని చూడండి.

గుణ - దోషౌ బుధౌ గృహ్ణన్ ఇందు - క్షేళావివేశ్వర:
శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్ఛతి

శివుడు చంద్ర - విషాలను గ్రహించినట్లు,
పండితుడు మంచి చెడులను గ్రహిస్తాడు.
చంద్రుని శిరసున ధరించినట్లు
మంచిని తల ఊపి మెచ్చవచ్చును.
చెడును కప్పిపుచ్చును.
శివుడు విషాన్ని కంఠంలో దాచాడుకదా!

Sunday, August 21, 2016

వారకామినుల వీక్షల్ నీ వపేక్షింతువే!


వారకామినుల వీక్షల్ నీ వపేక్షింతువే!


సాహితీమిత్రులారా!

ఈ పద్యం గణపవరపు వేంకటకవి రచించిన
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోనిది చూడండి.


బంధుద్వేషదవాగ్ని గంధవహముల్ బాపావలంబాజ్ఞతా
గ్రంధుల్ సంచిత విత్తభూరుహకుఠారంబుల్ సుసంసారజీ
ర్ణాంధుప్రస్పుట పాతహేతువులు వేదాంతజ్ఞధైర్యాబ్జినీ
గంధేభంబులు వారకామినుల వీక్షల్ నీ వపేక్షింతువే!
                                      (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము -681)

కవి ఇందులో వేశ్యాస్త్రీల చూపులను వర్ణిస్తున్నాడు చూడండి.

వేశ్యల చూపులు బంధుజనుల ద్వేషమనే
కార్చిచ్చునకు వాయువువంటిది.
ఇది చేరడంవల్ల మంటలు ఇంకా ప్రజ్వరిల్లుతాయి.
వేశ్యాలోలుడైన వానికి బంధువులు ద్వేషించడం ఎక్కువౌతుందని సారాంశం.

వేశ్యల పూపులు పాపాత్ముల అజ్ఞానానికి కూడళ్లు
అంటే వేశ్యాలోలుడు జ్ఞానంకోల్పోయి
పాపానికి ఒడిగడతాడని ఫలితార్థం.

సంపదలు అనే చెట్లపాలిట గొడ్డళ్ళు వేశ్యచూపులు
వాటివల్ల సంపదంతా నిర్మూలమౌతుందని సారాంశం.

పచ్చనిసంసారాలు పాడుపడిన
నూతుల్లో పడిపోవడానికి కారణాలౌతాయి.
వేశ్యాలోలుడు కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండటంవల్ల
కుటుంబాలు కూలిపోతాయి అని సారాంశం.

వేదాంతవేత్తల ధైర్యమనే పద్మలతలకు
మదగజం వంటివి వేశ్యాచూపులు.
ఎంతటి వేదాంతినైనా తమచూపులతో
తిప్పుకుంటాయని సారాంశం.

ఎన్నివిధాలైన చూపులో
వెంకటకవి విపులంగా వివరించారు.

ప్రయాణమునకు మంచిది ఏది?


ప్రయాణమునకు మంచిది ఏది?


సాహితీమిత్రులారా!

ప్రతి ఒక్కరు ప్రయాణమయేప్పుడు
ఎప్పుడు బయలుదేరితే మంచిదని ఆలోచించి
తెలిసినవారిని అడిగి ప్రయాణం అవుతుంటారు కదా!
ఈ శ్లోకం చూడండి.

ఉపశ్శశంస గార్గ్యస్తు శకునంతు బృహస్పతి:
మనోజయంతు మాండవ్య: విప్రవాక్యం జనార్దన:


గార్గ్యుడు ప్రయాణానికి
తెల్లవారు జాము మంచిదని చెప్పాడు.
బృహస్పతి శకునము చూచుకొని
ప్రయాణం చేస్తే మంచిదని చెప్పాడు.
మనసుకు కోరిక కల్గినపుడు
మంచిదని మాండవ్యుడు చెప్పాడు.
బ్రాహ్మణుని మాట మంచిదని జనార్దనుడు చెప్పాడు.
ఎవరిమాట వింటే మంచిదంటారు?
ఏవరిమాట వినాలి?
ప్రయాణానికి మంచిదేది?

Saturday, August 20, 2016

తలచుకొనుచు తుమ్మెదగా మారుచున్నది


తలచుకొనుచు తుమ్మెదగా మారుచున్నది


సాహితీమిత్రులారా!


ఏవరు ఏది ఎక్కువగా తలచుకొంటారో వారు అదే అవుతారు.
మనిషి చనిపోయే
సమయంలో ఏది స్మరిస్తాడో
తరువాతి జన్మలో అలానే పుడతాడట.
ఈ  శ్లోకం  తెలిపే సూక్తి చూడండి.

సతి సక్తో నరో యాతి సద్భావం హ్యే కనిష్ఠయా
కీటకో భ్రమరం ధ్యాయన్ భ్రమరత్వాయ కల్పతే

సజ్జనులతో నిరంతరం సంబంధం వలన మానవుడు
సజ్జనుడుగా మారును.
పురుగు తుమ్మెదను తలచుకొనుచు
తుమ్మెదగా మారుతున్నదికదా - అని భావం.

ఇదీ మనదేశ సాంప్రదాయం


ఇదీ మనదేశ సాంప్రదాయం


సాహితీమిత్రులారా!

అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు
శకుంతలను అత్తవారింటికి పంపే సందర్భంలో
కణ్వుడు శకుంతలకు చెప్పిన ఈ శ్లోకం
మనదేశ సాంప్రదాయాన్ని ప్రతిబింబింప చేస్తుంది.
చూడండి.

శుశ్రూషస్వగురూన్ కురు ప్రియసఖీ వృత్తిం సపత్నీ జనే
భర్తుర్వి ప్రకృతాషి రోషతయా మా సంప్రతీపం గమ:
భూయిష్ఠం భవ  దక్షిణా పరిజనే భాగ్యేష్వను త్సేకినీ
యాన్త్యీవం గృహిణీపదం యువతయో వామా: కల్పస్సాధయ:
                                                                              (4-18)

పెద్దవారిని సేవించు, సవతులను చెలికత్తెలుగా చూచుకో,
ఏదైనా పొరపాట్లు ఉన్నా భర్తయెడ విరుద్ధంగా ప్రవర్తించకు,
సాధ్యమైనంతవరకూ పరిజన విషయంలో దాక్షిణ్యంతో ఉండు.
ఐశ్వర్యం ఉందికదా అని గర్వపడకు. ఈ విధంగా ఉంటేనే స్త్రీలు 
గృహిణులు అనిపించుకుంటారు.
లేకపోతే వాళ్ళు కులానికి పీడ పట్టిన వాళ్ళవుతారు - అని భావం.

Friday, August 19, 2016

పలుకుం దొయ్యలి మోవికాంతికెన


పలుకుం దొయ్యలి మోవికాంతికెన


సాహితీమిత్రులారా!


తెనాలిరామకృష్ణునికి
పాండురంగమహాత్మ్యం కృతిభర్త వేదాద్రిమంత్రి
తనకు ఏవిధంగా తాంబూలాన్ని అందించాడో
ఈ పద్యంలో చెప్పాడు చూడండి.

పలుకుం దొయ్యలి మోవికాంతికెన యౌ బాగాలు నయ్యింతి చె
క్కుల బోలు దెలనాకు ల య్యువిద పల్కుల్ వంటి కప్రంపు ప
ల్కులతో గూడిన వీడియం బొసగె నాకున్ పద్మనాభా ర్చనా
కల నా పావన హస్త కంకణ ఝణత్కారంబు తోరంబుగన్
                                                  (పాండురంగమహాత్మ్యము పీఠిక-29)


సరస్వతీదేవి పెదవి కాంతితో తులతూగే వక్కలు,
ఆమె చెక్కులవంటి తెల్లాకులు(సర్వశుక్లా సరస్వతి -
అని దండి కావ్యాదర్శంలో సరస్వతిని స్తుతించాడు.
సరస్వతి తెల్లనిదని ప్రతీతి అందుకే
ఇక్కడ ఆమె చెంపలను తెల్లనాకులతో పోల్చాడు.)
ఆమె పలుకుల వంటి కర్పూరపు పలుకులతో
వేదాద్రి మంత్రి హస్తకంకణాలు ఝణ ఝణ నినదిస్తూండగా
తాంబూలాన్ని రామకృష్ణులవారికి అందించారట.
(మగవారు కూడ ఆరోజుల్లో కంకణాలు ధరించేవారు.)

త్రోవదొరికిన వట్టి గందోళిగాడు


త్రోవదొరికిన వట్టి గందోళిగాడు


సాహితీమిత్రులారా!

పద్యాలలో హాస్యాన్ని ఉత్పాదింప చేసినవారిలో
తిరుపతివేంకటకవుల శిష్యులు
మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారొకరు.
ఆయన గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం హీరో
గిరీశం మీద చెప్పిన పద్యం చూడండి.

గొంగడి పురుగు కట్టింగు మీసలవాడు
        గంపశ్రాద్ధపు తలకట్టువాడు
ఎపుడు కాఫీ దుకాణపుఠేవిణీవాడు
      సిగరుపీలుపు బుగబుగలవాడు
పైపటారమును లోపలలొటారము వాడు
       పట్టుతప్పిన చలోభాయిగాడు
తుదమొదల్ లేని గాడిద గత్తరవాడు
        జలసాలతో పడి చచ్చువాడు
తడి యనెడి దున్నచో చేత తుడుము మొదలు
దేవతార్చన వర కొక్క తీరువాడు
వలను పడకున్న శ్రీశుకు వంటివాడు
త్రోవ దొరికిన వట్టి గందోళిగాడు

(గిరీశం ఎలాంటివాడంటే, ముక్కు మొదట్లో గొంగళిపురుగువలె,
ప్రెంచి కట్టింగు నల్లని మీసాలతో ఉండేవాడట.
అతని తలకట్టు గంపశ్రాద్ధం కొలుపువంటిది,
ఎల్లపుడూ కాఫీహోటలులో తిష్ఠవేసి, సిగరెట్టు పొగవాసనలు
బుగబుగ వ్యాపింపజేసేవాడు, పైన పటారం లోన లొటారంగా, దబాయిస్తూ,
పట్టుతప్పితే, మళ్ళీ కనబడకుండా మాయమయ్యేవాడు.
మొదలు చివర, క్రమంలేని గాడిద కొలువు, జల్సాలంటే జారిపడి చచ్చేవాడు.
బండతడి గుడ్డతో, ఒకడే అన్నిపనులు చేసేవాడు,
వీలుపడితే, విడవకుండా ఉపయోగించుకొవడం,
లేకపోతే శుకబ్రహ్మ దారే, దారిదొరికితే మాత్రం
తోలుబొమ్మలాటలోని గందోళి(హాస్య)గాడు సుమా!
గిరీశం అలాంటి విలక్షణవ్యక్తి.)

(దీనిలోని కొన్ని దేశీయ నుడికారాలు
ఇప్పటివారికి కొత్తగా కనబడతాయి.
అవి ఆకాలంలో వాడే నుడికారాలు.)

Thursday, August 18, 2016

రెండు వైపులా పదునే


రెండు వైపులా పదునే


సాహితీమిత్రులారా!

కవి కలం ఎటైనా పలుకుతుంది అనేదానికి
ఇక్కడ ఒక సంఘటన చూద్దాం.

అడిదము(కత్తి)సూరకవికి విజయనగర ప్రభువు
పెద విజయరామరాజుకు అంతగా పడేదికాదని ప్రతీతి.
రాజేమో అహంకారి అది వారికి సహజం సూరనేమో కుర్రవాడు
ఒకసారి తురక సరదారు దండయాత్రకు
వస్తే సూరకవి ఏమన్నాడో చూడండి.

మెత్తనైనట్టి అరటాకు మీదగాక
మంటమీదను చెల్లునే ముంటివాడి
బీదలైనట్టి సరదార్ల మీద గాక
కలదె క్రొవ్వాడి బాదుల్లాఖాను మీద 

(ముల్లుకు అరిటాకు మీద చెల్లినట్లుగా
మంటమీద చెల్లుతుందా? కాలిపోదూ.
అలాగే రాజుగారి జులుం కింది సరదార్లమీదనేకాని,
నవాబుగారి సేనాపతి బాదుల్లాఖాను మీద చెల్లుతుందా - అని భావం.)

అయితే ఆ దండయాత్రలో రాజుగారు గెలిచారు.
అప్పుడు మళ్ళీ రాజుగారిని ప్రశంసిస్తూ ఈ పద్యం చెప్పాడట.


ఢిల్లీ లోపల గోలకొండపురి నిండెన్ నీ ప్రశంసల్ గులాల్
బల్లాలం బొడిపించి హుమ్మని అరబ్బా నెక్కి పైకొంచు బా
దుల్లాఖానుని బారద్రోలితివి నీ దోశ్శక్తి సూ బాలకున్
మళ్ళింపం దరమౌనె శ్రీ విజయరామా! మండలాధీశ్వరా!

చూడండి అటైనా ఇటైనా ఎటైనా చెప్పగలవాడు,
మెప్పించగలవాడు అడిదము సూరకవి.
సూరకవేకాదు ప్రతిభావంతుడైన కవి ఎవరైనా
ఇలాగే చేయగలరు.
అందుకే కవి ఎటైనా అంటే
రెండు వైపులా పదునే.

మృగమద సౌరభ విభవ.......


మృగమద సౌరభ విభవ.......


సాహితీమిత్రులారా!

తాంబూలం అనగానే మనకు గుర్తుకు వచ్చే పద్యం
మనుచరిత్రలోని ఈ క్రింది పద్యం

ప్రవరుడు హిమాలయాల్లో పసరుకరిగి ఇంటికి ఎటువెళ్ళాలో
తెలియక చెప్పేవాళ్ళు కనిపించక వెదకు సందర్భంలో
సువాసనాభరితమైన తాంబూలవాసన రావడాన్ని
తెలిపే పద్యం ఇది.

మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీ గంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపు దెలుపు నొక్క మారుత మొలసెన్
                                                     (మనుచరిత్రము - 2-24)

కస్తూరి వాసనకంటె రెండింతలు అధికముగా
కర్పూరముతోకూడిన తాంబూలము యొక్క
పరిమళముచేత కప్పబడిన పుష్పాదికములయొక్క
వాసనకలిగి స్త్రీలయొక్క జాడను తెలియజేసే
ఒకానొక వాయువు వ్యాపించెను - అని భావం.

దీన్ని బట్టి ఆకాలంలో మగవారి తాంబూలం ఒకరకమైన వాసనను,
ఆడవారి తాంబూలం ఒకరకమైనవాసనను కలిగించేదిగా
ఉండేవని తెలుస్తున్నది.

రాజులు, ధనవంతులు తాంబూలాలను అనేక
సుగంధద్రవ్యాలతో కలిపి వేసుకునేవారు.
ఆనాటి తాంబూల విశేషాలను ఈ పద్యం తెలియజేస్తోంది.
తాంబూలంలో వాడే వివిధమైన ద్రవ్యాలను బట్టి
అది ఆడవారి తాంబూలం,
ఇది మగవారి తాంబూలం అని తెలిసేది.
దాని వివరాల్లోకివెళితే........

ఆడవారి తాంబూలంలో ఒకపాలు కస్తూరి
రెండు పాళ్ళు కర్పూరము మోతాదుగా వాడేవారు.
అదే మగవారైతే రెండు పాళ్ళు కస్తూరి,
ఒకపాలు కర్పూరము మోతాగుగా వాడేవారు
- అని  పై పద్యం వలన తెలుస్తున్నది.

నేడు కాలంమారి అన్నీ పోయి
రకరకాల బీడాలను వాడుతున్నారు. 

Wednesday, August 17, 2016

పదమున్ బూనెడు సత్కవీంద్రు డలరున్


పదమున్ బూనెడు సత్కవీంద్రు డలరున్


సాహితీమిత్రులారా!

శివభారత కర్త గడియారం వేంకటశేషశాస్త్రిగారు,
రాణాప్రతాపసింహచరిత్ర కర్త దుర్భాక రాజశేఖర శతావధాని
ఇద్దరు జంట కవులుగా అవధానవిహారం చేశారు.
1920-26 సంవత్సరాలలో వీరి అవధానాలు బాగా ప్రకాశించినవి.

ఒకచోట కవిని దొంగతో పోల్చి చెప్పమని
ఒక పృచ్ఛకుడు వీరిఅడిగారట.
అప్పుడు వారు చెప్పిన పద్యం చూడండి.

పదమున్ మెల్లన చేర్చి, శబ్దముపలిన్ భావంబు సంధించుచున్
గదియన్ జిత్రతరార్థ జాతము నలంకారమ్ములం గొంచు న
మ్ముదమారంగ రసాంతరస్థితి దగన్ బొందించి దోషైక దృక్
పదమున్ బూనెడు సత్కవీంద్రు డలరున్ బాటింప జోరున్ బలెన్


(దొంగ - మెల్లగా అడుగులు వేస్తూ ఏ చప్పుడు వినిపించినా,
             మనసు దాని మీద ఉంచుతూ కార్యాన్ని సిద్ధింప చేసుకుంటాడు.
కవి- పదాలను మెల్లగా కూర్చి శబ్దములు ఆలోచించి సంధించి, చిత్రార్థాలుగల
        అలంకారాలను గ్రహిస్తూ తప్పు లేకుండా, కవితా రససిద్ధిని సాధిస్తాడు.
ఈ పద్యంలో పదములు, శబ్దములు,
అలంకారములు, చిత్రతరార్థజాతము
మొదలైన పదాలు రెండర్థాలలో ఉపయోగపడి
పద్యానికి వన్నె తెచ్చినవి.)

ఇది చూడగా అవధానంలో చెప్పిన పద్యంలా కాక
ఆలోచనాంచితమై శ్లేషాశ్లేషితమా అద్భుతంగా ఉందీ రచన.


ఇందులో వీరు దొంగను - సుకవితో పోల్చారు.
అల్లసాని పెద్దనగారు కుకవిని దొంగతో పోల్చి చెప్పాడు.
ఆ పద్యం చూడండి.

భరమై తోచు కుటుంబ రక్షణకుగా ప్రాల్మాలి చింతన్ నిరం
తర తాళీ దళ సంపుట ప్రకర కాంతారమ్మునం దర్థపున్
దెరువాటుల్ తెగి కొట్టి తద్జ్ఞపరిషద్విజ్ఞాతచౌర్యక్రియా
విరసుండై కొఱఁతన్ బడున్ గుకవి పృథ్వీభృత్సమీపక్షితిమ్
                                                             (మనుచరిత్ర పీఠిక-9)

వస్తా వట్టిది పోతా వట్టిది


వస్తా వట్టిది పోతా వట్టిది


సాహితీమిత్రులారా!

ప్రతిమనిషి ఈ ప్రాణం ఉన్నంతవరకు
అదినాది ఇదినాది అని వెంపర్లాడతాడు
కానీ ఈ ప్రాణమే పోతే ఎవరెవరు
ఎక్కడిదాకా వస్తారని
ఈ శ్లోకంలో కవి వివరించాడు
చూడండి.

ద్రవ్యాణి భూమౌ పశవశ్చ గోష్ఠే
భార్యా గృహద్వారి జన శ్మశానే
దేహశ్చితాయాం పరలోకమార్గే
కర్మానుగోగచ్ఛతి జీవ ఏక:


సంపాదించినవన్నీ భూమిమీద -
పశువులు శాలలో- భార్య ఇంటివాకిట్లో-
బంధువులు శ్మశానం దగ్గర-
దేహం చితియందు మిగిలిపోతాయి.
జీవుడు మాత్రం కర్మవెంట
ఒంటరిగా ప్రయాణించును - అని భావం.

Tuesday, August 16, 2016

వినాశకాలే విపరీత బుద్ధి:


వినాశకాలే విపరీత బుద్ధి:


సాహితీమిత్రులారా!

ఎవరికైనా పోయేకాలం వస్తే బుద్ధి పెడదారి పట్టిస్తుందట.
అందుకే పెద్దలు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు.
దానికి సంబంధించిన ఈ శ్లోకం చూడండి.

అళీ - కుళీ - వృశ్చిక - వేణు - రంభా
వినాశకాలే ఫలముద్వహన్తి
యథా తథా సజ్జన - దుర్జనానాం
వినాశకాలే విపరీత బుద్ధి:

తుమ్మెద - పీత - తేలు - వెదురు - అరటి -
ఇవి నాశకాలం వచ్చినపుడు ఫలిస్తాయి.
సజ్జనులకు దుర్జనులకు పోగాలమువేళ
విపరీత బుద్ధులు పుడతాయి - అని భావం.

తుమ్మెద, పీత, తేలు, వెదురు, అరటి ఇవి
ప్రత్యుత్పత్తి కాగానే తరువాత ఉండవట
అందుకే అవి వినాశకాలము వచ్చినపుడు
పండుతాయి అంటున్నాడు కవి.

సునాదపూరితరసజ్ఞ తృణీకృతపంచయజ్ఞ


సునాదపూరితరసజ్ఞ తృణీకృతపంచయజ్ఞ


సాహితీమిత్రులారా!

పాల్కురికి సోమనాథుని 
వృషాధిప శతకంలోని
ఈ పద్యం చూడండి.

తజ్ఞ జితప్రజ్ఞ యుచితప్రమథానుగతజ్ఞ నమ్రదై
వజ్ఞ కళావిధిజ్ఞ బలవచ్చివభక్తిమనోజ్ఞ ధూతశా
స్త్రజ్ఞ సునాదపూరితరసజ్ఞ తృణీకృతపంచయజ్ఞ స
ర్వజ్ఞ శరణమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
                                                                    (వృషాధిప శతకం-09)


వృషభావతార శ్రేష్ఠుడవైన ఓ బసవేశ్వరా! బాగుగ తెలిసినవాడా!
చేసిన ప్రతిజ్ఞను నిర్వహించువాడా! ఉత్తములైన శివభక్తుల
ననుసరించు బుద్ధికలవాడా! విధేయులైన భగవత్ జ్ఞానులను కలవాడా!
సమస్త కళల పద్ధతులను తెలిసినవాడా! బలీయమైన శివభక్తి కలిగి ఉండుటచే
మనోహరమైనవాడా! శాస్త్రజ్ఞులను జయించినవాడా! సలక్షణమైన నాద(గాన)
రసము గ్రహించువాడా! యజ్ఞయాగాది కర్మలను నిరసించినవాడా!
సమస్తము తెలిసినవాడా! నీవే నాకు శరణము. - అని పద్యభావం

Monday, August 15, 2016

భారతస్వాతంత్ర్యదినోత్సశుభాకాంక్షలు




భారతస్వాతంత్ర్యదినోత్సశుభాకాంక్షలు

సాహితీమిత్రులకు శ్రేయోభిలాషులకు భారతప్రజలందరికి
70వ భారతస్వాతంత్ర్యదినోత్సశుభాకాంక్షలు



పెమ్మయ సింగధీమణీ!


పెమ్మయ సింగధీమణీ!


సాహితీమిత్రులారా!

పెమ్మయ సింగధీమణి మకుటంతో గల
కొన్ని పద్యాలను చూడండి.

సత్యములేని చోటఁ దనుసమ్మతిఁ జెందనిచోట, సాధుసాం
గత్యములేనిచోట ధనకాంక్షమునింగినచోట శత్రు రా
హిత్యము లేనిచోట ఋణమీయనిచోటను గాపురంబుఁదా
నిత్యముఁజేయరాదు సుమి నిక్కము పెమ్మయ సింగధీమణీ

వాసనలేనిపువ్వు, బుధవర్గములేనిపురంబు నిత్య వి
శ్వాసములేని భార్య, గుణవంతుఁడుగాని కుమారుఁడున్ సద
భ్యాసములేని విద్య, పరిహాసప్రసంగములేని వాక్యమున్
గ్రాసములేని కొల్వు కొఱగానివి పెమ్మయ సింగధీమణీ!

పెట్టక కీర్తిరాదు వలపింపక యింతికి నింపురాదు తాఁ
దిట్టక వాదురాదిఁక నెదిర్చిన వైరుల సంగరంబునన్
కొట్టక పేరురాదు కొడుకొక్కఁడు లేక ఫలంబు లేదయా
బట్టపురాజుకైన నిది పద్ధతి పెమ్మయ సింగధీమణీ!

మనవికి నొక్కయేడు ననుమానపు మాటకు నాఱునెల్లు నే
డనిపెద నన్న మాసమపు నన్పెద పొమ్మనఁ బక్షమౌను తత్
క్షణమిదె యంపితన్న మఱి సంతయు వచ్చును మోక్షమింక నా
మనవికి యెన్నఁడో సుజనమాన్యుఁడ పెమ్మయ సింగధీమణీ!

వద్దన పద్యమేల మఱి పందికి నివ్వెఱ గంధమేల దు
క్కెద్దుకు పంచదారటుకులేల నపుంసకుడైనవానికిన్
ముద్దులగుమ్మయేల నెఱముక్కఱయేల వితంతురాలికిన్
గ్రద్దకు స్నానమేల నగరా విని పెమ్మయ సింగధీమణీ!

Sunday, August 14, 2016

ఒక పుష్పంబు భవత్పదద్వయముపై నొప్పంగ.....


ఒక పుష్పంబు భవత్పదద్వయముపై నొప్పంగ.....


సాహితీమిత్రులారా!

యథావాక్కుల అన్నమయ్య కృష్ణానదీతీరంలో
సత్రశాలలోని మల్లికేశ్వరుని సేవించి
సర్వేశ్వరా శతకాన్ని రచించాడట.
అది రచించే సమయంలో ఆయన ఒక ప్రతిజ్ఞచేసికొని
వ్రాయటం ప్రారంభించాడట.
అదేమిటంటే తను వ్రాసిన పద్యం కృష్ణానదిలో వేస్తే
అది ఎదురీది వస్తే తను తీసుకొని
తరువాత పద్యం మొదలు పెడతాడు
అదిరాక పోయిన గండకత్తెరతో తలను ఉత్తరించుకుంటాడట.
అలానే జరుగుతూంది పద్యాలు రాస్తున్నాడు
ఈ క్రింది పద్యం నదిలో వేశాడు అదిరాలేదు వెంటనే
గండకత్తెర అందుకొన్నాడట.
ఆ పద్యం చూడండి.

తరులం బువ్వులు పిందెలై యొదవి, తజ్జాతితోఁ బండ్లగున్
హర మీపాదపయోజ పూజితములై యత్యద్భుతం బవ్విరుల్
కరులౌ, నశ్వములౌ, ననర్ఘమణులౌ, గర్పూరమౌ, హారమౌ
దరణీరత్నములౌఁ, బటీరతరలౌఁ, దధ్యంబు సర్వేశ్వరా!


ఇంతలో  పసులకాపరి ఆ తాటియాకు తెచ్చి ఇవ్వగా
ఆ ప్రయత్నము ఉపశమించెను. అయితే అందులో
ఈయన వ్రాసిన పద్యం బదులుగా మరొక పద్యం ఉంది
అందులో ఆ పద్యం........

ఒక పుష్పంబు భవత్పదద్వయముపై నొప్పంగ సద్భక్తిరం
జకుఁడై పెట్టిన పుణ్యమూర్తికిఁ, బునర్జన్మంబు లేదన్నఁ, బా
యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచున్, బెద్దనై
ష్ఠికుఁడై యుండెడివాఁడు, నీవగుట, దాఁజిత్రంబె సర్వేశ్వరా!

అని ఉన్నదట. ఈ గాథ ఎంతవరకు సత్యమో రెంటిలోను
శివార్చనకు ఫలితం రెండు రకాలుగా కనిపిస్తున్నది.
మొదటిది సకామార్చనగాను, రెండవది నిష్కామార్చనగాను ఉన్నదని
ఇందులో రెండవది మేలైనది కావున పసులకారికి దొరికినదని -
ప్రాజ్ఞులు చెప్పడం జరిగింది.
(ఈ విషయం శతకవాఙ్మయ సర్వస్వం పుట - 31,32లలో కలదు.)

బెబ్బులినైన పట్టి పోనివ్వడు


బెబ్బులినైన పట్టి పోనివ్వడు


సాహితీమిత్రులారా!


తిమ్మగజపతి అనే సంస్థాధిపతి బహులోభి.
అందరు తనను అంటున్నారనికూడ తిమ్మగజపతికి తెలుసు.
అలాంటి లోభి నుండి పారితోషికము అందుకొన్నాడొక
కవి అది ఈ పద్యంతో చూడండి.

"ఇవ్వడు ఇవ్వడంచు" జనులెప్పుడు తప్పక చెప్పుచుందు రే
మివ్వడు? అన్యకాంత కురమివ్వడు! సంగరమందు వె
న్నివ్వడు! శత్రులన్ ప్రబలనివ్వడు! బెబ్బులినైన పట్టి పో
నివ్వ డసత్యవాక్య మెపుడివ్వడు తిమ్మ జగత్పతీంద్రుడే!


కవి చమత్కారం ఎంత గొప్పదో కదా!
ఇవ్వడు ఇవ్వడు అంటారు తిమ్మగజపతిని అది వాస్తవమే
ఆయన ఏమివ్వడో చూడండి.
పరస్త్రీకి మనసివ్వడు
యద్ధములో వెన్నివ్వడు(పారిపోడు)
శత్రువులను ప్రబలనివ్వడు(ఎక్కవకానీడు)
బెబ్బలినైన పట్టి పోనివ్వడు
అసత్యవాక్యన్ని ఎప్పుడూ ఇవ్వడు
ఇన్నిరకాలుగా ఇవ్వనివాడు - అని మంచి పనులే చూపించాడు కవి
అందుకే ఇవ్వనివాడు పారితోషికమిచ్చాడు.

కవికలం
రాజు కత్తికంటె బలమైనది.
అంటారుకదా!
అది ఇదేనేమో!

రోగాలు ఎందుకు వస్తాయి?


రోగాలు ఎందుకు వస్తాయి?


సాహితీమిత్రులారా!

ఈ సూక్తిలో రోగాలు ఎందుకు వస్తాయో?
వివరించారు చూడండి.
చరకుడు తన చరకసంహిత-లో  చెప్పినది.

అత్యంబు పానా దతి మైథునాచ్చ
దివాస్వపాత్ జాగరణాచ్చరాత్రౌ
విధారణాత్ మూత్రపురీషణాచ్చ
షడ్వి: మనుష్యై: ప్రభవన్తి రోగా:

మితము, సమయము తెలియకుండా నీరు త్రాగటంవలన,
అతి సంభోగము - పగటిపూట నిద్రించుట,
రాత్రిపూట మేల్కొనుట, మూత్రపురీషములను బిగబట్టుట
- అనే ఆరు కారణాలవల్ల రోగాలు వస్తాయని - శ్లోకభావం.

Saturday, August 13, 2016

అవనతముఖో వ్రీడయా నిర్జగామ!


అవనతముఖో వ్రీడయా నిర్జగామ!


సాహితీమిత్రులారా!


వేశ్యలు కాగితపు పూలవంటివారు
వారివలన తలవంపులు తప్ప
ఆనందం ఉండదనే ధ్వనిని తెలిపే
శ్లోకం చూడండి.

దృష్ట్వా హృష్టోభవ దళి రసౌ చిత్ర సంస్థేచ పద్మే
"వర్ణం రూపం కిమితి కిమితి" వ్యాహరన్నా జగామ!
నాస్మిన్ గంధో నచ మధుకణో నాస్తి తత్సౌకుమార్యం
ఘూర్ణన్ ఘూర్ణన్ అవనతముఖో వ్రీడయా నిర్జగామ!

తుమ్మెద చిత్తరువు లోని పద్మాన్ని చూచి అనందంతో
"ఏమి రంగు!  ఏమి అందం!" అని ఆనందిస్తూ దగ్గరకు వెళ్ళింది.
ఆ పుష్పంలో సువాసనలేదు. తేనెలేదు.
ఇతరపూలవలె సౌకుమార్యం లేదు.
చివరకు మూల్గుతూ తలదించుకొని
సిగ్గుతో వెనుతిరిగి పోయింది - అని భావం.

శ్రీ సాయి శతకము


శ్రీ సాయి శతకము


సాహితీమిత్రులారా!

శ్రీసాయి శతకములోని 31వ పద్యంనుండి చూడండి.

నీలాకాశములోన భూమిపయినన్ నీటన్ విలోకింప - యీ
గాలిన్ ధూళిని నిండియుందువట - దుర్గారణ్యమందైన - నీ
లీలామానుష విగ్రహంబు కననౌ లేదెందు జూడంగ - నీ
వేలా నాయెదలోన నిల్వవుగ షిర్దీ సాయినాథ ప్రభూ!                          - 31

సరిగా జూడక మున్ను సాకక - రుజాసంసర్గమౌయగ్నిలో
పరితప్తంబగుచున్న నన్నెపుడొహో పట్టించుకోకుండ - యే
లర వేధించెదవీవు ధార్మికుడవే రానీయుమా, సుంత, యా
ర్తి రహింపింపగ నీకు సంతసమ షిర్దీ సాయినాథ ప్రభూ!                       - 32

ప్రజలేమో పరమాప్తుడంచు భజియింపంగా బ్రహర్షమ్మునన్
సుజనస్తోమము నిన్ను గొల్వగను - నీశోభా సముత్తేజముల్
గజలల్లంగను పాడినారు ధరలోకమ్రమ్ముగా నేడు, వా
రిజ బంధు ప్రభ నీదు ప్రాభవము షిర్దీ సాయినాథ ప్రభూ!                     - 33

నీలోనన్ కలదందురంతయును ఆనీవెంతయో యింతకున్
ఆలోచింపగ నాకు శక్యమగునే ఆర్థార్థి కల్పద్రుమా
నాలో యీకలగుండులోల ర - మదాంధ్యమ్మట్లు వేగ్రమ్మ, నే
నేలో యిట్టుల నుంటి చూడు మిక   షిర్దీ సాయినాథ ప్రభూ!               - 34

నీవెంతోనట నీదుచెయ్దిమిలలో నెన్నంగలేరంట - యీ
జీవుల్ నీదగు సృష్టియంట, జగతిన్ జీవాళికిన్ సర్వమున్
నీవేయంట యికేది లేదట - సరే నీ మాటలౌ నందు - యై
తే వక్రోక్తులు లేక బ్రోవుమిక    షిర్దీ సాయినాథ ప్రభూ!                        - 35

అంతంబేదియొ అదియేదియొ సమార్హంబైన త్రోవేదియో
చింతింపం బలునాళ్ళ నుండి శ్రమయే చేజిక్కె నాకింక - యా
కంతైనన్ దెలియంగ రాదు - మునుపేకాంతంబునందుండి - చిం
తెంతో జేసితి నేమిలాభమగు    షిర్దీ సాయినాథ ప్రభూ!                          - 36

ఎటనీపుట్టుక ఎందునుంటివొ నిగారింపంగ షిర్దీకి, జే
రుట నీవెందుకొవచ్చి యచ్చటను - వారుంబోయ దీపాలు -ము
చ్చట గొల్పంగను వెల్గ భూప్రజలు - ఆశ్చర్యాంబుధిన్ మున్గి నా
రిట గాధావళి త్రవ్వుచున్ మిగుల    షిర్దీ సాయినాథ ప్రభూ!                     - 37

అదినీ నిల్చిన నింబ వృక్షమట - నీవాపాదపచ్ఛాయ, నె
న్నిదినాలుంటివొ, యొంటిపాటున, ప్రజల్ నిన్నెన్నకున్నన్ యటన్
ఇది నీవోర్చిత్వదీయ కీర్తలతలన్ యెంతెంతగా పెంచి - నా
యెద నీరూపము నిల్పి నావొగద  షిర్దీ సాయినాథ ప్రభూ!                           -38

ముద్దుల్ మూటగదా ముఖంబు నుడులా మోహాంధ్యమున్ ద్రోచి, సం
పద్దీకంబులునౌచు చెన్నలరు, శోభా ప్రాభవో పేతముల్
నిద్దంబైన మనోజ్ఞ రూపమిటు - సందీపింపగావచ్చి - నా
కిద్దంచున్నొక దారి జూపుమిక  షిర్దీ సాయినాథ ప్రభూ!                                - 39

ఎన్నాళ్లిట్టుల నిన్ను నమ్మినను - నాకేమాయె - నీ నామమున్
అన్నన్నా బలుమంత్రమట్లు సతమున్ యావృత్తిగావించినన్
కన్నామా చిఱుమేలొకండు - రసనా గ్రంచింత నొవ్వంగ - నీ
వెన్నంగా నది యేదొ జేయుమిక షిర్దీ సాయినాథ ప్రభూ!                                - 40