Sunday, November 27, 2016

వేసవి చందన చర్చ మున్నుగన్


వేసవి చందన చర్చ మున్నుగన్



సాహితీమిత్రులారా!


ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలవారు
విష్ణుచిత్తుడు విల్లిపుత్తూరునందు
అతిథులకు వేసవిలో వండించి
పెట్టిన భోజన వివరం
ఈ పద్యంలో చూడండి-

తెలి నులివెచ్చ యోగిరము తియ్యని చారులు తిమ్మనంబులున్
బలుచని యంబళు ల్చెఱుకు పాలెడనీళ్ళు రసావళు ల్ఫలం
బులును సుగంధి శీతజలము ల్వడపిందెలు నీరు చల్లయు
న్వెలయగ పెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్
                                                                       (ఆముక్తమాల్యద -1-81)

వేసవికాలం కాబట్టి అతిథులకు
ముందుగా తాపం చల్లార్చే
గంధపు పూతపెట్టి తరువాత
ఆహారపదార్థాలను వడ్డించేవారు
అవన్నీ వేడిని పోగొట్టే పదార్థాలే. అవి-

కొంచెం వేడిగా ఉండే తెల్లని అన్నము,
బెల్లము వేసిన చారు,
తిమ్మనంబులు అనే తీపి పదార్థాలు,
 పల్చని అంబళులు(పులుసులు)
చెఱకురసం, కొబ్బరినీళ్ళు,
తీపి భక్ష్యములు(రసావళులు, అతిరసలు)
పండ్లు, సువాసనగల చల్లని నీరు,
వేసవి తాపాన్ని పోగొట్టటానికి ఊరవేసిన
మామిడి పిందెలు, నీరు ఎక్కువగా కలిగిన
మజ్జిగ, తృప్తిగా భోజనము పెట్టేవాడు.
- అని భావం.

No comments:

Post a Comment